coal scam manmohan summons

మన్మోహన్‌కి సమన్లు

  మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ పదవి పోయినప్పటికీ, ఆ పదవిలో వున్నప్పుడు తగిలించుకున్న బొగ్గు మరకలు మాత్రం పోవడం లేదు. బొగ్గు కుంభకోణం విషయంలో మన్మోహన్‌ సింగ్‌ని సీబీఐ ఇప్పటికే ప్రశ్నించిన విషయం తెలిసిందే. అసలే ఆ అవమాన భారంతో వున్న మన్మోహన్‌ సింగ్‌కి మరో షాక్ తగిలింది. బొగ్గు కుంభకోణం విచారణలో నిందితుడిగా వున్న ఆయన ఏప్రిల్ 8వ తేదీన విచారణకు హాజరు కావాలని ఈ కేసును విచారిస్తున్న సీబీఐ ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేసింది. మన్మోహన్ సింగ్ ఈ సమన్లు అందుకున్నారు. మరి విచారణకు హాజరు అవుతారో లేదో చూడాలి. మన్మోహన్ సింగ్‌తోపాటు బొగ్గుశాఖ మాజీ కార్యదర్శి పీసీ ప్రకాష్, పారిశ్రామికవేత్త కుమారమంగళం బిర్లాతోపాటు మరో ముగ్గురికి కూడా సీబీఐ ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేసింది.

ananthapuram

పెళ్ళయిన మూడు రోజులకే...

  అనంతపురం జిల్లాలో పెళ్ళయిన మూడు రోజులకే ఒక వ్యక్తి తన భార్యను గొంతుకోసి చంపేశాడు. తాను కూడా గొంతు కోసుకుని ప్రాణాపాయ స్థితిలో వున్నాడు. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని నంద్యాల రోడ్డులో నివసించే ఫకీరప్ప (35) వివాహం అదే గ్రామానికి చెందిన విజయలక్ష్మి (18)తో మూడు రోజుల క్రితం జరిగింది. అయితే ఫకీరప్పకు ఈ వివాహం ఇష్టం లేకపోయినప్పటికీ పెద్దల బలవంతం వల్ల పెళ్లి చేసుకున్నాడు. అయితే బుధవారం ఉదయం ఈ నూతన దంపతులు ఎంతకీ తలుపు తీయకపోవడంతో అనుమానం వచ్చి కుటుంబ సభ్యులు తలుపులు బద్దలు కొట్టి చూడగా ఇద్దరూ రక్తపు మడుగులో ఉన్నారు. ఈ ఘటనలో వధువు విజయలక్ష్మీ మరణించగా.. వరుడు ఫకీరప్ప పరిస్థితి విషమంగా ఉంది. అతనిని అనంతపురం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇష్టం లేని పెళ్లి చేసినందుకే ఇంతటి అఘాయిత్యానికి పాల్పడ్డాడని ఇరు కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

andhra pradesh assembly speaker jagan

స్పీకర్‌పై నోరు జారిన జగన్

  వైసీపీ నాయకుడు, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు జగన్ అసెంబ్లీలో మైకు ముందు నిలబడితే తానేం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కాని పరిస్థితికి వెళ్ళిపోతున్నారు. బుధవారం నాడు ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ స్పీకర్ మీద నోరు జారారు. అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ ప్రసంగం మీద ఆకాశమే హద్దుగా మాట్లాడవచ్చని, అయితే తాము ఏం మాట్లాడాలో స్పీకర్ నిర్దేశిస్తున్నారని, స్పీకర్ కోడెల శివ ప్రసాదరావు తటస్థంగా వ్యవహరించడం లేదని, స్పీకర్ స్థానంలో తెలుగుదేశం శాసనసభ్యుడు కూర్చున్నట్టుగా వుందని వ్యాఖ్యానించారు. ఒక గౌరవనీయమైన స్థానంలో వున్న స్పీకర్ మీద జగన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మీద సభలో వున్న తెలుగుదేశం సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

telangana state budget 2015 2016

తెలంగాణ బడ్జెట్ విశేషాలు

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ 2015 - 2016 సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్‌ ప్రతిపాదనలను శాసనసభకు సమర్పించారు. ఈ ఆర్థిక సంవత్సరానికి లక్షా 15 వేల 689 కోట్ల బడ్జెట్‌ను ఆయన సమర్పించారు. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ విశేషాలు ఇలా వున్నాయి. * రాష్ట్రబడ్జెట్ రూ. లక్షా 15 వేల689 కోట్లు * ప్రణాళిక వ్యయం రూ. 52వేల383 కోట్లు * ప్రణాళికేతర వ్యయం రూ. 63వేల 306 కోట్లు * ఆర్థిక మిగులు రూ. 531 కోట్లు * ద్రవ్య లోటు రూ.16,969 కోట్లు * 2014-15లో ఆర్థికాభివృద్ధి 5.3 శాతం * 14వ ఆర్థిక సంఘం గుజరాత్, తెలంగాణ రాష్ర్టాలను మిగులు బడ్జెట్ రాష్ర్టాలుగా గుర్తించింది. * బడ్జెట్ అంటే చిట్టాపద్దుల పట్టిక కాదు... అంకెల కూర్పు అసలే కాదు * ప్రతీ పైసా తెలంగాణ ప్రజల సర్వతోముఖాభివృద్ధికి కేటాయిస్తాం * గత తాత్కాలిక బడ్జెట్ అనేక సంక్షేమ పథకాలను అమలు పరిచింది. * అమరవీరుల త్యాగానికి వినమ్రంగా తలవంచుతున్నాం * 481 మంది అమరుల కుటుంబాలకు రూ. 48.12 కోట్లు ఆర్థిక సహాయం * హైదరాబాద్ మెట్రో రైలుకు రూ.416 కోట్లు కేటాయించాం. * ఎఫ్‌ఆర్‌బీఎంలో వెసులుబాటు కల్పించాలని కేంద్రాన్ని కోరాం. * ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ నిధుల మళ్లింపునకు గురయ్యాయి. * ఉద్యమ భారం మోసిన వారి ఆంక్షలకు అనుగుణంగా రూపొందించిన ఆర్థిక ప్రణాళిక ఇది. * బీడీ కార్మికులకు రూ. 188 కోట్లు * ఈ నెల నుంచి బీడీ కార్మికులకు రూ. 1000 భృతి అందిస్తున్నాం * యాదగిరి గుట్టకు రూ. 100 కోట్లు * మైనార్టీలకు రూ.1,165 కోట్లు * బీసీలకు రూ.261 కోట్లు * గిరిజనుల సంక్షేమానికి రూ. 2878 కోట్లు * పంచాయితీరాజ్ శాఖ రోడ్ల అభివృద్దికి రూ. 2421 కోట్లు * ఆసరా పెన్షన్ల కోసం రూ. 4 వేల కోట్లు * ఆహార భద్రత సబ్సిడీ రూ. 2,200 కోట్లు * స్త్రీ శిశు సంక్షేమ శాఖకు రూ. 771 కోట్లు * రోడ్ల అభివృద్ధికి రూ. 2421 కోట్లు * కేంద్రం నుంచి రూ. 11, 781 కోట్లు రావాల్సి ఉండగా 4,147 కోట్లు మాత్రమే వచ్చాయి. * కేంద్రం పన్నుల వాటా రూ. 12,823 కోట్లు * జీహెచ్‌ఎంసీకి రూ. 526 కోట్లు * వాటర్ గ్రిడ్‌కు రూ. 4000 కోట్లు * మిషన్ కాకతీయకురూ. 2083 కోట్లు * జంట నగరాల్లో తాగు నీటికి రూ. 1000 కోట్లు * ఆటవీ, పర్యావరణ శాఖకు రూ. 325 కోట్లు * సాగునీటికి రూ. 8500 కోట్లు * రాష్ర్టాభివృద్ధికి పారిశ్రామికాభివృద్ధి చాలా అవసరం * పారిశ్రామిక వేత్తల ప్రోత్సాహకాల కోసం రూ. 