కోరలు చాస్తున్న కోవిడ్.. దేశంలో మూడువేల యాక్టివ్ కేసులు

కరోనా మరోసారి విజృంభిస్తోంది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రమాదం లేదని చెబుతున్నప్పటికీ దేశ వ్యాప్తంగా రోజు రోజుకూ పెరుగుతున్న కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. దేశంలో ఇప్పుడు మూడు వేల మందికి పైగా కరోనా సోకింది. వీరంతా వివిధ దశల్లో చికిత్స పొందుతున్నారు. రోజురోజుకూ కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకూ కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య ఏడుకు చేరుకుంది.  

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతన్నా.. కేరళ రాష్ట్రంలో మాత్రం కరోనా వ్యప్తి తీవ్ర స్థాయిలో ఉందని  వైద్య ఆరోగ్య శాఖ చెబుతోంది. కేరళలో ప్రస్తుతం  1,147 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కేరళ తరువాతి స్థానంలో 424 కేసులతో మహారాష్ట్ర ఉంది.  ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా కరోనా వ్యాప్తి తీవ్రత అధికంగా ఉ:దంటున్నారు. అలాగే కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య  కూడా భారీగానే ఉందని చెబుతున్నారు.  ఈ నెల 25 నుంచి కరోనా వ్యాప్తి తీవ్రత అధికమైందంటున్నారు. గత నాలుగు రోజులుగా కరోనా బారిన పడిన వారి సంఖ్య మూడు రెట్టు పెరిగిందని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. 

రాష్ట్రాల వారీగా చూస్తే, కేరళలో అత్యధికంగా 1,147 యాక్టివ్ కేసులున్నాయి. మహారాష్ట్రలో 424, ఢిల్లీలో 294, గుజరాత్‌లో 223 కేసులు నమోదయ్యాయి. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఒక్కొక్కటి 148 చొప్పున కేసులు ఉండగా, పశ్చిమ బెంగాల్‌లో 116 మంది కొవిడ్ తో బాధపడుతున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే  ఆంధ్రప్రదేశ్‌లో 16, తెలంగాణలో 3  కోవిడ్ కేసులు నమోదయ్యాయి.