Read more!

అసెంబ్లీలో నానేటి సేసేది?

 

 

 

“నాకు కంపూటరు రాకనే గదా మా తమ్ముడ్ని యిదేసం తీసుకేల్నాను. అయినా సొమ్ములు పోనాయి మరి నానేటి సేసేది? నానేటి గావాల్న జేసినాన ఇదంతా?” అని మన ప్రస్తుత పి.సి.సి. అద్యక్షుల వారు బొత్స సత్యనారాయణ గారు ఆనాడు వోక్స్ వ్యాగన్ కార్ల ఫ్యాక్టరీల వ్యహరంలో బాధ పడినట్లే, మళ్ళీ నేడు అయన శాసనసభలో తనని మాట్లాడనీయనప్పుడు అంతే ఇదిగా బాధ పడ్డారు పాపం.

 

శాసన సభలో ఎవరికివారు ఓ! ఒకటే ఇదిగా యస్సీ ఎస్టీ బిల్లు గురించి తమ జ్ఞానాన్ని ఇటు ప్రభుత్వానికి తద్వారా అటు ప్రజలకి తమ ఊకదంపుడు ఉపన్యాసాలతో తెగ పంచి పెట్టేస్తుంటే, చక్రం తిప్పగల నేర్పున్న తనకి ‘ఒక్క ముక్కయిన చెప్పు పాపం!’ అని శాసన సభలో అవకాశం కల్పించనందుకు మన బొత్స సత్యనారాయణగారు అలిగినట్లు టివి ఛానళ్ళు ఒకటే హోరెత్తిం చేయడమేగాక, అప్పుడే ఆయనకి మన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి మద్య ఉన్న విభేదాల సీరియల్ కధల గురించీ చెప్పుకోస్తూ ఇప్పుడు కూడా కావాలనే అతనికి మాట్లాడే అవకాశం ఇచ్చి ఉండక పోవచ్చని కనిపెట్టేసి, ఇప్పుడు బొత్స ఏ విదంగా స్పందిస్తాడు? బ్రేక్ తరువాత చూడండి అంటూ మరో సస్పెన్స్ సీరియల్ మొదలుపెట్టాయి.