రాయల తెలంగాణా వెనుక కాంగ్రెస్ అంతర్యం ఏమిటి?

  రాష్ట్ర విభజన దాదాపు ఖరారయినట్లే కనిపిస్తోంది. బహుశః అదే నిజమయితే, యుపీఏ ప్రభుత్వం తన నాలుగేళ్ల పాలనలో తీసుకొంటున్న అత్యంత సాహసోపేతమయిన నిర్ణయమవుతుంది. అయితే, తెలంగాణా, రాయల తెలంగాణాలలో కాంగ్రెస్ దేనిని ఎంచుకొంటుంది? అనే దానిపై కాంగ్రెస్ అంతర్యం బయటపడుతుంది. ఒకవేళ రాయల తెలంగాణావైపు మొగ్గు చూపినట్లయినతే, కాంగ్రెస్ రాష్ట్ర విభజన చేయకుండా సాగదీసేందుకే ప్రయత్నిస్తున్నట్లు భావించవచ్చును. అటు తెలంగాణా, ఇటు రాయలసీమ ప్రజలు, నేతలు ముక్త కంఠంతో వ్యతిరేఖిస్తున్నఈ ప్రతిపాదనతో కాంగ్రెస్ చర్చలు, సమావేశాలు పేరిట రాష్ట్ర విభజనపై మరికొంత వెసులుబాటు పొందడం కోసమే ఈ ఎత్తుగడ వేస్తున్నట్లు భావించవచ్చును.   ఇటువంటి ప్రతిపాదన తేవడంద్వారా తెలంగాణా నేతలలో భయాలు పెంచి చివరికి, తెలంగాణా ఇస్తే చాలు, రాజధాని తదితర క్లిష్టమయిన అంశాలపై ఎటువంటి షరతులకయినా వారు అంగీకరించే స్థాయికి తీసుకురావడం కూడా కాంగ్రెస్ ఉద్దేశ్యంగా కనబడుతోంది. బహుశః ఈ ప్రతిపాదనపైకి వచ్చిన తరువాతనే, తెలంగాణా నేతలు, హైదరాబాదును ఉమ్మడి రాజధానిగా అంగీకరించేందుకు మానసికంగా సిద్దపడినట్లు తెలుస్తోంది.   అయితే, సీమంధ్ర నేతలు కోరుతున్నట్లు హైదరాబాద్ ను పరిమిత కాలం వరకయినా కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలని వస్తున్న ఒత్తిళ్లకు తలొగ్గిన కాంగ్రెస్, ఆ విధంగా చేయాలంటే తెలంగాణా నేతలని ఈ విషయంలో మరికొంత ఒప్పించక తప్పదు. కానీ వారు అటువంటి ప్రతిపాదనను గట్టిగా వ్యతిరేఖిస్తున్నారు. అందువల్ల వారిని లొంగదీయాలంటే రాయల తెలంగాణా వంటి అసంబద్ద ప్రతిపాదనే శరణ్యం. అటువంటి దానికి అంగీకరించి భవిష్యత్తులో మరో కొత్త సమస్యను ఎదుర్కోవడం కంటే, హైదరాబాదును పరిమిత కాలంవరకు కేంద్రపాలిత ప్రాంతంగా ఉమ్మడి రాజధానిగా అంగీకరించడానికే వారు మొగ్గు చూపే అవకాశం ఉంది. బహుశః అందుకే కాంగ్రెస్ ఈ రాయల తెలంగాణా ప్రతిపాదన చేస్తున్నట్లు కనబడుతోంది.   ఈ రాయల తెలంగాణా ప్రతిపాదన రాష్ట్ర విభజన చేయకుండా మరికొంత కాలం సమయం పొందేందుకు లేదా రాజధాని విషయంలో తెలంగాణా నేతలను ఒప్పించేందుకే కాంగ్రెస్ ఈ ఎత్తుగడ వేసి ఉండవచ్చును.

రాష్ట్ర విభజనపై త్వరలో వైకాపా కూడా తుది నిర్ణయం

  ఈ రోజు సీమంధ్రకు చెందిన వైకాపా నేతలు శ్రీకాంత్ రెడ్డి, వంగవీటి రాధా, కొడాలి నాని తదితరులు జగన్ మోహన్ రెడ్డిని జైల్లో కలిసారు.ఆ తరువాత శ్రీకాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ “విభజనపై కాంగ్రెసు పార్టీని నిరసిస్తూ రాజీనామాలు చేయడం తమ వ్యక్తిగతమని, అది పార్టీ నిర్ణయం కాదని, మరొక రెండు మూడు రోజుల్లో తెలంగాణపై పార్టీ నిర్ణయం ప్రకటిస్తామని” తెలిపారు. ఆ తరువాత నర్సన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ “రాష్ట్రంలోని అన్నిప్రాంతాల అభివృద్ధిని కోరుకుంటున్నానని తెలిపారు. రాష్ట్ర విభజనను కోరుకోవడంలేదని” అన్నారు. ఒకరు త్వరలో పార్టీ నిర్ణయం ప్రకటిస్తామని చెపుతుంటే, మరొకరు రాష్ట్రవిభజన కోరుకోవట్లేదని చెప్పడం గమనార్హం.   ఇక మరో రెండు రోజుల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజనపై తుది నిర్ణయం ప్రకటించబోతుంటే, తాము కూడా మరో రెండు మూడు రోజుల్లో రాష్ట్ర విభజనపై తమ పార్టీ అభిప్రాయం ప్రకటిస్తామని చెప్పడం హాస్యాస్పదం.   తెలంగాణా అంశం నిన్న మొన్న కొత్తగా మొదలయినదేమీ కాదు. పార్టీ స్థాపించిన తరువాత జరిగిన ప్లీనరీలో రాష్ట్ర విభజనపై అభిప్రాయం చెప్పగలిగే అవకాశం ఉన్నపటికీ, అప్పుడు "తమ పార్టీ తెలంగాణా ప్రజల మనోభావాలను గౌరవిస్తుందని" చెప్పి పార్టీ రాష్ట్ర విభజనకు అనుకూలమా వ్యతిరేఖమా? అని చెప్పకుండా సమాధానం దాటవేసి, ఆ తరువాత “తెలంగాణా ఇచ్చే, తెచ్చేశక్తిలేని చిన్నపార్టీమాది. తెలంగాణా ఇస్తుందో లేదో ఆ శక్తి ఉన్నకాంగ్రెస్ పార్టీనే నిలదీయండి. కాంగ్రెస్ ఏ నిర్ణయం తీసుకొన్నామాకు అభ్యంతరం లేదు,” అని చెపుతూ ఇన్నాళ్ళు లౌక్యంగా తప్పించుకొని తిరిగిన, వైకాపా ఇప్పుడు రాష్ట్ర విభజనపై తుది నిర్ణయం తీసుకోవడానికి సిద్దపడుతున్న కాంగ్రెస్ పార్టీని తప్పుపడుతూ రాజీనామాల డ్రామాలు మొదలుపెట్టింది.   రాష్ట్ర విభజనపై ఆ పార్టీ చెప్పిన మాటలు పక్కన బెట్టినప్పటికీ, ఆ పార్టీ అఖిలపక్షంలో ఇచ్చిన లేఖ సంగతి ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదు? కాంగ్రెస్ ఎవరినీ సంప్రదించకుండా ఒంటెత్తు పోకడలు పోతోందని విమర్శిస్తున్న వైకాపా, మరి ఆనాడు అఖిలపక్షంలో ఎందుకు నోరు విప్పలేదు? ఇంతకాలం రాష్ట్ర విభజనపై నోరు మెదపని ఆ పార్టీ ఇప్పుడు ఆఖరి దశలో తన స్వార్ధ రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని సమైక్యరాగం ఆలపించి, పార్టీకోసం శ్రమించిన తన తెలంగాణా నేతలని నట్టేటముంచి, తెలంగాణాలో “విశ్వసనీయత” కోల్పోయిన తరువాత ఆ పార్టీని ఆంద్ర ప్రజలు మాత్రం నమ్ముతారా?   ఇంతవరకు ఒక్కసారి కూడా సాధారణ ఎన్నికలని ఎదుర్కోని వైకాపా, మొదటి ప్రయత్నంలోనే అధికారం కైవసం చేసుకొందామనే దురా(శ)లోచనతో ఇటువంటి ఆలోచనలు చేస్తూ, మొట్ట మొదటగా తనకే స్వంతమనుకొంటున్న‘విశ్వసనీయత’ ను పోగొట్టుకొంటోంది. తన పార్టీ నేతల, తెలంగాణా ప్రజల ఆగ్రహానికి గురయ్యి వారికి సంజాయిషీలు చెప్పుకోవడం గమనిస్తే, తన నిర్ణయం తప్పని అర్ధం అవుతోంది.

వైకాపా రాజీనామాల మతలబు ఏమిటి

  తొలి దశ పంచాయతీ ఎన్నికలతో తిరుగులేని ఆధిక్యత సాధించామని గొప్పగా ప్రకటించుకొన్న వైకాపా, రెండవ,మూడవ దశ ఎన్నికలను ఎదురుగా పెట్టుకొని హటాత్తుగా సమైక్యంద్ర నినాదం ఎత్తుకొని, ఆ పార్టీకి చెందిన 11మంది శాసనసభ్యులు రాజీనామాలు చేయడం చూస్తే ఇక ఆ పార్టీ తెలంగాణాలో ‘కేల్ ఖతం దుకాన్ బంద్’కు సిద్దపడినట్లు అర్ధం అవుతోంది. తెలంగాణాలో ఎంత చమటోడ్చినా ఒక మహబూబ్‌నగర్ లో తప్ప మరెక్కడ పార్టీ పత్తా లేకపోవడంతో, ఇక మున్ముందు కూడా తెలంగాణాలో ఇంత కంటే గొప్పగా సాధించేదేమీ ఉండదని గ్రహించి, 'తెలంగాణాలో రాకపోతే పాయె కనీసం ఆంధ్ర ప్రాంతంలోనయినా పార్టీని గట్టిగా నిలబెట్టుకొంటే అదే పదివేలు' అని భావించడం వల్లనే, అకస్మాత్తుగా తెలంగాణా వ్యతిరేఖ నినాదం చేయగలిగింది. లేకుంటే ఎన్నికల సమయంలో ఏ మాత్రం రాజకీయ అవగాహన ఉన్నపార్టీ అయినా, ఎన్నికల మధ్యలో ఇటువంటి సాహసానికి ఒడిగట్టదు.   ఇప్పుడు హటాత్తుగా సమైక్యరాగం ఆలపించడం ద్వారా తెలంగాణాను వదులుకొని, అదే సమయంలోఅందరి కంటే ముందు తానే ‘సమైక్యత్యాగం’ చేసి ఆంద్ర ప్రాంతంలో ఆలోటు భర్తీ చేసుకోవాలని ఆలోచనలా ఉంది.   తెలంగాణాలో ‘పోయిన పరువెలాగు పోయింది, ఇక పోతే పోయేది ఒట్టి గోచి మాత్రమే’నన్నట్లు,  అక్కడ పంచాయితీ ఎన్నికలు గెలిచినా ఓడినా ఒక్కటే గనుక, వైకాపా సమైక్య రాగాలాపన చేస్తోందిప్పుడు. వైకాపా పంచాయితీ ఎన్నికలకు ముందే తెలంగాణపై కాంగ్రెస్ ను ప్రశ్నిస్తూ ఒక లేఖ వ్రాసింది. అప్పుడే ఆ పార్టీకి వేరే ఆలోచనలున్నాయనీ భావించిన ప్రజలు ఆ పార్టీని పక్కనబెట్టారు. అందువల్ల పంచాయతీ ఎన్నికల మొదటి దశ ఫలితాలు చూసుకొన్న వెంటనే సమైక్యరాగం అందుకొంది. ఒకవేళ ఆ పార్టీకి తెలంగాణాలో మంచి ఆధిక్యత వచ్చి ఉండి ఉంటే బహుశః నేడు ఇటువంటి ఆలోచన చేసి ఉండేది కాదని ఖచ్చితంగా చెప్పవచ్చును.   ఇప్పుడు ఈ కొత్త ఎత్తుతో తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకొన్న తెదేపాను ఆంధ్ర ప్రాంతంలో దోషిగా నిలబెట్టవచ్చును. ఇంకా వీలయితే తెదేపాపై ఒత్తిడి తెచ్చి ఆపార్టీలో సమైక్యవాదం పేరిట చీలిక తేగలిగితే, అప్పుడు ఆ పార్టీని అటు తెలంగాణాలోనూ, ఇటు ఆంద్ర ప్రాంతంలోనూ పూర్తిగా దెబ్బ తీయవచ్చునని వైకాపా దూర దురాలోచన కూడా కనబడుతోంది.   ఇక, ఇదే వ్యూహంతో కాంగ్రెస్ పార్టీని కూడా రెండు ప్రాంతాలలో ఘోరంగా దెబ్బ తీయవచ్చునని ఆలోచన కూడా ఉంది. తెరాస చేతిలోంచి కాంగ్రెస్ తెలంగాణా సెంటిమెంటును కాకిలా ఏవిధంగా ఎత్తుకుపోయిందో, అదేవిధంగా ఇప్పుడు సమైక్యాంధ్ర సెంటిమెంటుని కాంగ్రెస్ నేతల చేతిలోంచి   వైకాపా తన్నుకుపోవాలనే ఆలోచనతో ఈ రాజీనామాల డ్రామకు తెర తీసింది.   రేపటి నుండి వైకాపా సమైక్య పోరాటం మొదలుపెడితే, అప్పుడు ఇంత కాలం దానికోసం పోరాడుతున్న కాంగ్రెస్ నేతలు దానిని వైకాపాకు అప్పజెప్పి, అధిష్టానం నిర్ణయానికి కట్టుబడుతున్నామని చెప్పలేరు. చెపితే వారిని సమైక్య ద్రోహులుగా ముద్ర వేసేయవచ్చును. అలాగని వారు రాజీనామాలు చేసి ఉద్యమాలకి దిగితే, రాష్ట్ర విభజనకి సిద్దపడుతున్న కాంగ్రెస్ అధిష్టానానికి గొంతులో పచ్చి వెలక్కాయ పడటం ఖాయం. అప్పుడది తెలంగాణపై మరోమారు వెనకడుగు వేయడం కూడా అంతే ఖాయం. అదే జరిగితే కాంగ్రెస్ ను అక్కడ కేసీఆర్ దెబ్బతీస్తే, ఇక్కడ తానూ దెబ్బ తీయవచ్చునని ఆలోచన ఉంది.   ఒకే దెబ్బకు రెండు పిట్టలు కొట్టినట్లు, వైకాపా తన సమైక్య రాగాలాపనతో అటు కాంగ్రెస్, ఇటు తెలుగుదేశం పార్టీలను దెబ్బ తీయాలని భావిస్తోంది. అయితే, ప్రతీ సారిలాగే ఈసారి కూడా ఆ పార్టీ ఇది కూడా మరొక తప్పటడుగు అని త్వరలోనే అర్ధం చేసుకోవచ్చును. ఎందుకంటే, కళ్ళముందు కనబడుతున్న తెలంగాణా రాష్ట్రాన్ని ఈసారి తమకి దక్కకుండా చేస్తే తెలంగాణా ప్రజల ఆగ్రహం ఆ పార్టీ తట్టుకోలేదు. అందుకు అది చాలా భారీ మూల్యం చెల్లించక తప్పదు.

సమైక్యాంధ్ర ఉద్యమాలు ఎవరి కోసం

  నిన్న మంత్రి టిజి వెంకటేశ్ మీడియాతో మాట్లాడుతూ “రాష్ట్ర విభజన జరగకుండా మా ప్రయత్నాలు మేము చేస్తున్నాము. కానీ ప్రజల నుండి కనీస స్పందన కూడా రావడం లేదు. సీమంధ్ర ప్రజల ఈ ఉదాసీన వైఖరి వల్లనే కేంద్రం కూడా తెలంగాణా ఏర్పాటుకి సిద్దపడుతోంది. ఇప్పుడు కేంద్రం తెలంగాణ ప్రకటన చేసినట్లయితే, గతంలోలాగా మేము రాజీనామాలుచేసి కేంద్రాన్ని బెదిరించడానికి అవకాశం లేదు. ఒకవేళ రాష్ట్ర విభజన జరిగితే అందుకు తెలంగాణా ప్రజలనే కాక సీమంధ్ర ప్రజలని కూడా నిందించక తప్పదు. కానీ రాష్ట్ర విభజన జరుగకుండా ఆపేందుకు చివరి నిమిషం వరకు మా ప్రయత్నాలు మేము చేస్తూనే ఉంటాము,” అని ఆయన అన్నారు.   ఆయన మాటలు రెండు విషయాలను స్పష్టం చేస్తున్నాయి.   సమైక్యాంధ్ర ఉద్యమాలు కేవలం కొందరు వ్యక్తుల స్వార్ధ రాజకీయ, వ్యాపార ప్రయోజనాల కొరకే ప్రేరేరింపబడినవే తప్ప వాటికి సీమంధ్ర ప్రజల మద్దతు లేదని మొదటి నుండి వాదిస్తున్నతెలంగాణా ఉద్యమనేతలు వాదన సరయినదేనని మంత్రి టిజి వెంకటేష్ తన మాటలతో చెప్పకనే చెప్పారు.   ఇంత కాలం ప్రజల అభీష్టానికి అనుగుణంగా నడుచుకొంటున్నామని చెప్పుకొస్తున్నఆయన, ఇప్పుడు ప్రజలు తమకు సహకరించడం లేదని ఆరోపించడంలో అర్ధం ఏమిటి? రాష్ట్ర విభజన పట్ల కేవలం ఆయన వంటి రాజకీయ నాయకులకే తప్ప ప్రజలకు అభ్యంతరం లేదని, అయినప్పటికీ రాష్ట్ర విభజన జరుగకుండా అడ్డుకొనేందుకు తమ ప్రయత్నాలు కొనసాగిస్తామని చెప్పడం ప్రజాభీష్టానికి వ్యతిరేఖంగా తమ ప్రయోజనాలను కాపాడుకోవడానికే నని అర్ధం అవుతోంది. అటువంటప్పుడు ఇక ప్రజలను నిందించడం ఎందుకు?   ఎందుకంటే సమైక్యాంధ్ర కోసం తాము చివరి నిమిషం వరకు చాల కృషి చేసామని, అయినప్పటికీ ప్రజల సహకారం లేకపోవడంతో  విధిలేని పరిస్థితుల్లో విభజనకు అంగీకరించవలసి వచ్చిందని సంజాయిషీలు చెప్పుకొంటూ, సమైక్యాంధ్ర కోసం పోరాడిన వీరులుగా తమకు తాము భుజకీర్తులు తగిలించుకొని, రేపు కొత్తగా ఏర్పడనున్న ఆంధ్రరాష్ట్రంలో కీలకమయిన మంత్రి పదవులు చెప్పట్టడానికి మార్గం సుగమం చేసుకోవడానికే.   ఇటువంటి నేతల ‘సమైక్య పోరాటాల’ లక్ష్యాలు తమ రాజకీయ, వ్యాపార ప్రయోజనాలను కాపాడుకోవడానికే తప్ప సమైక్యాంధ్ర కోసం మాత్రం కాదు. కొత్త రాష్ట్రం ఏర్పడినప్పుడు కొత్త రాజధాని ఏర్పరుచుకోవడం, హైకోర్టు, శాసన సభ, సచివాలయం వంటి వందలాది ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం మరియు మౌలిక వసతులు ఏర్పాటు కొరకు పెద్ద ఎత్తున రాష్ట్ర పునర్నిర్మాణ ప్రక్రియ మొదలవుతుంది. అందుకు కేంద్రం నుండి వేల కోట్లో లేక లక్ష కోట్లో నిధులు వచ్చిపడతాయి.   అటువంటి పరిస్థితుల్లో నిర్మాణ రంగం, వివిధ వ్యాపారాలు, కాంట్రాక్టులు వంటి సైడ్ బిజినెస్సులు చేసుకొంటున్నమంత్రులు, యంయల్యేలు, యంపీల మధ్య కొత్తగా ఏర్పడే రాష్ట్ర ప్రభుత్వంలో కీలకమయిన మంత్రి పదవులకు కోసం తీవ్రపోటీ ఉంటుంది. అవి దక్కించుకోవాలంటే ప్రజల మద్దతు కూడా భారీగా ఉండాలి. అందుకే ఈ సమైక్య పోరాటాలు.   ఈ రోజు మంత్రి టిజి వెంకటేశ్ మొదటిగా సంజాయిషీ చెప్పుకోవడం చూసిన రాష్ట్ర ప్రజలు, రేపు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తెలంగాణా ప్రకటన చేసిన తరువాతనో లేక ముందుగానో మిగిలిన వారు కూడా దాదాపు ఇటువంటి సంజాయిషీలే చెప్పుకొని తమ సమైక్య పోరాటాలకు స్వస్తి చెప్పి తమ రాజకీయ భవిష్యత్తు కోసం కృషి మొదలుపెడతారు.   అంతిమంగా దీనివల్ల ఋజువయిన విషయం ఏమిటంటే, ప్రజల మద్దతు లేని ఉద్యమాల ముగింపు ఈవిధంగా ఉంటే, మద్దతు ఉన్నవి తెలంగాణా ఏర్పాటు వంటి అసాధ్యాన్ని కూడా సుసాద్యం చేసి చూపుతాయని తేలింది.

పాదయాత్ర తరువాత షర్మిల పార్టీకి సారధ్యం చేస్తారా

  గత అక్టోబరు నుండి సాగుతున్న షర్మిల పాదయాత్ర ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలో అడుగుపెట్టడంతో ఆఖరి దశకు చేరుకొంది. ఆమె ఈరోజు సాయంత్రం రావివలస నుండి శ్రీకాకుళం జిల్లాలోకి అడుగుపెట్టారు. ఆమె తన పాదయాత్రను ఆగస్ట్ మొదటివారంలో ఇచ్చాపురంలో ముగించి ఒక భారీ బహిరంగ సభలో పాల్గొంటారు.   షర్మిల తన పాదయాత్రను ముగించుకొని వచ్చిన తరువాత ఆమె తల్లి విజయమ్మ నుండి పార్టీ బాధ్యతలు స్వీకరించి ముందుగా పార్టీని చక్కదిద్దే పని మొదలు పెట్టవచ్చును. ఇంతకాలం విజయమ్మ తన శక్తికి మించిన పనే అయినప్పటికీ, పార్టీ పరిస్థితుల దృష్ట్యా శ్రమించక తప్పట్లేదు. అందువల్ల షర్మిల వెంటనే పార్టీ బాధ్యతలు వెంటనే చెప్పట్టవచ్చును. అయితే వెంటనే ఆమె రెండు అగ్ని పరీక్షలు ఎదుర్కొని తన సత్తా చాటుకోవలసి ఉంటుంది. పంచాయితీ ఎన్నికల తరువాత వచ్చే జలసంఘం, మునిసిపల్ ఎన్నికలలో ఆమె వైకాపాను విజయపధంలో నడిపించగలిగితే, అది ఆమెకు మనోధైర్యం కలిగించడమే కాక, పార్టీపై పూర్తి పట్టు సాధించేందుకు దోహదపడుతుంది. ఆ తరువాత వివిధ జిల్లాలో పార్టీ నేతల మధ్య రగులుతున్న విబేధాలను పరిష్కరించి, పార్టీకి నష్టం కలిగిస్తున్న వారిపై చర్యలకు ఉపక్రమించవచ్చును.   అయితే, వీటన్నిటికంటే ముందుగా పార్టీలో తన స్థానం ఏమిటో ఆమె ఖరారు చేసుకోవలసి ఉంటుంది. పార్టీ వ్యవహారాలు చక్కబెట్టాలంటే ముందుగా ఆమె పార్టీలో తన స్థాయికి తగ్గ పదవి చెప్పటక తప్పదు. కానీ సెప్టెంబర్ నెలలో జగన్ మోహన్ రెడ్డి మళ్ళీ బెయిలుకి దరఖాస్తు చేసుకొనే అవకాశం ఉంది గనుక, అంతవరకు ఆమెకు తాత్కాలికంగా ఏవయినా సభలు, దీక్షలు వంటివి నిర్దేశించే అవకాశం ఉంది. ఒకవేళ అప్పుడు కూడా ఆయనకి బెయిలు దొరకని పక్షంలో, మీడియాలో వస్తున్నట్లు వారి కుటుంబంలో ఆదిపత్యపోరు లేకపోయినట్లయితే, షర్మిలకు పార్టీలో తగిన హోదా కల్పించి పార్టీ బాధ్యతలు అప్పగించడం ఖాయం. అదే జరిగితే, ఆమె రాజకీయ జీవితంలో మరో ప్రస్థానం ప్రారంభమవుతుంది.

Is TRS benefits with Media leakage by CM

  The media reports about CM Kiran Kumar Reddy arguments in favor of Samaikyandhra and his package proposals for reconstructing Telangana, virtually handed over the game to rival TRS, which feel cornered with Congress hijacking its T sentiment. So, it immediately hits back at Congress stating it is not honest with its promise of granting in Telangana state, so it masterminds a political game through leaking confidential reports to media through its CM. TRS also find fault with Congress over its leakage reports on ‘Rayala Telangana,’ which it believes to distract the people of the region.    On the other day, KCR has comes-up with a new idea of spreading a message into people that it is TRS, which has been fighting for Telangana and the Congress has been suppressing its agitations, in which people are also involved. For this purpose, TRS is hiring four vehicles fitted with wide screens and equipped with sound system to exhibit the TRS's tiresome battle for Telangana and to put-up Congress as a sinner for the deaths of Telangana students. The mobile video vans will go around the region and spread this message. This is planned to counter Congress claims on Telangana and to get back its full rights on its T sentiment.   KCR now also finds a reason to escape from Congress merger proposal. He said “Even if the Congress creates Telangana state, it is definitely going to stall a dummy government led by Seemandhra leaders. So, our party has to play the watch dog role to safeguard our people’s interests. We also have a big responsibility of reconstructing Telangana on our shoulders. So, the question of merging in Congress doesn’t arise.”   Naturally all these developments irk the T-Congress leaders. Hence, they have raised objections for leaking the confidential matters to media and blames CM for trying play spoilsport on the Telangana issue. Congress high command, which is also alerted with these unpredicted developments, is said to be asked the CM and PCC president to refrain from leaking such crucial information to media.

ఉండవల్లి కబుర్లు

   “ఒక అంశంపై ఏ నిర్ణయమూ తీసుకోకపోవడం కూడా ఒక నిర్ణయమేనని" స్వర్గీయ పీవీ నరసింహ రావుగారు చెప్పిన తరువాతనే ఆ కొత్త సూత్రం గురించి జనాలకి తెలిసివచ్చింది.   ఇక విషయంలోకి వస్తే, రాజమండ్రీ యంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడుతూ, తమ కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణాపై ఇదే సూత్రంతో పనిచేస్తోందని శలవిచ్చారు. కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర విభజనపై రెండు ప్రాంతాల ప్రజలు ఆవేశకావేశాలకు లోనయి ఉన్నారనే సంగతి గ్రహించినందునే ఈ అంశంపై ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా నానుస్తోందని, పరిస్థితులు కొంచెం చల్లబడ్డాక సరయిన నిర్ణయం తీసుకోవాలనే ఆలోచనతోనే ఈవిధంగా వ్యవహరిస్తోందని ఆయన స్పష్టం జేశారు. మరి ఆయన చెప్పిన మాటలను కాంగ్రెస్ అధిష్టానం కూడా అంగీకరిస్తుందో లేదో?   ఇక బీజేపీ కేవలం రాష్ట్రంలో మరికొన్ని సీట్లు సంపాదించుకోవడానికే తెలంగాణా ఇస్తానని చెపుతోంది తప్ప తానూ ఎట్టి పరిస్థితిలో అధికారంలోకి రాలేమని ఆ పార్టీకి కూడా స్పష్టంగా తెలుసునని, బీజేపీకి తెలంగాణా ఇచ్చే ఉద్దేశ్యమే ఉండి ఉంటే గతంలో అది అధికారంలో ఉన్నపుడే ఇచ్చి ఉండేదని, అప్పుడు ఈయలేమని చెప్పిన పార్టీ ఇప్పుడు మాత్రం ఇస్తుందని ఎలాగా నమ్మగలమని ఆయన ప్రశ్నించారు.   “రాష్ట్రం విడిపోతే విడిపోనీయండి. కానీ దానిపై పార్లమెంటులో తప్పనిసరిగా చర్చ జరగాలి. ఆచర్చలో సమైక్యరాష్ట్రం కోసం మావాదనలు మేము వినిపిస్తాము. రాష్ట్రం సమైక్యంగా ఎందుకు ఉండాలో మావాదనతో సభ్యులను ఒప్పిస్తాము” అని అన్నారు. ఆయన సమైక్యమే కోరుకొంటున్నపుడు రాష్ట్రం విడిపోతే విడిపోనీయండి అని అనడం ఎందుకు? మళ్ళీ విడిపోతామని మొత్తుకొంటున్నవారితో వాదనలు ఎందుకు? సమైక్యం కోసం ఆయన ప్రయత్నాలు ఆయన చేసుకొంటే సరిపోతుంది కదా?    ఇక షరా మామూలుగా ఆయన మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖరరెడ్డిని వెనకేసుకువస్తూ ‘చెట్టు మంచిదే కానీ పళ్ళు కుళ్ళిపోతే చెట్టుది తప్పు కాదు కదా’ అన్నట్లు రాజశేఖర్ రెడ్డి చాలా మంచోడని, ఆయన ఎన్నడూ అవినీతికి పాల్పడలేదని, గానీ తన కుమారుడు అక్రమ వ్యాపారం చేస్తున్నాడని ఆయన కనిపెట్టలేకపోయాడని, ఉండవల్లి ఒక కొత్త విషయాన్నికనిపెట్టి ప్రజలకి తెలియజేసి పుణ్యం కట్టుకొన్నారు. రాజశేఖర్ రెడ్డి తన అధ్యక్షతన నిర్వహింపబడిన మంత్రివర్గం సమావేశంలో వేలు,లక్షల ఎకరాల ప్రభుత్వభూమిని ముక్కుమొహం తెలియని కంపెనీలకి అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు దానపట్టాలు రాసిచ్చేసి, ఆయన ఆపని ఎందుకు చేస్తున్నాడో, అందువల్ల అంతిమంగా ఎవరికి ప్రయోజనం చేకూర్చుతున్నాడో తెలియకుండానే చేసాడని ఉండవల్లి చెప్పడం ఆయన కోర్టులో చేసే వాదనలా గమ్మతుగా ఉంది. అయినా కేంద్రంలో, రాష్ట్రంలో చక్రం తిప్పిన రాజశేఖర్ రెడ్డి, ఏమీ తెలుసుకోలేని అమాయక చక్రవర్తి అని ఉండవల్లి చెపితే జనాలు నమ్ముతారా?

షర్మిల రాజకీయభవిష్యత్తుకి బాటలుపరిచిన మరో ప్రజా ప్రస్థానం

  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత షర్మిల చేప్పటిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర నిన్నటితో విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గంలో కోమటిపల్లి వద్ద 2818కి.మీ. మైలురాయి దాటింది. ఆమె ఈ దూరాన్ని కేవలం 211 రోజుల్లో పూర్తిచేసారు. ఇదివరకు చంద్రబాబు 208 రోజుల్లో 2817 కి.మీ. చేసిన తన పాదయాత్రని విశాఖలో ముగించారు. ఆమె చంద్రబాబు నెలకొల్పిన ఈ రికార్డుని అధిగమించి నిర్విరామంగా ముందుకు సాగిపోతున్నారు.   ఆమె ఇంత వరకు 13జిల్లాలకు చెందిన 40 మునిసిపాలిటీలు, 9 కార్పొరేషన్‌లు, 108 నియోజకవర్గాలు, 184 మండలాలు, 1,784 గ్రామాలను తన పాదయాత్రలో సందర్శించారు. షర్మిల తన పాదయాత్ర మొదలుపెట్టిన నాటినుండి ఇంతవరకు 155 బహిరంగ సభల్లో ప్రసంగించారు. ఆమె తన పాదయాత్రను తన తండ్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి ముగించిన శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ముగించనున్నారు.   ఇంత సుదీర్గమయిన పాదయాత్ర చేసిన దేశంలో మొట్ట మొదటి మహిళగా ఒక సరికొత్త రికార్డు నెలకొల్పారు. ఆమె తన పాదయాత్రను ప్రధానంగా తన పార్టీని బలపరిచి ప్రజలలో వ్యాపింప జేయడానికి, తన తండ్రి, సోదరుల పట్ల ప్రజలలో ఉన్న సానుభూతిని సజీవంగా ఉంచడానికి, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు, తమకు ప్రధాన శత్రువయిన తెలుగుదేశం పార్టీని తీవ్రంగా విమర్శించేందుకు ఉపయోగించుకొంటున్నారు.   ముందే చెప్పినట్లు ఇంత సుదీర్గయాత్ర చేసి రాష్ట్రంలో మారుమూల గ్రామాలను సైతం సందర్శించిన షర్మిల, అదే సమయంలో తన పార్టీ నిర్మాణానికి కూడా పూనుకొని ఉంటే, తన యాత్రవల్ల వైకాపా పూర్తి ప్రయోజనం పొంది ఉండేది. కానీ ఆమె కేవలం ప్రభుత్వ, ప్రతిపక్షాలను విమర్శించడానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగిపోవడం వలన ఆమె పార్టీ ఒక గొప్ప అవకాశాన్ని వృధా చేసుకొన్నట్లయింది. అందుకు ప్రధానంగా వైకాపాకు శల్యసారద్యం చేస్తున్నఆ పార్టీ సీనియర్లనే నిందించకతప్పదు. ఆమె పాదయాత్రను పార్టీకి పూర్తి ప్రయోజనం చేకూర్చేవిధంగా మలిచి, ఎక్కడికక్కడ ఆమె పార్టీ శ్రేణులతో సమావేశపరచి, పార్టీ నిర్మాణం జరిగేలాచేసి ఉంటే ఆమె పాదయత్ర ముగిసేసరికి, వైకాపా రాష్ట్ర వ్యాప్తంగా ఒక మహాశక్తిగా మారిఉండేది. కానీ ఆమే స్వయంగా చెప్పుకొన్నట్లు ‘జగనన్న విడిచిన బాణం’లా రివ్వున దూసుకుపోవడం వలన వైకాపాకి పెద్దగా ఒరిగిందేమీ లేదు.   అయితే, మున్ముందు ఆపార్టీలో కీలక బాధ్యతలు చెప్పటేందుకు ఆమెకు అవసరమయిన అనుభవం, రాష్ట్ర ప్రజల సమస్యల పట్ల చక్కటి అవగాహన ఏర్పడింది. అదేవిధంగా రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో తమ పార్టీ వాస్తవ పరిస్థితి కూడా ఆమె స్వయంగా తెలుసుకోగలిగారు. అందువల్ల ఒకవేళ రానున్న ఎన్నికలలోగా జగన్ మోహన్ రెడ్డి జైలు నుండి విడుదల కాకపోతే, వైకాపాకి ఆమె మాత్రమె ఒక ప్రత్యామ్నాయ అధినేతగా నిలిచేందుకు ఈ పాదయాత్ర ద్వారా అర్హత సాధించారు.   ప్రస్తుతం పార్టీకి శల్యసారధ్యం చేస్తున్న సీనియర్ నేతలను, పదవులకోసం కీచులాడుకొంటున్న నేతలను షర్మిల తన దారికి తెచ్చుకొని, పార్టీకి దిశానిర్దేశ్యం చేయగల అనుభవం గడించారని ఖచ్చితంగా చెప్పవచ్చును.

కిరణ్ బంగారు కలలు కలలుగా మిగిలిపోతాయా

  వ్రతం చెడ్డా ఫలితం దక్కలేదంటే బహుశః ఇదేనేమో. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన మంత్రి వర్గ సభ్యులకి కూడా తెలియనీయకుండా, క్యాబినెట్ అనుమతి తీసుకోకుండా అట్టహాసంగా ప్రారంభించిన బంగారు తల్లి, అమ్మ హస్తం, ఇందిరమ్మ కలలు వంటి పధకాలను ప్రవేశ పెట్టినప్పుడు ముఖ్యమంత్రి తన స్వంత ఇమేజ్ పెంచుకొనేందుకే ఇటువంటివి ప్రకటిస్తున్నారని స్వంత పార్టీవారే తీవ్ర విమర్శలు గుప్పించారు. తనకు మళ్ళీ ముఖ్యమంత్రి పదవిని కట్టబెడతాయనుకొన్న ఆ  పధకాలను తీరాచేసి ఇప్పుడు అమలు చేయబోతే వరసపెట్టి ఎన్నికలు తరుముకు వస్తుండటంతో వాటి అమలుకు ఎన్నికల కోడ్ అడ్డం పడుతోంది.   ఇటీవలే రాష్ట్ర ఎన్నికల కమీషన్ ‘అమ్మహస్తం’ పధకం ద్వారా ప్రభుత్వం కాంగ్రెస్ నేతల బొమ్మలు ముద్రించిన బ్యాగులలో తొమ్మిది రకాల సరుకులు అందజేయడం ఎన్నికల కోడ్ ఉల్లంఘన క్రిందకు వస్తుందని గనుక వెంటనే నిలిపివేయాలంటూ ప్రభుత్వానికి లేఖ వ్రాసింది.   అదేవిధంగా ఇటీవల ప్రవేశపెట్టిన బంగారు తల్లి, ఇందిరమ్మ కలలు కూడా ఈ ఎన్నికల కోడ్ కారణంగా ముఖ్యమంత్రి కన్న కలలుగానే మిగిలిపోవచ్చును. ప్రస్తుతం పంచాయితీ ఎన్నికల కోడ్ అమలులో ఉంది. ఆ తరువాత వెంటనే సాగునీటి వినియోగదారుల సంఘాలకు ఎన్నికలు, పురపాలక ఎన్నికలు  రానున్నాయి. ఈ ప్రక్రియ అంతా ముగిసేసరికి ఆగస్ట్ లేదా సెప్టెంబర్ నెలలు దాటిపోవచ్చును.   ఇక, డిశంబరులోఐదు రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు జరునున్నాయి. దానితో బాటే సాధారణ ఎన్నికలను కూడా జరిపించాలని కేంద్రం యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ అదే జరిగితే అక్టోబర్ నెలలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. ఒకవేళ అలా కాకుండా కేంద్రం ఏప్రిల్ నెలలోనే సాధారణ ఎన్నికలకు వెళ్లాలని భావించినా కూడా ఫిబ్రవరి నెలలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. అంటే ముఖ్యమంత్రి ఆర్భాటంగా ప్రవేశ పెట్టిన పధకాల గురించి ప్రభుత్వం ప్రచారం చేసుకొని లబ్ది పొందే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని అర్ధం అవుతోంది.   అంతే గాకుండా, కేంద్రం ఒకవేళ రాష్ట్ర విభజనకు సిద్దపడితే, ఈ పధకాల గురించి  కిరణ్ కుమార్ రెడ్డి కన్న కలలు కలలుగానే మిగిలిపోతాయి. విభజన తరువాత ఏర్పడే కొత్త రాష్ట్రాలకి ఎవరు ముఖ్యమంత్రులవుతారో ఊహించడం కష్టం. గనుక ఆయన పధకాలన్నీ వృధా ప్రయాసగానే మిగిలిపోక తప్పదు. దీని వల్ల ఆయనకీ ప్రయోజనం కలుగదు. వాటిని అమలు చేసే వీలులేకపోవడం వలన ప్రజలకీ ప్రయోజనం కలుగదు.   కానీ, పధకాలను ఆర్భాటంగా ప్రకటించినందుకు సర్వత్రా నిరసనలు, విమర్శలు మూటగట్టుకోక తప్పలేదు. అదేవిధంగా వాటి ప్రచారం కోసం కోట్లాది రూపాయల ప్రజాధనం ఖర్చయిపోయింది. ఇప్పుడు తన పధకాల ప్రచారం కోసం ఆయన ఎన్నికలను నిలిపివేస్తారా? లేక ఎన్నికల కోడ్ వల్ల తన పధకాలను నిలిపివేస్తారా? అనేది ఆయనే చెప్పాలి.  

కాంగ్రెస్ తో ఒంటరిపోరాటం చేస్తున్న నరేంద్ర మోడీ

  బీజేపీ ప్రధాని అభ్యర్ధిగా చెప్పబడుతున్న గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారకమిటీ బాధ్యతలు చెప్పటిన తరువాత కాంగ్రెస్ పార్టీపై తీవ్ర శైలిలో విమర్శలు గుప్పిస్తున్నారు. అదే విధంగా కాంగ్రెస్ నిద్రలో కూడా మోడీ జపమే చేస్తోంది. అయితే, బీజేపీలో మోడీకి అండగా నిలబడుతున్న వాళ్ళను వ్రేళ్ళ మీద లెక్కించవచ్చును. కానీ, కాంగ్రెస్ లో మాత్రం ఆయనపై దాడి చేసేవాళ్ళకు లెక్క లేదు.   మోడీ ఇటీవల గుజరాత్ అల్లర్లపై స్పందిస్తూ “కారులో పయనిస్తున్నపుడు ఒక కుక్కపిల్ల కారు చక్రం క్రింద పడిపోతే ఎవరికయినా బాధ కలుగుతుందని” అని అన్నారు. అయన కేవలం తన బాధని వ్యక్తం చేయడానికే ఆవిధంగా ఉదహరించినప్పటికీ, ‘గుజరాత్ అల్లర్లలో చనిపోయిన వారిని కుక్కపిల్లలతో ఆయన పోల్చారని’ ఆయన మాటలకు వక్రభాష్యం చెపుతూ కాంగ్రెస్ చాల రాద్ధాంతం చేసింది. ఆ సమయంలో బీజేపీలో ఆయనకు అండగా నిలచినవారు కొద్ది మందే. కానీ, మోడీ మాత్రం ఏ మాత్రం వెరవకుండా కాంగ్రెస్ పార్టీతో ఒంటరి పోరాటం చేస్తునే ఉన్నారు.   నిన్న ఫెర్గుసన్ విశ్వవిద్యాలయంలో మాట్లాడుతూ, “కాంగ్రెసుపార్టీ తనకి సవాళ్లు ఎదురైనప్పుడల్లా లౌకికవాదమనే ముసుగులో దాక్కుంటుందని ఆరోపించారు. స్వాతంత్రం వచ్చిన నాటి నుండి దేశాన్ని కాంగ్రెస్ పార్టీయే పరిపాలిస్తున్నపటికీ, ఇంతవరకు దేశంలో దారిద్ర్యం తాండవిస్తూనే ఉందని, ఒక నాడు ‘గరీబీ హటావో’ మరొకసారి ‘ఆహార భద్రత’ ఇలా రకరకాల పేర్లు పెట్టి ప్రజలకి, ముఖ్యంగా నిరుపేద ప్రజలకి కేవలం చిత్తుకాగితాలు మాత్రమే చేతిలో పెడుతూ వంచిస్తోందని ఆయన విమర్శించారు.   నేటి ద్రవ్యోల్బణానికి, రూపాయి పతనానికి, అధిక ధరలకు అన్నిటికీ ప్రధాన కారణం ప్రధాని మనోమోహన్ సింగే కారకుడని, కాంగ్రెస్ అనుసరిస్తున్న విధానాలతో యావత్ దేశం తిరోగమన పధంలో దూసుకుపోతోందని ఆయన ఎద్దేవా చేసారు. కనీసం దేశప్రజలకు భద్రత కల్పించడంలోనూ, చైనాచొరబాట్లను అడ్డుకోవడంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందుతోందని ఆయన విమర్శించారు.   ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం దేశాన్ని ‘కాంగ్రెస్ రహితదేశంగా’ చేయడమే అని గట్టిగా చెప్పడంతో సహజంగానే కాంగ్రెస్ మండిపడింది. అసలు నరేంద్ర మోడీ దృష్టిలో లౌకిక వాదం అంటే ఏమిటని దిగ్విజయ్ సింగ్ ప్రశ్నించారు.   ఇక మోడీ సాకుతో యన్డీయే నుండి బయటపడిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మెల్లగా కాంగ్రెస్ కు చేరువయ్యే ప్రయత్నంలో ఇటీవల యుపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆహార భద్రతా బిల్లును గట్టిగా సమర్ధించారు. పనిలోపనిగా బీజేపీని తీవ్రంగా దుయ్యపట్టారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ నేతల భాష, ఆపార్టీ అసలు రంగును బయట పెడుతోందని అన్నారు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే తాము ఎన్డీయే నుంచి విడిపోయి చాలా మంచి నిర్ణయమే తీసుకొన్నామని అనిపిస్తోందని నితీష్‌కుమార్ అన్నారు.   ఈవిధంగా కాంగ్రెస్ మిత్ర పక్షాలతో సహా అందరూ కూడా మోడీపై కత్తులు దూస్తుంటే, కనీసం ఆయనకు బీజేపీలో స్వంత మనుషులు కూడా ముందుకు రావడం లేదు. ముఖ్యంగా ఆయనను వ్యతిరేఖించే అద్వానీ శిబిరంలో ఉన్న సుష్మా స్వరాజ్, యశ్వంత్ సిన్హా వంటి హేమాహేమీలు అందరూ దూరంగా నిలబడి చోద్యం చూస్తున్నారు.   అయితే, ఇదీ మోడీకి ఒకందుకు మేలే చేస్తుందని చెప్పవచ్చును. ఎన్నికలకి ముందే తన పోరాట పటిమ చాటుకొనే అవకాశం పొండమే కాకుండా, పార్టీలో తనకు అనుకూల వర్గాన్ని ఏర్పరచుకోవడానికి వీలవుతుంది.

సమైక్యాంధ్ర కోసం ఆడుతున్నఆ ‘స్టార్ బ్యాట్స్ మ్యాన్’ ఎవరు?

  కాంగ్రెస్ కు ప్రధమశత్రువు కాంగ్రేసే అని ఒక నానుడి ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తనను తానూ ఓడించుకొని ఓడిపోవాల్సిందే తప్ప ఇతరులు ఆ పార్టీని ఓడించలేరని మరో నానుడి కూడా ఉంది. ఈ రెండూ కూడా అక్షరాల నిజమని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు నిరూపిస్తున్నారు. తెరాస అధినేత రగిల్చిన తెలంగాణా ఉద్యమం కాంగ్రెస్ పార్టీని నిలువునా చీల్చింది. సమైక్యాంధ్ర , తెలంగాణ గ్రూపులుగా విడిపోయి బద్దశత్రుల కంటే ఘోరంగా ఒకరి మీద మరొకరు కత్తులు దూసుకొంటుంటే, ఇక కాగల కార్యం గందర్వులే చేస్తున్నపుడు మధ్యలో తామేందుకు దూరడమని తెదేపా, తెరాసలు దూరంగా నిలబడి చూస్తున్నాయి.   సీమంధ్ర నేతలు తమ నోటికాడ కూడుని లాకొంటున్నారని టీ-కాంగ్రెస్ నేతలు మండి పడుతుంటే, పుండు మీద కారం చల్లినట్లు ఆనం వివేకానంద రెడ్డి, లగడపాటి రాజగోపాల్ తదితరులు ఎట్టిపరిస్థితుల్లో రాష్ట్ర విభజన జరగదని ధృడంగా చెపుతున్నారు.   ఈ రోజు లగడపాటి మరో అడుగు ముందుకు వేసి తమ చేతిలో ఇంకా ‘బ్రహ్మాస్త్రం’ ఉందని, కానీ దానిని ప్రయోగించనవసరం లేకుండానే, మైదానంలోకి దిగిన తమ ‘స్టార్ బ్యాట్స్ మ్యాన్’ తెలంగాణాను సమర్ధంగా అడ్డుకోగలరని అన్నారు.   తెలంగాణా ప్రజలలో ఇదివరకు ఉన్నంత బలంగా తెలంగాణా సెంటిమెంట్ ఇప్పుడు లేదని, త్వరలో జరిగే పంచాయితీ ఎన్నికలతో మిగిలిన సెంటిమెంట్ కూడా మాయమవుతుందని అన్నారు. తెలంగాణా ఉద్యమం బలంగా సాగుతున్న తరుణంలోనే, గత రెండు ఎన్నికలలో తెలంగాణా ప్రజలు సమైక్యవాదానికే ఓటువేసారని, మళ్ళీ 2014లో జరగనున్న ఎన్నికలలో కూడా ప్రజలు కాంగ్రెస్ కే ఓటేసి గెలిపించడం ఖాయమని ఆయన అన్నారు. కొందరు టీ-కాంగ్రెస్ నేతలు వాదిస్తున్నట్లు రాష్ట్రం విడిపోతే కాంగ్రెస్ బలపడదని, సమైక్యంగా ఉంటేనే ఎక్కువ లోక్ సభ సీట్లు సాధించుకోవచ్చునని అన్నారు.   తెలంగాణ ఇస్తానని కాంగ్రెసు ఎప్పుడూ చెప్పలేదని, రెండో ఎస్సార్సీ కోసం కసరత్తు చేస్తోందని ఆయన అన్నారు. వచ్చే నెలాఖరులోగా రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ అధిష్టానం ఖచ్చితమయిన నిర్ణయం ప్రకటిస్తుందని ఆయన అన్నారు. శాసనసభలో తెలంగాణా బిల్లు ఆమోదం పొందకుండా, పార్లమెంటులో సాంకేతికంగా ఆమోదం పొందలేదని, తెలంగాణా ఏర్పాటు చేయాలంటే తప్పనిసరిగా శాసనసభ ఆమోదం, రాజ్యంగా సవరణ చేయాల్సి ఉంటుందని ఆయన అన్నారు.   ఇక లగడపాటి మాట్లాడినవాటిలో మిగిలిన అంశాల సంగతి పక్కనబెడితే, ఆయన చెప్పిన “స్టార్ బ్యాట్స్ మ్యాన్” ఎవరు అని ఆలోచిస్తే నిన్నకోర్ కమిటీ సమావేశంలో రాష్ట్ర విభజనకు వ్యతిరేఖంగా దాదాపు గంట సేపు ఏకధాటిగా వాదించిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, లేదా తెర వెనుక నుండి మంత్రాంగం నడుపుతున్న బొత్స సత్యనారాయణ లేదా కేవీపీ రామచంద్ర రావు అయి ఉండవచ్చునని అర్ధం అవుతోంది. అదే విధంగా లగడపాటి పేర్కొన్న ‘బ్రహ్మాస్త్రం’ సీమంధ్ర నేతల రాజినామాలేనని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.   ఒకపక్క కాంగ్రెస్ అధిష్టానం ఈ సమస్య నుండి ఎలాగయినా బయటపడాలని విశ్వప్రయత్నాలు చేస్తుంటే, పార్టీకి, అధిష్టానానికి తాము విధేయులమని చెప్పుకొంటూనే, మరో పక్క ఈవిధంగా మాట్లాడుతూ పార్టీ అధిష్టానాన్నిఇబ్బంది పెట్టడం కాంగ్రెస్ నేతలకే చెల్లు. వారు ఆవిధంగా మాట్లాడుతున్నపటికీ వారిని నియంత్రించలేకపోవడం కేవలం కాంగ్రెస్ పార్టీలో మాత్రమే సాధ్యం. వారు ఇదేవిధంగా కత్తులు దూసుకొంటుంటే తప్పకుండా వాళ్ళ పార్టీని వాళ్ళే ఓడించుకొని అధికారం ప్రతిపక్షాలకి అప్పగించడం ఖాయం.

రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ నిర్ణయం ప్రకటించగలదా

  ఒక్క కాంగ్రెస్ అధిష్టానం తప్ప మిగిలిన వారందరూ కూడా రాష్ట్ర విభజనపై ప్రకటనకి ఈరోజు సుమూహుర్తమని భావిస్తున్నారు. అయితే, సమైక్యమా లేక విభజనా? అనే రెండే ప్రత్యమ్నాయాలు తమ ముందు ఉన్నాయని దిగ్విజయ్ సింగ్ చెప్పడం చూస్తే, కాంగ్రెస్ పార్టీకి ఇన్నేళ్ళ తరువాత జ్ఞానోదయం అయినట్లే కనిపిస్తోంది. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికే ఒక నిర్దిష్ట అభిప్రాయానికి వచ్చినప్పటికీ, తను ప్రకటించే నిర్ణయంతో రాష్ట్రంలో తనకే పూర్తి ప్రయోజనం పొందాలనే దురాశాతోనే ఇంత కాలం జాప్యం చేస్తోంది.   కాంగ్రెస్ తెరాసను లొంగదీయడానికి ప్రయత్నిస్తుంటే, ఎట్టి పరిస్థితుల్లో దాని గాలానికి చిక్కుకోకూడదనే ఆలోచనతో కేసీఆర్ మళ్ళీ తన మౌనదీక్షను మొదలుపెట్టాడు. ఒకప్పుడు తెరాసను పార్టీలో విలీనం చేసుకొందామని భావించిన కాంగ్రెస్, ఆ తరువాత కేసీఆర్, అతని కుటుంబాన్నిభరించడం కష్టమనుకొంది. మళ్ళీ మనసు మార్చుకొని ఇప్పుడు విలీనం కోసం ఒత్తిడి తెస్తోంది. కాంగ్రెస్ తెలంగాణా ఇచ్చినప్పటికీ, తెరాసను పార్టీలో కలుపుకోకుండా వదిలిపెడితే, మళ్ళీ కేసీఆర్ ఆ క్రెడిట్ మొత్తం ఎక్కడ క్లెయిం చేసుకొంటాడో అనే భయం ఉండటం వలన తెలంగాణ ప్రకటనకి ముందుగానే అతనిని లొంగ దీసుకోవాలని విశ్వప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్ర విభజనలో అతిముఖ్యమయిన ‘హైదరాబాద్’ అంశాన్ని అడ్డుపెట్టుకొని అతనిని లొంగదీయాలని ప్రయత్నిస్తునట్లు సమాచారం. ఒకవేళ అప్పటికీ లొంగకపోతే, రాష్ట్ర విభజన చేస్తూ హైదరాబాదును ఉమ్మడి రాజధానిగా చేసి, కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలని కాంగ్రెస్ ఆలోచిస్తోంది.   ‘యావత్ రాష్ట్ర ప్రజల, దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకొంటామని’ నిన్న దిగ్విజయ్ సింగ్ చెప్పడం బహుశః అదే సూచిస్తోంది. హైదరాబాద్ కోసం పట్టుబడుతున్నసీమంధ్ర నేతలు దానిని ఉమ్మడి రాజధాని చేస్తే, విభజనకు అభ్యంతరం చెప్పకపోవచ్చు. అదే విధంగా సీమంధ్రకు కొత్త రాజధాని ఏర్పాటు చేసుకొనేవరకు హైదరాబాదును ఉమ్మడి రాజధానిగా ఉంచేందుకు తెలంగాణావాదులు కూడా అభ్యంతరం వ్యక్తం చేయకపోవచ్చును. కేసీఆర్ గనుక లొంగకపోతే అందరికీ ‘ఆమోద యోగ్యమయిన ఈ నిర్ణయం’ ప్రకటించి, ఒకవైపు తెలంగాణా ఇచ్చిన క్రెడిట్ తన ఖాతాలో వ్రాసుకొంటూనే, రాజధాని విషయంలో కేసీఆర్ ను దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేయవచ్చును.   అయితే, దానివల్ల కేసీఆర్ కి పెద్దగా వచ్చే నష్టం ఏమి ఉండదు, పైగా హైదరాబాద్ కోసం మరో ఉద్యమం చేసుకొనే గొప్ప అవకాశం అందిస్తుంది. తద్వారా ఇంత వరకు తెలంగాణా సెంటిమెంటుతో దూసుకుపోతున్న కేసీఆర్ రేపు రానున్నఎన్నికలకి హైదరాబాద్ సెంటిమెంటుతో బరిలోకి దిగవచ్చును.   ఇక కాంగ్రెస్ తెలంగాణా ప్రక్రియను మొదలుపెడితే, ఇంత కాలం దానికోసమే ఉద్యమాలు చేస్తున్న తెరాస అది తమ పోరాటాల ఫలితంగానే ఏర్పడుతోందని అందులో కాంగ్రెస్ గొప్పతనం ఏమీ లేదని చాటింపు వేసుకొని ఎన్నికలలో ఓట్లు రాబట్టుకోగలదు.   కేసీఆర్ ప్రధాన లక్ష్యం తెలంగాణా రాష్ట్రం ఏర్పాటే గనుక, ఒకసారి అది ఏర్పడిన తరువాత ఇక కొత్త రాష్ట్రంలో నిశ్చింతగా రాజకీయాలు చేసుకొంటూ కాంగ్రెస్ తో సహా అన్నిపార్టీలకు అధికారం దక్కకుండా అడ్డుపడగలడు. అందుకే కాంగ్రెస్ అతనిని ముందుగానే లొంగ దీసుకోవాలని ప్రయత్నిస్తుంటే, కాంగ్రెస్ ను తప్పించుకోవడానికే కేసీఆర్ మౌనవ్రతం కంటిన్యూ చేస్తున్నాడు. తన ప్రమేయం లేకుండా తెలంగాణాపై నిర్ణయం జరుగుతున్నపటికీ ఆయన దూరంగా ఉండటం వలన, ఆ ప్రక్రియలో కాంగ్రెస్ చేసే పొరపాట్లకు అతను బాధ్యుడు కాకుండా తప్పించుకోవడమే కాకుండా, వాటినే తన అస్త్రాలుగా మార్చుకొని రేపు జరిగే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని డ్డీ కొనవచ్చును.   ఈవిధంగా కాంగ్రెస్ తెరాసలు రెండూ కూడా తెలంగాణా అంశంపై పూర్తి ప్రయోజనం పొందాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. మరి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ దైర్యం తెచ్చుకొని తెలంగాణాపై సానుకూల ప్రకటన చేస్తుందో లేక కేసీఆర్ తో తన రాజకీయ చదరంగం కొనసాగిస్తుందో చూడాలి.

వ్యర్ధ వాదనలతో కాలక్షేపం చేస్తున్నఅధికార, ప్రతిపక్ష పార్టీలు

  కొద్ది రోజుల క్రితం ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో ఒక మాజీ కేంద్ర మంత్రి, మాజీ హోం మంత్రితో సహా అనేక మంది కాంగ్రెస్ నేతలను, పోలీసులను మావోయిష్టులు అతి కిరాతకంగా హతమార్చినపుడు అధికార, ప్రతిపక్ష పార్టీలు తీవ్రమయిన ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకొంటూ అసలు విషయాన్ని పక్క ద్రోవ పట్టించారు. తత్ఫలితంగా మావోయిష్టులు మళ్ళీ మరో మారు చెలరేగిపోయి, ఈసారి జిల్లా యస్.పీ. మరియు కొందరు పోలీసులను పొట్టన పెట్టుకొన్నారు.   కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ బోధ గయ ప్రేలుళ్ళలో బీజేపీ హస్తం ఉందేమో? అంటూ నిరాధారమయిన ఆరోపణలు చేసిన మరునాడే ఇండియన్ ముజాహుద్దీన్ ఉగ్రవాదులు అది తమ పనేనని ప్రకటించుకోవడమే కాకుండా, త్వరలో ముంబైలో ప్రేలుళ్ళు జరుపబోతున్నామని ప్రకటించి ప్రభుత్వానికి పెనుసవాలు విసిరారు.   ఉగ్రవాదులు, మావోయిష్టుల నుండి దేశాన్ని రక్షించడంలోను, బాంబు దాడులు చేసిన వారిని పట్టుకోవడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నపటికీ తన తప్పులను కప్పి పుచ్చుకోనేందుకు ఉన్నతమయిన స్థానాలలో ఉన్న దిగ్విజయ్ సింగ్ వంటి రాజకీయనేతలు, దేశరక్షణకు సంబందించిన వ్యవహారాలపై కూడా రాజకీయాలు చేయడం చాల శోచనీయం.   అధికారంలో ఉన్న ప్రభుత్వ వైఫల్యాలను అందిపుచ్చుకొని రాజకీయ ప్రయోజనం పొందాలని ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నించడం సహజమే. అయితే, అధికారంలో ఉన్నవారు కూడా ఇటువంటి తీవ్రమయిన అంశాలపై రాజకీయం చేయడం, ప్రతిపక్షాలతో వాగ్వాదాలు చేస్తూ కాలక్షేపం చేయడం చాలా అవివేకం. ప్రతిపక్షాలు తమ వైఫల్యాలను ఎత్తిచూపినప్పుడు వాటిని హుందాగా స్వీకరించి వాటిని సవరించుకొంటే పొరపాట్లు పునరావృతం కావు. కానీ, ప్రతిపక్షాల విమర్శలను సమర్ధంగా ఎదుర్కోనకపోతే, తమ ఒప్పుకొన్నట్లేననే ఒక దురభిప్రాయం మన నేతలలో దృడంగా పాతుకుపోవడం వలన, విమర్శలకు దీటుగా జవాబీయకపోతే ప్రతిపక్షాలు రాజకీయంగా తమపై పైచేయి సాధిస్తాయనే దురాలోచన వలన, అధికార పార్టీకి చెందిన నేతలు ముందు వెనుక చూడకుండా ఈవిధంగా ప్రత్యారోపణలు చేయడం రివాజుగా మారిపోయింది.   ప్రతిపక్షాల సూచనలు సలహాలు లెక్కలోకి తీసుకోవడం వలన తాము రాజకీయంగా నష్టబోతామనే భయమే దీనికి కారణం. అదేవిధంగా ప్రతిపక్షాలు కూడా ఇటువంటి విషయాలలో ప్రభుత్వానికి నిర్మాణాత్మకమయిన సలహాలు ఈయడం తమ బాధ్యత కాదనే అపోహ కలిగి ఉండటం, ఆవిధంగా చేస్తే తాము ఎన్నటికీ ప్రతిపక్ష బెంచీలకే పరిమితమయిపోతామనే దురాభిప్రాయం ఏర్పరుచుకొన్నందున అవి కూడా చాలా బాధ్యతా రాహిత్యంగానే ప్రవర్తిస్తున్నాయి.   అధికార, ప్రతిపక్ష నేతలు చేస్తున్నఇటువంటి వ్యర్ధ వాదనలు తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికే పనికి వస్తాయి తప్ప, మావోయిస్టుల నుండి, ఉగ్రవాదుల దాడుల నుండి అవి ప్రజలను రక్షించలేవు. అధికార పార్టీ నేతలు ప్రతిపక్షాలను నిందిస్తు కాలక్షేపం చేసే బదులు రేపు ముంబైలో బాంబులు ప్రేలుస్తామని ముందే హెచ్చరిస్తున్న ఉగ్రవాదుల దాడిని నివారించడానికి ఏమయినా చర్యలు చేపడితే అమాయకులయిన ప్రజల ప్రాణాలు కాపాడినవారవుతారు.

తెలంగాణపై నిర్ణయం కోసం కాంగ్రెస్ ఎందుకు తొందరపడుతోంది

  తెలంగాణా అంశం ఇక క్లైమాక్స్ కి వచ్చేసినట్లేనని రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు, మీడియా కూడా తీర్మానించేయడమే కాకుండా, జూలై 12వ తేదీని తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు ప్రకటన అంటూ ముహూర్తం కూడా ఖరారు చేసేసాయి. 12వ తేదీన జరిగే కోర్ కమిటీ సమావేశానికి హాజరవమంటూ ముఖ్యమంత్రికి, ఉపముఖ్యమంత్రికి, పీసీసీ అధ్యక్షుడుకి కాంగ్రెస్ అధిష్టానం కబురు పెట్టడం, దిగ్విజయ్ సింగ్ తెలంగాణా విద్యార్ధులకు మిఠాయిలు పంచిపెట్టి త్వరలో శుభవార్త వింటారని హామీ ఇవ్వడం, ఇవ్వనీ తెలంగాణా సూచికలేనని అందరూ ఘంటాపధంగా చెపుతున్నారు.   అయితే ఇంత కాలంగా తెలంగాణ అంశం నానుస్తూ వచ్చిన కాంగ్రెస్ అధిష్టానం, రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ మారగానే వారం పదిరోజుల్లోనే అనేక పీటముడులు పడిఉన్న తెలంగాణా సమస్యను ఒక కొలిక్కి తెచ్చేయాలని ప్రయత్నించడం చాలా ఆశ్చర్యకరమయిన విషయమే, కానీ తెలంగాణా ఏర్పాటుకి ఇప్పుడు కృతనిశ్చయంతో ఉన్నట్లు మాత్రం అర్ధం అవుతోంది. అందుకు రెండు ప్రధాన కారణాలున్నాయి. రాష్ట్రంలో ఒక్క స్వంత పార్టీ నేతలు తప్ప మిగిలిన అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణా ఏర్పాటుకి అంగీకరించడం, ఎన్నికలు తరుముకు వస్తుండటం. ఇక సీమంద్రాలో కాంగ్రెస్ పార్టీ ప్రయోజనాలను కాపాడేందుకే సీమంధ్ర కాంగ్రెస్ నేతలు మొదలుపెట్టిన సమైక్యాంధ్ర సభలకు, సమావేశాలకు ఎప్పుడు ఏవిధంగా ఫుల్ స్టాప్ పెట్టించాలో కాంగ్రెస్ అధిష్టానానికి తెలుసు గనుక వాటి గురించి కాంగ్రెస్  దిగులుపడటం లేదు.   ముఖ్యంగా రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి వచ్చేందుకు, మెజారిటీ లోక్ స్థానాలను కైవసం చేసుకొనేందుకు ఆ పార్టీ ముందుగానే చేస్తున్నఎన్నికల సన్నాహంగా దీనిని చూడవచ్చును. ఒకవైపు తెరాసను, మరో వైపు జగన్ మరియు తెదేపాలను ఎదుర్కొని ఎన్నికలలో విజయం సాదించడం అసాధ్యమని గ్రహించిన కాంగ్రెస్ అధిష్టానం, తెలంగాణా ప్రకటనతో ఒక దెబ్బకు మూడు పిట్టలు కొట్టే ప్రయత్నం చేస్తోంది. అయితే, ఇప్పటికిప్పుడు తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేసేయడం అసాధ్యమని అందరికీ తెలుసు. అనేక సంక్లిష్టమయిన అంశాలను పరిష్కరించకుండా రాష్ట్ర విభజన చేయడం వలన ఊహించని కొత్త సమస్యలు పుట్టుకొస్తాయని కాంగ్రెస్ అధిష్టానానికి కూడా తెలియకపోలేదు. అయితే, రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి రావాలంటే ఇంతకంటే వేరే మార్గం లేదు గనుక కాంగ్రెస్ రాష్ట్ర విభజన ప్రకటనకు మానసికంగా సిద్దపడుతోంది.   ప్రస్తుతానికి ఏదో ఒక సానుకూల ప్రకటన చేసి, ఎన్నికల గండం గట్టెక్కిన తరువాత మిగిలిన అంశాలను మెల్లగా చక్క బెట్టుకోవచ్చునని కాంగ్రెస్ ఆలోచన కావచ్చును. ఎన్నికలకు ఇంకా 9నెలలు గడువు ఉన్నందున, రాష్ట్రంలో, ముఖ్యంగా తెలంగాణాలో తనకు పూర్తి అనుకూల పరిస్థితులు ఏర్పరుచుకోవడమే లక్ష్యంగా ఈ ప్రక్రియ అమలుచేయవచ్చును.   అందువల్ల ఇక కాంగ్రెస్ అధిష్టానం మూడు విషయాలపై తన దృష్టి కేంద్రీకరించవచ్చును.   1.తెరాసను విలీనం చేసుకోవడం లేదా తెలంగాణాలో ఆ పార్టీ ప్రభావాన్ని గణనీయంగా తగ్గించివేయడం.   2.జగన్ మోహన్ రెడ్డి పార్టీని విలీనం లేదా పొత్తులు పెట్టుకోవడం లేదా అతనిని సీబీఐ కేసులలో మరింత బిగించడం.   3.రాష్ట్ర విభజన ప్రక్రియతో తెదేపాను రెండు ప్రాంతాలలో బలహీన పరచడం.   అందువల్ల కాంగ్రెస్ పార్టీ ఇక ముందు తీసుకొనే ప్రతీ నిర్ణయమూ కూడా ఈ మూడు అంశాల ఆధారంగానే ఉంటుంది. 

కాంగ్రెస్ మళ్ళీ సెల్ఫ్ గోల్

  సీమంధ్ర, తెలంగాణా రెండు ప్రాంతాలలో పార్టీ ప్రయోజనాలు కాపాడేందుకు తొలుత రాష్ట్ర విభజనపై రెండు కళ్ళ సిద్ధాంతం దిగ్విజయంగా అమలుపరిచిన చంద్రబాబు, తెరాస నుండి అనేక విమర్శలు ఎదుర్కొనక తప్పలేదు. అయితే ఆయన చూపిన దారిలోనే అధికార కాంగ్రెస్ పార్టీ, వై కాంగ్రెస్ పార్టీలు ముందుకు సాగుతున్నపటికీ, తెలంగాణాలో తనకు బలమయిన ప్రత్యర్ధిగా నిలిచి సవాలు విసురుతున్న తెదేపాను దెబ్బ తీసేందుకు ఆ పార్టీ మీదనే ఇంతకాలం తన అస్త్రాలు సందిస్తూ వచ్చింది తెరాస.   కానీ, అఖిలపక్ష సమావేశంలో తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకి అనుగుణంగా తెదేపా లేఖ ఇవ్వడంతో, తెలంగాణా ప్రాంతంలో తేదేపాకు ఒక్కసారిగా మళ్ళీ ఆదరణ పెరిగింది. దానితో ఆ పార్టీని ఏవిధంగా ఎదుర్కోవాలో పాలుపోక, తెలంగాణపై స్పష్టమయిన అభిప్రాయం ప్రకటించాలని తెరాస డిమాండ్ చేయడం మొదలుపెట్టింది. అయితే, చంద్రబాబు పార్టీ ప్రయోజనాలను దృష్టిలోఉంచుకొని స్పష్టమయిన ప్రకటన చేయలేదు.   కానీ సీమంధ్రకు చెందిన తెదేపా నేతలెవరూ కూడా తన గీసిన గీత దాటకుండా సమర్ధంగా నియంత్రించడంతో, క్రమంగా ఆయనలోను ఆత్మవిశ్వాసం పెరిగింది. దానితో ముందుగా బయ్యారం గనులను తెలంగాణకు కేటాయించాలని ఆయన ధర్నాలో పాల్గొన్నారు. ఆ తరువాత తెలంగాణా ఏర్పాటుకి తాము అడ్డు చెప్పబోమని ఇటీవలే విస్పష్టంగా ప్రకటించారు. మొన్న ఖాజీపేటలో జరిగిన ప్రాంతీయ సమావేశాలలో తెలంగాణా అమర వీరులకు శ్రద్దాంజలి ఘటించిన చంద్రబాబు, తమ పార్టీ అధికారంలోకి వస్తే అమర వీరుల కుటుంబ సభ్యులకు ప్రభుత్వోద్యోగాలు ఇస్తామని వాగ్దానం కూడా చేసారు. తెలంగాణా అంశంలో చంద్రబాబు వైఖరిలో స్పష్టమయిన మార్పు వచ్చిందని ఇవన్నీ రుజువు చేస్తున్నాయి.   సీమంద్రా నేతలకు తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు అనివార్యమని తెలియజేసి అందుకు వారిని మానసికంగా సిద్ధం చేయడం వలన, వారి నుండి వ్యతిరేఖత లేకపోవడంతో ఆయన ఇప్పుడు దైర్యంగా తెలంగాణా విషయంలో స్పందించగలుగుతున్నారు. ఇంత కాలం పార్టీకి తెలంగాణాలో తీవ్రనష్టం కలిగిస్తున్నతన రెండు కళ్ళ సిద్ధాంతాన్ని క్రమంగా పక్కన బెట్టి, ఇప్పుడు స్పష్టమయిన విధానం అవలంబిస్తున్నారు.   తెలంగాణా అంశంపై తెదేపాను దెబ్బతీయాలని ఎప్పటికప్పుడు కొత్త ఎత్తులు వేస్తున్న కాంగ్రెస్ పార్టీకి చంద్రబాబులో ఈ ఊహించని మార్పు మింగుడు పడటం లేదు. తెరాస మరియు తన టీ-కాంగ్రెస్ నేతల ఒత్తిడి వల్లనే రాష్ట్ర విభజన చేసేందుకు సిద్దపడుతున్న కాంగ్రెస్ పార్టీ, తన నిర్ణయం వలన సీమంద్రాలో తన పార్టీకి నష్టం జరుగకూడదనే దురాలోచనతో, రాష్ట్ర విభజన కేవలం తెదేపా ఇచ్చిన లేఖ వల్లనే జరుగుతోందని ఋజువు చేసేందుకు ఒకవైపు ప్రయత్నిస్తూనే, తెలంగాణా ఏర్పాటు చేసిన ఘనకీర్తిని మాత్రం తన ఖాతాలో వ్రాసుకోనేందుకు విఫలయత్నం చేస్తోంది.   తెదేపాను తెలంగాణా అంశంలోఅడ్డుగా ఇరికించి, రానున్న ఎన్నికలలో మళ్ళీ అధికారంలోకి రావాలని కలలు కంటున్న కాంగ్రెస్ పార్టీకి, తను ఆలస్యం చేస్తున్న కొద్దీ క్రమంగా తెదేపా తెలంగాణా అనుకూల వైఖరి ప్రదర్శిస్తూ, అటు తెలంగాణాలోనూ, ఇటు సీమంద్రాలోనూ పట్టు సాదిస్తుండటంతో విధిలేని పరిస్థితుల్లో ‘పది రోజుల్లో తెలంగాణాపై ప్రకటన’ అని గొప్పగా చాటింపు వేసుకొని మళ్ళీ తనే ఇప్పుడు మరో మారు అడ్డుగా దొరికిపోయింది. రోడ్డు మ్యాపులు ఇంకా సిద్ధం కాలేదని, తెరాస విలీనానికి ఒప్పుకోవడం లేదని కుంటి సాకులు చెపుతూ ఇప్పుడు దానినుండి బయటపడేందుకు దారికోసం కాంగ్రెస్ వెదుకులాడుతోంది.   ఇప్పడు తెలంగాణపై ప్రకటన చేస్తే, కేసీఆర్ చేతిలోంచి తెలివిగా ఎత్తుకొచ్చిన తెలంగాణా అంశాన్ని మళ్ళీ కేసీఆర్ తెలివిగా హైజాక్ చేసుకొని ఎత్తుకు పోతాడేమోననే బెంగ ఒకవైపు, ప్రకటించకపోతే ‘కాంగ్రెస్ పార్టీ మళ్ళీ మరో మారు తెలంగాణా ప్రజలను మోసం చేసిందనే అపప్రధతో బాటు, టీ-కాంగ్రెస్ నేతల తిరుగుబాటు కూడా అనివార్యమని గ్రహించిన కాంగ్రెస్ అధిష్టానం ఈ సమస్య నుండి బయటపడేందుకు తిప్పలుపడుతోందిపుడు.

ప్రత్యర్ధి పార్టీలలో చీలికకు వేసిన కాంగ్రెస్ ఎత్తు ఫలిస్తోందా

  ఒకవైపు తెలంగాణావాదులు ఇక నేడో రేపో ప్రత్యేకరాష్ట్రం ఏర్పడటం ఖాయమనే భరోసాతో రోడ్డు మ్యాపులు తయారు చేసుకొంటే, మరోవైపు సమైక్యాంధ్ర కోసం మళ్ళీ రాజీనామాల పర్వం మొదలయింది. ఆదివారం కడపలో జరిగిన సమైక్యాంధ్ర జేఏసీ సమావేశానికి హాజరైన వైకాపా ఎమ్మెల్యేలు శ్రీకాంత్‌రెడ్డి, శ్రీనివాసులు, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఆది నారాయణరెడ్డి, ఎమ్మెల్సీలు నారాయణరెడ్డి, బత్తుల పుల్లయ్య తమ రాజీనామా పత్రాలను స్పీకర్‌ ఫార్మట్‌లో సమైక్యాంధ్ర జేయేసీ నేతలకు అందజేశారు. అదేవిధంగా తేదేపాకు చెందిన శాసనసభ్యుడు లింగారెడ్డి కూడా రాజీనామాకు సిద్దమేనని ప్రకటించారు. తెదేపాకి చెందిన నేతలు మాజీ మంత్రి బ్రహ్మయ్య ,గోవర్దనరెడ్డి, అమీర్ బాబు తదితరులు కూడా ఈ అఖిలపక్ష సమైక్యాంధ్ర జేఏసీ సమావేశానికి హాజరయ్యారు. ఇక మరో విశేషమేమిటంటే, ప్రత్యేక తెలంగాణకు మొదటి నుండి మద్దతు తెలుపుతున్న సిపిఐ పార్టీ నేతలలో కూడా చీలిక వచ్చినట్లు కనబడుతోంది. ఆ పార్టీకి చెందిన నేతలు కూడా కొందరు ఈ సమావేశానికి హాజరవడం విశేషం.   అయితే, తెదేపా తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చిన తరువాత ఆ పార్టీకి చెందిన సమైక్యాంధ్ర నేతలు కొంచెం వెనక్కి తగ్గారు. ఇటీవలే చంద్రబాబు తమ పార్టీ తెలంగాణకు వ్యతిరేఖం కాదని విస్పష్టంగా ప్రకటించారు కూడా. ఇటువంటి నేపద్యంలో ఆ పార్టీకి చెందిన నేతలు మళ్ళీ సమైక్యవాదం నినాదం ఆ పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు సృష్టించబోతోంది.   అదేవిధంగా ఇంత కాలం రాష్ట్ర విభజనపై నోరు మెదపని వైకాపాకి, సరిగ్గా పంచాయితీ ఎన్నికలు దగ్గర పడుతున్నసమయంలో ఆపార్టీ నేతలు ఇప్పుడు సమైక్యాంధ్ర నినాదం చేయడం తెలంగాణా ప్రాంతంలో ఎదురు దెబ్బ కావచ్చును.   ‘పదిరోజుల్లో తెలంగాణా’ అంటూ కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎన్నికల కోసమే ఈ కొత్త నాటకం మొదలుపెట్టిందని తెరాస చేస్తున్న ఆరోపణలు నిజమనుకొంటే, కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ ప్రత్యర్దులయిన తెదేపా, వైకాపాలను ఇరుకునబెట్టి త్వరలో జరగనున్న పంచాయితీ మరియు స్థానిక ఎన్నికలలో విజయం సాదించేందుకే వేసిన ఈ ఎత్తు ఫలిస్తున్నట్లే కనబడుతోంది. ఒకవేళ అదే నిజమయితే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రాజకీయాలలో తాత్కాలికంగా పైచేయి సాధించి ఈ ఎన్నికలల గెలిచే అవకాశం ఉన్నపటికీ, ఇది స్థానిక ఎన్నికల కోసమే వేసిన ఎత్తని స్పష్టమయినప్పుడు, ఆ పార్టీ తెలంగాణా ప్రజల నమ్మకం పోగొట్టుకొని, రానున్న సాధారణ ఎన్నికలలో తీవ్రంగా నష్ట పోక తప్పదు. అయితే, కాంగ్రెస్ అంత పెద్ద తప్పిదం చేస్తుందని అనుకోలేము.   ప్రస్తుతం ఈ పంచాయితీ ఎన్నికలు గడిచేవరకు ఈ రోడ్డు మ్యాపు సమావేశాలు, చర్చ డ్రామాలు కొనసాగించినప్పటికీ, ఆ తరువాతయినా రాష్ట్ర విభజనపై విస్పష్టమయిన ఒక ప్రకటన చేయక తప్పదు.   ఇప్పటికే, తన సీమంద్రా నేతలందరికీ కేంద్ర మంత్రి పదవులిచ్చి దారికి తెచ్చుకొన్న కాంగ్రెస్ అధిష్టానం మిగిలిన కొద్ది మందిని కూడా త్వరలోనే దారికి తెచ్చుకోగానే ఒక నిర్దిష్టమయిన ప్రకటన చేయవచ్చును. అప్పుడు దానిని తెదేపా, వైకాపాలు ఇదివరకులా వ్యతిరేఖించే పరిస్థితి లేదు గనుక ప్రకటన తరువాత ఎటువంటి అడ్డంకులు ఉండకపోవచ్చును. ఒకవేళ తెదేపా, వైకాపాలు తమ పార్టీ నేతలను అదుపులో పెట్టుకోలేక, వారు ఇప్పటిలాగే సమైక్య నినాదం చేసి అడ్డంకులు కల్పిస్తే కాంగ్రెస్ పార్టీ దానివల్ల రాజకీయంగా ప్రయోజనం పొందే ప్రయత్నం తప్పక చేస్తుంది.

తెలంగాణపై కాంగ్రెస్, కేసీఆర్ కొత్త డ్రామా షురూ

  తెలంగాణా రాష్ట్ర సాధించడానికే జన్మించిన కారణ జన్ముడనని చెప్పడం ఒక్కటే మిగిలిపోయింది కేసీఆర్ కి. తెలంగాణా రాష్ట్ర సాధన తనవల్ల తప్ప మరెవరివల్ల సాధ్యంకాదని అందరినీ నమ్మించగలిగిన కేసీఆర్, కాంగ్రెస్ పార్టీ అకస్మాత్తుగా కాకిలా వచ్చి తన చేతిలో ఉన్నతెలంగాణా ఉద్యమాన్ని ఎత్తుకుపోవడంతో బిత్తరపోయాడు. అయితే, మళ్ళీ వెంటనే తేరుకొని, కాంగ్రెస్ పార్టీకి ఎలాగూ తెలంగాణా ఇచ్చే దైర్యం లేదని కనిపెట్టిన ఆయన, ‘తన ప్రమేయం లేకుండా కాంగ్రెస్ గనుక తెలంగాణా ప్రకటించుకొంటే, ఇక ఆ పార్టీలో విలీనం కుదరదని’ తేల్చి చెప్పేసాడు.   కాంగ్రెస్ కూడా అతని పార్టీని కలుపుకోవడానికి మొదట అయిష్టత చూపినప్పటికీ, అతనిచ్చిన ఐడియాతోనే తెలంగాణా అంశం మరికొంత కాలం సాగదీయవచ్చునని అర్ధమవడంతో మళ్ళీ డీ.శ్రీనివాస్ ద్వారా కేసీఆర్ తో రాయభారం మొదలుపెట్టింది. అదే విషయాన్నీ శ్రీనివాస్ కూడా ధృవీకరించారు.   ఇందులో ఉన్న ట్విస్ట్ ఏమిటంటే, తన చేతిలోంచి తెలంగాణా అంశాన్ని ఎత్తుకుపోయిన కాంగ్రెస్ తో కలవకూడదని బెట్టు చేయడం ద్వారా, కేసీఆర్ తెలంగాణాను వెనక్కి జరిపితే, అతని పార్టీ విలీనం అయితే తప్ప తెలంగాణా సాద్యం కాదనే సాకుతో కాంగ్రెస్ పార్టీ కూడా మరికొంత కాలం తెలంగాణా అంశాన్ని సాగదీయాలని ప్రయత్నిస్తున్నట్లు అర్ధం అవుతోంది.   మొన్న టీ-కాంగ్రెస్ నేతల సభలో “కాంగ్రెస్ వల్లనే తెలంగాణా సాధ్యం” అని తన నేతలతో చిలక పలుకులు చెప్పించిన కాంగ్రెస్ పార్టీ, కేసీఆర్ ని పక్కన బెట్టి తెలంగాణా ఇచ్చిన క్రెడిట్ ని మొత్తం స్వంతం చేసుకోవాలని యోచించినా, దానివలన సీమంద్రా నేతల నుండి కొత్త తల నొప్పులు మొదలవడం గమనించగానే, మళ్ళీ కేసీఆర్ తో రాయభారం సీనుకు తెర తీసింది.   కేసీఆర్ తో మొదలుపెట్టిన ఈ ‘రాయబేరం సీను’ని తెలంగాణా ఆలోచన లేకుంటే చర్చల పేరిట మరి కొంత కాలం సాగదీసుకోవచ్చును, ఇద్దరికీ లాభం ఉంటుందనుకొంటే వెంటనే ముగించుకోవచ్చును. బేరసారాలు కుదరకపోతే చెడగొట్టుకోవచ్చు కూడా.   ఇది కాంగ్రెస్ ఆలోచన అయితే, మరో పదినెలలపాటు కాంగ్రెస్ పార్టీ తెలంగాణాపై నిర్ణయం తీసుకోనీయకుండా అడ్డుపడగలిగితే, అప్పుడు తెలంగాణా సెంటిమెంటుతో రానున్న ఎన్నికలలో 15/100 సీట్లు సాధించి కేంద్ర రాష్ట్ర రాజకీయాలలో చక్రం తిప్పాలని కేసీఆర్ ఆలోచన. మరో పది నెలలో దివ్యమయిన భవిష్యత్తును ఎదురుగా పెట్టుకొని, కాంగ్రెస్ లో విలీనం చేసుకొని దానిని చేజేతులా కేసీఆర్ పాడు చేసుకోకపోవచ్చును.   కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేస్తే, ఇంతకాలం రాజాల్లాగ బ్రతికిన కేసీఆర్ ఆయన పరివారం సోనియా, రాహుల్ గాంధీల ముందు చేతులు కట్టుకొని నిలబడవలసి రావడమే గాక, శతకోటి కాంగ్రెస్ నేతలతో అధికారం కోసం పోటీలుపడక తప్పదు.   అందువల్ల ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టిన ‘రాయబేరాలను’ అవుననకుండా కాదనకుండా మరికొంత కాలం సాగదీస్తూ కాలక్షేపం చేసేస్తే ఎలాగు అప్పటికి ఎన్నికలు వచ్చేస్తాయి గనుక, అప్పుడు తన కలలు సాకారం చేసుకోవచ్చునని కేసీఆర్ ఆలోచన. కాంగ్రెస్ కూడా కేసీఆర్ నుండి సరిగ్గా అదే కోరుకొంటోంది.   దానర్ధం ఆజాద్ ప్రతిపాదించిన తాజా సిద్ధాంతం ప్రకారం ‘పది రోజుల్లోతెలంగాణా అంటే పదిరోజులని కాదు. పది వారాలో, పది నెలలో తెలంగాణా’గా మనం అర్ధం చేసుకోక తప్పదు

తెదేపాను దెబ్బ తీయడానికే సభలో తీర్మానమా?

