రైతుల కష్టాల్లో తోడుగా మేమున్నాం.. మోడీ

ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీలో నిర్వహిస్తున్న కృషీ ఉన్నతి మేళాను ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ..రైతుల కష్టాల్లో త‌మ ప్ర‌భుత్వం పాలుపంచుకుంటుంద‌ని అన్నారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే దిశగా అడుగువేస్తున్నామ‌ని పేర్కొన్నారు. అంతేకాదు సాంకేతికతను కూడా రైతులు ఉపయోగించుకునేలా అందరికి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తామని.. ఆ సాంకేతిక‌త అందరికీ చేరవేస్తామ‌ని అన్నారు. తాము రైతులకు ఏం చేయాలని పూనుకున్నామో అవన్నీ తప్పక చేస్తామని.. రైతులు ఆనందంగా ఉండాలంటే వేస‌విలోనూ నీరు పుష్కలంగా ఉండాలన్నారు. అంతేకాదు ఈ సందర్భంగా ఆయన గత ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. తాము చేసిన అభివృద్ధిని వారే చేసిన‌ట్లు చెప్పుకుంటున్నారని అన్నారు. కొన్ని చోట్ల ప్రాజెక్టులు కట్టారు కానీ రైతులకు మాత్రం నీరందలేదని విమ‌ర్శించారు.

పవన్ కల్యాణ్ కంటే ప్రభాసే గొప్ప.. వర్మ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో విడుదల రేపు జరగనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సందర్బంగా రాంగోపాల్ వర్మ పవన్ కు ఓ సలహా ఇచ్చారు. 'సర్దార్ గబ్బర్ సింగ్' సినిమాను బాలీవుడ్ లో విడుదల చేయడంపై మరోసారి ఆలోచించాలని చెప్పాడు. అంతేకాదు.. బాహుబలి సినిమాతో ఈ సినిమాని ముడిపెట్టి సహహాలు అంటూనే బాగానే కామెంట్లు విసిరారు. బాహుబలి సినిమాలో విషయం ఉంది కాబట్టి..విజువల్ ఎఫెక్ట్స్ సూపర్ అని.. అలాంటి సినిమాకి తగ్గ విషయం సర్దార్ గబ్బర్ సింగ్ లో ఉండాలని సూచించాడు. బాహుబలి సినిమాతో ప్రభాస్  స్టార్ డమ్ ను సంపాదించుకున్నాడు.. బాలీవుడ్ లో పవన్ కల్యాణ్ కంటే ప్రభాసే గొప్ప అని.. ఆఖరికి 'బాహుబలి'తో పోలిస్తే 'సర్దార్ గబ్బర్ సింగ్' గొప్ప సినిమా కాదని తేల్చిచెప్పాడు. మరి ఇప్పటికే పవన్ పై అనేక సార్లు కామెంట్లు విసిరిన వర్మ పై ఫ్యాన్స్ కోపంతో రగలిపోతున్నారు.. మరి ఈ మాటలకు ఎలా స్పందిస్తారో.. ముఖ్యంగా పవన్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

అసదుద్దీన్‌కు గాంధి మనవడి మద్దతు

‘నా పీక మీద కత్తి పెట్టినా కూడా భారత్‌ మాతాకీ జై అనను’ అంటూ మజ్లిస్‌ నేత అసదుద్దీన్‌ ఓవైసీ చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపిన విషయం తెలిసిందే! దేశంలోని పార్టీలన్నీ ఏకతాటిన అసదుద్దీన్‌ వ్యాఖ్యలను ఖండించాయి. జావేద్‌ అక్తర్‌, షబానా ఆజ్మీ, తస్లీమా నస్రీన్‌..... ఇలా ఒకరి తరువాత ఒకరు ఆయన వ్యాఖ్యలను తూర్పారపట్టారు. ఇలాంటి క్లిష్ట సమయంలో అసదుద్దీన్‌కు ఓ అనుకోని మద్దతు లభించింది. జాతిపిత గాంధి మనవడైన రాజ్‌మోహన్‌ గాంధి ‘దేశభక్తి నినాదాలను చేయాలని ఒకరిని బలవంత పెట్టలేమంటూ’ వ్యాఖ్యానించారు. అంతేకాదు! అలా బలవంత పెట్టే శక్తులను వ్యతిరేకించకపోతే గాంధి, ఆచార్య కృపలానీ, సర్దార్‌ పటేల్‌ వంటి పెద్దల సిద్ధాంతాలను అగౌరవపరిచినట్లే అని చెప్పుకొచ్చారు. నిన్న గుజరాత్‌లో ఆచార్య కృపలానీ స్మారక ఉపన్యాసాన్ని ఇస్తూ రాజ్‌మోహన్‌ ఈ వ్యాఖ్యలను చేశారు. ఇప్పడు రాజ్‌మోహన్‌కు ఎవరు బదులు చెబుతారో మరి!

