కాళేశ్వరం కమిషన్ ఎదుటకు ఈటల
కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ శుక్రవారం (జూన్ 6) హాజరు కానున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఆర్థిక, విధాన నిర్ణయాలు, బ్యాంకు గ్యారంటీల విడుదల, అంచనాల పెంపుపైనా కమిషన్ ఈటలను ప్రశ్నించనుంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో అప్పటి సీఎం కేసీఆర్ కేబినెట్లో ఈటల రాజేందర్ ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న సంగతి తెలిసిందే. దీంతో ప్రాజెక్టుకు నిధుల విడుదల, ప్రాజెక్టుకు సంబంధించి మంత్రి మండలి తీసుకున్న ఆర్థిక, విధానపరమైన నిర్ణయాలపై ఆయనను కమిషన్ ప్రశ్నించనుంది.
ఇక మాజీ మంత్రి హరీష్ రావు సోమవారం (జూన్ 9) కమిషన్ ముందు విచారణకు హాజరు కానున్నారు. ఇక మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కమిషన్ ఎదుట ఈ నెల 11న హాజరు కానున్నారు. వాస్తవానికి కేసీఆర్ ఈ నెల5నే విచారణకు హాజరు కావాల్సి ఉండగా, ఆయన విజ్ణప్తి మేరకు కమిషన్ విచారణకు 11కు వాయిదా వేసింది. అసలు కేసీఆర్, ఈటల, హరీష్ రావులను విచారించకుండానే కమిషన్ నివేదిక ప్రభుత్వానికి సమర్పించాలని ముందుగా భావించినప్పటికీ ఆ తరువాత వీరిని కూడా విచారించాలని నిర్ణయం తీసుకుంది.
విచారణలో భాగంగా ఇప్పటికే 109 మంది రిటైర్డ్ ఈఎన్సీలు, ఇంజనీర్లు, అధికారులు, పలువురు ప్రైవేట్ వ్యక్తుల నుంచి స్టేట్మెంట్లను తీసుకున్న కమిషన్, వారి స్టేట్ మెంట్ల ఆధారంగా తుది నివేదికను ఇప్పటికే సిద్ధం చేసింది. ఇప్పుడు కేసీఆర్, హరీశ్ రావు, ఈటల రాజేందర్ వాంగ్మూలాలనూ నమోదు చేయాలని కమిషన్ వారికి నోటీసులు పంపింది.