ఆయన సీమాంధ్ర పక్షపాతిట! నిజమేనా

  ‘రాష్ట్ర విభజన జరిగితే కేవలం సీమాంధ్ర ప్రాంత ప్రజలే కాక తెలంగాణా ప్రజలు కూడా తీవ్ర నీటి సమస్యలు ఎదుర్కొంటారు, గనుకనే ప్రజలందరి సంక్షేమం కోరి రాష్ట్రం విడిపోకూడదని చెపుతున్నాను’ అని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వాదిస్తున్నసంగతి అందరికీ తెలిసిందే. అయితే యావత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించాల్సిన ఆయన కేవలం సీమాంద్రా ప్రాంతానికే ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారని తెరాస నేతలతో బాటు ఆయన స్వంత పార్టీ నేతలే విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక్కడ రెండు అంశాలు గమనించాల్సి ఉంది. ఒకటి ముఖ్యమంత్రి తెలంగాణాతో సహా యావత్ రాష్ట్ర ప్రజలకి నీటి సమస్యలు రాకూడదని కోరుకొంటున్నారు. రెండవది ఆయన సీమాంధ్ర ప్రాంత పక్షపాతి. ఈ రెండు విషయాలు నిర్ద్వందంగా ఋజువు అయినట్లే అనుకోవచ్చును.   ఇక విషయంలోకి వస్తే, ఆయన ఒకవైపు యావత్ ప్రజల సంక్షేమం కోరుకొంటున్నానని చెపుతూనే మరో వైపు నెల్లూరు జిల్లాలో గల కండలేరు ప్రాజెక్టు నుండి తను ప్రాతినిధ్యం వహిస్తున్నచిత్తూరు జిల్లాలో పీలేరు నియోజకవర్గానికి త్రాగునీరు తరలించేందుకు రూ.7390 కోట్లు మంజూరు చేసారు. అది కూడా ఆయన త్వరలో తన పదవికి రాజీనామా చేసి కొత్త రాజకీయ పార్టీ పెడతారని జోరుగా ఊహాగానాలు చెలరేగుతున్న ఈ సమయంలో (అక్టోబర్ 4న) జీవో సంతకం చేయడం విశేషం.   కండలేరు ప్రాజెక్టుపై నెల్లూరు, కడప, కర్నూలు జిల్లాలు త్రాగు,సాగు నీరుకోసం ఆధారపడి ఉన్నాయి. వీటితో బాటు తెలుగు గంగ పధకం ద్వారా చెన్నైనగరానికి 15 టీయంసీ (యఫ్టీ) నీళ్ళు ఇవ్వవలసి ఉండగా నీళ్ళు లేని కారణంగా కేవలం 5 టీయంసీ (యఫ్టీ)లను మాత్రమే అందించ గలుగుతున్నాము. మూడు జిల్లాలతో బాటు చెన్నై నగరం కూడా కండలేరు ప్రాజెక్టుపైనే ఆధారాపడి ఉన్నాయి. అయినప్పటికీ వాటికి తీవ్ర నీటి ఎద్దడి తప్పడం లేదు.   ఇటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి కండలేరు నుండి తన స్వంత జిల్లా చిత్తూరుకి నీరు తరలించుకుపోవడం చాలా అనైతికమవుతుంది. ఇప్పటికే తీవ్ర నీటి ఎద్దడితో బాధలుపడుతున్నఈ మూడు జిల్లాల ప్రజలు, ఈ ప్రాజెక్టు దెబ్బకి పంటల సంగతి దేవుడెరుగు కనీసం తాగునీరుకి కూడా నోచుకోకపోవచ్చును. మూడేళ్ళలో పూర్తిచేయాలనే లక్ష్యంతో మొదటి దశ పనులు ఆరంభించడానికి ముఖ్యమంత్రి అక్టోబర్ 4న అనుమతి కూడా మంజూరు చేసారు. ఈ ప్రాజెక్టులో మొదటి దశ పనుల కోసం రూ.5990 కోట్లు కేటాయింపబడ్డాయి.   ప్రజలందరి సంక్షేమం కోరుతున్నాని చెప్పుకొనే ముఖ్యమంత్రి తన స్వంత జిల్లాకి, నియోజక వర్గానికే ఎందుకు అంత ప్రాధాన్యం ఇస్తున్నారు? కేవలం సీమాంద్రాకే ముఖ్యమంత్రి అనిపించుకొన్న ఆయన ఇప్పుడు తన పరిధిని మరికొంత కుచించుకొని కేవలం చిత్తూరుకే ముఖ్యమంత్రిగా వ్యవహరించడం ఎంతవరకు సబబు? ఆయన కేవలం తన జిల్లాను మాత్రమే దృష్టిలో ఉంచుకొని మూడు జిల్లాలకు ఈవిధంగా అన్యాయం చేస్తే, ఆ మూడు జిల్లాల ప్రజలకు ఆయన ఏమని సమాధానం చెపుతారు?   ఇప్పటికే నీళ్ళు లేక అల్లాడుతున్న కందలేరుపై మరో కొత్త ప్రాజెక్టుకి అన్నివేళ కోట్ల రూపాయలతో మరో కొత్త ప్రాజెక్టు ఇంత హడావుడిగా ఎందుకు ఆమోదించవలసి వచ్చింది? ఒకవేళ ఆయన తన రాజకీయ భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొనే ఈ నిర్ణయం తీసుకొన్నపటికీ, దీనివల్ల ఆయన ఆశించిన ప్రయోజనము నెరవేరుతుందా? ఇంత కాలం ముఖ్యమంత్రిగా అధికారం వెలగబెట్టి ఇకనేడో రేపో దిగిపోయే సమయంలో ఇటువంటి వివాదస్పద నిర్ణయాలు తీసుకొన్నంత మాత్రాన్నవాటిని ఆ తరువాత వచ్చే ప్రభుత్వాలు ఆమోదించే అవకాశం ఉంటుందా?   ప్రజాప్రతినిధులుగా ఎన్నికయి అధికారం చేప్పటిన వారు, ప్రభుత్వానికి, ప్రజల సొమ్ముకి ధర్మకర్తల వలే వ్యవహరించాలి తప్ప అధికారం చేతిలో ఉంది గనుక దానిని దుర్వినియోగం చేస్తే, వారు కొత్తపార్టీలు పెట్టుకొని వచ్చినపటికీ కూడా అటువంటి వారికి ప్రజలు తప్పకుండా శలవు ప్రకటిస్తారు.

ఒక్కటోసారి..రెండో స్సారి...మూడో స్సారి....

  ట్రాజెడీలో కామెడీ సృష్టించగల నేర్పు కేవలం చార్లీ చాప్లిన్ కి మాత్రమే ఉందనే ప్రజల అపోహాలను దూరం చేస్తూ కోట్లాది తెలుగు ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉన్న సున్నితమయిన రాష్ట్ర విభజన అంశాన్ని తీసుకొని కాంగ్రెస్ నేతలు మంచి టైమింగ్ తో చక్కటి కామెడీ చేస్తూ సీమాంధ్ర ప్రజల దుఃఖాన్నిమరిపింపజేస్తున్నారు. అందులో భాగంగానే కొందరు యంపీలు రాజీనామాలు చేయడం దానిని స్పీకర్ తిరస్కరించడమనే డ్రామా చాలా చక్కగా నడుస్తోంది.   వారి రాజీనామాలు ఆమోదించమని కోర్టులు స్పీకర్ ను ఆదేశించలేవనే రహస్యం ప్రజలందరికీ తెలియదు గనుక, ఈ డ్రామా మరింత రక్తి కట్టేందుకు కొందరు కోర్టుని కూడా వాడేసుకొంటున్నారు. వేలంపాటలోఒక్కటోసారి..రెండో స్సారి...మూడో స్సారి....అని పాటకి ముగింపు ఉంటుందేమో గానీ ఇక్కడ మాత్రం ఈ రాజీనామాల పాట నిరంతరంగా కొనసాగుతూనే ఉంటుంది, మరో వైపు విభజన ప్రక్రియ కూడా సజావుగా సాగిపోతూనే ఉంటుంది.   అంటే రాష్ట్ర విభజన విభజనే, సమైక్యం సమైక్యమేనన్నమాట. అందుకే ఉండవల్లి, లగడపాటి, సాయి ప్రతాప్ మరియు సబ్బం హరిలు మళ్ళీ మూడో... స్సారి రాజీనామాలు సమర్పించి, మళ్ళీ వీటిని కూడా స్పీకర్ తిరస్కరించవచ్చని ముందే ప్రకటించేశారు.   ఇక్కడ రాజీనామాల డ్రామా సరదా సరదాగా సాగిపోతుంటే మరో వైపు రాష్ట్రంలో కొందరు యంపీలు ‘విభజన పక్కా...ఇందులో డౌట్ లేదు అందరూ ప్రిపేర్ అయిపోండి!’ అని జనాల కంటే ముందు వారే మెంటల్గా ప్రిపేర్ అయిపోయారు. ఇక ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈ డ్రామాలో క్లైమాక్స్ సీన్ కోసం మంచి గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే వ్రాసుకొని, అందుకోసం రిహార్సల్స్ కూడా మొదలు పెట్టేసారు.   ఆ క్లైమాక్స్ సీన్ కోసం తను వ్రాసుకొన్నఓ పంచ్ డైలాగు-‘ఈ మీ కిరణ్ దేవుడు పంపిన తుఫానుని అడ్డుకోలేడేమో కానీ మా అధిష్టానం చేస్తున్న రాష్ట్ర విభజన తుఫానును మాత్రం మోకాలు అడ్డుపెట్టయిన ఆపగలడని’ పలికి జనాల చేత చప్పట్లు కొట్టించు కోవడమే కాక అటు తెలంగాణా వైపు నుండి కూడా మంచి రెస్పాన్స్ రాబట్టగలిగారు.  కానీ దేని దారి దానిదే అన్నట్లు, రాష్ట్ర విభజనకు అవసరమయిన కార్యక్రమాలు చెప్పటేందుకు రాష్ట్రంలో శాఖలు వారిగా బాధ్యతల అప్పగింతలు కూడా జరిపోయినట్లు తాజా సమాచారం.   ఏమయినప్పటికీ సున్నితమయిన రాష్ట్ర విభజన అంశాన్ని తీసుకొని ఇంత బాగా స్క్రీన్ ప్లే వ్రాసుకోవడం, దానిని ఇంత వైరుద్యం గల కాంగ్రెస్ పాత్రదారులతో ఎక్కడ తొణకకుండా రక్తి కట్టించడం త్రివిక్రమ్, రాజమౌళి వంటివారికి కూడా సాధ్యమా కాదని చెప్పవచ్చును.

