కేసీఆర్కి జగన్ అంటే అంత ప్రేమ ఎందుకో తెలుసా?
posted on Jun 2, 2025 9:27PM
.webp)
రెండు పార్టీలు రెండు తెలంగాణ తల్లి విగ్రహాలు, రెండు జాతీయ గీతాలంటూ తీవ్రంగా కొట్టుకు ఛస్తున్నాయి కదూ. అయితే వీరు పెట్టుకుని నిజానికి పెట్టుకోవల్సింది వైయస్ విగ్రహానికి. వైయస్ ఆనాడు చంద్రబాబును ఏమీ చేయలేక.. చిన్నారెడ్డి అనే ఒక కాంగ్రెస్ నాయకుడి ద్వారా నలభై మంది వరకూ పోగేసి.. ఢిల్లీకి పంపారు. పర్పస్.. పాతబడిన తెలంగాణ ఉద్యమాన్ని తిరిగి రీయాక్టివేట్ చేయడానికి. అలా ప్రాంతీయ వాదాన్ని అడ్డు పెట్టుకుని చంద్రబాబును దెబ్బ తీసే యత్నం చేశారు. ఆ తర్వాత చంద్రబాబు ఓడిపోవడం వైయస్ అధికారంలోకి రావడం తెలిసిందే.
అప్పటికి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి స్తాపించారు. కానీ ఏమంత ప్రోత్సాహకరంగా లేదు. ఈ విషయం పసిగట్టిన వైయస్, చిన్నారెడ్డి రూపంలో ఢిల్లీకి తెలంగాణ వాదం వినిపించేందుకు పంపారు. తర్వాతి కాలంలో కూడా ఆయన తెలంగాణ వాదులను చాలా రకాలుగా విమర్శించి వేధించేవారు. స్వయంగా కేసీఆర్ ను "నీకు బాబుగానీ మంత్రి పదవి ఇచ్చి ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదంటూ" తీవ్ర అవమానకరమైన కామెంట్లు చేసేవారు. 'ఏవయ్యా రాజేంద్రా!' అంటూ ఆయన చేసిన కామెంట్లు ఇప్పటికీ చాలా మంది చెవుల్లో మారు మోగుతున్నాయి కూడా.
ఒక పక్క తెలంగాణ కోసం చిన్నారెడ్డిలాంటి వాళ్లను రెచ్చగొట్టిన వైయస్ సరిగ్గా అదే సమయంలో.. తెలంగాణ రాకుండా అడ్డుకున్నట్టు కూడా చెబుతారు. 2009 ఎన్నికల సమయంలో "తెలంగాణకు వెళ్లాలంటే వచ్చే రోజుల్లో పాస్ పోర్టు అవసరమంటూ" వివాదాస్పద వ్యాఖ్యలను చేసి.. తర్వాత గెలిచిన ఘన చరిత్ర వైయస్ ది. అంతగా తెలంగాణ వాదంతో ఆడుకున్న వ్యక్తి వైయస్. ఎప్పుడైతే వైయస్ మరణించారో అప్పుడు తెలంగాణ వాదానికి ఊపిరి తీసుకున్న పరిస్థితి.
ఒక సమయంలో వైయస్ ఉండగా తమకిక తెలంగాణ వచ్చే ప్రసక్తే లేదన్న కోణంలో కొందరు తీవ్రంగా ఫీలయ్యేవారు కూడా. అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో వైయస్ కి అంతటి గ్రిప్ ఉండేది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి పెద్ద ఎత్తున ఎంపీలను ఇచ్చే సీఎం కావడంతో.. ఢిల్లీ అధిష్టానం కూడా వైయస్ మాట జవదాటేది కాదు. ఇటు సీట్లు, అటు నోట్ల కట్టలతో వైయస్ ఢిల్లీ పెద్దల దగ్గర అంతగా తన మాట నెగ్గించుకునేవారు. అందుకే "వైయస్ చచ్చి ఏలోకాన ఉన్నారో కానీ.." అంటూ కేసీఆర్ తరచూ అంటుండేవారు.
అయితే ఇక్కడ వైయస్ తెలివి ఏంటంటే తెలంగాణ సెంటిమెంటు అడ్డు పెట్టుకుని.. ఢిల్లీ పెద్దలను గట్టిగానే గ్రిప్ లో పెట్టుకునేవారు. ఒక సమయంలో వైయస్ వల్లే విపరీతంగా బలిదానాలు జరిగాయన్న మాట వినిపించేది. వైయస్ మరణానంతరం కాస్త తెరిపిన పడ్డారు తెలంగాణ వాదులు. అంతగా ఆయన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును దారుణంగా అడ్డుకున్నారు. వైయస్ మరణానంతరం.. అంటే 2014లో తెలంగాణ రావడంతో.. పాత కక్షలన్నీ మరచి పోయి.. వైయస్ ని కేసీఆర్ గౌరవించేవారని అంటారు. అంతే కాదు ఆయన కొడుకు జగన్ సైతం తెలంగాణ రాకను రాజకీయంగా అంగీకరించేవారు కాదు. దానికి తోడు ఈ ప్రాంతంలో కేసీఆర్ కి అడ్డుగా తన పార్టీని లేకుండా సమూలంగా తొలగించి.. ఏపీకి తన రాజకీయాలను పరిమితం చేశారు.
దీంతో వైయస్ అన్నా, ఆయన కొడుకు జగన్ అన్నా.. కేసీఆర్ కి వల్లమాలిన అభిమానం. ఒక దశలో జగన్, షర్మిళ ఆస్తి పంపకాల పంచాయితీ కూడా కేసీఆర్ దగ్గరకే వచ్చింది. అలా కేసీఆర్, జగన్ ఇరువురు నేతలు రెండు ప్రాంతాలను చీల్చుకుని.. వాటి ద్వారా అధికారంలోకి రావడంతో.. ఇద్దరి మధ్య సత్సంబంధాలతో పాటు.. కొన్ని కొన్ని ఒప్పందాలు జరిగి ఎవరికి సాగినంతగా వారు సాగించుకున్నట్టు చెబుతారు. వైయస్ తన రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణ వాదాన్ని వాడుకోవడం. ఆయన అడ్డుకోవడం వల్ల యువత బలవన్మరణాలకు పాల్పడ్డంతో ఉద్యమానికి మరింత ఊపొచ్చిందని నమ్ముతారు కేసీఆర్. దీంతో ఆయన వైయస్ ఫ్యామిలీ అంటే అంతటి అభిమానం చూపుతారని అంటారు