దాడికి బాధ కలగడం సహజం: చంద్రబాబు
posted on Mar 10, 2013 @ 6:33PM
టిడిపి ఎమ్మెల్సీ అభ్యర్ధుల పేర్లను అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు అధికారికంగా ప్రకటించారు. మాజీ స్పీకర్ యనమల రామకృష్ణుడు, వక్ఫ్బోర్డు మాజీ అధ్యక్షుడు సలీం, మాజీ మంత్రి శమంతకమణి పేర్లు ఖరారు చేసినట్లు ఆయన తెలిపారు. పార్టీ కోసం చాలా మంది పనిచేశారని, అయితే ఈసారీ అందరికీ అవకాశం ఇవ్వలేకపోయామని ఆయన అన్నారు. ప్రాధాన్యత క్రమంలో పదవులు ఇస్తామని చంద్రబాబు అన్నారు. అందరికీ సమన్యాయం, రాజకీయ ప్రాధాన్యత దక్కాలని బాబు అభిప్రాయపడ్డారు.
పార్టీ కోసం ప్రాణత్యాగాలు చేసిన వారు చాలా మంది ఉన్నారన్నారు. కులాలతో సంబంధం లేకుండా అందరూ పార్టీ కోసం పనిచేస్తున్నారని చంద్రబాబు చెప్పారు. పార్టీలో పేదరికంతో ఉన్న నాయకులు చాలా మంది ఉన్నారని తెలిపారు.
ఎమ్మెల్సీ పదవి విషయమై శనివారం దాడి వీరభద్రరావుతో మాట్లాడానని, ఆదివారం కూడా మాట్లాడేందుకు ప్రయత్నించారని, ఆయన అందుబాటులో లేరని చంద్రబాబు అన్నారు. ఉన్నవి మూడు సీట్లు, అందరికీ ఇవ్వలేమని, మూడు ప్రాంతాలకు సమన్యాయం పాటించామని, ఎవరూ అన్యతా భావించవద్దని చంద్రబాబు కోరారు.
దాడి వీరభద్రరావుకు బాధకు కలగడం సహజమేనని, ఆయన స్థానంలో ఎవరున్నా అలాగే స్సందిస్తారని చెప్పారు. అభ్యర్థుల ఎంపికలో రాగద్వేషాలకు తావులేదని, అందరూ ఒకటేనని చంద్రబాబు అన్నారు.