విద్యుత్ వినియోగదారులకు ఆ డబ్బు వెనక్కు!
posted on Sep 29, 2025 1:00PM

ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ కమిషన్(ఏపీఈఆర్సీ) చరిత్రలో తొలి సారిగా విద్యుత్ వినియోగదారుల నుంచి అదనపు వసూళ్లు అంటూ రిఫండ్ ఇవ్వనుంది. వైసీపీ హయాంలో అత్యంత భారంగా మారిన విద్యుత్ చార్జీల కారణంగా నానా ఇబ్బందులూ పడిన విద్యుత్ వినియోగదారులకు రిఫండ్ ద్వారా గొప్ప ఊరట కలిగించనుంది. 1999లో ఈఆర్సీ ఏర్పడిన తరువాత ఇలా రిఫండ్ ఇవ్వడం ఇదే తొలిసారి.
2023లో ఇంధనం మరియు విద్యుత్ కొనుగోలు వ్యయ సర్దుబాటు (ఎఫ్పీపీసీఏ) విధానం కింద విద్యుత్ పంపిణీ సంస్థలు వినియోగదారుల నుండి అధికంగా డబ్బు వసూలు చేశారని ఏపీఆర్ఈసీ నిర్ధారణకు వచ్చింది. . డిస్కమ్ లు యూనిట్కు 40 పైసలు వసూలు చేయడం ద్వారా దాదాపు 2,787 కోట్ల రూపాయలను రిఫండ్ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ రిఫండ్ ను యూనిట్ కు 13 పైసల చొప్పున నవంబర్ 2025, అక్టోబర్ 2026 మధ్య కాలంలో దశలవారిగా సర్దుబాటు చేయాలని ఏపీఈఆర్సీ నిర్ణయించింది.
వైసీపీ హయాంలో 2021–22, 2023–24 మధ్య ట్రూ అప్ చార్జీల పేరుతో విద్యుత్ వినియోగదారులపై దాదాపు 18,567 కోట్ల రూపాయల భారం మోపింది ఇప్పుడు రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అప్పట్లో జగన్ ప్రభుత్వం వినియోగదారుల నుంచి ముక్కుపిండి మరీ వసూలు చేసిన అదనపు చార్జీలను రిఫండ్ చేయాలని నిర్ణయించింది. దీనిపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.