దొందుకు దొందూ దొందప్పలే

  జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ దాఖలు చేసిన చార్జ్ షీట్లలో కొందరు రాష్ట్ర మంత్రులు, అధికారులు కూడా ఈ అవినీతిలో కుట్రదారులేనని పేర్కొన్నప్పుడు, వారందరూ ఈ వ్యవహారంలో తామేమి తప్పు చేయలేదని, అప్పటి ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి ఆదేశాలు ప్రకారమే అన్ని వ్యవహారాలు నడిపించామని వాదించారు. అయితే చనిపోయిన రాజశేఖర్ రెడ్డిపై నిందలు వేసి తప్పించుకోవడం ఏమిటని వైకాపా నేతలు నిలదీసినప్పుడు, సదరు మంత్రులు క్యాబినెట్ సమిష్టి నిర్ణయం ప్రకారమే నడుచుకొన్నామని మాట మార్చారు.   అంటే లక్షలకోట్ల అవినీతి జరిగిందని సీబీఐ ప్రాధమికంగా నిర్ధారించినా, అందులో ప్రధమ ముద్దాయి జగన్ మోహన్ రెడ్డితో సహా అందరూ కూడా తాము నిరపరాదులమనే వాదిస్తూ తప్పించుకోజూస్తున్నారు. అయితే ఈ లక్షల కోట్ల అవినీతి ఎలా జరిగిందనే ప్రశ్నకు జవాబు వెదకవలసి ఉంది. కానీ ఇప్పుడు సీబీఐకి కూడా రాజకీయ రంగు కూడా పులుముకోవడంతో అసలు ఈ అవినీతిలో కుట్రదారులను నిరూపించి, దోషులకు అసలు శిక్ష పడుతుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి.   ఇప్పుడు కేంద్రంలో కూడా ఇంచుమించుగా ఇదేవిధమయిన డ్రామా నడుస్తోంది. ఇక్కడ రాష్ట్రంలో మంత్రులు, అధికారులు ఏవిధంగా ఈ అవినీతి భాగోతాలతో తమకు సంబంధం లేదని వాదిస్తున్నారో, అదేవిధంగా కేంద్రంలో కూడా బొగ్గు కుంభకోణంలో ప్రధాన మంత్రికి, మాజీ బొగ్గు శాఖా కార్యదర్శి పీసీ పరేఖ్ కూడా తమకు ఎటువంటి సంబంధమూ లేదని వాదిస్తున్నారు. ఇప్పుడు సీబీఐ చేసిన తాజా చార్జ్ షీట్లో కుమార్ మంగళం బిర్లా, పీసీ పరేఖ్ ల పేర్లతో బాటు ప్రధాని మన్మోహన్ సింగ్ పేరును నేరుగా పేర్కొనకుండా ‘కాంపిటెంట్ అధారిటీ’ కూడా ఇందుకు బాధ్యత వహించాలని సీబీఐ పేర్కొన్నపుడు, ఆ ‘కాంపిటెంట్ అధారిటీ’ అయిన ప్రధాని మన్మోహన్ సింగ్ ను వెనకేసుకు వస్తూ కేంద్ర కాంగ్రెస్ మంత్రులు మరియు కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు కొందరు పరేఖ్ మరియు ప్రతిపక్షాల ఆరోపణలపై ఎదురు దాడికి దిగారు.   కోర్టులో ఉన్న వ్యవహారంపై మాట్లాడటం సమజసం కాదని చెపుతూనే, ప్రధాని స్వయంగా అన్ని ఫైళ్ళను చదవడం అసంభవం గనుక, ఆయన ఆ ఫైళ్ళపై సంతకాలు చేసినంత మాత్రాన్న అందులో ఆయనను దోషిగా పేర్కొనడం సమంజసం కాదని వాదిస్తున్నారు. అయితే ప్రధాని కార్యాలయంలో ఉన్న అనేక మంది అధికారులు ఆ ఫైళ్ళను క్షుణ్ణంగా చదివి, ఆ వివరాలను క్లుప్తంగా ప్రధానికి వివరించిన తరువాతనే ఆయన సంతకాలు చేస్తారు గనుక, ఇందులో ప్రధానికి సంబంధం లేదనడం అతితెలివి ప్రదర్శించడమేనని పరేఖ్ విమర్శించారు.   ఇక్కడ రాష్ట్రంలో, అక్కడ కేంద్రంలో రెండు చోట్ల లక్షల కోట్ల అవినీతికి స్వయంగా ఆమోదం తెలుపుతున్న మంత్రులు, అధికారులు దానితో తమకు ఎటువంటి సంబంధమూ లేదని వాదించడం చూస్తే, బహుశః ఫైళ్ళపై సంతకాలు చేసిన వారే పూర్తి భాద్యులని మళ్ళీ సుప్రీంకోర్టు మరో నిర్వచనం లేదా తీర్పు చెప్పి కొరడా జళిపించవలసి ఉంటుందేమో.

దిగ్గీ రాజా చెప్పిన తాజా కబుర్లు

  రాష్ట్ర విభజన సంగతేమో గానీ దాని గురించి కాంగ్రెస్ నేతలు రోజూ చెప్పే పిట్ట కధలు మాత్రం చాలా ఆసక్తికరంగా సాగుతున్నాయి. వారు చెప్పే ఈ కధలన్నీ వింటుంటే ఇదంతా కూడా రాష్ట్ర విభజన ప్రక్రియలో భాగమనే అభిప్రాయం, ఇంకా చెప్పాలంటే అసలు రాష్ట్ర విభజన ఈవిధంగానే చేయాలేమోననే నమ్మకం జనాలకి కలిగిస్తున్నారు.   ఇక విషయంలోకి వస్తే, రోజుకో తాజా పిట్ట కధలో భాగంగా నేడు దిగ్విజయ్ సింగ్ కొత్తగా ఏమి చెప్పారంటే, షరా మామూలుగా తెలంగాణా విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తి లేదని ఆచమనం చెప్పుకొన్న తరువాత విభజన వ్రత కధ మొదలుపెట్టారు.   "తెలంగాణా ఏర్పడాలంటే అన్ని రాజకీయ పార్టీలు పార్లమెంటులో తెలంగాణా బిల్లుకి ఆమోదం తెలపాల్సి ఉంటుంది. అప్పుడే తెలంగాణా సాధ్యమవుతుంది. ఇక మా పార్టీకి జగన్మోహన్ రెడ్డితో, ఆయన పార్టీతో ఏదో రహస్య ఒప్పందం ఉన్నదనే మాట ఒట్టి అబద్దం. అది కేవలం తెదేపా పుట్టించిన పుకార్లు మాత్రమే. తెలంగాణా విషయంలో తెదేపా ‘యూ’ టర్న్ తీసుకొని తన విశ్వసనీయతను కోల్పోయింది. అందుకే అటువంటి ప్రచారం చేస్తోంది."   "మేము ఇప్పటికీ వచ్చే శీతాకాల సమావేశాలలో పార్లమెంటులో తెలంగాణా బిల్లు ప్రవేశపెట్టాలనే అనుకొంటున్నాము. మరి దానికి ప్రతిపక్ష పార్టీలు మద్దతు ఇస్తాయ లేదా విషయం అవే నిర్ణయించుకోవాలి,” అని అన్నారు.   ఇక కేసీఆర్ ఈ నెల మొదటి వారంలోగా కాంగ్రెస్ అధిష్టానం కిరణ్ కుమార్ రెడ్డి ప్లగ్గు పీకేయ బోతోందని తనకు హాట్ లయిన్లో కబురు అందిందని ఇటీవల హైదరాబాదు సభలో ప్రకటించారు. కానీ దిగ్గీ రాజా మాత్రం ఆ హాట్ లైన్ వేరేవరి నుండో అయి ఉండవచ్చునని సూచిస్తూ “ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని పదవి నుండి తప్పించడంలో వస్తున్న వార్తలలో నిజం లేదు. ఆయనొక క్రమశిక్షణగల కాంగ్రెస్ నాయకుడు. ఆయన అధిష్టానం నిర్ణయాన్ని తప్పక అమలుచేస్తారు,” అని చెపుతూ కేసీఆర్ ప్లగ్గు పీకేయడం విశేషం.   ఇక తెరాసతో పొత్తులు విలీనం గురించి మాట్లాడుతూ ఇంతవరకు ఆ పార్టీ నుండి మాకు అటువంటి ప్రతిపాదనేమి రాలేదు. ఒకవేళ వస్తే, మా పార్టీ నేతలతో చర్చించి ఏమి చేయాలో నిర్ణయించు కొంటాము,” అని చెవిలో పువ్వు సర్దుకొంటూ చెప్పారు.   ఇక సీమాంధ్రలో సమైక్యాంధ్ర ఉద్యమాలు, ఉద్యోగుల సమ్మెలు అన్నీ ఒకటొకటిగా నిలిచి పోతున్నాయి. గనుక అక్కడ పరిస్థితులు మళ్ళీ సాధారణ స్థితికి చేరుకొంటున్నాయని ఆయన అన్నారు. అయితే రాష్ట్ర విభజన లో సీమంధ్ర ప్రజలు భయపడనవసరం లేదని, వారికి భారీ ప్యాకేజీ ఇస్తామని ఆయన అభయ (కాంగ్రెస్) హస్తం ఇచ్చారు.   అందువల్ల నేటి కధలో మనం తెలుసుకోవలసిన నీతులు ఏమిటంటే, 1. బీజేపీ బిల్లుకి మద్దతు ఇస్తేనే తెలంగాణా ఏర్పాటు.   2. జగన్మోహన్ రెడ్డితో కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి రహస్య ఒప్పందం కుదరలేదు.   3. తెరాసతో కూడా ఎటువంటి రహస్య ఒప్పందం లేదు.   4. కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే ఉండి రాష్ట్ర విభజన దగ్గరుండి చేయిస్తారు.   5. సీమాంద్రా ప్రజలు విభజనకు అంగీకరించినట్లే గనుక వారికో బంపర్ గిఫ్ట్.

బైరెడ్డి ఎంట్రీతో వేడెక్కనున్న సీమ రాజకీయాలు

  ఇంతవరకు సీమాంధ్ర ప్రాంతంలో కేవలం తెదేపా, వైకాపా, కాంగ్రెస్ పార్టీల మధ్యనే ఎన్నికల పోరు జరుగుతోంది. కానీ రానున్న ఎన్నికలలో మరో కొత్త పార్టీ- రాయలసీమ పరిరక్షణ సమితి పార్టీ కూడా బరిలోకి దిగబోతోంది. ఆ పార్టీ అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ రాయలసీమలోని 52 శాసన సభ నియోజకవర్గాలు, 8 పార్లమెంట్ స్థానాల నుంచి పోటీ చేస్తుందని ప్రకటించారు.   ఆయన ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం కోరుకొంటున్నపటికీ, ఆయన పార్టీ ఇంకా పూర్తిగా నిలద్రొక్కుకోనందున, తన డిమాండ్ నెరవేరే అవకాశం లేదని గ్రహించిన బైరెడ్డి తన వ్యూహంమార్చుకొని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిని రాయలసీమ ప్రాంతంలోనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ కర్నూలు పట్టణంలో సుప్రసిద్ద చారిత్రిక కట్టడం కొండారెడ్డి బురుజు వద్ద శనివారం నాడు 48 గంటల నిరాహార దీక్ష కూడా చేసారు.   ఆయన పార్టీ ప్రస్తుతం తెదేపా, వైకాపా, కాంగ్రెస్ పార్టీల ముందు బలహీనంగా కనిపించవచ్చును. కానీ, ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాజాధానిగా రాయలసీమను గాక వేరే ఏ ఇతర ప్రాంతాన్నోఎంచుకొంటే, అది ఆయన పార్టీకి కలిసివచ్చేఅంశంగా మారవచ్చును. రాయలసీమ నుండి హేమాహేమీలు రాష్ట్రాన్ని ముఖ్యమంత్రులుగా పాలించినప్పటికీ, రాయలసీమ పరిస్థితిలో ఇసుమంత మార్పు రాలేదు. ఇప్పుడు కనీసం రాయలసీమలో రాజధానిని ఏర్పాటు చేయడం ద్వారానయినా సీమ అబివృద్దికి శ్రీకారం చుట్టవచ్చునని బైరెడ్డి వాదన. సీమకు న్యాయం చేయాలనే ఆయన వాదనను అక్కడి ప్రజలెవరూ కాదనరు కూడా.   అందువల్లనే ఆయన సీమకు రాజధాని అనే నినాదంతో ఉద్యమాలకు శ్రీకారం చుట్టారు. ఒకవేళ రాజధానిని సీమలో గాక వేరే ప్రాంతంలో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయిస్తే, అక్కడి ప్రజలు రాజధాని కోసం పోరాడుతున్నఆయన పార్టీవైపు మొగ్గే అవకాశం ఉంది. రాజధాని రేసులో ఇంతవరకు ఒంగోలు, గుంటూరు-విజయవాడ మధ్య ప్రాంతాలు, విశాఖ నగరాల పేర్లే తప్ప రాయలసీమ జిల్లాల పేర్లు వినపడటం లేదు. రాజధానికి నిర్మాణానికి అవసరమయిన భూములు కలిగి ఉన్నందున, మరియు భౌగోళికంగా రాష్ట్రం మధ్యలో ఉన్నకారణంగా ఒంగోలు పేరు ఖరారు అవవచ్చునని అంచనాలున్నాయి.   గనుక, రాయలసీమకు మళ్ళీ అన్యాయం జరుగిందనే బైరెడ్డి వాదనతో సీమ ప్రజలు కూడా ఏకీభవిస్తే, ఇంతవరకు మూడు ప్రధాన పార్టీలకు వేరే ప్రత్యామ్నాయం లేక వాటి మధ్యనే మూడు స్థంబాల ఆట ఆడుకొంటున్నసీమ రాజకీయ నాయకులు కూడా ఆ పార్టీ వైపు ఆకర్షితులవ్వవచ్చును. అయితే బైరెడ్డి తన ఉద్యమాలతో, వాదనతో ప్రజలను ఏమేరకు ఆకట్టుకొంటారనే దానిపైనే అది అఆదారపడి ఉంటుంది. అదేవిధంగా పటిష్టమయిన క్యాడర్, ఆర్ధికంగా మంచి బలమయిన మూడు ప్రధాన పార్టీలను ఎదురొడ్డి డ్డీ కొని నిలిచే శక్తి కూడా తనలో ఉందని ఆయన నిరూపించుకోవలసి ఉంటుంది.   అయితే ఇప్పటికిప్పుడు ఆయన బలీయమయిన రాజకీయ శక్తిగా ఎదగలేక పోయినప్పటికీ, రాష్ట్రవిభజన తరువాత కూడా సీమ జిల్లాలు ఇదేవిధంగా నిర్లక్ష్యానికి గురయినట్లయితే, ఆయన పార్టీ కూడా తెరాస లాగే కాలక్రమంలో బలపడవచ్చును.కానీ అంతకంటే ముందు ఆయన పార్టీ రానున్న ఎన్నికలలో ఓట్లు చీల్చి మూడు ప్రధాన రాజకీయ పార్టీలకు ఎంతో కొంత నష్టం చేకూర్చడం మాత్రం ఖాయం.

ఈ నాన్సెన్స్ అంతా అందుకేనేమో

  ఇటీవల కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నేర చరితులయిన ప్రజా ప్రతినిధులను వెనకేసుకు వస్తూ యూపీయే ప్రభుత్వం ఆమోదించిన ఆర్డినెన్స్ ను “నాన్సెన్స్” అని తీసి పారేయడం, వెనువెంటనే కేంద్ర ప్రభుత్వం దానిని రద్దుచేయడం అంతా యాదృచ్చికంగా జరిగిందేమీ కాదని, రాహుల్ గాంధీని ప్రధాని పీఠంపై అధిష్టింపజేసేందుకే కాంగ్రెస్ ఈ తతంగం అంతా నడిపిందని అనుమానం కలుగుతోంది.   ఆయన ‘నాన్సెన్స్’ తో యుపీయే ప్రభుత్వానికి తాత్కాలికంగా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవలసి వచ్చినప్పటికీ, ఆ నాన్సెన్స్ వల్ల ప్రజలలో ఆయన ఇమేజ్ కొంత పెరిగింది. అధిష్టానానికి భజన చేస్తూ తరించే కాంగ్రెస్ పార్టీ నేతలు ఇదే అదునుగా రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించాలని కోరుతున్నారు.   ఇక గొప్ప ఆర్ధికవేత్త, మేధావిగా పేరున్న ప్రధాని డా. మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీ కోసం తను ప్రధాని పదవి నుండి తప్పుకోవడమే గాక రాహుల్ నేతృత్వంలో పనిచేసేందుకు కూడా సిద్దమేనని నిస్సిగ్గుగా ప్రకటించారు. బహుశః తను తప్పుకోవడానికి ఒప్పుకొన్నాఒప్పుకోకపోయినా రాహుల్ గాంధీ తన కుర్చీపై ముచ్చటపడితే తనను తప్పించడం ఖాయమని గ్రహించినందునే ప్రధాని లౌక్యంగా ఈవిధంగా అని ఉండవచ్చును.   మన్మోహన్ ప్రధాని పదవిలో కొనసాగడం గురించి ఆయన వ్యక్తిగత అభిప్రాయాలను కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ ఖాతరు చేయలేదు. పార్టీలో చిన్నా పెద్దా అందరూ కూడా ఆయన స్థానంలో రాహుల్ గాంధీని కూర్చోబెట్టడం గురించి మాట్లాడుతూ ప్రధాని పదవికే అవమానం కలిగిస్తూ ఆయనకు ఎటువంటి విలువలేదని స్పష్టం చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ డా. మన్మోహన్ సింగ్ దానిని ఎన్నడూ అవమానంగా భావించకపోవడం చాలా విచారకరం. బహుశః ప్రధాని పదవిలో వీలయినంత ఎక్కువ కాలం కొనసాగాలనే కోరిక చేతనే ఆయన ఈ అవమానాలను భరిస్తున్నారేమో తెలియదు.   రాజకీయాలలో నైతిక విలువల గురించి అనర్గళంగా ప్రసంగాలు చేసే రాహుల్ గాంధీ కూడా తమ పార్టీ నేతలు ఈవిధంగా మాట్లాడటాన్నితప్పుగా భావించలేదు. భావించి ఉంటే ఆయన ఆవిధంగా మాట్లాడవద్దని ‘హుకుం’ జారీ చేసేవారు. కానీ చేయలేదు. అంటే ప్రధాని కుర్చీలో నేడు కాకపోతే రేపయినా కూర్చొనే “ప్రాధమిక అర్హత” తనకే ఉందని ఆయన భావించడమే అందుకు కారణం అనుకోవచ్చును.   ఆయన ఇటీవల ఉత్తర ప్రదేశ్ రాష్టంలో జరిగిన ఒక బహిరంగ సభలో ప్రసంగిస్తూ వచ్చే ఎన్నికల తరువాత కేంద్రంలో “యువ ప్రభుత్వం” ఏర్పడపోబోతోందని ప్రకటించారు. అంటే తను ప్రధాని పదవి చెప్పట్టబోతున్నట్లు ఆయనే స్వయంగా ప్రకటించుకొనట్లయింది.   కాంగ్రెస్ భజన మండలి సభ్యులందరూ ఆయన ప్రకటనను స్వాగతిస్తున్నామని చెప్పడానికి పోటీలు పడతారిక. అందరి కంటే ముందుగా హోం మంత్రి షిండే స్వాగతించారు. త్వరలో మిగిలిన వారు స్వాగతిస్తారు. వారందరి కోరిక మేరకు కాంగ్రెస్ అధిష్టానం త్వరలోనే రాహుల్ ను తమ ప్రధాని అభ్యర్ధిగా అధికారికంగా ప్రకటించడంతో ఈ తంతు పూర్తవ్వవచ్చును. బహుశః దీని కోసమే కాంగ్రెస్ పార్టీ ఈ ‘నాన్సెన్స్’ కధంతా నడిపించిందేమో!   అయితే అసలు కేంద్రంలో మళ్ళీ యుపీయే అధికారంలోకి రావడమే “నాన్సెన్స్” అని యువభారత్ అభిప్రాయ పడుతోంది.

ఈ స్టార్ బ్యాట్స్ మ్యాన్ ఎవరి తరపున ఆడుతున్నట్లు

  గత రెండు నెలలుగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కి కాంగ్రెస్ అధిష్టానానికి మధ్య ప్రచ్చన్న యుద్ధం జరుగుతోనే ఉంది. కానీ కాంగ్రెస్ పొమ్మనదు, కిరణ్ వదలడు. ఎవరి కారణాలు, ఆలోచనలు వారికున్నాయి.   తన మాట ఖాతరు చేయకుండా గట్టిగా సమైక్యవాదం వినిపిస్తున్న ముఖ్యమంత్రిపై అధిష్టానానికి పీకల దాక కోపం ఉన్నపటికీ, ఇప్పుడు ఆయనని దింపేస్తే సమైక్య ఉద్యమం మరింత తీవ్రతరం అయ్యే ప్రమాదం ఉంటుందనే భయం, ఇప్పటికే తన సమైక్యవాదంతో జనంలో మంచి పాపులారిటి సంపాదించుకొన్న ఆయనకు కొత్తగా సానుభూతి కూడా తోడయితే చేజేతులా మరో బలమయిన ప్రత్యర్ధిని సృష్టించుకోవడమే అవుతుందనే భయం చేత, ఆయనను పదవి నుండి తప్పించేందుకు కాంగ్రెస్ అధిష్టానం వెనుకంజ వేస్తోందని చెప్పవచ్చును.   ఇక కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఎటూ కాని ఈ సమయంలో చేజేతులా ముఖ్యమంత్రి పదవిని వదులుకొంటే, ఆ తరువాత తను కూడా మిగిలిన సీమాంధ్ర మంత్రుల లాగానే అగమ్యగోచరంగా తిరగాల్సి ఉంటుంది గనుక, అధిష్టానం పొమ్మనే వరకు పదవిలోనే కొనసాగడం మేలనే ఆలోచనతోనే పదవిని అంటిపెట్టుకొని సమైక్యవాదం వినిపిస్తూ తన రేటింగ్ మెరుగుపరుచుకొంటున్నారు.   అదీగాక ఆయన ముఖ్యమంత్రి హోదాలో చేస్తున్న సమైక్యవాదానికి ఒక ప్రత్యేకత, గుర్తింపు, సీమంధ్ర ప్రజల మన్ననలు ఉంటాయి. కానీ అదే పదవికి రాజీనామా చేసి ఎంత గట్టిగా సమైక్యవాదం వినిపించినా ఎవరూ పట్టించుకోక పోవచ్చును.   అదేవిధంగా ఇటువంటి సమయంలో రాజీనామా చేయడం కంటే శాసనసభలో బిల్లు వచ్చినప్పుడు దానిని అడ్డుకొనే ప్రయత్నం చేసిన తరువాత అప్పుడు రాజీనామా చేయడం వలన ప్రజల దృష్టిలో గొప్ప సమైక్యవాదిగా పేరు వస్తే మిగిలిన మంత్రులు, శాసన సభ్యులు గెలిచినా గెలువకపోయినా తాను మాత్రం గెలవడం ఖాయం. ఇక ముఖ్యమంత్రిగా కొనసాగితే యావత్ రాష్ట్ర అధికార యంత్రాంగం తన చెప్పు చేతలలో ఉంటుంది. గనుక తనకు అనుకూలమయిన విధంగా పావులు కదపడం తేలికవుతుంది అనే ఆలోచనా ఉండి ఉండవచ్చును.   అయితే ముఖ్యమంత్రి, అధిష్టానం మధ్య జరుగుతున్న ఈ యుద్ధం అంతా కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ ప్రత్యర్ధులను, సీమాంధ్ర ప్రజలను, ఇంకా చెప్పాలంటే తన సీమంధ్ర నాయకులను పక్కదారి పట్టించడానికి కాంగ్రెస్ అధిష్టానమే రచించిన ఒక పెద్ద డ్రామాలో భాగమేనా అనే అనుమానాలు కొత్తగా తలెత్తాయి.   ఎందుకంటే, అధిష్టానాన్ని దిక్కరిస్తున్నముఖ్యమంత్రిని పదవిలో నుండి గెంటి వేయడం ఇక తప్పదని అందరూ భావిస్తున్నఈ తరుణంలో, సవరించిన ప్రదేశ్ కాంగ్రెస్ సమన్వయ కమిటీని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఈ రోజు అంటే బుధవారం ఆమోదించారు. అందులో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఒక సభ్యుడు.   ఒకవేళ ఆయనని ముఖ్యమంత్రి పదవి నుండి తప్పించాలనే ఆలోచనే కాంగ్రెస్ అధిష్టానానికి ఉండి ఉంటే, ఈ కమిటీని ఇటువంటి తరుణంలో ప్రకటించేది కాదు. ప్రకటించినా అందులో ముఖ్యమంత్రికి స్థానం కల్పించేది కాదు. కానీ ఆ రెండు చేసిందంటే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సీమంధ్ర ప్రజల తరపున గాక కాంగ్రెస్ అధిష్టానం తరపున “స్టార్ బ్యాట్స్ మ్యాన్” గా ఆట ఆడుతున్నారేమో? అనే ధర్మ సందేహం కలుగుతోంది.

రాష్ట్ర విభజన కోసం గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ పేర్లు ఖరారు

  ఒకవైపు సీమంద్రా జిల్లాలు సమైక్యాంధ్ర ఉద్యమాలతో అట్టుడికిపోతుంటే, కేంద్రం మాత్రం రాష్ట్ర విభజనకి రంగం సిద్దం చేస్తోంది. కేంద్రం మొన్న ఖరారు చేసిన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ప్యానల్ ను పూర్తిగా మార్చి ఈరోజు సరికొత్త ప్యానల్ ను ప్రకటించింది.   రక్షణ మంత్రి ఏకే అంటోనీ ఛైర్మన్ గా ఉండే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ లో హోంమంత్రి సుషీల్ కుమార్ షిండే, ఆర్ధిక మంత్రి పీ.చిదంబరం, పెట్రోలియం మరియు గ్యాస్ మంత్రి యం. వీరప్ప మోయిలీ, ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ శాఖా మంత్రి గులాం నబీ ఆజాద్ మరియు పట్టణాభివృద్ది శాఖా మంత్రి జై రాం రమేష్ దీనిలో సభ్యులుగా ఉంటారు. ప్రధాని కార్యాలయానికి చెందిన మంత్రి వ్.నారాయణ స్వామీ ఇందులో ప్రత్యేక ఆహ్వానితులుగా వ్యవహరిస్తారు.   గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ చూడవలసిన అంశాలు:   1. రెండు రాష్ట్రాల సరిహద్దులను గుర్తించడం. రెండు రాష్ట్రాలలో నియోజక వర్గాలను నిర్దారించడం. ఆర్ధిక, అధికారిక, పరిపాలనా పరమయిన వ్యవస్థల నిర్ధారణ చేయడం.   2. రెండు రాష్ట్రాలు హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా చేసుకొని 10సం.లు సజావుగా పాలన చేసుకొనేందుకు వీలుగా అవసరమయిన న్యాయపరమయిన మరియు పరిపాలనా వ్యవస్థలను నిర్దారించడం.   3. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త రాజధానికి అవసరమయిన న్యాయ, ఆర్ధిక, పరిపాలనా ఏర్పాట్లకి సూచనలు, సలహాలు.   4. రెండు రాష్ట్రాలలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి అవసరమయిన సూచనలు, సలహాలు.   5. రెండు రాష్ట్రాలలో శాంతి భద్రతలు, ప్రజల రక్షణకు మరియు రాష్ట్ర విభజన కారణంగా ఏర్పడే దీర్గకాలిక సమస్యల అధ్యనం మరియు వాటికి తగిన పరిష్కారాలు.   6. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటింపబడ్డ పోలవరం ప్రాజెక్టుతో సహా రెండు రాష్ట్రాల మధ్య జలవనరులు మరియు సహజ నిక్షేపాలు (బొగ్గు, నీళ్ళు, గ్యాస్ మరియు చమురు) పంపకాలపై తగిన సలహాలు మరియు ఇతర రాష్ట్రాలతో పంపకాలను పునర్నిర్వచించడం.   7. రెండు రాష్ట్రాల మధ్య విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ వ్యవస్థలకి అవసరమయిన సలహాలు, సూచనలు.   8. రెండు రాష్ట్రాల మధ్య ఆస్తులు, అప్పులు, కేంద్ర ప్రభుత్వ సంస్థల పంపకాలు.   9. రెండు రాష్ట్రాల మధ్య అఖిల భారత ఉద్యోగులతో సహా ఉద్యోగుల నియామకాలు, సర్దుబాట్లలలో ఇమిడి ఉన్నసమస్యలను గుర్తించడం, తగిన పరిష్కారాలు సూచించడం.   10. రాష్ట్ర విభజన నేపద్యంలో ఉద్యోగుల నియామకం, బదిలీలు తదితర అంశాలకు సంబంధించి సెక్షన్ 371డీ జారీ చేయబడిన రాష్ట్రపతి ఆర్డర్ ద్వారా తలెత్తే సమస్యలను అధ్యయనం, పరిష్కారం.   11. రాష్ట్ర విభజన సందర్భంగా తలెత్తే మరే ఇతర సమస్యల అధ్యయనం మరియు పరిష్కారాలు సూచించడం.   ఆరువారాలలోగా ఈ వ్యవహారాలనీటిపై ఒక సమగ్ర నివేదిక ఈయవలసి ఉంటుంది.

చిత్తశుద్ధి లేని శివపూజ లేలయా...రాజీనామా లేలయా

  లక్షలాది ప్రజలు, ఉద్యోగులు సమైక్యాంధ్ర కోరుతూ గత రెండు నెలలుగా ఉద్యమం చేస్తున్నపటికీ, ఇంతకాలంగా తమ కేంద్రమంత్రి పదవులు వదిలిపెట్టడానికి ససేమిరా అంటున్న చిరంజీవి, పురందేశ్వరి, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి నిన్నహోంమంత్రిని, ప్రధానిని కలిసిన తరువాత రాజీనామాలు సమర్పించారు. తమ సెక్యురిటీ, వాహనాలు, ఇతర సిబ్బందిని ప్రభుత్వానికి అప్పగించి, తమ రాజీనామాలు ఆమోదించినా లేకపోయినా ఇక పదవులలో కొనసాగబోవడం లేదని స్పష్టం చేసారు. కేంద్రమంత్రులు పల్లం రాజు, కావూరి, కిల్లి క్రుపారాణీలు కూడా హోంమంత్రిని, ప్రధానిని కలిసినపటికీ వారు తమ రాజీనామాలకై ఒత్తిడి చేయలేదని సమాచారం.   ఇంతకాలంగా రాష్ట్రవిభజనను అడ్డుకొనేందుకు తాము పదవులలో కొనసాగడం అవసరమని చెపుతూ వచ్చిన వీరు, సరిగ్గా అదే మిషతో రాష్ట్ర విభజనకు కడవరకు కేంద్రానికి సహకరించి ఇప్పుడు రాజీనామాలు చేస్తుండటం విశేషం. దానివల్ల రాష్ట్రవిభజన ఆగదని కూడా వారికీ బాగా తెలుసు. విభజన ప్రక్రియ మొదలయిపోయిన తరువాత చేస్తున్నఈ రాజీనామాలు కేవలం ప్రజాగ్రహానికి గురి కాకూడదనే తప్ప విభజనకు వ్యతిరేఖంగా కాదని చిరంజీవి చెప్పిన ఈ మాటలు “ఇప్పటికయినా రాజీనామాలు చేస్తే తప్ప మేము ప్రజలలోకి వెళ్ళ లేమని” స్పష్టం చేస్తున్నాయి.   ఇక కేంద్రమంత్రులు యంపీలు తమ రాజీనామాలు ఆమోదింపజేసుకోలేని పక్షంలో కనీసం తమ అధికారిక వాహనాలను, అధికార నివాసాలను ప్రభుత్వానికి అప్పగించేసే వారి వారి నియోజక వర్గాలకు తిరిగివచ్చేయాలని ఏపీయన్జీవోలు చేసిన డిమాండ్ ప్రభావం కూడా మంత్రులపై కనబడుతోంది. అదేవిధంగా తాము ఇక కేంద్రమంత్రులను, యంపీలను ఎంతమాత్రం విశ్వసించడం లేదని, “కనీసం శాసనసభ్యులయినా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు కృషిచేస్తామని” వారి వారి నియోజకవర్గాలలో ఈనెల 10,11,12 తేదీలలో ప్రజల ముందు ప్రమాణాలు చేయాలని కోరడం కూడా కేంద్రమంత్రులకు రాజీనామాలు చేయక తప్పనిసరి పరిస్థితి కల్పించింది.   ఇదంతా గమనిస్తే మంత్రులు కేవలం ఏపీ యన్జీవోల ఒత్తిడి కారణంగానే ఇప్పుడు రాజీనామాలు చేసి తమ రాజకీయ జీవితాన్నికాపాడుకొనేందుకే ప్రయత్నిస్తున్నారు తప్ప నిజంగా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే చిత్తశుద్దితో లేదా రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేఖిస్తోనో కాదని స్పష్టం అవుతోంది. ఇప్పటికీ ప్రధాని వారి రాజీనామాలు ఆమోదించని కారణంగా వారి పదవులకొచ్చిన ప్రమాదం కూడా ఏమీ లేదు. రేపు పరిస్థితులు చక్కబడితే మళ్ళీ వీరే స్వయంగా వెళ్లి మంత్రుల కమిటీతో చర్చలకు కూర్చొన్నాకూడా ఆశ్చర్యం లేదు.