974 కోట్లు * ప్రభుత్వం వద్ద సాగుకు పనికిరాని భూమి 20 లక్షల ఎకరాలు అందుబాటులో ఉంది. * ముచ్చర్లలో 11 వేల ఎకరాల్లో ఫార్మా సిటీ * హైదరాబాద్ - వరంగల్ మధ్య ఇండస్ట్రీయల్ కారిడార్ * పారిశ్రామిక రంగంలో జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడమే మా లక్ష్యం * పరిశ్రలకు అవసరమైన అన్ని అనుమతులు సింగిల్ విండో విధానం అమలు చేస్తున్నాం * విద్యా రంగానికి రూ. 11,216 కోట్లు * ఉద్యోగుల జీతాలు పెన్షన్లకు రూ. 22,889 కోట్లు * ఉస్మానియా యూనివర్సిటీకి రూ. 238 కోట్లు * హాస్టల్లకు 2200 కోట్లు * మధ్యాహ్న భోజనానికి సన్న బియ్యం కేటాయించినప్పటి నుంచి స్కూళ్లలో డ్రాప్ అవుట్స్ తగ్గాయి. * ఉద్యోగుల ఆశలకు అనుగూణంగా 43 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించాం. బంగారు తెలంగాణలో ఉద్యోగులు పునరంకితం కావాలి. * పశు, ఉద్యానవన, వ్యవసాయ వర్సిటీలకు రూ. 261 కోట్ల* * అంగన్వాడీ టీచర్ల కార్యకర్తల వేతనాలు రూ. 7 వేలకు పెంపు * అంగన్‌వాడీ ఆయాల వేతనం రూ. 4500కు పెంపు * పెరిగిన అంగన్‌వాడీ టీచర్ల, కార్యకర్తల జీతాలు మార్చి 2015 నుంచి అమలు * ప్రతీ అంగన్‌వాడీ కేంద్రానికి రూ. 1000 వన్‌టైమ్ స్పెషల్ గ్రాంట్ * తెలంగాణలో వ్యవసాయం ఖర్చుతో కూడుకున్న వ్యవహారం * డ్రిప్ ఇరిగేషన్‌కు ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తుంది. * వ్యవసాయ మార్కెటింగ్ శాఖలో సంస్కరణలు చేపడుతున్నాం. * వరంగల్, నిజామాబాద్, కరీంనగర్‌లో ఈ-మార్కెటింగ్ వేలం నిర్వహిస్తున్నాం. * ఎర్రజొన్న రైతులకు 11.5 కోట్లు చెల్లించాం * రూ.480 కోట్లు ఇన్‌పుట్ సబ్సిడీ అందించాం. * రుణమాఫీ కోసం రూ.4,800 కోట్లకు పైగా నిధులు బ్యాంకులకు చెల్లించాం. * 36 లక్షల మంది రైతులకు రుణమాఫీ * ఈ సంవత్సరం రైతు రుణ మాఫీ కోసం రు. 4,250 కోట్లు * వ్యవసాయ అనుబంధ రంగానికి రూ. 8,432 కోట్లు * డ్రిప్ ఇరిగేషన్‌కు రూ. 200 కోట్లు * చిన్ననీటి పారుదల శాఖకు రూ. 200 కోట్లు * గిడ్డంగులకు రూ. 403 కోట్లు * మార్కెటింగ్ శాఖకు రూ. 411 * విద్యుత్ రంగానికి రూ. 7400 కోట్లు * 2018 నాటికి విద్యుత్ ఉత్పత్తి సమార్థ్యం 23,670 మె.వా చేయాలని లక్ష్యం * కిలోవాట్ సామర్థ్యం గల 4వేల సోలార్ విద్యుత్ ప్లాంట్లు * విద్యుత్ శాఖకు రూ. 7400 కోట్లు * విద్యుత్ రంగాన్ని సంస్కరించేందుకు తొలి అడుగులు పడ్డాయి. * ఫ్లై ఓవర్లకు రూ. 1600 కోట్లు * హరిత హారానికి రూ. 325 కోట్లు * ఎస్సీ, ఎస్టీ భూముల కొనుగోలు కోసం 1000 కోట్లు * ఆర్టీసీ బస్సుల కొనుగోలు కోసం రూ. 400 కోట్లు * మెట్రో రైలుకు రూ. 416 కోట్లు * వైద్య, ఆరోగ్య సేవల కోసం రూ. 4932 కోట్లు * నెల ఖర్చుల కోసం నగర పోలీస్‌స్టేషన్లకు రూ.75 వేలు * జిల్లా కేంద్రాల్లోని పోలీస్‌స్టేషన్‌లకు రూ. 50 వేలు * మండల కేంద్రాల్లోని పోలీస్‌స్టేషన్‌లకు రూ. 25 వేలు

 telangana assembly

"క్షమాపణల సభ"

  తెలంగాణ శాసనసభలో చర్చలకంటే ఒకరినికొరు ధూషించుకోవడం ఎక్కువైంది. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ పలువురు నేతలు మాటల యుద్ధాలే చేశారు. దీంతో కొంతమంది నేతలు చింతించడం, విచారించడంతో... ప్రతిపక్ష నేత జానా రెడ్డి అటు ముఖ్యమంత్రి కేసిఆర్ లు కలసి ఫుటేజ్ లు పరిశీలించి మరీ ఇరుపక్షాలతో క్షమాపణలు చెప్పించారు. అసలు సంగతి ఏంటంటే నిన్న జరిగిన సభలో కాంగ్రెస్ ఎమ్మెల్యే డి.కె అరుణ మాట్లాడుతున్నప్పుడు టీఆర్ఎస్ నేతలు అభ్యంతరం చెప్పడంతో ఆమె మండిపడ్డారు. దీంతో ఒక్కసారిగా ఆమె మైకు విరగకొట్టి "నోర్ముయ్.. ఏం మాట్లాడుతున్నావని" వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్ కల్పించుకొని మీ దాదాగిరి ఏదైనా ఉంటే మహబూబ్ నగర్ లో చూపించుకోండి ఇక్కడ చూపించకండి అని సమాధానమివ్వడంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో స్పీకర్, ముఖ్యమంత్రి సభను వాయిదా వేసి ఫుటేజ్ లు పరిశీలించి మంత్రి కేటీఆర్, డీకే అరుణ ఇద్దరూ క్షమాపణలు కోరాలని నిర్ణయించారు. తీరా సభ ఆరంభమయ్యాక తానెందుకు ముందు క్షమాపణ చెప్పాలంటూ అరుణ ప్రశ్నించారు. చివరకు అధికారపక్షమే మొదట క్షమాపణ చెబుతుందని సీఎం పేర్కొనడంతో కేటీఆర్ తన మాటలపై విచారం వ్యక్తం చేశారు. ఆ తర్వాత డీకేఅరుణ కొద్దిసేపు తన వాదన వినిపించే ప్రయత్నం చేశారు. మైకు విరగ్గొట్టినందుకు క్షమాపణ చెప్పారు. మంత్రి జగదీష్ రెడ్డి కూడా చేసిన పరూష అనే వ్యాఖ్యలపై జానా రెడ్డి, సీఎం అభ్యంతరం తెలపడంతో తన మాటలను ఉపసంహరించుకున్నారు.

Telangana CM KCR

ఆంధ్రా కరెంట్ మాకు అక్కరలేదు: కేసీఆర్

  తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న రాష్ట్ర శాసనసభలో మాట్లాడుతూ, తెలంగాణా రాష్ట్రం తీవ్ర విద్యుత్ సంక్షోభం ఎదుర్కొంటునప్పుడు విద్యుత్ ఇచ్చేందుకు నిరాకరించిన ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు విద్యుత్ ఇస్తామన్నా తీసుకొనేందుకు సిద్దంగా లేమని, తమకు ఆయనిచ్చే విద్యుత్ అవసరం లేదని కుండబ్రద్దలు కొట్టినట్లు చెప్పారు.   “ఆయన విద్యుత్ ఇవ్వకపోవడం వల్ల మన ఏర్పాట్లు మనం చేసుకోవాలనే సంగతి అర్ధమయింది. అందుకే రూ.1500కోట్లు ఖర్చు చేసి ఓపెన్ మార్కెట్ నుండి 1300 మెగావాట్స్ విద్యుత్ కొనుకొన్నాము. ఒక్క ఎకరా పంట కూడా ఎండిపోకుండా కాపాడుకోగలిగాము. ప్రస్తుతం మనకి థర్మల్ మరియు హైడల్ విద్యుత్ కలిపి మొత్తం 6420 మెగావాట్ల విద్యుత్ ఉంది. వచ్చే రెండు నెలలలో రాష్ట్రంలో విద్యుత్ కొరత ఉంటుంది. దానిని నివారించేందుకు అధనంగా ఇతర రాష్ట్రాల నుండి విద్యుత్ కొనుగోలు చేస్తాము. కానీ వచ్చే ఏడాదినాటికి రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితి చాలా వరకు మెరుగుపడుతుంది. అప్పుడు వ్యవసాయానికి ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిరంతరాయంగా విద్యుత్ ఇస్తాము. పరిశ్రమలకు అసలు విద్యుత్ కోతలుండవు. 2018 నాటికి రాష్ట్రంలో 24,575 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది. అప్పుడు మన రాష్ట్రానికి కూడా మిగులు విద్యుత్ ఉంటుంది,” అని తెలిపారు.

Finance Minister

ఏపీకి భారీగా నిధులు మంజూరుకి కేంద్రం సిద్దం

  ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి బడ్జెట్ కేటాయింపుల విషయంలో రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షాలు, మీడియా, ప్రజల ఆగ్రహానికి కేంద్రం తలొగ్గక తప్పలేదు. కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి నిన్న ఫోన్ చేసి రాష్ట్రానికి రూ.3,000 కోట్లు విడుదల చేసేందుకు కేంద్రం సిద్దంగా ఉందని తెలిపారు. ప్రధాని మోడీ తన ఐదు రోజుల విదేశీ పర్యటన ముగించుకొని డిల్లీకి తిరిగివచ్చిన తరువాత ముఖ్యమంత్రి కూడా డిల్లీ వచ్చినట్లయితే అన్ని విషయాలు మాట్లాడుకొందామని తెలియజేసారు. తొలివిడతగా రాజధాని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి తలో వెయ్యి కోట్లు, రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి మరో వెయ్యి కోట్లు మంజూరు చేసేందుకు కేంద్రం సిద్దంగా ఉన్నట్లు ఆర్ధికమంత్రి చంద్రబాబుకి తెలియజేసినట్లు సమాచారం. అదేవిధంగా రాష్ట్ర బడ్జెట్ లో ఆర్దికలోటు భర్తీకి కూడా అధనంగా నిధులు మంజూరు చేసేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలియజేసారు.

NTR Statue

గోదావరి నది మధ్య యన్టీఆర్ విగ్రహం?

