హైదరాబాద్‌లో రూ.150 కోట్ల భారీ మోసం

 

హైదరాబాద్ శివారు జీడిమెట్లలో మరో భారీ మోసం వెలుగు చూసింది. స్టాక్‌మార్కెట్లో పెట్టుబడుల పేరుతో ఓ సంస్థ రూ.150 కోట్ల కుచ్చు టోపీ పెట్టింది. ది పెంగ్విన్ సెక్యూరిటీస్' అనే పేరుతో కొందరు మోసగాళ్లు ఒక సంస్థను ఏర్పాటు చేశారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడితే తక్కువ కాలంలోనే మంచి రాబడి వస్తుందని ఆకర్షణీయమైన పథకాలతో ప్రచారం చేసి రూ. లక్షకు రూ. లక్ష లాభం ఇస్తామని ప్రజలను నమ్మించారు. 

వీరి మాయమాటలు నమ్మిన సుమారు 1,500 మంది అమాయకులు తమ కష్టార్జితాన్ని ఈ సంస్థలో పెట్టుబడులుగా పెట్టారు. ఈ విధంగా మదుపర్ల నుంచి దాదాపు రూ.150 కోట్ల వరకు నిధులు సేకరించారు. వీరిని నమ్మి రూ.లక్ష నుంచి రూ.కోటి వరకు బాండ్ల రూపంలో 1,500 మంది ఈ సంస్ధలో పెట్టుబడులు పెట్టారు. మోసపోయామని ఆలస్యంగా తెలుసుకున్న బాధితులు పెద్ద ఎత్తున శుక్రవారం జీడిమెట్ల పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.