వివేకా హత్యపై షర్మిల సంచలన వ్యాఖ్యలు
Publish Date:Mar 18, 2026
Advertisement
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు మరోసారి రాజకీయ వేడిని రాజేసింది. ఈ ఘటన కడప ఎంపీ టికెట్ వివాదంతో ముడిపడి ఉందని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కడప ఎంపీ అభ్యర్థిగా అవినాశ్రెడ్డి సరైన వ్యక్తి కాదని వివేకానందరెడ్డి తనతో స్వయంగా చెప్పారని ఆమె పేర్కొన్నారు. అయితే ఆయన అభిప్రాయాన్ని పక్కనపెట్టి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అవినాశ్రెడ్డికే టికెట్ ఇచ్చారని విమర్శించారు. వివేకానందరెడ్డి బతికి ఉంటే రాజకీయంగా అడ్డుగా మారతారని భావించి ఈ హత్య జరిగిందని షర్మిలా ఆరోపించారు. టికెట్ విషయంలో వివేకా ఎప్పటికైనా అవినాశ్కు అడ్డుగా నిలుస్తారని గ్రహించి హత్యకు పాల్పడ్డారని ఆమె అన్నారు. అలాగే ఈ కేసులో బాధితురాలు వైఎస్ సునీతపై కూడా దుష్ప్రచారం జరుగుతోందని మండిపడ్డారు. సునీత భర్తే హత్య చేయించారని, ఆమె ప్రత్యర్థి పార్టీలకు పని చేస్తోందని ప్రచారం చేయడం బాధాకరమని అన్నారు. ప్రాణహాని ఉందని తెలిసినా సునీత న్యాయం కోసం పోరాడుతుండగా, ఒక అన్నగా జగన్కు కనీస కనికరం కూడా లేదని షర్మిలా ప్రశ్నించారు. బాధితుల పక్షాన నిలబడకుండా నిందితులకు మద్దతుగా వ్యవహరిస్తున్నారని ఆమె తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి చర్చ మొదలైంది.
http://www.teluguone.com/news/content/sharmilas-sensational-comments-on-vivekas-murder-36-215725.html





