హైదరాబాద్... ఓ 'గులాబీ' వనం

  హైదరాబాద్ మొత్తం గులాబీ రంగులో మునిగిపోయింది. ఇప్పుడు కానీ ఉపగ్రహం ఒక ఫోటో తీస్తే పింక్ కలర్ తప్ప ఏం కనిపించదేమో. హైదరాబాదా లేక గులాబీ వనమా అని అనిపిస్తుంది. త్వరలో టీఆర్ఎస్ పార్టీ తరపున పెద్ద ఎత్తున ప్లీనరీ జరగనుంది. ఈ సమావేశానికి గాను ఆ పార్టీ సభ్యులు పెద్ద పెద్ద హోర్డింగులు, చిన్న చిన్న పోస్టర్లు అన్ని సైజులలో ఎక్కడ పడితే అక్కడ అతికించారు. పార్టీ నాయకులంతా పోటీ పడి మరీ ఎక్కడ చిన్న గోడలు కనిపించినా వదల్లేదు. ఆఖరికి మెట్రో రైలు పిల్లర్లకు కూడా అతికించేశారు. ప్లీనరీ నిర్వహించనున్న లాల్ బహదూర్ స్టేడియం, పబ్లిక్ మీటింగ్  నిర్వహించనున్న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ పోస్టర్లతో నిండిపోయింది. మంత్రులు పద్మారావ్, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ ప్లీనరీ ఏర్పాటు కార్యక్రమాలలో చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. మంత్రి పద్మారావ్ సికింద్రాబాద్ ఏరియా మొత్తం కట్ ఔట్స్ తో నింపేశారు. మరోవైపు తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్లీనరీ కార్యక్రమంలో పాల్గొనాలని టీఆర్ఎస్ నాయకులను, కార్యకర్తలను ఆహ్వానించారు. ప్రతి ఒక్క పోస్టర్లో టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తో పాటు కొడుకు ఐటీ మంత్రి కేటీఆర్, కూతురు ఎంపీ కవిత, మేనల్లుడు నీటిపారుదుల శాఖ మంత్రి హరీష్ రావ్ నలుగురు ఫోటోలు మాత్రం తప్పకుండా ఉండేలా చూసుకున్నారు. మొత్తానికి ఈ ప్లీనరీ పుణ్యమా అని హైదరాబాద్ లో పండుగు వాతావరణం కనిపిస్తోంది. 

స్మగ్లర్ ముదిరి ప్రొడ్యూసరయ్యాడు

తొండ ముదిరితే ఊసరవెల్లి అవుతుంది.. మరి స్మగ్లర్ ముదిరితే... ఏమైనా కావచ్చు.. ఎంత ఎత్తయినా ఎదగవచ్చు. సదరు స్మగ్లర్ గారికి రాజకీయ నాయకుల అండ కూడా వుంటే... ఎక్కడికో ఎదిగిపోవచ్చు... ఈ సూత్రానికి అనుగుణంగానే మస్తాన్ వలి అనే ఎర్రచందనం స్మగ్లర్ ఎక్కడికో ఎదిగిపోయాడు. కోట్లకు కోట్లు సంపాదించాడు.. ప్రొడ్యూసర్ అయి ఓ సినిమా కూడా తీశాడు. చివరికి పోలీసుల చేతిలోపడ్డాడు... మొన్నామధ్యే మూడు నెలలపాటు జైల్లో గడిపి బయటకి వచ్చాడు. ఇప్పుడు మళ్ళీ ఎర్రచందనం స్మగ్లింగ్‌లో  బిజీగా వున్నాడు. కర్నూలు జిల్లా చాగలమర్రి ప్రాంతానికి చెందిన మస్తాన్ వలి మొదట్లో ఆటో నడిపేవాడు. కూరగాయలు అమ్మేవాడు. ఇలా ఎంతకాలం బతకాలని అనుకున్నాడో ఏమోగానీ, ఒక్కసారిగా ఎర్రచందనం స్మగ్లర్ అవతారం ఎత్తాడు. పెట్రోలుకు నిప్పు తోడైనట్టుగా ఈయనకి రాజకీయంగా కూడా అండ దొరికింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైన మస్తాన్ వలి ఇటు రాజకీయంగాను, అటు స్మగ్లర్‌గానూ ఎదిగాడు. ఆటో నడుపుకునే వ్యక్తి అతి కొద్దికాలంలోనే కోట్ల రూపాయలు సంపాదించాడు. కార్లు, బిల్డింగ్స్, విలాసాలు, దర్జాలు... గట్రా.. గట్రా అతని జీవితంలో మామూలు విషయాలైపోయాయి. అప్పుడు అయ్యగారికి సినిమా ఇండస్ట్రీ మీద మోజు పుట్టింది. అంతే ఎంటర్ ద టాలీవుడ్ అన్నాడు. టాలీవుడ్‌లోకి ఎంటరైపోయిన మస్తాన్ వలి తన స్మగ్లర్ ప్రయాణంలో సంపాదించిన డబ్బుతో ‘ప్రేమ ప్రయాణం’ అనే సినిమా మొదలుపెట్టాడు. కొన్నాళ్ళపాటు షూటింగ్స్, ‘మీటింగ్స్’, ఆడియో ఫంక్షన్లు... ఆ ఫంక్షన్లు, ఈ ఫంక్షన్లు అని బాగానే కాలక్షేపం చేశాడు. చేతికి ఎముక లేనట్టుగా డబ్బు ఖర్చు పెడుతున్న మస్తాన్ వలీని చూసి టాలీవుడ్ జీవులు అబ్బ.. మన ఇండస్ట్రీకి మరో ‘మంచి’ ప్రొడ్యూసర్ వచ్చేశాడని మురిసిపోయారు. ఆ తర్వాత సదరు సినిమా విడుదలవటం, బాక్సాఫీసు దగ్గర ఢమాల్ అనడం సహజంగానే జరిగిపోయాయి. దాంతో మస్తాన్ వలీ మళ్ళీ తన సొంత ఊరికి వెళ్ళిపోయి మళ్ళీ స్మగ్లింగ్‌లో బిజీ అయిపోయాడు. ఇవన్నీ కర్నూలు జిల్లా పోలీసులు తెలిపిన విషయాలు.

సింగపూర్ అనుభవం.. ఏపీలో అద్భుతం

సింగపూర్ ప్రభుత్వ సాంకేతిక సహకారంతో ఆంధ్రప్రదేశ్ రాజధాని మాస్టర్ ప్లాన్ రూపుదిద్దుకుంటోంది. ఏపీ ప్రభుత్వానికి ఇప్పటికే తొలిదశ ప్లాన్ అందింది. పూర్తి స్థాయి మాస్టర్ ప్లాన్ జూన్ నాటికల్లా అందే అవకాశం వుంది. పూర్తిస్థాయి మాస్టర్ ప్లాన్ అందిన తర్వాత ఏపీ ప్రభుత్వం ప్రపంచ స్థాయి రాజధాని నగర నిర్మాణం పనులను ప్రారంభిస్తుంది. ఈ నేపథ్యంలో చాలామంది మనసులో వున్న ఒక సందేహానికి సమాధానం ఇవ్వాల్సి వుంది. అది... ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణాన్ని సింగపూర్ ప్రభుత్వమే ఎందుకు చేయాలి? ఆంధ్రప్రదేశ్ రాజధానిని సింగపూర్ ప్రభుత్వానికి చెందిన సెంటర్ ఫర్ లివబుల్ సిటీస్ (సి.ఎల్.సి.) అనే సంస్థ ప్లాన్ చేస్తోంది. ఇప్పుడు ప్రపంచ స్థాయి నగరంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న సింగపూర్ నగరాన్ని ఈ సంస్థ చేసిన ప్లానింగ్ ప్రకారమే అభివృద్ధి చేశారు. ఇప్పుడున్న సింగపూర్ నగరం రూపొందడానికి యాభై సంవత్సరాల సుదీర్ఘ కాలం పట్టింది. ఒక్కో ఇటుకనూ పేర్చుకుంటూ ఇప్పుడున్న అద్భుత నగరాన్ని సీఎల్‌సి సంస్థ రూపొందించింది. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణంలో ఈ సంస్థకున్న సుదీర్ఘ అనుభవాన్ని తనకు అనుకూలంగా మలచుకోవడం కోసమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన రాజధాని నిర్మాణం కోసం సింగపూర్ ప్రభుత్వాన్ని సంప్రదించింది. రాజధాని నిర్మాణం అంటే ఒక బృహత్కార్యం. ఆ కార్యాన్ని సాధించడంలో సిఎల్.సి. సంస్థ తీరే ప్రత్యేకం. నగరాలను ప్లాన్ చేయడంలో ఆ సంస్థ సాధించిన నైపుణ్యం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉపయోగపడబోతోంది. ఏ నగరాన్నయినా ప్లాన్ చేసే సమయంలో ఈ సంస్థ స్వల్పకాలిక, దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుంటుంది. ఇప్పుడు ఏపీ రాజధానిని కూడా ఈ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే రూపకల్పన చేస్తోంది. రాజధానిని మూడు దశల్లో అభివృద్ధి చేసుకునేలా ఈ సంస్థ ప్లాన్ చేస్తోంది. తొలిదశలో జరిగే అభివృద్ధికి కొనసాగింపుగానే రెండో దశ, మూడో దశలో జరిగే అభివృద్ధి వుంటుంది. ఏ దశలో జరిగే అభివృద్ధి అయినా మరో దశకు ఎలాంటి ఆటంకం కలిగించదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏర్పాటు చేసే ప్రాంతంలో వ్యవసాయం చాలా విస్తృతంగా జరుగుతోంది. భవిష్యత్తులో రాజధాని ఎంత అభివృద్ధి చెందినా వ్యవసాయ ప్రయోజనాలు దెబ్బతినకుండా వుండే విధంగానే ఈ సంస్థ తన మాస్టర్ ప్లాన్‌ని రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవల ఈ సంస్థ రాష్ట్రానికి పంపించిన తొలి విడత నమూనా ప్లాన్‌లోనే వ్యవసాయ భూములకు ఈ సంస్థ ఇస్తున్న ప్రాధాన్యం స్పష్టంగా అర్థమైంది. మెతుకు పట్టుకుంటే చాలు అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవడానికి.. సీఎల్‌సి సంస్థ అందించే పూర్తి స్థాయి మాస్టర్ ప్లాన్ ‘ఆకుపచ్చగా’ ఉండబోతోందన్న అంచనాలు ఇప్పటికే ఏర్పడ్డాయి.

ఈ మృగాళ్లు మారరా?

  ఎన్నిచట్టాలొచ్చినా ఆడపిల్లల మీద అఘాయిత్యాలు మాత్రం ఆగటంలేదు. ఎంతో మంది యువతులు ప్రేమోన్మాదుల చేతుల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి ఘటనల గురించి వింటుంటే అసలు ఆడపిల్లలుగా పుట్టడమే తప్పా? అసలు మనం ఎలాంటి సమాజంలో ఉన్నాం, మనుషుల మధ్యనే ఉన్నామా అన్న సందేహం వస్తుంది. కొంతమంది ప్రేమించలేదని చంపేస్తారు, కొంతమంది ప్రేమించి చంపేస్తారు. మొత్తానికి ఆడవాళ్లను మాత్రం చంపకుండా ఉండట్లేదు ఈ ప్రేమోన్మాదులు. వాళ్లలో ఉన్న రాక్షసత్వానికి ఆడపిల్లలు బలైపోతున్నారు. అలా ఓ ప్రేమోన్మాది తనను ప్రేమించట్లేదని చంపడానికి వెళ్లి తనే ఆ అమ్మాయి తండ్రి చేతిలో చనిపోయాడు.     హైదరాబాద్ నగరం కూకట్ పల్లిలో ఓ కన్నతండ్రి ఓ ప్రేమాన్మాదిని కొడవలితో నరికి చంపిన ఘటన శనివారం వెలుగు చూసింది. ఆ ప్రేమోన్మాది యువతిపై కొడవలితో దాడి చేసినప్పుడు ఆమె తండ్రి ఇంట్లో ఉన్నాడు కాబట్టి కూతుర్ని కాపాడుకోవడం కోసం అతనిని చంపాడు. ఒకవేళ ఆ సమయంలో ఆ తండ్రి అక్కడ లేకపోతే పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉండేదో ఊహించుకోవడానికే భయమేస్తోంది. కుటుంబం మొత్తం అతని రాక్షసత్వానికి బలైపోయి ఉండేది.   సమాజంలో చైతన్యం ఎంత పెరిగినా కొంతమంది మృగాళ్ల మనసు మాత్రం మారటంలేదు. నిర్భయ చట్టం, షీ టీమ్ అంటూ ప్రభుత్వాలు ఆడపిల్లలకు ఎన్ని రకాలుగా రక్షణ కల్పించినా అవి ప్రేమోన్మాదుల్లో భయాన్ని మాత్రం కలిగించలేకపోయాయి. అసలు తల్లిదండ్రులు ఆడపిల్లల్ని బయటికి పంపించాలంటేనే భయపడుతున్నారు. ఈ పరిస్థితి మారేదెన్నడో... ఆడపిల్లలకు మంచి రోజులు వచ్చేదెప్పుడో.

ఇప్పుడేమంటారు... మిసెస్ సుహాసినీ మణిరత్నం?

భర్త సక్సెస్‌లో వుండాలని ఏ భార్య అయినా కోరుకుంటుంది. భర్త ఫెయిల్యూర్స్‌లో పడిపోతే  ఏ భార్య అయినా విలవిలలాడిపోతుంది. ఆయన మళ్ళీ విజయాలు సాధించాలని కోరుకుంటుంది. ఈ సైకాలజీకి సినీనటి సుహాసిని కూడా అతీతమేమీ కాదు. తన భర్త మణిరత్నం ఎప్పుడూ సూపర్‌హిట్ సినిమాలు తీయాలని, ఆ సినిమాల రివ్యూలు రాసే మీడియావాళ్ళు అదరహో, బెదరహో అని పొగడాలని కోరుకోవడం న్యాయమే. అయితే పాపం మణిరత్నం ఈమధ్యకాలంలో అలా పొగిడించుకునే సినిమాలు తీయలేదు. మొన్నీమధ్య వరకూ ఈ సినిమా మణిరత్నమే తీశాడా... లేక తన అసిస్టెంట్ డైరెక్టర్‌తో తీయించాడా అనే సందేహం వచ్చే సినిమాలే తీశాడు. ఈమధ్యకాలంలో ఆయన తీసిన సినిమాలు బాక్సాఫీసు దగ్గర బోల్తాపడటమే కాదు... విమర్శకుల నుంచి కూడా అక్షింతలు జల్లించుకున్నాయి. ఇది సుహాసిని మణిరత్నానికి ఎంతమాత్రం నచ్చలేదు. తన భర్త గొప్ప కళాఖండాలు తీస్తున్నప్పటికీ మీడియావాళ్ళు, రివ్యూలు రాసేవాళ్ళు వాటిని కావాలనే చెత్తసినిమాలని రాస్తున్నారని అపోహ పడిపోయారు. మణిరత్నం దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ ‘ఓకే బంగారం’ మీద కూడా అలాగే బ్యాడ్ రివ్యూలు రాసేస్తారని ఆమె భయపడిపోయారు. వెంటనే మీడియా సమావేశం ఏర్పాటు చేసి, తన భర్త సినిమాల రివ్యూలు ‘క్వాలిఫైడ్ క్రిటిక్స్’తోనే చేయించాలని షరతులు విధించారు. అనర్హులు రివ్యూలు చేయడం వల్లే మంచి సినిమాలు అన్యాయమైపోతున్నాయని ఫీలయ్యారు. సుహాసిని మేడమ్ అలా అంటే, మణిరత్నం మాత్రం సుహాసిని ఏదో మాట్లాడబోయి ఏదో మాట్లాడింది... రివ్యూలు ఎవరైనా చేయొచ్చు... రివ్యూలు ఫలానావాళ్ళే రాయాలని చెప్పడం న్యాయం కాదు అంటూ మీడియా దాడి నుంచి తెలివిగా తప్పించుకున్నాడు. మణిరత్నం ‘ఓకే బంగారం’  శుక్రవారం నాడు విడుదలైంది. ఈ సినిమా చాలా బాగుందని రివ్యూలు వచ్చాయి. ఎవరు రివ్యూ రాసినా ‘ఓకే బంగారం’ బాగుందనే రాశారు. తమిళనాడులో మాత్రమే కాదు.... ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఈ సినిమా బాగుందనే రివ్యూలు వచ్చాయి. ఇప్పుడు ఈ సినిమాకి రివ్యూలు రాసినవాళ్ళందరూ గతంలో రివ్యూలు రాసినవాళ్ళే. సుహాసిని మేడమ్ గారు చెప్పారు కదా అని ఎక్కడినుంచో ‘క్వాలిఫైడ్ క్రిటిక్స్’ వచ్చి రివ్యూలు రాయలేదు. గతంలో మణిరత్నం సినిమాలు బాగాలేదని రివ్యూలు రాసినవాళ్ళే ఇప్పుడు ‘ఓకే బంగారం’ సినిమా బాగుందని రివ్యూలు రాశారు. మరి ఇప్పుడు సుహాసిని గారు ఏమని సమాధానం చెబుతారు? రివ్యూలు ఫలానావాళ్ళు రాస్తేనే బాగా రాస్తారనే అపోహలను ఆమె ఇప్పటికైనా వదిలించుకుంటారా? రివ్యూలు రాసేది ఎవరైనా సినిమా ఎలా వుంటే అలాగే రాస్తారు. మణిరత్నం మీదో, సుహాసినిమీదో, మరో సినీ ప్రముఖుడి మీదో కోపమో, ద్వేషమో పెట్టుకుని రివ్యూలు రాయరు. పాపం రివ్యూలు రాసేవాళ్ళమీద సుహాసిని పెట్టుకున్న అపనమ్మకం నిజమే అయితే ‘ఓకే బంగారం’ సినిమా కూడా బాగాలేదని రాసేవాళ్ళే కదా! ఏమంటారు సుహాసిని గారూ? అంచేత సుహాసిని గారూ... మణిరత్నం గారు కావచ్చు... మరే సినిమా మేకర్ అయినా కావచ్చు... మంచి సినిమాలు తీయండి... మంచి రివ్యూలు అందుకోండి.. అంతేతప్ప మీ సినిమాకు మీరు కోరినట్టుగా రివ్యూలు రాయాలని, ఫలానా వాళ్ళే రివ్యూలు రాయాలని కోరుకోవడం అత్యాశ మాత్రమే కాదు.. దురాశ కూడా అవుతుంది. మీడియాతో ఎలా మెలగాలో మీ భర్తగారికి తెలిసిన దాంట్లో మీకు కొద్దిగా కూడా తెలిసినట్టు లేదు... కొంచెం ఆయన్ని అడిగి తెలుసుకోకూడదూ!?

కేజ్రీవాల్... ఇంత దుర్మార్గుడివా...

మొన్నటి ఢిల్లీ ఎన్నికలలో అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ అఖండ విజయం సాధించినప్పటికీ, ఆయన రెండోసారి ముఖ్యమంత్రి పీఠం మీదకి ఎక్కినప్పటికీ ఆయన మీద దేశ రాజకీయ వర్గాల్లో సదభిప్రాయం లేదు. ఢిల్లీ ప్రజలు ఆయన్ని గుడ్డిగా నమ్మేశారనే ఇప్పటికీ చాలామంది భావిస్తున్నారు. మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు మూణ్ణాళ్ళ ముచ్చటగా ఆ పదవిలో వుండి, చేతులారా రాజీనామా చేసి, రాజకీయ సంక్షోభాన్ని సృష్టించాడు. ఆ సమయంలో అందరూ ఇక కేజ్రీవాల్ పని అయిపోయినట్టే అని భావించారు. అయితే ఆశ్చర్యకరంగా ఆమ్ ఆద్మీ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చింది. కేజ్రీవాల్ మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడు. ప్రజల ఆకాంక్షల్ని నెరవేరుస్తామని హామీల మీద హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కేజ్రీవాల్ పార్టీ ఇప్పటి వరకూ ఒరగబెట్టింది శూన్యం. పార్టీలో అంతర్గత విభేదాలు, పగలు, ప్రతీకారాలతోనే కాలం గడిచిపోతోంది. ఆమ్ ఆద్మీ పార్టీ మేధావుల కూటమి అని జనం భావించడం వల్లే జనం అధికారం ఇచ్చారని, కేజ్రీవాల్ ముఖం చూసి ఓట్లు వేయలేదన్న అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వున్నాయి. అయితే ఇప్పుడు ఆ మేధావులు అనుకున్నవారే ఆధిపత్యం కోసం, అధికారం కోసం తిట్టుకుంటూ రోడ్డుమీదకు ఎక్కుతున్నారు. ఢిల్లీ ప్రజలు పశ్చాత్తాపపడేలా చేస్తున్నారు. ఇదంతా ఇలా వుంటే, అరవింద్ కేజ్రీవాల్ దుర్బుద్ధి, దుర్మార్గపు బుద్ధి ఇటీవల బయటపడింది. ప్రముఖ సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేష్ కేజ్రీవాల్ మీద చేసిన ఆరోపణలు దేశ రాజకీయ రంగం మొత్తం నివ్వెరపోయేలా చేశాయి. అసలు అరవింద్ కేజ్రీవాల్ వెలుగులోకి వచ్చింది సమాజసేవకుడు అన్నా హజారే కారణంగానే. అలాంటి అన్నా హజారే చనిపోవాలని కేజ్రీవాల్ కోరుకున్నాడంటే నమ్మగలమా? కానీ నమ్మక తప్పదు.. ఎందుకంటే ఈ ఆరోపణ చేసింది ఏ రాజకీయ ప్రత్యర్థో కాదు... ఏ పార్టీకీ చెందని స్వామి అగ్నివేష్. లోక్‌పాల్ బిల్లుకు అనుకూలంగా అన్నా హజారే నిరాహారదీక్ష చేసిన సమయంలో ఆయన చనిపోతే బావుండని కేజ్రీవాల్ భావించారట. ఆయన నిరాహారదీక్ష చేస్తూ చనిపోతే ఆ సందర్భంగా వచ్చే సానుభూతి పవనాలను తనకు అనుకూలంగా మలచుకుని రాజకీయంగా లబ్ధి పొందాలని భావించారట. అందుకే అన్నాహజారే ఆరోగ్య పరిస్థితి విషమించినప్పటికీ, ఆయన దీక్షను మరో పదిహేను రోజుల పాటు పొడిగించేలా చేయడానికి ప్రయత్నించాడట. హమ్మ కేజ్రీవాలూ.. నువ్వు మరీ ఇంత దుర్మార్గుడివా..?

జగన్‌ ఖేల్ ఖతమయ్యేదే.. జస్ట్ మిస్....

పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టులకు ఎలా ఆటంకం కలిగించాలా ఆన్న ఆలోచనలో ప్రస్తుతం  వైసీపీ అధినేత జగన్ వున్నారు. దానికోసం తన శాయశక్తులా కృషి చేస్తున్నారు. అందులో భాగంగానే ప్రాజెక్టులు నిర్మిస్తున్న ప్రాంతంలోని ప్రజల మనసుల్లో విషం నింపే ప్రయత్నాన్ని మొదలెట్టారు. దానికోసం ప్రాజెక్టుల యాత్రని చేపట్టారు. అయితే మంగళవారం నాడు వైసీపీలో జరగాల్సిన పరిణామాలు చివరి క్షణంలో ఆగిపోయాయి. ఆ పరిణామాలే కనుక జరిగి వుంటే, జగన్ పొలిటికల్ ఖేల్ ఖతమ్ అయిపోయి వుండేది. అప్పుడాయన ప్రాజెక్టుల యాత్రని పక్కన పెట్టి, రాజకీయ పతన యాత్రని  చేయాల్సి వచ్చేది. అసలింతకీ చివరి క్షణంలో ఆగిపోయిన ఆ పరిణామాలేంటి? జగన్ వ్యవహార శైలి ఆ పార్టీలో వున్న ఎమ్మెల్యేలకు మొదట్నుంచీ నచ్చడం లేదు. జగన్ నుంచి దూరంగా పారిపోవాలన్న ఆలోచనలు ఎమ్మెల్యేలలో ఎప్పటి నుంచో వున్నాయి. ఈమధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విషయంలో జగన్ అనుసరిస్తున్న వైఖరి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన చేస్తు్న్న అడ్డగోలు పోరాటం చాలామంది ఎమ్మెల్యేలకు ఎంతమాత్రం నచ్చడం లేదు. పార్టీ ఎమ్మెల్యేలుగా వున్నారు కాబట్టి తప్పనిసరి పరిస్థితిల్లో జగన్‌ వెనుక నిలబడి అరుస్తున్నారు అంతే! ఇటీవలి కాలంలో పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టుల విషయంలో జగన్ తీరు వారికి ఎంతమాత్రం మింగుడు పడటం లేదు. ఒకరిద్దరు ఎమ్మెల్యేలు ప్రాజెక్టుల విషయంలో జగన్ వైఖరిని బాహాటంగానే ఖండించారు. జగన్ వ్యవహారశైలితోపాటు, ఎప్పుడు జైలుకు వెళ్తాడో తెలియని వ్యక్తి నాయకత్వంలో పనిచేయడం చాలామంది ఎమ్మెల్యేలకు ఇబ్బందిగానే వుంది. వైసీపీ నుంచి విముక్తి లభించే ముహూర్తం ఎప్పుడొస్తుందా అని వారంతా ఎదురుచూస్తున్నారు. ఆ దివ్యమైన ముహూర్తం మంగళవారం నాడు రానే వచ్చింది. మంగళవారం నాడు జగన్ ప్రాజెక్టుల వ్యతిరేక యాత్ర కోసం బస్సు ఎక్కి వెళ్ళగానే, వైసీపీకి మంగళం పలుకుదామని 40 మంది ఎమ్మెల్యేలు నిర్ణయించుకున్నారు. జగన్ బస్సు యాత్రకి సన్నాహాలు చేసుకుంటూ వుంటే, ఈ 40 మంది ఎమ్మెల్యేలు పార్టీనుంచి బయటకి వెళ్ళిపోయే సన్నాహాలు ముమ్మరం చేసుకున్నారు. జగన్ అలా బస్సు ఎక్కగానే ఇలా పార్టీని చీల్చేసే ఏర్పాట్లు చేసుకున్నారు. వైసీపీకి ఉన్న మెజారిటీలో సగానికి పైగా వున్న ఈ 40 మంది జగన్‌కి జలక్‌ ఇచ్చారంటే అది జగన్‌కి రాజకీయంగా పెద్ద షాక్. ఆయన పెట్టిన పార్టీ ఆయన చేతుల్లోంచి జారిపోయే అవకాశాలు కూడా వున్నాయి. తమ పార్టీ ఎమ్మెల్యేలు 40 మంది తనకు షాక్ ఇవ్వబోతున్నారన్న విషయం ఎలా తెలిసిందోగానీ జగన్‌కి తెలిసింది. దాంతో ఆందోళనకు గురైన ఆయన ఆ ఎమ్మెల్యేలతో టచ్‌‌లోకి వచ్చే ప్రయత్నం చేశాడు. అయితే వాళ్ళు తమకు జగన్ని కలిసే ఉద్దేశం లేదని, పార్టీని చీల్చడం ఖాయమని సంకేతాలు ఇచ్చారు. దాంతో జగన్ ఆపద్బంధువు వైవీ సుబ్బారెడ్డి రంగంలోకి దిగి 40 మంది ఎమ్మెల్యేల కాళ్ళూ గడ్డాలూ పట్టుకుని జగన్‌కి వారికి భేటీని ఏర్పాటు చేశారు. ఆ భేటీలో జగన్ వాళ్ళని ప్రాధేయపడిన తీరు చూస్తే శత్రువులకు కూడా కన్నీరు వచ్చేదట. ఆ స్థాయిలో బతిమాలడంతో ఆ 40 మంది ఎమ్మెల్యేలు శాంతించి తమ నిర్ణయాన్ని ప్రస్తుతానికి వాయిదా వేసుకుంటున్నామని చెప్పారట. మీరు తలపెట్టిన ప్రాజెక్టుల యాత్ర పూర్తి చేసుకుని రండి... మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందాం అన్నారట. అప్పటికీ జగన్‌కి భయం తగ్గలేదు. తాను అలా బస్సు ఎక్కి వెళ్ళగానే, ఇక్కడ వీళ్ళు ఇలా ప్లేటు ఫిరాయిస్తే ఎలా అనే సందేహం ఆయన్ని పీడించింది. దాంతో ఆ 40 మంది ఎమ్మెల్యేలు కూడా తనతోపాటు ప్రాజెక్టుల యాత్రకి రావాల్సిందేనని బతిమాలి ఒప్పించాడట. ఇలా జగన్‌కి ప్రస్తుతానికి ఒక గండం గడిచింది. వైసీపీలో బద్దలు కాబోయే అగ్ని పర్వతం ప్రస్తుతానికి శాంతించింది. ఆ అగ్నిపర్వతం ఎప్పటికైనా బద్దలయ్యేదే!

తెరాస ప్రభుత్వంపై వైకాపా విమర్శలు!!!

  రాష్ట్ర విభజన తరువాత నుండి నేటి వరకు ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాల మధ్య ప్రభుత్వాల మధ్య అనేక సమస్యలు, గొడవలు తలెత్తాయి. కానీ ఏనాడు కూడా వైకాపా ఏ అంశం మీద గట్టిగా స్పందించిన దాఖలాలు లేవు. పైగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెరాస అనధికార ప్రతినిధిగా వ్యవహరిస్తోంది. ఆంద్రప్రదేశ్ ప్రభుత్వంపై నిత్యం విమర్శలు గుప్పిస్తూ ఏదో ఒక అంశం తీసుకొని ధర్నాలు, బస్సు యాత్రలు చేసే వైకాపా ఏనాడు కూడా ఆంద్రప్రదేశ్ ప్రయోజనాల కోసం తెలంగాణా ప్రభుత్వాన్ని నిలదీయలేదు. అందుకు కారణం ఆ రెండు పార్టీల మధ్య ఎవరికీ అర్ధం కాని అనిర్వచనీయమయిన అనుబంధమే. బహుశః ఆ రెండు పార్టీల ఉమ్మడి శత్రువు తెదేపా దాని అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కారణంగానే తూర్పు పడమర వంటి ఆ రెండు పార్టీలు దగ్గరయ్యాయో లేక ఇంకేమయినా బలమయిన కారణాలున్నాయో వారే చెప్పాలి.   అయితే ఇంతవరకు ఆ రెండు పార్టీలు ఒకదానినొకటి విమర్శించుకోకుండా చాలా జాగ్రత్తగా రైలు పట్టాల మాదిరిగా సమాన దూరం పాటిస్తు పయనిస్తున్నాయి. కానీ ఇప్పుడు వైకాపా తిరిగి తెలంగాణా రాష్ట్రంలో పునః ప్రవేశం చేయాలనుకోవడంతో అధికార తెరాసపై బాణాలు ఎక్కుపెట్టక తప్పడం లేదు. నిన్న ఇల్లెందులో జరిగిన వైకాపా కార్యకర్తల సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలంగాణా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసారు.   తెరాస పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలను, రైతులను మోసం చేస్తోందని విమర్శించారు. ప్రజా వ్యతిరేక విధానాలు అమలుచేస్తున్న తెలంగాణా ప్రభుత్వాన్ని నిలదీసేందుకు త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలతో కలిసి ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.   అయితే ఆయన చేస్తున్న ఈ విమర్శలు తెలంగాణాలో మళ్ళీ పార్టీ ఉనికిని చాటుకొనేందుకా లేక త్వరలో జరుగబోయే జి.హెచ్.యం.సి. ఎన్నికలలో హైదరాబాద్ జంట నగరాలలో స్థిరపడిన ఆంధ్రా ప్రజలను బుట్టలో వేసుకోవడానికా అనేది ఎన్నికల తరువాత గానీ తెలియదు.   పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ అధికార దాహంతోనే కొంతమంది నేతలు పార్టీని వీడిపోయారని ఆరోపించారు. కానీ కొండా సురేఖ వంటి అనేకమంది తెలంగాణా నేతలు స్వర్గీయ రాజశేఖర్ రెడ్డిపై అభిమానంతోనే ఆయన మరణించిన తరువాత తమ పదవులు, అధికారం అన్నీ వదులుకొని వైకాపాలో చేరారు. రాష్ట్ర విభజన కోసం తెలంగాణాలో చాలా ఉదృతంగా ఉద్యమాలు జరుగుతున్న సమయంలో కూడా వారు వైకాపానే అంటిపెట్టుకొని ఉన్నారు తప్ప పార్టీ మారాలనుకోలేదు. కానీ ‘మడమ తిప్పను మాట తప్పను’ అని నిత్యం గొప్పలు చెప్పుకొనే జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర విభజన జరుగబోతోందనే విషయం పసిగట్టి తననే నమ్ముకొని వచ్చిన వారినందరినీ నడిరోడ్డు మీద వదిలేసి రాత్రికి తెలంగాణానుండి జంప్ అయిపోయారు. తీవ్ర వ్యతిరేక పరిస్థితులలో తెలంగాణాలో వైకాపాను బలోపేతం చేసిన కొండా సురేఖ వంటి అత్యంత విశ్వసనీయులకే హ్యాండిచ్చిన జగన్మోహన్ రెడ్డి రేపు పొంగులేటి వంటి మిగిలిన నేతలకి హ్యాండివ్వకుండా ఉంటారా? అని ఎవరికయినా సందేహం కలుగకమానదు.   ఈరోజు పొంగులేటి వంటి నేతలు తెలంగాణాలో వైకాపాను బలోపేతం చేసుకొనేందుకు తెరాస ప్రభుత్వాన్ని విమర్శించవచ్చును. కానీ రేపు జి.హెచ్.యం.సి. ఎన్నికలు ముగిసిన తరువాత మళ్ళీ అదే తెరాసతో అంటుకడదామని జగన్మోహన్ రెడ్డి ఆదేశిస్తే అప్పుడు వారి పరిస్థితి ఏమిటి?అని వారే ఆలోచించుకోవలసి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

జగన్ - లోకేశ్ యాత్రల ఆంతర్యం ఏమిటి?

ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయ వర్గాలు నారా లోకేశ్ చేస్తున్న పరామర్శ యాత్ర, జగన్ చేపట్టిన ప్రాజెక్టుల యాత్రల పై ఆసక్తిగా చూస్తున్నాయి. ఇద్దరూ ఒకేసారి  యాత్రలు చేపట్టడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటా అని ఆలోచిస్తున్నాయి.   చంద్రబాబు బాటలోనే నారా లోకేష్ కూడా పయనిస్తున్నారు. ఎలాగైతే చంద్రబాబునాయుడు కార్యకర్తల మనిషిగా పనిచేసి ఇంతటి స్థాయికి ఎదిగారో అలాగే నారా లోకేశ్ కూడా కార్యకర్తల మనిషిగా ఉండి ఎదగాలనుకుంటున్న విషయం అర్ధమవుతోంది. అటు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లో ఓవరాక్షన్ చేయడంతో అతను పార్టీకి దూరమయ్యాడు. బాలకృష్ణ కూడా తన సినిమాలు, ఎమ్మెల్యే పదవితో బిజీగా ఉన్నారు. అందువల్ల బయటి ప్రచారాలలో ఎక్కువగా కనిపించని లోకేశ్ ఈ సమయంలో కార్యకర్తలు, పార్టీ నేతలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ బలంతోనే తను 2019న జరగబోయే ఎన్నికలలో అధ్యక్ష పదవి చేపట్టాలనే చూస్తున్నారని అంటున్నారు. తను దీనిలో భాగంగానే ఆయన కడపజిల్లాలో పర్యటించారు. తెదేపా నాయకులు, కార్యకర్తలు నారా లోకేశ్ కు ఘన స్వాగతం అందించి, ప్రజల మనిషి అయిన చంద్రబాబులాగానే నారా లోకేశ్ కూడా కార్యకర్తలతో కలిసి పోతున్నందుకు చాలా సంతోషం వ్యక్త పరిచారు. తండ్రిలా చురుకైన మాటలు మాట్లాడుతూ, అప్పుడప్పుడు జగన్ పై చురకలు వేస్తుంటే కార్యకర్తలు ఉత్సాహంతో ఉరకలు వేశారు.   మరోవైపు ప్రజలలో తన ఉనికి తగ్గిపోతోందని జగన్ భయపడుతున్నాడో ఏమో ప్రాజెక్టుల యాత్ర పేరిట యాత్ర ప్రారంభించాడు. అప్పుడు రాజధాని భూముల మీద పేచీ పెట్టి, నానా రభన చేసి చంద్రబాబు ప్రభుత్వానికి జోరీగ లాగా తయారయిన జగన్ ఏం చేయలేకపోయాడు. ఇప్పుడు కొత్తగా పట్టిసీమ ప్రాజెక్టు, పోలవరం ప్రాజెక్టులంటూ వాటి మీద పడ్డాడు. పట్టిసీమ ప్రాజెక్టు మీద ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. పట్టిసీమ వద్దంటే ఒకవైపు రాయలసీమ ప్రజల నుండి వ్యతిరేకత, ప్రాజెక్టు కాంట్రాక్టర్ నుండి వ్యతిరేకత ఇలా కక్కలేక మింగలేక అనే పరిస్థితిలో ఉన్నాడు. ఆ ఉద్దేశ్యంతోనే ఏదో ఒక రకంగా జనాలను రెచ్చగొట్టి వారిలో తన ఉనికిని చాటుకోవడానికి చూస్తున్నాడన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.   అయితే నారా లోకేశ్, జగన్ చేసే యాత్రలు రాజకీయ మైలేజ్ పెంచుకోవడానికే అని అందరికీ తెలుసు. రాజకీయం పరంగా ఎదగాలనుకునే వారు ప్రజలలోకి వెళ్లడం తప్పనిసరి. నారా లోకేశ్ రాజకీయ పరంగా ఎదగడానికి, ప్రజలలో మన్నన పొందడానికి చేస్తుంటే, జగన్ మాత్రం ప్రజలను రెచ్చగొట్టడానికే యాత్ర చేపట్టాడని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. జగన్ యాత్ర చేయడం తప్పుకాదు కానీ.. ఇది సరైన సమయం కాదు. ఏదో వాళ్లు యాత్ర మొదలుపెట్టారు కదా అని నేను కూడా యాత్ర చేస్తా అన్నట్లు ఉంది జగన్ వ్యవహారం.

కోర్టు దృష్టిలో ఆయన దోషి కానీ ప్రజల దృష్టిలో...

  జీవితంలో అందరూ తెలిసో తెలియకో కొన్ని తప్పులు చేస్తుంటారు. కానీ వారిలో రామలింగ రాజులా పశ్చాతాపం చెంది, తన తప్పులను నిర్భయంగా ఒప్పుకొనేవారు ఎక్కడో గాని కనబడరు. ఆర్ధిక నేరాలకు పాల్పడినందుకు రామలింగ రాజును కోర్టు దోషిగా నిర్ధారించి ఏడేళ్ళ జైలు శిక్ష, రూ.5 కోట్ల జరిమానా కూడా విధించి ఉండవచ్చును. కానీ ఆయన, ఆయన కుటుంబ సభ్యులు చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు దేశంలో అత్యంత నీతివంతుడయిన రాజకీయ నాయకుడు కూడా చేయలేడని ఖచ్చితంగా చెప్పవచ్చును.   రామలింగ రాజు గత ఏడాది బెయిలుపై జైలు నుండి విడుదలయయి బయటకు వచ్చినప్పుడు, ఈ కేసుల నుండి ఏవిధంగా తప్పించుకొందామాని ఆలోచించలేదు. గతంలో తను ప్రవేశ పెట్టిన 108 ఉచిత అంబులెన్స్ సేవలను ఏవిధంగా మరింత విస్తరించాలా అని ఆలోచించారు. ఆ ఆలోచనలో నుండి పుట్టినదే ‘కాల్ హెల్త్’ సేవలు. ఆయన ఆలోచనలను ఆచరణలో పెట్టిన ఆయన ఇరువురు కుమారులు రామరాజు, తేజ రాజు ‘కాల్ హెల్త్ సర్వీసస్ ప్రైవేట్ లిమిటెడ్’ అనే ఉచిత విద్యసేవా సంస్థను స్థాపించారు.   హైదరాబాద్, జీడిమెట్ల వద్ద గల తమ బైర్రాజు ఫౌండేషన్ ప్రధాన కార్యాలయంగా పనిచేసే ఈ సంస్థ ద్వారా జంట నగరాలలో మారుమూల ప్రాంతాలలో నివసించే ప్రజలకు కూడా ద్విచక్ర త్రిచక్ర వాహనాల ద్వారా అత్యవసర వైద్య సేవలు అందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలో ఈ సంస్థకు మరో రెండు కార్యాలయాలు ఒకటి ఫిలిం నగర్ వద్ద మరొకటి జూబిలీ హిల్స్ వద్ద ఏర్పాటు చేయబోతున్నారు. ఈ సంస్థలో ఇప్పటికే సుమారు 100 మంది ఉద్యోగులు పనిచేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సంస్థ ఏర్పాటుకి, నిర్వహణకు సుమారు నెలకు ఒకటిన్నర కోట్లు వరకు రాజు సోదరులు తమ స్వంత నిధుల నుండి ఖర్చు చేస్తున్నారు. మరొకటి రెండు నెలలలో ఈ సంస్థ మొదటగా జంట నగరాలలో తన సేవా కార్యక్రమాలు ప్రారంభించబోతోంది. రామలింగ రాజుకి కోర్టు దోషిగా నిర్ధారించి జైలుకి పంపినా ఈ సేవా కార్యక్రమాలు ఆపబోమని ఆయన సన్నిహితులు చెపుతున్నారు.

ఎంత మాటన్నారు స్వామిగౌడ్ సార్...

ఉద్యమాలు చేసే సమయంలో ఎలాంటి మాట మాట్లాడినా చెల్లుతుంది. ఎంత ఘోరంగా మాట్లాడినా చెలామణి అయిపోతుంది. ఎవర్ని నోటికొచ్చినట్టు తిట్టినా నడుస్తుంది. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత, పదవులు అనుభవిస్తూ నోరు అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం వుంది. ఈ సూత్రం ఎవరికైనా వర్తిస్తుంది. తెలంగాణ రాష్ట్ర శాసనమండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌కి కూడా వర్తిస్తుంది. తెలంగాణ ఉద్యమం జరిగిన సమయంలో స్వామిగౌడ్ మాట్లాడిన ఘాటు మాటలు విని అందరూ తరించారు. ఆంధ్రప్రాంత ప్రజల్ని, నాయకులని మాగ్జిమమ్ ఏ స్థాయిలో తిట్టచ్చో ఆ స్థాయిలో ఆయన తిట్టేశారు. ఆ స్థాయిలో తిట్టడం వల్లే ఆయన సేవలను గుర్తించిన కేసీఆర్ ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చారు. శానసమండలి ఛైర్మన్‌ స్థానం మీద కూడా కూర్చోబెట్టారు. అత్యంత గౌరవనీయమైన స్థానంలో కూర్చున్న ఆయన తన ఫ్లాష్‌బాక్‌ మరచిపోకుండా పాత స్థాయిలోనే మాట్లాడ్డం బాధాకరం. ఇటీవల జరిగిన ఒక కార్యక్రమానికి స్వామిగౌడ్‌ని పెద్దమనిషి హోదాలో పిలిచారు. అక్కడ ఆయన చేయాల్సిన పని నాలుగు మంచి మాటలు మాట్లాడ్డం. కానీ ఆయన మాట్లాడిన మాటలు మంచి మాటలు కాదు... దారుణమైన మాటలు. ‘‘హిందువులు నలుగురేసి పిల్లల్ని కనడం ద్వారా ముస్లింలను డామినేట్ చేసేయాలి’’ అని అన్నారు. ఏమైనా అంటే, ఫీలవుతారుగానీ, విధానమండలి స్పీకర్ హోదాలో వున్న వ్యక్తి మాట్లాడాల్సిన మాటలా ఇవి? ఇలా మాట్లాడిన ఆయన తన తప్పు తెలుసుకుని, వెంటనే నాలుక కరుచుకుని తన తప్పును సరిదిద్దుకుంటే సరిపోయేది. కానీ, ఆయన ఆ పని చేయలేదు. ఈ వ్యాఖ్యల మీద టీఆర్ఎస్ మినహా అన్ని రాజకీయ పార్టీల నాయకులు, సమాజంలో బాధ్యత వున్నవారు విమర్శించేసరికి రెండ్రోజుల తర్వాత దార్లోకి వచ్చారు. తాను అన్న మాటల వెనుక అసలు ఉద్దేశం వేరని, కన్నబిడ్డలున్నా తల్లిదండ్రులు వృద్ధాశ్రమాలలో ఉండటం చూసి తన హృదయం చలించిపోయి... గుండె కరిగిపోయి... బాధతో ఆ మాటలు అన్నానని సెలవిచ్చారు. మీరు ఏ ఉద్దేశంలో ఆ మాటలు అన్నా, మీ అసలు ఉద్దేశం ఏమిటో జనానికి అర్థమైపోయింది గౌరవనీయులైన స్వామిగౌడ్ గారూ.

జగన్ బస్సు యాత్ర తుస్సుమంటుందా?

మొన్నటి వరకూ రాజధాని భూముల విషయంలో రచ్చ చేయడానికి ప్రయత్నించి విఫలమైన వైసీపీ నాయకుడు జగన్ ఇప్పుడు ప్రాజెక్టుల విషయంలో రచ్చ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు, భవిష్యత్ తరాలు ప్రపంచం ముందు గర్వంగా తలెత్తుకునే విధంగా రాజధానిని నిర్మించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తుంటే, ఆ ప్రయత్నాలకు అడ్డు పడటానికి జగన్ శాయశక్తులా కృషి చేశారు. దొనకొండలో రాజధాని పెట్టలేదన్న బాధ ఒకవైపు, చంద్రబాబుకు మంచి పేరు వచ్చేస్తోందన్న కడుపు మంట మరొకవైపు జగన్ సారుని రాజధాని భూముల విషయంలో రచ్చ చేయడానికి ప్రేరేపించాయి. అయితే స్థానిక రైతులు జగన్ అండ్ బ్యాచ్‌ని రచ్చ చేయనిచ్చీ చేయనిచ్చీ చివరికి చాల్చాల్లే వెళ్ళవయ్యో అనేశారు. దాంతో జగన్ బృందం తోకముడిచేసింది. ఇప్పుడేం రచ్చ చేయాలా అన్న ఆలోచనలో జగన్ సార్‌కి పోలవరం ప్రాజెక్టు, పట్టిసీమ ప్రాజెక్టు దొరికాయి. పోలవరం ప్రాజెక్టుగానీ, పట్టిసీమ ప్రాజెక్టుగానీ పూర్తి కావడం, రైతులు బాగుపడటం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నీటి సమస్య లేకుండా వుండటం జగన్‌ గారికి ఇష్టం ఉన్నట్టు కనిపించడం లేదు. అందుకేనేమో పనిగట్టుకుని మరీ ప్రధాని దగ్గరకి వెళ్ళి ఈ ప్రాజెక్టుల గురించి చెప్పాల్సిన చెడు అంతా చెప్పారు. ఇతర రాష్ట్రాలు ఎలా ఈ ప్రాజెక్టులకు అడ్డు తగలచ్చో ఉప్పు ఇచ్చే విధంగా కూడా స్టేట్‌మెంట్లు ఇచ్చారు. ఇప్పుడు ఆయా ప్రాజెక్టులు నిర్మించే ప్రాంతాలకు బస్సు యాత్రని చేపట్టి, అక్కడి రైతులను రెచ్చగొట్టే కార్యక్రమం చేపట్టారు. పట్టిసీమ ప్రాజెక్టు వల్ల రాయలసీమకి ఒరిగేదేమీ లేదంటూ మొన్నటి వరకూ పాడిన జగన్, ఆ పాటకు తన పార్టీకి చెందిన రాయలసీమ ఎమ్మెల్యేల నుంచే వ్యతిరేకత రావడంతో ఇప్పుడు కొత్త పాట అందుకున్నారు. పట్టిసీమ ప్రాజెక్టు వల్ల ఉభయ గోదావరి జిల్లాలు నష్టపోతాయట. ఉభయ గోదావరి జిల్లాల రైతులేమో సముద్రంలోకి పోయే నీటిని తరలిస్తే మాకేం ప్రాబ్లం అని స్పష్టంగా చెబుతున్నారు. అయినప్పటికీ వారిని రెచ్చగొట్టే ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు జగన్ మహాశయుడు బస్సు యాత్ర చేపట్టారు. అయితే జగన్ చేపట్టిన ఈ బస్సు యాత్ర తుస్సుమనే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో పట్టిసీమ ప్రాజెక్టు మీద ఎంతమాత్రం వ్యతిరేకత లేదు. ఎవరో తన పార్టీకి చెందిన వారిని నలుగుర్ని వెంటేసుకుని వెళ్ళి అక్కడ హడావిడి చేసినంత మాత్రాన ఒరిగేదేమీ వుండదని అభిప్రాయపడుతున్నారు. అసలు ఎవరికీ సమస్య లేని అంశం మీద బస్సు యాత్ర చేపట్టిన జగన్ తాను అనుకున్న ప్రయోజనాన్ని పొందే అవకాశాలు ఎంతమాత్రం కనిపించడం లేదని వారు అంటున్నారు. రాజధాని భూముల విషయంలో జగన్‌కి ఎలాంటి పరాభవం జరిగిందో, అలాంటి పరిస్థితే పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో జగన్‌కి ఎదురయ్యే అవకాశం వుండొచ్చని భావిస్తున్నారు.  తన మీటింగ్‌కి వచ్చే తన సొంత పార్టీ వారికే ప్రసంగాలు వినిపించి జగన్ వెనుదిరగాల్సి రావచ్చని భావిస్తున్నారు.

కేసీఆర్ వారసుడు ఎవరు? కె.టీ.ఆర్. లేక హరీష్ రావు?

  ఈనెల 24వ తేదీన హైదరాబాద్, లాల్ బహద్దూర్ స్టేడియంలో తెరాస ప్లీనరీ సమావేశాలు చాలా అట్టహాసంగా నిర్వహించేందుకు చురుకుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. తెరాస అధికారంలోకి మొట్ట మొదటిసారి జరుగుతున్న ప్లీనరీ సమావేశాలు కనుక రాష్ట్రం నలుమూలల నుండి భారీ ఎత్తున పార్టీ కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులు తరలి వచ్చే అవకాశం ఉంది. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్ష పదవికి జరుగబోయే ఎన్నికలలో మళ్ళీ కేసీఆర్ ఏకగ్రీవంగా ఎన్నిక కావడం లాంచనప్రాయమే.   కానీ ఈసారి జరుగబోయే ప్లీనరీ సమావేశాలలో కేసీఆర్ కుమారుడు కె.తారక రామారావుని పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అధికారిక కార్యక్రమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడం కోసం తగినంత సమయం కేటాయించలేకపోతున్నందున, ఆ బాధ్యతలు తన కుమారుడికి అప్పగించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ ఈ సమావేశాలలో కేసీఆర్ తన కుమారుడు కె.తారకరామారావునే పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రకటించినట్లయితే, అతనే తన వారసుడని ప్రకటించినట్లే భావించవచ్చును. కానీ అదే జరిగితే ఆయన తన మేనల్లుడు హరీష్ రావు కంటే కుమారుడికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లువుతుంది.   నీటి పారుదల శాఖా మంత్రిగా వ్యవహరిస్తున్న హరీష్ రావు తెరాస ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చెప్పట్టిన మిషన్ కాకతీయ ప్రాజెక్టును చాలా సమర్ధంగా నిర్వహిస్తూ మంచి పేరు సంపాదించుకొన్నారు. హరీష్ రావుకి అత్యంత సన్నిహితుడయిన డా. రాజయ్యను చాలా అవమానకరంగా మంత్రిపదవిలో నుండి తప్పించినందుకు ఆయన ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈ ప్లీనరీ సమావేశాలలో ముఖ్యమంత్రి కేసీఆర్ తన కుమారుడు తారక రామారావుకె పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించినట్లయితే హరీష్ రావుకి ఇక పార్టీలో, ప్రభుత్వంలో కూడా ఎప్పటికీ మూడవ స్థానానికే పరిమితం కావలసి ఉంటుంది. మరి దీనిని ఆయన జీర్ణించుకోగలరో లేదో?

ఇంటర్నెట్ వినియోగంపై ప్రభుత్వ పెత్తనం అక్కర్లేదు

  ప్రపంచదేశాలలోకెల్లా భారతదేశంలోనే అత్యంత వేగంగా మొబైల్, ఇంటర్నెట్ వాడకం పెరుగుతోందణి గణాంకాలు చెపుతున్నాయి. అందుకే ఇప్పుడు మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, ఇంటర్నెట్ సేవలు అందించే అనేక పెద్దపెద్ద కంపెనీలు భారతదేశానికి క్యూ కడుతున్నాయి. అందుకే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని మొబైల్, ఐటి కంపెనీల స్థాపనకు ప్రోత్సాహకాలు ప్రకటిస్తున్నాయి. ఆంద్ర, తెలంగాణా, మహారాష్ట్ర వంటి కొన్ని రాష్ట్రాలలో డిల్లీ, చెన్నై, ముంబై, కోల్ కతా, హైదరాబాద్ వంటి అనేక ప్రధాన నగరాలలో బహిరంగ ప్రదేశాలలో ప్రభుత్వాలు ఉచిత వైఫీ సౌకర్యం కల్పిస్తున్నాయి.   దేశంలో ప్రజలందరికీ ఇంటర్నెట్ సేవలు మరింత ఎక్కువగా, వేగంగా అందుబాటులోకి తీసుకురావాలంటే దానిపై ప్రభుత్వ నియంత్రణ పూర్తిగా తగ్గించడం లేదా పూర్తిగా వదులుకోవడమే సరయిన మార్గమని మోడీ ప్రభుత్వం గట్టిగా విశ్వసిస్తోంది. అందుకోసం డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలీ కమ్యూనికేషన్స్ శాఖకు చెందిన నిపుణులతో కూడిన ఒక కమిటీని కూడా ఇటీవల నియమించింది. ఆ కమిటీ ఇందుకు అవసరమయిన సలహాలు, సూచనలు, మార్గదర్శకాలతో కూడిన ఒక నివేదికను ప్రభుత్వానికి వచ్చేనెల రెండవ వారంలోగా ఒక నివేదికను సమర్పిస్తుంది. ఆ నివేదిక ఆధారంగా కేంద్ర ప్రభుత్వం అందుకు తగిన చట్టం రూపొందిస్తుందణి కేంద్ర ఐ.టి. శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ తెలియజేసారు.   ఇంటర్నెట్ వ్యవస్థపై ప్రభుత్వం అజమాయిషీ వదులుకోవాలనుకోవడం సంబంధిత సంస్థలు, ప్రజలు కూడా హర్షించవచ్చును. కానీ దానిపై ఎంతో కొంత ప్రభుత్వ నియంత్రణ లేకపోయినట్లయితే, దాని వలన చాలా అనర్ధాలు జరిగే ప్రమాదం ఉంది. ఇంటర్నెట్ వ్యవస్థపై ప్రభుత్వ నియంత్రణ ఉన్నప్పుడే అనేక అత్యంత ప్రమాదకర, హానికర సమాచారం సరఫరా అవుతోంది. దానివలన దేశంలో ఎన్నడూ ఊహించలేని అనర్ధాలు ఎన్ని జరుగుతున్నాయో అందరూ కళ్ళారా చూస్తూనే ఉన్నారు. అటువంటప్పుడు ఇంటర్నెట్ వ్యవస్థపై ప్రభుత్వ నియంత్రణ లేకపోయినట్లయితే అది ఇంకా చాలా ప్రమాదకర పరిస్థితులు సృష్టించవచ్చును. లేదా ఊహించలేని సరికొత్త సమస్యలు సృష్టించవచ్చును.   కొన్ని ప్రముఖ సెర్చ్ ఇంజన్లు, వెబ్ సైట్లు యువతను తప్పు ద్రోవలోకి వెళ్లేలా చేస్తున్నాయని చైనాతో సహా అనేక దేశాలు వాటిని నిషేధం విదించాయి. ఆ కారణంగానే అనేక దేశాలలో నేటికీ ఇంటర్నెట్ వ్యవస్థపై ప్రభుత్వ నియంత్రణ తప్పనిసరవుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో భారత ప్రభుత్వం ఇంటర్నెట్ వ్యవస్థపై ఉన్న కొద్దిపాటి నియంత్రణను ఎత్తివేసినట్లయితే దాని వలన మేలు కంటే కీడే ఎక్కువ జరిగే ప్రమాదం ఉంది.   కనుక అటువంటి ఆలోచనచేసే కంటే ఇంటర్నెట్ వినియోగదారులకు మరింత చౌకగా సేవలు ఉపలబ్దమయ్యేందుకు అవసరమయిన చర్యలు చేపడితే బాగుంటుంది. అదేవిధంగా ఇంటర్నెట్ వినియోగదారులు రకరకాల కంప్యూటర్ వైరస్ ల నుండి తమ డాటాను కాపాడుకొనేందుకు కోట్లాది రూపాయలు ఖర్చు చేయవలసి వస్తోంది. అదేవిధంగా దేశంలో ఇంటర్నెట్ వినియోగంతో బాటు సైబర్ నేరాలు క్రమంగా పెరిగిపోతున్నాయి. వేలాది మంది ప్రజలు, ముఖ్యంగా మహిళలు, ఆన్ లైన్ వ్యవహారాలూ చేసేవారు హ్యాకర్ల భారీన పడి చాలా నష్టపోతున్నారు. వారందరూ తమ సమస్యలను ఎవరికి మొరపెట్టుకోవాలో తెలియక మౌనంగా నరకం అనుభవిస్తున్నారు. దేశ ప్రజలందరికీ ఇంటర్నెట్ సేవలు అందుబాటులో తేవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించడం మంచిదే. అందుకోసం ప్రభుత్వ నియంత్రణ ఎత్తివేయాలని ఆలోచించడం కంటే ఇటువంటి సమస్యలకు పరిష్కారం కోసం అవసరమయిన యంత్రాంగం, సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లయితే ఇంటర్నెట్ వ్యవస్థపై ప్రభుత్వ నియంత్రణ ఉన్నప్పటికీ శరవేగంగా దేశంలో వ్యాప్తి చెందుతుంది. అలాకాక హడావుడిగా ఇటువంటి నిర్ణయాలు తీసుకొంటే చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకోవడం వలన ఏమీ ప్రయోజనం ఉండబోదు.

ఎంకి పెళ్లి సుబ్బి చావుకి వచ్చినట్లు...

  ఆర్ధికంగా చాలా బలంగా ఉన్న తెలంగాణా ప్రభుత్వం తన ఉద్యోగులకు చాలా ఉదారంగా ఇంక్రిమెంట్లు మంజూరు చేస్తుంటే, ఎంకి పెళ్లి సుబ్బి చావుకి వచ్చినట్లు అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అగ్ని పరీక్షగా మారుతోంది. ఇదివరకు తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అందరికీ ప్రభుత్వం 47 శాతం వరకు జీతాలు పెంచినప్పుడు, ఆ ప్రభావం ఆంద్రప్రదేశ్ ప్రభుత్వంపై కూడా పడింది. ప్రభుత్వం తమ జీతాలు ఇవ్వడానికే నెలనెలా వెతుకొనే పరిస్థితిలో ఉందని తెలిసి ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అందరూ ప్రభుత్వం ముక్కు పిండి మరీ అంత ఇంక్రిమెంటు తీసుకొన్నారు.   ఇప్పుడు తెలంగాణా ప్రభుత్వం తన 56,000 మంది ఆర్.టి.సి. ఉద్యోగులు ప్రత్యేక ఇంక్రిమెంటు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. అందుకు తెలంగాణా రాష్ట్ర ఆర్.టి.సి. ఉద్యోగులు అందరూ సంతోసహించడం సహజమే. కానీ ఇప్పుడు ఆంద్రప్రదేశ్ ఆర్.టీ.సి. ఉద్యోగులు కూడా తమకూ తెలంగాణా ఉద్యోగులతో సరిసమానంగా ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని పట్టుబడితే ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం పరిస్థితి అప్పుడు మూలిగే నక్కమీద తాటి పండు పడినట్లుగా ఉంటుంది.   రాష్ట్ర విభజన తరువాత ఆంద్రప్రదేశ్ రాష్ట్రమే కాకుండా ఆర్.టి.సి. కూడా తీవ్రంగా నష్టపోయింది. ఆ సమస్య నుండి ఏవిధంగా బయటపడాలా అని చూస్తున్న ప్రభుత్వానికి ఇప్పుడు అత్యవసరంగా మరో సమస్యను పరిష్కరించవలసి వస్తుంది. అయితే ప్రస్తుతం రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగోలేదు కనుకనే ఆంద్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇటువంటివి పెద్ద సమస్యలుగా కనబడుతున్నాయి. కానీ ఒక్కసారి రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి పుంజుకొంటే అప్పుడు తెలంగాణా ప్రభుత్వంతో పోటీపడి మరీ తన ఉద్యోగులకు కూడా జీతాలు పెంచగలదని ఖచ్చితంగా చెప్పవచ్చును.

తప్పులకు శిక్షించారు.. త్యాగాలు మరచిపోయారు

కొందరు వ్యక్తులు చేసిన తప్పులు మాత్రమే అందరికీ గుర్తుండిపోతాయి. త్యాగాలు మాత్రం మరుగున పడిపోతాయి. అలా తప్పులు మాత్రమే మిగిలి, ఆ తప్పులకు శిక్ష కూడా పడి, త్యాగాలు మాత్రం మరుగున పడిపోయిన వ్యక్తి ‘సత్యం’ రామలింగరాజు. ఈమధ్య రామలింగరాజుకు సంబంధించిన కేసు తీర్పు వెలువడింది. ఏడు సంవత్సరాల జైలుశిక్షతోపాటు ఐదుకోట్ల జరిమానా విధించింది. రామలింగరాజు తనను నమ్మిన ఇన్వెస్టర్ల నమ్మకాన్ని వమ్ము చేశాడు. ఎవరూ ఊహించని విధంగా ఒక భారీ కుంభకోణంలో ప్రధాన పాత్రధారి అయ్యాడు. అయితే చివరికి తాను చేసిన మోసాన్ని తానే బయటపెట్టుకుని చట్టానికి లొంగిపోయాడు.  జనాన్ని మోసం చేయగలిగాడు కానీ, ఆ మోసాన్ని కొనసాగించలేకపోయాడు. ఏ పశ్చాత్తాపమో ఆయన్ని అన్ని నిజాలూ బయటపెట్టి లొంగిపోయేలా చేసింది. ఆ కోణంలో చూస్తే లక్షల కోట్ల కుంభకోణాలు చేసి దర్పం వెలగబెడుతూ, స్వేచ్ఛగా బయటే తిరుగుతున్న కొంతమంది రాజకీయ నాయకులకంటే ఆయన చాలా బెటర్. మోసమయితే చేయగలిగాడుగానీ, మోసం చేయలేదంటూ బుకాయించి, దబాయించి దర్జాగా బతికేపని మాత్రం చేయలేకపోయాడు. ఇప్పుడు లోకం సత్యం రామలింగరాజుని  ఒక కార్పొరేట్ మోసగాడు గానే గుర్తిస్తోంది. ఆయన వైభవం వెలిగినప్పుడు తన సొమ్ముతోకానీయండి, జనం సొమ్ముతో కానీయండి... ఆయన చేసిన సేవా కార్యక్రమాలను మాత్రం ఇప్పుడు అందరూ మరచిపోయారు. రామలింగరాజు తాను స్థాపించిన బైర్రాజు ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలను చేపట్టారు. అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటా ఈ సంస్థ తన సేవా కార్యక్రమాలను విస్తరించింది. ముఖ్యంగా తూర్పుగోదావరి, గుంటూరు, కృష్ణా, రంగారెడ్డి, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లో రెండు వందల  గ్రామాల్లో ఈ సంస్థ భారీ స్థాయిలో సేవా కార్యక్రమాలు చేపట్టింది. పేద ప్రజలకు వైద్యం, విద్య, మంచినీరు, పర్యావరణ, పారిశుద్ధ్యం, నివాస గృహాలు, వ్యవసాయ సలహాల వంటి అంశాలలో ఈ సంస్థ సేవలను అందించింది. వేలాదిమంది గ్రామీణ యువతరానికి కంప్యూటర్‌లో శిక్షణ ఇచ్చింది. సాఫ్ట్‌వేర్ రంగంలో అప్పటి ఆంధ్రప్రదేశ్ దేశంలో ముందడుగు వేయడానికి ప్రధాన కారణమైంది. ప్రతిభావంతులైన యువతీ యువకులు జీవితంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించడానికి మొదటి మెట్టుగా సత్యం సంస్థ ఉపయోగపడింది. ఈ సంస్థను స్ఫూర్తిగా తీసుకుని ఎన్నో సాఫ్ట్‌వేర్ సంస్థలు ఆవిర్భవించడానికి, తద్వారా ఎన్నో లక్షల ఉద్యోగాలు రావడానికి కారణమైంది... ఇప్పుడు ఇవన్నీ గుర్తించేవారేరి? చివరికి స్వయం కృతాపరాధాల కారణంగా మొదలుకంటా కూలిపోయిన సత్యం రామలింగరాజు... ఎంతోమందికి గుణపాఠంగా నిలిచాడు... ఇలా కూడా ఇతరులకు ఉపయోగపడ్డాడు.

అడ్డంగా దొరికిపోయిన అసదుద్దీన్

  ముస్లింలను ఉద్ధరించడమే తమ ధ్యేయంగా చెప్పుకునే మజ్లిస్ పార్టీ నాయకుడు అసదుద్దీన్ ఒవైసీ ఎన్నోసార్లు తన రెచ్చగొట్టే ప్రసంగాల ద్వారా ఎన్నోసార్లు చట్టానికి దొరికిపోయాడు. అయితే చట్టాలు ఇలాంటివాళ్ళకి చుట్టాలు కాబట్టి కొంతకాలం జైల్లో వున్నా, ఇప్పుడు మళ్ళీ జనాల్లో తిరుగుతూ తమ ధోరణినిని కొనసాగిస్తున్నాడు. అసదుద్దీన్ పార్టీ తీవ్రవాదులకు అనుకూలంగా వుంటుందన్న విమర్శలు మొదటినుంచీ వున్నాయి. అయితే ఆధారాలు లేని ఈ విమర్శలను పట్టించుకోనవసరం లేదని ప్రజాస్వామ్యవాదులు ఇంతకాలం భావిస్తూ వుంటేవారు. అయితే ఈమధ్య వికారుద్దీన్ అండ్ గ్యాంగ్ ఎన్‌కౌంటర్ జరిగిన సందర్భంగా అసదుద్దీన్ వ్యవహరించిన తీరు చూస్తే, ఆయన మీద, ఆయన పార్టీ మీద వినిపిస్తున్న విమర్శలు నిజమేనని నమ్మాల్సి వస్తోంది. ఎన్‌కౌంటర్ జరిగిన వెంటనే, ఆ ఎన్‌కౌంటర్ని తాను దగ్గరుండి చూసినట్టు ఇది బూటకపు ఎన్‌కౌంటర్ అని స్పందించారాయన. వికారుద్దీన్ బ్యాచ్ చేతిలో ఎంతోమంది పోలీసులు చనిపోయినా ఎప్పుడూ ఒక్క సానుభూతి వాక్యం కూడా పలకని ఆయన తీవ్రవాదులు ఎన్‌కౌంటర్ అయితే మాత్రం నిమిషాల్లో స్పందించేశాడు. అక్కడితో ఆగాడా, కొంతమంది ముస్లిం పెద్దలతో కలసి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ని కలిసి ఈ ఎన్‌కౌంటర్ని ఖండించాడు. సీబీఐ చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశాడు. ఇక వికారుద్దీన్ అంత్యక్రియలయితే ఎంఐఎం కార్యకర్తలు, ఎమ్మెల్యేలు కన్నీరు మున్నీరు అవుతూ దగ్గరుండి జరిపించారు. సరే, అసదుద్దీన్ అండ్ బ్యాచ్ వికారుద్దీన్ అండ్ బ్యాచ్ మీద సానుభూతి వ్యక్తం చేయడాన్ని మత కోణంలో తీసుకుంటే, వికారుద్దీన్ బ్యాచ్ ముస్లిం మతానికి చెందిన వారు కాబట్టి ముస్లిం మతాన్ని ఉద్ధరించడానికే రాజకీయాల్లో ఉన్నామని చెప్పుకునే అసదుద్దీన్ బాధపడిపోవడం న్యాయమే. అయితే ఎన్‌కౌంటర్లో మరణించిన వికారుద్దీన్ మాత్రమే కాదు... అంతకుముందు మరో ఇద్దరు ఉగ్రవాదుల చేతిలో కాల్పులకు గురై మరణించిన ఎస్.ఐ. సిద్ధయ్య కూడా ముస్లిమే. ఆయన అసలు పేరు మహ్మద్ సిద్ధిక్. తన విధి నిర్వహణలో భాగంగా ఆయన తీవ్రవాదుల చేతిలో తీవ్రంగా గాయపడి నాలుగు రోజులపాటు ఆస్పత్రిలో చికిత్స పొందుతుంటే, ఈ అసదుద్దీన్ గానీ, ఆయన పార్టీ వాళ్ళుగాని పరామర్శించిన పాపాన పోలేదు. చివరికి ఆయన మృత్యువుతో పోరాడి మరణిస్తే కనీసం ఆయన మృతికి సంతాపాన్ని కూడా తెలపలేదు. తీవ్రవాదుల అంత్యక్రియలకు వెళ్ళి కన్నీరు మున్నీరుగా విలపించిన ఎం.ఐ.ఎం. నాయకులు ఎస్.ఐ. సిద్ధిక్ మృతదేహం వున్న ఛాయలకు కూడా రాలేదు. మరి ముస్లింల కోసం పోరాడే అసదుద్దీన్ అండ్ కో సిద్ధిక్‌ని ఎందుకు పట్టించుకోలేదో? ఇవే ప్రశ్నలు ఇప్పుడు బలంగా వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో అనేకమంది ముస్లింలు అసదుద్దీన్‌ని ప్రశ్నిస్తున్నారు. తాను అడ్డంగా దొరికిపోయిన ఈ విషయంలో అసదుద్దీన్ తన వివరణ ఇవ్వాలి. ఇవ్వకపోతే ఆయన ముస్లిం సమాజం ముందు దోషిలా నిలబడాల్సిందే. ముస్లింల కోసం పోరాడుతున్నట్టు తమ ముఖానికి వేసుకున్న మాస్కుని తొలగించాల్సిందే.

బొత్స వైకాపాలో చేరబోతున్నారా?

  విజయనగరం జిల్లాలో ఒక ప్రముఖ రాజకీయ నాయకుడిని వైకాపాలో చేర్చుకోవడం గురించి ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి జిల్లా నేతల అభిప్రాయం అడిగినట్లు వార్తలు వచ్చేయి. కానీ ఆ నాయకుడు ఎవరనే విషయం బయటకి పొక్కనీయలేదు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీయే రాష్ట్రంలో అధికారంలో ఉంది కనుక ఆ పార్టీకి చెందిన నేతలెవరూ వైకాపాలో చేరే ఆలోచన చేయరని ఎవరయినా చెప్పగలరు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితే అగమ్యగోచరంగా ఉంది కనుక ఆ పార్టీకి చెందిన నేతలే వైకాపాలో చేరేందుకు ఆసక్తి చూపుతుండవచ్చును.   జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రముఖనేత అనగానే టక్కున గుర్తుకు వచ్చేది బొత్స సత్యనారాయణే. ఇదివరకు ఆయన బీజేపీలోకి వెళ్లేందుకు ప్రయత్నించి అది వీలుకకాకపోవడంతో నేటికీ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. కానీ ఆయన ఇదివరకులా కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలలో చురుకుగా పాల్గొనడం లేదు. ఒకవేళ పాల్గొన్నా ఆయన తన ఉనికిని కాపాడుకోవడానికి మాత్రమే పాల్గొంటున్నట్లున్నారు తప్ప ఇదివరకులా కాంగ్రెస్ పార్టీని వెనకేసుకురావడం లేదనే సంగతి గమనిస్తే ఆయన వైకాపాలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారనే అనుమానం కలుగకమానదు. విజయనగరానికే చెందిన వైకాపా నేత కోలగట్ల వీరభద్రరావుతో ఆయనకు మంచి సాన్నిహిత్యం కూడా ఉంది. కనుక ఆయన ద్వారా బొత్స సత్యనారాయణ కాంగ్రెస్ వైకాపాలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారేమో?   ప్రస్తుతం విజయనగరం జిల్లాలో వైకాపాకు బలమయిన నాయకులే ఉన్నారు. ఒకవేళ బొత్సను వైకాపాలో చేర్చుకొంటే పార్టీ బలోపేతం అవడం సంగతి ఎలా ఉన్నా ఆయన వారందరి మీద పెత్తనం చేసే అవకాశాలున్నాయి. ఆయనతో బాటు ఆయన కుటుంబ సభ్యులు, అనుచరులు కూడా వెంటవస్తారు కనుక క్రమంగా వారందరూ కలిసి జిల్లాలో పార్టీని తమ చెప్పు చేతల్లోకి తీసుకొనే అవకాశం కూడా ఉంటుంది. బహుశః అందుకే వైకాపా జిల్లా నేతలు తమ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రతిపాదనకు వెంటనే తలూపేయకుండా ఆలోచించుకోవడానికి కొంత సమయం కావాలనికోరారు. ఒకవేళ బొత్స సత్యనారాయణ కాక కాంగ్రెస్ పార్టీకి చెందిన వేరే నేతలేవరయినా అయ్యుంటే బహుశః వైకాపా నేతలు అభ్యంతరం చెప్పి ఉండేవారు కారేమో?

శ్రుతిహాసన్ ఇష్యూలో శ్రుతి మించిన మీడియా

సినీ కథానాయిక శ్రుతిహాసన్‌ని ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖమంత్రి కామినేని శ్రీనివాస్ విమానంలో ఏడిపించారనే అనారోగ్యకరమైన వార్త గత కొద్ది రోజులుగా మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ వార్తకి మీడియా రకరకాల మసాలాలు దట్టించి, చిలువలు పలువలు కల్పించి, తనదైన స్టైల్లో స్క్రీన్‌ప్లే అల్లేసి ప్రసారం చేసి మంత్రి కామినేని శ్రీనివాస్‌ని బద్నామ్ చేయడానికి శాయశక్తులా ప్రయత్నించింది. దీనికితోడు ఇదిగో పులి అంటే అదిగో తోక అనే సోషల్ మీడియా వుండనే వుంది... ఇలా ఈ నిరాధార వార్త మీడియాని ఆధారం చేసుకుని వ్యాపించింది. ఒక అబద్ధాన్ని ఖండించకపోతే అది నిజమేమోనని జనం నమ్మే ప్రమాదం వుంది కాబట్టి మంత్రి కామినేని శ్రీనివాస్  దీనిమీద వివరణ ఇచ్చారు. తాను ఎప్పుడూ శ్రుతి హాసన్‌ ప్రయాణించిన విమానంలో ప్రయాణించనే లేదని, తాను ఎప్పుడు తిరుపతి వెళ్ళినా కారులోనే వెళ్తానని, మీడియాలో జరుగుతున్న ఈ దుష్ప్రచారమంతా శుద్ధ అబద్ధమని తేల్చేశారు. తాను శ్రుతిహాసన్‌ని సినిమాల్లో తప్ప బయట ఎక్కడ చూడను కూడా చూడలేదని స్పష్టం చేశారు. ఒక వార్తను ప్రకటించే ముందు తన వివరణ తీసుకోవాలని మీడియా ఆలోచించకపోవడం అన్యాయమని ఆయన బాధపడ్డారు. తాను శ్రుతిహాసన్‌ని విమానంలో ఏడిపించానని నిరూపిస్తే తాను తన పదవికి రాజీనామా చేయడానికి కూడా సిద్ధంగా వున్నానని ప్రకటించారు. తన పదవికి కూడా రాజీనామా చేస్తానని ప్రకటించారంటే మంత్రిగారిని మీడియా ఎంతగా విసిగించిందో అర్థం చేసుకోవచ్చు. నిజానికి ఈ శ్రుతిహాసన్ ఇష్యూలో మీడియా శ్రుతిమించిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే, అసలు ఆరోజు జరిగింది వేరు... మీడియా కల్పించింది వేరు. అసలు ఆరోజు జరిగింది ఇదే... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు ఇటీవల ఒక సీనియర్ మహిళా అధికారితో కలసి విమానంలో తిరుపతికి వెళ్తున్నారు. వీరి పక్క సీట్లో ఒకమ్మాయి కూర్చుని వుంది. సినిమాలు చూడని మంత్రిగారికి ఆ అమ్మాయి శ్రుతిహాసన్ అని కూడా తెలియదు. ఇంతలో సూర్యాపేటలో జరిగిన కాల్పుల్లో దొరబాబు అనే ఎంపీటీసీ గాయపడ్డారని మంత్రిగారికి ఫోన్ వచ్చింది. గాయపడిన ఎంపీటీసిని ఆపరేషన్‌ థియేటర్‌కి తరలిస్తుండగా మంత్రికి ఫోన్ చేశారు. మంత్రి మాణిక్యాలరావు ఆ ఎంపీటీసీకి చికిత్స చేస్తున్న డాక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఎంపీటీసీ దొరబాబుకు మంచి వైద్యాన్ని అందించాల్సిందిగా డాక్టర్ని మంత్రి కోరారు. ఇలా మంత్రి మాణిక్యాలరావు ఫోన్‌లో మాట్లాడుతూ వుండగా పక్కసీట్లోనే వున్న శ్రుతిహాసన్ గయ్యిమంటూ లేచింది. మీరు ఫోన్ మాట్లాడుతూ వుంటే నేను డిస్ట్రబ్ అయిపోతున్నానంటూ గోలగోల చేసింది. మంత్రి మాణిక్యాలరావు ‘‘ఇది చాలా ఇంపార్టెంట్ ఫోనమ్మా.. అందుకే మాట్లాడుతున్నాను’’ అని చెప్తున్నా శ్రుతిహాసన్ ఎంతమాత్రం పట్టించుకోకుండా ఎయిర్‌హోస్టెస్‌ని పిలిచి కంప్లయింట్ చేసింది. దాంతో మంత్రి మాణిక్యాలరావు ఎందుకొచ్చిన గొడవ అని ఫోన్ కట్ చేసి కూర్చున్నారు. ఇంతలో మంత్రిగారి ఫోన్ మరోసారి మోగింది. అవతల ఫోన్ చేసిన వ్యక్తి... ‘‘సార్... ఇక్కడ బైక్ మీద వెళ్తున్న వ్యక్తికి యాక్సిడెంట్ అయింది. అతను స్పృహ కోల్పోయాడు. అతని ఫోన్‌లో చివరగా డయల్ చేసిన నంబర్ మీదే వుంది. అందుకే ఫోన్ చేశాం’’ అని చెప్పారు. ఇంతకీ ఆ యాక్సిడెంట్ అయిన వ్యక్తి మరెవరో కాదు... మంత్రి మాణిక్యాలరావు పీఏ. దాంతో ఆందోళన చెందిన మంత్రి తన పీఏ ప్రాణాలు కాపాడుకోవాలన్న ఉద్దేశంతో అతనని ఎలా ఆస్పత్రికి తరలించాలి.. ఏం చేయాలి అనే విషయాలను ఫోన్‌లో మాట్లాడారు. అంతే... శ్రుతి హాసన్ మరోసారి శివాలెత్తింది. తాను డిస్ట్రబ్ అయిపోతున్నానంటూ మరోసారి గొడవ చేయడం మొదలుపెట్టింది. చాలా పెద్ద ప్రాబ్లం కావడం వల్లే ఫోన్ మాట్లాడుతున్నానని చెప్పినా ఆమె ఎంతమాత్రం వినిపించుకోలేదు. ఇక ఈమెతో వాదించి తన పరువు తీసుకోవడం ఎందుకనుకున్న మంత్రిగారు ఫోన్ కట్ చేసి కూర్చుండిపోయారు. మంత్రిగారి పక్కన సీనియర్ మహిళా అధికారి ఉన్నారుకాబట్టి సరిపోయింది.. లేకపోతే విమానంలోని జనం మంత్రిగారిని అనుమానంగా చూసేవారే. మొత్తమ్మీద తిరుపతిలో ఫ్లైట్ లాండ్ అయిన తర్వాత ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. ఇదీ అసలు జరిగిన విషయం. ఈ విషయాన్ని మీడియా ఎలా డైవర్ట్ చేసిందో చూడండి. అసలు ఈ విషయంలో సంబంధమే లేని మంత్రి కామినేని శ్రీనివాస్‌ని ముగ్గులోకి లాగింది. అసలు జరిగిన ఘటనకి రకరకాల మసాలాలు దట్టించి జనాల్లోకి వదిలింది. ఇలాంటి అనారోగ్యకరమైన ధోరణులు ఇటీవలి కాలంలో మీడియాలో బాగా పెరిగిపోయాయి. తమ రేటింగ్‌ కోసం బాధ్యతాయుతమైన వ్యక్తుల మీద లేనిపోని అభాండాలు వేయడం దారుణమైన విషయం. మానవత్వంతో  వ్యవహరించాల్సిన సమయంలో నానాయాగీ చేసిన శ్రుతిహాసన్ ఎంత తప్పు చేసిందో, ఈ విషయంలో అభూత కల్పనలు ప్రసారం చేసిన మీడియా కూడా అంతే తప్పు చేసినట్టు. ఈ విషయంలో మీడియా తన పొరపాటును తెలుసుకుని, భవిష్యత్తులో అయినా బాధ్యతాయుతంగా ఆలోచిస్తుందని ఆశించడం అత్యాశే అయినా... మనం ఆశావాదులం... అలా జరుగుతుందనే ఆశిద్దాం.