శివాలయంలోకి ప్రవేశించినందుకు అరెస్టు

  మహిళలకు కూడా ఆలయాలలో ప్రవేశించే హక్కు ఉండాలంటూ సాగుతున్న ఉద్యమం, నానాటికీ తీవ్రరూపం దాలుస్తున్నట్లుంది. తాజాగా ప్రసిద్ధ జ్యోతిర్లింగం త్రయంబకేశ్వర ఆలయంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన తృప్తి దేశాయ్‌ అనే కార్యకర్తను పోలీసులు అరెస్టు చేశారు. భూమాత బ్రిగేడ్‌ అనే సంస్థకు చెందిన తృప్తి దేశాయ్‌, అంతరాలయాలలో మహిళలకు ప్రవేశం ఉండాలని ఎన్నో రోజులుగా ఉద్యమాన్ని నిర్వహిస్తున్నారు. గత జనవరిలో శని సింగనాపూర్‌లో కూడా ఆమె ఇలాంటి ప్రయత్నమే చేసి దేశవ్యాప్తంగా చర్చలకు దారితీశారు.   తృప్తి దేశాయ్‌ లేవనెత్తిన ఈ చర్చకు బీజేపీ అనుబంధ సంస్థ ఆరెస్సెస్ కూడా స్పందించాల్సి వచ్చింది. ఆలయాలలో స్త్రీల ప్రవేశానికి తాము అనుకూలమేనని, అయితే ఇది చర్చల ద్వారానే సాధ్యం కావాలని ఆరెస్సెస్ గత వారం సూచించింది. త్రయంబకేశ్వర ఆలయ కమిటీ మాత్రం, తరతరాలుగా వస్తున్న ఆచారాన్ని మార్చేదే లేదని తేల్చి చెప్పేసింది. మరోవైపు త్రయంబకంలోని స్థానిక మహిళలు, తృప్తి దేశాయ్‌ అరెస్టు గురించి తీవ్ర నిరసనలను వ్యక్తం చేయడం గమనార్హం. బహుశా మహిళా లోకం ఈ విషయమై తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లుంది.

ఒకరు కాదు ఇద్దరు పిల్లల్ని కనండి... చైనా అభ్యర్ధన

  ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం ఏదని అడిగితే ఠక్కున చైనా అని చెప్పేస్తారు. ఆ అపప్రధ పోగొట్టుకునేందుకు చైనా మూడు దశాబ్దాల క్రితం ఓ కఠినమైన చట్టాన్ని ప్రవేశపెట్టింది. దీని ప్రకారం ఒక జంట ఒక బిడ్డనే కనాల్సి ఉంటుంది. ఎవరన్నా ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తే వారికి కఠినమైన జరిమానాను విధించడంతోపాటు, కొన్ని ప్రభుత్వ పథాకాలకు అనర్హులుగా కూడా ప్రకటించేవారు. ఈ చట్టానికి భయపడి బలవంతపు అబార్షన్లు చేయించుకునేవారి సంఖ్య లక్షల్లోనే ఉండేది. చైనా చేసిన ఈ చట్టం వల్ల జనాభా అయితే తగ్గింది. కానీ దశాబ్దాలు గడిచిన తరువాత కానీ వారికి అర్థం కాలేదు, ఎంతటి పొరపాటు జరిగిపోయిందో!   ప్రస్తుతానికి చైనాలో యువకుల సంఖ్య తగ్గి, వృద్ధుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. 60 ఏళ్లు దాటిన వృద్ధులు ఆ దేశంలో 15.5 శాతం ఉన్నారంటేనే అర్థం చేసుకోవచ్చు. చైనా ఎంతటి ముందుచూపు లేని పనిచేసిందో! అందుకని ఈ ఏడాది మొదటి నుంచీ చైనా ప్రభుత్వం ‘ఒక్క బిడ్డతో ఏం ఆగుతారు, రెండో బిడ్డను కూడా కనేయండి’ అంటూ పెద్దరికం ప్రదర్శించడం మొదలుపెట్టింది. అంతేకాదు! రెండో పెళ్లి చేసుకున్నవారు కూడా ఇద్దరు పిల్లల్ని కనవచ్చునంటూ, ఇవాల్టి నుంచి అమల్లోకి వచ్చే ఓ చట్టాన్ని తీసుకువచ్చింది. కానీ జనం మాత్రం ఈ ప్రభుత్వ నిర్ణయం పట్ల పెద్దగా సంతోషం వ్యక్తం చేయడం లేదు. వయసు మీరిపోయిందనో, రెండో బిడ్డను పెంచే స్తోమత లేదనో వారు స్తబ్దుగా ఉండిపోతున్నారట.

హిందు, ముస్లింల కాళ్లు కడిగిన పోప్‌

  ఒక పక్క బెల్జియంలో జరిగిన ఉగ్రదాడితో యూరోప్‌ అంతటా విస్తుపోయి ఉండవచ్చు. ఈ దాడుల తరువాత ముస్లింల మీద అక్కడి ప్రజలలో ద్వేషభావం మరింతగా పెరిగిపోయిందనడంలో ఏమాత్రం సందేహం లేదు! మతాల మధ్య ఇలాంటి ద్వేషభావం పెరిగిపోవడం మంచిది కాదనుకున్నారో ఏమో, పోప్‌ ఒక అసాధారణ నిర్ణయాన్ని తీసుకున్నారు. గుడ్‌ ఫ్రైడేకి ముందు రోజున జరిగే ఓ కార్యక్రమంలో ఆయన వేర్వేరు మతాల వారి కాళ్లు కడిగి, వాటిని ముద్దు పెట్టుకున్నారు. సాధారణంగా తనను శిలువ వేయడానికి ముందర, క్రీస్తు తన 12 మంది శిష్యుల కాళ్లు కడిగారట.   ఆ ఆచారాన్ని కొనసాగిస్తూ, పోప్‌ ఏటా 12 మంది కాళ్లు కడగడం ఆనవాయితీగా వస్తోంది. అయితే క్యాథలిక్ మతానికి చెందిన పురుషులను మాత్రమే ఇందుకోసం ఎంపిక చేసేవారు. కానీ 2013లో పోప్‌ పదవిని చేపట్టిన తరువాత ఫ్రాన్సిస్‌... స్త్రీలను, అన్యమతస్తులను కూడా ఈ కార్యక్రమంలో చేర్చుకుని పలువురిని ఆశ్చర్యపరిచారు. ఈసారి జరిగిన కార్యక్రమంలో కూడా శరణార్థులను, ఆఫ్రికన్‌లను, ముసల్మానులను, స్త్రీలను, ఒక హిందువును కూడా చేర్చుకున్నారు పోప్‌. ‘మనందరి మతాలు, సంప్రదాయాలు వేరు కావచ్చు. కానీ మనమంతా సోదరులం. శాంతిని కోరుకునేవారం’ అంటూ ఈ సందర్భంగా తన సందేశాన్ని వినిపించారు పోప్‌!

కశ్మీర్‌ తొలి మహిళా ముఖ్యమంత్రి మెహబూబా!

  ఎట్టకేలకు కశ్మీర్లోని ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమమైంది. నిన్న పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ ముఖ్యులంతా సమావేశమై, మెహబూబాని తన పార్టీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడంతో... మెహబూబా ఇక ముఖ్యమంత్రి కావడం ఓ లాఛనంగా మారిపోయింది. దీంతో 77 రోజులుగా సాగుతున్న ఉత్కంఠతకు తెరపడింది. గత జనవరి 7న అప్పటి కశ్మీర్‌ ముఖ్యమంత్రి మూఫ్తీ మహమ్మద్‌ మరణించడంతో ఆ పీఠం ఖాళీ అయ్యింది. ఆయన తరువాత, ముఫ్తీ కుమార్తె ముఖ్యమంత్రి కానున్నారని ప్రచారం జరిగినా... మెహబూబా మాత్రం కాలం వెళ్లబుచ్చుతూ వచ్చారు. తమ మిత్రపక్షమైన బీజేపీ నుంచి మరిన్ని స్పష్టమైన హామీలు కావాలని పట్టుపట్టారు.   కానీ రోజులు గడుస్తున్న కొద్దీ, పరిస్థితులు ఆమెకు వ్యతిరేకంగా మారడం మొదలయ్యాయి. మెహబూబాకు మద్దతునిచ్చేందుకు బీజేపీ ఎంత సిద్ధంగా ఉన్నా, ఆమె మరింత బెట్టు చేయడంతో, ప్రభుత్వమే కూలిపోయే పరిస్థితులు వచ్చాయి. పీడీపీలోకి కొందరు ఎమ్మెల్యేలు ‘మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోతే, మేమే ఏదో దారి చూసుకుంటాం’ అని తేల్చి చెప్పడంతో మెహబూబా ఓ మెట్టు దిగారు. దానికి తోడు బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా, ప్రధాని నరేంద్రమోదీతో ఆమె జరిపిన చర్చలు కూడా సఫలం కావడంతో... ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మెహబూబా సిద్ధపడ్డారు. ఇక నేడో రేపో కశ్మీర్‌ ముఖ్యమంత్రిగా ఆమె ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. అతివాదులు, వేర్పాటువాదులు ఉన్న సమస్యాత్మక కశ్మీరంలో మెహబూబా తన సత్తాను ఎలా చాటనున్నారోనని దేశమంతా ఎదురు చూస్తోంది.  

నాకు ఇండియా అంటే పచ్చి ద్వేషం అంటున్న డేవిడ్ హెడ్లీ

  నా చిన్నప్పటి నుంచీ ఇండియా అంటే ద్వేషం. 1971లో ఇండియా యుద్ధ విమానాలు మా స్కూల్ భవనాన్ని కూల్చేశాయి. మా టీచర్లతో సహా అక్కడ పనిచేసే ఎంతో మంది మరణించారు. అప్పటి నుంచే ఇండియాపై నాకు ద్వేషం మొదలైంది. ఆ పగ తోనే లష్కరే తోయిబాలో చేరాను. ముంబై దాడుల్లో, భారతదేశానికి వీలైనంత నష్టం చేకూర్చాలనుకున్నాను అంటూ తన పాపాన్ని ఒప్పుకున్నాడు 26/11 ముంబై దాడుల్లో కీలక పాత్ర పోషించిన డేవిడ్ హెడ్లీ. ప్రస్తుతం అమెరికా జైల్లో 35 ఏళ్ల శిక్షను అనుభవిస్తున్న హెడ్లీని, వీడియో లింక్ ద్వారా ముంబై కోర్టు విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే.  2008 నవంబర్ 26న జరిగిన అప్పటి దాడుల్లో 166 మంది ప్రాణాలు కోల్పోయారు. తన బంధువులు కూడా పాకిస్థాన్ ఇంటిలిజన్స్ ఏజన్సీ ఐఎస్ఐ లో కీలక పాత్ర పోషిస్తున్నారని హెడ్లీ చెబుతున్నాడు. శివసేన అధినేత బాల్ థాక్రేను అంతం చేయడానికి లష్కరే ప్లాన్ చేసిందని, కానీ కుదరలేదని చెప్పుకొచ్చాడు హెడ్లీ. ఈ రోజుతో హెడ్లీ విచారణ ముగుస్తుందని సమాచారం.

కారు రాసుకుంటూ వెళ్లిందని... కొట్టి చంపేశారు

రోడ్డు మీద మొదలయ్యే గొడవలు ఎక్కడి దారితీస్తాయో, ఎలా ముగుస్తాయో చెప్పడం కష్టం. దిల్లీలో జరిగిన ఓ ఉదంతమే దీనికి సాక్ష్యం. దిల్లీలోని వికాస్‌పురిలో ఉండే 40 ఏళ్ల పంకజ్‌ నారంగ్ అనే దంతవైద్యుడు, బుధవారం అర్ధరాత్రి కారులో తన ఇంటికి వెళ్తున్నాడు. ఇంతలో అతని కారుని రాసుకుంటూ ఓ బైక్‌ దూసుకుపోయింది. బైక్‌ మీద ప్రయాణిస్తున్నవారు పంకజ్‌ని నానా తిట్లూ తిట్టి వదిలిపెట్టారు. కానీ గొడవ అంతటితో ముగిసిపోలేదు. వారు మరో 13 మందిని వెంటేసుకుని వైద్యుడి ఇంటికి చేరుకున్నారు. ఆ 15 మందీ కలిసి వైద్యుని చావకొడుతుంటే, ఆపే ధైర్యం కూడా ఎవ్వరూ చేయలేకపోయారు. తీవ్ర గాయాలతో పడి ఉన్న వైద్యుని సమీపంలోని ఓ ఆసుపత్రికి తీసుకువెళ్లినా ఉపయోగం లేకపోయింది. దాడికి పాల్పడినవారిలో ఎనిమిదిమందిని పోలీసులు అరెస్టు చేయగలిగారు. మిగతావారు మాత్రం పరారీలో ఉన్నారు!

ఆ ఎమ్మెల్యే కాపీ కొడుతూ దొరికిపోయాడు

  స్టూడెంట్స్ కాపీ కొడుతూ దొరికిపోవడం సహజం. కానీ బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన మాజీ ఎమ్మెల్యే గారు కూడా తన ఇష్టానికి కాపీ కొట్టేస్తూ చివరికి దొరికిపోయాడు. ప్రజలందరికీ ఆదర్శంగా ఉండాల్సిన ఒకప్పటి ప్రజాప్రతినిథి, ఆ పదవి పరువు తీసేశాడు. విషయంలోకి వెళ్తే గుంటూరు తూర్పు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, మస్తాన్ వలీ. ఈయన పీసీసీ ప్రధాన కార్యదర్శి కూడా. లా మొదటి సంవత్సరం చదువుతున్న ఈయన గురువారం జరిగిన పరీక్షలో కాపీ కొడుతూ దొరికిపోయాడు. స్క్వాడ్ వచ్చే సమయానికి కొంతమంది కాపీ కొడుతూ చిక్కారు. వారిలో మస్తాన్ వలీతో పాటు, అక్కడి యూత్ కాంగ్రెస్ నేత ఎస్.కే.జిలానీ, బీజేపీ నేత భాస్కర్రావు ఉన్నారు. ప్రస్తుతం ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా అందరినోటా నానుతోంది. పిల్లలకు ఆదర్శంగా ఉండాల్సిన వాళ్లే, ఇలాంటి పనులు చేస్తే ఎలా అంటూ ప్రశ్నిస్తున్నారు జిల్లా వాసులు.

రిటైర్ మెంట్ ప్రకటించిన షేన్ వాట్సన్

  ఆస్ట్రేలియా డాషింగ్ ఆల్ రౌండర్ షేన్ వాట్సన్ క్రికెట్ కు రిటైర్ మెంట్ ప్రకటించాడు. ప్రస్తుతం భారత్ లో జరుగుతున్న వరల్డ్ టి20 టోర్నీయే వాట్టోకు చివరిది. ఈ టోర్నీ ముగిసిపోగానే, వాట్సన్ క్రికెట్ కెరీర్ కూడా ముగిసిపోతుంది. 34 ఏళ్ల వాట్సన్ క్రికెట్ కు, ఆస్ట్రేలియాకు చేసిన సేవల్ని క్రికెట్ ఆస్ట్రేలియా సిఇ జేమ్స్ సదర్లాండ్ ప్రశంసించాడు. దాదాపు 14 ఏళ్ల పాటు ఆస్ట్రేలియాకు కీలక ఆల్ రౌండర్ గా సేవల్ని అందించిన వాట్సన్, ప్రపంచంలోనే బెస్ట్ ఆల్ రౌండర్స్ లో ఒకడిగా పేరు సంపాదించుకున్నాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ కు రిటైర్ మెంట్ ఇచ్చినా, దేశవాళీ లీగ్స్ లో మాత్రం ఇంకొన్నేళ్లు ఆడతానని వాట్సన్ స్పష్టం చేశాడు. స్టీవ్ వా తర్వాత ఆస్ట్రేలియాకు ఆడిన ఆల్ రౌండర్స్ లో షేన్ వాట్సన్ బెస్ట్. కెరీర్లో మూడు వరల్డ్ కప్పులను, రెండు అలాన్ బోర్డర్ మెడల్స్ ను, వన్డేల్లో 17 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్స్, నాలుగు మ్యాన్ ఆఫ్ ది సీరీస్ అవార్డ్స్ సొంతం చేసుకున్నాడు వాట్సన్. టెస్టుల్లో వాట్టో ఆస్ట్రేలియాకు 44వ టెస్ట్ కెప్టెన్.

ధోనీకి ఒళ్లు మండింది

కేప్టెన్‌ కూల్‌గా పేరుతెచ్చుకున్న ధోనీకి కూడా కోపం వస్తుంది. వస్తే గిస్తే సిక్సర్ బాదినట్లు అవతలివాడిని దులిపి పారేస్తాడు. అలా ధోనీ కోపానికి పాపం ఓ పాత్రికేయుడు బలైపోయాడు. బంగ్లా మీద ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌ తరువాత ధోనీ సంతోషంగా విలేకరుల సమావేశంలోకి అడుగుపెట్టాడు. కానీ ఓ విలేకరి అడిగిన మొదటి ప్రశ్నకే ధోనీకి ఒళ్లు మండిపోయింది. ‘నెట్‌ రన్‌రేట్‌ను మెరుగుపరుచుకునేలా భారీ విజయాన్ని సాధించాల్సిన చోట, చెమటోడ్చి గెలవాల్సి రావడం తృప్తిగా ఉందా?’ అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ధోనీ శివాలెత్తిపోయాడు. ‘మీకు ఇండియా గెలవడం ఇష్టం లేనట్లుంది!’ అంటూ దెప్పిపొడిచాడు. దానికి విలేకరి ఏదో చెప్పబోగా ‘మీ ప్రశ్నని వింటుంటే, మీరు అడిగే విధానాన్ని చూస్తుంటే ఇండియా గెలవడం మీకు ఇష్టం లేదని తెలిసిపోతోంది. అనుకున్న విధంగా గెలవడానికి ఇదేమీ స్క్రిప్ట్ ప్రకారం జరగదు’ అంటూ మండిపడ్డాడు. పైగా ‘భారీ గెలుపుకు అవసరమైన పరుగులను ఎందుకు చేయలేకపోయామో మీరు విశ్లేషించి ఉండాల్సింది. ఆ మాత్రం విశ్లేషణ మీరు చేయలేకపోతే, ఈ ప్రశ్నను అడగకుండా ఉండాల్సింది!’ అంటూ పుండు మీద కారం అద్దాడు. పాపం పాత్రికేయుడు!

నేను హిందూ వ్యతిరేకిని- దియా మీర్జా

హోళీ పండుగ గురించి మాట్లాడుతూ దియా మీర్జా చేసిన ఒక ట్వీట్‌, ఆమెను ఇబ్బందుల్లోకి నెడుతోంది. ‘మీరు నన్ను హిందూ వ్యతిరేకిగా పిలిస్తే పిలవచ్చుగాక, కానీ ఒక పక్క నీళ్లు లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే, మనం హోళీ పేరుతో నీటిని వృథా చేయడం చాలా దారుణం.’ అంటూ ఆ మధ్య దియా మీర్జా చేసిన ట్వీట్‌ మీద సోషల్ మీడియా విరుచుకుపడింది. దాంతో దియా మీర్జా తన ఫేస్‌బుక్‌లో సుదీర్ఘ వివరణని ఇవ్వవలసి వచ్చింది. భారతీయ పౌరురాలిగా, తనకు అన్ని వర్గాల వారి సంప్రదాయాల మీద గౌరవం ఉందని చెప్పుకొచ్చారు దియా. ఒకవేళ తన ట్వీట్‌ ఎవరి మనసునైనా నొప్పించి ఉంటే క్షమించమంటూ వేడుకున్నారు. ఒక పక్క క్షమాపణ చెబుతూనే, తాను అన్నదానిలో తప్పేమీ లేదని చెప్పేందుకు కూడా దియామీర్జా ప్రయత్నించారు. మహారాష్ట్రలో కరువు విలయతాండవం చేస్తోందనీ, ఇలాంటి సమయంలో నీటిని పొదుపుగా వాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.  అందుకోసం రంగునీళ్లతో కాకుండా, ఉత్త రంగులతోనే హోళీని జరుపుకోవాలని జనాలకి సూచించారు. మరి దియా మీర్జా క్షమాపణతో, వివరణతో సోషల్ మీడియా శాంతిస్తుందో లేదో చూడాలి. దేశంలోని పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్న సమయంలో, ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే వివాదాస్పదం అవుతాయని దియా మీర్జాకు తెలియదంటారా!

అదే మా విజయ రహస్యం- ధోని

టి-20 ప్రపంచ కప్‌లో బంగ్లాదేశ్‌తో ఇండియా కీలక పోరు. ఇందులో ఓడినవారు ఇంటిబాట పట్టక తప్పదు. గణాంకాలన్నీ ఇండియాకు అనుకూలంగా ఉన్నా, అప్పుడప్పుడూ అద్భుతాలు సాధించే సత్తా బంగ్లాకు ఉంది. అనుకున్నట్లే ఆట సాగుతుండగా బంగ్లాది పైచేయిగా కనిపిస్తోంది. ఆఖరి బంతికి రెండు పరుగులు చేస్తే చాలు, మ్యాచ్‌ బంగ్లా కైవసం అవుతుంది. అలాంటప్పుడే ధోని చకచకా నిర్ణయాలు తీసుకున్నాడు. ఇటు సింగిల్‌ కానీ, అటు భారీ షాట్ కానీ ఆడేందుకు అవకాశం లేకుండా ఫీల్డర్లను మోహరించాడు. ఇలాంటి సమయంలో బ్యాట్స్‌మెన్‌ కంగారుపడి బాల్‌ని కొట్టకపోయినా, పరుగు కోసం బయల్దేరతాడని ధోనీ అనుభవం చెబుతోంది. అందుకే బ్యాట్స్‌మెన్‌ను రనౌట్‌ చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు. ధోనీ ఊహించినట్లే జరిగింది. లేని పరుగు కోసం పరుగులెత్తి రనౌట్‌ అయ్యాడు బంగ్లా ఆటగాడు. ఒక్క పరుగుతో ఇండియా విజయాన్ని దక్కించుకుంది. ‘క్లాసులో ఉన్నవాడు ఎవ్వడైనా ఆన్సర్‌ చెబుతాడు, కానీ ఎగ్జామ్‌లో రాసేవాడే టాపర్‌ అవుతాడు’- జులాయి సినిమా క్లైమాక్సులో అల్లు అర్జున్‌ డైలాగుని విన్నాడో లేదో కానీ, బంగ్లా మ్యాచ్‌ తరువాత ధోనీ ఇలాంటి మాటలే అన్నాడు. ‘పరిస్థితి గందరగోళంగా ఉన్నప్పుడు, ప్రశాంతంగా ఆడగలిగితే ఫలితం దక్కుతుందని’ అంటున్నాడు. తన దగ్గరకు వచ్చి చాలామంది చాలా సలహాలు ఇస్తూ ఉంటారనీ... అవన్నీ దృష్టిలో ఉంచుకుని చివరికీ తాను నిర్ణయం తీసుకుంటాననీ చెప్పుకొచ్చాడు. బంగ్లాదేశ్‌ ఆటగాళ్లు జోరు మీద ఉన్నప్పుడే తాను ఆఖరి ఓవరు ఎవరితో ఎలా వేయించాలో నిర్ణయించుకున్నాని వెల్లడించాడు. మొత్తానికి ధోనిని మిస్టర్‌ కూల్‌గా ఎందుకు పిలుస్తారో, ప్రపంచానికి అర్థమైపోయి ఉంటుంది.

బాల్‌థాకరేను చంపే ప్రయత్నం జరిగింది- హెడ్లీ

ముంబై కోర్టు ముందు ఇదివరకు ఎన్నో సంచలనాలను ప్రకటించిన లష్కర్‌ తీవ్రవాది డేవిడ్‌ కోల్‌మన్‌ హెడ్లీ, మరో వార్తని పేల్చాడు. శివసేన నాయకుడు బాల్‌థాకరేను చంపాలని ఒకప్పుడు లష్కర్‌ ఏ తయ్యబా సంస్థ పథకం వేసిందని చెప్పుకొచ్చాడు. అయితే ఆ పథకాన్ని అమలుచేసే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేయడంతో, పని జరగలేదట. పోలీసుల కస్టడీలో ఉన్న సదరు నిందితుడు మాత్రం ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తేలింది.   శివసేన గురించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు, తాను కూడా వారి కార్యాలయాన్ని సందర్శించినట్లు హెడ్లీ చెప్పాడు. గత విచారణలో పాకిస్తాన్‌లో ఉన్న తీవ్రవాద సంస్థల గురించీ, ఆ సంస్థలతో అక్కడి ప్రభుత్వానికి ఉన్న సత్సంబంధాల గురించీ చెప్పుకొచ్చిన హెడ్లీ... ఈసారి విచారణలో మరెన్ని సంచలనాలు ప్రకటిస్తాడో చూడాలి. ప్రస్తుతం అమెరికా నిర్బంధంలో ఉన్న హెడ్లీని భారతదేశానికి తీసుకురాగలమా లేదా అన్నది, అతను వెల్లడించే వివరాల మీదే ఆధారపడి ఉంది.

హిందువులని బెదిరించేందుకు గోహత్య... అమెరికాలో

  అమెరికాలోని పెన్సిల్వేనియాలో జరిగిన ఓ సంఘటన ఆ దేశంలోని హిందువులను ఉలిక్కిపడేలా చేసింది. అక్కడ నిర్వహింపబడుతున్న ఓ గోసంరక్షణా కేంద్రం ముందు ఎవరో ఆగంతకులు, ఓ ఆవుతలని వదిలి వెళ్లారు. ఈ గోసంరక్షణా కేంద్రాన్ని న్యూయార్క సిటీ కళాశాలలో పనిచేసిన శంకరశాస్త్రి అనే పెద్దాయన 20 ఏళ్ల క్రితం మొదలుపెట్టారట. అమెరికాలో శాంతియుతంగా నివసిస్తున్న హిందువులను బెదిరించేందుకు, నిందితులు ఈ చర్యకు పాల్పడినట్లు అక్కడి హిందూ నాయకులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కూడా ఈ విషయమై కేసును నమోదు చేసి దర్యాప్తుని మొదలుపెట్టారు. కానీ శంకర శాస్త్రిగారు మాత్రం ఈ విషయం మీద ప్రశాంతంగానే ఉన్నారు. హిందువులకు గోవు ఎంత పవిత్రమైనదో తెలియనివారు ఇలా చేసి ఉంటారనీ, మున్ముందు ఇలాంటి ఘటనలు జరగకుండా తాము గో ప్రాముఖ్యత గురించి ప్రచారం చేస్తామని చెప్పుకొచ్చారు. ఈ విషయం మరింత వివాదాస్పదం కాకూడని ఆయన కోరుకున్నారు. అందరి ఆశా అదే!

నీ భార్యని బద్నాం చేస్తా... ట్రంప్‌!

అమెరికా అధ్యక్షునిగా రిపబ్లికన్‌ పార్టీ తరఫున ఎవరు పోటీ చేయాలనే అంశం ఇప్పుడు వ్యక్తిగతంగా మారిపోయింది. ఆ పార్టీ నుంచి అధ్యక్ష ఎన్నికలలో నిలబడేందుకు డొనాల్డ్ ట్రంప్‌, టెడ్‌ క్రూజ్‌ల మధ్య మంచి వేడి రాజుకుంది. అయితే ఈ విషయంలో భారతీయ నేతలు కూడా గర్వించేలా సదరు అభ్యర్థులు దిగజారుతున్నారు. తాజాగా ఓ వెబ్‌సైట్, ట్రంప్ భార్య ఉన్న ఓ నగ్న చిత్రాన్ని విడుదల చేసింది. ‘మీరు కనుక ట్రంప్‌ను ఎన్నుకొంటే, ఈమెను అధ్యక్షులవారి భార్యగా అంగీకరించాల్సి వస్తుంది’ అంటూ సదరు వెబ్‌సైట్‌ జనాల్ని హెచ్చరించింది. ఈ ఫోటోని చూసిన ట్రంప్ అగ్గిమీద గుగ్గిలం అయిపోయాడు. ఇదంతా నీ పనేనంటూ క్రూజ్‌ మీద మండిపడ్డాడు. ‘నా భార్య జోలికి వస్తే, నీ భార్యని కూడా బద్నాం చేస్తా!’ అంటూ హెచ్చరించాడు. దీనికి క్రూజ్‌ కూడా ఘాటుగానే స్పందించాడు. తమకీ ఫొటోకీ ఏ సంబంధమూ లేదనీ, నా భార్య జోలికి వస్తే నీకంటే పిరికిపంద మరెవ్వరూ ఉండరని బదులిచ్చాడు. ఎన్నికల సంగతేమో కానీ, అమెరికాకు కాబోయే ఈ అధ్యక్షులని చూసి మాత్రం ప్రపంచం నవ్వుకుంటోంది. ఏమో నవ్విన నాపచేను పండే రోజులే వస్తాయేమో!

క్రికెట్ కామెంటేటర్‌గా షారుక్.... ఈరోజే!

టి-20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్‌, బంగ్లాదేశ్‌ల మధ్య  ఇవాళ జరగనున్న పోటీ ఇరుజట్లకీ కీలకంగా మారనుంది. ఈ మ్యాచ్‌లో ఓడిపోయే జట్టు, పోటీ నుంచి నిష్క్రమించాల్సి రావచ్చు. అయితే చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ మీద గెలుపొందిన ఊపుతో ఉన్న భారత్‌, వరుస పరాజయాలతో నిండిన బంగ్లాదేశ్ మీద గెలిచే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. దానికి తోడు బంగ్లాదేశ్‌ బౌలర్లు తస్కిన్‌, అరాఫత్‌లు ఈ మ్యాచ్‌లో ఆడటం లేదు.   ఎటు చూసినా భారత్‌కు విజయ సంకేతాలు కనిపిస్తున్న ఈ సందర్భంలో, షారుక్‌ ఖాన్‌ కూడా పాలుపంచుకోనున్నట్లు సమాచారం. నేడు ఆయన కపిల్‌దేవ్, షోయబ్‌ అక్తర్‌లతో కలిసి అరగంట పాటు కామెంట్రీని చెప్పనున్నారట. కోల్‌కతాలో జరిగిన భారత్‌-పాక్ మ్యాచ్‌ని ప్రత్యక్షంగా చూడలేకపోయినందుకు షారుక్‌ ఇప్పటికే తెగ బాధపడిపోతున్నారు. అందుకే ఈసారి బెంగళూరులో జరగనున్న భారత్-బంగ్లా మ్యాచ్‌కు, కామెంట్రీ చెప్పి తగిన ప్రాయశ్చిత్తం చేసుకోనున్నారు. భారత్‌లో అసహనం గురించి వ్యాఖ్యలు చేసి వివాదాస్పదం అయిన షారుక్, ఇలాగైనా మళ్లీ నిలదొక్కుకుంటాడని ఆశిద్దాం!

ఉద్యోగం వెతుక్కో.... భర్తమీద భారం కావద్దు- ఓ కోర్టు తీర్పు

భార్యాభర్తలు విడిపోతే... భర్త, భార్యకి భరణంగా కొంత డబ్బుని అందిస్తూ ఉండటం సహజం. కానీ దిల్లీలోని ఓ కోర్టు దీనికి వ్యతిరేకంగా తీర్పునిచ్చింది. ఒక విడాకుల కేసులో భర్తకంటే భార్య మంచి చదువు చదువుకున్నందుకు, ఆమెనే ఉద్యోగం వెతుక్కోమని సూచించింది. తను ఒక్కసారి కూడా ఉద్యోగం చేయలేదనీ, తోడు లేకుండా బయటకు వెళ్లే అలవాటు కూడా తనకి లేదని చెప్పిన బాధితురాలి మాటలను కోర్టు అంగీకరించలేదు. కోర్టు కేసు కోసం రోజూ రాగలిగినప్పుడు, ఉద్యోగం కోసం వెళ్లలేవా అంటూ తిరిగి ప్రశ్నించింది. ఎమ్మెస్సీలో బంగారు పతకం పొందిన సదరు స్త్రీకి, తప్పకుండా ఉద్యోగం చేసే అవకాశం ఉందని కోర్టు భావించింది. అందుకోసం అవసరమైతే ఆమె మాజీ భర్త సాయం కూడా తీసుకోవచ్చునని సూచించింది. ఒక ఏడాదిపాటు ఆమె భర్త 12,000 రూపాయలు చెల్లించాలనీ, ఈలోగా ఆమె ఒక ఉద్యోగంలో చేరేందుకు తీవ్రంగా ప్రయత్నించాలని తీర్పునిచ్చింది. విడాకుల కేసులో ఇప్పటివరకూ ఇలాంటి తీర్పు రాలేదు కనుక, ఈ ఘటనను ఒక సంచలనంగా భావిస్తున్నారు.

పీడబ్యూఎఫ్ తో డీఎండీకే పొత్తు..

    తమిళనాడులో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే పార్టీలన్ని ఎటువంటి పొత్తు లేకుండా ఒంటరిగానే బరిలో దిగుతున్నట్టు తెలిపాయి. అయితే విజయ్ కాంత్ కూడా ఒంటరిగా పోటీ చేస్తున్నట్టు చెప్పారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం రాజకీయాల్లో మరో మలుపు తిరిగింది. ఎండీఎంకే, పీడబ్యూఎఫ్ తో కలసి తాము పోటీ చేస్తున్నట్టు డీఎండీకే స్పష్టం చేసింది. మొత్తం 124 సీట్లకు తాము పోటీ చేయనున్నామని, ముఖ్యమంత్రి అభ్యర్థిగా విజయకాంత్ ఉంటారని ఆ పార్టీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. మిగతా సీట్లను పొత్తులోని ఇతర పార్టీలకు పంచుతామని పేర్కొంది.

ఉస్మానియా యూనివర్శిటీలో మృతదేహం.. విద్యార్దుల ఆందోళన

  ఉస్మానియా యూనివర్శిటీలో కలకలం రేగింది. వాటర్ ట్యాంక్లో దూకి ఆత్మహత్య చేసుకున్న మృతదేహం బయటపడటంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని వెలికితీశారు. అయితే విద్యార్ధి మృతదేహం తరలింపులో పోలీసులకు, విద్యార్ధులకు మధ్య వాగ్వాదం తలెత్తింది. మృతదేహాన్ని తరలించడానికి వీల్లేదంటూ విద్యార్ధులు అడ్డుపడ్డారు. అయినా పోలీసులు వినకపోవడంతో వారిమధ్య గొడవ పెరగింది. దీంతో పోలీసులపై విద్యార్దులు రాళ్లు రువ్వారు. మరోవైపు వాటర్ ట్యాంకులో డెడ్ బాడీ స్టూడెంట్ దే అంటూ స్టూడెంట్స్ జేఏసీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.