క్యూలైన్ లో రాజకీయ నినాదాలు జగన్ ప్రియ శిష్యుడి పనే!
posted on May 31, 2025 2:40PM

టీటీడీకి సంబంధించి ఏదైనా తప్పుడు వార్తలు ప్రచారం జరిగితే.. అందుకు బాధ్యులైన వారిపై కేసులు పెడతామని ఇప్పటికే టీటీడీ చైర్మన్ ప్రకటించారు. కానీ ఇవేవీ ఖాతరు చేయని కొందరు తరచూ ఏవో అవాస్తవాలను తిరుమలకు ఆపాదించే యత్నం చేస్తున్నారు. నిజానికి తిరుమల నిబంధనల ప్రకారం తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తే.. వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు. ఈ విషయం తెలిసి కూడా కొందరు కావాలనే ఈ ఆధ్యాత్మిక కేంద్రానికి రాజకీయాలను పులమాలని ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే గోవుల మరణాల విషయంలో వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి పెద్ద ఎత్తున గొడవకు దిగడం.. అదో పెద్ద రాజకీయ దుమారానికి కారణంగా నిలవడం సంగతి తెలిసిందే.
ఈ వ్యవహారం సద్దుమణిగిందనుకునేలోపు.. దర్శన క్యూలైన్లలో సౌకర్యాలు సరిగా లేవంటూ కాకినాడకు చెందిన అచ్చారావు అనే భక్తుడు హడావిడి చేశాడు. దీంతో అతడ్ని పట్టుకుని ఆరా తీసిన సిబ్బందికి తెలిసిందేంటంటే త్వరగా దర్శనానికి అనుమతిస్తారనే ఆలోచనతో తానిలా చేశానంటున్నాడీ భక్తుడు. ఇతడిలా అరిచి గోల చేస్తుంటే ఇదే అదనుగా భావించిన ఒకరు వీడియో తీసి వదిలారు. ఇపుడీ వ్యక్తి ఎవరు? ఇతడి వెనకున్న ఉద్దేశమేంటి? పొలిటికల్ బ్యాగ్రౌండ్ ఎలాంటిదన్నది విచారణ చేస్తున్నారు పోలీసులు.
అయితే టీటీడీలో భారతమ్మ సైన్యం ఒక రెండు వేల మంది వరకూ ఉన్నారని అంటారు. వీరిలోని ఒకరే ఈ వీడియో తీశారా!? అన్న కోణంలో కూడా దర్యాప్తు చేసే అవకాశం కనిపిస్తోంది. ఇంతకీ టీటీడీ నామ్స్ ప్రకారం తప్పుడు ప్రచారం చేస్తే ఏం జరుగుతుంది? అంటే ఐటీ యాక్ట్ వాడుతారు. ఆ తర్వాత పోలీసులు కూడా కేసులు పెడతారు. తప్పుడు ప్రచారం చేసేవారిపై భారతీయ న్యాయ సంహిత 197, 353 సెక్షన్ల ప్రకారం శిక్షిస్తారు. మరీ ముఖ్యంగా ఆధ్యాత్మిక పరంగా ఇలాంటి తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తే వారిపై ఈ సెక్షన్ల ప్రకారం చర్యలు తీసుకుంటారు. ఒక్కోసారి ఆరు నెలల నుంచీ జైలు శిక్ష, ఐదు వేల రూపాయల జరిమానా సైతం విధిస్తారు.
ఇప్పుడిక సౌకర్యాలు లేవంటూ క్యూలైన్ లో రాజకీయ నినాదాలు చేసిన భక్తుడు ఎవరా అన్న ఆరా తీస్తే.. వైసీపీ, మరీ ముఖ్యంగా వైఎస్ జగన్ కుట్ర కోణం బయటపడింది. ఇంతకీ తిరుమలలో నిన్న క్యూ లైన్ లో హడావిడి చేసిన వ్యక్తి కాకినాడ రూరల్ కి చెందిన వైసీపీ నేత. జగన్ రెడ్డి ప్రియ శిష్యుడు. ఇతని పేరు బద్దిలి అచ్చారావు. వేణుగోపాల స్వామి ఆలయ చైర్మన్ గా 2022లో జగన్ రెడ్డి పదవిని ఇచ్చాడు. ఆ అచ్చారావే.. నిన్న తిరుమల క్యైలైన్ లో సౌకర్యాలు లేవంటూ నానా హడావుడీ చేసి వివాదం సృష్టించాలని ప్రయత్నించాడు.
