దేశంలోనే బెస్ట్ సిటీగా అమరావతిని నిర్మిస్తాం : సీఎం చంద్రబాబు

 

దేవుడు నాకు మరో నగర నిర్మాణం చేసే అవకాశం ఇచ్చాడని. అమరావతిని దేశంలోనే ఒక బెస్ట్ సిటీగా ప్లాన్ చేస్తున్నామని  ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఢిల్లీలో జరిగిన సీఐఐ వార్షిక సమ్మేళనంలో ఆయన పాల్గొని ప్రభుత్వ విధానాలు,  ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, పెట్టుబడుల అవకాశాలను వివరించారు. మీ సిఐఐని మొదటి నుంచి నేను ప్రోత్సహించాను, మీ తరుపున మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా కృషి చేయాలని కోరుతున్నాని చంద్రబాబు తెలిపారు .1995లో దావోస్ వెళ్తున్నా అంటే, అప్పట్లో నన్ను వెళ్లొద్దు అనే వారు. పారిశ్రామికవేత్తలతో భేటీలు అయితే, ఓట్లు పోతాయని బెదిరించే వారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

సంపద సృష్టి జరగకపోతే సంక్షేమ కార్యక్రమాలు చేపట్టలేమని.. సంపద సృష్టి పారిశ్రామికవేత్తల ద్వారానే సాధ్యమవుతుందని  సీఎం చంద్రబాబు తెలిపారు. ఏపీలో అభివృద్ధి, పెట్టుబడుల అవకాశాలను వివరించారు. సంపద సృష్టిలో ఏపీకి పారిశ్రామిక వేత్తలు సహకరించాలని కోరారు. పీవీ నరసింహారావు ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు దేశగతిని మార్చేశాయన్నారు. 1990లోనే ఇంటర్‌నెట్‌ విప్లవం వచ్చిందని గుర్తుచేశారు. దావోస్‌లో ఏటా పారిశ్రామికవేత్తల సదస్సు జరుగుతుందని తెలిపారు. భారత్‌కు మోదీ నాయకత్వం ప్రధాన బలమని కొనియాడారు. 

చైనా ఆర్థిక వ్యవస్థ భారత్‌కు నాలుగున్నర రెట్లు.. అమెరికా ఆర్థిక వ్యవస్థ భారత్‌ కంటే ఏడు రెట్లు ఎక్కువ అని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు హైదరాబాద్‌ బ్రౌన్‌ ఫీల్డ్‌ సిటీ.. అమరావతి గ్రీన్‌ ఫీల్డ్‌ సిటీ అని అభివర్ణించారు. ఐటీ పరిశ్రమల వల్లే హైదరాబాద్‌కు లబ్ధి జరిగిందని తెలిపారు. 2047 విజన్‌ లక్ష్యంగా భారత్‌ సాగుతోందని చెప్పారు. సాంకేతిక విప్లవంలో చాలా మార్పులు వచ్చాయని ముఖ్యమంత్రి అన్నారు . ఏపీలో 15 శాతం వృద్ధి రేటు తన లక్ష్యమని అన్నారు.  అమరావతిలో దేశంలోనే తొలిసారి క్వాంటం వ్యాలీ ఏర్పాటు చేయబోతున్నామని ప్రకటించారు. విశాఖపట్నానికి టీసీఎస్, గూగుల్‌, మిట్టల్‌ పరిశ్రమలు వచ్చాయని సీఎం చంద్రబాబు వెల్లడించారు