High Court

హైకోర్టు విభజనకు కేంద్రం సిద్దం: సదానంద గౌడ

  రాష్ట్ర విభజన జరిగి ఇప్పటికి 9నెలలు పూర్తయినా ఇంతవరకు హైకోర్టు విభజన జరుగకపోవడంతో తెలంగాణా న్యాయవాదులు మళ్ళీ ఉద్యమబాట పట్టిన సంగతి అందరికీ తెలిసిందే. తెలంగాణా ప్రభుత్వం కూడా అందుకు సానుకూలంగానే ఉంది. తెలంగాణా రాష్ట్రానికి హైకోర్టు ఏర్పాటు చేస్తే 48 గంటలలోనే అందుకు అవసరమయిన అన్ని సౌకర్యాలు, ఏర్పాట్లు చేస్తామని తెలంగాణా ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఆంధ్రప్రదేశ్ రాజధానిలో నిర్మించబోయే హైకోర్టు భవనం సిద్ధమయ్యే వరకు రాష్ట్ర హైకోర్టు హైదరాబాద్ లోనే కొనసాగవలసి ఉంటుంది కనుక ఒకవేళ తెలంగాణా హైకోర్టు విడిపోదలిస్తే అందుకు సమ్మత్తించడం తప్ప ఈ విషయంలో ప్రత్యేకంగా చేయవలసినది ఏమీ లేదు. కనుక ఇరు రాష్ట్రాలు హైకోర్టు విభజనకు సిద్దంగా ఉన్నట్లే భావించవలసి ఉంటుంది.   పార్లమెంట్‌లో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి యం. వెంకయ్యనాయుడు చాంబర్ లో సమావేశమయిన కేంద్రమంత్రులు మీడియా ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. కేంద్ర న్యాయశాఖా మంత్రి సదానంద గౌడ ఒక ప్రశ్నకు బదులిస్తూ హైకోర్టు విభజనకు తమకు ఎటువంటి అభ్యంతరం లేదని, ఇరు రాష్ట్రాలు చర్చించుకొని అంగీకారం తెలిపినట్లయితే కేంద్రప్రభుత్వం తదుపరి చర్యలు ప్రారంభించేందుకు సిద్దంగా ఉందని తెలిపారు. అంటే రాష్ట్ర ప్రభుత్వాలదే ఆలస్యమని ఆయన చెప్పకనే చెపుతున్నారు. కనుక ఆంధ్రా, తెలంగాణా ప్రభుత్వాలు తక్షణమే స్పందించి అవసరమయిన చర్యలు చేపడితే సమస్య మరింత ముదరకుండా నివారించవచ్చును.

Film Director

పూరీ ఇంట్లో చోరీ

  కారెవరూ దోపిడీకి అనర్హులు అనుకొన్నారో ఏమో తెలియదు గానీ దొంగలు దర్శకుడు పూరీ జగన్నాధ్ ఇంటిని కూడా  వదిలిపెట్టలేదు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి దొంగలు ఆయన ఇంతలో జొరబడి అందినకాడికి దోచుకొని వెళ్ళిపోయారు. జూబ్లీహిల్స్ రోడ్ నెం. 31లో ఉన్న ఆయన ఇంట్లో శుక్రవారం తెల్లవారుజామున దొంగలు ప్రవేశించి బెడ్ రూమ్ లో ఉన్న బీరువాలో ఉన్న సుమారు రూ.15 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు, అరుదైన వజ్రాలు పొదిగిన ఒక నెక్లెస్ ఎత్తుకుపోయారు. ఈ విషయం తెలుసుకొన్న పూరీ జగన్నాథ్ అదే రోజు ఉదయం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Taylor Swift Legs Are Worth How Much Get the Skinny on Her Stems

అందగత్తె కాళ్ళు.. 250 కోట్లు

  హాలీవుడ్ గాయని, నటి, నిర్మాత టేలర్ స్విఫ్ట్ ఎంత అందగత్తె అనే విషయం అందరికీ తెలిసిందే. కరడుగట్టిన సన్యాసులకు కూడా సంసారం పట్ల ఆసక్తిని కలిగించేంత ముఖ సౌందర్యం ఆమె సొంతం. ఆమె ముఖం మాత్రమే కాదు.. కాళ్ళు కూడా చాలా అందంగా వుంటాయని ఆమె వీరాభిమానులు చెబుతూ వుంటారు. ఆమె వేదికల మీద పాడుతూ, ఆడుతూ వుంటే ఆమె ముఖాన్ని చూడాలో, అందమైన కాళ్ళను చూడాలో అర్థంకాక సతమతం అయిపోతారు. చివరికి అందరి కళ్ళూ ఆమె కాళ్ళ దగ్గర ఫిక్సయిపోతాయట. టేలర్ స్విఫ్ట్ కాళ్ళకు అంత అదీ, ఇదీ వున్నాయి మరి. ఆమెవి అంత స్పెషల్ కాళ్ళు కాబట్టే ఆమె తన కాళ్ళని లేటెస్ట్‌గా భారతీయ కరెన్సీలో లెక్కేస్తే అక్షరాలా 250 కోట్లకి ఇన్స్యూర్ చేసింది. ఒకవేళ భవిష్యత్తులో తన కాళ్ళకు ఏమైనా అయితే తనకు ఇన్స్యూరెన్స్ కంపెనీ 250 కోట్లు ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకుంది. టేలర్ తన కాళ్ళకు 60 కోట్ల రూపాయల విలువ వుంటుందని భావిస్తూ అంత మొత్తానికి ఇన్స్యూరెన్స్ చేయండయ్యా అని ఓ బీమా సంస్థని అడిగింది. దానికి ఆ సంస్థ వాళ్ళు మీ కాళ్ళు 60 కోట్లంత చవుకైన కాళ్ళు కావు.. 250 కోట్ల విలువైన కాళ్ళు అని అని చెప్పారు. దాంతో టేలర్ ఆ కాళ్ళతోనే ఎగిరి గంతేసి అంతే మొత్తానికి బీమా చేసేసింది. ఈ న్యూస్‌లో టేలర్ ముఖమే పెట్టారు కాళ్ళు పెట్టలేదని ఫీలవకండి.. వీలు చూసుకుని ఓసారి గూగుల్‌ ద్వారా ఆమె కాళ్ళ అందాన్ని ఆస్వాదించండి.

Kerala Assembly

ఎమ్మెల్యే కొరికిందట

  కేరళ అసెంబ్లీలో శుక్రవారం నాడు నానా గందరగోళం జరిగిన సంగతి తెలిసిందే. బార్ల లైసెన్సుల స్కాముల్లో భాగస్వామి అయిన మంత్రి కేఎం మణికి అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అర్హత లేదంటూ ప్రతిపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. దానికి తోడు అనేకమంది అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన కార్యకర్తలు అసెంబ్లీ ముందు గుమిగూడటంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో తన తోటి మహిళా ఎమ్మెల్యే తనను కొరికారంటూ మరో ఎమ్మెల్యే లబోదిబోమంటూ ఆరోపించారు. వామపక్ష పార్టీకి చెందిన మహిళా ఎమ్మెల్యే జమీలా ప్రకాశం అసెంబ్లీలో గొడవ సందర్భంగా తనను కొరికారని కాంగ్రెస్ సభ్యుడు కె. శ్రీనివాసన్ ఆరోపించారు. అసెంబ్లీలో గొడవ జరిగిన సమయంలో తాను ముఖ్యమంత్రి ఊమెన్ చాందీకి రక్షణగా నిలబడ్డానని, అప్పుడు జమీలా ప్రకాశం తనను గట్టిగా కొరికారని ఆయన చెప్పారు. జమీలా ప్రకాశం తనను కొరికినప్పుడు చేతికి అయిన గాయాన్ని కూడా ఆయన మీడియాకి చూపించారు.

AP agricultural Budget 2015

ఏపీ వ్యవసాయ బడ్జెట్ విశేషాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు శుక్రవారం అసెంబ్లీలో వ్యవసాయ బడ్జెట్ సమర్పించారు. వ్యవసాయ శాఖ మంత్రి ప్రసంగంలో విశేషాలివి. * 2015-16 వ్యవసాయ బడ్జెట్ అంచనా రూ.14,184 కోట్లు , మొదటి దశ రుణమాఫీకి 40.50 లక్షల ఖాతాలకు రూ.4,689 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. * రెండో దశ కింద 42.16 లక్షల ఖాతాలకు వర్తింపు, * ప్రయివేటు భాగస్వామ్యంతో ప్రాథమిక రంగ మిషన్, * ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు నష్టపరిహారం పెంపు రూ. 1.5 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంపు, * భూసార పటిష్టతకు రూ. 90/95 కోట్లు, * విత్తన మార్పిడికి రూ. 80 కోట్లు, * ఎస్సీ, ఎస్టీ రైతులకు సబ్సిడీ 50 శాతం నుంచి 70 శాతానికి పెంపు, * యాంత్రీకరణకు రూ. 141.63 కోట్లు, * శాటిలైట్ ఇమేజనరీకి రూ. 81.21 కోట్లు, * పొలం బడి కార్యక్రమానికి రూ. 1.46 కోట్లు, * వడ్డీలేని రుణాల కోసం రూ. 172 కోట్లు, * పావలా వడ్డీకి రూ. 10 కోట్లు, * రాష్ట్ర కృషి వికాస్ యోజనకు రూ. 513.21 కోట్లు, * ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి రూ. 367.73 కోట్లు, * ఉద్యాన వన శాఖకు రూ. 210 కోట్లు, * ఉద్యాన అభివృద్ధి మిషన్కు రూ. 100 కోట్లు, * క్షేత్రస్థాయి నీటి నిర్వహణకు రూ. 144 కోట్లు, * పట్టు పరిశ్రమకు రూ. 93.61 కోట్లు, * వైఎస్ఆర్ హార్టీ కల్చర్ యూనివర్శిటీకి రూ. 53.01 కోట్లు, * పశు సంవర్థక శాఖకు రూ. 672.73 కోట్లు, * ఉపాధి హామీకి నిధులు పెంపు, * వ్యవసాయరంగంలో ప్రయివేటుకు పెద్దపీట, * త్వరలో వ్యవసాయ విస్తరణాధికారులుగా 6,354 మంది నియామకం, * ఉచిత విద్యుత్కు  రూ.3,000 కోట్ల కేటాయింపు, * హుద్హుద్ తుపానులో నష్టపోయిన రైతులకు రూ.140 కోట్లు, * వెంకటేశ్వర పశువైద్య కళాశాలకు రూ.124 కోట్లు, * మత్స్యశాఖకు రూ.187 కోట్లు, * భూసార పటిష్టత మ్యాపుల తయారీ, *  వడ్డీ రాయితీ రూ.182 కోట్లు, * సహకార శాఖకు రూ.7.88 కోట్లు, * అనంతపురంలో వేరుశెనగ పంటను కాపాడేందుకు సామూహిక స్ప్రింక్లర్ల ఏర్పాటు, * సేద్యపు ఖర్చులు తగ్గించడానికి చర్యలు, * ఎరువుల సరైన సరఫరాకు రూ.60 కోట్లు, * లక్షలోపు రుణాలకు వడ్డీ రాయితీ, * లక్ష నుంచి 3లక్షల లోపు రుణాలకు పావలా వడ్డీ.

kerala assembly

రణరంగం కాదు.. అసెంబ్లీ...

  మనం అది రణరంగమేమోనని అపోహపడతాం కానీ, నిజానికి అది అసెంబ్లీ... బోలెడంతమంది విద్యాధికులు, తెలివైన వారు ఉన్నారని చెప్పుకునే కేరళ రాష్ట్ర అసెంబ్లీ. అసలేం జరిగిందంటే, కేరళ అసెంబ్లీలో శుక్రవారం నాడు ప్రతిపక్షాల ఆందోళనతో గందరగోళం నెలకొంది. అసెంబ్లీలోని అన్ని ద్వారాలనూ ప్రతిపక్ష సభ్యులు మూసివేశారు. మైక్‌లు, స్పీకర్‌ కుర్చీని ప్రతిపక్ష సభ్యులు విసిరేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతిపక్షాల ఆందోళనల మధ్య రాష్ట్ర ఆర్థిక మంత్రి కె.ఎం.మణి బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టారు. బార్ లైసెన్స్‌ల వ్యవహారంలో కేఎం మణి అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఆయన బడ్జెట్‌ని ప్రవేశపెట్టడానికి అనర్హుడని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. ప్రతిపక్షాల ఆందోళన నేపథ్యంలో కేఎం మణి రాత్రంతా అసెంబ్లీలోనే వున్నారు. ఈ నేపథ్యంలో కేరళ అసెంబ్లీ ఎదుట యుద్ధ వాతావరణం నెలకొంది. అధికార, ప్రతిపక్షాల మద్దతుదారులు అసెంబ్లీ వద్దకు భారీగా చేరుకున్నారు. వీరందరినీ చెదరగొట్టడానికి పోలీసులు నానా తంటాలు పడుతున్నారు.