  తాజా సమాచారం ప్రకారం ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం రాజమండ్రి వద్ద గోదావరి నది మధ్యలో మాజీ ముఖ్యమంత్రి మరియు తెదేపా వ్యవస్థాపక అధ్యక్షుడు స్వర్గీయ నందమూరి తారక రామారావుగారి భారీ విగ్రహం స్థాపించబోతోంది. ఈ విగ్రహాన్ని గోదావరి పుష్కరాల సమయంలోనే ఆవిష్కరించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు తగిన సన్నాహాలు కూడా మొదలుపెట్టినట్లు సమాచారం. ఈ భారీ విగ్రహాన్ని యన్.డి. తేజ అనే శిల్పి పశ్చిమ గోదావరి జిల్లాలో తయారుచేస్తున్నట్లు తెలుస్తోంది.   ఇదివరకు హైదరాబాద్ లో హుస్సేన్ సాగర్ మధ్యలో గల జీబ్రాల్టార్ రాక్ మీద భారీ విగ్రహం స్థాపించారు. ఇప్పుడు ప్రతిష్టించబోయే యన్టీఆర్ విగ్రహం కూడా ఇంచుమించు అదే స్థాయిలో ఉంటుందని తెలుస్తోంది, అక్కడిలాగే గోదావరి నదిలో కూడా విగ్రహం ప్రతిష్టించిన చోట ఒక మంచి పార్క్ నిర్మించడం ద్వారా పర్యాటకులను ఆకర్షించాలని ప్రభుత్వం భావిస్తోంది. కానీ ఇదివరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణానది మధ్యలో త్వరలో నిర్మించబోయే రాజధాని నగరానికి అభిముఖంగా ఈ విగ్రహం ప్రతిష్టించాలని భావించినట్లు వార్తలు వచ్చేయి. స్వర్గీయ యన్టీఆర్ కి కృష్ణా జిల్లాకి అవినాబావ సంబంధం ఉంది కనుక అక్కడే ఆయన విగ్రహం ప్రతిష్టిస్తారని అందరూ భావిస్తుంటే అకస్మాత్తుగా ఈ వార్త వెలువడింది. కానీ దీనిని అధికారికంగా ఎవరూ దృవీకరించలేదు.

Land acquisition Bill

భూసేకరణ బిల్లు సవరణకు లోక్ సభ ఆమోదం

  ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుకి లోక్ సభ ఆమోదముద్ర వేసింది. గతేడాది యూపియే హయాంలో పార్లమెంటు ఆమోదించిన ఈ బిల్లులో ఎన్డీయే ప్రభుత్వం కొత్తగా 11 సవరణలు చేసింది. అయితే ప్రతిపక్షాలు ప్రతిపాదించిన సవరణలు వీగిపోయాయి. లోక్ సభలో ఈ బిల్లుకి ఎన్డీయే భాగస్వాములయిన శివసేన, తెదేపా, అకాలీదళ్ పార్టీలు మద్దతు తెలుపగా కాంగ్రెస్, తెరాస మరియు బీజేడీ వ్యతిరేకిస్తూ సభ నుండి వాక్ అవుట్ చేసాయి. లోక్ సభలో ఎన్డీయే కూటమికి పూర్తి మెజార్టీ ఉంది కనుక అవలీలగా ఆమోదింప జేసుకోగలిగింది. కానీ రాజ్యసభలో కాంగ్రెస్ దాని మిత్ర పక్షాలదే బలం గనుక రాజ్యసభలో ఆమోదింపజేసుకోవడానికి ఎన్డీయే ప్రభుత్వం చాలా శ్రమ పడకతప్పదు.

 nagarjuna

మన్మధుడి ప్రశంసల వర్షం

  మన్మధుడు ఈ పేరువింటే మనకు వెంటనే గుర్తొచ్చేపేరు నాగార్జున. అలాంటి నాగార్జునే అందంగా ఉన్నారని పొడిగితే ఎలా ఉంటుంది. ఇంతకీ నాగార్జున పొగిడింది ఎవరిని అనుకుంటున్నారా. మరెవరినో కాదండీ తన సరసన పలు చిత్రాల్లో నటించి తన కంటూ ఒక స్టైల్ ను ఏర్పరుచుకున్న హీరోయిన్ రమ్యకృష్ణని. అసలు సంగతి ఏంటంటే నాగార్జున.. రమ్యకృష్ణ కాంబినేషన్ లో 'సోగ్గాడే చిన్ని నాయనా' సినిమా షూటింగ్ ప్రస్తుతం మైసూరులో వేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో నాగార్జున డబుల్ రోల్ పోషిస్తున్నారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ 15 ఏళ్లు దాటినా ఆమె అందం ఇప్పటికీ చెక్కుచెదరలేదని రమ్యకృష్ణ పై ప్రశంసల వర్షం కురిపించాడు.ఎంతైనా మన్మధుడు కదా.

ap mlcs notification

ఎమ్మెల్సీ స్థానాల నోటిఫికేషన్ విడుదుల

  కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యేల కోటాలో ఉన్న ఐదు ఎమ్మెల్యేల స్థానాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. శాసనమండలి సభ్యులుగా ఉన్న రుద్రరాజు, పద్మరాజు, సింగం బసవపున్నయ్య, తిప్పేస్వామి, నన్నపునేని రాజకుమారి పదవీకాలం ఈ నెల 29వ తేదీతో ముగియనుండడంతో ఆస్థానాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే వీటితో పాటు ఖాళీగా ఉన్న మరో స్థానానికి కూడా ఎన్నిక జరగనుంది. మార్చి 17 నుండి నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణక చివరితేది మార్చి 20. 5 స్థానాలకు 18 నామినేషన్లు పరిశీలనలో ఉంటాయి. మార్చి 27వ తేదీ పోలింగ్ నిర్వహించి అదేరోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు ఉంటుందని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది.

worldcup 2015

పసికూనపై పవర్ చూపించిన భారత్

  మంగళవారం ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో 260 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన భారత్ కేవలం రెండు వికెట్లు కోల్పోయి మరో 79 బంతులు మిగిలుండగా విజయకేతనం ఎగరవేసింది. వరుసగా ఐదు మ్యాచుల్లో గెలిచి గ్రూపు-బిలో అగ్ర స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా ప్రముఖలు టీం ఇండియాకు అభినందనలు తెలిపారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ భారత్ కు అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా టీం ఇండియా బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డంగ్ అన్ని విభాగాల్లోనూ రాణించి విజయం సొంతం చేసుకుందని, ఇలాగే విజయాల బాటలో పయనించాలని ఆకాంక్షిస్తున్నానని ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు. అంతేకాక ప్రపంచ కప్ చరిత్రలో ధోనీసేన (2011 ఈవెంట్లో చివరి నాలుగు విజయాలు సహా) అత్యధిక విజయాల రికార్డు (9) సాధించింది.

chandrababu naidu

ఏడు జిల్లాలకు స్పెషల్ ప్యాకేజీ... చంద్రబాబు

  ఆంధ్రప్రదేశ్ లో మంగళవారం శాసనసభలో చర్చలు బాగానే జరిగాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడుతూ... రాయలసీమ ఉత్తర ఆంధ్రాల్లోని ఏడు జిల్లాలకు కేంద్రం స్పెషల్ ప్యాకేజీ ఇచ్చిందని తెలిపారు. దేశ, రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొనే ఎన్నికల కంటే ముందే భాజపాతో పొత్తుపెట్టుకున్నామని అన్నారు. విశాఖ రైల్వేజోన్, రాజధానికి నిధులు, రెవెన్యూలోటు భర్తీ చేస్తామని కేంద్రం హామీ ఇచ్చిందనీ స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి తీసుకొస్తామని, అంతేకాకుండా కేంద్రం కూడా రాష్ట్ర అభివృద్ధికి సహకారం అందించాలని కోరారు. 30 ఏళ్లు నుండి నీతి నిజాయితీగా రాజకీయాల్లో కొనసాగుతున్నానని, ఎవరెన్ని అవినీతి ఆరోపణలు చేసినా పట్టించుకోనని అన్నారు. అవినీతికి పాల్పడేవాళ్లే అలాంటి మాటలు మాట్లడతారని చెప్పారు.

chennai

ప్రియుడా..? కాలయముడా..?

  ఓ ప్రియుడు రాక్షసుడిలా మారి ప్రియురాల్ని కిరాతకంగా హతమార్చాడు. ఈ దారుణమైన ఘటన సోమవారం చెన్నైలో జరిగింది. వివరాల ప్రకారం దినేశ్ కన్నప్పన్ (25) ఓ ప్రైవేటు బ్యాంకులో పనిచేస్తున్నాడు. అతనికి అదే బ్యాంకులో పనిచేస్తున్న అరుణ శ్రీనివాసన్ తో చాలా కాలంగా పరిచయం ఉంది. వీరిద్దరూ గత మూడేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. అయితే దినేశ్ గత రాత్రి అనారోగ్యంతో ఉన్న తన తండ్రిని ఆస్పత్రిలో చేర్పించి అయనవరంలోని అరుణ ఫ్లాట్ కు వెళ్లాడు. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య మాటా మాటా పెరిగి ఘర్షణ చోటుచేసుకొంది. దీంతో దినేశ్ ఒక్కసారిగా ఉన్మాదిలా మారిపోయి అరుణని ఫ్లవర్ వాజ్ తో బలంగా తలపై కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. మృతదేహాన్ని దినేశ్ ఓ బెడ్ షిట్ లో చుట్టి లోయలో పడేశాడు. స్థానిక యువకుడు దినేశ్ చర్యలను అనుమానించి పోలీసులకు సమాచారం అందిచగా, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకునేలోపు పరారయ్యాడు. అసలు అతను ఎందుకు హత్య చేశాడో తెలియదని అతన్ని పట్టుకొని ఇంటరాగేషన్ చేస్తేకానీ వివరాలు తెలియవని పోలీసులు తెలిపారు.

నోర్ముసుకో..ఏం మాట్లాడుతున్నావ్...డీకే అరుణ

  తెలంగాణా అసెంబ్లీ సమావేశాలలో ఎవరికి వాళ్లు వాళ్ల నోటి పవర్ ను చూపించుకుంటున్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ సభ్యుల మధ్య మాటల యుద్ధమే కొనసాగుతోంది. మాజీమంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకె అరుణ మహబూబ్ నగర్ జిల్లా గుర్రంగడ్డ అభివృద్ధి గురించి మాట్లాడుతూ ఆమె అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం ఇచ్చిన సమాధానంతో అసలు గొడవ మొదలైంది. డీకే అరుణ మాట్లాడుతూ... టీఆర్ఎస్ సభ్యులను నోర్ముసుకో..ఏం మాట్లాడుతున్నావ్.. మహిళలతో పద్ధతి ఇదేనా.. మహిళలకు ఇచ్చే గౌరవం ఇలాగేనా... టీఆర్ఎస్ పార్టీలో ఎలాగూ మహిళలను నోరు మూపించేశారు మీరు అంటూ మండిపడ్డారు. ఈ మాటలకి ఐటీ మంత్రి కేటీఆర్ జోక్యం చేసుకొని మీ దాదాగిరి ఏదైనా ఉంటే మహబూబ్ నగర్ లో చూసుకోండి ఇక్కడ చూపించకండి అని అన్నారు.

గందరగోళ సమావేశాలు...

  తెలంగాణ శాసనసభ సమావేశాలు రెండోరోజు కూడా చాలా వాడివేడిగా ప్రారంభమయ్యాయి. మంగళవారం కూడా సభ అలా మొదలయ్యిందో లేదో 15 నిమిషాలు వాయిదా పడింది. ఇవి అసెంబ్లీ సమావేశాల్లా కాకుండా గందరగోళ సమావేశాలుగా తయారయ్యాయి. సభలో చర్చలు కంటే ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడం ఎక్కువైంది. సభలో అధికార పార్టీ తమ జులుంను బాగానే చూపిస్తుంది. దీనికి ఉదాహరణగా సోమవారం జరిగిన శాసనసభా సమావేశాల్లో పదిమంది టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెన్షన్ గురికావడం చెప్పుకోవచ్చు. సభా కార్యక్రమాలకు అడ్డుతగులుతున్న టీడీపీ ఎమ్మెల్యేలను సమావేశాలు ముగిసే వరకూ సస్పెండ్ చేయాలని శాసనసభ వ్యవహారాల మంత్రి హరీశ్‌రావు ప్రతిపాదించడం, తీర్మానాన్ని సభ ఆమోదించడం క్షణాల్లో జరిగిపోయింది. మాల, మాదిగ, మహిళలకు ప్రాతినిధ్యం కల్పించాలంటూ టీడీపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేయగా, మంత్రి హరీశ్‌రావు కల్పించుకుని.. జాతీయ గీతాన్ని అవమానించిన సభ్యులు భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో పది మంది సస్పెన్షన్ కోరుతున్నట్లు మంత్రి ప్రతిపాదించారు.