ఏపీలో నోరూల్.. ఓన్లీ అరెస్టులు, వేధింపులు!
posted on Sep 30, 2023 9:19AM
ఏపీలో పాలన ఉందా అంటే ఉంది. మరి ఎక్కడా అంటే గాలి మాదిరి అది రాష్ట్ర ప్రజల కంటికి కనిపించదు. నాలుగేళ్ళ పాలనలో సీఎం జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు.. ఆ నిర్ణయాల వలన లబ్ది పొందిన ప్రజల గురించి గట్టిగా రెండు నిమిషాలు కూడా మాట్లాడిన దాఖలాలు లేవు. క్యాబినెట్ నిర్ణయాలపై కానీ, అసెంబ్లీ వేదికగా కానీ ప్రజలకు ఆయన ఏం చేయాలనుకున్నారో చెప్పింది చూడలేదు.
మైకు దొరికితే టీడీపీ అధినేత చంద్రబాబుపై, ఆ పార్టీ నేతలపై విమర్శలు, గత ప్రభుత్వం అంతా అవినీతే అంటూ ఆరోపణలు. అమరావతి భూమి కుంభకోణం నుండి ప్రతి అంశంలో అవినీతి ఆరోపణలు చేసిన వైసీపీ నేతలు ఒక్కటీ నిరూపించలేకపోయారు. ప్రస్తుతం చంద్రబాబును అరెస్ట్ చేయించిన స్కిల్ డెవలప్మెంట్ స్కాం, ఆరోపిస్తున్న ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ నెట్ ప్రాజెక్టులలో ఆరోపణలపై కూడా ఇప్పటి వరకూ ఒక్క ఆధారం బయటపెట్టింది లేదు. మొన్నటి వరకూ ఆరోపణలతో పబ్బం గడిపిన వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు అరెస్టులతో రాష్ట్రాన్ని డైవర్ట్ చేస్తుంది.
ఏపీలో ఇప్పుడు ఎక్కడ చూసినా చంద్రబాబు అరెస్టు, లోకేష్ అరెస్టు ఊహాగానాలపైనే చర్చ సాగుతున్నది. చంద్రబాబుకు బెయిల్ వస్తుందా? కేసు కొట్టేస్తారా.. విచారణకు ఆదేశిస్తారా? లోకేష్ ను కూడా అరెస్ట్ చేస్తారా? ముందే లోకేష్ కు బెయిల్ దక్కుతుందా? ఈ ఇద్దరితో ఈ అరెస్టుల పరంపర ఆగుతుందా? ఒకవేళ చంద్రబాబు, లోకేష్ లను అరెస్ట్ చేస్తే టీడీపీను నడిపించేదెవరు? ఇలా పలు రకాలుగా రాష్ట్రవ్యాప్తంగా చర్చ సాగుతుంది. ఈ క్రమంలో అసలు ప్రభుత్వం ఏం చేస్తున్నది? ఉద్యోగులకు, పెన్షనర్లకు జీతాలు అందుతున్నాయా? రబీ సీజన్ మొదలైనా రైతులకు విత్తనాలు, సబ్సిడీ ఎరువులు ఏమైనా ఇస్తున్నారా? రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు డబ్బులు జమవుతున్నాయా? ఆరోగ్య శ్రీ అసలు నడుస్తున్నదా? ప్రభుత్వ ఆసుపత్రులలో మందులు అందుబాటులో ఉన్నాయా.. ఇలా ప్రజల సమస్యలపై ఎక్కడా ఎలాంటి చర్చలు లేవు.. ప్రభుత్వం కూడా దృష్టి పెట్టడం లేదు.
రాష్ట్ర వ్యాప్తంగా విషజ్వరాలు ప్రబలుతున్నాయి. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ తో జనం ఆసుపత్రుల బాట పడుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ ఆసుపత్రులలో మందులు అందుబాటులో ఉండడం లేదని, వైద్య పరీక్షలకు కూడా బయటకి పంపిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎక్కడిక్కడ జిల్లా వార్తాపత్రికల జిల్లా ఎడిషన్ లలో కథనాలు కూడా వస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన రైతు భరోసా కేంద్రాలలో ఒక్క బస్తా కూడా ఎరువు దొరకడం లేదు. బయట వ్యాపారులు రైతులను దోచుకుంటున్నారు. ఇవేమీ ప్రభుత్వానికి పట్టడం లేదు.
ఇంకా మాట్లాడితే అసలు ఏ శాఖకి మంత్రి ఎవరో కూడా 99 శాతం మంది ప్రజలకు తెలియనే తెలియదు. అసలు ఆయా శాఖల మంత్రులకు కూడా వారి శాఖ ఏమిటో, వారి బాధ్యత ఏమిటో తెలుసా అంటూ అనుమానమేనన్న సమాధానం పరిశీలకుల నుంచి వస్తున్నది. అసలు ఆ మంత్రులంతా ఏం చేస్తున్నారో కూడా ఎవరికీ చెప్పరు. చంద్రబాబు అరెస్టు, పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తులపై మాట్లాడేందుకు మాత్రం అందరూ కట్టగట్టుకొని వరసబెట్టి టీవీల ముందుకు వచ్చేస్తారు.
సహజంగా సీఎం వారం రోజులు రాష్ట్రంలో లేరంటే వచ్చీ రాగానే పాలనపై దృష్టి పెడతారు. గత వారంలో రాష్ట్ర పాలన ఎలా సాగింది? ప్రసుత రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏంటి? సమస్యలను ఎలా ఎదుర్కోవాలి? అసలే అప్పుల పాలు చేసిన రాష్ట్రం కనుక ఏదైనా రాష్ట్రానికి ఆదాయం తెచ్చే పనులు చేయాలంటే ముందున్న అవకాశాలేంటి? అనే అంశాలపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. కానీ, జగన్ విదేశీ యాత్ర ముగించుకొని వచ్చిన తర్వాత ఈ తరహా సమావేశాలు చేపట్టినట్లు ఎక్కడా కనిపించలేదు. కనీసం తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు ఆదేశించినట్లుగా కూడా దాఖలాలు లేవు. కానీ, జగన్ రాష్ట్రానికి వచ్చాక చంద్రబాబు అరెస్టుపై వివరణ ఇవ్వడం, రానున్న ఎన్నికల కోసం ప్రజలను మెప్పించడం ఎలా అనే అంశాలపై సొంత పార్టీ ఎమ్మెల్యేల నుండి ఇంచార్జిలు, కన్వీనర్లతో సమావేశాలు నిర్వహించారు. దీనిని బట్టి చూస్తే వైసీపీకి రాష్ట్ర పాలన, ప్రజల సంక్షేమం కంటే ప్రత్యర్థులపై కక్షసాధింపు, రానున్న ఎన్నికల కోసం ప్రజలను ఎలా మాయ చేయాలనే దానిపైనే ఆసక్తి కనబడుతుంది.