guntur district

సహజీవనం... సజీవదహనం

  సహజీవనం వికటించింది... సజీవ దహనంగా మారింది. గుంటూరు జిల్లా తెనాలి మండలం నందివెలుగు గ్రామంలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. వివరాల ప్రకారం గండికోట మణికంఠ అనే వ్యక్తి ఓ మహిళతో సహజీవనం చేస్తున్నాడు. వీరికి రెండేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. గురువారం రాత్రి ఒక్కసారిగా ఇంటి నుంచి మంటలు చెలరేగడంతో వెంటనే స్థానికులు విషయాన్ని గమనించి పోలీసులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. తరువాత పోలీసులు ఇంట్లోకి వెళ్లి పరిశీలించగా చిన్నారి, మహిళ మృత దేహాలను గుర్తించారు. మణికంఠే వారిద్దరినీ హత్య చేసి ఇంటికి నిప్పంటించి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Brazil school shootout

స్కూల్లో కాల్పులు... ఒకరి మృతి

  బ్రెజిల్ లోని బెలో హరిజోటి మెట్రో పాలిటిన్ ప్రాంతంలో ఉన్న స్కూల్లో ఓ ఆగంతకుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. దాంతో స్కూల్ విద్యార్థులు, సిబ్బంది కారిడార్ నుంచి తరగతి గదుల్లోకి భయంతో పరుగులు తీశారు. కాల్పులు జరిపిన వెంటనే ఆగంతకుడు అక్కడి నుండి పరారయ్యాడు. ఈ ఘటనలో ఒకరు మరణించగా, మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్కూలు సిబ్బంది గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించగా, ఒకరి పరిస్థతి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. గాయపడిన వారిలో అసిస్టెంట్ ప్రిన్సిపాల్ కూడా ఉన్నారు. స్కూల్ లోకి ప్రవేశిస్తున్న ఒక వ్యక్తిని లక్ష్యంగా చేసుకొని ఆగంతకుడు కాల్పులు జరిపాడని, ఈ కాల్పుల ఘటనకు డ్రగ్స్ ముఠాతో సంబంధాలు ఉండే అవకాశాలున్నాయని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ దిశగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Prabha Arun Kumar

ప్రభ హత్యపై దర్యాప్తు ముమ్మరం

  వారం రోజుల క్రితం ఆస్ట్రేలియాలో దారుణ హత్యకు గురైన ప్రవాస భారతీయురాలు, ఐటీ కన్సల్టెంట్ ప్రభా అరుణ్ కుమార్ (41) కేసు దర్యాప్తును ఆస్ట్రేలియా పోలీసులు ముమ్మరం చేశారు. ఈ హత్యకేసులో నిందితుల కోసం తాము తీవ్రంగా అన్వేషణ జరుపుతున్నామని ఆస్ట్రేలియా పోలీసులు తెలిపారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన ప్రభ గత శనివారం నాడు తన భర్తతో ఫోన్‌లో మాట్లాడుతూ రోడ్డు మీద వెళ్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆమె మీద దాడి చేసి హత్య చేశారు. ప్రభ హత్యకు కారణాలు ఇంకా వెల్లడి కాలేదని పోలీసులు తెలిపారు. ఇదిలా వుంటే, ప్రభా అరుణ్ కుమార్ మృతదేహాన్ని ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు. అంత్యక్రియల నిర్వహణ కోసం ప్రభ మృతదేహాన్ని ఆమె స్వస్థలం మంగళూరుకు తీసుకుని వెళ్ళారు.

AP CM Chandrababu Naidu

ఈరోజు విశాఖకు రానున్న ముఖ్యమంత్రి చంద్రబాబు

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు సాయంత్రం విశాఖపట్నం రాబోతున్నారు. ఆయన అధికారం చేప్పట్టగానే రాష్ట్రాభివృద్ధి కోసం ప్రకటించిన ఏడు మిషన్లలో ఒకటయిన మౌలికవసతుల కల్పన మిషన్ ఆరంభించేందుకు ఆయన నేడు విశాఖకు వస్తున్నారు. రాష్ట్రంలో ఓడరేవుల నిర్మాణం, వాటి అభివృద్ధి, పారిశ్రామిక కారిడార్ల ఏర్పాటు, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో మౌలిక వసతుల కల్పన తదితర అంశాలపై దేశ విదేశాల నుండి వచ్చిన 500 మంది ఔత్సాహిక పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలతో చర్చించి వారి సలహాలను సూచనలను స్వీకరించి, వారికి ఆయన తన ప్రభుత్వ విధానాలను వివరిస్తారు. ఆ తరువాత ఆయన సమక్షంలోనే రాష్ట్ర మౌలిక వసతులకల్పన మంత్రిత్వ శాఖ వివిధ సంస్థలతో రాష్ట్రంలో మౌలిక వసతుల అభివృద్ధికి ఒప్పంద పత్రాలపై సంతకాలు చేస్తుంది.   ఇందులో ప్రధానంగా జి.యం.ఆర్. మరియు కోనసీమ పవర్ సంస్థలు రెండూ కలిసి శ్రీకాకుళం-కాకినాడ మధ్య గ్యాస్ పైప్ లైన్ ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర గ్యాస్ డెవెలప్ మెంట్ సంస్థతో ఒక ఒప్పందం చేసుకోబోతున్నాయి. ఇదివరకు రాష్ట్ర ప్రభుత్వం 13జిల్లాలలో వివిద రకాల పారిశ్రామిక హబ్ లను కేటాయిస్తూ ఒక విధానం ప్రకటించింది. అందుకు అనుగుణంగా నేడు వివిధ సంస్థలతో ప్రభుత్వం ఒప్పందాలు చేసుకొనే అవకాశం ఉంది. అదేవిధంగా వివిధ జిల్లాలలో ఇప్పటికే నెలకొల్పబడిఉన్న లేదా ఇక ముందు నెలకొల్పబోయే పరిశ్రమలకు అవసరమయిన మౌలిక వసతుల కల్పన కోసం వివిధ సంస్థలు ఈరోజు ఒప్పందాలు చేసుకొనే అవకాశం ఉంది.   రాష్ట్రంలో 13 జిల్లాలలో ప్రభుత్వం గుర్తించిన ప్రాంతాలలో రోడ్లు మరియు ఫ్లై ఓవర్ల నిర్మాణానికి కూడా ఈరోజు వివిధ సంస్థలు ఒప్పందాలు చేసుకొనే అవకాశం ఉంది. వీటిలో చాలా వరకు ప్రభుత్వ, ప్రయివేట్ భాగస్వామ్యంలో ఏర్పాటు చేయబడే అవకాశం ఉంది. కనుక త్వరలోనే ఆయా పనులు కూడా ఆరంభం అవుతాయని ఆశించవచ్చును.

Andhra Pradesh

ఏపీ వ్యవసాయ బడ్జెట్ నేడే

  తెదేపా అధికారంలోకి వస్తే ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయాభివృద్ధి కోసం ప్రత్యేకంగా బడ్జెట్ ఏర్పాటు చేస్తూ అందుకు అవసరమయిన నిధులు కేటాయిస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చేరు. ఆ ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెడుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఈరోజు రాష్ట్ర వ్యవసాయ బడ్జెట్ శాసనసభలో ప్రవేశపెట్టబోతున్నారు.అదే సమయంలో కార్మికశాఖ మంత్రి అచ్చెం నాయుడు వ్యవసాయ బడ్జెట్ ప్రతిని శాసనమండలిలో ప్రవేశపెడతారు.   జాతీయ ప్రాజెక్టుగా గుర్తించబడిన పోలవరం ప్రాజెక్టుకి ఒకవేళ కేంద్రం నిధులు అందించకపోయినట్లయితే రాష్ట్ర ప్రభుత్వమే దానిని పూర్తిచేస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇదివరకు ప్రకటించారు. కనుక దానిని పూర్తి చేసేందుకు ప్రభుత్వం ఎటువంటి విధానం అనుసరించబోతోందనే సంగతి ఈ బడ్జెట్ లో కొంచెం స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేయవచ్చును. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన పట్టిసీమ ప్రాజెక్టుకు ఈ బడ్జెట్ లో నిధులు కేటాయించే అవకాశం ఉంది. వంశధార, నాగావళి, తోటపల్లి ప్రాజెక్టులను ఎట్టి పరిస్థితుల్లో ఈ ఏడాదే పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చేరు గనుక వాటికీ ఈ బడ్జెట్ లో అవసరమయిన నిధులు కేటాయించే అవకాశం ఉంది.