చంద్రబాబు దీక్షతో కాంగ్రెస్ దిగి వస్తుందా

  తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ అనుచిత వైఖరిని నిరసిస్తూ రేపటి నుండి డిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఆమరణ నిరాహార దీక్షకు కూర్చోబోతున్నారు. సీమాంధ్ర, తెలంగాణా ప్రాంతాల తెదేపా నేతలు కూడా ఈ దీక్షలో పాల్గొనబోతున్నారు. తద్వారా ఆయన దీక్ష తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకి వ్యతిరేఖం కాదనే సంకేతం ఇవ్వాలని ఆ పార్టీ ఆలోచన కావచ్చును. కానీ, తద్విరుద్ధంగా రాష్ట్రంలో ప్రచారం జరగుతోంది.   ఆయన తెలంగాణా రాష్ట్రాన్ని అడ్డుకోవడానికే దీక్ష చేస్తున్నారని టీ-కాంగ్రెస్, తెరాస నేతలు ఆరోపిస్తుంటే, జగన్మోహన్ రెడ్డి “ఆయన చేసే దీక్ష సమైక్యాంధ్ర కోసమేనని” విస్పష్టంగా ప్రకటిస్తే తమ పార్టీ కూడా ఆయన దీక్షకు మద్దతు ఇస్తుందని ప్రకటించి సీమంద్రా ప్రజలలో అనుమానాలు రేకెత్తించే ప్రయత్నం చేసారు. అందువల్ల ఆయన దీక్ష పట్ల రెండు ప్రాంతాల ప్రజలలో ఆశించిన విధంగా ప్రతిస్పందన కలుగలేదు.   చంద్రబాబు తన దీక్షతో రాష్ట్రంలో ఆశించిన విధంగా ఫలితం దక్కించుకోలేకపోయినా, ఈ సమస్యను జాతీయ నేతల, జాతీయ మీడియా దృష్టికి సమర్ధంగా తీసుకు వెళ్ళగలరు. రాష్ట్ర విభజన ద్వారా రెండు ప్రాంతలలో తన పార్టీని దారుణంగా దెబ్బతీయాలని చూస్తున్నకాంగ్రెస్ పార్టీ పన్నుతున్న కుటిలోపాయలను ఆయన బయటపెట్టవచ్చును. అందుకోసం జగన్మోహన్ రెడ్డిని లోపాయకారిగా ఉపయోగించుకొనేందుకు సీబీఐని ఏవిధంగా నిర్వీర్యం చేసినది కూడా ఆయన తన దీక్షలో బయటపెట్టవచ్చును.   ఇప్పటికే, నరేంద్ర మోడీ కాంగ్రెస్ పార్టీకి సీబీఐకి మధ్య విడదీయరాని అనుబంధం ఉందని చెపుతున్న మాటలు ప్రజల హృదయాలలో బలంగా నాటుకొంటున్నాయి. ఇప్పుడు చంద్రబాబు క్లూడా ఇదే విషయం జాతీయ మీడియాకు వివరించడం మొదలుపెడితే, అది త్వరలో డిల్లీతో సహా ఐదు రాష్ట్రాలలో ఎన్నికలను ఎదుర్కోబోతున్న కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరంగా మారుతుంది. ముఖ్యంగా డిల్లీ ఎన్నికలలో దాని ప్రభావం కాంగ్రెస్ పార్టీపై చాలా ఉండవచ్చును.   రాష్ట్రంలో తన పార్టీని దెబ్బతీయ జూస్తున్న కాంగ్రెస్ పార్టీపై చంద్రబాబు ఈవిధంగా ప్రతీకారం తీర్చుకోగలుగుతారు. కానీ చంద్రబాబు దీక్షతో కేంద్రం వెనక్కి తగ్గే అవకాశం లేదని దిగ్విజయ్ సింగ్ తాజా వ్యాఖ్యలు తెలియజేస్తున్నాయి. తెదేపా, వైకాపా రెండూ కూడా రాష్ట్ర విభజనకు అంగీకరిస్తూ లేఖలు ఇచ్చాయని, అటువంటివి ఇప్పుడు విభజనను వ్యతిరేఖిస్తూ చంద్రబాబు, జగన్ దీక్షలు చేయడం కేవలం రాజకీయ ప్రయోజనాలను ఆశించి చేస్తున్నవేనని ఆయన విమర్శించారు.

విభజన వల్లనే సీమంధ్ర ప్రజలు ఆగ్రహిస్తున్నారా

  రాష్ట్ర విభజన వెనుక కాంగ్రెస్ పార్టీకి అనేక ఆలోచనలుండవచ్చుగాక. కానీ దానివల్ల తెలంగాణా ప్రజల చిరకాల స్వప్నం నెరవేరింది. కానీ, ఆ పార్టీ రాష్ట్ర విభజనకు అనుసరించిన పద్దతితో సీమంధ్ర ప్రజల ఆత్మాభిమానం కూడా దెబ్బతింది. ఇరుప్రాంతల రాజకీయనేతల, పార్టీల వాదనలు, ఎత్తుగడలను పక్కన బెట్టి ఆలోచిస్తే, ఇరుప్రాంతల మధ్య సయోధ్యతో పరిష్కరించవలసిన ఒక సంక్లిష్టమయిన సమస్యను కాంగ్రెస్ ప్రభుత్వం తనదయిన శైలిలోనే పరిష్కరించింది. గత 63రోజులుగా లక్షలాది సీమంధ్ర ప్రజలు ఉద్యమాలు చేస్తుంటే, కనీసం వారి ఆగ్రహావేశాలను చల్లార్చేందుకు చిన్నపాటి ప్రయత్నం కూడా చేయకపోవడం వలననే నేడు వారు మరింత ఆగ్రహావేశాలకు లోనవుతున్నారు.   రాష్ట్ర విభజన నిర్ణయం కంటే, కాంగ్రెస్ ప్రభుత్వం తమపట్ల ప్రదర్శించిన అనుచిత వైఖరికే వారి మనసులు గాయపడ్డాయి. ఇటువంటి నిర్ణయాలలో ఒకరికి సంతోషం మరొకరికి బాధ కలగడం సహజమే అనుకొన్నపటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం సీమంధ్ర ప్రజలపట్ల సరయిన విధంగా స్పందించి ఉంటే కనీసం వారిలో ఆ బాధను కొంత మేరయినా తగ్గించగలిగేది. కానీ, కాంగ్రెస్ తన సహజ సిద్దమయిన ఉదాసీన వైఖరి, నిర్లక్ష్యం ప్రదర్శిస్తూ సమస్యను పరిష్కరించాలనుకోవడం చేతనే నేడు సీమంధ్ర ప్రజలు ఇంత ఆగ్రహావేశాలు చూపుతున్నారు.   కాంగ్రెస్ వారితో ప్రవర్తించిన తీరుతో వారు కాంగ్రెస్ ప్రభుత్వం చేత తిరస్కరింపబడి, అవమానింపబడినట్లు భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అనాలోచితంగా ప్రజల అహంపై దారుణంగా దెబ్బ తీసింది. మీడియా ముందుకి వచ్చి మాట్లాడుతున్నప్రజలలో ఇదే భావన ప్రస్పుటంగా కనిపిస్తోంది.   అయితే, రానున్న ఎన్నికలలో పార్టీపై ఇది తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని తెలిసిఉన్నపటికీ, కాంగ్రెస్ పార్టీకి తన వ్యూహాలు తనకు ఉండటం చేతనే ఉద్యమిస్తున్న ప్రజల మనోభావాలను పట్టించుకోకుండా ముందుకు సాగగలిగిందని చెప్పవచ్చును. లేకుంటే ఏ రాజకీయ పార్టీ కూడా ఒక ప్రాంత ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి మరో ప్రాంతంలో తనకు తాను సమాధి కట్టుకోదు.

