ఎవరీ వేం నరేందర్ రెడ్డి?.. ఎందుకంత ప్రాధాన్యత?
Publish Date:Mar 5, 2026
Advertisement
వేంనరేందర్ రెడ్డి తెలంగాణ రాజకీయాల్లో కీలక నేత. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డికి ఆయన కుడిభుజంలాంటి వారంటే అతిశయోక్తి కాదు. ఆనాడు వైఎస్ కి కేవీపీ ఎలాగో, ఇప్పుడు రేవంత్ కి వేం నరేందర్ రెడ్డి అలా అని రాజకీయవర్గాలు అంటున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్ధిగా వేం నరేందర్ రెడ్డిని అధికారికంగా ప్రకటించారు. దీంతో ఎవరీ వేం నరేందర్ రెడ్డి, ఆయనకు ఏమిటంత ప్రాధాన్యత అన్న చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది. వేం నరేందర్ రెడ్డి, రేవంత్ రెడ్డి మధ్య దశాబ్ద కాలంగా అనుబంధముంది. వీరిద్దరూ కలసి తెలుగుదేశం నుంచి కాంగ్రెస్ లోకి వచ్చారు. రేవంత్ కష్టాల్లో ఉన్నపుడు, రాజకీయంగా ఎదుగుతున్నపుడు వేం నరేందర్ రెడ్డి ఆయన వెన్నంటే ఉన్నారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. రేవంత్ రెడ్డికి వేం నరేందర్ రెడ్డి ఒక వ్యూహకర్తలా పని చేశారు. అందుకే రేవంత్ రెడ్డి వేంనరేందర్ రెడ్డిని సహచరుడిగా మాత్రమే కాకుండా, అత్యంత నమ్మకమైన వ్యక్తిగా పరిగణిస్తారు. వేం నరేందర్ రెడ్డి పొలిటికల్ హిస్టరీ పరిశీలిస్తే, ఉమ్మడి ఏపీలో మహబూబాబాద్ నియోజకవర్గం నుంచి 2004లో ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం ఆయన తెలంగాణ ప్రభుత్వంలో సీఎంకి ప్రజా వ్యవహారాల సలహాదారుగా క్యాబినేట్ ర్యాంకు పదవిలో ఉన్నారు. వేంనరేందర్ రెడ్డి కారణంగానే రేవంత్ ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే 2015లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం తరఫున ఎమ్మెల్సీ అభ్యర్ధిగా పోటీ చేసింది వేం నరేందర్ రెడ్డే. ఆ సమయంలోనే రేవంత్ రెడ్డి ఏసీబీకి చిక్కారు. ఈ కేసు పరిణామాలన్నింటిలోనూ వీరిద్దరూ కలిసి పోరాడారు. అది పక్కన పెడితే.. రాజ్యసభ ఎన్నికలలో పోటీకి కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ నుంచి ఇద్దరు అభ్యర్ధులను ఎంపిక చేసింది. వారిలో ఒకరు పీసీ ఘోష్ కమిషన్ పిటిషన్ పై ప్రభుత్వం తరఫున వాదిస్తున్న సీనియర్ లాయర్ అభిషేక్ మను సింఘ్వీ కాగా, రెండో వ్యక్తి వేం నరేందర్ రెడ్డి. రాజ్య సభ ఎన్నికలకు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు గురువారం (మార్చి 5) కావడంతో వీరిరువురూ అదే రోజు నామినేషన్లు దాఖలు చేస్తారు. ఇక పోతే తనకు సన్నిహితుడూ, ఎల్లవేళలా తనకు పూర్తిగా సహకరించే వేం నరేందర్ రెడ్డిని జాతీయ స్థాయిలో ప్రాధాన్యత ఉన్న పదవికి ఎంపిక చేయించుకోవడంలో రేవంత్ రెడ్డి సఫలీకృతుడయ్యారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. దానికి తోడు పార్టీలో ఒక ట్రబుల్ షూటర్ గానూ వేం నరేందర్ రెడ్డికి మంచి గుర్తింపు ఉంది. వీటన్నిటి దృష్ట్యా రేవంత్ వేం నరేందర్ రెడ్డిని రాజ్య సభకు పంపాలని పట్టుబడితే, అధిష్టానం అందుకు ఆమోదముద్ర వేసింది. వీహెచ్ వంటి పాతకాపులను పక్కన పెట్టి మరీ నరేందర్ రెడ్డిని రాజ్యసభకు పంపుతోంది. ఒక్కమాటలో చెప్పాలంటే, రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వంలోనూ, ఇప్పుడు పార్టీ పరంగానూ.. వేం నరేందర్ రెడ్డికి అగ్రపీఠం వేయడం ఆయన పట్ల రేవంత్ రెడ్డికి ఉన్న అపారమైన నమ్మకానికి నిదర్శనంగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
http://www.teluguone.com/news/content/revanth-reddt-succeed-in-getting-vem-narendra-reddy-tayasabha-ticket-45-215045.html