Bees attack

అవిగానీ "ఆంధ్రా" తేనెటీగలా?

  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన సొంత నియోజకవర్గం గజ్వేల్ లో పర్యటనకు గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా హెలిప్యాడ్ ప్రాంగణం వద్ద అందరూ సీఎం కోసం వెయిట్ చేస్తున్నారు. ఇంతలో ఒక్క హెలికాఫ్టర్ కాదు చాలా హెలికాఫ్టర్లు వచ్చాయి. కానీ అవి చాలా చిన్న చిన్నహెలికాఫ్టర్లు. అదేనండీ తేనెటీగలు. పాపం సీఎం కోసం ఎదురుచూస్తున్న అందరిపైనా వాటి ప్రతాపాన్ని చూపించాయి. వాటి నుండి తప్పించుకునేందుకు కొంత మంది చెట్లెక్కారు, కొంతమంది గోనె సంచుల్లో దూరిపోయారు, కొంతమంది నేల మీద పడి దొర్లారు. ఇంకొంతమంది కుర్చీలు అడ్డుపెట్టుకున్నారు. ఈ సందర్భంగా తేనెటీగలు మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జాతో సహా ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, పోలీసులు, కొంతమంది జనాలని కసితీరా కాటేశాయి. కొంపదీసి ఇవి "ఆంధ్రా తేనెటీగలు" కావు కదా?

జస్ట్ పెళ్ళి... వెంటనే పరీక్ష...

  పెళ్ళి ముఖ్యమా.. పరీక్ష ముఖ్యమా అనే ప్రశ్న ఆ అమ్మాయి ముందు నిలిచింది. దానికి ఆ అమ్మాయి రెండూ ముఖ్యమే అని స్పష్టంగా చెప్పేసింది. తాను చెప్పినట్టే చేసింది. రాజస్థాన్‌లోని బలేశ్వర్ గ్రామానికి చెందిన సంతోష్ ప్రజాపత్ అనే అమ్మాయికి సోమవారం నాడు పెళ్ళి ఫిక్సయింది. అయితే సంతోష్ ప్రజాపత్ మాత్రం ఆరోజున తనకు బీఏ మొదటి సంవత్సరం పరీక్ష వుందని, పెళ్ళిని మర్నాటికి మార్చాలని రిక్వెస్ట్ చేసింది. అయితే సోమవారం నాడు మంచి ముహూర్తం వుందని, ఆరోజే పెళ్ళి జరగాలని మగపెళ్ళివారు పట్టుబట్టారు. ఆ అమ్మాయి ఆరోజు పెళ్ళి పట్టుబట్టలు కట్టుకోవాల్సిందేనని కూడా పట్టుబట్టారు. దాంతో సంతోష్ ప్రజాపత్ తీవ్రంగా ఆలోచించింది. పెళ్ళికి, పరీక్షకి మధ్య ఒక గంట టైమ్ ఉంది కాబట్టి తాను పెళ్ళి చేసుకున్న వెంటనే అదే ఊళ్ళో వున్న పరీక్షా కేంద్రానికి వెళ్ళి పరీక్ష రాస్తానని చెప్పింది. మగ పెళ్ళివారు మొదట్లో నసిగినప్పటికీ, చదువు మీద ఆ అమ్మాయికి వున్న ఇష్టాన్ని అర్థం చేసుకుని అంగీకారం తెలిపారు. సోమవారం పెళ్ళి అయిన వెంటనే పెళ్ళి బట్టలతోనే పరీక్షా కేంద్రానికి వెళ్ళి ఆ అమ్మాయి పరీక్ష రాసింది. చదువంటే ఇంట్రస్ట్ ఇలా వుండాలి.. ఏమంటారు?

అసెంబ్లీలో సీఎం డాన్స్..

