విద్యా సంస్థల్లో ఫేషియల్ రెకగ్నిషన్ తప్పనిసరి : సీఎం రేవంత్
posted on Aug 29, 2025 8:17PM

స్కూళ్లు, కాలేజీల్లో విద్యార్థులు ,బోధన సిబ్బందికి ఫేషియల్ రెకగ్నిషన్ అటెండెన్స్ను తప్పనిసరి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. మధ్యాహ్న భోజన బిల్లుల చెల్లింపును గ్రీన్ ఛానల్లో చేపట్టాలని ఆ విషయం నిర్లక్ష్యం చేయవద్దని అన్నారు. ప్రతి విద్యాసంస్థలో క్రీడలకు ప్రాధాన్యమిచ్చి అవసరమైతే కాంట్రాక్ట్ పద్దతిలో పీఈడీలను నియమించాలని ముఖ్యమంత్రి సూచించారు.
బాలికలకు వివిధ అంశాలపై కౌన్సిలింగ్ ఇచ్చేందుకు మహిళా కౌన్సిలర్లను నియమించాలని విద్యా అధికారులకు సూచించారు. విద్యాశాఖ పరిధిలో అదనపు గదులు, వంట గదులు, టాయిలెట్ గదులు, ప్రహరీల నిర్మాణం వేర్వేరు విభాగాలు చేపట్టడం సరికాదని మఖ్యమంత్రి తెలిపారు. కంటైనర్ కిచెన్లకు ప్రాధాన్యమివ్వాలని తెలిపారు. కంటైనర్లపై సోలార్ ప్యానెళ్లతో అవసరమైన విద్యుత్ వినియోగించుకోవచ్చని సీఎం సూచించారు.
అమ్మ ఆదర్శ పాఠశాలల కింద పాఠశాలల్లో పారిశుద్ధ్య పనులకు సంబంధించిన బిల్లులు తక్షణమే విడుదల చేయాలని ఆదేశించారు .మహిళా కళాశాలలు, బాలికల పాఠశాలల్లో మూత్రశాలలు, ప్రహరీల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని సీఎం తెలిపారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్న విద్యా, సంక్షేమ వసతుల అభివృద్ధి సంస్థ పరిధిలోకి తేవడం ద్వారా నాణ్యతాప్రమాణాలు, నిర్మాణ పర్యవేక్షణ, నిధుల మంజూరు, జవాబుదారీతనం తేలికవుతుందని అధికారులకు సూచించారు.