అమరావతి పాలనా భవనాల పనులు ప్రారంభించాలని సీఎం చంద్రబాబు ఆదేశం

 

ఆంధ్రప్రదేశ్ అమరావతిలో పాలనా భవనాల నిర్మాణానికి రూ.3,673 కోట్ల చేపట్టే పనులకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించాలని సంబంధిత సంస్థలను సీఆర్‌డీఏపై సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. రూ.882 కోట్లతో పాలనా భవనం నిర్మాణ టెండర్‌ను ఎన్‌సీసీ సంస్థ దక్కించుకుంది. రూ.1,467 కోట్లతో టవర్‌ 1, 2 నిర్మాణాలను షాపూర్జీ పల్లోంజి సంస్ధ చేపట్టనుంది.

మరో రూ.1,393 కోట్లతో టవర్‌ 3, 4 నిర్మాణ టెండర్లు ఎల్‌అండ్‌టీ సంస్థ దక్కించుకుంది. టెండర్లు దక్కించుకున్న సంస్థలు వెంటనే పనులు ప్రారంభించాలని సీఎం ఆదేశించారు. సమావేశం అనంతరం పురపాలక శాఖ మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ.. పాలన సులభం చేసేందుకే భవనాలన్నీ ఒక చోట కట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. న్యాయపరమైన సమస్యలు లేకుండా టెండర్ల ప్రక్రియ పూర్తి చేశామన్నారు. ‘‘ పెట్టుబడులు రావాలంటే 5 వేల ఎకరాలతో విమానాశ్రయం అవసరం. స్మార్ట్‌ ఇండస్ట్రీస్‌, అంతర్జాతీయ క్రీడానగరానికి 34 వేల ఎకరాలు సరిపోదు.3 ప్రాజెక్టులకు ప్రజాభిప్రాయం మేరకు భూ సేకరణ చేస్తాం. 24 వేల ఎకరాలు ఇచ్చేందుకు రైతులు అంగీకరించారు. ఇప్పటి వరకు భూ సమీకరణ నిబంధనలు 217చ.కి.మీ వరకే ఉన్నాయి. నిబంధనల పరిధిని పెంచేందుకు సీఆర్డీయే నిర్ణయం తీసుకుంది.’’ అని మంత్రి నారాయణ పేర్కొన్నారు.