రేవంత్ సర్కార్ కు హైకోర్టులో భారీ ఊరట
posted on Sep 24, 2025 4:10PM

తెలంగాణ సర్కార్ కు హైకోర్టులో భారీ ఊరట లభించింది. టీజీపీఎస్సీ ఫలితాలపై హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ బుధవారం (సెప్టెంబర్ 24) సస్పెండ్ చేసింది. గ్రూప్ 1 అభ్యర్ధుల విషయంలో గతంలో ప్రభుత్వం ప్రకటించిన ర్యాంకుల ఆధారంగా ఉద్యోగ నియామకాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూనే.. నియామకాలు తుది తీర్పుకు లోబడే ఉండాలని పేర్కొంది.
గ్రూప్ వన్ మెయిన్స్ ర్యాకింగ్స్ లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలతో కొందరు అభ్యర్ధులు దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన హైకోర్టు సింగిల్ బెంచ్ ర్యాంకులను రద్దుచేస్తూ ఈ నెల 9న తీర్పు వెలువరించిన సంగతి విదితమే. ఫలితాలకు సంబంధించి అభ్యర్ధులు రాసిన జవాబుపత్రాలను రీవాల్యుయేషన్ నిర్వహించాలని, అది కుదరకుంటే పరీక్షలను మళ్లీ నిర్వహించాలని సింగిల్ బెంచ్ తన తీర్పులో పేర్కొంది. అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ ర్యాంకులు సాధించిన కొందరు అభ్యర్థులు డివిజన్ బెంచ్ ను ఆశ్రయించారు. వారి పిటిషన్ ను విచారించిన డివిజన్ బెంచ్ సింగిల్ బెంచ్ తీర్పును సస్పెండ్ చేస్తూ.. ర్యాంకుల ఆధారంగా నియామకాలు చేపట్టడానికి ప్రభుత్వానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ తరుపరి విచారణను వాయిదా వేసింది.