political-news-img

సజ్జల భార్గవ్‌పై ఏపీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం

వైసీపీ సోషల్ మీడియా మాజీ ఇన్‌చార్జ్ సజ్జల బార్గవ్ రెడ్డి, ఇతర నిందితులపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర పదజాలంతో ఆగ్రహం వ్యక్తం చేసింది. సజ్జల బార్గవ్ రెడ్డి , ఇతర నిందితులది ఆనాగరిక, ఆటవిక ప్రవర్తన అని ఇతరుల గౌరవ ప్రతిష్ఠలను దెబ్బతీసే హక్కు ఎవరికీ లేదని హైకోర్టు స్పష్టం చేసింది. తనపై జారీ చేసిన ఎల్‌ఓసీని .. అంటే నిందితులు దేశం విడిచి పారిపోకుండా నిరోధించడానికి జారీ చేసే ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ సజ్జల భార్గవ్ రెడ్డి వేసిన పిటిషన్‌పై హైకోర్టులో శుక్రవారం (17-4-26) విచారణ జరిగింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రుల కుటుంబ సభ్యుల ప్రతిష్ఠకు భంగం కలిగించే పోస్టులు ఎలా పెడతారని న్యాయస్థానం ప్రశ్నించింది. వాక్ స్వాతంత్రం, భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు పరిమితులు ఉన్నాయని హైకోర్టు స్పష్టం చేసింది. దర్యాప్తును సక్రమంగా చేసి నిందితులకు శిక్షపడేలా చేయాలని పోలీసులను ఆదేశించింది. దర్యాప్తునకు సహకరించాలని పిటిషనర్‌కు ఆదేశాలు జారీ చేసింది. కోరినప్పుడు విచారణకు హాజరు అవుతానని అఫిడవిట్ వేయాలని న్యాయస్థానం ఆదేశించింది. ఎల్ఓసీని రీ కాల్ చేయాలని అన్నమయ్య జిల్లా ఎస్పీకి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అభ్యర్దన వచ్చిన వెంటనే ఎల్ఓసీని రద్దు చేయాలని ఇమిగ్రేషన్ అధికారులకు ఏపీ హై కోర్టు ఆదేశించింది.

Publish Date: Apr 17, 2026 10:07PM

political-news-img

మహిళలను బీజేపీ మోసం చేసింది : కవిత

లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రంగా స్పందించారు. శుక్రవారం సాయంత్రం విడుదల చేసిన ప్రకటనలో ఆమె భారతీయ జనతా పార్టీ పై ఘాటు విమర్శలు చేశారు. డీలిమిటేషన్ బిల్లుతో మహిళా రిజర్వేషన్ బిల్లును ముడిపెట్టడం వల్లే లోక్‌సభలో బిల్లు వీగిపోయిందని ఆమె పేర్కొన్నారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించే విషయంలో బీజేపీకి చిత్తశుద్ధి లేదని మరోసారి నిరూపితమైందని విమర్శించారు. ప్రతిపక్షాలు అడ్డుకుంటాయనే స్పష్టమైన అవగాహన ఉన్నప్పటికీ, కుట్రపూరితంగా రెండు బిల్లులను కలిపి పార్లమెంట్ ముందుకు తీసుకువచ్చారని కవిత ఆరోపించారు. ఈ చర్యతో ప్రతిపక్షాలన్నీ ఒక్కతాటిపైకి వచ్చి బిల్లును అడ్డుకున్నాయని తెలిపారు. రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ ఈ ప్రయత్నం చేసిందని ఆమె అన్నారు. నూతన పార్లమెంట్ భవనం ప్రారంభ సమయంలో ఉమెన్ రిజర్వేషన్ బిల్లును పాస్ చేసి, దానిని జనగణన (సెన్సెస్)కు అనుసంధానించారని గుర్తుచేశారు. ఇప్పుడు 2011 జనగణన ఆధారంగా మహిళా రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పడం ద్వారా మరోసారి మహిళలను వంచించారని విమర్శించారు. తెలుగు రాష్ట్రాల మహిళలు బీజేపీ మోసాన్ని గుర్తించాలని ఆమె పిలుపునిచ్చారు. పశ్చిమ బెంగాల్‌లో ఒక మహిళ నాయకత్వం వహిస్తున్న నేపథ్యంలో, ఆ రాష్ట్రంలో బీజేపీని ఓడించి ఆ మహిళను గెలిపించాలని తమ స్నేహితులకు చెప్పాలని కవిత సూచించారు.

Publish Date: Apr 17, 2026 9:54PM

political-news-img

రాజ్యాంగాన్ని మార్చే కుట్రను తిప్పికొట్టాం...ఇది మహిళా బిల్లు కాదు : రాహుల్

పార్లమెంటు వేదికగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో వీగిపోవడాన్ని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్వాగతించారు. ఇది కేవలం బిల్లు ఓటమి కాదని, భారత ప్రజాస్వామ్యం సాధించిన గొప్ప విజయమని ఆయన అభివర్ణించారు. రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను విపక్షాలు ఏకతాటిపైకి వచ్చి అడ్డుకున్నాయని ఆయన స్పష్టం చేశారు. ఓటింగ్ ముగిసిన అనంతరం రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మహిళా రిజర్వేషన్ల పేరుతో ప్రభుత్వం పెద్ద కుట్రకు తెరలేపిందని ఆయన ఆరోపించారు. ఈ బిల్లు ద్వారా డీలిమిటేషన్ ప్రక్రియను తెరపైకి తెచ్చి, దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాధాన్యతను తగ్గించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని రాహుల్ మండిపడ్డారు. "ప్రభుత్వం ప్రవేశపెట్టింది నిజమైన మహిళా బిల్లు కాదు, అది కేవలం డీలిమిటేషన్ బిల్లు మాత్రమే" అని రాహుల్ ఎద్దేవా చేశారు. మహిళా సాధికారత అనేది కేవలం ఒక సాకు మాత్రమేనని, నియోజకవర్గాల పునర్విభజన ద్వారా సీట్ల సంఖ్యను పెంచుకుని రాజకీయ లబ్ధి పొందడమే కేంద్రం అసలు లక్ష్యమని ఆయన విమర్శించారు. ఈ ప్రమాదాన్ని పసిగట్టే తాము ఐక్యంగా పోరాడి బిల్లును అడ్డుకున్నామని వెల్లడించారు. మహిళా రిజర్వేషన్ల పట్ల ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, 2023లో ఆమోదం పొందిన చట్టాన్ని తక్షణమే అమలు చేయాలని రాహుల్ డిమాండ్ చేశారు. దానికి డీలిమిటేషన్, జనగణన వంటి నిబంధనలను ముడిపెట్టి కాలయాపన చేయవద్దని సూచించారు. మహిళా కోటాకు, నియోజకవర్గాల పునర్విభజనకు ఎటువంటి సంబంధం ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు. ఈ పరిణామం 'ఇండియా' కూటమి ఐక్యతను చాటిచెప్పిందని రాహుల్ పేర్కొన్నారు. సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసే చర్యలను తాము ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు. కేంద్రం ఇప్పటికైనా మొండి వైఖరిని వీడి, దేశ ప్రయోజనాల కోసం ప్రతిపక్షాల సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని ఆయన హితవు పలికారు. కీలకమైన రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో వీగిపోవడంతో అటు విపక్షాల్లో హర్షం వ్యక్తమవుతుండగా, పార్లమెంట్ పరిసరాల్లో రాజకీయ సెగలు రాజుకున్నాయి. రాబోయే రోజుల్లో ఈ అంశం దేశ రాజకీయాల్లో ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి. మహిళా రిజర్వేషన్ల అమలుపై కేంద్రం తదుపరి అడుగు ఏంటనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Publish Date: Apr 17, 2026 9:32PM