అబ్బాయి కడుపులో గర్భసంచి.. ఎక్కడ..?

  కొన్ని కొన్ని సార్లు కొన్ని సంఘటనలు వింటే చాలా విచిత్రంగా అనిపిస్తాయి. అయితే వినడానికి అవి విచిత్రంగా ఉన్న.. నిజం కాబట్టి నమ్మక తప్పదు. అలాంటి విచిత్రమైన ఘటనే తెలంగాణలో జరిగింది. సాధారణంగా గర్బసంచి అనేది ఆడవారిలో ఉంటుంది..కాని ఇక్కడ సృష్టి ధర్మానికి విరుద్ధంగా ఓ అబ్బాయి కడుపులో గర్భసంచి అభివృద్ధి చెందింది. వివరాల ప్రకారం.. తెలంగాణలోని కరీంనగర్ జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వీర్నపెల్లి గ్రామానికి చెందిన కుర్ర శేఖర్, భారతిలకు వేణు కొడుకు. అయితే వేణుకు చిన్నప్పటి నుండి ఆడపిల్లల లక్షణాలు కనిపించాయి. దీంతో వేణు తల్లి దండ్రులు అతనిని పలు ఆస్పత్రులకు తిప్పేవారు. ఈక్రమంలోనే ఇటీవల ముస్తాబాదులోని పీపుల్స్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అయితే అక్కడ పరీక్షలు చేసిన డాక్టర్ వేణు  కడుపులో గర్భసంచిని గుర్తించారు. హిమోప్రోడిజం అనే వ్యాధి వల్ల వేణులో ఆడ, మగ లక్షణాలు కలగలసి కనిపిస్తున్నాయని శంకర్ అనే వైద్యుడు తేల్చారు. ఆ తర్వాత వేణుకు ఆపరేషన్ చేసి అతడి కడుపులోని గర్భసంచిని తొలగించారు.

స్పీకర్ అబద్దాలు చెబుతున్నారు.. అవహేళన చేస్తున్నారు.. జగన్

  రోజాను అసెంబ్లీలోకి అనుమతించకపోవడంతో వైసీపీ నేతలు అసెంబ్లీ నుండి అంబేద్కర్ విగ్రహం వరకూ ర్యాలీ నిర్వహించారు. జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. న్యాయవ్యవస్థ తీర్పును అవహేళన చేస్తున్నారు.. హైకోర్టు తీర్పుపై అసెంబ్లీలో చర్చించడం ఏంటీ అని ప్రశ్నించారు. సోమవారం జరిగే చర్చలో మేం పాల్గొనం అని తేల్చి చెప్పారు. రోజా సస్పెన్ష్ పై స్పీకర్ అబద్దాలు చెబుతున్నారు..అసెంబ్లీలో నిరసన తెలిపేందుకు అవకాశం ఇవ్వలేదు..ప్రివిలేజ్ కమిటీలో అందరూ వారే ఉన్నప్పుడు ఇంకా న్యాయం ఎక్కడ జరుగుతుంది అని అన్నారు. మరోవైపు రోజా గాంధీ విగ్రహం దగ్గర నిరసన తెలుపుతుండగా నిరసంగా ఉన్న ఆమెను 108 అంబులెన్స్ లో నిమ్స్ కు తరలించారు.

ప్రాణాపాయ స్థితిలో మాఫియా డాన్ చోటా రాజన్..

  మాఫియా డాన్ చోటా రాజన్ అలియాస్ రాజేంద్ర సదాశివ్ నికల్జే ఇండోనేసియా పోలీసులకు చిక్కిన సంగతి తెలిసిందే. అయితే తన కిడ్నీలు పాడైపోయినందున చికిత్స నేపథ్యంలోనే చోటా డాన్ పోలీసులకు చిక్కినట్టు అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు మాత్రం చోటా రాజన్ ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఢిల్లీలోని తీహార్ జైల్లో ఉన్న చోటా రాజన్ పరిస్థితి మరీ దారుణంగా ఉందని.. డయాబెటీస్ తో పాటు గుండె జబ్బులతో ఇబ్బంది పడుతున్న అతడి మూత్రపిండాలు రెండూ చెడిపోయాయని.. తక్షణమే డయాలసిస్ చేస్తే తప్పించి అతడి ప్రాణాలు నిలిచేలా లేవని అధికారులు తెలుపుతున్నారు. అయితే అతనికి జైల్లో చికిత్స అందిస్తున్నా ఎలాంటి ఉపయోగం లేదని.. అతనిని ఢిల్లీలోని ఓ మెరుగైన ఆసుపత్రిలో చికిత్స చేయిస్తామంటూ జైలు అధికారులు కోర్టును ఆశ్రయించి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ఈ నెల 30న విచారణ జరగనుంది.

భారత్ అమ్మీ కి జై అను.. అసదుద్దీన్ కు షబానా కౌంటర్

అసదుద్దీన్ చేసిన వ్యాఖ్యలకు రోజుకొకరు రోజుకో తీరుగా స్పందిస్తున్నారు. తాను చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు రాజకీయ నేతలే కాదు.. అటు సామాన్య ప్రజల నుండి సెలబ్రిటీల దాకా అందరూ తమ అభిప్రాయాల్ని వ్యక్తపరుస్తున్నారు. ఒకపక్క రచయిత జావెద్ అక్తర్ అసదుద్దీన్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించి ఆయనకు గట్టిగా సమాధానం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ జాబితాలో ఆయన భార్య.. బాలీవుడ్ సీనియర్ నటి షబానా అజ్మీ కూడా చేరారు. అసదుద్దీన్ వ్యాఖ్యలపై మండిపడ్డ ఆమె.. అసదుద్దీన్ ఓవైసీకి భారత్ మాతాకీ జై అనడానికి బదులుగా.. 'భారత్ అమ్మీ కి జై' అనడానికి ఎలాంటి అభ్యంతరం లేదు కదా అని ప్రశ్నించింది. భారత్ మాతాలో 'మాతా' అనే పదంతోనే సమస్య అయినప్పుడు.. మాతాకు బదులుగా అమ్మీ అని పలకడానికి ఆయనకు ఓకేనా అని షబానా ప్రశ్నించింది.

ప్రదర్శన మధ్యలోనే చనిపోయిన విద్వాంసుడు

  ఆఖరి నిమిషం వరకూ తమ కళని ప్రదర్శిస్తూనే ఉండాలని కొందరు సంగీత విద్వాంసులు చెప్పడం మనం వింటూ ఉంటాం. కర్ణాటకకు చెందిన 74 ఏళ్ల ఎ.వి. ప్రకాష్‌ అనే వేణుగాన విద్యాంసుడు కూడా తరచూ ఇదే మాట అనేవారట. అన్నట్లుగానే ఆయన మైసూరులోని ఒక ఆలయ ప్రాంగణంలో, ప్రదర్శన ఇస్తుండగానే కుప్పకూలిపోయారు. ప్రదర్శనలో ఉండగానే ఎ.వి. ప్రకాష్‌కు తీవ్రమైన గుండెపోటు రావడంతో, స్టేజి మీద ఉన్న వాయులీన విద్యాంసుడిని ప్రదర్శన కొనసాగించమని చెబుతూ మరణంలోకి జారుకున్నారు. హసన్‌ జిల్లాకు చెందిన ప్రకాష్‌, తన వేణుగానంతో వేలాది ప్రదర్శనలను నిర్వహించారు. కర్ణాటక తరఫున జాతీయ స్థాయిలోనే గొప్ప సంగీతకారునిగా గుర్తింపుని సాధించడమే కాకుండా, వేయికి పైగా విద్యార్థులకు వేణునాదంలో శిక్షణనిచ్చారు. ఆయన వద్ద ఐదు వందలకు పైగా రకరకాల వేణువుల సేకరణ ఉంది. అందుకే ఆయనను ముద్దుగా ‘ఫ్లూట్‌ ఫ్యాక్టరీ’ అని కూడా పిలిచేవారట. ఇప్పుడు ఆ వేణువులకి నాదాన్ని ఎవరు అందిస్తారు!

టీ 20.. భారత్-పాక్ మ్యాచ్ ఫీవర్... హాట్ కేకుల్లా టికెట్లు

క్రికెట్ అభిమానులకు అన్ని మ్యాచ్ లు ఒక ఎత్తైతే.. భారత్-పాక్ మ్యాచ్ అంటే ఆ కిక్కే వేరు అంటారు. ప్రత్యర్ద దేశాలు కాబట్టి ఈ మ్యాచ్ గురించి అందరూ ఆస్తిగా ఎదురుచూస్తుంటారు. ఐసీసీ టీ20 మెగా టోర్నీలో భాగంగా భారత్-పాక్ దేశాలు మధ్య నేడు మ్యాచ్ జరగనుంది. కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరిగే ఈ మ్యాచ్ కోసం భారత్, పాక్ దేశాలు మాత్రమే కాదు.. క్రికెట్ లవర్స్ అందరూ ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ మ్యాచ్ టికెట్స్ అన్నీ హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఇంకా అభిమానం ఉన్న వారు మాత్రం చిన్న అవకాశమైనా దొరకకపోతుందా? అంటూ ఈడెన్ గార్డెన్స్ వద్ద పడిగాపులు కాస్తున్నారు.   కాగా భారత్-పాక్ జట్లు ఇప్పటికీ ఒక్కొక్క మ్యాచ్ అడగా.. పాక్ విజయంతో గ్రూప్ బీ టాప్ 2 పొజిషన్ ఉండగా.. భారత్ మాత్రం పాయింట్ల పట్టికలో కింది నుంచి రెండో స్థానంలో ఉంది. ఇక ఈ మ్యాచ్ గెలిస్తేనే కాని భారత్ ఫైనల్ కు వెళ్లే అవకాశాలుంటాయి. మరి ఏం జరుగుతుందో తెలియాలంటే మ్యాచ్ మొదలయ్యే వరకూ ఆగాల్సిందే.

ప్రేమించలేదని... 15 ఏళ్ల అమ్మాయిని తుపాకీతో కాల్చేశాడు

వెంటపడిన అమ్మాయి తన ప్రేమను ఒప్పుకోలేదని, ఏకంగా ఓ తుపాకీని కొనుక్కొచ్చి ఆమెను షూట్‌ చేశాడు ఓ ప్రబుద్ధుడు. రాజస్థాన్‌కు చెందిన కమల్‌కాంత్‌, ఒక చుట్టాలమ్మాయిని ప్రేమించాడు. తరచూ ఆమెతో ఫోన్లో మాట్లాడేవాడు కమల్‌కాంత్‌. రోజురోజుకీ ఫోన్లో సంభాషణలు పెరిగిపోవడంతో, ఆ అమ్మాయి తనను ప్రేమిస్తోందని అపోహ పడ్డాడు. అదే నమ్మకంతో ముంబైలో ఉండే అమ్మాయి ఇంటికి చేరుకున్నాడు.   ‘నీ మీద అలాంటి ఉద్దేశమేదీ లేదు’ అని అమ్మాయి చెప్పడంతో రాజస్థాన్‌కు తిరిగివెళ్లి పోయాడు. ఈసారి ఓ తుపాకీ కొనుక్కుని మరీ వచ్చాడు కమల్‌కాంత్‌. మరోసారి తన ప్రేమ గురించి ఆమె అభిప్రాయం ఏమిటంటూ ఆ అమ్మాయిని కదిపాడు. ఎప్పటికీ తన జవాబు ఒకటేనని అమ్మాయి తేల్చిచెప్పడంతో, జేబులోని తుపాకీని తీసి కాల్చాడు. తూటా బాధితురాలి గొంతులోకి దూసుకుపోవడంతో ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఇంతాచేసి బాధితురాలు మైనారటీ కూడా తీరని ఓ పదిహేనేళ్ల అమ్మాయి! ప్రేమించలేదన్న పాపానికి యాసిడ్‌ దాడులు, అత్యాచారాలు, కత్తిపోట్లకు గురవుతున్న ఆడవాళ్లు ఇప్పుడు తుపాకులకు కూడా భయపడాల్సి వచ్చేట్లుంది.

