కేసీఆర్ కోసం ధర్నా.. బీఆర్ఎస్ కాదు.. తెలంగాణ జాగృతి!

తెలంగాణ సాధన కోసం ప్రాణాలు ఫణంగా పెట్టి పోరాడిన యోధుడికి నోటీసులా అంటూ ఈ నెల 4న ఇందిరా పార్క్ వద్ద భారీ దర్నాకు రంగం సిద్ధమైంది. అయితే ఈ ధర్నా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరగబోవడం లేదు. కేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో బీఆర్ఎస్ జెండాలు లేకుండా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జరుగుతోంది. కేసీఆర్ కు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో నోటీసులు జారీ చేయడం వెనుక రాజకీయ దురుద్దేశం, కుట్ర ఉన్నాయని ఆరోపిస్తూ కవిత ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేయాలని నిర్ణయించారు.

కేసీఆర్ ఈ నెల 5న కమిషన్ ఎదుట విచారణకు హాజరు కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో  అంతకంటే ఒక రోజు ముందు అంటే  జూన్ 4న కవిత ఈ ధర్నా నిర్వహించనున్నారు. ఇప్పటికే కవిత పార్టీ లైన్ కు భిన్నంగా వెడుతున్నారు. తండ్రికి రాసిన లేఖ లీక్ కావడం బీఆర్ఎస్ లో చీలికకు సంకేతంగా నిలిస్తే.. ఈ తరువాత మీడియాతో చిట్ చాట్ అంటూ ఆమె తన అన్న, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, అలాగే మాజీ మంత్రి హరీష్ రావు టార్గెట్ గా పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు విమర్శలు.. ఆమెకు బీఆర్ఎస్ తలుపులు మూసేశాయని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే ఆమె తెలంగాణ జాగృతి బ్యానర్ తో సొంతంగా రాజకీయ అడుగులు వేస్తున్నారు.

ఇందిరా పార్క్ వద్ద ధర్నా ఆ అడుగుల్లో మొదటిదని చెప్పవచ్చు.  చావు నోట్లో తల పెట్టి.. తెలంగాణ సాధించిన  ప్రజానాయకుడు కేసీఆర్‌పై రాజకీయ కుట్రలు సాగడం సిగ్గుచేటు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన కవిత కాంగ్రెస్ ప్రభుత్వ దుర్మార్గాలకు వ్యతిరేకంగా ధర్నా కు పిలుపు నిచ్చారు. అలాగే.. తెలంగాణ జాగృతి నూతన కార్యాలయాన్ని కవిత శనివారం ప్రారంభించారు.  తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను  చాటిచెప్పడం, మహిళల హక్కుల కోసం, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల కోసం  పోరాడుతున్న తెలంగాణ జాగృతి సంస్థ, ఇక కొత్త కార్యాలయం ద్వారా మరింత విస్తృతంగా ఉధృతంగా నిర్వహించనుందని అంటున్నారు.