అమ్మ కేసీఆర్.. పదేళ్ల పాటు సినిమా అవార్డులు ఎందుకివ్వలేదో తెలిస్తే షాక్
posted on May 31, 2025 2:13PM

కేసీఆర్ సినిమా ఇండస్ట్రీని ఎందుకో చిన్న చూపు చూశారేమో అనిపిస్తుంది చాలా మందికి. అయితే సినిమా వారితో మాత్రం కేసీఆర్ కుటుంబం సత్సంబంధాలు బాగానే నెరిపారు. ఒక పక్క చూస్తే నాగార్జున భార్య అమలకూ, కవితకూ స్నేహముండేదని అంటారు. మరో పక్క చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా సమంత సైతం ఈ ప్రభుత్వంతో అంటకాగినట్టు చెబుతారు. ఇక ప్రకాష్ రాజ్ కూడా ఒక దశలో బీఆర్ఎస్ లో చేరుతారనే ప్రచారం కూడా జరిగింది.
ఇక కేసీఆర్ ప్రభుత్వ చివరి రోజులలో కరోనా రావడం. సినిమాటోగ్రఫీ మంత్రిగా.. శ్రీనివాస యాదవ్ హడావిడీ.. దాసరి తర్వాత అంతటి సినీ పర్సనాల్టీ చిరంజీవి అన్న గౌరవ మర్యాదలు.. అంతా బాగుండేది. కానీ సినిమా అవార్డులు మాత్రం ఇచ్చేవారు కాదు. బీఆర్ఎస్ హయాంలోనే తెలంగాణ యాసలో ఫిదా, బలగం వంటి సినిమాలు రావడం.. ఆపై విజయ్ దేవరకొండలాంటి అచ్చ తెలంగాణకు చెందిన ఒక కుర్రాడు ఆంధ్ర తెలంగాణ ప్రాంతీయ బేధాలకు అతీతంగా హీరోగా ఎదగడం. చాంబర్లు కూడా వేరు కావడం.. తెలంగాణ దర్శకులు బాగా పెరగడం. ఉదాహరణకు సందీప్ రెడ్డి వంగ, నాగ అశ్విన్.. ఇలా రకరకాలుగా తెలంగాణా సినీ అభివృద్ధి పరిఢవిల్లిందనే చెప్పాలి.
తెలంగాణ సినిమాకు కావల్సింది అవార్డులు కావు.. వాటికంటూ ఒక పాలసీ అంటారు ఇంకొందరు. గతంలో ప్రభుత్వ పరంగా ఏదైనా సహాయ సహకారాలు వెళ్తే అదంతా ఆంధ్రులకే వెళ్లిందన్న అపవాదు ఉండేది. అంతెందుకు ఇదే ఉద్యమ కాలంలో కొందరు రాఘవేంద్రరావు వంటి వారు స్టూడియోలకు స్థలమిస్తే కమర్షియల్ కాంప్లెక్సులు కట్టారన్న గొడవ జరిగింది. అలాగని కేవలం స్టూడియో మాత్రమే కడితే.. అది మరో రామానాయుడు స్టూడియోలా తయారయ్యే ప్రమాదం కూడా ఉంది. ఈ స్డూడియో సరిగా నడవక.. కరెంటు చార్జీలు కట్టడానికి కూడా ఇబ్బంది కరంగా మారింది. ఇపుడీ స్టూడియోను ఉంచకోలేక, తీయలేక సురేష్ అవస్తలు పడుతున్నట్టు తెలుస్తోంది. ఇలాంటి గొడవలు చాలానే.
అయితే బీఆర్ఎస్ పాలనలో ఎన్ శంకర్ వంటి వారికి స్టూడియో నిర్మాణాలకు 5 ఎకరాల స్థలం ఇచ్చారు. తర్వాత ఎవరికీ పెద్దగా ఈ దిశగా ఎంకరేజ్ మెంట్ జరగలేదు. కేసీఆర్ స్వయానా రచయిత. తెలుగు సాహితీ పిపాసి కూడా. జైబోలో తెలంగాణ వంటి సినిమాల ద్వారా కూడా ఆయన తన ఉద్యమాన్ని నడిపించారు. అందులో ఒక పాట కూడా రాశారు. అయినా కూడా ఆయనెందుకో తెలుగు సినిమా అవార్డులని ఇంత పెద్ద ఎత్తున ఇవ్వలేదు. అస్సలు పట్టించుకోలేదు.
ఇక ఆనాడు ఎన్టీఆర్, ఏఎన్నార్లతో సమానంగా తెలుగు తెరను ఏలిన కాంతారావు, కుటుంబం దీన పరిస్థితుల్లో ఉంది. ఈ విషయంలో కూడా కేసీఆర్ గానీ, ఆయన కుటుంబ సభ్యులుగానీ పెద్దగా పట్టించుకోలేదు. కరీంనగర్ కి చెందిన పైడి జయరాజ్ అనే ఒక నటుడు బాలీవుడ్ స్థాయికి ఎదిగారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా పొందారు. ఆయన కుటుంబాన్నీ పట్టించుకున్న పాపాన పోలేదు. గతంలో విలన్ పాత్రలు వేసిన ప్రభాకర్ రెడ్డి కూడా ఇక్కడి వారే. ఆయన అయితే ఏకంగా చిత్రపురి కాలనీ కోసం తన విలువైన స్థలాన్ని కూడా ఇచ్చారు. ఆ కుటుంబాన్ని కూడా ఆదుకోలేదు.
టోటల్ గా గద్దర్ అవార్డుల వల్ల మీకు హ్యాపీయేనా అని అడిగితే కొందరు మాత్రం నాట్ హ్యాపీ అంటున్నారు. ఎందుకంటే ఒక గద్దర్ అవార్డును స్మగ్లర్ పాత్రకు ఇవ్వడం సరికాదని చెబుతారు వీరు. అంతే కాదు ఒక రైట్ వింగ్ సినిమా రజకార్ కి లెఫ్ట్ వింగ్ ప్రతీక అయిన గద్దర్ అవార్డు ఇవ్వడమేంటి? అసలు ఈ అవార్డులన్నీ ఎవరికి వెళ్లాయ్? ఈ అవార్డుల కమిటీలోని జయసుధ, మురళీ మోహన్ ఎవరు?
వీరిలో ఎవరికీ కూడా అవార్డు సినిమా గుర్తింపే తెలీదు. వీరి ముందుకు సత్యజిత్ రే, శ్యాంబెనగల్ సినిమాలను తీసుకొచ్చి పెట్టినా.. వాటిని తీసి పక్కన పడేస్తారు. వీరు తమకున్న సినిమా పరిజ్ఞానంతో ఈ అవార్డులు ఇవ్వలేదు. తమకున్న పరిచయాలతో ఇచ్చారు తప్పించి ఇందులో మరేదీ లేదు. కావాలని పట్టుబట్టి కావాలని కొన్ని సినిమాలకు కొందరు నటులకు రాజకీయ ఉద్దేశాలను అనుసరించి అవార్డులిచ్చిన పరిస్థితి కూడా ఉందంటూ.. కామెంట్ చేస్తున్నారు కొందరు తెలంగాణ దర్శకులు.
అందుకే కేసీఆర్ ఈ అవార్డులు ఇవ్వలేదని అంటారు వీరు. ఈ కామెంట్లను బట్టి చూస్తే ఒక వేళ అవార్డులే ఇవ్వాల్సి వస్తే అది ఆంధ్రోళ్లకే ఎక్కువ అవార్డులు వెళ్తాయన్న కోణంలో ఈ అవార్డులను కేసీఆర్ పక్కన పెట్టేశారని కంక్లూడ్ చేస్తున్నారు. అంటే కేసీఆర్ కేవలం ఆంధ్ర తెలంగాణ బేధాన్ని కళల్లోనూ చూపించారన్నమాట. కాబట్టే పదేళ్ల పాటు సినిమా అవార్డులివ్వలేదన్నమాట. అమ్మ కేసీఆర్ అంటూ ఇప్పుడు నోళ్లు నొక్కుకుంటున్నారు కొందరు.