మరోసారి ఒకవేదికపై కేసీఆర్, చంద్రబాబు

  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి కలిసే అవకాశం వచ్చింది. ఏపీ, తెలంగాణ న్యాయాధికారుల సదస్సు సందర్బంగా ఇరు చంద్రులు మరోసారి కలిశారు. సుప్రీం జడ్జిలు జస్టిస్ ఎ.ఆర్.దవే, జస్టిస్ దీపక్ మిశ్రా, హైకోర్టు చీఫ్ జస్టిస్ దీపక్ బి. భోసలే ఇతర న్యాయమూర్తులు తదితరులు పాలుపంచుకున్న ఈ కార్యక్రమానికి వీరు కూడా హాజరయ్యారు. చంద్రబాబు, కేసీఆర్ లు ఇతర న్యాయమూర్తులతో కలిసి జ్యోతి వెలిగించి సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. సత్వర న్యాయం ఇచ్చేందుకు చేస్తున్న కృషి అభినందనీయం.. దేశ అభివృద్దికి న్యాయ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుంది.. హైకోర్టు చీఫ్ జస్టిస్ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 35 శాతం కేసులు త్వరగా పరిష్కారమవుతున్నాయి.. న్యాయవ్యవస్థకు తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడూ సహకరిస్తుంది అని అన్నారు.

రోజాకి మళ్లీ నో ఎంట్రీ.. నలుపు దుస్తుల్లో వైసీపీ నేతలు

వైసీపీ ఎమ్మెల్యే రోజా అసెంబ్లీ ఎంట్రీ పై ఇంకా ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. అసెంబ్లీలోకి ప్రవేశించేందుకు  రోజా ప్రయత్నించగా.. పోలీసులు అసెంబ్లీ గేటు దగ్గరే రోజాను అడ్డుకున్నారు. దీంతో రోజా నిరసనగా గాంధీ విగ్రహం వద్ద బైఠాయించారు. మరోవైపు రోజాను అసెంబ్లీలోకి ప్రవేశించనివ్వని కారణంగా వైసీపీ నేతలందరూ నలుపు దుస్తుల్లో అసెంబ్లీకి హాజరయ్యారు. అంతేకాదు స్పీకర్ పోడియం వద్దకు చేరి ఆందోళనలు చేపట్టారు. ఇదిలా ఉండగా రోజాను అసెంబ్లీలోకి వెళ్లకుండా అడ్డుపడుటుండటంతో రాష్ట్రం వ్యాప్తంగా.. వైసీపీ సభ్యులు ఆందోళనలు చేపట్టనున్నారు. నియోజక వర్గాల్లోని అంబేద్కర విగ్రహాల ఎదుట ఆందోళన చేపట్టనున్నారు.

ఇలియానాకు లేఖ రాసిన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా..

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఇలియానాకు లేఖ రాశారు. ఇదేంటీ ఒబామా ఏంటీ.. నటి ఇలియానాకు లేఖ రాయడమేంటీ అనుకుంటున్నారా.. అలా అనుకుంటే తప్పులో కాలేసినట్టే. ఎందుకంటే ఒబామా లేఖ రాసింది నటి ఇలియానాకి కాదు.. క్యూబాకు చెందిన ఇలియానా యార్జా అనే మహిళకు. దాదాపు 50 ఏళ్ల తర్వాత అమెరికా నుండి క్యూబాకు ఒబామా లేఖ రాశారు. ఈ రెండు దేశాల మధ్య ఎన్నో దశాబ్దాల నుంచి సంబంధాలు అంత మంచిగా లేని నేపథ్యంలో ఒబామా నుండి లేఖ రావడంతో క్యూబా ఎంతగానో పులకించిపోయింది. అసలు కారణం ఎంటంటే.. బరాక్ ఒబామాను క్యూబా కాఫీ రుచి చూసేందుకు రావాలని  అహ్వానిస్తూ ఫిబ్రవరి 18న ఇలియానా లేఖ రాశారు. దీనికి ఆయన స్పందిస్తూ.. తనను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ.. ఆదివారం క్యూబాకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు ఒబామా తెలిపారు. కాగా 1928 తర్వాత ఆ ద్వీపానికి వెళ్తున్న తొలి అమెరికా అధ్యక్షుడిగా ఒబామా అరుదైన ఘనత సొంతం చేసుకోనున్నారు.

ఏపీ ప్రభుత్వానికి జగన్ కౌంటర్‌..

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ ప్రభుత్వానికి కౌంటర్‌ ఇవ్వడానికి సిద్దపడినట్టు తెలుస్తోంది. ఏపీ ప్రభుత్వం వైసీపీ ఎమ్మెల్యే రోజాపై హక్కుల ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో జగన్ కూడా రివర్స్ లో వారికి పంచ్ ఇవ్వడానికి సిద్ధపడ్డారు. ఈ స్థితిలో సభా హక్కులను ఉల్లంఘించారంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రులు దేవినేని ఉమామహేశ్వర రావు, అచ్చెన్నాయుడు, కామినేని శ్రీనివాస్‌లపై వైసిపి ఎమ్మెల్యేలు సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. ప్రతిపక్ష నేత వైయస్ జగన్‌ను, ప్రతిపక్ష పార్టీకి చెందిన శాసనసభ్యులను దూషించారని ఆరోపిస్తూ వారు ఆ నోటీసు ఇచ్చారు. కాగా టీడీపీ ఎమ్మెల్యే అనిత రోజాపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చిన సంగతి తెలిసిందే.

మేడమ్‌ టుస్సాడ్స్‌లో కపిల్‌ శర్మ బొమ్మ

  అచ్చు మనిషిని పోలిని మైనపు బొమ్మలను రూపొందించే మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియం గురించి విననివారు ఉండరు. లండన్‌లో ఉన్న టుస్సాడ్స్‌ మ్యూజియంలో తన మైనపు బొమ్మకి చోటు దక్కడాన్ని మహామహులు సైతం, గొప్ప గౌరవంగా భావిస్తారు. ఆ మ్యూజియంలో మన ప్రధాని మోదీ బొమ్మ కూడా చేరనుందన్న సమాచారం నిన్నే తెలిసింది. తాజాగా, మరో భారతీయ సెలబ్రిటీకి కూడా ఈ మ్యూజియంలో చోటు దక్కనుందన్న వార్త వినిపిస్తోంది. ‘కామెడీ నైట్స్ విత్‌ కపిల్‌’ పేరుతో దేశానికి కితకితలు పెట్టిన హాస్యనటుడు కపిల్‌ శర్మ కొలతలు కూడా మేడమ్‌ టుస్సాడ్స్‌ సిబ్బంది తీసుకున్నారట. కేవలం ఒకే ఒక్క షో ద్వారా దేశవ్యాప్తంగా అభిమానాన్ని చూరగొన్న కపిల్‌,  ఇప్పుడు ‘ద కపిల్ శర్మ షో’ పేరుతో సోనీ టీవీలో మరో కార్యక్రమాన్ని రూపొందించే ప్రయత్నంలో ఉన్నాడు. భారతీయ టెలివిజన్‌ రంగానికి చెందిన ఒక వ్యక్తి ప్రతిమ, మేడమ్‌ టుస్సాడ్స్‌లో చోటు చేసుకోవడం ఇదే మొదటిసారి.