సినిమా హీరోలే డాన్స్ చేస్తారా ఏంటీ నేను కూడా డాన్స్ చేస్తానంటూ హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అసెంబ్లీలో డాన్స్ చేసి వార్తల్లోకెక్కారు. తన సెటైర్లతో ప్రత్యర్థులను తిప్పికొట్టే విదర్భసింగ్ ఈసారి అసెంబ్లీలో డాన్స్ తో ప్రతిపక్ష నేతలకు సమాధానం చెప్పారంట. ఇంతకీ విషయం ఏంటంటే, గత నెల జనవరిలో ముఖ్యమంత్రి కుమారుడు, యూత్ కాంగ్రెస్ కార్యకర్త విక్రమాదిత్య సింగ్ ఆధ్వర్యంలో భూసేకరణ బిల్లుకు వ్యతిరేక ప్రదర్శన జరిగింది. ఈ సందర్భంగా ఘర్షణలు కూడా జరిగాయి. ఈ నేపథ్యంలో బీజేపీ సభ్యులు గురువారం అసెంబ్లీలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తు గందరగోళం సృష్టించారు. వారి నినాదాలకు సమాధానం చెప్పవలసిన ముఖ్యమంత్రి రిథమిక్‌గా హిప్ మూవ్ మెంట్ చేస్తూ అందరిని ఆశ్చర్యానికి గురిచేశారు.

విభజన కారణంగా ఏపీకి రెవెన్యూ లోటు

  రాష్ట్ర విభజన కారణంగా ప్రణాళికేతర ఆదాయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెవెన్యూ లోటు ఏర్పడిందని రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తన బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. రాష్ట్ర విభజన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద తీవ్ర ప్రభావాన్ని చూపించిందని ఆయన అన్నారు. 14వ ఆర్థిక సంఘం చివరి కేటాయింపులు అందే వరకూ రాష్ట్రానికి రెవెన్యూ లోటు తప్పదని ఆయన తెలిపారు. రెవెన్యూ వ్యయాన్ని సమకూర్చుకోవడం కోసం రుణాలు తీసుకోవాల్సిన అవసరం వుందని ఆయన చెప్పారు. రుణాల కారణంగా ఆర్థిక భారం మరింత పెరిగే అవకాశం వుందని ఆయన తెలిపారు. రాజధాని నిర్మాణం కోసం 1,00,213 కోట్లు, ఇతర కీలక సదుపాయాల కోసం 41,253 కోట్లు ఆర్థిక సహాయం అందించాలని 14వ ఆర్థిక సంఘాన్ని కోరినట్టు చెప్పారు. 14వ ఆర్థిక సంఘం రెవెన్యూ లోటు కింద 22,113 కోట్లు, విపత్తు నిర్వహణకు 1823 కోట్లు కేటాయించిందని తెలిపారు. పట్టణ స్థానిక సంస్థల కోసం తాము ప్రతిపాదించిన 29,805 కోట్లకు 3,636 కోట్లు కేంద్ర కేటాయించిందని చెప్పారు. స్థానిక సంస్థల కోసం తాము ప్రతిపాదించిన 18,633 కోట్లకు గాను 8,654 కోట్ల కేటాయింపు మాత్రమే జరిగిందని ఆయన తెలిపారు.

చీటర్ అవినాష్ లొంగుబాటు

  ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, హోం మంత్రి చినరాజప్ప బంధువునని చెప్పి పలు మోసాలకు పాల్పడిన అవినాష్ పోలీసులకు లొంగిపోయాడు. వివరాల ప్రకారం పేరాబత్తుల అవినాష్ దేవ్ చంద్ర తాను చినరాజప్ప బంధువునని పలువురికి టోకరా వేయడమే కాకుండా, అతనిని నిలదీసిన వారిపై దాడికి పాల్పడి, అనేక చిత్రహింసలకు గురిచేశాడు. ఈ నేపథ్యంలో అవినాష్ ను పట్టుకునేందుకు తూర్పు గోదావరిజిల్లా పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. అయితే గురువారం హైదరాబాద్ లో ఏపీ డీజీపీ కార్యాలయానికి వచ్చిన అవినాష్ పోలీసు ఉన్నతాధికారుల ఎదుట లొంగిపోయాడు. వివిధ పత్రికల్లో వచ్చిన క్లిప్పింగులను ఆధారం చేసుకొని మానవ హక్కుల కమిషన్ అవినాష్ పై సుమోటోగా కేసు నమోదు చేసింది. అవినాష్ చేసిన అక్రమాలపై ఏప్రిల్ 6 లోపు నివేదిక ఇవ్వాలని జిల్లా ఎస్పీ, కలెక్టర్లకు నోటీసులు జారీ చేసింది.