మాటల గారడీ చేస్తున్నకాంగ్రెస్ పార్టీ

  యూపీయే ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్ ను ప్రజాభీష్టం మేరకు కేంద్ర మంత్రి మండలి రద్దు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి మనిష్ తివారీ మీడియాకు తెలియజేసారు. “తమ ప్రభుత్వం ప్రజాభీష్టం మేరకే నడుచుకొంటుందని, ప్రజాభిప్రాయానికి అత్యంత గౌరవం ఇస్తుందని, అందుకే ప్రభుత్వం ఆర్డినెన్స్ ను రద్దు చేసిందని ఆయన మీడియాకు తెలియజేసారు. ఆయన చిలకలా చాలా చక్కగా పడికట్టు పదాలు కొన్ని వల్లె వేసారు. కానీ అలా ఎందుకు చేయవలసి వచ్చిందో అందరికీ తెలుసు. అయితే ఈ ప్రకటన చేస్తున్నపుడు ఆయన చెప్పిన మాటలు మరికొన్ని కొత్త ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి.   ఆయన చెప్పినట్లు రాహుల్ గాంధీ ఆక్షేపించడం వలన కాక, నిజంగా ప్రజాభీష్టం మేరకే యుపీయే ప్రభుత్వం నిర్ణయాలు తీసుకొనేమాటయితే, మరి గత రెండు-మూడేళ్ళుగా తెలంగాణా ప్రజలు ఉద్యమాలు చేస్తున్నపుడు ప్రభుత్వం వెంటనే ఎందుకు స్పందించలేదు? మళ్ళీ గత రెండు నెలలుగా లక్షలాది సీమంధ్ర ప్రజలు రాష్ట్రాన్ని విభజించవద్దని ఉద్యమాలు చేస్తుంటే, ఎట్టి పరిస్థితుల్లో మా నిర్ణయం మారదని అంత ఖరాఖండిగా ఎందుకు చెపుతున్నారు?   రాష్ట్ర సమస్యలను పరిష్కరించడానికి మిగిలిన అన్ని రాష్ట్రాలకు చెందిన నేతల సలహాలు తీసుకొంటున్న కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్రానికి చెందిన నేతలను ఎందుకు లెక్కలోకి తీసుకోవడం లేదు? అసలు కాంగ్రెస్ హై కమాండ్ లో ఒక్క తెలుగు వాడికి కూడా ఎందుకు చోటు కల్పించలేదు? పార్టీలో అత్యంత సీనియర్ నేత, కేంద్ర మంత్రి, మేధావి అయిన జయపాల్ రెడ్డి వంటి వ్యక్తిని కూడా ఎందుకు పరిగణనలోకి తీసుకోదు?   రాష్ట్ర సమస్యలను పరిష్కరించలేకపోతే కనీసం ప్రజలతో మాట్లాడాలని కూడా ఇంతకాలం ఎందుకు ప్రయత్నం కూడా ఎందుకు చేయలేదు? అంటే లక్షలాది ప్రజల మాట కంటే, ఒక్క రాహుల్ గాంధీ మాటే కాంగ్రెస్ పార్టీకి, యుపీయే ప్రభుత్వానికి ముఖ్యమని, దానికే ప్రాధాన్యం ఇస్తుందని అర్ధం అవుతోంది.   ఇక నుండి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీని ‘అవినీతి నిరోధక మహాశయా’ అని కీర్తించవచ్చు. కానీ, రాజకీయాలలో అవినీతికి వ్యతిరేఖంగా గొంతెత్తి ప్రభుత్వ నిర్ణయాలు మార్చుకోనేలాచేయగలిగిన ఆయన, అదే చొరవను రాష్ట్ర ప్రజల సమస్యల పట్ల ఎందుకు చూపడం లేదు? అదేవిధంగా గత రెండు మూడేళ్ళుగా రాష్ట్రం ఉద్యమాలతో అతలాకుతలమవుతున్నపటికీ ఆయన ఈ విషయంతో తనకు అసలు సంబంధం లేనట్లు ఎందుకు వ్యవహరిస్తున్నారు?   ఆయనకు ఇష్టమున్నా లేకునా కాంగ్రెస్ పార్టీ ఆయనను ప్రధాని కుర్చీలో కూర్చోబెట్టుకోవాలని తహతహలాడుతోంది. అటువంటప్పుడు ఆయన తప్పనిసరిగా యావత్ దేశ సమస్యల పట్ల స్పందించవలసి ఉంటుందని తెలుసుకోవాలి.    

హస్తానికి బురద అంటకుండా పనికానిస్తోందా

  తెలంగాణా ఉద్యమాలు జోరుగా సాగుతున్న సమయంలో కూడా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రోజుకో కొత్త పధకం ప్రవేశపెడుతూ తన స్వంత ఇమేజ్ పెంచుకొనే ప్రయత్నాలు చేసారని స్వయంగా ఆయన క్యాబినెట్ మంత్రులే చాలా బాధపడ్డారు. ముఖ్యమంత్రి మానస పుత్రిక ‘బంగారుతల్లి’ దెబ్బకి మంత్రి డీయల్ రవీంద్రా రెడ్డి తన పదవినే కోల్పోవలసి వచ్చింది.   ఇక ముఖ్యమంత్రి పదవి దక్కకపోతే పాయె కనీసం హోంమంత్రి పదవయినా దక్కించుకొందామని ప్రయత్నించిన బొత్స, దామోదర రాజనరసింహలకు ముఖ్యమంత్రి సైంధవుడిలా అడ్డం పడినప్పటి నుండి వారూ ఆయన మీద కోపంగానే ఉన్నారు. తెలంగాణా వ్యతిరేఖిస్తున్నారనే వంకతో దామోదర రాజనరసింహులవారు ముఖ్యమంత్రిని తిట్టిన తిట్టు తిట్టకుండా రోజూ తిడుతూ తన పగ తీర్చుకోగలుగుతున్నారు. కానీ పాపం బొత్సకు మాత్రం ఆ అవకాశం లేకుండా పోయింది.   ఇక వట్టి వసంత కుమార్ తనకి వట్టి పనికిరాని పర్యాటక శాఖను కట్టబెట్టారని మొదటినుండే అలిగిఉన్నారు. పైగా నిన్నగాక మొన్నరాజకీయాలలోకి, ఆ తరువాత పార్టీలోకి వచ్చిన చిరంజీవి మళ్ళీ ఇప్పుడు పార్టీలో కూడా మెగా స్టార్ అయిపోవడం, అది కూడా తనకే బాస్ అవడం జీర్ణించుకోవడం అంత వీజీ కాదని వట్టి మాట. ఇక గ్యాంగ్ లీడర్ చిరంజీవి ముఖ్యమంత్రిపై కోపానికి సవాలక్ష కారణాలున్నాయి.   ఈవిధంగా మొత్తం “కిరణ్ బాధిత సంఘం’ (కి.భా.సం.) సభ్యులందరూ మొన్న ఆర్ధిక మంత్రి ఆనం వారి విందులో పాల్గొని సోనియమ్మకు వీరవిధేయులుగా తమను తాము ప్రకటించుకొని ఎవరికి వారు ‘వీరత్రాళ్ళు’ వేసేసుకొన్నారు. ముఖ్యమంత్రి మంచోడే.. కానీ అంటూ ఆయన చేస్తున్న పనేమీ బాలేదని సూత్రీకరించారు. హైకమండ్ మాట అంటే శిలాశాసనమే, దానిని ఎవరూ దిక్కరించరాదు అని చెప్పి, అలా దిక్కరించిన ముఖ్యమంత్రిని ‘రిప్లేస్’ చేసేందుకు తామందరమూ సిద్దంగా ఉన్నామని అధిష్టానానికి కాకి (బొత్స) ద్వారా కబురంపారు.   అదేవిధంగా సోనియమ్మకి తాము ఎంత వీర విధేయత ప్రకటించినప్పటికీ, ఆమె తమని గేటు లోపలకి కూడా రానీయదని తెలిసున్నకి.భా.సం. సభ్యులు, ఆమె ఇంటిలో ప్రవేశానికి ‘పర్మనెంట్ పర్మిషన్ కార్డ్ హోల్డర్’ అయిన తమ గ్యాంగ్ లీడర్ చిరంజీవిని వెంటనే పంపించి అంటోనీ కమిటీని రాష్ట్ర పర్యటనకి పంపాల్సిందిగా సోనియమ్మను ప్రార్దించబోతున్నారు. తద్వారా కిరణ్ కొట్టేస్తున్న సమైక్యాంధ్ర క్రెడిట్ లోంచి తమ వాటా తాము క్లెయిం చేసుకోవచ్చని వారి ఆలోచన.   అదే సమయంలో అధిష్టానం ఆదేశాలను తూచా తప్పకుండా పాటించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడం ద్వారా రాష్ట్ర విభజనకు కిరణ్ ఒప్పుకోకపోతే మేమున్నామని స్పష్టం చేసారు. తద్వారా సీమంద్రాలో వారి రాజకీయ భవిష్యత్త్ మాటెలా ఉన్నపటికీ, సాటి తెలంగాణా నేతలందరి చేత ముందుగా దండలు వేయించుకొనే గొప్ప సదావకాశం పొందగలుగుతున్నారు.   “జబ్ మియ్యా బీబీ రాజీ హై తో క్యా కారేగా ఖాజీ” (మొగుడు పెళ్ళాలు రాజి పడితే ఇక ఖాజీ మాత్రం ఏమి చేయగలడు?) అనే సూత్రం ప్రకారం సీమంద్రా, తెలంగాణా మంత్రులు ఈవిధంగా ఒకరికొకరు సహకరించుకొంటే, ఇక హైకమాండ్ మాత్రం ఎందుకు కాదంటుంది? కాగల కార్యం గందర్వులే తీర్చారంటే ఇదేనేమో అని తృప్తిగా ఒక నిట్టూర్పు విడిచి, రెండు నెలలుగా వెనక్కి తగ్గమని చెపుతున్నపటికీ, ముందుకు కూడా కదలలేని స్థితిలో ఉన్నతమను ముందుండి ముందుకు నడిపించేందుకు వస్తున్న సీమంధ్ర నేతలకు మరో వీర త్రాడు వేయడం ఖాయం.   ఇంత పెద్ద సమస్యని తన హస్తానికి బురద అంటకుండా చక్కబెట్టినందుకు గాను కి.భా.సం.లో ఎవరికో ఒకరికి “ఆరు నెలల ముఖ్యమంత్రి పదవి”ని బహుమానంగా ప్రకటించవచ్చును. మళ్ళీ జీవితంలో ఇటువంటి అవకాశం రాదని భావించేవారెవరయినా అందుకు అర్హులే.   చివరాకరిగా ఓ ధర్మ సందేహం మిగిలిపోయింది. ఈ ‘కి.భా.సం.’ ఐడియా నిజంగా వారి బాధ నుండి పుట్టుకొంచిందా లేక అందులో కూడా హైకమాండ్ హస్తం ఉందా అని?

Is Rahul’s nonsense is really a nonsense?

  All the political parties in the country, especially BJP lashes at Congress party for its vice president Rahul Gandhi’s ‘nonsense remark’ made against the ordinance passed by the UPA government for shielding the convicted politicians.   Many have described it as humiliation to Prime Minister Dr. Manmohan Singh’s government, which passed the ordinance. They describe Rahul Gandhi has tried to showcase his supremacy over his government by suggesting to tore and throw the ordinance into dust bin, that has been passed by Dr.Manmohan Singh government.   They also pointed out at the timing of his remarks leaves the Prime Minister embarrassed, who is now representing the government in talks with international leaders. Congress critics have also condemned Prime Minister’s poor response to Rahul Gandhi, which is in surrendering mode.   However, Rahul Gandhi’s ‘nonsense’ is reflecting the big sense of the Congress party. At a time, when BJP has declared Narendra Modi as its PM candidate, setting aside the objections of all its seniors like Advani, Sushma and others, Congress party stood inconclusive about its PM candidate Rahul Gandhi, who is refusing to take charge.   So, the Congress party has pushed Rahul Gandhi forward only as a part of its game plan to showcase his supremacy over the government so that he emerges as the undisputed leader of the party and government. And all most all the political leaders and parties have acknowledged him by spontaneously reacting to his sensible nonsense talk.   Probably, Congress may direct Rahul Gandhi towards PM chair, even though he shows no interest for it, because there is no alternative for it to take upon the mighty Narendra Modi. Further, his nonsense earns him applauses from youth and creates a big heroic image for him, who fights out baddies in the country.

కాంగ్రెస్ ఉదాసీనత, ఉద్యోగులకు అగ్నిపరీక్ష

  సమైక్యాంధ్ర కోసం ఏపీఎన్జీవోలు మొదలుపెట్టిన నిరవధిక సమ్మె దాదాపు రెండు నెలలు గడుస్తున్నా ఏమాత్రం జోరు తగ్గకపోగా ఇప్పుడు కొత్తగా కేంద్రప్రభుత్వ ఉద్యోగులు కూడా వారికి తోడవుతున్నారు. ఒకవైపు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, సీమంధ్ర కాంగ్రెస్ నేతలు ఎంతగా అడుగుతున్నపటికీ, కేంద్రం మాత్రం ఇంత వరకు వారితో చర్చించేందుకు కూడా ముందుకు రాలేదు. ఏమయినా సమస్యలుంటే అంటోనీ కమిటీకి వెళ్లి చెప్పుకోండని వారికి ఒక ఉచిత సలహా పడేసి చేతులు దులుపుకొంది. నిన్న ముఖ్యమంత్రి కూడా ఇదే విషయాన్నీప్రస్తావిస్తూ కేంద్ర వైఖరిని తప్పుపట్టారు. రాష్ట్ర విభజనపై కేంద్రం ఏ విధమయినా నిర్ణయమయినా తీసుకోవచ్చును. కానీ ముందు రాష్ట్రానికి రధచక్రాలు వంటి ఉద్యోగులతో సంప్రదింపులు మొదలుపెట్టడానికి వెనకాడుతుండటంతో వారు చాలా ఆగ్రహంతో ఉన్నారు.   వారితో సంప్రదింపులు మొదలుపెడితే అది తన ఓటమిని అంగీకరించినట్లేనని కాంగ్రెస్ అధిష్టానం భేషజానికి పోవడంచేతనో లేక అది తెలంగాణా ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపిస్తుందని భయం చేతనో మొత్తం మీద కాంగ్రెస్ అధిష్టానం సమ్మె చేస్తున్నఉద్యోగుల పట్ల చాలా నిర్లక్ష్య, నిర్లిప్త వైఖరిని ప్రదర్శిస్తోంది. దీనివలన ఉద్యోగులలో కాంగ్రెస్ పార్టీ పట్ల ఒక విముఖత భావం ఏర్పడటంతో, ఇదే అదునుగా వైకాపా వారిని మంచి చేసుకొనే ప్రయత్నాలు మొదలుపెట్టింది.   అయితే నేటికీ ఉద్యోగులు అన్ని రాజకీయపార్టీలను సమాన దూరంలో ఉంచాలని భావిస్తున్నారు. అయితే అనేక వ్యయప్రయాసలకు ఓర్చి సుదీర్ఘపోరాటం చేస్తున్నఉద్యోగులకు ఏ రాజకీయ పార్టీ మద్దతు లేని కారణంగానే, కేంద్రప్రభుత్వానికి ఇంత అలుసుగా కనిపిస్తున్నారన్నది వాస్తవం. రాష్ట్ర విభజన చేస్తున్న కాంగ్రెస్ పార్టీని కానీ, ఆ పార్టీతో చేతులు కలిపే ఆలోచనతో ఉన్న వైకాపాతో గానీ, సమైక్యాంధ్రకు నిర్ద్వందంగా మాట ఇవ్వలేకపోతున్న తెదేపాతో గానీ వారు చేతులు కలుపలేకపోవడంతో వారు కాంగ్రెస్ అధిష్టానానికే కాక తెరాసకు కూడా లోకువయిపోయారు.   ఇటువంటి పరిస్థితుల్లో ఉద్యోగులు తమ పోరాటం కొనసాగించాలంటే తప్పని సరిగా సరయిన పార్టీ మద్దతు తీసుకోవడం చాలా అవసరం. ఇంతవరకు చాల ఐకమత్యంగా పోరాటం చేసినప్పటికీ, వారి పోరాటం తుది దశకు చేరుకొన్న ఈ తరుణంలో మరింత అప్రమత్తతో, మరింత ఐకమత్యంతో సరయిన నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగవలసి ఉంటుంది.

అవును, నేను సమైక్యవాదినే!

  ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మళ్ళీ మరోమారు సమైక్యవాదం బలంగా వినిపించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన ఈసారి నేరుగా దిగ్విజయ్ సింగ్ ను కూడా విమర్శించారు.   “ఈమధ్య దిగ్విజయ్ సింగ్ స్టేట్‌మెంట్లు ఇస్తున్నారు. నేను సమైక్యాంధ్ర ముఖ్యమంత్రిగా పనిచేయాలని ఆయన సూచిస్తున్నారు. అవును, నేను ఖచ్చితంగా సమైక్యాంధ్ర ముఖ్యమంత్రినే! ఆయన అలా అన్నప్పుడల్లా నాలో సమైక్యవాదం మరింత బలపడుతుంది. నేను, ఆయన కూడా మా పదవులలో శాశ్వితంగా ఉండబోము. నాకు నా పదవి కంటే, నా రాజకీయ భవిష్యత్ కంటే, రాష్ట్ర ప్రజల శ్రేయస్సే ముఖ్యం. అందుకే రాష్ట్రం విడిపోకూడదని కోరుకొంటున్నాను. నేను సోనియా గాంధీ దిక్కరించాలనో లేక అధిష్టానం మీద కోపంతోనో ఈవిధంగా మాట్లాడటం లేదు. కేవలం సమస్యలని పరిష్కరించకుండా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని మాత్రమే చెపుతున్నాను."   "నాకు సోనియా గాంధీ వల్లే ఈ పదవి వచ్చిన సంగతిని ఎన్నడు మరిచిపోను. కానీ, రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం ఇప్పడు ఆ పదవి వదులుకొని జీవితాంతం మాజీ ముఖ్యమంత్రిగా నిలిచిపోవడానికి కూడా నేను సిద్ధం, “ అని ముఖ్యమంత్రి అన్నారు.   “రాష్ట్ర విభజనకు నిర్ణయం ప్రకటించిన నాటి నుండి ఇంతవరకు నేను లేవనెత్తిన ఏ ఒక్క అంశంపై కూడా కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇవ్వాలని భావించలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎవరూ విడదీయలేని విధంగా గట్టి చిక్కుముళ్ళు అనేకం వేసి ఏర్పాటు చేసారు. గనుక రాష్ట్ర విభజన అంత తేలిక కాదు. అందుకే ఇందిరా గాంధీ కూడా ఏనాడు ఇటువంటి ఆలోచనలు చేయలేదు. సీడబ్ల్యూసీ నిర్ణయం శిలా శాసనం అయినట్లయితే, మరి నెహ్రూ, ఇందిరల నిర్ణయాలు అటువంటివి కావా? అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు.”   నీళ్లు బాగా వచ్చినప్పుడు ఏ సమస్యా లేదు, నీళ్లు లేనప్పుడే అసలు సమస్య ప్రారంభమవుతుంది, రాష్ట్రం విడిపోతే జలయుద్ధాలు తీవ్రమవుతాయి. రాష్ట్ర విభజన జరిగితే ఉద్యోగుల ప్రమోషన్ల పైనా, సీనియారిటీపైనా వాటి ప్రభావం ఉంటుందని ఆయన చెప్పారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు పించను ఎలా ఇస్తారన్నది కూడా ఇప్పటివరకూ కేంద్రం చెప్పలేకపోయిందని, ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు వాటిని ఏవిధంగా పరిష్కరించగలదో కేంద్రమే చెప్పాలని ఆయన అన్నారు.   ఉద్యోగుల సమ్మెతో వారు వారి కుటుంబాలే కాక ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారని అందువలన వెంటనే సమ్మె విరమించాలని ఆయన ఉద్యోగులకు విజ్ఞప్తి చేసారు.

జగన్ చేతిలో కాంగ్రెస్ హస్తం నలిగిపోనుందా

  రాజాం యంపీ సాయి ప్రతాప్, అమలాపురం యంపీ హర్షకుమార్, విజయవాడ యంపీ లగడపాటి అందరూ నిఖార్సయిన కాంగ్రెస్ వాదులే. అయినా అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి విషయంలో ఆదిష్టాన వైఖరిని తీవ్రంగా తప్పుపడుతున్నారు. సిద్ధాంతాల ప్రకారం ముందుకు సాగల్సిన కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు రానున్నఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఓట్లు,సీట్లు ప్రాతిపదికన నిర్ణయాలు తీసుకోవడం చాలా శోచనీయమని సాయి ప్రతాప్ అన్నారు. దీనివలన తాత్కాలికంగా పార్టీ కొంత ప్రయోజనం పొందినా దీర్గ కాలంలో తీవ్రంగా నష్టపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు.   ఇక దివాకర్ రెడ్డి అయితే మరో అడుగు ముందుకు వేసి, రాష్ట్రంలో అసలు కాంగ్రెస్ పార్టీ మిగిలి ఉంటే కదా! ఎన్నికలలో పోటీ చేయడానికి? అన్నారంటే కాంగ్రెస్ పరిస్థితి అర్ధం అవుతోంది. ఇక హర్షకుమార్ మాట్లాడుతూ అధిష్టానం జగన్మోహన్ రెడ్డి కోసం ఏకంగా పార్టీనే బలి చేస్తోందని, కాంగ్రెస్ పార్టీకి వైకాపాలు రెండు తెర వెనుక కుమ్మక్కు అయ్యాయా లేదా అనే సంగతి రాష్ట్రంలో ఇప్పుడు చిన్న పిల్లాడిని అడిగినా చెప్పగలడని అన్నారు.   సమైక్యాంధ్ర పేరుతో పావులు కదుపుతూ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్నివిడగొట్టేందుకు కుట్రలు పన్నుతున్నారని, అందుకే తన పార్టీ యం.ఎల్.ఏ.లతో రాజినామాల డ్రామా మొదలుపెట్టడాని, అతనితో చేతులు కలిపి కాంగ్రెస్ అధిష్టానం పార్టీని రాష్ట్రంలో భ్రష్టు పట్టిస్తోందని, తమ రాజకీయ జీవితాలతో చెలగాటమాడుతోందని ఆయన ఆరోపించారు.   అదేవిధంగా సమైక్యవాదిగా ముద్రపడ్డ లగడపాటి కాంగ్రెస్-వైకాపాల మధ్య ఉన్న అనైతిక బంధం గురించి మీడియా ప్రశ్నించినపుడు ఆ విషయంపై ఇప్పుడేమి మాట్లాడలేనని, కానీ తమ రాజీనామాలు ఆమోదింపజేసుకొన్న తరువాత చాలా విషయాలు బయటపెడతానని అయన అన్నారు. అంటే ఆయన కూడా కాంగ్రెస్-వైకాపాల మధ్య జరిగిన రహస్య ఒప్పందాలను ఖండించడం లేదని, త్వరలోనే ఆయన కూడా అధిష్టానంపై బాంబులు వేయబోతున్నారని స్పష్టం అవుతోంది.   ఇక ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా అధిష్టానానికి వ్యతిరేఖంగా మొన్న మరో మారు గళం విప్పారు. ప్రజాభీష్టానికి వ్యతిరేఖంగా, ప్రజాందోళనలను ఖాతరు చేయకుండా ముందుకు సాగితే రాష్ట్రంలో పార్టీ బ్రతికి బట్ట కట్టడం అసాధ్యమని ఆయన మీడియా ముందే మరో మారు కుండ బ్రద్దలు కొట్టినట్లు చెప్పారు.   కాంగ్రెస్ అధిష్టానం తలచిందొకటి, కానీ జరుగుతున్నది మరొకటి. రాష్ట్ర విభజనతో రెండు రాష్ట్రాలలో ప్రతిపక్ష పార్టీలను భూస్థాపితం చేద్దామనుకొంటే, ఇప్పుడు పార్టీలోనే తీవ్ర వ్యతిరేఖతను ఎదుర్కోవలసి వస్తోంది. తనను వ్యతిరేఖిస్తున్నముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని, సీమంధ్ర నేతలను కట్టడి చేయడానికి, జగన్మోహన్ రెడ్డికి బెయిలు ఇచ్చి రంగంలోకి దింపితే, అది మరింత వ్యతిరేఖతను పెంచింది. ఇంతవరకు కేవలం రాష్ట్ర విభజన కారణంగానే కాంగ్రెస్ అధిష్టానాన్ని వ్యతిరేఖిస్తున్న సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కారణంగా నేరుగా పార్టీ అధిష్టాన్నానే ధిక్కరిస్తున్నారు.   దీనికంతటికీ కారణం కాంగ్రెస్ అధిష్టానం యొక్క రాజకీయ దురాశ, అతి తెలివి తేటలు, రాష్ట్ర సమస్యల పట్ల అవగాహణా లోపమే. అందువల్లే ఒక సమస్యను పరిష్కరించే ప్రయత్నంలో మరిన్నికొత్త సమస్యలు సృష్టించుకొంటోంది. బహుశః దీనినే వినాశకాలే విపరీత బుద్ధి అని అనాలేమో!

రాష్ట్ర విభజనతో రాష్ట్రంలో కాంగ్రెస్ దుఖాణం బంద్ కాబోతోందా

  కాంగ్రెస్ పార్టీ పేరుకి జాతీయ పార్టీ అయినా క్రమంగా ఒక ప్రాంతీయ పార్టీ స్థాయికి కుచించుకుపోతోంది. కారణం ఆ పార్టీ వేస్తున్నతప్పటడుగులే తప్ప ప్రతిపక్షాలు బలంగా ఉండటం వలన మాత్రం కాదు. రాష్ట్ర విభజనపై చాలా లోతుగా అధ్యయనం చేసిన తరువాతనే చేస్తున్నామని కాంగ్రెస్ పార్టీ చెపుతున్నపటికీ రాష్ట్రంలో జరుగుతున్నపరిణామాలు మాత్రం ఆ పార్టీ ఏమాత్రం ముందు చూపు లేకుండా నిర్ణయం తీసుకొందని స్పష్టం చేస్తున్నాయి. విభజన నిర్ణయాన్ని అమలు చేయడంలో జరుగుతున్నజాప్యం వలన తెలంగాణాలో, విభజన చేస్తున్న కారణంగా సీమాంద్రాలో పార్టీ నష్టపోబోతోందని రెండు ప్రాంతాల నేతలు కాంగ్రెస్ అధిష్టానాన్ని పదేపదే హెచ్చరిస్తున్నారు.   ఈ పరిస్థితుల్లో ఎటువంటి నిర్ణయం తీసుకొన్నా మొదట నష్టబోయేది కాంగ్రెస్ పార్టీయే తప్ప అది ఊహించినట్లు ప్రాంతీయ పార్టీలు కావు. ఈ సంగతి కాంగ్రెస్ పార్టీకి తెలియకపోలేదు. అందుకే తెరాస, వైకాపాలను కాంగ్రెస్ లో విలీనం లేదా పొత్తుల కోసం అంత ఆరాటపడుతోంది. కానీ గత కొంత కాలంగా మళ్ళీ తెలంగాణాలో ఉద్యమ సెగలు రాజుకోవడం చూసిన కేసీఆర్ కాంగ్రెస్ పార్టీతో కనీసం పొత్తులకి కూడా ఇష్టపడటం లేదు. అంటే, కాంగ్రెస్ పార్టీ తెలంగాణాలో ఒంటరి పోరు చేయక తప్పదన్నమాట.   ఇక, విభజన ప్రకటన తరువాత సీమాంద్రాలో అకస్మాత్తుగా మారిన పరిస్థితులు చూసిన కాంగ్రెస్ అధిష్టానం చాలా కలవరపడుతోంది. కానీ పైకి మాత్రం తన సహజ సిద్దమయిన మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోంది. ఎన్నికలలో పోటీ చేయడం మాట అటుంచి కాంగ్రెస్ తరపున కనీసం నామినేషన్లు వేయడానికి కూడా చాలా సాహసం ఉండాలని అక్కడి కాంగ్రెస్ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఈ సంకట స్థితి నుండి బయటపడేందుకే కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డిని బయటకు తీసుకు వచ్చిరంగంలో దింపిందిప్పుడు.   అయితే ఇంతకాలంగా అతనిని జైలులో నిర్భందించి, ఇప్పుడు తనకు అవసరం పడింది గనుక బయటకు తెచ్చినంత మాత్రాన్నఅతను కాంగ్రెస్ పార్టీని క్షమించేయలేడు. మొదటి నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిపై కన్నేసిన జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి, సోనియా గాంధీ ముందు చేతులు కట్టుకొని నిలబడి ఆమె కనుసన్నలలో పని చేస్తూ ఆ పార్టీతో అధికారం పంచుకొంటాడని అంతకంటే నమ్మకం లేదు. అందువలన కాంగ్రెస్ పార్టీతో విలీనం కాదు కదా కనీసం పొత్తులకి కూడా అతను ఇష్టపడకపోవచ్చును. అప్పుడు సీమాంద్రాలో కూడా కాంగ్రెస్ ఒంటరిగా మిగిలిపోవచ్చును.   రాష్ట్ర విభజనతో తెరాసను,తెదేపాలను దెబ్బతీద్దామనుకొన్నకాంగ్రెస్ తన అసమర్ధ, అనాలోచిత నిర్ణయాలతో ఆ రెండు పార్టీలకే మేలు చేయడమే కాకుండా,ఇప్పుడు రాష్ట్రం నుండి జెండా పీకేసుకొనే పరిస్థితి స్వయంగా కల్పించుకొంది. మళ్ళీ ఉద్యమ సెగలు రాజుకొంటున్న నేపధ్యంలో తెలంగాణాలో తెరాస బలపడితే, రాష్ట్ర విభజన చేస్తున్నకాంగ్రెస్ పార్టీతో వైకాపాకున్నఅనైతిక సంబంధాల కారణంగా ప్రజలు తెదేపా వైపుమొగ్గు చూపే అవకాశాలున్నాయి.   అందువలన రానున్న ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పార్టీ మరి కొంత కుచించుకుపోయి తెలంగాణాలో తెరాసకు తోకపార్టీగా, సీమంద్రాలో ఎవరయినా నేతలు గెలిస్తే ప్రతిపక్ష పార్టీగా మిగిలిపోవచ్చును. ఈ దుస్థితి చేజేతులా సృష్టించుకొన్నదే గనుక ఇక కాంగ్రెస్ ఎవరినీ నిందించవలసిన పనిలేదు కూడా.

జగన్ ఎపీయన్జీవోలతో సయోధ్య కోరితే

  ఇంతవరకు వైకాపా చేపట్టిన సమైక్యాంధ్ర ఉద్యమాలు ఆశించినంత స్థాయిలో ప్రజలపై ప్రభావం చూపలేకపోయాయని ఇటీవల షర్మిల పార్టీ అంతర్గత సమావేశంలో అన్నట్లు సమాచారం. సమైక్య ఉద్యమాల ద్వారా రాష్ట్రాన్నికలిపి ఉంచాలనే ఆశయం కంటే, ఆ ఉద్యమాల ద్వారా తమ పార్టీని సీమాంద్రాలో బలపరుచుకోవాలనే ఆత్రమే వారిలో ఎక్కువ కనిపిస్తోంది. చివరికి ఆ పార్టీ నేతలు, అధ్యక్షుడితో సహా అందరూ తమ పదవులకు రాజీనామాలు చేసినా కూడా ప్రజలు, ఉద్యోగులు కూడా నమ్మడం లేదు. అందుకే వారు ఇంతకాలం వైకాపాను దూరం పెడుతున్నారు. అయితే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విడుదలతో ఆ పరిస్థితి మారే అవకాశం ఉంది.   రానున్న ఎన్నికలలో ఎట్టి పరిస్థితుల్లో వైకాపా గెలిచి తీరాల్సిన అవసరం ఉంది. లేకుంటే జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ సీబీఐ కష్టాలు మొదలవుతాయి. గనుక గెలుపే లక్ష్యంగా అతను ముందుకు సాగనున్నాడు. ప్రస్తుతం అందివచ్చిన సమైక్యాంధ్ర ఉద్యమాలతో పార్టీని ప్రజలకు మరింత చేరువచేసేలా అతను వ్యూహాలు రచించవచ్చును.   ఇంతవరకు ఏపీయన్జీవోలు, ప్రజలు సమైక్యాంధ్ర కోసం చేస్తున్న నిరవధిక సమ్మె, ఉద్యమాలను జగన్మోహన్ రెడ్డి తన చేతిలోకి తీసుకొనే ప్రయత్నం చేసినప్పుడు, ఉద్యోగులలో చీలికలు ఏర్పడినట్లయితే, అది ఘర్షణ వాతావరణానికి దారి తీయవచ్చును. అయితే సీమాంద్రాకే పరిమితమయిన వైకాపా రానున్న ఎన్నికలలో ఘన విజయం సాధించి అధికారం చేపట్టాలంటే ఏపీయన్జీవోల సహకారం కూడా చాలా అవసరం ఉంటుంది గనుక వారిని దూరం చేసుకొనే సాహసం చేయకపోవచ్చును.   ఇంతవరకు వైకాపా వారికి దగ్గరయ్యేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోయినప్పటికీ, త్వరలో జగన్మోహన్ రెడ్డి మరోమారు గట్టి ప్రయత్నమే చేయవచ్చును. ఇక రెండు నెలలుగా అవిశ్రాంత పోరాటం చేసి అలిసున్నