విరాట్ కింగ్ కోహ్లీ అజేయ సెంచరీ..కేకేఆర్ పై ఆర్సీబీ విజయం
Publish Date:May 13, 2026
Advertisement
ఐపీఎల్ 2026 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. బుధవారం (మే 13) రాయ్పూర్ వేదికగా కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన పోరులో బెంగళూరు జట్టు అద్భుత విజయాన్ని అందుకుంది. స్టార్ బ్యాటర్ విరాట్ కింగ్ కోహ్లీ అద్భుత శతకంతో చెలరేగడంతో కేకేఆర్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఆర్సీబీ మరో ఐదు బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. ఈ విజయంతో బెంగళూరు జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. టాస్ కోల్పోయి తొలుత బ్యాటింగ్ చేసిన కోల్కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 192 పరుగుల స్కోరు సాధించింది. 193 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన బెంగళూరుకు ఓపెనర్ కోహ్లీ కళ్లు చెదిరే ఆరంభాన్ని ఇచ్చాడు. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన కోహ్లీ 58 బంతుల్లోనే తన సెంచరీని పూర్తి చేసుకుని స్టేడియాన్ని హోరెత్తించాడు. కోహ్లీ మొత్తం 60 బంతులు ఎదుర్కొని 105 పరుగులతో అజేయంగా నిలిచాడు. మూడు సిక్సర్లు, పది ఫోర్లకు తోడు వికెట్ల మధ్య వేగంగా పరుగెడుతూ సింగిల్స్ తీయడం ద్వారా కేకేఆర్ ఫీల్డర్లపై ఒత్తిడి పెంచాడు. కోహ్లీకి తోడుగా యువ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ 39 పరుగులతో సహకారాన్ని అందించారు. వీరిద్దరి భాగస్వామ్యం మ్యాచ్ను పూర్తిగా బెంగళూరు వైపు తిప్పేసింది. చివరికి 19.1 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించిన ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్లో కోహ్లీ బ్యాటింగ్ తీరు అభిమానులను కట్టిపడేసింది. స్పిన్నర్లను, పేసర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ మైదానం నలుమూలల షాట్లు ఆడటం విశేషం. ఈ అద్భుత ప్రదర్శనతో విరాట్ మరోసారి తన క్లాస్ను నిరూపించుకున్నారు. ఈ సీజన్ లో గత రెండు మ్యాచ్ లలో డకౌట్ అయ్యి అభిమానులను నిరాశపరిచిన కింగ్ కోహ్లీ కేకేఆర్ తో మ్యాచ్ లో విశ్వరూపం చూపాడు.
http://www.teluguone.com/news/content/virat--king-kohlis-unbeaten-century-36-219705.html





