ఓఆర్ఆర్పై ఘోర రోడ్డు ప్రమాదం ఆరుగురు మృతి
Publish Date:May 1, 2026
Advertisement
శంషాబాద్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఒక కార్లో ఏడుగురు వ్యక్తులు సరదాగా మాట్లాడుకుంటూ వస్తున్న సమయంలో శంషాబాద్ సమీపంలోని ఆర్ఆర్ ఎగ్జిట్ 16 వద్ద ఆగి ఉన్న లారీని అత్యంత వేగంగా వచ్చి వెనుక నుంచి ఢీ కొట్టారు. దీంతో కారు మొత్తం ధ్వంసం అయింది. TS23F2298 గల కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఢీ కొట్టిన తీవ్రత ఎక్కువగా ఉండడంతో కారులోపల ప్రయాణం చేస్తున్న ఆరుగురి వ్యక్తులు రోడ్డుమీద చెల్లా చెదురుగా పడిపోయి ప్రాణాలు కోల్పోయారు.. అది చూసిన వాహనదారులు భయభ్రాంతులకు గురై వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించారు. సమాచారం అందుకున్న ఔటర్ రింగ్ రోడ్డు సిబ్బంది, పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. తీవ్ర గాయాలైన వ్యక్తిని సమీపంలోని హాస్పిటల్ కి తరలించారు. కానీ అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా వైద్యులు వెల్లడించారు. ప్రమాదంలో మృతి చెందిన ఆరు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. ప్రాథమిక విచారణలో డ్రైవర్ నిద్ర మత్తులో ఉండడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. డ్రైవర్ కునుకు పట్టడంతో ముందు ఉన్న లారీని గుర్తించలేక ఢీకొట్టినట్లుగా భావిస్తున్నారు. ఈ ఘటనతో మృతుల కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి. ఈ ఘటనను చూసి పలువురు కంటతడి పెట్టుకున్నారు. ఈ ఘటనలో మృతి చెందిన వారి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. శంషాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగించారు..
http://www.teluguone.com/news/content/fatal-road-accident-on-outer-ring-road-36-218746.html





