ఏపీ శాసనమండలి చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం?!
Publish Date:Apr 25, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర శాసన మండలి చైర్మన్ మోషేన్ రాజుపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. చైర్మన్ వ్యవహరిస్తున్న తీరు.. ముఖ్యంగా సభ్యుల రాజీనామాల విషయంలో అనుసరిస్తున్న విధానాలపై తీవ్ర అసంతృప్తి నెలకొన్న నేపథ్యంలో.. ఆయనను పదవి నుంచి తొలగించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ అంశంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పార్టీ ముఖ్య నేతలతో సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. వైసీపీకి చెందిన పలువురు ఎమ్మెల్సీలు ఆ పార్టీని వీడి టీడీపీ, జనసేన, బీజేపీల్లో చేరారు. వీరిలో కొందరు తమ సభ్యత్వాలకు రాజీనామాలు చేశారు. అయితే, నిబంధనల ప్రకారం రాజీనామాలు సమర్పించినా.. చైర్మన్ వాటిని ఆమోదించకుండా పెండింగ్లో పెడుతున్నారని ఎమ్మెల్సీలు ఆరోపిస్తున్నారు. ఇటీవలే ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ సమర్పించిన రాజీనామాను సరైన ఫార్మాట్లో లేదని, సహేతుక కారణాలు చూపలేదని పేర్కొంటూ చైర్మన్ తిరస్కరించడం రాజకీయంగా దుమారం రేపింది. తెలుగుదేశంఎమ్మెల్సీలు ఈ విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న చైర్మన్, నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సింది పోయి.. వైసీపీ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారని వారు ఆరోపించారు. గతంలోనే బల్లి కళ్యాణ్ చక్రవర్తి, పోతుల సునీత వంటి నేతలు చైర్మన్ పై అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇచ్చినప్పటికీ.. అవి కార్యరూపం దాల్చలేదు. రానున్న శాసన మండలి సమావేశాల్లో ఈ తీర్మానాలపై చర్చ జరిగేలా చూడాలని కూటమి నేతలు పట్టుబడుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ వ్యవహారంపై ఆచితూచి స్పందించారు. చైర్మన్ పదవి అత్యున్నతమైనదనీ.. ఆ స్థానాన్ని గౌరవించాలని పేర్కొన్న ఆయన.. సభ్యులకు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే హక్కు ఉంటుందని, అందులో ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. విడివిడిగా కాకుండా, అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్సీలందరూ కలిసి ఒక ఉమ్మడి తీర్మానాన్ని ప్రవేశపెడితే బాగుంటుందని చంద్రబాబు సూచించినట్లు తెలుస్తోంది. దీనిపై సమగ్రంగా చర్చించి, పకడ్బందీగా ముందుకు వెళ్లాలని కూడా ఆయన దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. అవిశ్వాస తీర్మానం అనేది కేవలం ఒక ప్రక్రియ మాత్రమే కాకుండా, మండలిలో తమ పట్టును నిరూపించుకునే అవకాశంగా కూటమి ప్రభుత్వం భావిస్తోంది. ఒకవేళ తీర్మానం వీగిపోతే వైసీపీ దీనిని రాజకీయంగా వాడుకునే ప్రమాదం ఉందనీ, అందుకే ఎక్కడా పొరపాట్లు జరగకుండా జాగ్రత్త వహించాలని చంద్రబాబు కూటమి సభ్యులకు సూచించినట్లు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ శాసన మండలి వేదికగా రాజకీయ సమీకరణాలు వేగంగా మారే అవకాశాలున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఇక జయమంగళ వెంకటరమణతో పాటు మరి కొందరు ఎమ్మెల్సీల రాజీనామాలు సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మర్రి రాజశేఖర్, పోతుల సునీత, కర్రి పద్మశ్రీ వంటి వారి రాజీనామాలను కూడా పరిశీలనలోనే ఉంచడం వెనుక రాజకీయ కారణాలున్నాయని కూటమి నేతలు భావిస్తున్నారు. ఈ పరిస్థితిని ఇలాగే కొనసాగనిస్తే మండలిలో సంఖ్యాబలం విషయంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని, అందుకే చైర్మన్ మార్పు అనివార్యమని వారు పట్టుబడుతున్నారు.
http://www.teluguone.com/news/content/noconfidence-motion-against-ap-legislative-council-chairman-45-218230.html