political-news-img

కార్పొరేట్ ముసుగులో వ్యవస్థీకృత నేర సామ్రాజ్యం

ప్రముఖ ఐటీ దిగ్గజం టీసీఎస్కి చెందిన నాసిక్ బిపిఓ యూనిట్‌లో వెలుగుచూసిన షాకింగ్ ఉదంతం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. కార్పొరేట్ కార్యాలయాల్లో మహిళా భద్రతపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్న వేళ, నాసిక్ మహిళా పోలీసులు నిర్వహించిన ఒక రహస్య ఆపరేషన్ ద్వారా అక్కడ జరుగుతున్న అక్రమాలు బయటపడ్డాయి. లైంగిక వేధింపులే కాకుండా, బలవంతపు మత మార్పిడిలు, గూమింగ్, అంతర్జాతీయ హ్యూమన్ ట్రాఫికింగ్ నెట్‌వర్క్, టెర్రర్ ఫండింగ్ లాంటి తీవ్రమైన అంశాలు ఈ కేసులో ముడిపడి ఉన్నట్లు ప్రాథమిక ఆధారాలు లభించాయి. ఈ కేసు దర్యాప్తులో నాషిక్ మహిళా పోలీసులు అత్యంత సాహసోపేతంగా అండర్ గ్రౌండ్ ఆపరేషన్ నిర్వహించి ఆధారాలతో సహా బయటపెట్టారు. సుమారు ఏడెనిమిది మంది మహిళా కానిస్టేబుళ్లు సాధారణ ఉద్యోగులుగా, హౌస్ కీపింగ్ సిబ్బందిగా వేషాలు మార్చుకుని టీసీఎస్ యూనిట్‌లోకి ప్రవేశించారు. దాదాపు రెండు నుంచి మూడు వారాల పాటు అక్కడే ఉండి, కార్యాలయంలోని పరిస్థితులను, మహిళా ఉద్యోగులపై జరుగుతున్న మానసిక, శారీరక వేధింపులను వారు ప్రత్యక్షంగా గమనించి, ఆధారాలు సేకరించారు. ఈ అండర్ కవర్ ఆపరేషన్ ద్వారా సేకరించిన పక్కా ఆధారాలతోనే పోలీసులు నిందితులకు ఉచ్చు బిగించారు. ఈ కేసులో ఒక పద్దతి ప్రకారం నేరాలు జరుగుతున్నాయని పోలీసులు గుర్నించారు. ముఖ్యంగా చిన్న పట్టణాల నుండి మొదటిసారి కార్పొరేట్ ఉద్యోగాల్లోకి వచ్చే హిందూ యువతులను లక్ష్యంగా చేసుకుని ఈ గూమింగ్ గ్యాంగ్ పనిచేస్తున్నట్లు తేచ్చారు. హెచ్ఆర్, టీమ్ లీడ్ స్థాయిల్లో ఉన్న కొందరు వ్యక్తులు తొలుత మార్గదర్శకత్వం పేరిట యువతులకు దగ్గరై, ఆపై వారిని మానసిక ఒత్తిడికి గురిచేసి లైంగికంగా వాడుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇమ్రాన్ అనే వ్యక్తి వీడియో కాల్స్ ద్వారా యువతులకు బ్రెయిన్ వాష్ చేస్తూ మత మార్పిడికి ప్రేరేపిస్తున్నట్లు పోలీసులు ఎఫ్ఐఆర్ లో నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసులో దర్యాప్తు వేగవంతమైంది. ఇప్పటివరకు లైంగిక దాడికి సంబంధించి 9 కేసులు, బలవంతపు మత మార్పిడికి సంబంధించి 2 కేసులు నమోదయ్యాయి. బాధితులకు కౌన్సెలింగ్ ఇస్తున్న కొద్దీ మరిన్ని కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయనీ.. త్వరలోనే మరికొన్ని కేసులు నమోదయ్యే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. ఈ కేసులో కేవలం స్థానిక నేరస్తులే కాకుండా, విదేశీ శక్తుల ప్రమేయం కూడా ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాధితులను మలేషియా వంటి దేశాలకు తరలించే ప్రణాళిక ఉందా అన్న కోణంలో దర్యాప్తు సాగుతోంది. మరోవైపు ఈ ఘటనపై కార్పొరేట్ బాధ్యతపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. టీసీఎస్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలో ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోవడం యాజమాన్య వైఫల్యమేనన్న విమర్శలూ వెల్లువెత్తుతున్నాయి. సంస్థలోని అంతర్గత మహిళా భద్రతా కమిటీలు ఏం చేస్తున్నాయని సామాజిక కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా ఈ కేసుపై దృష్టి సారించాయి, ముఖ్యంగా టెర్రర్ ఫండింగ్ వంటి కోణాలు ఉన్నాయా అన్న కోణంలో వారు దర్యాప్తు చేస్తున్నారు. మరో వైపు రాజకీయంగా కూడా ఈ అంశం వేడెక్కింది. గత ప్రభుత్వాల హయాంలో ఇటువంటి ఫిర్యాదులను నిర్లక్ష్యం చేశారని.. ప్రస్తుత ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాల ద్వారా నిజాలను వెలికితీస్తోందని బీజేపీ నేతల వ్యాఖ్యలు రాజకీయ వేడిని రగులుస్తున్నాయి. కార్పొరేట్ కార్యాలయాల్లో మహిళలకు రక్షణ కల్పించడంతో పాటు, ఇలాంటి గూమింగ్ ముఠాల ఆటకట్టించడానికి కఠినమైన నిబంధనలు తీసుకురావాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Publish Date: Apr 17, 2026 9:30PM

political-news-img

లోక్‌సభలో వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు

లోక్‌సభలో వీగిపోయిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు విపక్షాల ఐక్యతతో కేంద్రానికి చుక్కెదురు! మెజారిటీ లేక చతికిలబడ్డ కేంద్రం. భారత పార్లమెంటరీ చరిత్రలో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో వీగిపోయింది. నియోజకవర్గాల పునర్విభజన (డెలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ల అమలు దిశగా ప్రతిపాదించిన ఈ బిల్లుకు అవసరమైన మూడింట రెండొంతుల మెజారిటీ లభించకపోవడంతో సభలో ఆమోదం పొందలేదు. విపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చి బిల్లును వ్యతిరేకించడంతో మోదీ ప్రభుత్వానికి ఇది పెద్ద ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. ఓటింగ్ ప్రక్రియలో భాగంగా బిల్లుకు అనుకూలంగా 278 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 211 ఓట్లు పడ్డాయి. రాజ్యాంగ సవరణ జరగాలంటే కనీసం 362 మంది సభ్యుల మద్దతు అవసరం. అయితే, మిత్రపక్షాల సహకారం ఉన్నప్పటికీ, మేజిక్ ఫిగర్‌ను అందుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది. ఈ బిల్లు ద్వారా లోక్‌సభ స్థానాల సంఖ్యను 850కి పెంచాలని, 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన పునర్విభజన చేపట్టాలని కేంద్రం భావించింది. ఈ చర్చలో పాల్గొన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. జనాభా నిష్పత్తికి అనుగుణంగా ప్రాతినిధ్యాన్ని కల్పించడమే ఈ బిల్లు ఉద్దేశమని స్పష్టం చేశారు. దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయం జరగదని, సీట్ల సంఖ్య పెరగడం వల్ల అన్ని ప్రాంతాలకు మేలు జరుగుతుందని భరోసా ఇచ్చారు. మహిళా రిజర్వేషన్లను 2029 నుంచి అమలు చేయాలంటే ఈ సవరణలు తప్పనిసరని ఆయన పేర్కొన్నారు. అయితే, విపక్ష నేత రాహుల్ గాంధీ ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించారు. ఇది మహిళా రిజర్వేషన్ల కోసం కాదని, దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసే కుట్ర అని ఆరోపించారు. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని తగ్గించి, కొన్ని ప్రాంతాలకే ప్రాధాన్యత కల్పించేలా ఈ డెలిమిటేషన్ ప్రక్రియ ఉందని ఆయన విమర్శించారు. సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసే ఇలాంటి చర్యలను అడ్డుకుంటామని స్పష్టం చేశారు. దక్షిణాది రాష్ట్రాల నుంచి గట్టి నిరసన వ్యక్తమవుతోంది. జనాభా నియంత్రణ పాటించినందుకు తమకు సీట్లు తగ్గించి శిక్ష వేస్తారా? అని తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి రాష్ట్రాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే విపక్ష ‘ఇండియా’ కూటమి సభ్యులు భారీగా తరలివచ్చి ఓటింగ్‌లో పాల్గొని బిల్లును తిరస్కరించారు. బిల్లు వీగిపోవడంతో ఇప్పుడు మహిళా రిజర్వేషన్ల అమలుపై సందిగ్ధత నెలకొంది. ప్రభుత్వం మళ్లీ ఏ రూపంలో ఈ బిల్లును ముందుకు తెస్తుందో అన్నది ఆసక్తికరంగా మారింది. రానున్న రోజుల్లో నియోజకవర్గాల పునర్విభజన అంశం దేశ రాజకీయాల్లో మరిన్ని ప్రకంపనలు సృష్టించే అవకాశం కనిపిస్తోంది. ప్రభుత్వం ఈ విషయంలో ఏకాభిప్రాయ సాధనకు ప్రయత్నిస్తుందా లేక ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతుందా అన్నది వేచి చూడాలి.

Publish Date: Apr 17, 2026 8:58PM

political-news-img

చైనా ఆర్థిక సంక్షోభం: ప్రజల కోసం ఉన్న వ్యవస్థలే ఇప్పుడు భారమా?

చైనా ఆర్థిక వ్యవస్థలో కనిపిస్తున్న ప్రస్తుత పరిస్థితులు సాధారణ మందగమనం కంటే ఎక్కువగా, ఒక లోతైన వ్యవస్థాత్మక సంక్షోభాన్ని సూచిస్తున్నాయి. అధికారిక గణాంకాలు వృద్ధిని చూపుతున్నప్పటికీ, నేలమీద వాస్తవ పరిస్థితులు పూర్తిగా భిన్నంగా కనిపిస్తున్నాయి. జీతాలు చెల్లించకపోవడం, బ్యాంకుల్లో డబ్బు ఉపసంహరణపై ఆంక్షలు, ఆసుపత్రుల మూసివేత, కట్టుదిట్టమైన నియంత్రణలు—ఇవి అన్నీ ప్రజలపై ఒత్తిడి పెరుగుతోందనే సంకేతాలు. ప్రజలను రక్షించాల్సిన బ్యాంకులు, ఆసుపత్రులు, ప్రభుత్వ సంస్థలే ఇప్పుడు ప్రజల నుంచే వనరులను పీల్చే యంత్రాలుగా మారుతున్నాయనే భావన బలపడుతోంది. ఆరోగ్య రంగంలో విరుద్ధ దృశ్యం స్పష్టంగా కనిపిస్తోంది. వైద్య సేవలకు డిమాండ్ తగ్గకపోయినా, చిన్న మరియు మధ్యస్థ ఆసుపత్రులు ఆర్థిక ఇబ్బందులతో మూతపడుతున్నాయి. కొన్ని ప్రభుత్వ ఆసుపత్రులూ ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. మెడికల్ ఇన్సూరెన్స్ నిధులు ఖాళీ కావడం, రీయింబర్స్మెంట్లు ఆలస్యం కావడం, క్యాష్ ఫ్లో సమస్యలు—ఇవి ప్రధాన కారణాలు. ఫలితంగా, పెద్ద నగరాల్లో ఆసుపత్రులు రద్దీగా ఉండగా, చిన్న పట్టణాల్లో వైద్య సేవలు దొరకని పరిస్థితి ఏర్పడుతోంది. బ్యాంకింగ్ వ్యవస్థలో కూడా పెద్ద మార్పులు కనిపిస్తున్నాయి. డబ్బు తీసుకోవడానికే కస్టమర్లపై విచారణలు, అదనపు డాక్యుమెంట్లు, యాంటీ-ఫ్రాడ్ తనిఖీలు పెరుగుతున్నాయి. కొన్ని సందర్భాల్లో డిపాజిట్లు మాయమయ్యాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. చెడు రుణాల ఒత్తిడి, బ్రాంచుల మూసివేతతో బ్యాంకులు సేవల కేంద్రాలుగా కాకుండా, తమను తాము కాపాడుకునే కోటలుగా మారుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. మత సంస్థల పరిస్థితి కూడా మారుతోంది. ఆలయాలపై కట్టుదిట్టమైన నియంత్రణలు పెరుగుతూ, కొన్ని చోట్ల మూసివేతలు, భద్రతా చర్యలు అమలు చేస్తున్నారు. ఆలయాల ఆదాయాలు—విరాళాలు, టూరిజం, అద్దెలు—ప్రభుత్వ ఖజానాకు మళ్లుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. దీంతో విశ్వాస కేంద్రాలు కూడా ఆర్థిక వనరుల కేంద్రాలుగా మారుతున్నాయనే అభిప్రాయం పెరుగుతోంది. ఉద్యోగ మార్కెట్‌లో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. దిగువ స్థాయిలో నెలకు 800–1000 యువాన్‌ల జీతాలు కూడా జీవన వ్యయాలకు సరిపోవడం లేదు. పై స్థాయిలో ఉన్నత చదువులు చేసిన యువత కూడా తక్కువ జీతాల “సేఫ్” ఉద్యోగాల వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రైవేట్ రంగం మందగమనం, “35 ఏళ్ల లోపు” అనే వయస్సు పరిమితి వంటి అంశాలు యువత ఆశయాలను దెబ్బతీస్తున్నాయి. ఇంతవరకు సురక్షితంగా భావించిన ప్రభుత్వ అనుబంధ సంస్థలలో కూడా సమస్యలు బయటపడుతున్నాయి. కొన్ని చోట్ల ఉద్యోగులకు రెండేళ్ల వరకు జీతాలు బకాయి ఉన్న ఘటనలు వెలుగులోకి వచ్చాయి. దీంతో “గవర్నమెంట్ జాబ్ అంటే సేఫ్” అనే నమ్మకం కూడా కదిలిపోతోంది.“స్టెబిలిటీ” కోసం ప్రజలు చెల్లిస్తున్న ధర కూడా పెరుగుతోంది. కొన్ని ఉద్యోగాల కోసం ఒక సంవత్సరం జీతానికి సమానమైన ఫీజులు చెల్లిస్తున్న ఉదాహరణలు ఉన్నాయి. తక్కువ జీతం ఉన్నా, భద్రత కోసం ఉద్యోగాలను కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. గిగ్ వర్క్ రంగంలో ఆదాయం పడిపోవడం, పూర్తి సమయం పనిచేసినా తక్కువ సంపాదన రావడం సాధారణమైంది. నిరాశ్రయుల సంఖ్య పెరుగుతున్నదీ, ముఖ్యంగా యువతలో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తున్నదీ ఆందోళన కలిగిస్తోంది.విదేశాలకు వెళ్లే మార్గాలు కూడా కష్టతరమవుతున్నాయి. విదేశాల్లో పనిచేస్తున్న వారు తిరిగి రావడానికి ఇష్టపడకపోవడం, ప్రయాణ ఖర్చులు పెరగడం వంటి కారణాలతో ప్రజలు దేశంలోనే ఇరుక్కుపోతున్నారు. ఈ మొత్తం పరిణామాలు ఒకే దిశగా సూచిస్తున్నాయి—ప్రజలను రక్షించాల్సిన వ్యవస్థలే ఇప్పుడు వ్యవస్థను కాపాడుకోవడానికి ప్రజల నుంచే వనరులు పీల్చే దిశగా మారుతున్నాయనే భావన బలపడుతోంది. ఆరోగ్యం, బ్యాంకింగ్, ఉద్యోగాలు, మతం—ఇవి భద్రత కలిగించే బఫర్లుగా కాకుండా, రిస్క్‌ను ప్రజలపైకి నెట్టే మార్గాలుగా మారుతున్నాయనే ఆందోళన పెరుగుతోంది. చివరగా మిగిలే ప్రశ్న ఒక్కటే: భవిష్యత్తు తెరుచుకుంటోందా… లేక నిశ్శబ్దంగా మూసుకుపోతుందా? సంకలనం, సేకరణ : సీతారాం కంఠమనేని

Publish Date: Apr 17, 2026 8:47PM

MOVIE NEWS

movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img