  విజయవాడ యంపీ లగడపాటి రాజగోపాల్, అందరూ కలిసి తెలుగు తల్లిని బలిపీఠం మీదకు ఎక్కిస్తున్నారని, ఆమె మెడపై ఇప్పుడు విభజన కత్తి వ్రేలాడుతోందని ఆవేదన వ్యక్తం చేసారు. దీనికంతటికి ప్రధాన కారణం తెదేపా తెలంగాణకు అనుకూలంగా లేఖ ఈయడమేనని ఆయన ఆరోపిస్తున్నారు. త్వరలో శాసనసభలో తెలంగాణాపై తీర్మానం పెట్టినప్పుడు తెదేపా గనుక, తెలంగాణా తీర్మానానికి వ్యతిరేఖంగా ఓటువేసి ఓడిస్తే రాష్ట్ర విభజనను అడ్డుకోవచ్చునని ఆయన అన్నారు. ఒకవేళ అప్పటికీ రాష్ట్ర విభజనను అడ్డుకోలేకపోతే తానూ రాజకీయాల నుండి తప్పుకొంటానని ఆయన ప్రకటించారు.   ఆయన మాటలు వింటే, రాష్ట్ర విభజన పట్ల ఆయన చాల ఆవేదన చెందుతున్నట్లు అనిపిస్తుంది. కానీ, నిజానికి ఆ బాధకంటే తెదేపాను రాజకీయంగా దెబ్బ తీయాలనే ఆలోచనే ఎక్కువగా ఉంది. అందుకే ఆయన శాసనసభలో తెలంగాణకు వ్యతిరేఖంగా ఓటేయమని తెదేపాను కోరుతున్నారు. తద్వారా, తెదేపా తెలంగాణకు వ్యతిరేఖమో, అనుకూలమో చెప్పక తప్పనిపరిస్థితి కల్పిస్తే, దానిని బట్టి ఆ పార్టీని అటు తెలంగాణాలో, ఇటు సీమంద్రాలో పూర్తిగా దెబ్బ తీయవచ్చుననే దురాలోచన ఉంది. ఆ ఆలోచనతోనే మొన్న దిగ్విజయ్ సింగ్ కూడా సభలో తీర్మానం పెట్టబోతునట్లు తెలిపారు.   అంటే, కాంగ్రెస్ పార్టీ ఒకవైపు తెలంగాణా ఇవ్వడానికి సిద్దపడుతూనే, చివరి నిమిషం వరకు కూడా ఇదే అంశంతో తన ప్రత్యర్దులను ఏవిధంగా దెబ్బ తీయాలనే ఆలోచనలు చేస్తోందని అర్ధం అవుతోంది. ఇప్పటికే, తెలంగాణా సెంటిమెంటుని తెలివిగా హైజాక్ చేసి, తెరాసను దెబ్బ తీసిన కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు అదే పాయింటుతో తెదేపాను రెండు ప్రాంతాలలో కూడా దెబ్బతీయాలని వ్యూహం పన్నుతోంది.   ఇంతవరకు వచ్చిన తరువాత, ఇప్పుడు తెదేపా తెలంగాణకు అనుకూలమని చెప్పినా ఆ పార్టీకి తెలంగాణాలో కొత్తగా ఒరిగేదేమీ లేదు. ఎందుకంటే, తామే తెలంగాణా ఇచ్చామని కాంగ్రెస్ నేతలు చెప్పుకొని దాని పూర్తి ప్రయోజనం పొందే ప్రయత్నం చేయకమానరు. ఇక, సభలో తెదేపా తెలంగాణాకు అనుకూలమని చెపితే, తెదేపా వల్లే రాష్ట్రం విడిపోయిందని లగడపాటి రాజగోపాల్ వంటి కాంగ్రెస్ నేతలు ప్రచారం చేసి, సీమంద్రాలో ఆ పార్టీని దెబ్బతీసే అవకాశం ఉంది.   తెదేపా తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చినప్పటికీ కేవలం ఈ భయంతోనే ఆ పార్టీ ఇంతవరకు తెలంగాణపై తన స్పష్టమయిన వైఖరి ప్రకటించలేకపోతోంది. తెదేపా యొక్క ఈ బలహీనతనే అడ్డుపెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ప్రయోజనం పొందాలని ప్రయత్నం చేస్తోంది. అందుకే మొన్నదిగ్విజయ్ సింగ్, నిన్నలగడపాటి వంటి వారు సభలో తెలంగాణా బిల్లు పెట్టడం గురించి మాట్లాడుతున్నారు. రేపు మరికొందరు వారికి తోడయినా ఆశ్చర్యం లేదు.   ఒకవిధంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ రెండు ప్రాంతాల ప్రజలతో డబుల్ గేం ఆడుతోందని చెప్పవచ్చును. అక్కడ టీ-కాంగ్రెస్ నేతలు తామే తెలంగాణా సాధించామని చెప్పుకొని ప్రయోజనం పొందబోతుంటే, ఇక్కడ లగడపాటి, శైలజానాథ్ వంటి వారు తాము చివరి వరకు కూడా రాష్ట్ర విభజన జరగకుండా యధాశక్తిన ప్రయత్నించామని, కానీ, తెదేపా వల్లే రాష్ట్రం విడిపోయిందని, నెపం తెదేపా మీదకు నెట్టివేసి సీమంద్రాలో ప్రజల హృదయాలు గెలుచుకోవాలని ప్రయత్నిస్తున్నారు.   రాష్ట్రాన్ని విడగొట్టింది కాంగ్రెస్ పార్టీయే అయినప్పటికీ దానివల్ల కలిగే ప్రయోజనాలను మాత్రం కాంగ్రెస్ పుచ్చుకొని, దుష్పరిణామాలు తెదేపాకు అంటగట్టే ప్రయతనం చేస్తోంది. నిజంగా కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి దురుదేశ్యాలు లేకపోతే, ‘శాసనసభ తీర్మానం తాము పట్టించుకోవలసిన అవసరం లేదని’ దిగ్విజయ్ సింగే స్వయంగా చెప్పినపుడు, ఇక శాసనసభలో తీర్మానం పెట్టవలసిన అవసరం ఏమొచ్చింది? ఇది కేవలం తెదేపాను రాజకీయంగా దెబ్బ తీసేందుకు వేస్తున్న ఎత్తుగడే తప్ప మరొకటి కాదు.

కాంగ్రెస్ వైకాపాతో పొత్తులకి రంగం సిద్దం చేస్తోందా

  రాష్ట్రంలో ముఖ్యమంత్రితో సహా రాష్ట్ర కాంగ్రెస్ నేతలందరూ పార్టీపై మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి ముద్రని పూర్తిగా తుడిచిపెట్టేసి, కాంగ్రెస్ ముద్రని ఏర్పరచాలని విశ్వప్రయత్నాలు చేస్తుంటే, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ్ సింగ్ ఆయనను గొప్ప విలువలున్న వ్యక్తి అని పొగడటం, అనేక ఆర్ధిక నేరారోపణలు ఎదుర్కొంటూ జైలులో నిర్బందించబడిన జగన్ మోహన్ రెడ్డి ‘డీ.యన్.యే.’ కాంగ్రెస్ ‘డీ.యన్.యే.’ తో సరిపోలుతుందని చెప్పడంతో కాంగ్రెస్ నేతలు చాలా అయోమయం చెందారు.   దిగ్విజయ్ సింగ్, ఈ మాటలను అనాలోచితంగా అన్నారో లేక రానున్న ఎన్నికలని దృష్టిలో పెట్టుకొని అన్నారో తెలియదు కానీ, ఇంత కాలంగా రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఆ తండ్రి కొడుకుల గురించి చెపుతున్న మాటలను ఆయనే స్వయంగా ఖండించినట్లు మాట్లాడి వారిని ఇబ్బందికరపరిస్థితులోకి నెట్టివేశారు. తద్వారా వారిప్పుడు జగన్ మోహన్ రెడ్డిని వేలెత్తి చూపలేని పరిస్థితి ఎదురయితే, ఇంత కాలం కాంగ్రెస్ నేతల దాడిని కాచుకోవడానికే సరిపోతున్న వైకాపాకు ఇప్పుడు దిగ్విజయ్ సింగ్ మాటలు పట్టుకొని నిలదీసే అవకాశం వచ్చింది.   ఇక దిగ్విజయ్ సింగ్ రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ వ్యాక్యాలు చేసి ఉంటే, వైకాపా విషయంలో కాంగ్రెస్ అధిష్టాన వైఖరిలో మార్పు వచ్చిందని భావించవచ్చును. రానున్న ఎన్నికలలో గెలిచి అధికారం సంపాదించుకొనేందుకు, ఎవరితోనయినా పొత్తులకు తమకు అభ్యంతరం ఉండబోదని ఆయన తన మాటలతో స్పష్టం చేసినట్లు భావించవచ్చును. తద్వారా కాంగ్రెస్ పార్టీలో నైతిక విలువలు కేవలం ఉపన్యాసాలకే పరిమితం తప్ప ఆచరణలో పాటించబోదని తేల్చిచెప్పారు.   నేటి రాజకీయాలలో ఇటువంటి ఆలోచనా ధోరణి సహజమేననుకొన్నపటికీ, ‘జగన్ డీ.యన్.ఏ. తమ డీ.యన్.ఏ. సరిపోలుతుందని’ చెప్పడం చూస్తే, తామందరం ఒక తానులో ముక్కలమేనని ఆయన నిసిగ్గుగా చాటుకోవడమే విడ్డూరం. ఏది ఏమయినప్పటికీ, నిన్న ఆయన చేసిన వ్యాక్యలు ఆ రెండు పార్టీల మధ్య పొత్తులు లేదా విలీనానికి దారితీసే అవకాశం ఉంది. అయితే, ఇప్పటికిప్పుడు ఆ రెండు పార్టీలు ఆ ప్రసక్తి తేకపోయినప్పటికీ రానున్న ఎన్నికల సమయానికి అందుకు తగిన వాతావరణం కల్పించే ప్రయత్నాలు మాత్రం త్వరలోనే మొదలుపెట్టవచ్చును.   అయితే, ఈ అనైతిక పొత్తులు లేదా విలీనానికి శ్రీకారం చుట్టాలంటే, అంతకంటే మున్ముందు అంతకంటే మరో అనైతిక పనికి కూడా కాంగ్రెస్ సిద్దపడక తప్పదు. అది తీవ్ర ఆర్ధిక నేరారోపణలు ఎదుర్కొంటున్న జగన్ మోహన్ రెడ్డిపై కేసులన్నీ ఎత్తివేసి, ఆయన నిర్దోషిగా చాటిచెప్పి జైలునుండి విడుదల చేయడం. జగన్ పై 5 చార్జ్ షీట్లు కూడా నమోదయిన ప్రస్తుత పరిస్థితుల్లోమరి కాంగ్రెస్ ఇంత సాహసం చేయగలదా అనే ప్రశ్న తలెత్తుతుంది. అయితే, అధికారం చేజిక్కించుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ జగన్ మోహన్ రెడ్డిపై ఉన్న కేసులనన్నిటినీ తెలివిగా నీరుగార్చినా ఆశ్చర్యం లేదు. దిగ్విజయ్ చేసిన వ్యాఖ్యల పరమార్ధం ఏమిటో త్వరలోనే క్రమంగా బయటపడవచ్చును.