శ్రుతిహాసన్ ఇష్యూలో శ్రుతి మించిన మీడియా

సినీ కథానాయిక శ్రుతిహాసన్‌ని ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖమంత్రి కామినేని శ్రీనివాస్ విమానంలో ఏడిపించారనే అనారోగ్యకరమైన వార్త గత కొద్ది రోజులుగా మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ వార్తకి మీడియా రకరకాల మసాలాలు దట్టించి, చిలువలు పలువలు కల్పించి, తనదైన స్టైల్లో స్క్రీన్‌ప్లే అల్లేసి ప్రసారం చేసి మంత్రి కామినేని శ్రీనివాస్‌ని బద్నామ్ చేయడానికి శాయశక్తులా ప్రయత్నించింది. దీనికితోడు ఇదిగో పులి అంటే అదిగో తోక అనే సోషల్ మీడియా వుండనే వుంది... ఇలా ఈ నిరాధార వార్త మీడియాని ఆధారం చేసుకుని వ్యాపించింది. ఒక అబద్ధాన్ని ఖండించకపోతే అది నిజమేమోనని జనం నమ్మే ప్రమాదం వుంది కాబట్టి మంత్రి కామినేని శ్రీనివాస్  దీనిమీద వివరణ ఇచ్చారు. తాను ఎప్పుడూ శ్రుతి హాసన్‌ ప్రయాణించిన విమానంలో ప్రయాణించనే లేదని, తాను ఎప్పుడు తిరుపతి వెళ్ళినా కారులోనే వెళ్తానని, మీడియాలో జరుగుతున్న ఈ దుష్ప్రచారమంతా శుద్ధ అబద్ధమని తేల్చేశారు. తాను శ్రుతిహాసన్‌ని సినిమాల్లో తప్ప బయట ఎక్కడ చూడను కూడా చూడలేదని స్పష్టం చేశారు. ఒక వార్తను ప్రకటించే ముందు తన వివరణ తీసుకోవాలని మీడియా ఆలోచించకపోవడం అన్యాయమని ఆయన బాధపడ్డారు. తాను శ్రుతిహాసన్‌ని విమానంలో ఏడిపించానని నిరూపిస్తే తాను తన పదవికి రాజీనామా చేయడానికి కూడా సిద్ధంగా వున్నానని ప్రకటించారు. తన పదవికి కూడా రాజీనామా చేస్తానని ప్రకటించారంటే మంత్రిగారిని మీడియా ఎంతగా విసిగించిందో అర్థం చేసుకోవచ్చు. నిజానికి ఈ శ్రుతిహాసన్ ఇష్యూలో మీడియా శ్రుతిమించిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే, అసలు ఆరోజు జరిగింది వేరు... మీడియా కల్పించింది వేరు. అసలు ఆరోజు జరిగింది ఇదే... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు ఇటీవల ఒక సీనియర్ మహిళా అధికారితో కలసి విమానంలో తిరుపతికి వెళ్తున్నారు. వీరి పక్క సీట్లో ఒకమ్మాయి కూర్చుని వుంది. సినిమాలు చూడని మంత్రిగారికి ఆ అమ్మాయి శ్రుతిహాసన్ అని కూడా తెలియదు. ఇంతలో సూర్యాపేటలో జరిగిన కాల్పుల్లో దొరబాబు అనే ఎంపీటీసీ గాయపడ్డారని మంత్రిగారికి ఫోన్ వచ్చింది. గాయపడిన ఎంపీటీసిని ఆపరేషన్‌ థియేటర్‌కి తరలిస్తుండగా మంత్రికి ఫోన్ చేశారు. మంత్రి మాణిక్యాలరావు ఆ ఎంపీటీసీకి చికిత్స చేస్తున్న డాక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఎంపీటీసీ దొరబాబుకు మంచి వైద్యాన్ని అందించాల్సిందిగా డాక్టర్ని మంత్రి కోరారు. ఇలా మంత్రి మాణిక్యాలరావు ఫోన్‌లో మాట్లాడుతూ వుండగా పక్కసీట్లోనే వున్న శ్రుతిహాసన్ గయ్యిమంటూ లేచింది. మీరు ఫోన్ మాట్లాడుతూ వుంటే నేను డిస్ట్రబ్ అయిపోతున్నానంటూ గోలగోల చేసింది. మంత్రి మాణిక్యాలరావు ‘‘ఇది చాలా ఇంపార్టెంట్ ఫోనమ్మా.. అందుకే మాట్లాడుతున్నాను’’ అని చెప్తున్నా శ్రుతిహాసన్ ఎంతమాత్రం పట్టించుకోకుండా ఎయిర్‌హోస్టెస్‌ని పిలిచి కంప్లయింట్ చేసింది. దాంతో మంత్రి మాణిక్యాలరావు ఎందుకొచ్చిన గొడవ అని ఫోన్ కట్ చేసి కూర్చున్నారు. ఇంతలో మంత్రిగారి ఫోన్ మరోసారి మోగింది. అవతల ఫోన్ చేసిన వ్యక్తి... ‘‘సార్... ఇక్కడ బైక్ మీద వెళ్తున్న వ్యక్తికి యాక్సిడెంట్ అయింది. అతను స్పృహ కోల్పోయాడు. అతని ఫోన్‌లో చివరగా డయల్ చేసిన నంబర్ మీదే వుంది. అందుకే ఫోన్ చేశాం’’ అని చెప్పారు. ఇంతకీ ఆ యాక్సిడెంట్ అయిన వ్యక్తి మరెవరో కాదు... మంత్రి మాణిక్యాలరావు పీఏ. దాంతో ఆందోళన చెందిన మంత్రి తన పీఏ ప్రాణాలు కాపాడుకోవాలన్న ఉద్దేశంతో అతనని ఎలా ఆస్పత్రికి తరలించాలి.. ఏం చేయాలి అనే విషయాలను ఫోన్‌లో మాట్లాడారు. అంతే... శ్రుతి హాసన్ మరోసారి శివాలెత్తింది. తాను డిస్ట్రబ్ అయిపోతున్నానంటూ మరోసారి గొడవ చేయడం మొదలుపెట్టింది. చాలా పెద్ద ప్రాబ్లం కావడం వల్లే ఫోన్ మాట్లాడుతున్నానని చెప్పినా ఆమె ఎంతమాత్రం వినిపించుకోలేదు. ఇక ఈమెతో వాదించి తన పరువు తీసుకోవడం ఎందుకనుకున్న మంత్రిగారు ఫోన్ కట్ చేసి కూర్చుండిపోయారు. మంత్రిగారి పక్కన సీనియర్ మహిళా అధికారి ఉన్నారుకాబట్టి సరిపోయింది.. లేకపోతే విమానంలోని జనం మంత్రిగారిని అనుమానంగా చూసేవారే. మొత్తమ్మీద తిరుపతిలో ఫ్లైట్ లాండ్ అయిన తర్వాత ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. ఇదీ అసలు జరిగిన విషయం. ఈ విషయాన్ని మీడియా ఎలా డైవర్ట్ చేసిందో చూడండి. అసలు ఈ విషయంలో సంబంధమే లేని మంత్రి కామినేని శ్రీనివాస్‌ని ముగ్గులోకి లాగింది. అసలు జరిగిన ఘటనకి రకరకాల మసాలాలు దట్టించి జనాల్లోకి వదిలింది. ఇలాంటి అనారోగ్యకరమైన ధోరణులు ఇటీవలి కాలంలో మీడియాలో బాగా పెరిగిపోయాయి. తమ రేటింగ్‌ కోసం బాధ్యతాయుతమైన వ్యక్తుల మీద లేనిపోని అభాండాలు వేయడం దారుణమైన విషయం. మానవత్వంతో  వ్యవహరించాల్సిన సమయంలో నానాయాగీ చేసిన శ్రుతిహాసన్ ఎంత తప్పు చేసిందో, ఈ విషయంలో అభూత కల్పనలు ప్రసారం చేసిన మీడియా కూడా అంతే తప్పు చేసినట్టు. ఈ విషయంలో మీడియా తన పొరపాటును తెలుసుకుని, భవిష్యత్తులో అయినా బాధ్యతాయుతంగా ఆలోచిస్తుందని ఆశించడం అత్యాశే అయినా... మనం ఆశావాదులం... అలా జరుగుతుందనే ఆశిద్దాం.

రాంబాబుకి రాజకీయాలెందుకు కెమెరా ఉండగా..

  జనసేన పార్టీకి ఏకఛత్రాధిపతి అయిన పవన్ కళ్యాణ్ మనసులో ఏమీ ఆలోచనలున్నాయో తెలియదు కానీ ఆయన వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే తను ఏమి చేయాలనుకొంటున్నాడో తనకే తెలియనట్లు కనబడుతున్నారు. ఆ కారణంగానే ప్రజలు, ముఖ్యంగా అభిమానులు కూడా ఆయన ధోరణిణి అర్ధం చేసుకోలేకపోతున్నారు. ఆయన రాజకీయాలలో స్థిరంగా ఉంటారా అంటే ఉండరు. పోనీ మిగిలిన సినీ నటుల్లా రాజకీయాలకు దూరంగా ఉంటారా అంటే అలాగా ఉండలేరు. పోనీ స్థిరంగా ఏదయినా ఒక నిర్ణయానికి కట్టుబడి ఉంటారా...అంటే అలాగా ఉండలేరని రుజువు చేసుకొన్నారు. ప్రజా సమస్యలపట్ల నిజంగా శ్రద్ద ఉందా లేదా అంటే చెప్పలేని పరిస్థితి. ఉంటే నిలకడగా వాటి పరిష్కారం కోసం కృషి చేసేవారు. కానీ లేదని చెప్పడానికి లేదు. ఉంది గాబట్టే అప్పుడప్పుడు ఇలాగ ఆవేశపడుతుంటారు. కానీ అది తాటాకు మంటలాగ ఎంత వేగంగా ఎగిసిపడుతుందో అంతకంటే వేగంగా చల్లారిపోతుంది.   ప్రజాసమస్యల పట్ల పవన్ కళ్యాణ్ కి చాలా సానుభూతి ఉండవచ్చు. కానీ ఈవిధంగా అయోమయంగా, అస్థిరంగా వ్యవహరించడం వలన ఆయనకున్న మంచిపేరును, ప్రతిష్టను ఆయనే స్వయంగా కాలరాసుకొంటున్నారు. నలుగురిలో నవ్వుల పాలవుతున్నారనే సంగతి గ్రహిస్తే మంచిది. అంతేకాదు ఆయన ఒక సమస్య పరిష్కరించడానికి బయలుదేరితే మరొకరికి సమస్యలు సృష్టిస్తున్నారు కూడా.   ఇంతకు ముందు ఆయన తుళ్ళూరు మండలంలో గ్రామాలను సుడిగాలిలా పర్యటించినప్పుడు చెప్పిన మాటాలు, హైదరాబాద్ చేరుకొన్న తరువాత చెప్పిన మాటలకి ఎక్కడా అసలు పొంతన లేకపోవడంతో ఆయన చాలా విమర్శలకు ఎదుర్కోవలసి వచ్చింది. వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తుళ్ళూరు పర్యటించాలనుకొన్న సమయంలో ఆయన కూడా తుళ్ళూరులో పర్యటించబోతున్నట్లు మెసేజ్ పెట్టడం, వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిసి మాట్లాడటం ఆ తరువాత తుళ్ళూరు పర్యటించడం అనే మూడు సంఘటనలను కలిపి చూసిన వైకాపా నేతలు, ఆయన చంద్రబాబు ప్రోద్బలంతోనే తుళ్ళూరు బయలుదేరారంటూ చంద్రబాబుని ఆడిపోసుకొన్నారు. కానీ పవన్ కళ్యాణ్ తుళ్ళూరు వెళ్లిన తరువాత ఆయనకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతానని శపధాలు చేసారు. కానీ మళ్ళీ హైదరాబాద్ చేరుకోగానే చంద్రబాబు నాయుడుణి పొగడటంతో అందరూ ఆశ్చర్యపోయారు. పవన్ కళ్యాణ్ ఆ విధంగా మాట్లాడటం వలన ఇదంతా చంద్రబాబు పన్నాగమేనని మళ్ళీ అందరూ అనుమానించారు. పవన్ కళ్యాణ్ అయోమయ వ్యవహార శైలి వలన చంద్రబాబు నాయుడు తను చేయని తప్పుకి కూడా నిందలు పడాల్సి వచ్చిందని అర్ధమవుతోంది.   అన్ని మాటలు మాట్లాడిన పవన్ కళ్యాణ్ మళ్ళీ హటాత్తుగా ఎందుకు అదృశ్యమయిపోయారో, మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఆవేశపడుతున్నారో ఆయనే చెప్పాలి. మళ్ళీ ఒకవేళ ఈసారి ప్రజల మధ్యకి రాదలిస్తే ముందుగా తను ఏమి చేయాలనుకొంటున్నారో, అందుకు తను ఎన్ని గంటలు లేదా రోజులు వారికి తన కాల్షీట్లు కేటాయించగలరో ముందుగానే అవగాహన చేసుకొని, అందులో సాధ్యాసాధ్యాలను తన సన్నిహితులతో లేదా అభిమానులతో చర్చించిన తరువాతనే తగిన నిర్ణయం తీసుకొంటే మంచిది. అలాకాక మళ్ళీ ఓ నాలుగయిదు గంటలు హడావుడి చేసి మాయమయిపోతే పోయేదీ ఆయన పరువే. ఆయన రాజకీయాలలో రాకపోయినా ఎవరూ ఆయనను నిలదీయరు. కానీ ఇలా అప్పుడప్పుడు వచ్చి హడావుడి చేయడాన్ని ఎవరూ సమర్ధించరు.   ఒకవేళ ఇప్పుడు రాజధాని కోసం భూములు ఇవ్వదలచుకొని రైతుల తరపున పోరాడేందుకు సిద్దపడితే దాని పరిణామాలు ఏవిధంగా ఉంటాయో ఆయన ఆలోచించిన తరువాతనే రంగంలో దిగితే మంచిది. ఇప్పటికే కొందరు రైతులు హైకోర్టును ఆశ్రయిస్తే వారి భూముల జోలికి వెళ్ళవద్దని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చట్టం ప్రయోగించి రైతుల భూములు తీసుకోదలిస్తే, అందుకు చట్టంలో ఎటువంటి అభ్యంతరాలు లేకపోతే కోర్టు కూడా అడ్డుకోలేదు. కానీ అది చట్ట వ్యతిరేకమయితే కోర్టులు ప్రభుత్వాన్ని ఒక్క అడుగు కూడా ముందుకు వేయనీయకుండా అడ్డుపడటం తధ్యం. అటువంటప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చి కొత్తగా చేసేదేముంటుంది? హడావుడి తప్ప.

పవన్ ఉద్యమిస్తాడట.. అబ్బ ఛా...

సినీ హీరో, జనసేన పార్టీ ఏకైన నాయకుడు పవన్ కళ్యాణ్‌ది ఉరుములేని పిడుగు టైపు. అప్పటి వరకు ఎక్కడున్నాడో తెలియదు.. అంతలోనే సడన్‌గా ఓ పిడుగులాంటి స్టేట్‌మెంట్ ఇచ్చేస్తాడు. అప్పుడిక  మీడియా పని మొదలవుతుంది. పవన్ కళ్యాణ్ ఇచ్చిన రెండు లైన్ల స్టేట్‌మెంట్‌కి రకరకాల ఊహాగానాలు, కల్పనలు, కాకరకాయలు జోడించి కథనాలు ప్రసారం చేస్తుంది. పాపం స్టేట్‌మెంట్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ కూడా ఊహించని విషయాలను కూడా మీడియా ఊహించేస్తుంది. ఒక్కోసారి ఫ్యూచర్లో పవన్ కళ్యాణ్ ఏం చేయాలో కూడా మీడియా చెప్పేస్తుంది. అదేంటోగానీ, పవన్ కళ్యాణ్ కూడా చాలాసార్లు మీడియా చెప్పినట్టే అడుగులు వేస్తూ వుంటాడు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మరోసారి ఓ స్టేట్‌మెంట్ ఇచ్చాడు. ఏపీ రాజధాని గ్రామాల్లో ప్రభుత్వం భూ సేకరణ చేయాలని అనుకుంటోందట, దానికి వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ ఉద్యమించేస్తాడట. అదీ విషయం... పవన్ కళ్యాణ్ స్టేట్‌మెంట్ ఇచ్చేశాడు కాబట్టి ఇక ఉద్యమించేస్తాడని, ఆయన ఉద్యమం వల్ల భూమి బద్దలైపోతుందని, ఆకాశం కంపించిపోతుందని ఆయన అభిమానులు అనుకుంటే అనుకుంటారేమో. అయితే, ఆయన వరసని మొదటినుంచీ గమనిస్తున్న పరిశీలకులు మాత్రం పవన్ కళ్యాణ్‌ చేస్తున్నవి  కేవలం తాటాకు చప్పుళ్ళేనని, ఆయన ఆవేశం కేవలం తాటాకు మంటేనని అంటున్నారు. ఉద్యమం చేసేంత సీను ఆయనకు లేదని స్పష్టంగా చెబుతున్నారు. ఎప్పుడో ఒక్కసారి బయట కనపడితే మళ్ళీ నాలుగైదు నెలల వరకూ అడ్రస్ లేకుండా పోయే ఆయనేంటి... ఉద్యమం చేసేందేంటి అని అంటున్నారు. ఆయన పార్టీ పెట్టి ఏడాది ఎప్పుడో పూర్తయింది. పేరయితే ప్రకటించారుగానీ, తన పార్టీ నిర్మాణానికి ఆయన ఎంతమాత్రం పూనుకోలేదు. అప్పటి నుంచీ ఇప్పటి వరకూ ఆయన పార్టీ ఏక్‌నిరంజన్‌గానే వుంది. ఉట్టెక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కుతానని అందట. పార్టీని అభివృద్ధి చేసుకోవడమే చేతగాని పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఉద్యమాలు చేసేస్తానని ప్రకటించడం ఉట్టెక్కలేనమ్మ తరహాలోనే వుంది. ఉద్యమం చేస్తానని పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో ప్రకటించాడు. కనీసం ఆయన మీడియా ముందుకు రాలేదు. ఆయన ప్రతినిధి అంటూ ఎవరూ రాలేదు.. ఉద్యమం చేస్తానని ప్రకటించడానికే మనుషులు లేని ఆయన ఇంకేం ఉద్యమం చేస్తాడని పరిశీకులు అంటున్నారు. పవన్ కళ్యాణ్ ఉద్యమం చేస్తానంటున్నాడు. అసలు ఉద్యమమంటే ఏం చేస్తాడు? రాజధాని గ్రామాలకు వెళ్ళి మరోసారి ఆవేశంగా మాట్లాడతాడా? ఒకవేళ అక్కడ ఆవేశంగా మాట్లాడి అక్కడి రైతుల్ని రెచ్చగొట్టినా, మర్నాడు హైదరాబాద్‌లో నాలుక్కరుచుకుని ప్రభుత్వాన్ని పొగిడేరకం ఆయన. మొన్నామధ్య కూడా జరిగింది అదే కదా. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాను మాట్లాడిన మాటకే కట్టుబడి వుండే ధైర్యం ఆయనకు లేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాను మాట్లాడిన మాటలకు రియాక్షన్ ఎలా వుంటుందో రెండు మూడు రోజులు వేచి చూసే ఓర్పు కూడా ఆయనకు లేదు. తనను చూడటానికి వచ్చిన జనం ముందు ఆవేశంగా మాట్లాడ్డం, వాళ్ళను రెచ్చగొట్టడం, ఆ తర్వాత మళ్ళీ అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడం... ఇదే ఉద్యమమని పవన్ కళ్యాణ్ అనుకుంటున్నారేమో. ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ‘ఉద్యమం’ చేసి పరిస్థితిని సర్వనాశనం చేయడం తప్ప ఆయన సాధించేదేమీ వుండని పరిశీలకులు అంటున్నారు.

పాపం...రాజుగారు!

  సత్యం కంప్యూటర్స్ కుంభకోణంలో ప్రధాన దోషిగా నిర్ధారించబడిన రామలింగ రాజు పరిస్థితి చూసిన వారెవరికయినా ‘అయ్యో పాపం రాజుగారు…’అనుకోకుండా ఉండలేరు. కోర్టు ఆయనకి జైలు శిక్ష ఖరారు చేసేముందు తను రాష్ట్రానికి దేశానికీ చేసిన సేవల ఆయన స్వయంగా గురించి చెప్పుకొని, వాటిని దృష్టిలో పెట్టుకొని శిక్షను ఖరారు చేయమని ఆయన కోర్టును వేడుకొంటునప్పుడు ఎవరికయినా మనసు చివుక్కు మానకమానదు. తను నేరం చేసానని, దానిని దైర్యంగా అంగీకరించి ప్రజలకు, ప్రభుత్వానికీ క్షమాపణలు చెప్పుకొని, దాదాపు మూడేళ్ళు జైలు శిక్ష కూడా అనుభవించాను కనుక ఇకనైనా తనపై కనికరం చూపవలసిందిగా ఆయన కోర్టులో న్యాయమూర్తిని వేడుకొంటున్నప్పుడు ‘అయ్యో! పాపం రాజుగారు...’అని అనుకోకుండా ఉండలేము. ఆయన అభ్యర్ధనను న్యాయమూర్తి తిరస్కరించి ఏడేళ్ళు జైలు శిక్ష వేస్తున్నట్లు ప్రకటించినప్పుడు ఆయన బాధను చూసినవారు ‘అయ్యో’ అనుకోకుండా ఉండలేరు. జూబ్లీ హిల్స్ లో తన నివాసం నుండి కారులో వచ్చిన ఆయనని పోలీస్ వ్యానులో చర్లపల్లి జైలుకి తరలిస్తున్నప్పుడు ‘అయ్యో’ అనిపించక మానదు. కానీ నేరం చేసినవారు ఎంతవారయినా ఎటువంటి పరిస్థితిలో ఉన్నా శిక్ష అనుభవించక తప్పదు కదా అనుకొని సరిపెట్టుకోక తప్పదు.   కానీ అనేక ఆర్ధిక నేరాలకి పాల్పడిన వారు, ప్రజల సొమ్మును, ప్రభుత్వ భూములను, ఆస్తులను దిగమింగినవారు, డజన్ల కొద్దీ చార్జ్ షీట్లు వేసినా, జైలుకెళ్ళివచ్చినా చట్టసభలకి వెళ్ళగలుగుతున్న వారు, జనాల మధ్యకి వెళ్లి నీతి నిజాయితీ అంటూ ఉపన్యాసాలిచ్చేవారు చట్టంలో లొసుగులను రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకొంటూ దర్జాగా బయట తిరుగుతున్నప్పుడు, రాష్ట్రానికి, దేశానికీ ఎంతో సేవ చేసిన రామలింగ రాజు తను చేసిన నేరాన్ని నిజాయితీగా అంగీకరించి, అందుకు భారీ జరిమానాలు చెల్లించి, జైలు శిక్ష కూడా అనుభవించిన తరువాత మళ్ళీ జైలుకి వెళుతుంటే మనసు చివుకుమానకమానదు.   చట్టంలో లొసుగులను అడ్డుపెట్టుకొని తప్పించుకొని తిరగదలిస్తే బహుశః ఆయన కూడా ఈ జైలు శిక్ష నుండి తప్పించుకోగలిగేవారేమో? కానీ అనేక నేరాలు చేసి బెయిలు పొంది దర్జాగా బయట తిరుగుతున్న వారితో పోల్చి చూసినట్లయితే ఈ పరిస్థితుల్లో కూడా ఆయన నీతి నిజాయితీకి కట్టుబడి ఉన్నందునే జైలుకి వెళుతున్నారనిపిస్తుంది. రేపు ఆయన తరపు లాయర్లు హైకోర్టులో బెయిలు కోసం పిటిషను దాఖలు చేస్తే దానికి కోర్టు ఆమోదం తెలిపితే ఆయనకు కొంత ఉపశమనం దొరుకుతుంది. లేకుంటే మళ్ళీ రాజుగారికి జైలు జీవితం తప్పదు పాపం.

దేవుడా.. ఈరోజు గడిస్తే చాలు...

  ప్రస్తుతం హైదరాబాద్‌లోని ప్రజలు, పోలీసుల మనసులలో ఒకే ఒక్క మాట పదేపదే మెదులుతోంది. అది... ‘‘దేవుడా.. ఈరోజు గడిస్తే చాలు’’. అవును ఈరోజు శుక్రవారం.. హైదరాబాద్‌లో భారీగా మసీదుల వద్ద ప్రార్థనలు జరిగే రోజు. ఈరోజున సంఘ విద్రోహ శక్తులు ఎలాంటి విద్రోహ చర్యలకు పాల్పడకుండా, రెచ్చగొట్టే చర్యలకు పాల్పడకుండా వుండాలని అందరూ కోరుకుంటున్నారు. కారణం.. మూడు రోజుల క్రితం వికారుద్దీన్‌తో సహా ఐదుగురు ఉగ్రవాదులు ఎన్‌కౌంటర్లో చనిపోవడమే. నరరూప రాక్షసుల్లాంటి కరడుగట్టిన ఉగ్రవాదులు ఎన్‌కౌంటర్లో మరణించడాన్ని ముస్లింలకు వ్యతిరేకంగా జరిగిన చర్యగా చిత్రీకరించడానికి కొంతమంది రాజకీయ నాయకులు, కొంతమంది మతపెద్దలు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు.   కొంతమందిలో వికారుద్దీన్ బ్యాచ్ చనిపోవడం ఎంతో బాధ కలిగిస్తోంది. వికారుద్దీన్ అంత్యక్రియలకు వేలాదిమంది హాజరై కన్నీరు మున్నీరుగా విలపించారు. ఎన్‌కౌంటర్లో చనిపోయింది ఎంతోమందిని చంపిన తీవ్రవాదులన్న విషయం వారిలో ఎవరికీ గుర్తున్నట్టే లేదు. సాక్షాత్తూ తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ కూడా ఈ తీవ్రవాదులు చనిపోవడం తనకు ఎంతో బాధ కలిగిస్తోందని అంటూ కళ్ళు ఒత్తుకున్నారంటే పరిస్థితి ఎలా వుందో అర్థం చేసుకోవచ్చు.   ఈ నేపథ్యంలో శుక్రవారం నాడు జరిగే ప్రార్థనల సందర్భంగా పలు ప్రదేశాలలో కొంతమంది రెచ్చగొట్టే ప్రసంగాలు చేసే అవకాశం వుందని, అలాగే అల్లర్లు జరిగే అవకాశాలు కూడా లేకపోలేదని పోలీసులు భయపడుతున్నారు. ప్రజల్లో కూడా ఈ భయం వుంది. అందుకే పోలీసులు హైదరాబాద్‌లో శుక్రవారం నాడు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. శుక్రవారం నాడు హైదరాబాద్‌లో భారీ స్థాయిలో పోలీసు బలగాలు మొహరించాయి. ముఖ్యంగా మసీదులు ఉన్న ప్రాంతాలను ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు.

హమ్మయ్య! బొగ్గు మసి వదిలింది

  బొగ్గు గనుల అక్రమ కేటాయింపుల కుంభకోణంలో స్వయంగా విచారణకు హాజరుకమ్మని సీబీఐ ప్రత్యేక కోర్టు నుండి నోటీసులు అందుకొన్న మాజీ ప్రధానమంత్రి డా.మన్మోహన్ సింగ్, తనపై పెట్టిన కేసుల విచారణను నిలిపివేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషను వేశారు. దానిని విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు ఆయనపై పెట్టిన కేసులన్నిటిపై స్టే విధించడంతో ఈరోజు ఆయన సీబీఐ కోర్టు బోనులో నిలబడి సంజాయిషీలు ఇచ్చుకొనే కష్టం, అవమానం తప్పింది. ఇక మరో విశేషం ఏమిటంటే, ఆయనతో బాటు బొగ్గు శాఖ మాజీ ప్రధాన కార్యదర్శి పిసి ఫారెక్, కుమారా మంగళం బిర్లా తదితరులు వేసిన పిటిషన్లను విచారణకు స్వీకరించిన సి.నాగప్పన్ మరియు వి.గోపాల గౌడలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం వారికీ స్టే మంజూరు చేసింది. అంతేకాదు వారి పిటిషన్లను విచారణకు ‘అడ్మిట్’ చేస్తున్నట్లు పేర్కొనడం ద్వారా వారందరికీ మరొక మూడేళ్ళ వరకు ఈ కేసుల బాధ నుండి విముక్తి కల్పించింది.   న్యాయ పరిబాషలో ఏ కోర్టయినా పిటిషన్లను విచారణకు స్వీకరిస్తున్నప్పుడు ‘అడ్మిట్’ లేదా ‘గ్రాంట్ ఆఫ్ లీవ్’ అనే పదాలు వాడినట్లయితే ఆ కేసులు కనీసం మూడేళ్ళపాటు పక్కన బెట్టినట్లేనని న్యాయశాఖ నిపుణులు పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా వారి పిటిషన్లను ‘అడ్మిట్’ చేస్తున్నట్లు తెలిపింది. ధర్మాసనం తన అడ్మిట్ నిర్ణయానికి కారణాలు వివరిస్తూ “ఈ పిటిషన్లు వేసిన వ్యక్తులు అవినీతి నిరోధ చట్టం 1988లో సెక్షన 13(1) (డి) (3) పై లేవనెత్తిన కొన్ని చట్ట సంబంధమయిన ప్రశ్నలను లోతుగా పరిశీలించవలసి ఉంది గనుక ఈ కేసులను ‘అడ్మిట్’ చేయడమయిందని ప్రకటించింది. కనుక అంతవరకు డా.మన్మోహన్ సింగ్ తో సహా అందరిపై సీబీఐ ప్రత్యేక కోర్టులో నమోదు చేయబడిన కేసుల విచారణను నిలిపివేయడమే కాక వారికి కనీసం మరో మూడేళ్ళవరకు ఈ కేసుల బాధ నుండి విముక్తి కల్పించింది. కనుక డా.మన్మోహన్ సింగ్ బొగ్గు మసి వదిలించుకొన్నందుకు ఆయన, ఆయనతో బాటే కాంగ్రెస్ పార్టీ కూడా చాలా సంతోషపడవచ్చును.

వాళ్ళ మెదడు మోకాలిలో.. వీళ్ళ మెదడు అరికాలిలో...

మంగళవారం నాడు జరిగిన రెండు ఎన్‌కౌంటర్లు దేశంలోనే సంచలనం సృష్టించాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 20 మంది ఎర్రచందనం కూలీలు మరణించగా, తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్‌కౌంటర్లో కరడుగట్టిన తీవ్రవాది వికారుద్దీన్‌తో సహా ఐదుగురు తీవ్రవాదులు మరణించారు. ఈ ఎన్‌కౌంటర్ల పట్ల సామాన్య ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో ఎన్‌కౌంటర్ అయిన తీవ్రవాదులు సామాన్యులు కాదు..  ఎంతోమంది ప్రాణాలు తీసి, ఎన్నో అరాచకాలు చేసిన దుర్మార్గులు. ఈ తీవ్రవాద ముఠా నాయకుడు వికారుద్దీన్ గురించి చెప్పాలంటే పెద్ద గ్రంథం అవుతుంది. ఎంతోమంది పోలీసులను చంపేశాడు. పోలీసుల ప్రాణాలంటే అతనికి పూచిక పుల్లలతో సమానం. పోలీసులను చంపుతానని చెప్పిమరీ చంపుతాడు. ఎన్నో దోపిడీలు చేశాడు. ఎంతోమంది ప్రాణాలు తీశాడు. గతంలో నరేంద్రమోడీని చంపడానికి కూడా పథకాలు వేశాడు. ఇలాంటి తీవ్రవాది గత కొంతకాలంగా జైల్లో అతిథిగా వుంటూ సకల మర్యాదలు పొందుతున్నాడు. జైల్లో వున్న సిబ్బందిని కూడా బెదిరిస్తూ హవా నడిపిస్తున్నాడు. ఇన్నాళ్ళకు వాడి పాపం పండి పైకిపోయాడని జనం హర్షిస్తున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ అడవుల్లో ఎర్రచందనం చెట్లను నరికేస్తున్న తమిళనాడు కూలీలది మరో కథ. ఎర్రచందనం స్మగ్లర్లకి వెన్నెముకలాంటివాళ్ళు ఈ తమిళనాడు కూలీలే. భారీ మొత్తాలకు కాంట్రాక్టు కుదుర్చుకుని, వందల సంఖ్యలో తమిళనాడు నుంచి ఏపీ అడవుల్లోకి ప్రవేశించి ఎర్రచందనం చెట్లని నరికేస్తూ వుంటారు. ఎవరైనా ఫారెస్టు అధికారులు కనిపిస్తే, వాళ్ళని కూడా చెట్లతోపాటు నరికేస్తూ వుంటారు. ఈ ఎర్రచందనం కూలీలు ఇప్పటి వరకు ఎంతమందిని చంపేశారో లెక్కేలేదు. వీళ్ళలో కొంతమంది వీరప్పన్ ముఠా సభ్యులు కూడా వున్నారు. వీళ్ళ దగ్గర గొడ్డళ్ళు, కొడవళ్ళతోపాటు అవసరమైతే ఉపయోగించడానికి తుపాకులు కూడా వుంటాయంటే  వీళ్ళు ఎంత ‘ప్రొఫెషనల్సో’ అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి సంఘ విద్రోహశక్తులను ఆంధ్రప్రదేశ్ పోలీసులు కాల్చి చంపారు. ఈ ఘటన మీద కూడా ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది. ప్రజల విషయం ఇలా వుంటే, రాజకీయ నాయకులకు మాత్రం ఎక్కడలేని నొప్పి వచ్చిపడింది. తమిళనాడుకు చెందిన కూలీలు ఎన్‌కౌంటర్ అయ్యేసరికి మెదడు మోకాళ్ళలో వున్న అక్కడి రాజకీయ నాయకులకు ఎక్కడలేని పౌరుషం, రోషం ముంచుకొచ్చాయి. తమజాతి వాళ్ళని చంపేశారని మొత్తుకుంటున్నారు. అధికార పక్షం, ప్రతిపక్షం ఒక్కటయిపోయి పోటీలుపడి మొసలికన్నీరు కార్చేస్తున్నారు. చనిపోయిన స్మగ్లర్ల మీద సానుభూతి కురిపించేస్తున్నారు. వాళ్ళ కుటుంబాలకు నష్టపరిహారం కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. పనిలోపనిగా ఆంధ్రప్రదేశ్ నుంచి తమిళనాడుకు వెళ్ళిన వాహనాలను ధ్వంసం చేసి తరించారు. గతంలో ఈ కూలీలు కమ్ స్మగ్లర్లు ఎన్ని హత్యలు చేసినా ఉలకని పలకని తమిళనాడు నాయకగణం ఇప్పుడు ఇంత హడావిడి చేస్తున్నారు. మరి వాళ్ళ మెదడు మోకాళ్ళలో కాక ఇంకెక్కడున్నట్టు? ఇక ఈ ఎన్‌కౌంటర్లను రాజకీయంగా ఉపయోగించుకోవాలని చూస్తున్న ఆంధ్రప్రదేశ్ నాయకులు జగన్, రఘువీరారెడ్డి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే మన ఆరోగ్యాలకి అంత మంచింది. తమిళనాడు నాయకుల పరిస్థితి ఇలా వుంటే, తెలంగాణలో నాయకుల పరిస్థితి మరీ ఘోరం. ముఖ్యంగా ఎంఐఎం, ఎంబీటీ లాంటి మతవాద పార్టీల నాయకులు మాట్లాడుతున్న తీరు దారుణం.. ఐదుగురు కరడుగట్టిన తీవ్రవాదులు మరణించారని ప్రజలంతా హర్షిస్తుంటే, ఎంఐఎం నాయకుడు అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతున్న తీరు  జుగుప్స కలిగించేలా వుంది. హేతుబద్ధంగా ఆలోచించాల్సిన ఆయన మెదడు అరికాలిలోకి జారిపోయిన విధానాన్ని సూచించే విధంగా ఆయన తీరు వుంది. పోలీసులు సదరు తీవ్రవాదుల్ని కావాలనే చంపేశారట. సూర్యాపేట ఘటనకు ప్రతీకారంగా తీవ్రవాదుల్ని ఎన్‌కౌంటర్ చేసేశారంట. దీనిమీద ఏవేవో విచారణలు జరిపించాలట... విధినిర్వహణలో పోలీసులు చనిపోయినప్పుడు ఒక్క సానుభూతి వాక్యం కూడా పలకని ఒవైసీ, ఇప్పుడు తీవ్రవాదులు  ఎన్‌కౌంటర్ అయిపోగానే వాళ్ళ తరఫున వకాల్తా పుచ్చుకుని మాట్లాడుతున్న తీరు దారుణం. ఏపీలో అయినా, తెలంగాణలో అయినా ఇలాంటి నాయకులను చూస్తుంటేనే మన సమాజం ఇంకా ఎంత పతనం అయిపోతుందో అనే భయం కలుగుతోంది.

మళ్ళీ కాంగ్రెస్ గూటికి చేరుకొన్న తులసి రెడ్డి

  ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఒక వెలుగు వెలిగిన సీనియర్ నేత తులసి రెడ్డి రాష్ట్ర విభజన సమయంలో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పంచనచేరారు. కానీ ఆయన స్థాపించిన జై సమైక్యాంధ్ర పార్టీ ఎన్నికలలో డిపాజిట్లు కూడా దక్కించుకోలేని విధంగా ఘోరంగా ఓడిపోయి మూతపడిన తరువాత తులసి రెడ్డి పరిస్థితి కూడా అయోమయంగా మారింది. దాదాపు పది నెలలు వేచి చూసిన తరువాత ఆయన పిసిసి అద్యక్షుడు రఘువీరారెడ్డి సమక్షంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరారు.   తన భవిష్యత్ అగమ్యగోచరంగా ఉందనే ఆలోచనతోనే బహుశః ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరి ఉండవచ్చును. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ కూడా అగమ్యగోచరంగానే ఉందనే సంగతి అందరికీ తెలుసు. అటువంటప్పుడు తులసి రెడ్డి తీసుకొన్న నిర్ణయం పెనం మీద నుండి పొయ్యిలోకి దూకినట్లుంది. కానీ ఎంతగొప్ప రాజకీయ నాయకులకైనా ఏదో ఒక పార్టీ గొడుగు క్రింద ఉన్నంత కాలమే మీడియాలో, సమాజంలో గుర్తింపు ఉంటుంది కనుక ఆయన మళ్ళీ కాంగ్రెస్ పంచన చేరుతున్నారనుకోవాలసి ఉంటుంది. అయితే రాష్ట్రంలో ప్రత్యమ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాలనుకొంటున్న బీజేపీ తులసిరెడ్డి వంటి కాంగ్రెస్ నాయకుల కోసమే చూస్తున్నప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడం కొంచెం ఆశ్చర్యం కలిగిస్తుంది.

అవినీతి జగన్.. కేసులు డజన్...

  నీతి నిజాయితీలకు మారు పేరని చెప్పుకొనే జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తులు పోగేసుకొన్నారని ఆరోపిస్తూ సీబీఐ 11 చార్జ్ షీట్లు వేసింది. అవింకా ఒక కొలిక్కి రాక ముందే, ఇప్పడు ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు కూడా ఆయనపై హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి కోర్టులో మరొక కొత్త చార్జ్ షీట్ వేసారు. జగన్ తరువాత అన్ని చార్జ్ షీట్లలో రెండవ ముద్దాయిగా ఉన్న ఆడిటర్ మరియు వైకాపా నేత విజయసాయి రెడ్డి పేరును కూడా ఈడీ తన చార్జ్ షీట్లో చేర్చింది. వారిరువురూ కలిసి జగతీ పబ్లికేషన్స్ ఆస్తుల విలువను పెంచి చూపడం, క్విడ్ ప్రో పద్దతిలో జయలక్ష్మి టెక్స్ టైల్స్ డైరెక్టర్ టి.ఆర్. కన్నన్ చేత జగతీ పబ్లికేషన్స్ లో పెట్టుబడులు పెట్టించడం, తరువాత జగతీ పబ్లిక్షేన్స్ లో నష్టాలు చూపించడం వంటి నేరాలకు పాల్పడ్డారని ఈడీ తన చార్జ్ షీట్లో ఆరోపించింది. ఆ చార్జ్ షీట్ ని విచారణకు స్వీకరించిన సెషన్స్ కోర్టు ఈ కేసుకు యస్.సి. నెంబర్: 106/15ను కేటాయించింది. ఈ కేసులో ప్రధమ ముద్దాయిగా ఉన్న జగన్మోహన్ రెడ్డికి, రెండవ ముద్దాయిగా ఉన్న విజయసాయి రెడ్డికి, మూడవ ముద్దాయిగా పేర్కొనబడిన జగతీ పబ్లికేషన్స్ కి మే2వ తేదీన కోర్టుకు హాజరవవలసిందిగా నోటీసులు జారీ చేసింది.   అయితే తలుపులు నమిలి తినేవాడికి అప్పడాలు తినడం ఒక లెక్కా అన్నట్లు ఒకపక్క 11 సీబీఐ చార్జ్ షీట్లలో సీబీఐ కోర్టు కేసులను అవలీలగా ఎదుర్కొంటూ మరోపక్క రాజకీయాలలో చక్రం తిప్పుతున్న జగన్మోహన్ రెడ్డికి ఈడీ వేసిన ఈ కేసును ఎదుర్కోవడం పెద్ద కష్టమేమీ కాదనే చెప్పవచ్చును. దీనిని కూడా వాటితో కలిపి చూసుకొంటే ముచ్చటగా డజను కేసులున్నాయి చెప్పుకొనే సౌలభ్యం ఏర్పడిందిప్పుడు.

శ్రీ సిటీకి ప్రత్యేక పాలానాధికారాలు

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకెల్లా అత్యుత్తమయిన పారిశ్రామికవాడగా నిలిచిన శ్రీ సిటీకి ప్రత్యేక పాలనాధికారాలు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంగీకరించారు. సుమారు 7,600 ఎకరాలలో నెలకొల్పబడిన ఈ అత్యాధునిక పారిశ్రామికవాడ దేశ విదేశాలకు చెందిన అనేక మధ్య తరహా, భారీ పరిశ్రమలున్నాయి. శ్రీ సిటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పటికీ అది తమిళనాడు రాజధానికి చెన్నైకి కేవలం 55కిమీ దూరంలో ఉండగా, ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత రాజధాని హైదరాబాద్ నగరానికి 600 కిమీ దూరంలో ఉంది. కనుక అక్కడ పరిశ్రమలు స్థాపిస్తున్నవారు ఏ పనిపడినా ఎటువంటి అనుమతులు కావలసినా తప్పనిసరిగా హైదరాబాద్ బయలుదేరక తప్పడం లేదు. ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల శ్రీసిటీలో వివిధ పరిశ్రమలకు శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడి పారిశ్రామికవేత్తలు ఈ సమస్యను ఆయన దృష్టికి తీసుకువచ్చేరు. దానికి ఆయన తక్షణమే స్పందిస్తూ శ్రీ సిటీకి ప్రత్యేకంగా ఒక స్థానిక సంస్థను ఏర్పాటు చేసి దానికి కంటోన్మెంట్ తరహాలో పారిశ్రామిక మరియు స్థానిక పాలనాధికారాలు మంజూరు చేస్తానని హామీ ఇచ్చేరు.   ఆ స్థానిక సంస్థ శ్రీ సిటీలో కర్మాగారాల స్థాపనకు అవసరమయిన అన్ని అనుమతులు మంజూరు చేస్తుంది. మునిసిపాలిటీల మాదిరిగానే ఆ సంస్థ పరిశ్రమలకు నుండి పన్నులు వసూలు చేస్తుంది. అలా వసూలయిన పన్నులతో శ్రీ సిటీలో మౌలికవసతుల కల్పన, పారిశుద్యం వంటి పనులన్నీ చక్కబెడుతుంది. ఆ పన్నులలో కొంత భాగం రాష్ట్ర ప్రభుత్వానికి జమా చేయవలసి ఉంటుంది. శ్రీ సిటీ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయబోతున్న ఈ స్థానిక సంస్థకు నియమనిబంధనలు రూపొందించి, దానికి చట్టబద్దత కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఈ ప్రయోగం సఫలమయినట్లయితే మున్ముందు మరిన్ని ప్రాంతాలకు ఈ పధకాన్ని విస్తరింపజేయడం ద్వారా రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి వేగవంతం చేయవచ్చును.

కడప వైసీపీలో ముసలం

వైసీపీ నాయకుడు జగన్ వైఖరి రాష్ట్ర ప్రజలకు చిరాకు తెప్పిస్తోంది. ఇటీవలి కాలంలో మరీ ముదిరిపోయిన ఆయన వ్యవహార శైలి జనానికి చిరాకు తెప్పిస్తోంది. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు, పట్టిసీమ ప్రాజెక్టుల విషయంలో జగన్ అనుసరిస్తున్న విధానాన్ని జనం జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా రాయలసీమ ప్రజలు ఈ ప్రాజెక్టుల విషయంలో జగన్ తీరును తప్పుపడుతున్నారు. రాయలసీమ ప్రజలకు మేలు చేయాలన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు పట్టిసీమ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. అయితే జగన్ మాత్రం ఆ ప్రాజెక్టువల్ల రాయలసీమకు ఎంతమాత్రం ఉపయోగం లేదని వాదించడం మొదలుపెట్టడంతోపాటు ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రిని కలిసి, పట్టిసీమ ప్రాజెక్టు వేస్టు అని చెప్పడం ప్రజలకు ఆగ్రహాన్ని తెప్పించింది. పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టులను వ్యతిరేకించడంతోపాటు ఆ ప్రాజెక్టులను ఇరుగు పొరుగు రాష్ట్రాలు అడ్డుకునేలా ఐడియాలు కూడా ఇస్తున్న జగన్ని ఏమనాలో అర్థంకాక ఆయన వైఖరిని గమనిస్తూ వున్నారు. అయితే జగన్ వ్యవహార శైలి ప్రజలకు ఎంత ఇబ్బందిగా మారిందో, ఆయన పార్టీలోని నాయకులకు కూడా అంతే ఇబ్బందిగా మారింది. జగన్ ఎలాంటి వృధా ఆందోళనలు చేసినా ఆయన వెంట నిలిచిన ఎమ్మెల్యేల్లోనే ఇప్పుడు తిరుగుబాటు వస్తోంది. ముఖ్యంగా పట్టిసీమ విషయంలో రాయలసీమలోని వైసీపీ ఎమ్మెల్యేలు జగన్ వైఖరిని సమర్థించడం లేదు. మొన్నటి వరకూ గుంభనంగా వున్న ఆ నిరసన ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. అది వైసీపీ పాలిట ముసలంగా మారే అవకాశాలను కూడా తీసిపారేయలేం. వైఎస్ జగన్ పట్టిసీమ ప్రాజెక్టును వ్యతిరేకించడాన్ని జీర్ణించుకోలేని వైసీపీ ఎమ్మెల్యే జగన్ వైఖరికి వ్యతిరేకంగా గళం విప్పారు. జగన్ కంచుకోటగా భావించే కడప జిల్లాకి చెందిన ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి (జమ్మలమడుగు) జగన్ వైఖరిని పరోక్షంగా తప్పుపడుతూ, పట్టిసీమ ప్రాజెక్టుకు తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. పట్టిసీమ ప్రాజెక్టు వల్ల రాయలసీమకు మేలు జరుగుతుందని ఘంటాపథంగా చెప్పడంతోపాటు పట్టిసీమ కోసం ప్రత్యేక నిధుల కేటాయించాలని ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  పట్టిసీమపై ప్రత్యేక చట్టం తెచ్చి ప్రాజెక్టును పటిష్టం చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. జగన్‌కి వ్యతిరేకంగా ఆదినారాయణరెడ్డి పట్టిసీమను సమర్థించడం జగన్‌కి పెద్ద షాక్. ఇప్పుడు ఆదినారాయణరెడ్డి ఒక్కరే బయటపడ్డారు. మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా జగన్ వైఖరిని వ్యతిరేకిస్తున్నారని, సమయం, సందర్భం చూసుకుని వారు కూడా జగన్ని వ్యతిరేకిస్తారని తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ జగన్ పార్టీలో ముసలం పుట్టింది... ఇక ముందు ముందు ఏం జరగబోతోందో వేచి చూడాలి.

పీవీ స్మృతి చిహ్నం... కాంగ్రెస్‌కి చెంపదెబ్బ

కాంగ్రెస్ పార్టీ దశాబ్దాలుగా జరిపిన విధ్వంసం నుంచి దేశం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం కనుచూపు మేరలో కనిపించడం లేదు. ఇది దేశం మొత్తానికీ శుభవార్త. అయితే దేశాన్ని కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన కాలంలో కొన్ని ప్రయోజనాలు కూడా జరిగాయి. అయితే ప్రయోజనాలకంటే విధ్వంసాలే ఎక్కువ కావడంతో ఆ ప్రయోజనాలన్నీ మరుగున పడిపోయాయి. పీవీ నరసింహారావు కాంగ్రెస్ నాయకుడిగా, ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఆయన తెచ్చిన ఆర్థిక సంస్కరణలు దేశాన్ని అభివృద్ధి పథం వైపు నడిపించాయి. మచ్చలేని నాయకుడిగా పేరు తెచ్చుకున్న ఆయన దేశ ప్రజలు రుణపడి వున్న ప్రధానమంత్రిగా పేరు తెచ్చుకున్నారు. అయితే ఆ తర్వాత ఆయనను కాంగ్రెస్ పార్టీ సోనియాగాంధీ ఆదేశాల మేరకు ఘోరంగా అవమానించింది. పీవీ దేశాన్ని ఎంత ముందుకు తీసుకెళ్ళారో, సోనియాగాంధీ దేశాన్ని అంతకు వందరెట్లు తిరోగమన బాట పట్టించారు. అలాంటి మహానుభావుడికి దేశ రాజధానిలో స్మృతి చిహ్నం ఏర్పాటు చేయాలన్న ఇంగిత జ్ఞానం కూడా కాంగ్రెస్ పార్టీకి లేకుండా పోయింది. స్మృతి చిహ్నం సంగతి తర్వాత... దేశానికి నాయకత్వం వహించిన ఆయన అంత్యక్రియలు ఢిల్లీలోనే నిర్వహించాలనే బాధ్యతని అప్పుడు మరచిపోయింది. హైదరాబాద్‌లో అత్యంత అవమానకరంగా జరిపిన పీవీ అంత్యక్రియలను దేశ ప్రజలు మరచిపోలేరు. అయితే దేశానికి, కాంగ్రెస్ పార్టీకి ఎంతో సేవ చేసిన పీవీ నరసింహారావును కాంగ్రెస్ పార్టీ విస్మరించినా, దేశం విస్మరించలేదు. ఢిల్లీలో పీవీ నరసింహారావు స్మృతి చిహ్నాన్ని ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీ నిర్ణయించడం అభినందనీయం. పీవీ స్మృతి చిహ్నం ఏర్పాటు చేయాలన్న మోడీ ప్రభుత్వ నిర్ణయాన్ని పీవీ కుమార్తె, ప్రముఖ విద్యావేత్త వాణీదేవి స్వాగతిస్తున్నారు. మోడీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఇంతకాలం పీవీ నరసింహారావును నిర్లక్ష్యం చేసిన కాంగ్రెస్ పార్టీకి చెంపదెబ్బ లాంటిదని ఆమె అభివర్ణిస్తున్నారు. తన తండ్రి మరణించిన సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యవహరించిన తీరు ఇప్పటికీ తమకు బాధను కలిగిస్తూ వుంటుందని, అప్పటి కేంద్రమంత్రులు, రాష్ట్రంలో ముఖ్యమంత్రి పీఠం మీద వున్న వైఎస్ రాజశేఖరరెడ్డి తమకు పీవీ స్మృతి చిహ్నం విషయంలో ఎన్నెన్నో వాగ్దానాలు చేసి వాటన్నిటినీ విస్మరించారని ఆమె గుర్తు చేసుకున్నారు. తమ తండ్రి మరణించిన వెంటనే ఆయన భౌతిక కాయాన్ని ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కి పంపించేంతవరకూ కాంగ్రెస్ నాయకులు తమని హడావిడి పెట్టేశారని ఆమె చెప్పారు. తమ తండ్రికి ఢిల్లీలో స్మృతి చిహ్నం ఏర్పాటు  విషయంలో తమ కుటుంబం మొత్తం ఆశలు వదులుకున్న సమయంలో ప్రధాని నరేంద్రమోడీ తీసుకున్న నిర్ణయం తమకెంతో సంతోషాన్ని కలిగిస్తోందని ఆమె అన్నారు. ఈ సందర్భంగా మోడీ ప్రభుత్వానికి వాణీదేవి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.

తెలంగాణ ప్రజలు వైకాపాను ఆదరిస్తారా?

  జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు ఆయన తల్లి విజయమ్మ, సోదరి షర్మిల ఆంద్ర, తెలంగాణాలలో వైకాపాను కాపాడుకొనేందుకు చేసిన కృషి గురించి అందరికీ తెలుసు. అందుకోసం షర్మిల ఏకబిగిన 3000 కిమీ పాదయాత్ర చేసారు కూడా. కానీ జగన్మోహన్ రెడ్డి అనాలోచిత నిర్ణయం వలన తెలంగాణాలో కోలుకోలేని విధంగా పార్టీ దెబ్బతినడంతో ఆమె కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీరయింది. మడమ తిప్పనని గొప్పగా చెప్పుకొనే జగన్మోహన్ రెడ్డి ఒకసారి తెలంగాణాను విడిచిపెట్టేసి వచ్చేసిన తరువాత మళ్ళీ ఎందుకు వెనక్కి వెళ్లాలని భావిస్తున్నారో తెలియదు కానీ మళ్ళీ తెలంగాణా తన పార్టీని బలపరిచే బాధ్యత సోదరి షర్మిలకే అప్పగించడం విశేషం.   ఆ ప్రయత్నంలో భాగంగా ఆమె పరామర్శ యాత్ర పేరిట తెలంగాణాలో రెండు జిల్లాలలో పర్యటించారు. కానీ మళ్ళీ ఏమయిందో ఏమో గానీ చాలా కాలంగా ఆ ఊసేలేదు. ముందు పార్టీ నిర్మాణం చేసుకొన్న తరువాతనే ఆమె తెలంగాణాలో పర్యటించినట్లయితే పూర్తి ప్రయోజనం ఉంటుందని వైకాపా భావిస్తున్నందు వల్ల కావచ్చు ఆ ప్రయత్నాలు మొదలుపెట్టింది.   వైకాపా పార్టీ రాష్ట్ర కమిటీలో ఏడుగురు కార్యదర్శులు, 8 మంది సంయుక్త కార్యదర్శులు, ఇద్దరు కార్యనిర్వహక సభ్యులను నియమిస్తూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి జాబితాను విడుదల చేసారు. అదే విధంగా పార్టీ ఐటీ వింగ్, గ్రీవెన్స్‌సెల్, పబ్లిసిటీ అండ్ కల్చరల్ వింగ్, ప్రోగ్రాం కో-ఆర్డినేషన్ వింగ్, ట్రేడ్ యూనియన్ వింగ్, యువజన, మైనారిటీ, మహిళా విభాగం వంటి అనుబంధ సంఘాలలోనూ మొత్తం 24 మందిని నియమించారు. తెలంగాణా ప్రజలు వైకాపాను ఆదరిస్తారో తెలియదు కానీ త్వరలో జరుగబోయే జి.హెచ్.యం.సి ఎన్నికలలో దృష్టిలో ఉంచుకుని కమిటీలను విస్తరించినట్లు కనబడుతోంది. ఆ ఎన్నికలలో విజయం సాధించగలిగినట్లయితే తెలంగాణాలో క్రమంగా బలపడవచ్చని వైకాపా భావిస్తున్నట్లుంది.   హైదరాబాద్ జంటనగరాలలో ఆంద్ర ప్రజలు ఎక్కువగా ఉన్నారు గనుక జి.హెచ్.యం.సి ఎన్నికలలో వైకాపా కొన్ని సీట్లు గెలుచుకొనే అవకాశం ఉంది. కానీ ఆ కారణంగా అధికార తెరాసకు, ప్రతిపక్ష పార్టీలయిన తెదేపా, బీజేపీ, కాంగ్రెస్ లకు మంచి పట్టు ఉన్న మిగిలిన జిల్లాలకి వైకాపా విస్తరించగలదని ఆశించడం కష్టం.

బీజేపీ కురువృద్ధుడు అద్వానీ అస్త్ర సన్యాసం చేస్తారా

  నరేంద్ర మోడీకి పార్టీలో కీలక బాధ్యతలు కట్టబెట్టినప్పుడే అలిగి అస్త్ర సన్యాసం చేసిన బీజేపీ కురువృద్ధుడు లాల్ కృష్ణ అద్వానీ ఆ తరువాత మోడీతో కొంచెం సర్దుకుపోయినప్పటికీ క్రమంగా ఆయనని పార్టీలో వెనుక బెంచీలకు పరిమితం చేసేయడంతో దాదాపు కనుమరుగయిపోయారు. మీడియాలో ఆయన గొంతు విని చాలారోజులే అయిపోయింది. మళ్ళీ చాలా రోజుల తరువాత ఆయన బెంగళూరులో జరుగుతున్న పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలకి హాజరయ్యారు. కానీ అక్కడ కూడా ఆయనకు తగిన ప్రాధాన్యత దక్కకపోవడంతో సమావేశాలలో ప్రసంగించేందుకు ఆయన నిరాకరించారు. ఆయనను సమావేశాల ఆరంభానికి సూచికగా జ్యోతీ ప్రజ్వలన కార్యక్రామానికి ఆహ్వానించినప్పటికీ, పార్టీ అధ్యక్షుడు అమిత్ షా, ప్రధాని మోడీ తదితరులు అందరూ ప్రసంగించారు కానీ ఆయనకు అవకాశం ఇవ్వలేదు. సమావేశంలో రెండవరోజు ఆయనను మాట్లాడేందుకు ఆహ్వానించినప్పుడు ఆయన నిరాకరించారు. మోడీ కానీ అమిత్ షా గానీ ఆయనను మాట్లాడమని బలవంతం చేయలేదు. కనుక ఇకపై ఇటువంటి సమావేశాలలో ఇక అద్వానీ పాల్గొనకపోవచ్చునని భావించవచ్చును.

అమరావతికి బ్యాంకులు, వ్యాపార సంస్థలు క్యూ

  ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కోసం రాష్ట్ర ప్రభుత్వం రచిస్తున్న భారీ ప్రణాళికలు చూసి అప్పుడే బ్యాంకులు, పెద్దపెద్ద ప్రభుత్వ సంస్థలు, దేశ విదేశీ వ్యాపార సంస్థలు, పరిశ్రమలు రాజధానిలో తమ కార్యాలయాలను స్థాపించుకొనేందుకు తగిన స్థలం కేటాయించామంటూ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకొంటున్నాయి. వాటిలో నాబార్డ్ (ద నేషనల్ బ్యాంక్ ఆఫ్ అగ్రికల్చర్ యండ్ రూరల్ డెవలప్మెంట్), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో సహా మరో అరడజను బ్యాంకులు ఉన్నాయి.   ఇక రాజధాని అమరావతిలో రూ.600 కోట్ల వ్యయంతో దాదాపు 5లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన భవనంలో టైర్-4 డేటా సెంటర్ ఏర్పాటు చేయబోతున్నారు. ప్రత్యేకంగా దీనికోసమే 60 మెగావాట్స్ విద్యుత్ సబ్ స్టేషన్ కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్న నబార్డ్ ప్రాంతీయ ప్రధాన కార్యాలయాన్ని తాము అమరావతికి తరలించాలనుకొంటున్నామని, అందుకోసం రాజధానిలో తగినంత స్థలం కేటాయించవలసిందిగా తాము చేసిన విజ్ఞప్తికి ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని నబార్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ జీజి మమ్మేన్ తెలిపారు.   అదేవిధంగా ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో 900 శాఖలు, తెలంగాణా రాష్ట్రంలో 433 శాఖలు గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా తమ ప్రధాన కార్యాలయాన్ని అమరావతిలో ఏర్పాటు చేసుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్లుగా బ్యాంక్ (ఏపీ) చీఫ్ జనరల్ మేనేజర్ సి.ఆర్. శశికుమార్ తెలిపారు.   ఇవి కాక చిత్తూరులో శ్రీ సిటీ, నెల్లూరులో కృష్ణ పట్నం వద్ద నెలకొల్పిన లేదా నెలకొల్పబడుతున్న పరిశ్రమలు, రాష్ట్రంలో వివిద ప్రాంతాలలో ఏర్పాటవుతున్న వ్యాపార సంస్థలు, ఐటీ కంపెనీలు కూడా ఇంకా రాజధానికి శంఖుస్థాపన కూడా చేయకముందే తమ ప్రధాన కార్యాలయాలను రాజధాని అమరావతిలోనే ఏర్పాటు చేసుకొనేందుకు తగిన స్థలం కేటాయించవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ఆంద్రప్రదేశ్ రాజధాని గురించి ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని అక్షేపిస్తున్నప్పటికీ, పెద్దపెద్ద సంస్థలు మాత్రం దాని వలన రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి జరగబోతోందని పసిగట్టినందునే త్వరలో నిర్మించబోయే రాజధానిలో తమ కార్యాలయాలు ఏర్పాటు చేసుకోవడానికి తొందరపడుతున్నాయని అర్ధమవుతోంది.

తొమ్మిది నెలలలోనే చంద్రబాబుకి దేశ ప్రజల గుర్తింపు

  ఆమాద్మీ పార్టీ ప్రస్తుతం ఎంత సంక్షోభం ఎదుర్కొంటున్నా ఆ పార్టీ అధినేత మరియు డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ యొక్క పాపులారిటీ గ్రాఫ్ ఏ మాత్రం తగ్గలేదు పైగా ఆయనే ఇప్పుడు దేశంలో ‘మోస్ట్ పాపులర్ ముఖ్యమంత్రి’ గా గుర్తింపు పొందగలిగారు. ప్రసిద్ద ఇంగ్లీషు పత్రిక ఇండియా టుడే మరియు సిసిరో సంస్థలు రెండూ కలిసి దేశంలో బాగా గుర్తింపు పొందిన ముఖ్యమంత్రులను తెలుసుకొనేందుకు ‘మూడ్ ఆఫ్ ద నేషన్’ అనే ఒక సర్వే నిర్వహించాయి. అందులో అరవింద్ కేజ్రీవాల్ దేశవ్యాప్తంగా 16 శాతం (డిల్లీలో 55 శాతం) ఓట్లు సాధించి నెంబర్ వన్ స్థానంలో నిలిచారు. ఆ తరువాత వరుసగా ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ 8 శాతం ఓట్లతో రెండవ స్థానంలో, ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 6శాతం ఓట్లతో మూడవ స్థానంలో నిలిచారు. పశ్చిమ బెంగాల్, ఓడిషా ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, నవీన్ పట్నాయక్ వరుసగా 4,5వ స్థానంలో నిలిచారు.   డిల్లీ ఎన్నికలలో జాతీయపార్టీలయినా కాంగ్రెస్, బీజేపీలను ఎదుర్కొని ఆమాద్మీ పార్టీకి అఖండమయిన విజయం సాధించిపెట్టిన అరవింద్ కేజ్రీవాల్ దేశప్రజల దృష్టిని ఆకర్షించడంలో పెద్ద వింతేమీ లేదు. కానీ పదేళ్ళపాటు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు, మళ్ళీ అధికారం చేప్పట్టిన 9నెలలలోనే దేశ ప్రజలందరి దృష్టిని ఆకర్షించగలగడం విశేషం. రాష్ట్రం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయన అధికారం చెప్పట్టారు. కానీ ఈ తొమ్మిది నెలల కాలంలోనే రాష్ట్రాభివృద్ధి కోసం ఆయన చేస్తున్న విశేష కృషి, తత్ఫలితంగా రాష్ట్రంలో క్రమంగా వస్తున్న మార్పుల కారణంగానే ఆయన దేశ ప్రజల దృష్టిని ఆకర్షించగలిగారని భావించవచ్చును. ఆయన అనుకొన్నట్లుగా రాష్ట్రానికి ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం చేసి, రాష్ట్రంలో ఉన్నత విద్యాసంస్థలు, మెట్రో రైల్ ఏర్పాటు, పారిశ్రామికాభివృద్ధి చేసి చూపినట్లయితే దేశంలో ఆయనే నెంబర్ వన్ స్థానం ఆక్రమించినా ఆశ్చర్యం లేదు.

హైకోర్టు విభజనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అభ్యంతరమా?

  ఆంద్ర, తెలంగాణా రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టుని విభజించేందుకు తెలంగాణా ప్రభుత్వం, కేంద్రప్రభుత్వం, సుప్రీంకోర్టు సంసిద్దత వ్యక్తం చేసాయి. ఉమ్మడి హైకోర్టులో ప్రస్తుతం 49మంది న్యాయమూర్తులు ఉండగా వారిని ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాలకు 60:40 నిష్పత్తిలో పంచేందుకు సుప్రీం కోర్టు అంగీకరించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కళ్యాణ్ జ్యోతి సేన్ గుప్తా వారిలో ఎవరు ఏ రాష్ట్ర హైకోర్టులో పనిచేసేందుకు ఆసక్తి చూపుతున్నారనే వివరాలు కూడా సేకరించారు.   ప్రస్తుతం ఉన్న హైకోర్టు హైదరాబాద్ లో ఉంది కనుక అది తెలంగాణా రాష్ట్రానికే చెందుతుందనే ఉద్దేశ్యంతో రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే కొత్తగా హైకోర్టు ఏర్పాటు చేయాలని పేర్కొనబడింది. కనుక తెలంగాణా రాష్ట్రానికి హైకోర్టు ఏర్పాటు చేయడం అంటే విభజన చట్టాన్ని ఉల్లంఘించడమేనని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. దానితో ఉమ్మడి హైకోర్టుని విడదీసి తెలంగాణా రాష్ట్రానికి కొత్తగా హైకోర్టు ఏర్పాటు చేద్దామనే తెలంగాణా ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది.   ఈ సమస్యను వేరే విధంగా పరిష్కరించాలనే ఉద్దేశ్యంతో, ఇంతకు ముందు తెలంగాణా హైకోర్టు కోసం కేటాయిద్ధామనుకొన్న భవనాన్ని ఆంధ్రా హైకోర్టుకోసం కేటాయించడానికి తెలంగాణా ప్రభుత్వం సంసిద్ధమయింది. కానీ అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చిన్న మెలిక పెట్టింది. హైకోర్టు విభజనకు తమకు ఎటువంటి అభ్యంతరం లేదని కానీ తుళ్ళూరు వద్ద నిర్మించబోయే రాజధాని కోసం తమ ప్రభుత్వం ఇప్పటికే 30వేల ఎకరాల భూసేకరణ చేసి ఉన్నందున అక్కడ హైకోర్టు కోసం భవనం నిర్మించుకొన్నాక నేరుగా అక్కడికే తరలిపోవాలనుకొంటున్నట్లు తెలిపింది. అంటే తెలంగాణా ప్రభుత్వం ఇవ్వదలచుకొన్న భవనంలోకి మారేదిలేదని చెప్పకనే చెప్పినట్లయింది.   కనుక ఉమ్మడి హైకోర్టు నుండి ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టును విడదీస్తే తప్ప తెలంగాణా రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టు ఏర్పడే అవకాశం కనబడటం లేదు. కానీ ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం అందుకు ససేమిరా అంటోంది. తెలంగాణా ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హైకోర్టు ఏర్పాటు చేసుకొనేందుకు హైదరాబాద్ లో వేరే భవనం కేటాయించేందుకు సంసిద్ధంగా ఉంది. ఒకవేళ ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వానికి అది కూడా ఇష్టం లేకపోతే, ప్రస్తుతం ఉన్న భవనంలోనే రెండు రాష్ట్రాలకు వేర్వేరుగా హైకోర్టులు ఏర్పాటు చేసుకొందామని తెలంగాణా రాష్ట్ర అడ్వకేట్ జనరల రామకృష్ణ రెడ్డి ప్రతిపాదించారు. కానీ ఆంధ్రప్రదేశ్ ఆ మూడు ప్రతిపాదనలకు అంగీకరించలేదు.   రాష్ట్రాలు విడిపోయిన తరువాత నేడు కాకపోతే రేపయినా హైకోర్టులు కూడా విడివిడిగా ఏర్పాటుచేసుకోక తప్పదు. అటువంటప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టు విభజనకు ఎందుకు అభ్యంతరం చెపుతోందో తెలియదు గానీ మళ్ళీ ఈ అంశంపై కూడా ఇరు రాష్ట్రాల మధ్య కొత్త తగాదా మొదలయ్యే అవకాశం ఉంది.ఇప్పటికే రెండు రాష్ట్రప్రభుత్వాలు అనేక అంశాలతో కుస్తీపట్లు పడుతున్నాయి. అటువంటప్పుడు మళ్ళీ మరో కొత్త సమస్యని సృష్టించుకోవడం వలన ప్రజల మధ్య, ప్రభుత్వాల మధ్య మరింత దూరం పెరుతుంది.

రాహుల్ గాంధీ అదృశ్యం... ఊహాగానాలు...

  కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కుమారుడు, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు, గిట్టనివాళ్ళు ‘మొద్దబ్బాయి’ అని పిలిచే వ్యక్తి, ఈ దేశానికి ప్రధానమంత్రి అవ్వాలని బోలెడన్ని ఆశలు పెట్టుకుని చివరికి విఫలమైన వ్యక్తి... ఇంకెవరూ.. రాహుల్ గాంధీ. ఈయన గారు ఈమధ్య పార్లమెంట్ సమావేశాలకు కూడా హాజరు కాకుండా ఎక్కడికో వెళ్ళిపోయాడు. మీ అమ్మాయి ఎక్కడికెళ్ళాడని వాళ్ళ అమ్మని అడిగితే ఆమె ఎక్కడికి వెళ్ళాడో చెప్పకుండా ప్రస్తుతం లీవులో వున్నాడని మాత్రమే చెప్పింది. ఆ తర్వాత మొన్నీమధ్య లీవ్ ఎక్స్‌టెండ్ చేశాడని వివరించింది. అయితే ఇంతకీ రాహుల్ గాంధీ ఎక్కడకి వెళ్ళాడో, ఎందుకు వెళ్ళాడో మాత్రం ఎవరూ చెప్పడం లేదు. దాంతో దేశంలో రాహుల్‌గాంధీ అదృశ్యం కావడం మీద అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆ ఊహాగానాల్లో కొన్ని... * రాహుల్ గాంధీ తన గర్ల్ ఫ్రెండ్‌తో కలసి షికార్లు కొట్టడానికి వెళ్ళాడు. * రాహుల్ గాంధీని ఆయన గర్ల్‌ఫ్రెండ్ విడిచిపెట్టి వెళ్ళిపోయింది.. అందుకే ఆమెని వెతకడానికి వెళ్ళాడు. * రాహుల్ గాంధీకి తన గర్ల్‌ఫ్రెండ్‌తో ఎప్పుడో పెళ్ళయిపోయింది. ప్రస్తుతం ఆమె ఏదో దేశంలో పండంటి బిడ్డకి జన్మనిచ్చింది. రాహుల్ గాంధీ ప్రస్తుతం అక్కడే వున్నాడు. * రాహుల్ గాంధీ అలిగి ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. ఎక్కడకి వెళ్ళాడో సోనియా గాంధీకి కూడా తెలియదు. * రాహుల్ గాంధీ తీవ్రమైన అనారోగ్య సమస్యతో బాధపడుతున్నాడు. ఆయనకి ఇటలీలో చికిత్స జరుగుతోంది. * రాహుల్ గాంధీని చంపేస్తామని బెదిరింపులు వచ్చాయి. అందుకే ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. * ప్రధానమంత్రి అవ్వాలనే కల చెదిరిపోయేసరికి రాహుల్ గాంధీకి మతిస్థిమితం తప్పింది. అందుకే ఎటో వెళ్ళిపోయాడు. * రాహుల్ గాంధీకి, సోనియా గాంధీకి గొడవ జరిగింది. అందుకే ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. * రాహుల్ గాంధీ పెళ్ళి చేసుకోకపోతే ఇంట్లో వుండటానికి వీల్లేదని సోనియాగాంధీ బయటకి తరిమేసింది. * రాహుల్ గాంధీ ఇంట్లోనే వున్నాడు. అందరూ చులకనగా చూస్తూ వుండేసరికి బయటకి రావడం లేదు.

సీబీఐకి ఏపీ ప్రజల లేఖ...

సీబీఐ అధికారులకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు రాసుకుంటున్న లేఖ. ఈమధ్యే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ రాష్ట్రాలుగా విడిపోయింది. తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రంగా వెలుగుతూ వుండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పేదరాష్ట్రంగా మిగిలింది. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆపదల నుంచి గట్టెంక్కించగల నాయకుడనే సంపూర్ణ నమ్మకంతో తెలుగుదేశం పార్టీకి మేం అధికారం అప్పగించాం. మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెంక్కించడానికి, రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపడానికి నిర్విరామంగా కృషి చేస్తున్నారు. ఆయన శ్రమను చూస్తుంటే అతి కొద్దికాలంలోనూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలుస్తుందన్న నమ్మకం పెరుగుతోంది. ఇలాంటి శ్రామికుడికి అధికారం అప్పగించినందుకు మమ్మల్ని మేమే అభినందించుకుంటున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మా రాష్ట్రంలోని ఒక వ్యక్తి తీరు మమ్మల్ని ఎంతో బాధిస్తోంది. ఆ బాధతోనే మేం మీకు ఈ లేఖ రాసుకుంటున్నాం. పేరు చెబితే ఏడిచి చస్తాడని మేం ఆ వ్యక్తి పేరు చెప్పడం లేదు. ఆ వ్యక్తి ఎవరో మీకు తెలుసు, అతనికి తెలుసు, దేశం మొత్తానికీ తెలుసు. ఇప్పటికీ ఆ వ్యక్తి ఎవరో కొంతమందికి తెలియకపోతే ఈ లేఖ మొత్తం చదివినతర్వాత వారికి కూడా ఆ వ్యక్తి ఎవరో స్పష్టంగా అర్థమైపోతుంది. రాష్ట్రాభివృద్ధి బాధ్యత ఆ వ్యక్తి భుజాల మీద కూడా వుంది. రాష్ట్రాభివృద్ధికి ముఖ్యమంత్రితో సహకరించాల్సిన కనీస ధర్మం అతనికి వుండాలి. అయితే అతను సహకరించకపోగా సాధ్యమైనంత న్యూసెన్స్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. రైతుల రుణమాఫీకి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుంటే, ఆ అంశం మీద నానా యాగీ చేశాడు. చివరకి ఫెయిలైపోయి నోరు మూసుకున్నాడు. ప్రపంచం అబ్బురపడే రాజధాని నిర్మాణం కోసం ప్రభుత్వం భూ సమీకరణ చేస్తుంటే దానికి ఆ మహానుభావుడు ఎన్ని ఇబ్బందులు క్రియేట్ చేశాడో మాటల్లో చెప్పలేం. రాజధాని గ్రామాల్లో వాతావరణం ప్రశాంతంగా వుంటే కావాలని కొంతమంది రైతులను రెచ్చగొట్టడం, తన విష పుత్రికల్లో ఘోరంగా రాతలు రాయడం. కూతలు కూయడం. తన స్వార్థం కోసం కొంతమంది రైతుల్ని పావుల్లా వాడుకోవడం... ఇదే అతని పని. చివరికి రాజధాని రైతులు అతన్ని దూరంగా పెట్టి రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తున్నారు. రాజధాని విషయంలో ఫెయిల్ అయిపోయిన ఆ వ్యక్తి ఇప్పుడు పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టుల మీద న్యూసెన్స్ చేస్తున్నాడు. ఈ రెండు ప్రాజెక్టుల నిర్మాణం జరగడం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడటం ఆ గ్రహానికి ఎంతమాత్రం ఇష్టం లేనట్టుంది. అందుకే రకరకాల పావులు కదుపుతూ, ఇతర రాష్ట్రాల వారికి లేనిపోని ఐడియాలు ఇస్తూ నాశనం దిశగా అడుగులు వేస్తున్నాడు. ఇలాంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్‌కి చెందినవాడు కావడం మమ్మల్ని సిగ్గుపడేలా చేస్తోంది. ఇక అతను ఇక్కడ వుండటానికి ఎంతమాత్రం అనర్హుడు. అందుకే మీకు ఈ లేఖ రాస్తున్నాం. సాధ్యమైనంత త్వరగా అతన్ని ఓ ఇరవై, పాతికేళ్ళపాటు లోపల వేసే విధంగా చర్యలు తీసుకోండి. ప్లీజ్... అతను బయటే వుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇక బాగుపడినట్టే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాశనం చేయడానికి ఆ ఒక్కడు చాలు. అందుకే నాలుగు కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగుండాలంటే ఆ ఒక్కడు లోపల వుండాలి. అది మీ చేతుల్లోనే వుంది. అంచేత సీబీఐ అధికారులూ... కాస్త ఆయన సంగతి త్వరగా తేల్చండి.. మా తెలుగు ప్రజలందరూ మీకు రుణపడి వుంటారు.