నవ్యాంధ్రలో నవశకం.. మోడీ చేతుల మీదుగా 13429 కోట్ల పనులకు శ్రీకారం

నవ్యాంధ్రప్రదేశ్ లో నవశకం మొదలైంది. ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా రూ. 13, 429 కోట్ల విలువైన పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరిగాయి. . కర్నూలులో సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్ సభ వేదికపై నుంచి పలు ప్రాజెక్టులకు ప్రధాని మోడీ గురువారం వర్చువల్ గా ప్రారంభించారు.  నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్‌మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్, ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ అభివృద్ధి చేస్తున్న ఓర్వకల్, కొప్పర్తి ఇండస్ట్రియల్ ఏరియాలలో పనులకూ ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు. మొత్తం రూ. 4,920 కోట్లకు పైగా పెట్టుబడితో వీటిని చేపడుతున్నారు. ఇవి భవిష్యత్తులో మరో రూ.21,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించి, దాదాపు లక్ష ఉద్యోగాలను సృష్టిస్తాయన్నది అంచనా. 

రోడ్డు మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి రూ. 960 కోట్ల వ్యయంతో నిర్మించనున్న సబ్బవరం నుంచి షీలానగర్ వరకు ఆరు లేన్ల గ్రీన్‌ఫీల్డ్ హైవేకు కూడా మోడీ ఈ సందర్భంగా  శంకుస్థాపన చేశారు. అలాగే   రూ. 1,140 కోట్లతో చేపట్టనున్న ఆరు రోడ్డు ప్రాజెక్టులను ప్రధాని మోదీ ప్రారంభించారు. అందులో పీలేరు –కల్లూరు సెక్షన్‌ నాలుగు వరుసల రహదారి,  కడప-నెల్లూరు సరిహద్దు నుంచి సీఎస్ పురం వరకు విస్తరణ, జాతీయ రహదారి-165పై గుడివాడ - నూజెల్ల రైల్వే స్టేషన్ల మధ్య నాలుగు వరుసల రైల్ ఓవర్ బ్రిడ్జి, జాతీయ రహదారి -716 పై కమలాపురం వద్ద పాపాఘ్ని నదిపై  వంతెన, జాతీయ రహదారి -565పై నిర్మించిన కనిగిరి బైపాస్, జాతీయ రహదారి -544డీడీలోని ఎన్ గుండ్లపల్లి పట్టణంలో నిర్మించిన బైపాస్ ఉన్నాయి.

అదే విధంగా రూ. 1,200 కోట్లకు పైగా విలువైన పలు కీలక రైల్వే ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ఇందులో కొత్తవలస–విజయనగరం నాల్గో రైల్వే లైన్, పెందుర్తి - సింహాచలం నార్త్ మధ్య రైల్ ఫ్లైఓవర్‌లు  ఉన్నాయి. కొత్తవలస-బొద్దవర,సిమిలిగుడ- గోరాపూర్‌ డబ్లింగ్‌ విభాగాల పనులు పూర్తి కావడంతో  మోడీ వాటిని  జాతికి అంకితం చేశారు.  

అదే విధంగా గెయిల్ ఇండియా లిమిటెడ్ చేపట్టిన శ్రీకాకుళం–అంగుల్ నేచురల్ గ్యాస్  పైప్‌లైన్‌ను ప్రధాని జాతికి అంకితం చేశారు. రూ. 1,730 కోట్ల వ్యయంతో నిర్మించబడిన ఈ 422 కిలోమీటర్ల పైప్‌లైన్ ఆంధ్రప్రదేశ్‌లో 124 ఒడిశాలో 298 కిలోమీటర్లు విస్తరించి ఉంటుంది.

ఇక చిత్తూరులో ఇండియన్ ఆయిల్‌కు చెందిన 60 వేల మెట్రిక్ టన్నుల వార్షిక సామర్థ్యం కలిగిన ఎల్పీజీ బాట్లింగ్ ప్లాంటును కూడా మోదీ ప్రారంభించారు. దాదాపు రూ.200 కోట్ల పెట్టుబడితో దీనిని నెలకొల్పారు. అదే విధంగా కృష్ణా జిల్లా నిమ్మలూరులో  రూ. 360 కోట్ల పెట్టుబడితో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్  నెలకొల్పిన అధునాతన నైట్ విజన్ ఉత్పత్తుల ఫ్యాక్టరీని కూడా ప్రధాని జాతికి అంకితం చేశారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu