మంత్రి కొమటిరెడ్డి వర్సెస్ పున్నా కైలాష్ నేత.. నల్గొండ కాంగ్రెస్ లో రచ్చ!
posted on Nov 26, 2025 5:31AM
నల్గొండ జిల్లా కాంగ్రెస్ లో చిచ్చు రేగింది. జిల్లా కాంగ్రెస్ కమిటీ నియామకం రచ్చ రేపింది. నల్గొండ డిసీసీ అధ్యక్షుడిగా పున్నా కైలాష్ నేత నియామకంపై మంత్రి కోమటిరెడ్డి తీవ్ర అసంతృప్తి, అసహనం, ఆగ్రహం వ్యక్తం చేయడంతో జిల్లా పార్టీలో విభేదాలు బహిర్గతమయ్యాయి. తనపైనా, తన కుటుంబంపైనా అసభ్య పదజాలంతో దూషిస్తూ మీడియాకు ఎక్కిన పున్నా కైలాష్ నేతను డిసీసీ అధ్యక్షుడిగా ఎలా నియమిస్తారంటూ మంత్రి కోమటిరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను, తన కుటుంబాన్ని అసభ్య పదజాలంతో దూషించిన పున్నా కైలాష్ నేతపై పోలీసు కేసు పెడతానంటూ ఏకంగా సీఎం రేవంత్ రెడ్డకి లేఖ రాశారు కోమటిరెడ్డి. పున్నా కైలాష్ నేతను డీసీసీ అధ్యక్ష పదవి నుంచి తొలగించి, అర్హులైన వారిని నియమించాలని డిమాండ్ చేశారు.
ఇలా ఉండగా మంత్రి కోమటిరెడ్డి వ్యవహారశైలిపై జిల్లా కాంగ్రెస్ లోని బీసీ వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీసీ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అయితే ఓర్వలేకపోతున్నారని మండిపడుతున్నాయి. ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపైనే తీవ్ర విమర్శలు చేసిన ఆయన తమ్ముడు కోమటిరెడ్డి రాజశేఖరరెడ్డిని ఎమ్మెల్యే పదవి నుంచి, పార్టీ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. దీంతో నల్గొండ జిల్లాలో వర్గ విభేదాలు రచ్చకెక్కాయి.
కోమటిరెడ్డి బ్రదర్స్ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వారిద్దరూ అందరిపైనా నోరు పారేసుకుంటుంటారనీ, ఇతరులెవరికీ పదవులు దక్కకుండా కుట్రలు చేయడం, బెదరింపులకు దిగడం వారికి అలవాటుగా మారిందని దుయ్యబడుతున్నాయి కాంగ్రెస్ లోని బీసీ వర్గాలు. ఈ నేపథ్యంలో నల్గోండ జిల్లా కాంగ్రెస్ రేగిన చిచ్చును పార్టీ అధిష్ఠానం ఎలా చల్లారుస్తుందోనన్న చర్చ రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది.