కార్మికుల కోసం ఇక లేబర్ అడ్డాలు : సీఎం చంద్రబాబు
Publish Date:May 1, 2026
Advertisement
కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్రంలో లేబర్ అడ్డాలను ఏర్పాటు చేస్తున్నామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. తొలివిడతలో వివిధ నగరాలు, పట్టణ ప్రాంతాల్లో 15 చోట్ల ఈ లేబర్ అడ్డాల నిర్మాణం చేపడతామని ఆయన స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా పమిడిముక్కల వద్ద ఏర్పాటు చేసిన ప్రజా వేదిక సభకు హాజరైన ముఖ్యమంత్రి అత్యుత్తమ సేవలు అందించిన కార్మికులకు, ఉత్తమ యాజమాన్యాలకు శ్రమశక్తి పురస్కారాలను అందజేశారు. అనంతరం ప్రజలను, కార్మికులను ఉద్దేశించి ప్రసంగించారు. లేబర్ అడ్డాలను స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లుగా అభివృద్ధి చేస్తామని అన్నారు. పని లేని రోజు ఈ కేంద్రాల్లో నైపుణ్యం పెంచుకునేలా శిక్షణ ఇస్తామని వివరించారు. అత్యాధునిక పనిముట్లతో తొలిదశలో 15 నగరాల్లో లేబర్ అడ్డాలు ఏర్పాటు చేస్తామని అన్నారు. అచ్యుతాపురం, గుంటూరు, కర్నూలుతో పాటు శ్రీసిటీతో పాటు అమరావతిలోనూ కొత్తగా ఈఎస్ఐ ఆస్పత్రులు ఏర్పాటు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు. అందరూ ఆరోగ్యంగా ఉండాలన్నదే తమ లక్ష్యమని అన్నారు. కార్మికుడి కష్టం లాగే రాష్ట్రాభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్నామని సీఎం వివరించారు. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఏపీకి పునర్వైభవాన్ని తీసుకు వస్తామని స్పష్టం చేశారు. కూటమి ప్రజా ప్రభుత్వానికి మద్దతు తెలిపిన పేదల రుణం తీర్చుకునేందుకు రాత్రీ పగలు శ్రమిస్తున్నామని అన్నారు. తెలుగు దేశం పార్టీ గుర్తులోనే నాగలి, కార్మికుడు, గుడిసె లాంటి చిహ్నాలు ఉన్నాయని.. పసుపు రంగు శుభసూచకమని ఆయన వివరించారు. కార్మికుల పిల్లలూ పరిశ్రమలు స్థాపించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నట్టు సీఎం తెలిపారు. కార్మిక సంక్షేమ పథకాలకు మళ్లీ జీవం పోశామని ముఖ్యమంత్రి తెలిపారు. నిర్మాణ రంగంలో ఉన్న కార్మికుడి వివాహ ఖర్చుకు రూ.25 వేలు ఇస్తున్నామని.. కార్మికుడి కుమార్తెకు కూడా ఈ పథకం వర్తిస్తుందని తెలిపారు. వారికి సంతానం కలిగితే రూ.20 వేలు ఆర్ధిక సాయం చేస్తున్నామని అన్నారు. సాధారణ మరణానికి రూ.60 వేలు...అంత్యక్రియలకు రూ.20 వేలు అందిస్తామన్నారు. వివాదాల పరిష్కారానికి 4 కార్మిక కోర్టులు అందుబాటులో ఉన్నాయన్నారు. త్వరలో బందరు పోర్టు కార్యకలాపాలు ప్రజా ప్రభుత్వం పాలనలో ప్రజల సంతోషాన్ని చూసి కష్టాన్ని మర్చిపోతున్నామని ముఖ్యమంత్రి అన్నారు. పెన్షన్ల పంపిణీని భారంగా చూడటం లేదని బాధ్యతగా భావిస్తున్నానని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. 62.47 లక్షల మందికి ప్రతీ నెలా అందిస్తున్నామని గడచిన 22 నెలల్లో రూ.63 వేల కోట్లకు పైగా ఖర్చు చేశామన్నారు. ప్రతీ నెలా రూ.2,721 కోట్ల చొప్పున ఏడాదికి రూ.33 వేల కోట్లు మేర వ్యయం చేస్తున్నామని దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఇంత పెద్దమొత్తంలో సంక్షేమం కోసం ఖర్చు చేయటం లేదన్నారు. గత పాలకుల నిర్వాకం కారణంగా పోలవరం డయాఫ్రామ్ వాల్ దెబ్బతిందని ప్రస్తుతం వెయ్యి కోట్లతో నిర్మాణం పూర్తి చేశామని అన్నారు. 2027 పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామన్నారు. కృష్ణా పుష్కరాల నాటికి కృష్ణా జిల్లాకు నీటి ఎద్దడి లేకుండా చేస్తామని వివరించారు. 13 ఏళ్ల క్రితం నిర్మించిన పట్టి సీమ ఎత్తిపోతలతో కృష్ణా డెల్టాకు నీటి ఎద్దడి లేకుండా పంటలు వస్తున్నాయని తెలిపారు. బందరు పోర్టుకు 2014లో భూసేకరణ చేశామని..గత పాలకులు 2019లో టెండర్లు రద్దు చేసి గందరగోళం సృష్చించారని అన్నారు. ప్రస్తుతం బ్రేక్ వాటర్, డ్రెడ్జింగ్, ఆఫ్ షోర్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. ఈ ఏడాది డిసెంబర్ కు బందరు పోర్టు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ముఖ్యమంత్రి వివరించారు. హైదరాబాద్- మచిలీపట్నం హైవే ఎక్స్ ప్రెస్ రోడ్డుగా అభివృద్ధి చెందుతోందని అన్నారు. భారత్ మాలా పరియోజన కింద కేంద్రం రూ.574 కోట్లతో రోడ్లను విస్తరిస్తోందని అన్నారు. మచిలీపట్నం బైపాస్ రోడ్డు 2 లేన్ల నుంచి 6 లేన్లుగా నిర్మించటంతో పాటు బీచ్ రోడ్డును కూడా విస్తరిస్తున్నామని అన్నారు. విశాఖకు గూగుల్ లాంటి అతిపెద్ద పెట్టుబడి వచ్చిందని త్వరలో రిలయన్స్ కూడా 17 బిలియన్ డాలర్లతో డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకు వచ్చిందన్నారు. గొడ్డలి పార్టీకి మానసిక సమస్యలు విపక్షంలో ఉన్నది వైసీపీ కాదని గొడ్డలి పార్టీ అని ముఖ్యమంత్రి ఎద్దేవా చేశారు. నేర ప్రవృత్తిలో ఉన్న వ్యక్తులు రాజకీయాలకు పనికిరారని అన్నారు. వైసీపీ అధినేతకు మానసిక సమస్య ఉందని.. ప్రజా ధనంతో ప్రజా వేదికను నిర్మిస్తే రెండు గంటల్లో కూల్చేశారని అన్నారు. తాము అభివృద్ధి చేస్తే ఆ పార్టీ అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని విధ్వంసం చేసిందన్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక గడచిన 22 నెలలుగా విధ్వంసమైన వ్యవస్థల్ని పునర్నిర్మిస్తూ ఏపీకి పునర్వైభవం తీసుకువస్తున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టు గానే విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తున్నామని...విద్యుత్ ఛార్జీలను పెంచబోమని మరోమారు స్పష్టం చేశారు. గత పాలకులు 9 సార్లు ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం మోపారని అన్నారు. ప్రజా ప్రభుత్వం చాలా పారదర్శకంగా పనిచేస్తోందని.. ప్రజలు ఇచ్చే సహకారమే పెద్ద శక్తిగా సుపరిపాలన అందిస్తున్నట్టు తెలిపారు. పంచాయితీరాజ్ లో పవన్ కల్యాణ్ మార్పులు తెచ్చారని.. విద్యా వ్యవస్థలో మంత్రి లోకేష్ సంస్కరణలు తెచ్చి పదో తరగతిలో విద్యార్ధులు మంచి ఫలితాలను సాధించేలా చేశారని అన్నారు. ఇక నుంచి ప్రతీ సమావేశంలోనూ ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజల నుంచి సమాచారం అడుగుతామని సీఎం అన్నారు. టీమ్ లీడర్ గా ప్రజాప్రతినిధులు, అధికారులు సహకరిస్తేనే మొత్తంగా ప్రభుత్వానికి మంచిపేరు వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమానికి మంత్రులు కొల్లు రవీంద్ర, వాసంశెట్టి సుభాష్, ఎంపీ బాలశౌరి తదితరులు హాజరయ్యారు.
http://www.teluguone.com/news/content/may-day-36-218726.html





