తెలంగాణలో ఆత్మహత్యలకు ప్రధానకారణం...
"తెలంగాణలో ఆత్మహత్యలకు ప్రధానకారణం ఆర్థికపరిస్థితులే''
- తెహల్కా వెల్లడి.
-డా. ఎబికె ప్రసాద్
[సీనియర్ సంపాదకులు]
ఆమధ్య, చైనాలో అంతర్భాగామైన టిబెట్ ను ప్రత్యేక దేశంగా గుర్తించి దాన్ని విమోచనచేసి, దానికి స్వాతంత్ర్యం ప్రకటించాలన్న మిషపైన "స్వేచ్చా టిబెట్'' పేరిట ఒక ఉద్యమాన్ని కొందరు టిబెటన్లు నిర్వహించడం, ఆ ఉద్యమానికి ఇండియాను కేంద్రం చేసుకుని నాలుగుదశాబ్దాలుగా "ధర్మశాల''లో మకాంపెట్టిన చైనా వ్యతిరేకి, అమెరికా ప్రోద్భలంతో చైనాకు వ్యతిరేకంగా రకరకాల కార్యకలాపాలు సాగిస్తున్న దలైలామా నాయకత్వం వహించడం అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే! అయితే దలైలామా, అమెరికాలు ప్రోత్సహిస్తున్న ఆ కొందరు చైనా వ్యతిరేక "టిబెటన్'' కొంతమంది ఇటీవల "టిబెట్''కు స్వాతంత్ర్యం ప్రకటించాలని కోరుతూ ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వీళ్ళకు కొమ్ముకాస్తున్న అమెరికా గుట్టు కాస్తా రట్టయింది.
అయితే, ఈ టిబెటన్ల "ఆత్మహత్యల''తో వేర్పాటు ఉద్యమం పేరిట ఇటీవలకాలంలో తెలంగాణలో జరిగిన ఆత్మహత్యలను పోల్చుతూ పరిశోధనా జర్నలిజంలో పరసీమలు చూస్తున్న ప్రసిద్ధ ఆంగ్లవారపత్రిక "తెహల్కా'' ఒక ప్రత్యేక వ్యాసం ప్రచురించింది [సంపుటి 10]. అయితే, "తెలంగాణాకు ప్రత్యేక రాష్ట్ర ప్రతిపత్తిని ప్రకటించాలన్న కోర్కె ఒక్కటే తెలంగాణాలో ముఖ్యంగా యువకుల ఆత్మహత్యలకు కారణం కాదనీ, అనేక ఇతర సామాజిక, ఆర్థిక కారణాలు ఈ ఆత్మహత్యలకు కారణమనీ "తెహల్కా'' విశ్లేషించడం విశేషం!
ఫిబ్రవరి (2013) 4వ తేదీన ఆత్మహత్య చేసుకున్న వరంగల్ ఇంజనీరింగ్ విద్యార్థి కడవెండి నీరజ్ భరద్వాజ (19 సంవత్సరాలు) ప్రత్యేక తెలంగాణా సమస్యను కాంగ్రెస్ పార్టీ ఎటూ తేల్చకుండా ఉన్నదుకు నిరసనగా తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు వదిలివెళ్ళిన చీటీ గురించి ""తెహల్కా'' ఉదాహరిస్తూ "ఇలాంటి చీటీలన్నీ ఆ సమస్యపై కాంగ్రెస్ ను నిందిస్తూ రాసినవేనని పేర్కొంది. కాని, భరద్వాజ లేఖే మొత్తం ఆత్మహత్యల కథకాదని చెప్పింది. 2009 నవంబర్ 2012 జనవరి మధ్య కాలంలో తెలంగాణలో మొత్తం ఆత్మహత్యల సంఖ్యా 849 కాగా, వీటిలో కొన్ని ఆత్మహత్యలు మాత్రమే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం పేరిట జరిగినవనీ కాని అనేక ఆత్మహత్యలు దిగజారిపోతున్న సాంఘిక, ఆర్థిక పరిస్థితులు కారణంగానే జరిగాయని తెహల్కా వెల్లడించింది. ఈ రోజున రైతులు, చేనేత పనివారు, విద్యార్థులూ దారుణ దారిద్ర్యం, రుణబాధలు, వ్యవసాయ సంక్షోభం, ఉపాధి కనుమరుగవుతున్న పరిస్థితులు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడకపోతే ఇక తమకు భవిష్యత్తే లేదన్నట్టుగా నిరంతరం సాగుతూ వచ్చిన రాజకీయ ప్రచారమూ ఆత్మహత్యలకు దారితీశాయని స్పష్టం చేసింది.
ఇలా ఒకవైపున ఆంధ్రప్రదేశ్ జీవితాలు కొడగట్టుకు పోతూండగా ఇంకోవైపున రాష్ట్రంలో రాజకీయపక్షాలు పరస్పరం ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటూ ఉన్నారని రాసింది. ఇందుకు ఒక ఉదాహరణగా ఆ పత్రిక ఒక ప్రయివేట్ వ్యక్తి కేంద్ర ఆర్థికమంత్రి చిదంబరం, హోంమంత్రి షిండే, కాంగ్రెస్ అధిష్ఠానవర్గ ప్రతినిథి గులామ్ నబీ ఆజాద్ లపైన రంగారెడ్డి జిల్లా కోర్టులో ఒక పిటీషన్ దాఖలు చేశాడు. దానిపైన కోర్టు ఎఫ్.ఐ.ఆర్.ను దాఖలు చేయమని పోలీసులను ఆదేశించింది. అందులో అభియోగం ఏమిటి? :"తప్పుడు హామీలు ఇవ్వటం, ప్రజల్ని మోసగించటం, సామాజిక భద్రతకు ప్రమాదకర పరిస్థితిని తెచ్చిపెట్టడా''ని వీరు కారకులన్నది ఆరోపణ. అలాగే తెలంగాణలో ఆత్మహత్యల్ని యు.పి.ఎ. అధ్యక్షురాలు సోనియా ప్రోత్సహిస్తున్నారని ఆరోపిస్తూ హైదరాబాద్ కు చెందిన ఒక బిజెపి నాయకుడు కూడా మరో ప్రయివేట్ పిటీషన్ దాఖలు చేశాడు. తెలంగాణా ఉద్యమంలో దళితవర్గాలకు చెందినవారే ఎక్కువమంది బలయ్యారని, వాస్తవానికి తెలంగాణా పేరుమీద ఆత్మహత్యలపాలైన వారిలో దాదాపు అందరూ షెడ్యూల్ కులాలు [ఎస్.సి.లు], తదితర వెనుకబడినవర్గాల యువకులేననీ, కాని వేర్పాటు ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న కె.సి.ఆర్. కులం తాలూకూ ఒక్కడంటే ఒక్కడూ ఆత్మహత్య చేసుకోలేదనీ "తెహల్కా'' నమోదు చేసింది.
తన విద్య తనకు ఉద్యోగం చూపలేదన్న మిషపైన ఒక ముదిరాజ్ కుల విద్యార్థి ఆత్మహత్య చేసుకోగా, ఈ ఘటనను టీవీలలో చూసిన ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇలా ఆర్థికపరిస్థితులు బాగులేకనో, పండించిన పంటకు తగిన రేటు రాక, అప్పులపాలయిన రైతులు, స్వల్పాదాయపు కుటుంబాలకు చెందిన యువకులు ఉపాధికి దూరమయినందుననో, అనేక ఆత్మహత్యలు జరిగాయి. కాని బూతులతో, తోటి తెలుగువారిపైన దూషణ ద్వారా విపరీతమైన ద్వేషాన్ని ప్రజలలో కల్గించడంద్వారా రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకోవాలని భావించిన "బొబ్బిలిదొర'' ఒక రాజకీయ నిరుద్యోగిగా వేర్పాటు ఉద్యమాన్ని ప్రారంభించి వందలమంది విద్యార్థియువకులను ఆత్మహత్యల వైపునకు ప్రోత్సహించాడు. చివరికి అతడు చేసిన పనేమిటి?
ఢిల్లీలో కేంద్రకాంగ్రెస్ అధిష్ఠానానికి, వారు లోనుచేసిన ప్రలోభాలకు లోబడిపోయి తాను ఏర్పాటు చేసుకున్న "తెలంగాణా రాష్ట్ర సమితి''ని కాంగ్రెస్ లో విలీనం చేయడానికి సిద్ధమైనవాడు కె.సి.ఆర్. అవకాశవాద రాజకీయ నిరుద్యోగి హోదాలో అతడిప్పుడు ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్ళగల స్థితిలో లేడు. కాని తన ప్రోత్సాహంవల్ల అమూలమైన ప్రాణాలు పోగొట్టుకున్న యువకులే తన పాలిట "యమపాశం''గా మారతారన్న బెంగవల్ల తరచుగా 2014 ఎన్నికలను ప్రస్తావించనారంభించాడు; ఓట్లు, సీట్లు అంటూ 'ఉద్యమాన్ని కాటేస్తున్నాడు. ఈ సరికొత్త పరిణామం మొత్తం తెలంగాణా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలోనే చీలికలకు కారణమవుతోంది. మిలిటెంట్ ఉద్యమాన్ని అతనెలాగూ నడపలేడు!
కాని అదే సమయంలో తన నాయకత్వాన్ని "తెలంగాణా సంయుక్త కార్యాచరణ'' సంఘమూ అంగీకరించే స్థితిలోలేదు; కాగా మిలిటెంట్ ఉద్యమానికి నాయకత్వం వహించగల స్థితిలో గత మూడేళ్లుగా నెలసరి భారీ జీతాన్ని ఉస్మానియుయా విశ్వవిద్యాలయంనుంచి పొందుతూ ఉద్యోగానికి రాజీనామా యివ్వగల స్థితిలో లేని ప్రొఫెసర్ కోదండం రామ్ సంకటంలో పడిపోయాడు. ఇక ఆదిలో కె.సి.ఆర్.తో చేతులుకలిపిన కళాకారుడు గద్దర్ కూడా కె.సి.ఆర్.కు దూరంగా జరిగి "ప్రజాఫ్రంట్'' పేరిట ఉనికిని అలాఅలా కృత్రిమంగా కాపాడుకుంటున్నాడు. మరొక వైపున కె.సి.ఆర్. "సంయుక్త కార్యాచరణసంఘం'' (టి.జె.ఎ.సి.)లోని మిలిటెంట్లతో చస్తే పొసగని పరిస్థితి. అలా అని ఒంటరిగా "వేర్పాటు ఉద్యమా''న్ని నిర్వహించగల స్థాయిని కోల్పోతున్నాడు! ఈ దశలో ఇతర మిలిటెంట్ శక్తులు కొన్ని కె.సి.ఆర్.ను మిలిటెంట్ ఉద్యమంలోకి లాగి అతడి శక్తియుక్తుల్ని పరీక్షించజూస్తున్నాయి. ఈ వ్యూహంలో భాగమే - "ఉద్యమాలు చేద్దాం, రా! ఎన్నికలద్వారా తెలంగానా రాదు, పోరాటాలద్వారానే తెలంగాణా సాధ్యమవుతుంది. తెలంగాణా రాజకీయ జె.ఎ.సీ. తన ఒంటెత్తు పోకడలను మానుకోవాలి; తెలంగాణా ఉద్యమం యింకా క్షేత్రస్థాయిలోకి (ప్రజల్లోకి) వెళ్ళనేలేదనీ, అందరినీ కలుపుకుని పోవలసిన అవసరం ఉందనీ, గద్దర్ ప్రకటనలు విడుదల చేస్తున్నాడు! కాని అటు కె.సి.ఆర్.కూ, ఇటు కోదండరామ్ కూ గద్దర్ వైఖరి నచ్చదు! ఎవరి మధ్యా సమన్వయము లేదు, రాదు.
ఇది యిలా ఉండగా తెలంగాణా జె.ఎ.సి.కి పోటీగా నడుస్తున్న "తెలంగాణా యునైటెడ్ ఫ్రంట్'' నాయకుడు, శాసనమండలి సభ్యుడైన దిలీప్ కుమార్, దళితవర్గాల ప్రతినిధి, గజ్జెల కాంతం ఒక ప్రకటన చేస్తూ "కె.సి.ఆర్. వంటా-వార్పులతోనూ, సడక్ బంద్''లతోనూ తెలంగాణారాదనీ స్పష్టంచేశాడు! ఈ వేర్పాటు ఉద్యమంలో పాల్గొంటున్న వర్గాలేవీ క్షేత్రస్థాయిలో రైతులు, వ్యవసాయకార్మికులు, పంటభూముల గురించి ప్రజాబాహుళ్యం ఎదుర్కొంటున్న ధరవరల గురించీ ఇంతవరకూ ప్రజల గుర్తింపు పొందగల స్థాయిలో తపన పడలేదు. ప్రజాబాహుళ్యం ఎదుర్కొంటున్న మౌలిక సమస్యలను గాలికివదిలి తిరుగుతున్న దాని ఫలితమే - గోదావరి నదిపైన మహారాష్ట్ర ప్రభుత్వం బాబ్లీ ప్రాజెక్టు పథకాన్ని సకాలంలో పసిగట్టి జాగ్రత్తలు తీసుకొనకపోవటం! వేర్పాటువాద నాయకత్వం రాజకీయ నిరుద్యోగులతో నిండి ఉన్నందుననే ప్రజాసమస్యలకు పరిష్కారం దుర్లభమవుతోంది!
అందుకే "తెహల్కా'' పత్రిక లోతుపాతుల్లోకి వెళ్ళి తెలంగాణా సమస్యను 'జల్లెడ'పట్టింది. అందుకే ఆ పత్రిక యిలా వ్యాఖ్యానించగలిగింది : "తెలంగాణాప్రాంతం ఆత్మహత్యలకు కేంద్రంగా మారింది. ముఖ్యంగా రైతులు, నేతకార్మికులు, వెనుకబడిన కులాలకు చెందినవారి ఆత్మహత్యలకు కేంద్రంగా మారింది. 1996 నుంచి 2007 దాకా ఘటిల్లిన ఆత్మహత్యల్లో మూడింట రెండువంతులు తెలంగాణాలోనే జరగడం విశేషం''