Top Stories

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులు ముగింపు దశకు వస్తుండటం, వారాంతం కావడంతో తిరుమల గిరులు భక్త జనసంద్రంగా మారాయి.  ఆదివారం (జూన్ 1) శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మంట్లన్నీ నిండిపోయి క్యూ లైన్ శిలా తోరణం వరకూ సాగింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక శనివారం (మే 31) రికార్డు స్థాయిలో భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. శనివారం శ్రీవారిని మొత్తం 95 వేల 80 మంది శ్రీవారిని దర్శించుకోగా వారిలో 39 వేల 668 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండా కానుకల ఆదాయం 3 కోట్ల 47లక్షల రూపాయలు వచ్చింది.  
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ Publish Date: Jun 1, 2025 9:09AM

మల్లంపల్లి మండలానికి బీఆర్ఎస్ నేత పేరు.. మాట నిలబెట్టుకున్న మంత్రి సీతక్క

రాజకీయం అంటే ప్రత్యర్థులపై కేసులు, ప్రతీకార చర్యలు, కక్ష సాధింపులుగా మారిపోయిన నేటి రోజులలో ఓ నాయకురాలు మాత్రం అందుకు భిన్నంగా నిలిచారు. ప్రత్యర్థి పార్టీకి చెందిన నాయకుడు చేసిన సేవలను గుర్తించి ఒక మండలానికి ఏకంగా ఆయన పేరునే ప్రతిపాదించి ఆదర్శప్రాయంగా నిలిచారు. ఔను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంత్రి సీతక్క ప్రతిపాదనను గౌరవించి ఓ మండలానికి ప్రతిపక్ష పార్టీ నాయకుడి పేరు పెట్టింది.    ములుగు జిల్లాలో కొత్తగా ఏర్పడిన మల్లంపల్లి మండలం పేరును జేడీ మల్లంపల్లిగా రాష్ట్ర ప్రభుత్వం మార్పు చేస్తూ శనివారం (మే 31) గెజిట్‌   విడుదలైంది. ఇంతకీ జేడీ ఏమిటంటారా. ములుగు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు. జడ్పీ మాజీ అధ్యక్షుడు  దివంగత కుసుమ జగదీష్‌.   బీఆర్‌ఎస్‌  రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు మల్లంపల్లిని మండ లంగా ప్రకటించాలంటూ కుసుమ జగదీష్‌ తీవ్రంగా ప్రయత్నించారు. అయితే అప్పట్లో అది సాధ్యం కాలేదు. కానీ కాంగ్రెస్‌  రాష్ట్రంలో అధికారం చేపట్టిన తర్వాత మల్లంపల్లిని మండలంగా ప్రకటిస్తూ నోటిఫికేషన్‌ జారీ చేసింది.  కాగా  కుసుమ జగదీష్‌ ఇటీవల మరణించారు. ఆ సమయంలో కుసుమ జగదీష్ కు నివాళులర్పించిన సీతక్క.. మల్లంపల్లి మండలానికి ఆయన పేరు పెడతామనీ, ఇందుకు ప్రభుత్వానికి ప్రతిపాదిస్తాననీ హామీ ఇచ్చారు.  ఆ మాట నిలబెట్టుకున్నారు. కుసుమ జగదీష్ సేవలకు గుర్తింపుగా మల్లంపల్లి మండలానికి ఆయన పేరు పెట్టాలన్న మంత్రి సీతక్క ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మల్లంపల్లి మండలానికి ఆయన పేరు చేరుస్తూ జేడీ మల్లంపల్లిగా మారుస్తూ గెజిట్ విడుదల చేసింది.  రాజకీయాలకు అతీతంగా ప్రతిపక్ష పార్టీకి చెందిన నేత పేరును మండలానికి పెట్టడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ఇందుకు కృషి చేసిన మంత్రి సీతక్క రాజకీయాలలో విలువలకు పెద్ద పీట వేశారంటూ మల్లంపల్లి మండల సాధన సమితి సభ్యులు, ప్రజలు ధన్యవాదాలు తెలియజేశారు.
 మల్లంపల్లి మండలానికి బీఆర్ఎస్ నేత పేరు.. మాట నిలబెట్టుకున్న మంత్రి సీతక్క Publish Date: Jun 1, 2025 8:25AM

ఆ బాలుడి నిజాయితీకి సూపర్ స్టార్ ఫిదా!

పువ్వు పుట్టగానే పరిమళిస్తుందంటారు. అలా ఆ బాలుడు చిన్నతనంలోనే తన నిజాయితీతో ఎందరికో ఆదర్శప్రాయుడయ్యాడు. తన ఆత్మవిశ్వాసం, తనది కాని సొమ్ము వద్దంటూ కరాఖండీగా చెప్పిన తీరు సూపర్ స్టార్ రజనీని సైతం ముగ్ధుడిని చేశాయి. ఔను.. ఆ ఏడేళ్ల బాలుడి నిజాయితీకి, ఆత్మ విశ్వాసానికి సూపర్ స్టార్ రజనీకాంత్ ఫిదా అయ్యారు. తనది కాని సొమ్ము తనకు వద్దని నిష్కర్షగా చెప్పడమే కాదు.. అంతకంతా తాను సంపాదించగలనన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసిన తమిళనాడుకు చెందిన ఏడేళ్ల బాలుడు మహ్మద్ యాసిన్ నిజాయితీకి నిలువెత్తు నిదర్శనంగా వార్తల్లో నిలిచాడు. వివరాల్లోకి వెడితే..  మహ్మద్ యాసిన్ తనకు రోడ్డుపై దొరికిన 50 వేల రూపాయలను తీసుకుని తిన్నగా పోలీసు స్టేషన్ కు వెళ్లాడు. అక్కడ పోలీసు అధికారికి ఆ సొమ్ము ఇచ్చి ఎవరో పారేసుకున్నారు. జాగ్రత్తగా వారికి అందజేయండి అని రిక్వెస్ట్ చేశాడు. సహజంగానే ఆ పోలీసు అధికారి బాలుడి నిజాయితీకి ముచ్చటపడ్డాడు. ఇంత డబ్బు నీకు దొరికింది.. నువ్వే ఉంచేసుకోవచ్చుకదా.. అన్న ఆ పోలీసు అధికారికి ఆ ఏడేళ్ల బాలుడు ఇచ్చిన సమాధానంతో నోట మాటరాలేదు. ఆ బాలుడేమన్నాడంటే.. అది ఎవరో కష్టపడి సంపాదించిన సొమ్ము.. అది నాది కాదు..నాది కాని డబ్బును నేనెలా తీసుకుంటాను అంటూ అమాయకంగానే అయినా చాలా ధృఢంగా చెప్పాడు. దీంతో ఆ బాలుడి నిజాయితీకి ముగ్ధుడైన పోలీసు అధికారి..  నీ కోసం నేనేదైనా చేయాలని ఉంది.. ఏం చేయమంటావు అని అడిగితే.. మహ్మద్ యాసిన్ జవాబు ఏమిటో తెలుసా.. సూపర్ స్టార్ రజనీకాంత్ ను చూడాలని ఉందని. విషయాన్నిపోలీసులు రజనీకాంత్ దృష్టికి తీసుకువెళ్లారు.వెంటనే స్పందించి రజనీ కాంత్ మహ్మద్ యాసిన్ ను తన వద్దకు పిలిపించుకున్నారు. దగ్గరకు తీసుకుని ఆప్యాయంగా మాట్లాడారు. ఆ పిల్లవాడి చదువు బాధ్యత తీసుకున్నారు. ఆ కుర్రవాడు ఎక్కడ చదువుకోవాలనుకుంటే అక్కడ, ఎం చదువుకుంటానంటే అది.. ఎంత ఖర్చైనా ఆ బాధ్యతంతా తనదేనని చెప్పారు. నిజాయితీకి కులం, మతం ఉండవనీ, అది పుట్టుకతో అబ్బే సుగుణమని అన్న రజనీకాంత్ అలాంటి సుగుణాల పుట్ట అయిన మహ్మద్ యాసిన్ అందరికీ ఆదర్శం అని మెచ్చుకున్నారు.  
ఆ బాలుడి నిజాయితీకి సూపర్ స్టార్ ఫిదా! Publish Date: Jun 1, 2025 8:16AM

మిస్ వరల్డ్ గా థాయ్ లాండ్ భామ

హైదరాబాద్ వేదికగా జరిగిన 72వ మిస్ వరల్డ్ పోటీలలో థాయ్ లాండ్ భామ విజేతగా నిలిచింది.  ప్రపంచ వ్యాప్తంగా వందకు పైగా దేశాలకు చెందిన అందాల భామలు మిస్ వరల్డ్ కిరీటం కోసం పోటీ పడగా వారందరినీ అధిగమించి థాయ్ లాండ్ కు చెందిన ఓపల్ సుదాత చువాంగ్ శ్రీ ప్రపంచ సుందరి కిరీటాన్ని దక్కించుకుంది. ఈ పోటీలలో ఫస్ట్ రన్నర్ అప్ గా ఇథియోపియా, సెకండ్ రన్నర్ అప్ గా పోలెండ్ కు చెందిన అందాల భామలు నిలిచారు. భారత్ నుంచి మిస్ వరల్డ్ కిరీటానికి పోటీపడిన నందిని గుప్తాకు నిరాశే మిగిలింది.  అందం, అభినయం, ప్రతిభల మేలు కలయికతో ఓపల్ సుదాత చువాంగ్ శ్ఱీ మిస్వరల్డ్ కిరీటం అందుకున్నారు.   థాయ్, ఇంగ్లీష్, చైనీస్ భాషల్లో మంచి ప్రావీణ్యం ఉన్న ఓపల్ సుచాత చువాంగ్ శ్రీ, మోడలింగ్ పట్ల ఇష్టం, ఆసక్తితో ఈ పోటీలలో పాల్గొన్నారు.  2022లో జరిగిన మిస్ యానివర్స్ థాయ్ ల్యాండ్ పోటీలలో పాల్గొని సెకండ్ రన్నరప్ గా నిలిచిన ఆమే.. 2024లో కూడా ఈ పోటీలలో పాల్గొని మిస్ చార్మింగ్ టాలెంట్, మిస్ బ్యూటీ అండ్ కాన్ఫిడెన్స్ టైటిళ్లు గెలిచారు.   16 ఏళ్ల వయసులో రొమ్ములో కణితితో బాధపడ్డారు సుచాత.   క్యాన్సర్ తో బాధపడే వారి పరిస్థితిని అర్ధం చేసుకుని,    ఓపల్ ఫర్ హెర్  ప్రాజెక్ట్ ద్వారా మహిళలలో రొమ్ము క్యాన్సర్ పై అవగాహన పెంచేందుకు కృషి చేశారు.  సుచాత ప్రస్తుతం ధమ్మసాట్ విశ్వవిద్యాలయంలో పొలిటికల్ సైన్స్ అభ్యసిస్తున్నారు. మిస్ వరల్డ్ కిరీటం గెలుచుకున్నఓపల్ సుదాత చువాంగ్ శ్రీకి రూ.8.5 కోట్ల నగదు, 1770 వజ్రాల కిరీటం బహుమతిగా దక్కాయి. అలాగే ఏడాది పాటు ఉచిత ప్రపంచ యాత్ర చేసే అవకాశం లభించింది.  ఇక ఈ పోటీలలో భారత్ కు చెందిన నందినీ గుప్తాకు టాప్ 8లో స్థానం లభించలేదు. మార్టినిక్, బ్రెజిల్, ఇథియోపియా, నమీబియా, పోలండ్, ఉక్రెయిన్, ఫిలిప్పీన్స్, థాయ్‌లాండ్ దేశాల అందాల భామలు మిస్ వరల్డ్ టాప్ 8లో చోటు దక్కించుకున్నారు.   శనివారం(మే 31) రాత్రి హైటెక్స్ లో జరిగిన ఈ భారీ వేడుకకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, సినీ నటి ఖుష్బూ, ఇతర ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు హాజరయ్యారు.అలాగే   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సతీమణి గీత, కూతురు నైమిషా రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఆయన భార్య నందిని, మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.
మిస్ వరల్డ్ గా థాయ్ లాండ్ భామ Publish Date: Jun 1, 2025 7:17AM

డీజీపీగా శ్రీ హరీష్ కుమార్ గుప్తా బాధ్యతలు స్వీకరణ

ఆంధ్రప్రదేశ్ డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా బాధ్యతలు చేపట్టారు.   మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో శనివారం ఆయన రాష్ట్ర పోలీస్ చీఫ్ గా పదవీ బాధ్యతలు చేపట్టారు.    1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన హరీష్ కుమార్ గుప్తా  విజిలెన్స్అండ్ ఎన్ ఫోర్స్ మెంట్  విభాగం డైరెక్టర్  జనరల్  పోస్టులో కొనసాగుతూ ఇంత వరకూ ఇన్ ఛార్జి డీజీపీ గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు.  ఇప్పుడు ఆయన పూర్తి స్థాయి డీజీపీగా బాధ్యతలు చేపట్టారు. పదవీ  విరమణ తేదీతో సంబంధం లేకుండా డీజీపీగా ఆయన  రెండేళ్లపాటు   కొనసాగనున్నారు. గత నాలుగు నెలలుగా ఇన్ ఛార్జి డీజీపీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆయన పోలీసుశాఖలో తనదైన ముద్ర వేశారు. ఈ ఏడాది జనవరిలో ద్వారకా తిరుమలరావు డీజీపిగా పదవీ విరమణ చేసిన తర్వాత మళ్లీ హరీష్ కుమార్ గుప్తాకే ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ఇన్ ఛార్జిగా ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది.  డీజీపీగా బాద్యతలు స్వీకరించిన హరీష్ కుమార్ గుప్తాను పలువురు సీనియర్ పోలీసు అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి  శుభాకాంక్షలు తెలిపారు. గత ఏడాది ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం హరీష్ కుమార్ గుప్తానే డీజీపీగా నియమించింది. దీంతో అప్పట్లో కొన్ని రోజుల పాటు ఆయన ఆంధ్రప్రదేశ్ డీజీపీగా పని చేశారు. ఆ తరువాత రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి అధికార పగ్గాలు చేపట్టిన అనంతరం ప్రభుత్వం సీనియారిటీ ఆధారంగా ద్వారకా తిరుమల రావును డీజీపీగా నియమించింది. ఆయన పదవీ విరమణ చేసిన అనంతరం హరీష్ కుమార్ గుప్తాకు ఇన్ చార్జ్ డీజీపీగా అదనపు బాధ్యతలు అప్పగించింది. ఇప్పుడు పూర్తి స్థాయి డీజీపీగా నియమించింది. 
డీజీపీగా శ్రీ హరీష్ కుమార్ గుప్తా బాధ్యతలు స్వీకరణ Publish Date: Jun 1, 2025 6:54AM

మూడు పార్టీలు.. ఒకటే ముచ్చట

బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత కుటుంబ కలహాలు బజారు పడ్డాయి. పతాక స్థాయికి చేరాయి. మాటలు లేవు మాట్లాడుకోవడాలు లేవు అన్నట్లు, పార్టీ, కుటుంబ రాజకీయాలనే కాదు, రాష్ట్ర రాజకీయాలలోనూ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. రోజు రోజుకు మరింతగా ముదిరి పాకాన పడుతున్నాయి. రాజకీయాలను రక్తి కట్టిస్తునాయి.  అయితే, అంతర్గత కుమ్ములాటలు ఒక్క బీఆర్ఎస్ కు మాత్రమే పరిమితమా అంటే కాదు..  అన్ని పార్టీలలో ఉన్నదే.. ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీలలోనూ అదే పరిస్థితి వుంది.  మూడు పార్టీలలో ఒకటే ముచ్చట నడుస్తోంది. చిన్న గీత పెద్ద గీత అంతే, అదొక్కటే తేడా, మిగిలినదంతా సేమ్  టూ సేమ్.  అవును..  అన్ని పార్టీలలో, ప్రధానంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో, కేంద్రంలో అధికారంలోఉన్న బీజేపీలోనూ ధిక్కార స్వరాలు గట్టిగానే వినిపిస్తున్నాయి. పార్టీ విధానాలను చిన్నా పెద్ద నాయకులు ప్రశ్నిస్తున్నారు. గీత దాటుతున్నారు. నేతలను నిలదీస్తునారు. అంతే కాదు.. ఇదొక అంటూ వ్యాధిలా ఒక పార్టీ నుంచి మరో పార్టీకి, ఒక నాయకుడి నుంచి మరో నాయకుడికి   పాకుతోందని, రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. రాజకీయ పార్టీలలో అంతర్గత కుమ్ములాటలకు పదవీ కాంక్ష ఒక ప్రధాన కారణం అయితే..  రాజకీయ పార్టీలలో ప్రజాస్వామ్య పరిధి, పరిమితి రోజురోజుకు కుచించుకు పోవడం మరో ప్రధాన కారణంగా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. పదవీ కాంక్ష పై కొచ్చినప్పుడు బంధాలు, బాంధవ్యాలు కూడా కొట్టుకు పోతున్నాయని అంటున్నారు. నిజానికి, ఈ రోజు బీఆర్ఎస్ లో  జరుగుతున్న పరిణామాలను గమనిస్తే,  ఇది ఫక్తు పదహారణాల కుటుంబ కలహాల చిత్రం లా సాగుతోందని అంటున్నారు. అన్నా, చెల్లి మధ్య కుర్చీలాటగా మొదలైన వివాదం మెల్లమెల్లగా కుటుంబ పరిధిని, పార్టీ పరిధిని దాటి ఇప్పుడు రాష్ట్ర సమస్యగా మారింది. ఒక చోటి నుంచి ఒక చోటికి పాకుతూ.. పక్క దారులు పట్టి పోతోంది.  రాష్ట్ర హద్దులు దాటి  జాతీయ మీడియాలోనూ చర్చకు వస్తున్నా పెద్దాయన కేసీఆర్  పెదవి విప్పక పోవడం చిత్రంగా ఉందని అంటున్నారు. నిజానికి.. ఆయన తలచుకుంటే, సమస్య ఇంత వరకు వచ్చేది కాదని, అయినా ఆయన మౌనంగా ఉండడమే కాకుండా, మధ్య వర్తిత్వం జరిపేందుకు ముందుకు వచ్చిన కుటుంబ, పార్టీ పెద్దలకు కూడా పర్మిషన్ ఇవ్వ లేదని అంటున్నారు. మరోవంక కవిత, కేసీఆర్ ను కలిసే  అవకాశం వచ్చినా కలవలేక పోయానని,అంటున్నారు.  మరోవంక బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేసే కుట్ర జరుగుతోందని కవిత చేసిన కామెంట్ బీజేపీలో చిచ్చు పెట్టింది. అంతో ఇంతో ఇంకా క్రమశిక్షణ బతికున్న పార్టీగా భావించే బీజేపీలోనూ కవిత కామెంట్ నిప్పు పెట్టింది. ఫైర్ బ్రాండ్ ఎమ్మల్యేగా ముద్ర వేసుకున్న గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్  కవిత కామెంట్ ను ఎండార్స్ చేశారు. ఆమె చెప్పింది సత్యమని సర్టిఫికేట్ ఇచ్చారు.  అంతే కాదు.. రాష్ట్ర అపార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిని బహిరంగంగా విమర్శించారు. సరైన రేటు ఇస్తే, ప్లేటు మార్చేందుకు తమ పార్టీ నాయకులు ఎప్పుడూ సిద్దంగా ఉంటారని అన్నారు. ఆయన ఒకరనే కాదు..  కవిత ఇష్యూలో వేలు పెట్టవద్దని అధిష్టానం ఆదేశించినా..  బీజేపీ నాయకులు ఎవరికి  వారుగానే సొంత అభిప్రాయాలు, విశ్లేషణలు వినిపిస్తున్నారు. కవిత విషయంలోనే కాదు.. అంతర్గత కుమ్ములాటల కారణంగానే పార్టీ  అధ్యక్ష ఎన్నిక ఒక అంతులేని కథల సాగుతోంది.  ఇక కాంగ్రెస్ విషయం అయితే చెప్పనే అక్కర లేదు. ముందు అసమ్మతి పుట్టి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ పుట్టింది అంటే అందులో తప్పులేదు. అదేమంటే,  మా పార్టీలో  అంతర్గత ప్రజాస్వామ్యం కొంచెం ఎక్కువ అంటారు. అందుకే.. పార్టీ ఎమ్మెల్సీ సభలోనే  ప్రభుత్వ విధానాలను విమర్శిస్తారు. ఎమ్మెల్యేలు, నాయకులు పదవుల కోసం గాంధీ భవన్  మెట్ల మీదనే ధర్నా చేస్తారు. అంతవరకు ఎందుకు.. అంతర్గత కుమ్ములాటల కారణం గానే ప్రభుత్వం ఏర్పడి 16 నెలలు అయినా ఇంతవరకు పూర్తిస్థాయి మంత్రివర్గం ఏర్పడ లేదు. కనీసం పీసీసీ  ఏర్పాటుకు కూడా మీన మేషాలు లెక్క పెట్టవలసి వస్తోంది.  సో. అంతర్గత కుమ్ములాటల విషయంలో అన్ని పార్టీలది ఒకటే మాట ..అంతర్గత ప్రజాస్వామ్యం లేక పోవడమే ఈ పరిస్థితికి కారణమని పరిశీలకులు అంటున్నారు.
మూడు పార్టీలు.. ఒకటే  ముచ్చట Publish Date: Jun 1, 2025 6:36AM

కేసీఆర్ కోసం ధర్నా.. బీఆర్ఎస్ కాదు.. తెలంగాణ జాగృతి!

తెలంగాణ సాధన కోసం ప్రాణాలు ఫణంగా పెట్టి పోరాడిన యోధుడికి నోటీసులా అంటూ ఈ నెల 4న ఇందిరా పార్క్ వద్ద భారీ దర్నాకు రంగం సిద్ధమైంది. అయితే ఈ ధర్నా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరగబోవడం లేదు. కేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో బీఆర్ఎస్ జెండాలు లేకుండా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జరుగుతోంది. కేసీఆర్ కు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో నోటీసులు జారీ చేయడం వెనుక రాజకీయ దురుద్దేశం, కుట్ర ఉన్నాయని ఆరోపిస్తూ కవిత ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేయాలని నిర్ణయించారు. కేసీఆర్ ఈ నెల 5న కమిషన్ ఎదుట విచారణకు హాజరు కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో  అంతకంటే ఒక రోజు ముందు అంటే  జూన్ 4న కవిత ఈ ధర్నా నిర్వహించనున్నారు. ఇప్పటికే కవిత పార్టీ లైన్ కు భిన్నంగా వెడుతున్నారు. తండ్రికి రాసిన లేఖ లీక్ కావడం బీఆర్ఎస్ లో చీలికకు సంకేతంగా నిలిస్తే.. ఈ తరువాత మీడియాతో చిట్ చాట్ అంటూ ఆమె తన అన్న, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, అలాగే మాజీ మంత్రి హరీష్ రావు టార్గెట్ గా పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు విమర్శలు.. ఆమెకు బీఆర్ఎస్ తలుపులు మూసేశాయని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే ఆమె తెలంగాణ జాగృతి బ్యానర్ తో సొంతంగా రాజకీయ అడుగులు వేస్తున్నారు. ఇందిరా పార్క్ వద్ద ధర్నా ఆ అడుగుల్లో మొదటిదని చెప్పవచ్చు.  చావు నోట్లో తల పెట్టి.. తెలంగాణ సాధించిన  ప్రజానాయకుడు కేసీఆర్‌పై రాజకీయ కుట్రలు సాగడం సిగ్గుచేటు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన కవిత కాంగ్రెస్ ప్రభుత్వ దుర్మార్గాలకు వ్యతిరేకంగా ధర్నా కు పిలుపు నిచ్చారు. అలాగే.. తెలంగాణ జాగృతి నూతన కార్యాలయాన్ని కవిత శనివారం ప్రారంభించారు.  తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను  చాటిచెప్పడం, మహిళల హక్కుల కోసం, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల కోసం  పోరాడుతున్న తెలంగాణ జాగృతి సంస్థ, ఇక కొత్త కార్యాలయం ద్వారా మరింత విస్తృతంగా ఉధృతంగా నిర్వహించనుందని అంటున్నారు.  
కేసీఆర్ కోసం ధర్నా.. బీఆర్ఎస్ కాదు.. తెలంగాణ జాగృతి! Publish Date: May 31, 2025 4:47PM

పీఎస్సార్ ఆంజనేయులుకి అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు

ఏపీపీఎస్సీలో అవకతవకలు కేసులో  విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సీనియర్ ఐపీఎస్‌ అధికారి‌ పీఎస్సార్ ఆంజనేయులు శనివారం (మే 31) అస్వస్థతతకు గురయ్యారు. విజయవాడ జిల్లా  జైలులో రిమాండ్ ఖైదీ గా ఉన్న సీఎస్సార్‌కు ఉదయం బిపీ ప్లక్చుయేషన్స్ రావడంతో జైలు అధికారులు ఆయనను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయనకు గుండె సంబంధిత ఇబ్బంది ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. గుండె జబ్బులకు సంబంధించి ప్రత్యేక వార్డులో పీఎస్సార్ ఆంజనేయులుకు చికిత్స అందిస్తున్నారు.  సాయంత్రం వరకు వైద్యుల పరిశీలనలో ఉంచి  అనంతరం తిరిగి జిల్లా జైలుకు తరలించే అవకాశం ఉందని సమాచారం. పీఎస్సార్ ఆంజనేయులు తొలుత ముంబైకి చెందిన నటి కాదంబరి జత్వానీని అక్రమంగా నిర్బంధించి, ఆమెపై అక్రమ కేసు నమోదు చేశారన్న ఆరోపణలపై అరెస్టయ్యారు. ఈ కేసులో ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్న సమయంలోనే, ఏపీపీఎస్సీలో పరీక్షా పత్రాల మూల్యాంకనానికి సంబంధించి నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు వ్యక్తుల ప్రమేయంతో అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఆయనపై వచ్చాయి. దీంతో  ఏపీపీఎస్సీ కేసులో ఆంజనేయులుతో పాటు ధాత్రి మధును కూడా పోలీసులు అరెస్ట్ చేసి, కస్టడీలోకి తీసుకుని విచారించారు. కాగా, కాదంబరి జత్వానీ కేసులో  హైకోర్టు ఆంజనేయులుకు బెయిల్ మంజూరు చేసినప్పటికీ, ఏపీపీఎస్సీ కేసులో ఆయన ఇంకా రిమాండ్ ఖైదీగానే కొనసాగుతున్నారు.  అదలా ఉంటే   నకిలీ ఇళ్ల పట్టాల కేసుకు సంబంధించి రిమాండ్ ఖైదీగా ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీసీ సీనియర్ నాయకుడు వల్లభనేని వంశీకి అనారోగ్య కారణాలతో ఆయన విజ్ణప్తి మేరకు మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం కోర్టు మధ్యంతర బెయిలు మంజూరు చేసింది. దీంతో కోర్టు ఉత్తర్వుల మేరకు వంశీని  విజయవాడలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్న సంగతి తెలిసిందే.  
పీఎస్సార్ ఆంజనేయులుకి అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు Publish Date: May 31, 2025 3:54PM

ఒక అల్లు అర్జున్.. మ‌హేష్ బాబు.. వైసీపీ ఈ హీరోల‌ను ఎందుకు ఓన్ చేసుకుంటోంది?

ఇవాళ సూప‌ర్ స్టార్ కృష్ణ బ‌ర్త్ డే. దీంతో మ‌హేష్ బాబును ఓన్ చేసుకుంటూ ధూమ్ ధామ్ చేసేస్తున్నాయి వైసీపీ శ్రేణులు.  గ‌తంలో అల్లు అర్జున్   నంద్యాల‌కు రావ‌డం నుంచి మొద‌లైంది అల్లు అర్జున్ మీద విప‌రీత‌మైన ప్రేమాభిమానం. అక్క‌డి  నుంచి వైసీపీ కేడ‌ర్ అల్లు అర్జున్ ని ప‌ట్టుకుని ఊగిపోవ‌డం మొద‌లైంది. అంతెందుకు లైలాను అదే ప‌నిగా బ్యాన్ చేసి దాన్ని ఆడ‌కుండా చేసింది ఇదే వైసీపీ  కేడ‌ర్.  కార‌ణం.. ఈ సినిమాలో న‌టించిన పృధ్వి చేసిన లెవ‌న్ కామెంట్లు. ఇలా సినిమాల‌ను ఎట్టి ప‌రిస్తితుల్లో లైట్ తీస్కోవ‌డం లేదు  వైసీపీ. అల్లు అర్జున్ బ్ల‌డ్ గ్రూప్ లో జ‌న‌సేన ఉంది. ఆ కాంపౌండ్ మొత్తం జ‌న‌ సైనికులే. కానీ అది గ‌తం. అర్జున్ భార్య కులాన్ని అడ్డు పెట్టుకుని బంధుత్వం క‌లిపేసుకున్నారు ఫ్యాన్ పార్టీ లీడ‌ర్లు. ఇప్పుడు అల్లు అర్జున్ స్వ‌త‌హాగా ఎలాంటి రాజ‌కీయ విధానం క‌లిగి ఉన్నారో ఏమో తెలీదు. కానీ..  వైసీపీ వాళ్లు మాత్రం.. అల్లు అర్జున్ మా హీరో అని ఓన్ చేసుకుంటున్నారు. ఆయ‌న ప్ర‌తి క‌ద‌లిక‌కూ కొమ్ము కాస్తున్నారు. సంధ్యా థియేట‌ర్ ఘ‌ట‌న‌లో అల్లు అర్జున్ వెన్నంటే ఉన్నారు. అల్లు అర్జున్ భుజాల‌ను అడ్డు పెట్టుకుని.. ప‌వ‌న్ క‌ళ్యాన్ ని గానీ ఆయ‌న జ‌న‌సైనికుల‌ను గానీ కొడితే అలా ప‌డి ఉంటుంద‌ని గ‌ట్టిగా న‌మ్ముతున్నారు. ఇక మ‌హేష్ బాబు సంగ‌తి స‌రే స‌రి. సూప‌ర్ స్టార్ కృష్ణ ఆనాడే ఎన్టీఆర్ ని వ్య‌తిరేకించిన వ్య‌క్తి. యాంటీ ఎన్టీఆర్ మూవీస్ సైతం తీసిన వారు. అంతేనా.. కాంగ్రెస్ నుంచి ఎంపీగానూ గెలిచిచారు. అలాంటి సూప‌ర్ స్టార్ కృష్ణ వార‌సుడైన మ‌హేష్ బాబు సైతం వారికి ఆరాధ‌నీయుడే. దీంతో కృష్ణ‌ను ఆయ‌న కొడుకు మహేష్ ను త‌మ కుటుంబ హీరోగానే ఫీల‌వుతుంది త‌ల్లి కాంగ్రెస్. ఇప్పుడు పిల్ల కాంగ్రెస్ దాన్ని కొన‌సాగిస్తోంద‌ని అంటారు. ఇంత‌కీ జ‌గ‌న్ ఫేవ‌రేట్ హీరో ఎవ‌రంటే బాల‌య్య‌. బాల‌కృష్ణ అంటే జ‌గ‌న్ కి ఎడ‌తెగ‌ని వీరాభిమానం. క‌డ‌ప జిల్లా ఫ్యాన్స్ అసోసియేష‌న్ ప్రెసిడెంట్ మాత్ర‌మే కాదు.. ఒక స‌మ‌యంలో బాల‌య్య సినిమాల‌ను సైతం డిస్ట్రిబ్యూట‌ర్ గా విడుద‌ల చేసేవాడ‌ని అంటారు. ఇదే బాల‌కృష్న‌ను ఒక స‌మ‌యంలో కాపాడిన‌ట్టుగానూ చెబుతారు. ఇక జ‌గ‌న్ సోద‌రి ష‌ర్మిల‌, యోగి అనే సినిమా ప్రొడ్యూస‌ర్ కూడా.  జ‌గ‌న్ కుటుంబం కూడా సినిమాల‌తో లింక్ అప్ అయ్యి ర‌క‌ర‌కాల య‌త్నాలు చేశారు. కానీ అదెందుకో వ‌ర్క‌వుట్ కాలేదు. సినిమాల  ప‌రంగా వారు ఏమి చేయ‌ద‌లిచినా ఎదురు దెబ్బ‌లు త‌గిలేవి. జ‌గ‌న్ డిస్ట్రిబ్యూట‌ర్ గా కావ‌చ్చు, ష‌ర్మిల ప్రొడ్యూస‌ర్ గా కావ‌చ్చు.. రివ‌ర్స్ లో న‌ష్టాలు లేదా చెడ్డ‌పేరే మిగిల్చాయి.  అయినా స‌రే వైసీపీ అభిమానులు.. మ‌న‌కంటూ ఒక హీరో ఉండాల‌న్న కోణంలో గ‌తంలో  మ‌హేష్ బాబు,  అల్లు అర్జున్ని ఓన్ చేసుకుంటూ.. ఈ దిశ‌గా ప్ర‌య‌త్నాలు సాగిస్తున్న‌ట్టుగా తెలుస్తోంది.
ఒక అల్లు అర్జున్.. మ‌హేష్ బాబు.. వైసీపీ ఈ హీరోల‌ను ఎందుకు ఓన్ చేసుకుంటోంది? Publish Date: May 31, 2025 3:25PM

కోరలు చాస్తున్న కోవిడ్.. దేశంలో మూడువేల యాక్టివ్ కేసులు

కరోనా మరోసారి విజృంభిస్తోంది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రమాదం లేదని చెబుతున్నప్పటికీ దేశ వ్యాప్తంగా రోజు రోజుకూ పెరుగుతున్న కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. దేశంలో ఇప్పుడు మూడు వేల మందికి పైగా కరోనా సోకింది. వీరంతా వివిధ దశల్లో చికిత్స పొందుతున్నారు. రోజురోజుకూ కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకూ కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య ఏడుకు చేరుకుంది.   దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతన్నా.. కేరళ రాష్ట్రంలో మాత్రం కరోనా వ్యప్తి తీవ్ర స్థాయిలో ఉందని  వైద్య ఆరోగ్య శాఖ చెబుతోంది. కేరళలో ప్రస్తుతం  1,147 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కేరళ తరువాతి స్థానంలో 424 కేసులతో మహారాష్ట్ర ఉంది.  ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా కరోనా వ్యాప్తి తీవ్రత అధికంగా ఉ:దంటున్నారు. అలాగే కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య  కూడా భారీగానే ఉందని చెబుతున్నారు.  ఈ నెల 25 నుంచి కరోనా వ్యాప్తి తీవ్రత అధికమైందంటున్నారు. గత నాలుగు రోజులుగా కరోనా బారిన పడిన వారి సంఖ్య మూడు రెట్టు పెరిగిందని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.  రాష్ట్రాల వారీగా చూస్తే, కేరళలో అత్యధికంగా 1,147 యాక్టివ్ కేసులున్నాయి. మహారాష్ట్రలో 424, ఢిల్లీలో 294, గుజరాత్‌లో 223 కేసులు నమోదయ్యాయి. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఒక్కొక్కటి 148 చొప్పున కేసులు ఉండగా, పశ్చిమ బెంగాల్‌లో 116 మంది కొవిడ్ తో బాధపడుతున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే  ఆంధ్రప్రదేశ్‌లో 16, తెలంగాణలో 3  కోవిడ్ కేసులు నమోదయ్యాయి.
కోరలు చాస్తున్న కోవిడ్.. దేశంలో మూడువేల యాక్టివ్ కేసులు Publish Date: May 31, 2025 3:01PM

క్యూలైన్ లో రాజకీయ నినాదాలు జగన్ ప్రియ శిష్యుడి పనే!

టీటీడీకి సంబంధించి ఏదైనా త‌ప్పుడు వార్త‌లు ప్ర‌చారం జ‌రిగితే.. అందుకు బాధ్యులైన వారిపై కేసులు పెడ‌తామ‌ని ఇప్ప‌టికే టీటీడీ చైర్మ‌న్ ప్ర‌క‌టించారు.  కానీ ఇవేవీ ఖాత‌రు చేయ‌ని కొంద‌రు త‌ర‌చూ ఏవో   అవాస్త‌వాల‌ను తిరుమ‌లకు ఆపాదించే య‌త్నం చేస్తున్నారు. నిజానికి తిరుమ‌ల నిబంధ‌న‌ల ప్ర‌కారం త‌ప్పుడు స‌మాచారం వ్యాప్తి చేస్తే..  వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటారు.  ఈ విష‌యం తెలిసి కూడా కొంద‌రు కావాల‌నే ఈ ఆధ్యాత్మిక కేంద్రానికి రాజ‌కీయాల‌ను పుల‌మాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇప్ప‌టికే గోవుల మ‌ర‌ణాల విష‌యంలో వైసీపీ నేత భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి పెద్ద ఎత్తున గొడ‌వ‌కు దిగ‌డం.. అదో పెద్ద రాజ‌కీయ దుమారానికి కార‌ణంగా నిల‌వ‌డం సంగ‌తి తెలిసిందే. ఈ వ్య‌వ‌హారం స‌ద్దుమ‌ణిగింద‌నుకునేలోపు.. ద‌ర్శ‌న క్యూలైన్ల‌లో సౌక‌ర్యాలు స‌రిగా లేవంటూ కాకినాడ‌కు చెందిన అచ్చారావు అనే భ‌క్తుడు హ‌డావిడి చేశాడు. దీంతో అత‌డ్ని ప‌ట్టుకుని ఆరా తీసిన సిబ్బందికి తెలిసిందేంటంటే త్వ‌ర‌గా ద‌ర్శ‌నానికి అనుమ‌తిస్తార‌నే ఆలోచ‌న‌తో తానిలా చేశానంటున్నాడీ భ‌క్తుడు.  ఇత‌డిలా అరిచి గోల‌ చేస్తుంటే ఇదే అద‌నుగా భావించిన ఒక‌రు వీడియో తీసి వ‌దిలారు. ఇపుడీ వ్య‌క్తి ఎవ‌రు? ఇత‌డి వెన‌కున్న ఉద్దేశ‌మేంటి? పొలిటిక‌ల్ బ్యాగ్రౌండ్ ఎలాంటిద‌న్న‌ది విచార‌ణ చేస్తున్నారు పోలీసులు. అయితే టీటీడీలో భార‌త‌మ్మ సైన్యం ఒక రెండు వేల మంది వ‌ర‌కూ ఉన్నార‌ని అంటారు. వీరిలోని ఒక‌రే ఈ వీడియో తీశారా!? అన్న కోణంలో కూడా ద‌ర్యాప్తు చేసే అవ‌కాశం క‌నిపిస్తోంది.  ఇంత‌కీ టీటీడీ నామ్స్ ప్ర‌కారం త‌ప్పుడు ప్ర‌చారం చేస్తే ఏం జ‌రుగుతుంది? అంటే ఐటీ యాక్ట్ వాడుతారు. ఆ త‌ర్వాత పోలీసులు కూడా కేసులు పెడ‌తారు.  త‌ప్పుడు ప్ర‌చారం చేసేవారిపై భార‌తీయ న్యాయ సంహిత 197, 353 సెక్ష‌న్ల ప్ర‌కారం శిక్షిస్తారు. మ‌రీ ముఖ్యంగా ఆధ్యాత్మిక ప‌రంగా ఇలాంటి త‌ప్పుడు స‌మాచారం వ్యాప్తి చేస్తే  వారిపై ఈ సెక్ష‌న్ల ప్ర‌కారం చ‌ర్య‌లు తీసుకుంటారు. ఒక్కోసారి  ఆరు నెల‌ల నుంచీ జైలు శిక్ష, ఐదు వేల రూపాయ‌ల జ‌రిమానా సైతం విధిస్తారు. ఇప్పుడిక సౌకర్యాలు లేవంటూ క్యూలైన్ లో రాజకీయ నినాదాలు చేసిన భక్తుడు ఎవరా అన్న ఆరా తీస్తే.. వైసీపీ, మరీ ముఖ్యంగా వైఎస్ జగన్ కుట్ర కోణం బయటపడింది. ఇంతకీ    తిరుమలలో నిన్న క్యూ లైన్ లో హడావిడి చేసిన వ్యక్తి  కాకినాడ రూరల్ కి చెందిన వైసీపీ నేత. జగన్ రెడ్డి ప్రియ శిష్యుడు. ఇతని పేరు బద్దిలి అచ్చారావు. వేణుగోపాల స్వామి ఆలయ చైర్మన్ గా 2022లో జగన్ రెడ్డి పదవిని ఇచ్చాడు. ఆ అచ్చారావే.. నిన్న తిరుమల క్యైలైన్ లో సౌకర్యాలు లేవంటూ నానా హడావుడీ చేసి వివాదం సృష్టించాలని ప్రయత్నించాడు.  
 క్యూలైన్ లో రాజకీయ నినాదాలు జగన్ ప్రియ శిష్యుడి పనే! Publish Date: May 31, 2025 2:40PM

అమ్మ కేసీఆర్.. ప‌దేళ్ల పాటు సినిమా అవార్డులు ఎందుకివ్వ‌లేదో తెలిస్తే షాక్

కేసీఆర్ సినిమా ఇండ‌స్ట్రీని ఎందుకో చిన్న చూపు చూశారేమో అనిపిస్తుంది చాలా మందికి. అయితే సినిమా వారితో మాత్రం కేసీఆర్ కుటుంబం స‌త్సంబంధాలు బాగానే నెరిపారు. ఒక ప‌క్క చూస్తే నాగార్జున భార్య అమ‌ల‌కూ, క‌విత‌కూ స్నేహ‌ముండేద‌ని అంటారు. మ‌రో ప‌క్క చేనేత బ్రాండ్ అంబాసిడ‌ర్ గా స‌మంత సైతం ఈ ప్ర‌భుత్వంతో అంట‌కాగిన‌ట్టు చెబుతారు. ఇక ప్ర‌కాష్ రాజ్ కూడా ఒక దశ‌లో బీఆర్ఎస్ లో చేరుతార‌నే ప్రచారం కూడా జరిగింది.  ఇక కేసీఆర్ ప్ర‌భుత్వ చివ‌రి  రోజులలో క‌రోనా రావ‌డం. సినిమాటోగ్ర‌ఫీ మంత్రిగా.. శ్రీనివాస యాద‌వ్ హ‌డావిడీ.. దాస‌రి త‌ర్వాత అంత‌టి సినీ ప‌ర్స‌నాల్టీ చిరంజీవి అన్న గౌర‌వ మ‌ర్యాద‌లు.. అంతా బాగుండేది.  కానీ సినిమా అవార్డులు మాత్రం ఇచ్చేవారు కాదు.  బీఆర్ఎస్ హ‌యాంలోనే తెలంగాణ యాస‌లో ఫిదా, బ‌ల‌గం వంటి సినిమాలు రావ‌డం.. ఆపై విజ‌య్ దేవ‌ర‌కొండ‌లాంటి అచ్చ తెలంగాణ‌కు చెందిన ఒక కుర్రాడు ఆంధ్ర తెలంగాణ ప్రాంతీయ బేధాల‌కు అతీతంగా హీరోగా ఎద‌గ‌డం. చాంబ‌ర్లు కూడా వేరు కావ‌డం.. తెలంగాణ ద‌ర్శ‌కులు బాగా పెర‌గ‌డం. ఉదాహ‌ర‌ణ‌కు సందీప్ రెడ్డి వంగ‌, నాగ అశ్విన్.. ఇలా ర‌క‌ర‌కాలుగా తెలంగాణా సినీ అభివృద్ధి పరిఢవిల్లిందనే చెప్పాలి.   తెలంగాణ సినిమాకు కావ‌ల్సింది అవార్డులు కావు.. వాటికంటూ ఒక పాల‌సీ అంటారు ఇంకొంద‌రు. గ‌తంలో ప్ర‌భుత్వ ప‌రంగా ఏదైనా స‌హాయ స‌హ‌కారాలు వెళ్తే అదంతా ఆంధ్రుల‌కే వెళ్లింద‌న్న అప‌వాదు ఉండేది.  అంతెందుకు ఇదే ఉద్య‌మ కాలంలో కొంద‌రు రాఘ‌వేంద్ర‌రావు వంటి వారు స్టూడియోల‌కు స్థ‌ల‌మిస్తే క‌మ‌ర్షియ‌ల్ కాంప్లెక్సులు క‌ట్టార‌న్న గొడ‌వ జ‌రిగింది. అలాగ‌ని కేవ‌లం స్టూడియో మాత్ర‌మే క‌డితే.. అది మ‌రో రామానాయుడు స్టూడియోలా త‌యార‌య్యే ప్ర‌మాదం కూడా ఉంది. ఈ స్డూడియో స‌రిగా న‌డ‌వ‌క‌.. క‌రెంటు చార్జీలు క‌ట్ట‌డానికి కూడా ఇబ్బంది క‌రంగా మారింది. ఇపుడీ స్టూడియోను ఉంచకోలేక‌, తీయ‌లేక సురేష్ అవ‌స్త‌లు ప‌డుతున్న‌ట్టు తెలుస్తోంది. ఇలాంటి గొడ‌వ‌లు చాలానే.   అయితే బీఆర్ఎస్ పాల‌న‌లో ఎన్ శంక‌ర్ వంటి వారికి స్టూడియో నిర్మాణాల‌కు 5 ఎక‌రాల‌ స్థ‌లం ఇచ్చారు. త‌ర్వాత ఎవ‌రికీ పెద్ద‌గా ఈ దిశ‌గా ఎంక‌రేజ్ మెంట్ జ‌ర‌గ‌లేదు. కేసీఆర్ స్వ‌యానా ర‌చ‌యిత‌. తెలుగు సాహితీ  పిపాసి కూడా.  జైబోలో తెలంగాణ వంటి  సినిమాల ద్వారా కూడా ఆయ‌న త‌న ఉద్య‌మాన్ని న‌డిపించారు. అందులో ఒక పాట కూడా రాశారు. అయినా కూడా ఆయ‌నెందుకో తెలుగు సినిమా అవార్డుల‌ని ఇంత పెద్ద ఎత్తున ఇవ్వ‌లేదు. అస్స‌లు ప‌ట్టించుకోలేదు.  ఇక ఆనాడు ఎన్టీఆర్, ఏఎన్నార్ల‌తో స‌మానంగా తెలుగు తెర‌ను ఏలిన కాంతారావు, కుటుంబం దీన ప‌రిస్థితుల్లో ఉంది. ఈ విష‌యంలో కూడా కేసీఆర్ గానీ, ఆయ‌న కుటుంబ స‌భ్యులుగానీ పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. క‌రీంన‌గ‌ర్ కి చెందిన‌ పైడి జ‌య‌రాజ్ అనే ఒక న‌టుడు బాలీవుడ్ స్థాయికి ఎదిగారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా పొందారు. ఆయ‌న కుటుంబాన్నీ ప‌ట్టించుకున్న పాపాన పోలేదు. గ‌తంలో విల‌న్ పాత్ర‌లు వేసిన ప్ర‌భాక‌ర్ రెడ్డి కూడా ఇక్క‌డి వారే. ఆయ‌న అయితే ఏకంగా చిత్ర‌పురి కాల‌నీ కోసం త‌న విలువైన స్థ‌లాన్ని కూడా ఇచ్చారు. ఆ కుటుంబాన్ని కూడా ఆదుకోలేదు.   టోట‌ల్ గా గ‌ద్ద‌ర్ అవార్డుల వ‌ల్ల మీకు హ్యాపీయేనా అని అడిగితే కొంద‌రు మాత్రం నాట్ హ్యాపీ అంటున్నారు.  ఎందుకంటే ఒక గ‌ద్ద‌ర్ అవార్డును స్మ‌గ్ల‌ర్ పాత్ర‌కు ఇవ్వ‌డం స‌రికాద‌ని చెబుతారు వీరు. అంతే కాదు ఒక రైట్ వింగ్ సినిమా ర‌జ‌కార్ కి లెఫ్ట్ వింగ్ ప్ర‌తీక అయిన గ‌ద్ద‌ర్ అవార్డు ఇవ్వ‌డ‌మేంటి? అస‌లు ఈ అవార్డుల‌న్నీ ఎవ‌రికి వెళ్లాయ్? ఈ అవార్డుల క‌మిటీలోని జ‌య‌సుధ‌, ముర‌ళీ మోహ‌న్ ఎవ‌రు?  వీరిలో ఎవరికీ కూడా అవార్డు సినిమా గుర్తింపే తెలీదు. వీరి ముందుకు స‌త్య‌జిత్ రే, శ్యాంబెన‌గ‌ల్ సినిమాల‌ను తీసుకొచ్చి పెట్టినా.. వాటిని తీసి ప‌క్క‌న పడేస్తారు. వీరు త‌మ‌కున్న సినిమా ప‌రిజ్ఞానంతో ఈ అవార్డులు ఇవ్వ‌లేదు. త‌మ‌కున్న ప‌రిచ‌యాల‌తో ఇచ్చారు త‌ప్పించి ఇందులో మ‌రేదీ లేదు. కావాల‌ని ప‌ట్టుబ‌ట్టి కావాల‌ని కొన్ని సినిమాల‌కు కొంద‌రు న‌టుల‌కు రాజ‌కీయ ఉద్దేశాల‌ను అనుస‌రించి అవార్డులిచ్చిన ప‌రిస్థితి కూడా ఉందంటూ.. కామెంట్ చేస్తున్నారు కొంద‌రు తెలంగాణ ద‌ర్శ‌కులు. అందుకే కేసీఆర్ ఈ అవార్డులు ఇవ్వ‌లేద‌ని అంటారు వీరు. ఈ కామెంట్ల‌ను బ‌ట్టి చూస్తే ఒక వేళ అవార్డులే ఇవ్వాల్సి వ‌స్తే అది ఆంధ్రోళ్ల‌కే ఎక్కువ అవార్డులు వెళ్తాయ‌న్న కోణంలో ఈ అవార్డుల‌ను కేసీఆర్ ప‌క్క‌న పెట్టేశార‌ని కంక్లూడ్ చేస్తున్నారు. అంటే కేసీఆర్ కేవ‌లం ఆంధ్ర తెలంగాణ బేధాన్ని క‌ళ‌ల్లోనూ చూపించార‌న్న‌మాట‌. కాబ‌ట్టే ప‌దేళ్ల పాటు సినిమా అవార్డులివ్వ‌లేద‌న్న‌మాట‌. అమ్మ కేసీఆర్ అంటూ ఇప్పుడు నోళ్లు నొక్కుకుంటున్నారు కొంద‌రు.
అమ్మ కేసీఆర్..  ప‌దేళ్ల పాటు సినిమా అవార్డులు ఎందుకివ్వ‌లేదో తెలిస్తే షాక్ Publish Date: May 31, 2025 2:13PM

టీటీడీలో త‌ర‌చూ వివాదాల‌కు కార‌ణం?

భార‌త‌మ్మ సైన్య‌మేనా? వీరెంత మంది వ‌ర‌కూ ఉన్నారు? టీటీడీలో రంగ ప్ర‌వేశం ఎప్పుడు జ‌రిగి ఉండొచ్చు?  తిరుమ‌ల‌లో త‌ర‌చూ   వివాదాలు జ‌ర‌గ‌టానికి గ‌ల కార‌ణ‌మేంటి?  ఈ సంస్థ‌లో అన్నమ‌య్య మ‌త‌స్తులు కాకుండా అన్య‌మ‌త‌స్తులుండ‌ట‌మే అస‌లు కార‌ణ‌మా? ఇంత‌కీ వీరి వాద‌నేంటి?  త‌ర‌చూ మ‌ద్య మాంసాల వ్య‌వ‌హారం..  ఆ త‌ర్వాత ఇదిగో టీటీడీ చైర్మ‌న్ డౌన్ డౌన్ అనే నినాదాలు చేసేవ‌ర‌కూ ఎలా కొన‌సాగుతూ వ‌స్తోంది? తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానాల్లో ఇటీవ‌లి కాలంలో వ‌రుస వివాదాలు న‌డుస్తున్నాయ్. ఆల‌య ప్ర‌తిష్ట‌కు భంగం క‌లిగేలా ఇవి ఉంటున్నాయ్. వీటి వెన‌క  రెండు వేల వ‌ర‌కూ ఉన్న‌ భార‌త‌మ్మ సైన్యం దాగి ఉందా? అన్న‌దొక డౌట్ ఫుల్ డిబేట్.  ఇంత‌కీ వీరెలా ఈ వ్య‌వ‌స్థ‌లో వేళ్లూనుకున్నారు? దీనంత‌టికీ కార‌ణం భూమ‌న వంటి  క్రిష్టియ‌న్లు చైర్మ‌న్ కావ‌డ‌మేనా? అన్న‌దొక అనుమానం కాగా..  తిరుమ‌ల వెంక‌టేశ్వ‌రుడంటే కేవ‌లం భూమ‌న‌కే కాదు.. వైయ‌స్ కి కూడా ఏమంత గౌర‌వం లేదని అంటారు.  ఏడు కొండ‌లు ఎందుకు?  రెండు కొండ‌లు చాలు క‌దా అన్న సీఎం వైయస్. అలాంటి వైయ‌స్ కాల‌గ‌ర్భంలో క‌లిసిపోయారు అనుకుంటే..  ఆయ‌న  కొడుకు జ‌గ‌న్ వ‌చ్చీ రావ‌డ‌మే గొడ‌వ గొడ‌వ‌. హైంద‌వాల‌యాల్లో అన్య‌మ‌త‌స్తులు ఉండ‌కూడ‌ద‌ని ఆనాటి  సీఎస్ ఎల్వీ సుబ్ర‌హ్మ‌ణ్యం జీవో తేవాల‌ని భావిస్తే కొంద‌రు క్రిష్టియ‌న్ సంఘాల వారు అడ్డుకున్నారు. ఇరువురిలో ఎవ‌రికి ప్ర‌యారిటీ ఇవ్వాల‌ని చూసిన జ‌గ‌న్   క్రిష్టియ‌న్ల వైపు మొగ్గారని అంటారు. దీంతో ఎల్వీని జీఏడీకి రిపోర్ట్ చేయ‌మ‌న్నారట‌. ఈ ఆగ్ర‌హంతో ఆయ‌న ఆనాటి ప్ర‌భుత్వం నుంచి ఎల్వీ వైదొలిగారని చెబుతారు. ఆ స‌మ‌యంలో కొన్ని క్రిష్టియ‌న్ సంఘాలు కేకులు క‌ట్ చేసిన  ఫోటోలు సైతం అప్పట్లో వెలుగులోకి వ‌చ్చాయని చెబుతారు. అంతేనా కావాల‌ని తిరుమ‌ల అట‌వీ సిబ్బందికి జీతాలు పెంచ‌క వారి ద్వారా వ‌న్య‌ప్రాణుల‌ను భ‌క్తులు న‌డిచే దారుల్లోకి ర‌ప్పించి.. ఏకంగా చిన్న పిల్ల‌ల ప్రాణాలు తీసే వ‌ర‌కూ తేవ‌డం కూడా అప్ప‌ట్లో పెను దుమారం న‌డిచింది. దీని వెన‌క కూడా ఏదైనా కుట్ర దాగి ఉందా? అన్న అనుమానాలున్నాయి.  ఇక అప్ప‌ట్లో మంత్రిగా ఉన్న రోజ‌మ్మ అయితే ఏకంగా క్రీస్తు డాల‌ర్ క‌లిగిన కెమెరామెన్ తో స‌హా వ‌చ్చి చేసిన హ‌డావిడి హంగామా మాములుగా లేదని అంటారు.  అంతేనా కిరాక్ ఆర్పీ చెప్పేదాన్నిబ‌ట్టి చూస్తే 30 వేల‌కు పైగా ఆమె సిఫార్సు లెట‌ర్లు ఇచ్చార‌ని తెలుస్తోంది. దీని వెన‌క కూడా అతి పెద్ద స్కామ్ న‌డిచేద‌ని టాక్. ఇలాక్కూడా రొజ‌మ్మ వెన‌కేసిన‌ట్టుగానూ చెబుతారు.  జ‌గ‌న్ ప్ర‌భుత్వంలోని క్రిష్టియ‌న్ లాబీ ద్వారా భారీ ఎత్తున హిందూ దేవాల‌యాల్లోకి క్రిష్టియ‌న్లు ప్ర‌వేశించి.. అప్ప‌ట్లో ఆల‌య ప్ర‌తిష్ట మంట‌గ‌ల‌పాల‌ని చూసేవార‌ని అంటారు. ఆనాటి పాపాల కార‌ణంగానే జ‌గ‌న్ అధికారం కోల్పోయినట్టు అంచ‌నా క‌డ‌తారు..  అయినా స‌రే జ‌గ‌న్ అండ్ కోకి ఇంకా బుద్ధి రావ‌డం లేద‌ని అంటున్నారు. అప్ప‌ట్లో తాము ప్ర‌వేశ పెట్టిన ఈ బీ- సైన్యాన్ని అడ్డు పెట్టుకునే.. ఇప్పుడు వి త‌ర‌చూ వాదాల‌ు రాజుకునేలా చేస్తున్నారట‌. ఈ విష‌యం ఎక్క‌డ బ‌య‌ట ప‌డుతుందోన‌ని.. భార‌త‌మ్మ అదే ప‌నిగా త‌మ ఇంట్లోనే తిరుమ‌ల సెట్ వేయించార‌నీ చెబుతారు.   లేకుంటే ఎవ‌రో ఒక భ‌క్తుడు డౌన్ డౌన్ అంటూ అరిచాడే అనుకుందాం. అత‌డి ఆలోచ‌న ఏంటంటే త‌న‌కు త్వ‌ర‌గా దైవ ద‌ర్శ‌నం ల‌భిస్తుంద‌నే భావిద్దాం... బేసిగ్గా వెంక‌న్న‌లాంటి దేవ‌దేవుడి ద‌ర్శ‌నానికి వ‌చ్చిన‌పుడు.. అంతా ఆయ‌న మీదే భార‌మేసి.. ఆయ‌న ఎప్పుడు క‌నిపిస్తే అప్పుడు త‌న మొక్కులు చెల్లించుకుని రావ‌ల్సి ఉంటుంది.  గంట‌ల త‌ర‌బ‌డి క్యూలైన్ల‌లో ఉన్న‌పుడు అనాల్సింది టీటీడీ చైర్మ‌న్ డౌన్ డౌన్ అని కాదు. గోవిందా గోవిందా అని. అప్పుడే పాప ప్ర‌క్షాళ‌న జ‌రిగేది. కంపార్ట్ మెంట్ల‌లో ఉన్న‌పుడు మ‌న‌కున్న స‌మ‌స్త రేడియేష‌న్ రోగాలు పోతాయ్. కార‌ణం మొబైల్ ఫోన్లు ఎప్పుడైతే బ‌య‌ట ప‌డేస్తామో,  అప్పుడు వాటి తాలూకూ ప్ర‌కంప‌న‌లు, ప్ర‌భావాల నుంచి దూర‌మ‌వుతాం. అది మ‌న శారీర‌క మాన‌సిక స్థితిగతుల‌కు ఎంతో మేలు చేస్తుంది. కాకినాడ‌కు చెందిన అచ్చారావ్ అనే ఆ భ‌క్తుడు  చేసిందే ఒక త‌ప్ప‌యితే.. దాన్ని వీడియో తీసిన వాడికి ఎంత భ‌యం లేక పోవాలి?  స‌రే ఇప్పుడున్న జ‌మానాలో సెల్ ఫోన్లు కామ‌నే కాద‌న‌డం లేదు. కానీ వెంక‌న్న లాంటి  మ‌హిమాన్విత దేవుడి విష‌యంలో న‌మ్మ‌కం వారిని ఇలాంటి త‌ప్పుడు ప్ర‌చారాలు చేయ‌కుండా ఆపేస్తుంది. అలా కూడా ఒకరు న‌మ్మ‌కాన్ని అతిక్ర‌మించి బ‌య‌ట‌కొచ్చేలా చేశారంటే దాన‌ర్ధ‌మేంటంటే వెంక‌న్న అంటే భ‌యం లేద‌ని. భక్తి లేదని. ఇలాంటి వారు అయితే పొలిటిక‌ల్ బ్యాగ్రౌండ్ కి చెందిన వారు, లేదంటే అన్య‌మ‌త‌స్తులే అయి ఉంటార‌ని అంచనా వేస్తున్నారు శ్రీవారి భ‌క్తులు. 
టీటీడీలో త‌ర‌చూ వివాదాల‌కు కార‌ణం? Publish Date: May 31, 2025 1:15PM

ఇల్లు అలకగానే పండగ కాదు

క‌డ‌పలో మ‌హానాడు తో జ‌గ‌న్ పై అన్నీ సాధించేసిన‌ట్టేనా? ఆల్ హ్యాపీస్ అంటూ ఇంట్లో బ‌జ్జుంటే…. ప్రత్యర్థులకు ప్రాణం పోసినట్టే బాబు భక్తులూ ఒకసారి వెనుదిరిగి చూడండి.. కూట‌మి ప్ర‌భుత్వం గెలిచిన కొత్త‌ల్లో ప్ర‌స్తుత స్పీక‌ర్ అయ్య‌న్న పాత్రుడు ఒక మాట అన్న విష‌యం గుర్తుందా?  జ‌గ‌న్ ఇంకా బ‌తికే ఉన్నాడ‌ని.. నిజానికి ఇక్క‌డెవ‌రికీ జ‌గ‌న్ చావాల‌న్న‌ది కాన్సెప్ట్ కాదు. ఇవాళ జ‌గ‌న్.. అంత‌క‌న్నా ముందు వైయ‌స్ఆర్ ఆ త‌ర్వాత‌ కేసీఆర్ ఇలా.. వ‌రుస‌గా ప్ర‌త్య‌ర్ధులు మారుతుంటారు. రేపు మ‌రొక‌రు కూడా వ‌స్తూనే ఉంటారు.  ఏదో సినిమాలో త్రివిక్రమ్ డైలాగ్ లా గెల‌వ‌డం అంటే ప్ర‌త్య‌ర్ధి మ‌ర‌ణం కాదు.. ఆ ఇజాన్ని చంప‌డం. విల‌నిజాన్ని అంతం చేయండం. ఈ విష‌యంలో మ‌న‌మెంత దూరం వ‌చ్చాం? నాలుగు పంచ్ డైలాగులు కొట్ట‌గానే స‌రిపోదు. జ‌గ‌న్ తాను అధికారంలోకి రాగానే ఎన్నో డైలాగులు కొట్టారు. సిద్ధం స‌భ‌ల‌తో ద‌ద్ద‌రిల్లేలా చేశారు. త‌ర్వాత ఏమైంది? మొత్తం తారు మారైంది. స‌రిగ్గా ఇక్క‌డే మ‌నం వ్యూహం ర‌చించాల్సి ఉంది. జ‌గ‌న్ కి వ‌చ్చింది ప‌ద‌కొండు సీట్లే కాబ‌ట్టి అత‌డి ఖేల్ ఖ‌తం అన్న భావ‌న‌లో ఉండ‌టం పూర్తిగా త‌ప్పు. ఆ సీట్ల వెన‌క 40 శాతం ఓటు బ్యాంకు ఉంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన్న‌ట్టు ఇదే జ‌గ‌న్ జ‌ర్మ‌నీలో ఉండి ఉంటే.. ప్ర‌తిప‌క్ష నేత అయ్యి ఉండేవాడు. అది కూడా అత్యంత లాంఛ‌నంగా.. ఘ‌నంగా! నిజాలు మాట్లాడుకుందాం. జ‌గ‌న్ త‌ల్లీ చెల్లి వెళ్లిపోయారు. ఇక అత‌డు ఒంట‌రి. రేప‌టి రోజు జైలుకు కూడా పంపించేస్తాం. ఆయ‌న వెన‌క విజ‌యసాయిరెడ్డి కూడా లేడు. మోడీ నుంచి కోర్టుల వ‌ర‌కూ మొత్తం వ్య‌వ‌హారం న‌డ‌ప‌డానికి.. సాయిరెడ్డి సాయం కూడా కోల్పోయాడ‌ని అనుకూల మీడియాలు రాసే విషాద గాథ‌ల మాయ‌లో ప‌డిపోకండి(అది జ‌న్మ జ‌న్మ‌ల జైలానుబంధం)  లైట్ తీసుకోవ‌డం కూడా చేటు తెచ్చేదే.  ఎందుకంటే అది మ‌రో వ్యూహం కావ‌చ్చు. అటు నుంచి న‌రుక్కు రావ‌డం అన్న‌దొక‌టి ఇందులో దాగి ఉండొచ్చు.  ఏమో ఇప్ప‌టి దాకా మో,షాలు జ‌గ‌న్ని జైలుకు పంప‌కుండా ఉన్నారంటే అర్ధ‌మేంటి? షా ఇక్క‌డికి వ‌చ్చినపుడు జ‌గ‌న్ గురించి వాక‌బు చేసిన విష‌యం మ‌ర‌చి పోయారా?  ఆయనను అడ్డు పెట్టుకుని ఆటాడ్డానికి ఇంకా ఎన్నో ఛాన్సులుండొచ్చు.  ఎందుకంటే జ‌గ‌న్ ని  జైలుకు పంప‌డం అంటే అదేమంత‌ జోక్ కాదు.  లోకేష్ మోడీ ద‌గ్గ‌ర‌కు వెళ్లారు. మొత్తం మేనేజ్ చేశారు. ఇక జ‌గ‌న్ ప‌ని క్లోజ్ అనుకోడానికి అస్స‌లు వీల్లేదు. కార‌ణం ఏంటంటారా? ఇదే జ‌గ‌న్ తండ్రి వైయ‌స్ త‌న క‌థ ముగిసిపోయింద‌ని ఫీలైన‌పుడు అస‌లు క‌థ మొద‌లు పెట్టారు. చంద్ర‌బాబు ముందు మ‌న‌మిక ఏమీ సాధించ‌లేమయ్యా! అంటూ త‌న ఆత్మ కేవీపీతో  అన్న మాట‌ల‌ను మ‌ర‌చి పోయారా ఏంటి? ఆ త‌ర్వాత చిన్నారెడ్డిని కెలికి.. తెలంగాణ అనే భూస్థాపిత‌మైన అంశాన్ని తిరిగి నిద్ర లేపి.. దాని ద్వారా  చంద్ర‌బాబుకు చెక్ పెట్టాల‌నుకోవ‌డంతో పాటు.. 2004 ఎన్నిక‌ల్లోనూ గెలిచేశారు. ఆ టైంలో చంద్ర‌బాబు అలిపిరి బ్లాస్టింగ్ జ‌రిగింది కూడా. ఆ సానుభూతి ప‌ని చేయాలి.. కానీ అలా జ‌ర‌గ‌లేదు. పాద‌యాత్ర సైతం చేసి ఎలాగోలా వైయ‌స్ ఆనాడు అధికారంలోకి వ‌చ్చారో  చూశారుగా.  మరి జగన్… ప్ర‌త్యేక హోదా అనే డెడ్ లైన్  పాలి.. ట్రిక్స్ బ‌య‌ట‌కు లాగి.. దాని  ద్వారా.. ఏకంగా టీడీపీని ఎన్డీయేలోంచి బ‌య‌ట‌కు వ‌చ్చేలా చేశారు. ఆ పై లోక్ స‌భ‌లో అవిశ్వాసం పెట్టి.. దానికి అధికార పార్టీ ద్వారా ఓటు వేయించిన ఘ‌నుడు జగన్. చ‌రిత్ర‌లో ఒక అధికార పార్టీ, ప్ర‌తిప‌క్ష పార్టీ పెట్టిన అవిశ్వాసానికి ఓటు వేయ‌డం అదే తొలిసారి. త‌ర్వాత ఏం జ‌రిగిందో అంద‌రికీ తెలిసిందే. అంతా ముగిసిపోయింద‌ని జ‌గ‌న్ లాంటి నేత‌ను అంత తేలిగ్గా న‌మ్మ‌డానికి లేదు. ఎందుకంటే, ఆ బ్ల‌డ్ లోనే  తిరిగి కోలుకోవ‌డం ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కూ బెజ‌వాడ క‌న‌క‌దుర్గ‌మ్మ ప్ర‌తి బొట్టులోంచి పుట్టుకొచ్చే మ‌హిషాసురుడ్ని హ‌త‌మార్చిందేమోగానీ టీడీపీ దాని కూట‌మి పార్టీలు ఆ స్థాయిలో జ‌గ‌న్ రాజ‌కీయ ప‌త‌నాన్నేమీ శాసించ‌లేదు.  ఇంకా జ‌గ‌న్ త‌న టెక్నిక్స్ తాను వాడుతూనే ఉన్నారు. అందులో భాగంగా విజ‌య‌సాయిని తెలివిగా అటు వైపున‌కు పంపారు. చాలా మంది సాయిరెడ్డి కూడా లేరు అని ఓ ఫీలై పోతున్నారుగానీ.. ఆయ‌న నిజంగా ఆలాగే ఉన్నారా? ఒక లీడ‌ర్ పార్టీని వ‌దిలిన‌పుడు ఆయన హావ భావ విన్యాసాలు ఎలా ఉండేవి?  చూడ‌లేదా మీరెప్పుడూ.. అదే విజ‌య‌సాయి తాను పార్టీని వ‌దిలిన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కూ జగన్ పై అదే సాఫ్ట్ కార్న‌ర్ చూపుతున్నారు. గ‌మ‌నించారా?  సాయిరెడ్డి ఇంకా జ‌గ‌న్ కి సాయం చేసే మూడ్ క‌మ్ మోడ్ లోనే ఉన్నారు. అందుకే పార్టీ వ‌దిలి వ‌చ్చిన నాటి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కూ ఆయ‌న తిట్ల‌లో ఏమంత ఫ్ర‌స్టేష‌న్ లేదు. అంతా వ్యూహాత్మ‌కంగానే ఉంది. గమనించారా? ఒక్కోసారి ఆట‌గాడు.. జ‌ట్టులో ఉండాల్సిన అవ‌స‌రం కూడా లేదు. నాన్ ప్లేయింగ్ కెప్టెన్ గానూ వ్య‌వ‌హ‌రించ‌వ‌చ్చు. ఎవ‌రు చెప్ప‌గ‌ల‌రు?  సాయిరెడ్డి సాయం అదృశ్య‌మైన‌ది కావ‌చ్చేమో.  2019లో విజ‌య‌సాయి ఆడియో కాల్ వ‌ల్లే ఆ పార్టీ గ‌ట్టెక్కింద‌ని గుర్తులేదా?  రేప‌టి రోజున బ‌య‌ట ఉండి ఇలాంటి సాయం చేయ‌రని ఎలా అనుకోగ‌లం.. ఎన్నో అవ‌కాశాలున్నాయ్.  ఇవాళ జ‌గ‌న్ తాను పార్టీ  న‌డ‌ప‌డానికి సైతం డ‌బ్బుల్లేవంటూ బీద‌రుపులు అర‌వ‌డం.. అద్దె కూడా క‌ట్ట‌లేనంటూ పార్టీ ఆఫీస్ మార్చేయ‌డం.. ఇలా చేస్తున్న‌దంతా నాట‌కం కాద‌ని ఎలా చెప్ప‌గ‌లం?  ఏమో ఏయే అవ‌స‌రాలు తీర్చ‌డానికి ఈ రాజ‌కీయాల్లో ఎవ‌రు- ఏ వైపునుంచి- ఎలా కాపు కాచి ఉన్నారో ఊహించ‌లేం కూడా ఒక్కోసారి.   ఒక రోజుకు జ‌గ‌న్.. శాండ్- వైన్- మైన్ అంటూ రోజుకు వెయ్యి(1000) కోట్ల వ‌ర‌కూ వ‌సూలు చేశారని అంటారు ఆ కాంపౌండ్లో కొన్ని క‌ళ్లారా  చూసిన‌- గుంటూరు చార్టెడ్ అకౌంటెంట్లు. కేసిరెడ్డి ద్వారా జ‌గ‌న్ చేయించింది.. నాట్ ఓన్లీ మ‌ద్యం కుంభ‌కోణం... హ‌వాలా వ్య‌వ‌హారం కూడా.  కోటి పంపి ఎన‌భై ల‌క్ష‌లు తిరిగి వ‌చ్చేలా ఒక నెట్ వ‌ర్క్ న‌డిపారంటే.. ఊహించుకోవ‌చ్చు.. ఇది ఎంత పెద్ద స్కెచ్చో. రియ‌ల్ ఎస్టేట్, న‌గ‌ల దుకాణాలు, అడ్వ‌ర్టైజింగ్ ఏజెన్సీలు, సినిమా ఇలా అన్ని మార్గాల ద్వారా ఈ సొమ్ము ఎవ‌రికి చేరిందో తెలిసిందే.  జ‌గ‌న్ ఇప్పుడు మిథున్ రెడ్డికి ఏం సంబంధం అన‌గానే ఆనాడు అందుకున్న క‌ట్ట‌ల పాములు ఊరుకుంటాయా ఏంటి? వాటి తాలుకూ  క‌స్సు బుస్సులు అడ‌వుల‌ను కూడా కొనేసేంత భారీ  స్థాయిలో.. బ‌య‌ట ప‌డుతూనే ఉంటాయ్.  అందుకే బాబు క‌డ‌ప  మ‌హానాడులో అన్న‌ది.. ప‌హల్గాం ఉగ్ర‌వాదుల‌క‌న్నా ఈ ఆర్ధిక ఉగ్ర‌వాదులు మ‌హా డేంజ‌ర‌ని. తల్లి సాయం లేదు, చెల్లి సాయం అంత‌క‌న్నా లేదు.. అనుకోడానికే వీల్లేదు. బావ అనిల్ కూడా స‌పోర్ట్ ఇవ్వ‌లేద‌ని జ‌స్ట్ లైట్ తీస్కోడానికి అంత‌క‌న్నా లేదు. ఆనాడు కేఏ పాల్ క్రిష్టియ‌న్ సంఘాల‌ను పోగేసి.. త‌ద్వారా అతి పెద్ద క్రైస్త‌వ శ‌క్తిగా ఎదుగుతున్నారని తెలిసి.. అనిల్ అనే ఒక బ్రాహ్మ‌ణ  క్రిష్టియ‌న్ని తెచ్చి.. త‌ద్వారా ఇక్క‌డ త‌న కుటుంబంలో అంటు క‌ట్టి.. ఇప్పుడా బావ‌ను అతి పెద్ద క్రిష్టిన్ గా ఎదిగాక‌.. ఆయనకు మాత్రం ఒక విజ‌య‌సాయికి ఉన్న‌ట్టు లోలోన ఓ కృత‌జ్ఞ‌తాభావం ఉండ‌క పోతుందా ఏంటి? అయిపోయింద‌నుకున్న చోట నుంచి పుట్టేదేన‌మ్మా రాజ‌కీయం. ఇది వెయ్యి త‌ల‌ల రాకాసి. అందునా రాజారెడ్డి మ‌న‌వ‌డు కూడా. ఒక‌ప్పుడు త‌న‌దైన ఫాక్ష‌నిజంతో ఒక కాపు మైనింగ్ య‌జ‌మానికి ర‌క్ష‌ణ‌గా  నిలుస్తాన‌ని మాట ఇచ్చి.. ఆ త‌ర్వాత ఆ మైన్ కే ఓన‌రైనోడి మ‌న‌వ‌డు. ఇలాంటి జుజుబీలు ఎన్ని చూసుంటారు? ఏం క‌థ‌! ఇప్పుడు జ‌గ‌న్ ని కానీ ఆయనలాంటి నాయ‌క‌త్వాన్ని కానీ ఈ భూమ్మీద లేకుండా చేయ‌డం ముఖ్యం కాదు. ఆయన చేసిన విధ్వంసం.. దాని తాలూకూ ప్ర‌భావం ఎలాంటిది? భ‌విష్య‌త్ లో దాని ద్వారా ఆంధ్రులు కోల్పోయేది ఏంట‌న్న‌ది మాత్ర‌మే మ‌నం ఫోక‌స్ చేయాలి. ఏమో పైకి కూట‌మి ఇచ్చిన హామీలు ఏమ‌య్యాయ‌ని? అడుగుతూనే లోలోప‌ల ఏ ప్ర‌త్యేక హోదాలాంటి  డెడ్ లైన్ పాలిటిక్స్ కి తెర‌లేపుతున్నారో?  డెడ్ డెత్ అనే ప‌దాలు జగన్ కు క‌లిసి వ‌చ్చిన‌ట్టు మ‌రెవ‌రికీ క‌ల‌సి  రావు కూడా! విలేఖ‌ర్ల‌తో తెలిసీ తెలియ‌క‌ ముచ్చట్లాడుతూ.. ఏ రెడ్ లైన్ పాలిటిక్స్ కి తెర‌లేపుతున్నాడో ఏమో. ఎవ‌రికెరుక? కొన్ని సెటిల్మెంట్ లతో  అన్నీ వాటిక‌వే మాఫీ అయిపోవా??? ఇప్ప‌టి వ‌ర‌కూ బ‌య‌టున్నాడంటే విజ‌య‌సాయి ఉండ‌టం వ‌ల్లే కాదు.. ఇలాంటి విజ‌యాల‌ను, సాయాల‌ను వంద కొన‌గ‌ల‌డు.. (ఇందాకే అనుకున్నాంగా రోజుకు వెయ్యి కోట్ల‌ని) అలాంటోడ్ని త‌క్కువ అంచ‌నా వేసి... క‌డ‌ప‌లో జ‌రిపిన‌ మ‌హానాడుతో ఈ విజ‌యం సంపూర్ణం అనుకోడానికి అస్స‌లు వీల్లేదు. చిన్న‌పామునైనా ప‌ద్ద క‌ర్ర‌తో కొట్టాలంటారు.. అలాంటిది ఇంకా న‌ల‌భై శాతం ఓట్ షేర్ అనే ప్రాణంతో ఉన్న పామిది.. న‌ల‌భై గురూ 40.. దాన్ని మ‌ర‌చిపోవ‌ద్దు. దేవాన్ష్ తో ఢిల్లీ తాత‌య్య ఎందుకాడుకున్నాడో ఏమో.. ఒక్కోసారి  యురోపియ‌న్ సిగ్న‌ల్స్ వేరుగా ఉంటాయ్. మీకు అతి గౌర‌వం ఇస్తున్నారంటే ఎక్క‌డైనా ఎప్పుడైనా హ్యాండ్ ఇవ్వ‌డానికేనేమో.. ఎవ‌రికి తెలుసు??? కాబ‌ట్టి బాస్ మ‌నం చేయాల్సింది.. జ‌గ‌న్ని అంతం చేయ‌డం కాదు. జ‌నంలో ఉన్న అత‌డి న‌మ్మ‌కాన్ని. ఇంత‌కీ ఏంటా న‌మ్మ‌కం అంటే, ఆ ప‌ల్స్ ప‌ట్టుకోవాలి. దాని ద్వారా మొత్తం సెట్ చేయాలి. విజ‌య‌సాయి కూడా లేడు అని ఓ ఫీలై పోమాకండి. ఆయ‌న చుట్టూ ఉన్న లీడ‌ర్లంతా అయితే జైలు, లేదంటే బెయిలు, మ‌రీ మాట్లాడితే వ‌కీళ్ల‌ని వాడెవ‌డో రాసాడ‌ని రిలాక్స్ అయితే … ఇది రాజ‌కీయం. అందునా.. ఏం చేసైనా.. పై చేయి సాధించాల‌నుకునే రాజారెడ్డి మార్క్ రాజ్యాంగం. రెడ్ బుక్ ని చూసి వాళ్లంతా జ‌డుసుకుంటున్నార‌ని నీకు నువ్వ బిందాస్ అయిపోకు.. అన్న‌ది కొంద‌రు విశ్లేష‌కుల నుంచి కూట‌మినేత‌ల‌కు అందుతోన్న సూచ‌న‌. మ‌రి చూడాలి.. దీన్ని కూట‌మినేత‌లు ఎలా తీసుకుంటారో తేలాల్సి ఉంది.
ఇల్లు అలకగానే పండగ కాదు Publish Date: May 31, 2025 12:40PM

హస్తం పార్టీలో అంతర్యుద్ధం.. వ్యక్తిగత రాగ ద్వేషాలపై రగులు తున్న నేతలు

కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావ.. బీఆర్ఎస్ రెబెల్ స్టార్, కల్వకుట్ల కవిత  చేసిన సంచలన వ్యాఖ్య ఇది.  ఆమె ఏ ఉద్దేశంతో ఆ మాటన్నారో  కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి గురించి ఆమె ఈ వ్యాఖ్య చేశారో లేక దేశం మొత్తంలో హస్తం పార్టీ మునిగి పోతున్నదనే ఉద్దేశంతో ఈ వ్యాఖ్య చేశారో ఏమో కానీ..   పార్టీ పరిస్థితి దేశం అంతటా ఒకేలా ఉందన్న చర్చ కాంగ్రెస్  వర్గాల్లోనే   జరుగుతోంది.  ముఖ్యంగా..  పాకిస్థాన్ మన దేశం పై దశాబ్దాలుగా సాగిస్తున్న ఉగ్రవాద దుశ్చర్యలను శాశ్వతంగా తుదముట్టించేందుకు, ప్రధాని నరేంద్ర మోదీ సారధ్యంలో కేంద్ర ప్రభుత్వం,  సైన్యం వ్యూహాత్మకంగా సాగిస్తున్న బహుముఖ యుద్ధం విషయంలో..  కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు కొందరు చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలు పార్టీ ప్రతిష్టను దిగజాజరుస్తున్నాయని సీనియర్ నాయకులు అంటున్నారు. అంతే కాదు.. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ  మొదలు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరకు కొందరు ముఖ్య నాయకులు చేస్తున్న పాక్ అనుకూల వ్యాఖ్యలు  పార్టీకి నష్టం చేసేలా ఉన్నాయని అంటున్నారు. ఇదే ధోరణి కొనసాగితే..  రాజకీయంగానూ పార్టీ భారీ మూల్యం చెల్లిచుకోవలసి  వస్తుందని  పార్టీ సీనియర్ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  అంతే కాదు..  దేశం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో..  దేశ ప్రయోజనాలను పణంగా పెట్టి  వ్యక్తిగత రాగ ద్వేషాల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటే, అందుకు పార్టీ మాత్రమే కాదు.. దేశం కూడా  మూల్యం చెల్లించవలసి వస్తుందని కాంగ్రెస్ సీనియర్ నాయకులు అంటున్నారు.    దేశంలో పాక్ వ్యతిరేక  సెంటిమెంట్ బలంగా ఉన్న సమయంలో.. రాహుల్ గాంధీ వ్యక్తిగత రాగద్వేషాలకు అనుగుణంగా ప్రదాని మోదీ, భారత సైన్యాన్ని, చివరకు సొంత పార్టీకి చెందిన సీనియర్ నాయకులను అనుమానించడం, అవమానించడం పార్టీకీ,  దేశానికీ మంచింది కాదని సీనియర్ నాయకులు అంటున్నారు. రాహుల్ గాంధీకి సన్నిహితంగా ఉండే  కొదరు కీలక నేతలు  ప్రధాని మోదీకీ, దేశానికీ మధ్య ఉన్న విభజన రేఖను చెరిపేసి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలు కాంగ్రెస్ పార్టీ పాకిస్థాన్ అనుకూల వైఖరి అవలంబిస్తోందనే తప్పుడు సంకేతలు పంపుతోందని  సీనియర్ నేతలు  అభిప్రాయ పడుతున్నారు. ముఖ్యంగా.. సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌ చర్యలను ప్రపంచానికి చాటి చెప్పేందుకు ప్రపంచ దేశాల్లో సాగిస్తున్న ఎంపీల దౌత్య యాత్రలో భాగంగా..    కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్  సహా.. పార్టీలకు అతీతంగా ఎంపిక చేసిన ఎంపీల ప్రతినిధి బృందాలు వివిధ దేశాల్లో పర్యటిస్తున్న సమయంలో, రాహుల్ గాంధీ మొదలు రేవంత్ రెడ్డి వరకు  పాకిస్థాన్ ప్రధాని సహా ప్రపంచ దేశాలన్నీ అంగీకరించిన భారత సైన్యం, భారత ఆయుధ సంపద, మన యుద్ద విమానాల సామర్ధ్యాన్ని ప్రశ్నించడం పార్టీ ప్రతిష్టను పలచన చేస్తోందని హస్తం పార్టీ నేతలు అంటున్నారు.  స్వయంగా పాకిస్థాన్ ప్రధాని తమ సైన్యం కళ్ళు తెరిచే ముందే భారత  వైమానిక దళం  తమ దేశంలోని 11  వైమానిక స్థావరాలను ద్వంస  చేసిందని బహిరంగంగా చెప్పిన తర్వాత కూడా రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి వంటి  ఆయన అనుచరులు  ఇంకా.. పాకిస్థాన్ కూల్చిన యుద్ధవిమానాల లెక్కలు చెప్పాలని డిమాండ్ చేయడం  దేశ  ప్రజల మనో ధైర్యాన్ని దేబ్బతీసే చర్యగా పేర్కొంటున్నారు.  మరో వంక  మన ఎంపీల బృందానికి సారధ్యం వహిస్తున్న శశిథరూర్ పార్టీ  లక్ష్మణరేఖ  దాటారని  కోటరి నేతలు ఆయనపై విరుచుకుపడడం పార్టీ ఇమేజ్ ని తీసిందనే అభిప్రాయం పార్టీలో బలంగా వినిపిస్తోంది. ఒక్క రాహుల్ గాంధీ ముచ్చట తీర్చేందుకు, దేశం తరపున దౌత్యపర్యటనలో ఉన్న పార్టీ ఎంపీ, శశిథరూర్’ను టార్గెట్ చేస్తూ కొందరు నాయకులు  చేస్తున్న విమర్శలు పార్టీ ప్రతిష్టనే కాదు, దేశ ప్రతిష్టను దిగజార్చే విధంగా ఉన్నాయని సీనియర్ నేతలు విచారం వ్యక్తపరుస్తున్నారు.   ఈ నేపధ్యంలో.. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఎంపీ సల్మాన్ ఖుర్షీద్ మరో  బాంబు పేల్చారు. జమ్మూకశ్మీర్‌కు సంబంధించిన ఆర్టికల్ 370ని రద్దు చేయడాన్ని స్వాగతించారు. నిజానికి కాంగ్రెస్ ఆర్టికల్ 370ని రద్దుని వ్యతిరేకించడమే కాదు..  కేంద్రంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే దానిని పునరుద్దరిస్తామని ప్రకటించింది. అయితే ఇప్పడు.. ఖుర్షీద్  ఆర్టికల్ రద్దుకు  ఆ రాష్ట్ర ప్రజల నుంచి సానుకూల స్పందన వచ్చిందని, ఆ క్రమంలో జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో 65శాతం మేర పోలింగ్ నమోదయిందని గుర్తు చేశారు. దీంతో రాష్ట్రంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఏర్పాటైందని వివరించారు. ఇండినేషియా పర్యటనలో భాగంగా అక్కడి మేథావులు, విద్యా సంస్థల ప్రతినిధులతో విదేశీ వ్యవహారాల శాఖ మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇలా సీనియర్ నాయకులు ఒకరొకరుగా రాహుల్ బృందం భాషలో లక్ష్మణ రేఖను దాటుతున్నారు. అందుకే కావచ్చును కవిత, కాంగ్రెస్ మునుగుతున్న నావ అన్నారు.నిజమే కావచ్చును.
హస్తం పార్టీలో అంతర్యుద్ధం.. వ్యక్తిగత రాగ ద్వేషాలపై రగులు తున్న నేతలు Publish Date: May 31, 2025 12:29PM

శ్రీ వెంగమాంబ బ్రహ్మోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ

నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం నర్రవాడ  శ్రీ వెంగమాంబ  దేవస్థానంలో జూన్ 15వ తేదీ నుండి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన పోస్టర్ ను   ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్   ఆవిష్కరించారు.   అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ఈ బ్రహ్మోత్సవాలకు రాష్ట్రం నలుమూల నుంచీ భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తారు.   భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయనున్నట్లు కాకర్ల సరేష్ చెప్పారు.  పోస్టర్ ఆవిష్కరణ అనంతరం ఆయన అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై చర్చించారు.  పారిపారిశుద్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలని, అన్ని శాఖల అధికారులూ సమన్వయంతో పని చేయాలని దిశా నిర్దేశం చేశారు.   
 శ్రీ వెంగమాంబ బ్రహ్మోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ Publish Date: May 31, 2025 10:54AM

మహానాడుకు బాలయ్య గైర్హాజరుపై అనవసర రచ్చ

తెలుగుదేశం పార్టీ మహానాడు కడపలో అట్టహాసంగా జరిగింది. ఎన్టీఆర్ జయంతి వేడుకలు, పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు ఎన్నికతో సందడి నెలకొంది. అయితే హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మహానాడుకు హాజరు కాలేదు. దీంతో ఆయన ఎందుకు రాలేదనే చర్చ జరుగుతోంది. బాలయ్య రాకపోవడంపై ఎన్నో ఊహాగానాలు వినిపిస్తున్నాయి.  రాయలసీమ గడ్డపై నిర్వహించిన మహానాడులో పార్టీ నేతలు, కార్యకర్తల సందడి కనిపించింది. రాష్ట్రం నలుమూలల నుంచి టీడీపీ నేతలు, కార్యకర్తలు మహానాడుకు హాజరయ్యారు మహానాడు వేదికగా  నిర్వహించిన కార్యక్రమంలో పలు తీర్మానాలు ప్రవేశపెట్టి ఆమోదించారు..  ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించారు. చంద్రబాబును పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. చివరి రోజు భారీ బహిరంగసభ నిర్వహించారు. కడప వేదికగా జరుగుతున్న మహానాడులో  హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కనిపించలేదు. దీంతో ఆయన ఎందుకు రాలేదనే చర్చ జరుగుతోంది. కడప మహానాడులో నందమూరి వారసులు కనిపించని లోటు స్పష్టంగా కనిపించిందని తెలుగు తమ్ముళ్లు సైతం చర్చించుకుంటున్నారు. తొలిసారిగా కడప జిల్లాలో నిర్వహించిన మహానాడులో బాలకృష్ణ సందడి కనిపించకపోవడం పెద్ద లోటే అంటున్నారు. చంద్రబాబు నాలుగో సారి ముఖ్యమంత్రి అయ్యాక జరిగిన తొలి మహానాడు గ్రాండ్ సక్సెస్‌ అయింది. దిగ్విజయంగా మహానాడు జరిగితే బాలయ్య ఎక్కడ అని ప్రాంగణంలో టీడీపీ శ్రేణులు వెతుక్కోవడం కనిపించింది. ఎన్టీఆర్ రాజకీయ వారసుడిగా కొనసాగుతున్న బాలయ్య హిందూపురంలో వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. పార్టీలో పొలిట్‌బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. ఎన్టీఆర్‌కి వారసులుగా హరికృష్ణ, బాలయ్య రాజకీయాల్లో ఉన్నారు. ఆ నందమూరి వారసులు  ఇద్దరూ దాదాపు ప్రతి మహానాడులో పాల్గొన్నారు. హరికృష్ణ మరణించిన తర్వాత బాలకృష్ణ అటు సినిమాల్లో, ఇటు రాజకీయాల్లో యాక్టివ్‌ రోల్ పోషిస్తున్నారు. ఇక హరికృష్ణ తనయులు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్‌లు ఎప్పటి నుంచో రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఎన్టీఆర్‌ స్థాపించిన పార్టీ నిర్వహించే మహానాడు పార్టీ శ్రేణులకు పెద్ద పండుగలాంటిది. మూడురోజులపాటు పండగలా నిర్వహించే కార్యక్రమంలో బాలకృష్ణలో ఎప్పుడు స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా ఉండేవారు.  ఎన్టీఆర్ కి కుమారుడిగా ముఖ్యమంత్రి చంద్రబాబుకి వియ్యంకుడిగా లోకేష్‌కి మామగా ఉన్న బాలయ్య అంతటి ప్రాధాన్యత కలిగిన మహానాడుకు హాజరు కాకపోవడం టీడీపీ వర్గాలను తీవ్రంగా నిరాశపరిచిందంట. అంతే కాదు బాలయ్య హైదరాబాద్‌లో ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళి కార్యక్రమంలో కూడా పాల్గొనలేదు. దాంతో బాలయ్య ఎక్కడ ఉన్నారు ఏమి చేస్తున్నారనే చర్చ నడుస్తోంది. ఆయన విదేశాలలో షూటింగ్ నిమిత్తం ఉండడంవల్లే మహానాడుకు హాజరుకాలేదు.  బాలయ్య అఖండ 2 మూవీ షూటింగ్‌ కోసం జార్జియా వెళ్లారని.. అక్కడ బిజీ షెడ్యూల్ కారణంగానే మహానాడుకు దూరంగా ఉన్నారని చెబుతున్నారు. ముందుగా ఫిక్స్‌ అయిన షెడ్యూల్‌ కారణంగానే బాలకృష్ణ సినిమా షూట్‌లో పాల్గొనాల్సి వచ్చిందనేది సినీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. విదేశాల్లో షూటింగ్‌ పనుల వల్లనే మహానాడుకు దూరం ఉండాల్సి వచ్చింది తప్ప...  వేరే కారణాలు లేవని అంటున్నారు నందమూరి ఫ్యాన్స్. నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబోలో అఖండ 2 : తాండవం మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాను ఈ ఏడాది సెప్టెంబర్ 25న పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ కారణంగా బాలయ్య బిజీగా ఉన్నారంట. సమయం దొరికినప్పుడు హిందూపురం నియోజకవర్గానికి వెళుతున్నారు. అంతేకాదు నందమూరి బాలకృష్ణకు ఇటీవల పద్మభూషణ్ అవార్డు వచ్చింది.. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. అనంతరం హిందూపురంలో భారీ పౌర సన్మాన కార్యక్రమం కూడా నిర్వహించారు. ఆ తర్వాత బాలయ్య మూవీ షూటింగ్ కోసం జార్జియా వెళ్లారు. అక్కడ షూటింగ్ బిజీ షెడ్యూల్ కారణంగా మహానాడుకు రాలేకపోయారు.  దీనిపై వైసీపీ నేతలు అనవరంగా రచ్చ చేస్తున్నారంటూ తెలుగు తమ్ముళ్లు ఫైర్ అవుతున్నారు. 
మహానాడుకు బాలయ్య గైర్హాజరుపై అనవసర రచ్చ Publish Date: May 31, 2025 10:42AM

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులు ముగింపు దశకు వస్తుండటం, వారాంతం కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. శనివారం (మే 31) ఉదయం శ్రీవారి దర్శనం కోసం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి క్యూలైన్ శిలాతోరణం వరకూ సాగింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక శుక్రవారం శ్రీవారిని మొత్తం  71 వేల 721 మంది దర్శించుకున్నారు. వారిలో 36 వేల 11 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 47 లక్షల రూపాయలు వచ్చింది.  ఇలా ఉండగా శుక్రవారం అర్ధరాత్రి సమయంలో శ్రీవారి సర్వదర్శనం కోసం క్యూలైన్ లో వేచి ఉన్న భక్తులు సౌకర్యాలు కరవయ్యాయంటూ ఒక్కసారిగా ఆందోళనకు దిగారు. టీటీడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అధికారులు రావాలి, భక్తులకు సౌకర్యాలు కల్పించాలంటూ డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి భక్తల వద్దకు వచ్చి వారి సమస్యలు అడిగి తెలుసుకుని నచ్చ చెప్పి వారడిగిన సౌకర్యాలు కల్పించారు. విపరీతమైన రద్దీ, గంటల తరబడి క్యూలో నిలుచోవలసి రావడంతోనే భక్తులలో అసహనం పెరిగి ఆందోళనకు దిగారు. 
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ Publish Date: May 31, 2025 10:20AM

కాకరకాయ ఆరోగ్యానికి మంచిదే అయినా.. ఎంత హాని చేస్తుందో తెలిస్తే షాక్ అవుతారు!

  ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఇందుకోసం ఏవేవో చెయ్యక్కర్లేదు. తాజా ఆకుకూరలు, కూరగాయలు తింటుంటే ఆరోగ్యం ఆఫహే చేకూరుతుంది. మరీ ముఖ్యంగా ఆరోగ్యంగా ఉండటానికి ఆకుపచ్చ కూరగాయలు పండ్లను తినమని పెద్దలు చెబుతారు. అన్ని రకాల కూరగాయలు తిన్నప్పుడే ఆరోగ్యం బాగుంటుంది. కానీ చాలామంది కొన్నింటికి స్టిక్ అయిపోయి ఉంటారు. అయితే ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా కొందరు కొన్ని కూరగాయలను, పండ్లను ఎక్కువగా తీసుకుంటారు. అలాంటి వాటిలో కాకరకాయ కూడా ఒకటి. పిల్లలకు ఏమాత్రం ఇష్టం లేని ఈ కాకరకాయ ఆరోగ్యానికి మంచిదే అయినా విపరీతంగా తింటే చెప్పలేనన్ని సమస్యలు వస్తాయి.  కాకరకాయ తినడం వల్ల బరువు తగ్గవచ్చు, కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా అదుపులో ఉంటాయి. గుండె వేగాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కూడా కాకరకాయ ఉపయోగపడుతుంది. అయితే కాకరకాయను ఎక్కువగా తీసుకోవడం వల్ల బోలెడు నష్టాలు ఫేస్ చేయాల్సిందే.. ఏదైనా మితిమీరితే హానికరం అనే మాట తెల్సిందే కదా.. కాకరకాయను ఎక్కువగా తినడం వల్ల ఆరోగ్యంపై పడే చెడు ప్రభావాల గురించి నష్టాల గురించి తెలుసుకుంటే..  కాకరకాయ  తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుందని అందరూ అనుకుంటారు. అయితే సాధారణ వ్యక్తుల్లో షుగర్ లెవల్స్ సాధాణంగానే ఉంటాయి. ఇలాంటి వారు కాకరకాయను ఎక్కువ తీసుకుంటే షుగర్ లెవెల్స్ మీద ప్రభావం పడుతుంది. అలాగే అధిక షుగర్ లెవెల్స్ ఉన్నవారు షుగర్ కంట్రోల్ ఉండటానికి మెడిసిన్ వాడుతుంటారు. ఇలాంటి వాళ్ళు కాకరకాయ ఎక్కువ తిన్నా షుగర్ లెవల్స్ డౌన్ అవుతాయి. అలాగే, హిమోలిటిక్ అనీమియా ప్రమాదం కూడా కాకరకాయ ఎక్కువ తినడం వల్ల పెరుగుతుంది. గర్భధారణ సమయంలో కాకరకాయను తినకూడదు. దీన్ని ఎక్కువగా తినడం వల్ల పుట్టబోయే బిడ్డకు హాని కలుగుతుంది. గర్భిణీ స్త్రీలు కాకరకాయకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.  కాకరకాయను ఎక్కువగా తీసుకునేవారికి కాలేయానికి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.  కాకరకాయలో లెక్టిన్ ఉంటుంది. దీన్ని తీసుకోవడం వల్ల కాలేయంలో ప్రొటీన్ల కమ్యూనికేషన్ నిలిచిపోతుంది. అందుకే పొట్లకాయను రెగ్యులర్ గా, ఎక్కువగా తినకూడదు. కాకరకాయ ఎక్కువగా తినడం వల్ల విరేచనాలు, వాంతుల సమస్య పెరుగుతుంది. కాకరకాయలో బోలెడు ప్రయోజనాలున్నాయని దాన్ని ఇంట్లో వారికి, పిల్లలకు ఎక్కువగా వండిపెట్టే వారు దీనిగురించి తెలుసుకోవాలి. ఆరోగ్యానికి మంచిదే అయినా హాని కూడా కలిగించడంలో కాకరకాయ కూడా ఒకటనే విషయం మరచిపోకూడదు.                                        ◆నిశ్శబ్ద. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
కాకరకాయ ఆరోగ్యానికి మంచిదే అయినా.. ఎంత హాని చేస్తుందో తెలిస్తే షాక్ అవుతారు! Publish Date: May 31, 2025 9:30AM

భార్యాభర్తల గొడవలకు కారణాలు ఏంటి? వాటిని ఎలా అధిగమించాలంటే..!

  తల్లిదండ్రుల తో బంధం చిన్నతనం నుంచి ఉంటుంది.  అందుకే వారితో ఏదైనా గొడవ జరిగితే అది కొన్ని గంటలు లేదా రోజులలో క్లియర్ అవుతుందిి. కానీ భార్యాభర్తల మధ్య జరిగే గొడవలు చాలా వరకు తీవ్ర పరిస్థితులకు దారి తీస్తుంటాయి.  అసలు భార్యభర్తల మధ్య గొడవలకు కారణాలు ఏంటో తెలుసుకుంటే బంధాన్ని నిలబెట్టుకునే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. భార్యభర్తల మధ్య గొడవలు అనేవి సాధారణంగా వివాహిత జీవితంలో వస్తుంటాయి. ఇవి చిన్నపాటి అభిప్రాయ భేదాల నుంచి తీవ్రమైన సమస్యల వరకు ఉండవచ్చు. గొడవలకు ప్రధానమైన  కారణాలు ఇవే:  ఆర్థిక సమస్యలు డబ్బు ఖర్చులు, ఆదాయం, పొదుపు పై అగ్రిమెంట్ లేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవకు దారి తీస్తుంది.  భర్త తనదే ఆధిపత్యం అని, భార్య తనకు ప్రాధాన్యత ఇవ్వకుండా నిర్ణయాలు తీసుకుంటాడని ఇలా.. ఇద్దరూ ఆర్థిక విషయాలలో అబిప్రాయ బేధాలతో గొడవలు పడే అవకాశాలు ఉంటాయి. అలాగే ఒకరి ఖర్చు పద్ధతులు ఇంకొకరికి నచ్చకపోవడం కూడా ఆర్థిక గొడవలకు కారణం అవుతుంది. ఆత్మీయత లోపం లేదా శారీరక సంబంధాల్లో తేడా.. శారీరక సంబంధాలపై అబద్ధపు అంచనాలు,  ప్రేమ లేదా స్పర్శలో లోపం భార్యాభర్తల మద్య పెద్ద గొడవలకు కారణాలు అవుతాయి. సాధారణంగా వివాహం అనేది ప్రేమ, నమ్మకం,  శారీరకంగా ఒకరిని ఒకరు కోరుకోవడంలోనే ఆధారపడి ఉంటుంది. కానీ వివాహం తరువాత ఇవి లోపిస్తే ఇద్దరి మధ్య అసంతృప్తి ఏర్పడి అది కాస్తా గొడవలుగా మారుతుంది. అభిప్రాయ భేదాలు.. కుటుంబపరమైన నిర్ణయాలు, పిల్లల పెంపకం, జీవిత పద్ధతులపై విభిన్న అభిప్రాయాలు ఉంటాయి.  భార్యాభర్తలు ఇద్దరూ కలసి చర్చించి ఈ విషయాలలో ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కానీ భర్త తను, తన తల్లిందండ్రులు చెప్పినట్టే జరగాలని, భార్య తన మాట నెగ్గాలని పంతానికి పోతే ఇద్దరి మధ్య అబిప్రాయ బేధాలు ఏర్పడి గొడవలు అవుతాయి. ఆత్మగౌరవ సమస్యలు / ఈగో సమస్యలు.. ఒకరి మాటకి మరొకరు విలువ ఇవ్వకపోవడం. చిన్న విషయాల్లోనూ తానెక్కడా తగ్గకూడదన్న భావన భార్యాభర్తల మధ్య గొడవలు సృష్టిస్తుంది.  భార్యాభర్తలు తామరిద్దరూ సమానమే అనే విషయాన్ని తెలుసుకుని ఒకరిని ఒకరు గౌరవించుకుంటే.. ఒకరి మాటకు మరొకరు ప్రాధాన్యత ఇవ్వగలరు. అభిమానాలు / అనుమానాలు.. ఒకరిపై మరొకరికి నమ్మకం లేకపోవడం, చిర్రెత్తించే ప్రవర్తనలపై అనుమానాలు పెరగడం వల్ల బంధం విచ్చిన్నమవుతుంది. బంధంలో నమ్మకమే కీలక పాత్ర పోషిస్తుంది. అనుసంధానం లోపం (Communication Gap).. సరిగ్గా మాట్లాడుకోకపోవడం, భావాలను పంచుకోకపోవడం వల్ల గొడవలు వస్తాయి. పెళ్లంటే కేవలం ఆర్థికంగా,  ఇంటి పనులలో ఒకరి అవసరం మరొకరికి ఉండటం కాదు.  ఇద్దరి మధ్య మానసిక అనుబంధం కూడా ఉండాలి.  స్నేహితుల్లా మాట్లాడుకోవాలి. బంధువుల జోక్యం.. భార్యాభర్తల తల్లిదండ్రుల  జోక్యం,  తోబుట్టువులు,  స్నేహితులు, బంధువుల జోక్యం వల్ల, వారిచ్చే సలహాల కారణంగా  ఒకరినొకరు తప్పుగా అర్థం చేసుకోవడం జరిగి గొడవలు వస్తాయి. వ్యక్తిత్వ తేడాలు.. ఒకరు చురుకుగా ఉండగా, ఇంకొకరు అంతగా కాకపోవడం,  జీవితంలో గమ్యం లేదా అభిరుచుల్లో తేడా ఉండటం. వీటి వల్ల  ఇద్దరి మధ్య జీవితానికి సంబంధించిన లక్ష్యాలు,  భవిష్యత్ ప్రణాళికలు వంటివి చేరుకోలేక పోతారు. సమస్యలు తగ్గించడానికి మార్గాలు: ఓపికగా వినాలి, సానుభూతితో స్పందించడం చాలా ముఖ్యం. స్పష్టమైన సంభాషణ  ఉండాలి. దీని వల్ల ఇద్దరి మధ్య అపార్థాలు రావు. పరస్పర గౌరవం ఉండాలి.  గౌరవం లేని బంధం ఎక్కువ కాలం నిలబడదు. చిన్న విషయాల్లో క్షమించటం నేర్చుకోవాలి.  అన్ని విషయాలకు పంతానికి పోతూ ఉంటే తనను గౌరవించట్లేదని భాగస్వామి అర్థం చేసుకునే అవకాశం ఉంది. అవసరమైతే కౌన్సిలింగ్ తీసుకోవడం మంచిది. ఇది భార్యాభర్తలు చేస్తున్న తప్పులు తెలియజేసి ఒకరితో ఒకరు ఎలా ఉండాలో తెలుసుకునేలా చేస్తుంది.                                                          *రూపశ్రీ.
భార్యాభర్తల గొడవలకు కారణాలు ఏంటి? వాటిని ఎలా అధిగమించాలంటే..! Publish Date: May 31, 2025 9:30AM

సీజన్ మారుతోంది.. ఈ జాగ్రత్తలు పాటించండి..

  సీజన్ మారుతున్నప్పుడు శరీర ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతిసారి వాతావరణం మారినప్పుడు రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడం, సరైన జీవనశైలి పాటించడం ముఖ్యం. ఇందుకోసం కొన్ని ఆరోగ్య చిట్కాలు పాటించాలి.  ప్రస్తుతం వేసవి కాలం సాగుతున్నా.. వర్షాలు పడుతూ వాతావరణం చాలా డిస్టర్బ్ గా ఉంటోంది.  వర్షాలు వేసవిలో ఊరట అనిపిస్తాయి కానీ వీటి వల్ల కలిగే సమస్యలు కూడా ఉంటాయి.  ఈ వాతావరణ మార్పులలో పాటించాల్సిన జాగ్రత్తలు ఏంటంటే.. పరిమిత ఆహారం తీసుకోవాలి. హైడ్రేట్‌డ్‌గా ఉండాలి.  వాతావరణం చల్లగా ఉంది కదా అని నీరు తగ్గించకూడదు.ఎక్కువ నీరు త్రాగాలి. తాజా పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. విటమిన్ C ఎక్కువగా ఉన్న ఆహారం (లేత నిమ్మకాయ, ఉసిరికాయ, కివి, నారింజ) శరీర రక్షణ శక్తిని పెంచుతుంది. వేడి లేదా బరువుగా ఉన్న ఆహారం తక్కువగా తీసుకోవాలి (ముఖ్యంగా ఈ వేసవిలో). చల్లటి పదార్థాలు (ఐస్ క్రీమ్, చల్లని పానీయాలు) ఎక్కువగా తీసుకోవడం వలన శరీరం పై ప్రభావం చూపొచ్చు, జాగ్రత్తగా ఉండాలి.  ముఖ్యంగా వాతావరణం చల్లగా ఉన్న సమయంలో వాతావరణ మార్పులకు అలవాటు పడటం మంచిది. ఉదయం సూర్యోదయ సమయానికి బయట తిరగడం మంచిది. ఇది శరీరానికి డే-నైట్ సైకిల్‌ను స్థిరపరుస్తుంది. బయట ఉష్ణోగ్రత ప్రకారంగా దుస్తులు ధరించండం వల్ల చాలా మంచి ఉపశమనం ఉంటుంది. వ్యాయామం & యోగా చేయడం మరచిపోకూడదు. రోజూ కనీసం 30 నిమిషాల పాటు వాకింగ్ లేదా యోగా చేయాలి.  “ప్రాణాయామం” లాంటి శ్వాస వ్యాయామాలు శ్వాస సంబంధిత సమస్యలను తగ్గిస్తాయి. అలాగే ప్రకృతిలో కొంత సమయం గడపడం కూడా మంచిది. నిద్ర – విశ్రాంతి విషయంలో చాలా కేర్ గా ఉండాలి. ప్రతి రోజు కనీసం 7-8 గంటల నిద్ర తప్పనిసరిగా తీసుకోవాలి.  రాత్రిళ్లు ఆలస్యంగా మేలుకుని ఉండకూడదు. ఇది శరీర రక్షణ శక్తిని తగ్గిస్తుంది. హైజెనిక్ గా ఉండాలి.  శుభ్రత,  స్వచ్చత   పాటించడం చాలా ముఖ్యం.  తరచూ చేతులు కడుక్కోవడం అలవాటు చేసుకోవాలి.  బయట తినే ఆహారం తగ్గించాలి. ఇంటి ఆహారమే చాలా ఆరోగ్యం. ఆయుర్వేద చిట్కాలు పాటిస్తే మంచిది.  రోజూ ఉదయం ఉసిరికాయ పౌడర్ లేదా   "చ్యవనప్రాశ్" తీసుకోవచ్చు. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది.  తులసి, అల్లం, మిరియాలు,  తేనెతో చేసిన కషాయం చలికాలంలో ఉపయోగపడుతుంది. సీజనల్ సమస్యలను సమర్థవంతగా ఎదుర్కుంటుంది.                                     *రూపశ్రీ గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
సీజన్ మారుతోంది.. ఈ జాగ్రత్తలు పాటించండి.. Publish Date: May 31, 2025 9:30AM

ఏపీలో మూడు రోజులు భారీ వర్షాలు

  నైరుతి రుతుపవన ప్రభావంతో ఏపీలో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొన్నాది. వాతావరణంలో మార్పులు చోటుచేసుకోనున్నాయి. వివరాల్లోకి వెళితే, ముఖ్యంగా శనివారం నాడు రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో వర్షాలు కురిసే సూచనలున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని అధికారులు తెలిపారు. ఇదే సమయంలో పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అన్నమయ్య జిల్లాల్లో కూడా ఇలాంటి వర్షపాతమే నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని, అడపాదడపా వర్షపు జల్లులు కురిసే పరిస్థితులు కొనసాగుతాయని తెలుస్తోంది. ఈ మార్పుతో వాతావరణం కొంత చల్లబడే అవకాశం ఉంది. పలు జిల్లాలకు ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.రెండు రోజులపాటు భారీ వర్షాలతోపాటు.. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తాయని వెల్లడించింది. రానున్న మూడు రోజులు రాష్ట్రంలో మేఘావృత వాతావరణంతో పాటు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది.  
ఏపీలో మూడు రోజులు భారీ వర్షాలు Publish Date: May 30, 2025 9:39PM

హైదరాబాద్‌లో రూ.150 కోట్ల భారీ మోసం

  హైదరాబాద్ శివారు జీడిమెట్లలో మరో భారీ మోసం వెలుగు చూసింది. స్టాక్‌మార్కెట్లో పెట్టుబడుల పేరుతో ఓ సంస్థ రూ.150 కోట్ల కుచ్చు టోపీ పెట్టింది. ది పెంగ్విన్ సెక్యూరిటీస్' అనే పేరుతో కొందరు మోసగాళ్లు ఒక సంస్థను ఏర్పాటు చేశారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడితే తక్కువ కాలంలోనే మంచి రాబడి వస్తుందని ఆకర్షణీయమైన పథకాలతో ప్రచారం చేసి రూ. లక్షకు రూ. లక్ష లాభం ఇస్తామని ప్రజలను నమ్మించారు.  వీరి మాయమాటలు నమ్మిన సుమారు 1,500 మంది అమాయకులు తమ కష్టార్జితాన్ని ఈ సంస్థలో పెట్టుబడులుగా పెట్టారు. ఈ విధంగా మదుపర్ల నుంచి దాదాపు రూ.150 కోట్ల వరకు నిధులు సేకరించారు. వీరిని నమ్మి రూ.లక్ష నుంచి రూ.కోటి వరకు బాండ్ల రూపంలో 1,500 మంది ఈ సంస్ధలో పెట్టుబడులు పెట్టారు. మోసపోయామని ఆలస్యంగా తెలుసుకున్న బాధితులు పెద్ద ఎత్తున శుక్రవారం జీడిమెట్ల పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
హైదరాబాద్‌లో రూ.150 కోట్ల భారీ మోసం Publish Date: May 30, 2025 8:37PM

బీఆర్ఎస్ ప‌దేండ్ల‌లో రూ. 3.5 ల‌క్ష‌ల కోట్ల పెట్టుబ‌డులు : కేటీఆర్

  తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్   ప‌దేండ్ల‌లో 8 వేల‌కు పైగా అనుమ‌తులు, రూ. 3.5 ల‌క్ష‌ల కోట్ల పెట్టుబ‌డులు వ‌చ్చాయ‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. లండన్‌లో జరుగుతున్న బ్రిడ్జ్ ఇండియా వీక్ 2025 సదస్సులో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఐటీ కంపెనీలను తీసుకొచ్చి 10 లక్షల మంది స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించామని ఆయన పేర్కొన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో దేశంలోనే తెలంగాణ నంబ‌ర్ వ‌న్‌గా నిలిచింద‌ని కేటీఆర్ తెలిపారు. హైద‌రాబాద్‌లో టాప్ 5 మ‌ల్టీనేష‌న‌ల్ కంపెనీల అతిపెద్ద క్యాంప‌స్‌లు నెల‌కొల్పాయి.  టీఎస్ ఐపాస్‌తో సెల్ఫ్ స‌ర్టిఫికేష‌న్ విధానం ప్ర‌వేశ‌పెట్టామని కేటీఆర్ పేర్కొన్నారు. టీఎస్ ఐపాస్‌తో సెల్ఫ్ స‌ర్టిఫికేష‌న్ విధానం ప్ర‌వేశ‌పెట్టామని కేటీఆర్ పేర్కొన్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి విప్లవాత్మ‌క విధానం లేదు. ప‌దేండ్ల‌లో 8 వేల‌కు పైగా అనుమ‌తులు, రూ. 3.5 ల‌క్ష‌ల కోట్ల పెట్టుబ‌డులు వ‌చ్చాయి. తెలంగాణకు ఐటీ కంపెనీలు తీసుకువచ్చి 10 లక్షల మంది స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాము. మినిమ‌మ్ గ‌వ‌ర్న‌మెంట్‌.. మ్యాగ్జిమ‌మ్ గ‌వర్నెన్స్ మా విధానం. తెలంగాణ‌లో పెట్టుబ‌డులు పెట్టండి. తెలంగాణ‌లో ప్ర‌తి ఇంటికి సుర‌క్షిత మంచినీరు అందించామ‌ని ఆయన తెలిపారు.
 బీఆర్ఎస్ ప‌దేండ్ల‌లో రూ. 3.5 ల‌క్ష‌ల కోట్ల పెట్టుబ‌డులు  : కేటీఆర్ Publish Date: May 30, 2025 7:58PM

దేశంలోనే బెస్ట్ సిటీగా అమరావతిని నిర్మిస్తాం : సీఎం చంద్రబాబు

  దేవుడు నాకు మరో నగర నిర్మాణం చేసే అవకాశం ఇచ్చాడని. అమరావతిని దేశంలోనే ఒక బెస్ట్ సిటీగా ప్లాన్ చేస్తున్నామని  ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఢిల్లీలో జరిగిన సీఐఐ వార్షిక సమ్మేళనంలో ఆయన పాల్గొని ప్రభుత్వ విధానాలు,  ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, పెట్టుబడుల అవకాశాలను వివరించారు. మీ సిఐఐని మొదటి నుంచి నేను ప్రోత్సహించాను, మీ తరుపున మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా కృషి చేయాలని కోరుతున్నాని చంద్రబాబు తెలిపారు .1995లో దావోస్ వెళ్తున్నా అంటే, అప్పట్లో నన్ను వెళ్లొద్దు అనే వారు. పారిశ్రామికవేత్తలతో భేటీలు అయితే, ఓట్లు పోతాయని బెదిరించే వారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. సంపద సృష్టి జరగకపోతే సంక్షేమ కార్యక్రమాలు చేపట్టలేమని.. సంపద సృష్టి పారిశ్రామికవేత్తల ద్వారానే సాధ్యమవుతుందని  సీఎం చంద్రబాబు తెలిపారు. ఏపీలో అభివృద్ధి, పెట్టుబడుల అవకాశాలను వివరించారు. సంపద సృష్టిలో ఏపీకి పారిశ్రామిక వేత్తలు సహకరించాలని కోరారు. పీవీ నరసింహారావు ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు దేశగతిని మార్చేశాయన్నారు. 1990లోనే ఇంటర్‌నెట్‌ విప్లవం వచ్చిందని గుర్తుచేశారు. దావోస్‌లో ఏటా పారిశ్రామికవేత్తల సదస్సు జరుగుతుందని తెలిపారు. భారత్‌కు మోదీ నాయకత్వం ప్రధాన బలమని కొనియాడారు.  చైనా ఆర్థిక వ్యవస్థ భారత్‌కు నాలుగున్నర రెట్లు.. అమెరికా ఆర్థిక వ్యవస్థ భారత్‌ కంటే ఏడు రెట్లు ఎక్కువ అని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు హైదరాబాద్‌ బ్రౌన్‌ ఫీల్డ్‌ సిటీ.. అమరావతి గ్రీన్‌ ఫీల్డ్‌ సిటీ అని అభివర్ణించారు. ఐటీ పరిశ్రమల వల్లే హైదరాబాద్‌కు లబ్ధి జరిగిందని తెలిపారు. 2047 విజన్‌ లక్ష్యంగా భారత్‌ సాగుతోందని చెప్పారు. సాంకేతిక విప్లవంలో చాలా మార్పులు వచ్చాయని ముఖ్యమంత్రి అన్నారు . ఏపీలో 15 శాతం వృద్ధి రేటు తన లక్ష్యమని అన్నారు.  అమరావతిలో దేశంలోనే తొలిసారి క్వాంటం వ్యాలీ ఏర్పాటు చేయబోతున్నామని ప్రకటించారు. విశాఖపట్నానికి టీసీఎస్, గూగుల్‌, మిట్టల్‌ పరిశ్రమలు వచ్చాయని సీఎం చంద్రబాబు వెల్లడించారు 
దేశంలోనే బెస్ట్ సిటీగా అమరావతిని నిర్మిస్తాం : సీఎం చంద్రబాబు Publish Date: May 30, 2025 6:41PM

ఈటెల రాజేందర్ బీజేపీలో ఉంటూ బీఆర్ఎస్ కోసం పని చేస్తున్నారు : టీపీసీసీ చీఫ్

  మల్కాజ్‌గిరి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ బీజేపీలో ఉంటూ బీఆర్ఎస్ కోసం పని చేస్తున్నారని  టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఆరోపించారు. కాళేశ్వరం కమిషన్ నోటీసుల తర్వాత హరీష్ రావు,  ఈటెల సమావేశమయ్యారని, ఈ భేటీలో ఈ భేటీ లో కేసీఆర్ తో ఈటెల ఫోన్ లో మాట్లాడారంటూ మహేష్ గౌడ్ పేర్కొన్నారు. ఈటెల బీజేపీలో ఉన్నారా? బీఆర్‌ఎస్‌లో ఉన్నారా అని పీసీసీ చీఫ్ ప్రశ్నించారు. బీఆర్ఎస్, బీజేపీ చీకటి ఒప్పందాన్ని  ఎమ్మెల్సీ కవిత బహిర్గతం చేశారని ఆయన అన్నారు.  దోస్తీకి అడ్డుగా ఉన్నందుకే బండి సంజయ్‌ను బీజేపీ స్టేట్ చీఫ్ పదవి నుంచి తొలిగించారని ఆయన అన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు  భయపడే భారత్.. మధ్యలో యుద్ధాన్ని ఆపేశారాని మహేష్ గౌడ్ అన్నారు. ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్ పై యుద్ధానికి దిగిన భారత్.. మధ్యలో యుద్ధాన్ని ఆపడానికి కారణాన్ని ప్రధాని మోదీ దేశ ప్రజలకు సమాధనం చెప్పాలని ఆయన తెలిపారు. యుద్ధం అంటే ఇంధిరా గాంధీ గుర్తుకు వస్తారు. కొన్ని వందల సర్జికల్ స్ట్రైక్స్ ఇంధిరా గాంధీ హాయాంలో జరిగాయి... కానీ ఎప్పుడూ రాజకీయం చేయలేదు’ అని పీసీసీ చీఫ్ వెల్లడించారు.  
ఈటెల రాజేందర్  బీజేపీలో ఉంటూ బీఆర్ఎస్ కోసం పని చేస్తున్నారు : టీపీసీసీ చీఫ్ Publish Date: May 30, 2025 5:13PM

తెలంగాణ కేబినెట్ విస్తరణ... మరో వాయిదా?

తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కు అన్నట్లు సాగుతోంది.   తాజాగా మరో మారు రేవంత్ కేబినెట్ విస్తరణ అంశం తెరమీదకు వచ్చినట్లే వచ్చి మళ్లీ తెర వెనక్కు వెళ్లింది.  రేవంత్ సర్కార్ కొలువుదీరి ఏడాదిన్నర కావస్తోంది. ఈ ఏడాదిన్నరగా మంత్రివర్గ విస్తరణ అందని ద్రాక్ష పుల్లన అన్న చందాన ఆశావహుల్లో నిరాశ నింపుతూనే ఉంది. తాజాగా రాష్ట్ర అవతరణ దినోత్సవమైన జూన్ 2 లోగా మంత్రివర్గ విస్తరణ ఖాయమంటూ పార్టీ అధిష్ఠానం నుంచి  స్పష్టమైన సంకేతాలు వచ్చాయి.  పనిలో పనిగా పీసీపీ, కార్పొరేషన్ పదవుల భర్తీ వంటి అంశాలు కూడా చర్చకు వచ్చాయి. ముఖ్యమంత్రికి హస్తిన పిలుపు కూడా వచ్చింది. అయితే అంతలో ఏమైందో ఏమో కానీ.. మళ్లీ ముహూర్తం ముడిపడలేదనీ, ఇప్పట్లో మంత్రివర్గ విస్తరణకు అవకాశం లేదనీ హస్తిన వర్గాలు అంటున్నాయి.  గతంలో గవర్నర్‌తో మంత్రుల ప్రమాణ స్వీకారానికి ముహూర్తాలు కూడా ఖరారు అయి అర్ధాంతరంగా రద్దైప సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా దాదాపు అంతదాకా వచ్చి విస్తరణ ముహూర్తం వాయిదా పడటంతో అసలేం జరుగుతోంది? అధిష్ఠానం తెలంగాణ మంత్రివర్గ విస్తరణ విషయంలో ఆశావహులను ఊరించి ఉసూరుమనిపిస్తోంది అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మీనాక్షి నటరాజన్‌, ఆలిండియా కాంగ్రెస్ కమిటీ సంస్థాగత వ్యవహారాల కార్యదర్శి కె.సి.వేణుగోపాల్‌ మధ్య మంత్రివర్గ విస్తరణపై చర్చలు జరిగాయి. ఇందు కోసం దాదాపు మూడు రోజుల పాటు సీఎం హస్తినలోనే మకాం వేశారు కూడా. అయినా కూడా చర్చలు ఒక కొలిక్కి రాలేదు. ఈ నెల 30న మరో సారి చర్చలు జరుపుదాం రండి అని అధిష్ఠానం సీఎంకు చెప్పింది. దీంతో ఆయన శుక్రవారం (జూన్ 30) హస్తిన పర్యటనకు రెడీ అయిపోయారు కూడా. అయితే.. చావు కబురు చల్లగా అన్నట్లు హైకమాండ్ ఇప్పుడు కాదు తరువాత చూద్దాం అంటూ సమాచారం పంపడంతో రేవంత్ రెడ్డి తన హస్తిన పర్యటనను వాయిదా వేసుకున్నారు. దీంతో రాష్ట్ర కేబినెట్ విస్తరణ మరోసారి వాయిదా పడిందని స్పష్టమైంది. అదే విధంగా పీసీసీ కార్యవర్గం విషయంలో కూడా అధిష్ఠానం ఒక నిర్ణయానికి రాలేదని అంటున్నారు. ముఖ్యంగా మంతివర్గ విస్తరణలో ఎస్పీ, ఎస్టీ, బీసీ, ఓసీలకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలన్నది హైక మాండ్ యోచనగా చెబుతున్నారు.   ఇక ఇప్పుడు మరో చర్చ తెరపైకి వచ్చింది. త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికల తరువాతనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని, మంత్రిపదవుల ఆశతో నేతలు పార్టీ విజయం కోసం కష్టపడి పని చేస్తారని అధిష్ఠానం భావిస్తున్నట్లు చెబుతున్నారు.    
తెలంగాణ కేబినెట్ విస్తరణ... మరో వాయిదా? Publish Date: May 30, 2025 4:27PM

కశ్మీర్ పూంచ్ బాధితులకు అమిత్ షా పరామర్శ

  కేంద్ర హోంమంత్రి అమిత్ షా పూంచ్ జిల్లాను సందర్శించి పాకిస్తాన్ దాడుల బారినపడిన బాధిత కుటుంబాలను కలుసుకున్నారు. బాధిత కుటుంబాల్లోని యువకులకు అమిత్ షా ఉద్యోగ నియామక పత్రాలను  అందించారు. దాడుల సమయంలో పూంచ్ పౌరులు, అధికారులు చూపిన ధైర్యం, జమ్ముకశ్మీర్ ప్రజల దేశభక్తి దేశానికి మరింత బలాన్నిచ్చాయని అమిత్‌ షా పేర్కొన్నారు. మనం చేపట్టిన ఆపరేషన్‌ సింధూర్‌తో పాక్‌లో ఉగ్రవాద స్థావరాలు ధ్వంసమయ్యాయిని షా పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు కేంద్రం పూర్తి సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు.  కాశ్మీర్ పహల్గామ్ ఉగ్ర దాడిని ఖండించారు. ‘మతపరమైన ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని, పాకిస్తాన్ దాడులకు తెగబడుతోందని ఆయన పేర్కొన్నారు. ఇది పిరికితనంతో కూడిన చర్య. పాక్‌ దాడులలో పలువురు భారత పౌరులు గాయపడ్డారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఉపాధి, ఉద్యోగ  అవకాశాలు కల్పిస్తోంది. వారికి సంఘీభావం ప్రకటిస్తోంది’ అని హోం మంత్రి అమిత్‌ షా పేర్కొన్నారు.పూంచ్ పౌరులు, అధికారులు చూపించిన సాహసం, దేశభక్తి యవద్దేశానికి స్ఫూర్తినిస్తుందని ప్రశంసించారు.  పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి పిరికిపందల చర్య అని, ఏ ఒక్క ఉగ్రవాద చర్యను ఉపేక్షించరాదన్నదే ప్రధానమంత్రి నరేంద్రమోదీ విధాన నిర్ణయమని చెప్పారు. పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశామని, ప్రజలు బలంగా కోరుకోవడం, ప్రధానమంత్రి నిర్ణయాత్మక నాయకత్వం, విలువైన ఇంటెలిజెన్స్ సమాచారం, భారత సాయుధ బలగాల అసమాన ప్రతిభ వల్లే అత్యంత భీకర దాడులు జరపగలిగామని అమిత్‌షా అన్నారు. వందలాది మంది టెర్రరిస్టులను మట్టుబెట్టామని, తమపై దాడులు జరిపినట్టు పాక్ చెప్పుకుంటున్నప్పటికీ మన మిలటరీ కేవలం టెర్రరిస్టు శిబిరాలనే టార్గెట్ చేసిందని వివరించారు. ఒక్క ఇండియన్ ఆర్మీ పోస్ట్ కూడా దెబ్బతినలేదని, పాకిస్థాన్ పౌరులెవరికీ నష్టం జరగలేదని చెప్పారు. టెర్రరిస్టు శిబిరాలను మాత్రమే ధ్వంసం చేశామని  అమిత్ షా  తెలిపారు.  
కశ్మీర్ పూంచ్ బాధితులకు అమిత్ షా పరామర్శ Publish Date: May 30, 2025 4:10PM

ఢిల్లీలో సీఎం చంద్రబాబును కలిసిన మంద కృష్ణ

  ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఢిల్లీలో కలిశారు. ఇటీవల రాష్ట్రపతి చేతుల మీదగా పద్మశ్రీ అవార్డును అందుకున్న మందకృష్ణ  సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మందకృష్ణను ముఖ్యమంత్రి అభినందించారు. వర్గీకరణ ఉద్యమ ప్రస్థానాన్ని గురించి ఇరువురు నేతలు గుర్తు చేసుకున్నారు. సామాజిక న్యాయం కోసం మందకృష్ణ మాదిగ చేస్తున్న కృషిని చంద్రబాబు ప్రస్తావించారు. ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో అనేక సంవత్సరాలుగా కొనసాగుతున్న ఈ ఉద్యమంలోని కీలక ఘట్టాలను, ఎదురైన సవాళ్లను, గత అనుభవాలను వారు గుర్తు చేసుకున్నారు. వర్గీకరణ సాధన కోసం జరిగిన పోరాటాలు, ఆనాటి పరిస్థితులపై ఇరువురు నేతలు మాట్లాడుకున్నారు.
ఢిల్లీలో  సీఎం చంద్రబాబును కలిసిన మంద కృష్ణ Publish Date: May 30, 2025 3:32PM

తిరుమల భద్రంగా లేదా.. మరింత అలర్ట్ గా ఉండాలన్న డీజీపీ ఆదేశాల అర్దం అదేనా?

తిరుమల తిరుపతి భద్రతకు ముప్పు పొంచి ఉందా? అన్న ప్రశ్నకు పరిశీలకులు ఔననే అంటున్నారు. రాష్ట్ర డీజీపీగా బాధ్యతలు చేపట్టిన అనంతరం శ్రీవారి దర్శనం చేసుకున్న హరీష్ కుమార్ గుప్తా.. దర్శనానంతరం తిరమల భద్రతపై ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. పోలీసు ఉన్నతాధికారులు, టీటీడీ ఈవో జే.శ్యామలరావు, సీవీఎస్ వో తదితరులతో ఆయన నిర్వహించిన సమావేశంలో తిరుమల భద్రత విషయంలో మరింత అలర్ట్ గా ఉండాలని ఆదేశించారు. దేశంలో ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్థితులనను దృష్టిలో పెట్టుకుని తిరుమలలో భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండాలని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశించారు.  భక్తుల రక్షణ, ఆలయ భద్రత విషయంలో   స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ రూపొందించాలని ఆదేశించారు.   తిరుమల  హై సెక్యూరిటీ జోన్ లో ఉంది. ఐదంచెల భద్రతా వ్యవస్థ 224 గంటలూ అప్రమత్తంగా ఉంటుంది.  రిజర్వు బెటాలియన్, ఏపీఎస్పీదళాలు టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్ , ఆ తరువాత ఎలాంటి పరిస్థితిని అయినా సరే ధీటుగా ఎదుర్కొని, క్షణాల్లో అదుపుచేసే శక్తిసామర్థ్యాలు ఉన్న అక్టోపస్ దళాలు ఎల్లవేళలా తిరుమలలో సిద్ధంగా ఉంటాయి. అయినా కూడా భద్రత విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలంటూ డీజీపీ హెచ్చరించడం ప్రాధాన్యత సంతరించుకుంది. తిరుమలలో భద్రత విషయంలో సమావేశంలో తిరుపతి   టీటీడీ ఇన్ చార్జ్  సీవీఎస్ ఓ హర్షవర్ధన్ రాజు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. తిరుమల భద్రత విషయంలో తీసుకుంటున్న చర్యలు, చేసిన ఏర్పాట్లపై ఆయన డీజీపీకి వివరించారు.   
తిరుమల భద్రంగా లేదా.. మరింత అలర్ట్ గా ఉండాలన్న డీజీపీ ఆదేశాల అర్దం అదేనా? Publish Date: May 30, 2025 3:28PM