Top Stories

political-news-img

తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభకు అనుమతి నో.. కోర్టును ఆశ్రయించిన జనసేన

తెలంగాణ రాజకీయ ముఖచిత్రంపై తమ ముద్ర వేసేందుకు సన్నద్ధమవుతున్న జనసేన పార్టీకి తెలంగాణ సర్కార్ షాక్ ఇచ్చింది. మంగళవారం (జూన్ 2) రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లో జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన సభకు పోలీస్ శాఖ అనుమతి నిరాకరించింది. ఒకపక్క ఏర్పాట్లన్నీ పూర్తయి, శ్రేణులు ఉత్సాహంగా ఉన్న తరుణంలో పోలీసుల నిర్ణయం ఆ పార్టీ నేతలకు శరాఘాతంగా మారింది. జనసేన పార్టీ మంగళవారం (జూన్ 2) హైదరాబాద్‌ సంధ్యా కన్వెన్షన్ వేదికగా ఒక భారీ కార్యక్రమాన్ని ప్లాన్ చేసింది. తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ – జనసేన సాధక్ సమ్మేళనం పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంది. అయితే, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు నేపథ్యంలో నగరంలో వీఐపీల కదలికలు, ట్రాఫిక్ ఆంక్షలు, శాంతిభద్రతల నిర్వహణ దృష్ట్యా పవన్‌కల్యాణ్ సభకు అనుమతి ఇవ్వలేమని పోలీస్ శాఖ చెప్పింది. దీనిపై జనసేన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఆ పార్టీ సీనియర్ నేత మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఇది రోడ్ల మీద నిర్వహించే బహిరంగ సభ కాదని, కేవలం కన్వెన్షన్ హాల్ లోపల నిర్వహించుకునే అంతర్గత సమావేశం మాత్రమేనని స్పష్టం చేశారు. చట్టపరమైన నిబంధనల ప్రకారం.. ఒక క్లోజ్డ్ ప్రాంగణంలో సమావేశం పెట్టుకున్నప్పుడు పోలీసులకు ముందస్తు సమాచారం ఇస్తే సరిపోతుందని, దీనికి ప్రత్యేకంగా అనుమతి తీసుకోవాల్సిన ఏముందని ఆయన ప్రశ్నించారు. ఎలాంటి సరైన, సహేతుకమైన కారణాలు చూపకుండా చివరి నిమిషంలో అనుమతి నిరాకరించడం పోలీసుల ఏకపక్ష ధోరణికి అద్దం పడుతోందని మండిపడ్డారు. పోలీసుల సభకు అనుమతి నిరాకరించడంతో జనసేన కోర్టును ఆశ్రయించింది. సమావేశం నిర్వహించుకోవడం తమ ప్రాథమిక హక్కు అని, కేవలం శాంతిభద్రతల సాకు చూపి ఒక హాల్‌లో జరిగే మీటింగ్‌ను ఎలా అడ్డుకుంటారని పిటిషన్‌లో పేర్కొన్నట్లు సమాచారం.

Publish Date: Jun 2, 2026 11:13AM

political-news-img

తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. పిడుగుపాటు హెచ్చరిక

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. ఉభయ తెలుగు రాష్ట్రాలలోని పలు జిల్లాలలో మంగళవారం (జూన్ 2) పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌లో అయితే పలు ప్రాంతాలలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తెలంగాణలో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంది. ఏపీలో ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడుతో పాటు మరి కొన్ని ప్రాంతాలలో ప్రాంతాల్లో పిడుగులు పడే ప్రమాదం ఉందనీ, ఇక సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, పశ్చిమగోదావరి, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, వైఎస్సార్ కడప, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అలాగే తెలంగాణలో ఆదిలాబాద్, మంచిర్యాల, కొమరంభీం ఆసిఫాబాద్, రాజన్న సిరిసిల్ల, వనపర్తి, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, కామారెడ్డి, మెదక్, నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆకాశం మేఘావృతమై ఉరుములు, మెరుపులతో వర్షం కురుస్తుందని పేర్కొన్న వాతావరణ శాఖ పిడుగు పాటుకు అవకాశం ఉన్నందున ప్రజలు సురక్షితమైన ప్రాంతాల్లో ఉండాలని పొరపాటున కూడా చెట్లు, విద్యుత్ స్తంభాలు, ఇనుప హోర్డింగ్స్ కింద నిలబడకూడదని అధికారులు సూచించారు.

Publish Date: Jun 2, 2026 11:02AM

political-news-img

తెలంగాణ ఫార్మేషన్ డే సందర్భంగా ప్రజలకు సీఎం రేవంత్ శుభాకాంక్షలు

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అమరుల త్యాగాలు, ఉద్యమ స్ఫూర్తి ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని పేర్కొంటూ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షలను సాకారం చేసుకుని తెలంగాణ అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణను సమగ్ర అభివృద్ధి, సామాజిక న్యాయం, ఆర్థిక పురోగతి దిశగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని చెప్పారు. రైతుల సంక్షేమం, మహిళా సాధికారత, యువతకు ఉపాధి అవకాశాలు, విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నామంటూ ట్వీట్ చేశారు. ప్రతి కుటుంబానికి అభివృద్ధి ఫలాలు చేరేలా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేడుక సందర్భంగా రాష్ట్ర ప్రజలందరూ ఐక్యంగా, సౌభ్రాతృత్వంతో ముందుకు సాగుతూ.. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.

Publish Date: Jun 2, 2026 10:54AM

political-news-img

వేడుకగా తెలంగాణ అవతరణ దినోత్సవ సంబురాలు

దశాబ్దాల సుదీర్ఘ పోరాటం, ఎందరో అమరవీరుల త్యాగాల ఫలంగా జూన్ 2, 2014న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. స్వరాష్ట్ర కల సాకారమై నేటికి 12 ఏళ్లయ్యింది. ఈ చారిత్రాత్మక తరుణంలో మంగళవారం (జూన్ 2) తెలంగాణవ్యాప్తంగా అవతరణ సంబురాలు అంబరాన్నంటాయి. పల్లె నుండి పట్నం దాకా ప్రతి ఇల్లూ పండుగ వాతావరణాన్ని తలపించింది. వీధులన్నీ తోరణాలు, రంగురంగుల విద్యుత్ దీపాల కాంతులతో ముస్తాబయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ప్రభుత్వ యంత్రాంగం ఆధ్వర్యంలో అధికారిక వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. జనం పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఈ పండుగలో భాగస్వాములయ్యారు.ఈ మహోత్సవాల్లో భాగంగా హైదరాబాద్‌లోని సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ ప్రధాన వేదికగా నిలిచింది. అక్కడ అధికారిక వేడుకలు ఉదయాన్నే అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరేడ్ గ్రౌండ్స్‌కు చేరుకుని, అక్కడ మువ్వన్నెల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. సాయుధ దళాల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. వివిధ బెటాలియన్ల పోలీసులు చేసిన మార్చ్ ఫాస్ట్ వేడుకలకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ వేడుకను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చారు. జెండా ఆవిష్కరణ అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. గత 12 ఏళ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని, సాధించిన విజయాలను వివరించారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబోయే సంక్షేమ పథకాలు, పారిశ్రామిక అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన సరికొత్త ప్రణాళికలను ప్రజల ముందుంచారు. అమరవీరుల ఆశయాలకు అనుగుణంగానే పాలన సాగుతుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎండ తీవ్రత విపరీతంగా ఉన్న నేపథ్యంలో వేడుకలకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉదయం 8:30 గంటలకే కార్యక్రమాన్ని ప్రారంభించి, ఎండ ముదరక ముందే ముగించింది.

Publish Date: Jun 2, 2026 10:46AM

political-news-img

బాబ్ ఎల్ మాండెబ్ జలసంధినీ స్వాధీనం చేసుకుంటాం.. ఇరాన్ హెచ్చరిక!

ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన సముద్ర మార్గాలపై ఇరాన్ తన పట్టును బిగించేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ప్రపంచ ముడి చమురు, సహజ వాయువులో దాదాపు 20 శాతం వాటా రవాణా అయ్యే హార్ముజ్ జలసంధి పై ఆంక్షలు విధించి అంతర్జాతీయ సమాజాన్ని కలవరపెట్టిన ఇరాన్, ఇప్పుడు మరో కీలకమైన సముద్ర మార్గాన్ని దిగ్బంధిస్తామంటూ హెచ్చరించింది. వ్యూహాత్మకంగా ఎంతో ప్రాధాన్యత కలిగిన బాబ్ ఎల్-మాండెబ్ జలసంధిని తమ అధీనంలోకి తీసుకుంటామని, ఆ జలసంధి గుండా ప్రయాణించే నౌకలు తీవ్ర పరిణామాలు ఎదుర్కొనాల్సి ఉంటుందని ఇరాన్, హౌతీ తిరుగుబాటుదారులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిణామం ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాను స్తంభిం పజేయడమే కాకుండా.. అంతర్జాతీయ మార్కెట్లలో నిత్యావసరాల ధరలు కొండెక్కి కూర్చోవడానికి కారణం కానుందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ సముద్ర వాణిజ్యంలో ఈ రెండు జలసంధులు అత్యంత కీలకమైన చోక్ పాయింట్లు. హార్ముజ్ జలసంధి ద్వారా ప్రతిరోజూ మిలియన్ల కొద్దీ చమురు బారెళ్లు రవాణా అవుతుండగా, బాబ్ ఎల్-మాండెబ్ జలసంధి హిందూ మహాసముద్రాన్ని ఎర్ర సముద్రంతోనూ, తద్వారా సుయెజ్ కాలువ మార్గంలో ఐరోపా దేశాలతోనూ అనుసంధానిస్తుంది. ఒకవేళ ఇరాన్ ఈ రెండు మార్గాలను అడ్డుకుంటే, ఆసియా, ఐరోపా దేశాల మధ్య ప్రయాణించే సరుకు రవాణా నౌకలు ఆఫ్రికా ఖండం చుట్టూ వేల కిలోమీటర్ల అదనపు దూరం ప్రయాణించాల్సి వస్తుంది. దీనివల్ల రవాణా ఖర్చులు విపరీతంగా పెరగడమే కాకుండా, డెలివరీ సమయం చాలా చాలా ఎక్కువ అవుతుంది. ఇది ఇప్పటికే ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్న ప్రపంచ దేశాలకు పెద్ద దెబ్బగా పరిణమించే ముప్పు ఉంది. అమెరికా సైనిక బలగాలు, ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని ప్రాజెక్ట్ ఫ్రీడమ్ సముద్ర మార్గాల రక్షణ కోసం రంగంలోకి దిగినప్పటికీ, ఉద్రిక్తతలు తగ్గడం లేదు. అమెరికా సెంట్రల్ కమాండ్ నివేదికల ప్రకారం, సముద్ర దిగ్బంధం కారణంగా ఇరాన్ విక్రయించలేకపోయిన దాదాపు 41 ట్యాంకర్లలోని 69 మిలియన్ బారెళ్ల చమురు నిలిచిపోయింది. దీనికి ప్రతీకారంగానే ఇరాన్ ఇప్పుడు తన వ్యూహాన్ని మార్చి, హౌతీల సహాయంతో బాబ్ ఎల్-మాండెబ్ ప్రాంతంలో ఉద్రిక్తతలను పెంచుతోంది. సముద్ర రవాణా మార్గాల్లో నౌకల భద్రతకు విఘాతం కలిగించేలా ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో దాడులకు తెగబడుతోందని అమెరికా ఆరోపిస్తోంది. ఈ రెండు దేశాల మధ్య జరుగుతున్న ఈ మైండ్ గేమ్, సైనిక ఘర్షణలు ఎప్పుడు ఎలాంటి భీకర యుద్ధానికి దారితీస్తాయోనని గల్ఫ్ దేశాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Publish Date: Jun 2, 2026 10:37AM

political-news-img

కోహ్లీ ఆస్ట్రేలియాలో ఓ జెయింట్ అంబాసిడర్.. పొగడ్తల వర్షం కురిపించిన ఆసీస్ ఉప ప్రధాని

ఐపీఎల్ 2026 సీజన్ ఫైనల్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చారిత్రాత్మక విజయం సాధించి, వరుసగా రెండోసారి ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకున్నే సంగతి తెలిసిందే. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ తో జరిగిన పోరులో ఆర్సీబీ అద్భుత ప్రదర్శన చేసింది. ఈ చారిత్రాత్మక విజయంపై దేశ విదేశాల నుండి ప్రశంసలు కురుస్తున్నాయి. ముఖ్యంగా విరాట్ కోహ్లీపై ప్రశంసల సునామీయే వస్తోంది. ఆస్ట్రేలియా డిప్యూటీ ప్రధాని, రక్షణ మంత్రి రిచర్డ్ మార్లెస్ కోహ్లీని పొగడ్తలతో ముంచెత్తారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన కోహ్లీకి తాను పెద్ద ఫ్యాన్ అంటూ ప్రశంసించారు. ఐపీఎల్ ఫైనల్ పోరులో.. టీమిండియా రన్ మెషీన్, ఆర్సీబీ బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లీ కేవలం 42 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 75 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును సొంతం చేసుకున్నాడు. ఈ విజయాన్ని ప్రస్తావిస్తూ రిచర్డ్ మార్లెస్ మాట్లాడుతూ, మైదానంలో విరాట్ కోహ్లీ 75 పరుగులతో అజేయంగా నిలిచి మ్యాచ్ విన్నర్‌గా మారిన తరుణంలో, అతడితో పాటు ఆస్ట్రేలియాకు చెందిన స్టార్ ఆటగాళ్లు జోష్ హేజిల్‌వుడ్ మరియు టిమ్ డేవిడ్ కూడా కీలక పాత్రలు పోషించారన్నారు. ఈ ముగ్గురి మేళవింపుతో కూడిన ఆర్సీబీ విజయంలో ఇండో-ఆస్ట్రేలియా ద్వైపాక్షిక బంధం స్పష్టంగా కనిపించిందన్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో విరాట్ కోహ్లీ ఒక జెయింట్ బ్రాండ్‌ అన్న ఆస్ట్రేలియా ఉప ప్రధాని, ఆసీస్ లో కోహ్లీకి విపరీతమైన ఆదరణ ఉందని పేర్కొన్నారు. తాను చిన్నతనంలో బిషన్ సింగ్ బేడీ వంటి భారతీయ క్రికెట్ దిగ్గజాలను చూస్తూ పెరిగానని, నాటి నుండి నేటి వరకు క్రికెట్ అనేది ఇరు దేశాలను కలిపి ఉంచే ఒక బలమైన శక్తిగా మారిందని చెప్పారు.

Publish Date: Jun 2, 2026 10:17AM

MOVIE NEWS