Top Stories

dummy

political-news-img

ఐపీఎల్‌ 2026.. జూనియర్ ధోని.. ముకుల్ చౌదరి

ఐపీఎల్ 2026 సీజన్ భారతీయ యువ క్రికెటర్ల అద్భుత ప్రదర్శనలకు వేదికగా నిలుస్తోంది. వైభవ్ సూర్యవంశీ, సమీర్ రిజ్వీ, ప్రియాంష్ ఆర్య, అంగ్‌క్రిష్ రఘువంశీ వంటి యువ ఆటగాళ్లు తమ దూకుడైన బ్యాటింగ్, బౌలింగ్‌తో సంచలనం సృష్టిస్తున్నారు. అన్‌క్యాప్డ్ ప్లేయర్లు, అండర్-19 ప్రతిభావంతులు మెగా లీగ్‌లో అనుభవజ్ఞులను అధిగమిస్తూ, కీలకమైన మ్యాచుల్లో విజయావకాశాలను మారుస్తూ రికీ పాంటింగ్ వంటి కోచ్‌ల ప్రశంసలు పొందుతున్నారు. తాజాగా ఐపీఎల్ ప్లాట్‌ఫారమ్‌పై లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ కుర్రాడు ముకుల్ చౌదరి అందరి దృష్టి ఆకర్షిస్తున్నాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 27 బంతుల్లోనే 54 పరుగులతో నాటౌట్‌‌గా నిలిచి లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌కు అనూహ్య వియజం అందించాడు. అందులో ఏకంగా 7 సిక్సర్లు ఉండటం విశేషం. కోల్‌కతా నైట్ రైడర్స్ గెలుపు ఖాయమని అనుకుంటున్న సమయంలో ఎల్ఎస్‌జీకి హీరోలా వచ్చాడు ముకుల్. పరుగుల దాహంలో విరాట్ కోహ్లీ.. ఫినిషర్‌లో ధోనిని తలపించేలా అద్భుతమైన షాట్లతో విరుచుకుపడుతూ.. కేకేఆర్ నుంచి గెలుపును సరదాగా లాగేసుకున్నాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాడు. ఈ 22 ఏళ్ల ముకుల్ చౌదరి స్వస్థలం రాజస్థాన్. తన కొడుకు క్రికెటర్ అవ్వాలని ముకుల్ తండ్రి ఎన్నో కలలు కనేవాడు. కానీ ఆర్థిక ఇబ్బందుల కారణంగా చిన్నతనం నుంచే ఆ దిశగా నడవలేకపోయాడు. ఎలాగైనా తన కుమారుడిని క్రికెటర్‌ని చేయాలనే పట్టుదలతో ముకుల్ తండ్రి.. తమ ఇంటినే అమ్మేసి ఎస్‌బీఎస్ అకాడమీలో చేర్పించాడు. అప్పటికి ముకుల్ వయసు 12 ఏళ్లు. అక్కడే దాదాపు ఐదేళ్లు శిక్షణ తీసుకున్నాడు. అక్కడ నుంచి జైపుర్ వెళ్లి నాలుగేళ్లపాటు ప్రాక్టీస్ చేశాడు. ఓసారి అండర్ 19 మ్యాచులో యూపీపై తన ఆటను చూసిన తర్వాత ముకుల్ తండ్రికి భరోసా వచ్చిందట. 2026 ఐపీఎల్ మినీ వేలంలో ముకుల్ బేస్ ప్రైజ్ రూ.30 లక్షలు. అతడిని లఖ్‌నవూ ఫ్రాంచైజీ ఏకంగా రూ.2.60కోట్లకు కొనుగోలు చేసింది. ఐపీఎల్‌లో ఇంత మంది ప్లేయర్లు ఉన్నప్పటికీ ఫినిషర్ అంటే ముందుగా ధోనినే గుర్తొస్తాడు. అయితే ఫినిషర్‌గా మ్యాచ్‌ను గెలిపించాలంటే తీవ్ర ఒత్తిడిని తట్టుకోవాల్సి ఉంటుంది. అలాంటి పాత్రలో వచ్చిన ముకుల్.. అద్భుతం చేసి చూపించాడు. 182 పరుగుల లక్ష్య ఛేదనలో 8వ వికెట్‌కు అవేశ్ ఖాన్‌తో కలిసి 24 బంతుల్లో 54 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అందులో ముకుల్ 21 బంతుల్లో 52 పరుగులు బాదేశాడు. అయితే ముకుల్ చౌదరికి ధోని అంటే చాలా ఇష్టమట. ధోనినే రోల్ మోడల్‌గా తీసుకుని క్రికెట్ అరంగేట్రం చేశాడట. అయితే ముకుల్ కూడా వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ కావడం కొసమెరుపు. ఈ మ్యాచ్‌లోనూ ధోనిలా ‘హెలికాప్టర్ షాట్’తో సిక్స్ బాదడం.. చివరి ఓవర్లో ఏకంగా రెండు సిక్సర్లు బాది జట్టును గెలిపించి సంచలనంగా మారాడు.

Publish Date: Apr 11, 2026 12:05AM

political-news-img

కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్ భర్త పరకాల ప్రభాకర్ జీరో బీజేపీ ప్రచారం

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఇంటి పోరు ముదురుతోంది. ఆమె భర్త పరకాల ప్రభాకర్ తమిళనాడు ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. ఇందుకోసం ఆయన జీరో బీజేపీ ఇనీషియేటివ్‌ చేపట్టడం గమనార్హం. చెన్నైలోని ప్రెస్ క్లబ్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీకి ఓటేస్తే.. సామాజిక న్యాయానికి పాడె కట్టడమేనన్నారు. రాష్ట్రంలోని బీజేపీని అడుగుపెట్టనీయవద్దని, ఒక్క సీటు కూడా వారికి ఇవ్వకుండా తమిళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పరకాల కోరారు. ఏప్రిల్ 23న జరగనున్న తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో బీజేపీ ఒక్క సీటు కూడా గెలవకూడదని అఖిల భారత ప్రజా ఉద్యమ తమిళనాడు సమన్వయ కమిటీ ఉద్ఘాటించింది. జీరో బీజేపీ ప్రచారాన్ని ప్రారంభించిన ఆ కమిటీ... 234 మంది సభ్యులున్న అసెంబ్లీలో బీజేపీకి ఒక్క సీటు కూడా దక్కకుండా చూడటమే లక్ష్యమని పేర్కొంది. ఈ కార్యక్రమ నిర్వాహకులలో ఒకరైన డాక్టర్ పరకాల ప్రభాకర్ మాట్లాడుతూ.. జీరో బీజేపీ ’ చాలా ముఖ్యమని, ఆ సిద్ధాంతాన్ని ప్రచారం చేసేందుకే తాను తమిళనాడుకు వచ్చానని పరకాల ప్రభాకర్ పేర్కొన్నారు. తమిళనాడు ప్రజలంతా ఈ సిద్ధాంతం వైపు నిలబడాలని పిలుపునిచ్చారు. బీజేపీకి వేసే ప్రతి ఓటు మన రాజ్యాంగ విలువలకు సమాధి కట్టుకోవడమేనన్నారు. ప బీజేపీకి ఓటేస్తే తమిళనాడులో మత సామరస్యం దెబ్బతింటుందని, వివిధ సామాజిక వర్గాలకు చెందిన ప్రజలు కలిసిమెలిసి జీవించలేరని అన్నారు. స్వేచ్ఛ, సమానత్వం నాశనమవుతాయని పరకాల హెచ్చరించారు.

Publish Date: Apr 10, 2026 11:55PM

political-news-img

మహిళల భద్రత కోసం షీ నేత్ర

మహిళల గోప్యతకు ముప్పుగా మారుతున్న రహస్య కెమెరాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు హైదరాబాద్ నగరంలో పోలీసులు కొత్త అడుగు వేశారు. ఈ నేపథ్యంలో మహిళా భద్రతకు మరింత బలం చేకూర్చేలా షీ నేత్ర పేరిట ప్రత్యేక తనిఖీ బృందాలను ఏర్పాటు చేశారు. నగర కమిషనరేట్ పరిధిలోని ఏడు జోన్లకు ఒక్కో బృందం చొప్పున మొత్తం ఏడు ప్రత్యేక టీమ్స్‌ను రంగంలోకి దించారు. బషీర్‌బాగ్‌లోని పాత కమిషనరేట్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఈ బృందాలకు అత్యాధునిక కెమెరా డిటెక్టర్ పరికరాలను అందజేశారు. రహస్య కెమెరాలు, స్పై కెమెరాలు, సెల్‌ఫోన్ కెమెరాలను గుర్తించగల ఈ పరికరాల సహాయంతో నగరవ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. షాపింగ్ మాల్స్‌లోని ట్రయల్ రూమ్స్, ఆస్పత్రులు, హోటళ్లు, హాస్టళ్లు, విద్యాసంస్థలు, వాణిజ్య సముదాయాల్లో మహిళల గోప్యతకు భంగం కలిగించే ఘటనలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని ఈ సందర్భంగా సజ్జనార్ హెచ్చరించారు. తమ ప్రాంగణాల్లో రహస్య కెమెరాలు లేవని నిర్ధారించుకోవడం ఆయా యాజమాన్యాల బాధ్యత అని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించినట్లయితే క్రిమినల్ కేసులు నమోదు చేసి అవసరమైతే సంస్థలను బ్లాక్‌లిస్ట్ చేసే చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి సంస్థ తప్పనిసరిగా కస్టమర్ సేఫ్టీ ఇన్‌చార్జ్ ను నియమించి, షీ టీమ్స్‌తో సమన్వయం చేసుకోవాలని సూచించారు. వీరికి పోలీసుల ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ అందించనున్నట్లు వెల్లడించారు. సాంకేతికత అభివృద్ధి చెందుతున్న వేగంతో పాటు దాని దుర్వినియోగం కూడా పెరుగుతోందనీ, సైబర్ నేరగాళ్లు మార్ఫింగ్, బ్లాక్‌మెయిలింగ్, ప్రమాదకర ఏపీకే ఫైల్స్ ద్వారా ప్రజలను మోసం చేస్తున్నారని తెలిపారు. హార్డ్‌వేర్ రూపంలో సీక్రెట్ కెమెరాల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా ఈ బృందాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.ఎక్కడైనా అనుమానాస్పద వస్తువులు కనిపిస్తే వెంటనే డయల్ 100/112 లేదా షీ టీమ్స్ హెల్ప్‌లైన్ 9490616555కు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు.

Publish Date: Apr 10, 2026 11:45PM

political-news-img

సలామి కోల్డ్ స్టోరేజ్‌ ఇండస్ట్రీపై పోలీసుల దాడి... కుళ్ళిన మాంసం స్వాధీనం

హైదరాబాద్ పాతబస్తి బాలాపూర్ ప్రాంతంలో ఉన్న సలామి ఇండస్ట్రీస్‌పై పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన దాడులు స్థానికంగా కలకలం రేపాయి. మదీనా కాలనీలో ఉన్న సలామి కోల్డ్ స్టోరేజ్‌ లో కుళ్ళిన మాంసాన్ని విక్రయిస్తున్నట్లుగా అందిన విశ్వసనీయ సమాచారం మేరకు బాలాపూర్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో కనీస పారిశుద్ధ్యం లేకుండా, మాంస వ్యర్థాలను నిల్వ ఉంచినట్లుగా అధికారులు గుర్తించారు. నిల్వ ఉంచిన మాంసం చాలా భాగం కుళ్లిపోయినట్లు అధికారులు నిర్ధారించారు. దాడుల్లో భాగంగా భారీ మొత్తంలో అపరిశుభ్ర మాంసం మరియు ఇతర వ్యర్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై సలామీ కోల్డ్ స్టోరేజీ ఇండస్ట్రీ యజమానిపై కేసు నమోదు చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఇలాంటి అక్రమ కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు అధికారులు తెలిపారు. బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇలాంటి మాంస పరిశ్రమలు మరెన్నో ఉన్నాయని, ఉన్నతాధికారులు దృష్టి సారిస్తే మరిన్ని దాడులు చేపట్టి ఇలాంటి అక్రమ యూనిట్లను మూసివేయడం సాధ్యమని స్థానికులు అంటున్నారు.

Publish Date: Apr 10, 2026 11:36PM

political-news-img

మంత్రులు, కార్యదర్శులు బాధ్యతగా ఉండాలి: చంద్రబాబు

క్యాబినెట్ అజెండా లీక్ అవుతోందంటూ చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన శుక్రవారం జరిగిన కేబినెట్ సమావేశంలో అజెండా లీక్ విషయంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు మంత్రులు కార్యదర్శులు బాధ్యతగా ఉండాలని హెచ్చరించారు. గతంలో బడ్జెట్ లీక్ అయితే 30 మంది మంత్రులు రాజీనామా చేశారని, ఎన్టీఆర్ ఎవరూ లేకుండా 15 రోజులు ప్రభుత్వాన్ని నడిపారని చంద్రబాబు గుర్తు చేశారు. అలాగే. పేపర్ లీక్ కేసులో గతంలో ఓ మంత్రి రాజీనామా చేసిన విషయాన్నీ ప్రస్తావించారు. ఇప్పుడు సాంకేతిక పెరిగిందనీ, ఎవరి నుంచి లీక్ అయ్యిందన్న విషయం సులభంగా గుర్తించవచ్చన్నారు. మంత్రులు, కార్యదర్శులు బాధ్యతగా ఉండాలని సీఎం చంద్రబాబు నాయుడు హెచ్చరించారు.

Publish Date: Apr 10, 2026 11:27PM

political-news-img

ఆవిర్భవిస్తున్న ప్రపంచ వ్యవస్థ: వ్యూహాత్మక వృద్ధి చోదకంగా భారత్.. స్థూల సమీక్ష

సంకలనం, సేకరణ : కంఠంనేని సీతారాం పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నడుమ ప్రపంచ వ్యవస్థ గణనీయమైన పరివర్తనకు లోనవుతున్న తరుణంలో, భారతదేశం (భారత్) ఆర్థిక వృద్ధికి కీలక చోదకంగా తనను తాను నిలబెట్టుకుంటోంది. దేశీయ రక్షణ తయారీ మరియు స్వదేశీకరణపై వేగంగా దృష్టి సారించడం ఈ ఆవిర్భావానికి ఒక ప్రధాన ఆధారం. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) ఇటీవలి పరిశీలనలు, భారత్ యొక్క రక్షణ వ్యూహం జాతీయ భద్రతను బలోపేతం చేయడమే కాకుండా, నిరంతర ఆర్థిక విస్తరణకు ఉత్ప్రేరకంగా ఎలా పనిచేస్తుందో స్పష్టం చేస్తున్నాయి. రక్షణ ఎగుమతులు: ఒక దశాబ్దపు అసాధారణ వృద్ధి గత దశాబ్ద కాలంలో భారత రక్షణ ఎగుమతులు గణనీయమైన వృద్ధిని సాధించాయి: 2016–17: ₹1,522 కోట్లు 2025–26 ఆర్థిక సంవత్సరం: ₹38,424 కోట్లు (~$4.1 బిలియన్లు) వృద్ధి: 25 రెట్లకు పైగా పెరుగుదల ఈ పెరుగుదల, దిగుమతులపై ఆధారపడటం నుండి ఎగుమతి ఆధారిత దేశీయ సామర్థ్యం వైపు జరిగిన నిర్మాణాత్మక మార్పును ప్రతిబింబిస్తుంది. ఇది ప్రపంచ రక్షణ మార్కెట్‌లో భారత్ ఒక వర్ధమాన శక్తిగా ఆవిర్భవించడాన్ని సూచిస్తుంది. ఐఎంఎఫ్ దృక్పథం: ఆర్థిక వృద్ధి కారకంగా రక్షణ వ్యయం అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) ప్రకారం, రక్షణ వ్యయాన్ని దిగుమతులకు కాకుండా దేశీయ ఉత్పత్తికి మళ్లించినప్పుడు దాని ఆర్థిక ప్రభావం గణనీయంగా ఎక్కువగా ఉంటుంది. కీలక అంతర్దృష్టులు అధిక ఉత్పాదక ప్రభావం: స్థానిక తయారీ రంగం ఆర్థిక వ్యవస్థలో బలమైన గుణకార ప్రభావాలను సృష్టిస్తుంది ఉద్యోగ కల్పన: దేశీయ పరిశ్రమల విస్తరణ సరఫరా గొలుసులంతటా ఉపాధికి మద్దతు ఇస్తుంది పెట్టుబడి ప్రోత్సాహం: ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని మరియు దీర్ఘకాలిక మూలధన నిర్మాణాన్ని ప్రోత్సహిస్తుంది బాహ్య అసమతుల్యతల తగ్గింపు: దిగుమతులతో ముడిపడి ఉన్న విదేశీ మారక ద్రవ్య ప్రవాహాలను పరిమితం చేస్తుంది సారాంశంలో, స్వదేశీకరణ ఆర్థిక ఉద్దీపన జాతీయ సరిహద్దుల్లోనే ఉండేలా చూస్తుంది, తద్వారా దాని వృద్ధి ప్రభావాన్ని పెంచుతుంది. వ్యూహాత్మక మార్పు: దిగుమతిదారు నుండి తయారీదారుగా **విదేశీ రక్షణ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి భారతదేశం ఈ క్రింది చర్యల ద్వారా ఉద్దేశపూర్వక విధాన మార్పును చేపట్టింది: స్థానిక తయారీ పర్యావరణ వ్యవస్థలను ప్రోత్సహించడం ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం సంయుక్త సంస్థలు మరియు సాంకేతిక భాగస్వామ్యాలను విస్తరించడం దేశీయంగా ఉత్పత్తి చేయబడిన రక్షణ వ్యవస్థల కోసం కేటాయింపులను పెంచడం ఈ పరివర్తన క్రమంగా భారత్‌ను స్వయం సమృద్ధి మరియు ఎగుమతి సామర్థ్యం గల రక్షణ ఆర్థిక వ్యవస్థగా మారుస్తోంది. ** ప్రపంచ సందర్భం: పెరుగుతున్న సైనిక వ్యయం ప్రపంచవ్యాప్తంగా రక్షణ వ్యయం పెరుగుతున్న తరుణంలో ఈ ఐఎంఎఫ్ నివేదిక వెలువడింది: ఇటీవలి సంవత్సరాలలో దాదాపు సగం దేశాలు తమ సైనిక బడ్జెట్‌లను పెంచాయి. ఈ ధోరణి, ప్రచ్ఛన్న యుద్ధానంతర క్షీణతకు విరుద్ధంగా ఉంది. పెరిగిన భౌగోళిక రాజకీయ అనిశ్చితులు దేశాలను వ్యూహాత్మక స్వావలంబన వైపు నడిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, భద్రతా ప్రాధాన్యతలను ఆర్థిక వృద్ధి లక్ష్యాలతో సమన్వయం చేయడం ద్వారా భారత్ విధానం ప్రత్యేకంగా నిలుస్తుంది. భారత్‌కు ఆర్థికపరమైన ప్రభావాలు భారత్ యొక్క రక్షణ-ఆధారిత పారిశ్రామిక వ్యూహం అనేక స్థూల ఆర్థిక ప్రయోజనాలను అందిస్తుంది: 1. నిరంతర వృద్ధి వేగం పారిశ్రామిక విస్తరణ ద్వారా దేశీయ తయారీ రంగం జీడీపీ వృద్ధిని బలపరుస్తుంది. 2. ఉపాధి కల్పన రక్షణ ఉత్పత్తి ఇంజనీరింగ్, తయారీ, లాజిస్టిక్స్ మరియు ఆర్&డి రంగాలలో ఉద్యోగాలను సృష్టిస్తుంది. 3. బలపడిన పారిశ్రామిక పునాది అత్యున్నత సాంకేతిక రంగాలలో దీర్ఘకాలిక సామర్థ్యాలను పెంపొందిస్తుంది. 4. బాహ్య స్థిరత్వం దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది, తద్వారా కరెంట్ అకౌంట్ ఒత్తిళ్లను తగ్గిస్తుంది. ముగింపు ప్రపంచ వ్యవస్థ పరిణామం చెందుతున్న కొద్దీ, భారతదేశం (భారత్) కేవలం ఒక భాగస్వామిగానే కాకుండా, భవిష్యత్ ఆర్థిక మరియు వ్యూహాత్మక చట్రాలను రూపొందించడంలో ఒక సంభావ్య నాయకురాలిగా ఆవిర్భవిస్తోంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) విశ్లేషణ ఒక కీలకమైన విషయాన్ని నొక్కి చెబుతోంది: రక్షణ రంగ స్వదేశీకరణ అనేది ఇకపై కేవలం ఒక భద్రతా అవసరం మాత్రమే కాదు—అది ఒక శక్తివంతమైన ఆర్థిక వ్యూహం. దేశీయ సామర్థ్య నిర్మాణంపై నిరంతరంగా దృష్టి సారించడం ద్వారా, ఆవిర్భవిస్తున్న బహుధ్రువ ప్రపంచంలో ఒక కీలక వృద్ధి చోదకంగా మారడానికి భారత్ సుసజ్జితంగా ఉంది.

Publish Date: Apr 10, 2026 9:58PM

MOVIE NEWS

movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img