బంగ్లాదేశ్ మాజీ ప్రధాని బేగం ఖలీదా జియా కన్నుమూత

బంగ్లాదేశ్  తొలి మహిళా ప్రధానని బేగం ఖలీదా జియా మంగళవారం డిసెంబర్ 30) కన్నుమూశారు. ఆమె వయస్సు 80 ఏళ్లు. గత కొంత కాలంగా   అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న బేగం ఖలీదా జియా చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.    కాలేయ వ్యాధి, కీళ్ల నొప్పులు, మధుమేహం, గుండె, ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్న ఆమె ఆరోగ్యం క్షిణించడంతో గత కొంత కాలంగా ఆమె ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఈ ఉదయం ఆమె ఆరోగ్యం మరింత క్షీణించి తుది శ్వాస విడిచారు.  

బంగ్లాదేశ్ మాజీ అధ్యక్షుడు జియావుర్ రెహ్మాన్ భార్య అయిన ఖలీదా జియా.. తన భర్త మరణానంతరం రాజకీయాల్లోకి వచ్చి అజేయ శక్తిగా ఎదిగారు. బంగ్లాదేశ్ ప్రధానిగా మూడు సార్లు  బాధ్యతలు చేపట్టిన ఆమె, ఆ దేశంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణకు విశేషంగా కృషి చేశారు.  ఆమె మరణవార్త తెలియగానే బంగ్లాదేశ్ వ్యాప్తంగా ఉన్న బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు.  
ఖలీదా మరణించిన సమయంలో ఆమె కుమారుడు, బీఎన్‌పీ తాత్కాలిక చైర్మన్ తారిక్ రెహమాన్, కోడలు జుబైదా రెహమాన్, మనవరాలు జైమా రెహమాన్, పార్టీ సెక్రటరీ జనరల్ మీర్జా ఫక్రుల్ ఇస్లాం అలంగీర్ సహా ఇతర కుటుంబ సభ్యులు ఆసుపత్రి వద్దే ఉన్నారు. బేగం ఖలీదా జియాకు ఇండయాతో విడదీయరాని అనుబంధం ఉంది. ఆమె జన్మించినది ఇండియాలోనే.   1947లో దేశ విభజన  తర్వాత ఆమె కుటుంబం ప్రస్తుత బంగ్లాదేశ్ కు వలస వెళ్లింది.  

1991లో బంగ్లాదేశ్‌ ఎన్నికల్లో విజయం సాధించి, ఆ దేశపు తొలి మహిళా ప్రధానమంత్రిగా ఖలీదా జియా చరిత్ర సృష్టించారు. ముస్లిం ప్రపంచంలో బెనజీర్ భుట్టో తర్వాత ఈ ఘనత సాధించిన రెండో మహిళగా ఆమె రికార్డు సృష్టించారు.  మూడు పర్యాయాలు బంగ్లాదేశ్ ప్రధానిగా ప్రధానిగా పనిచేసిన ఆమె ఆ దేశ రాజకీయాలలో తిరుగులేని శక్తిగా ఎదిగారు. బేగం ఖలీదా జియా మృతిపట్ల భారత ప్రధాని నరేంద్రమోడీ సహా, పలు దేశాల అధినేతలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu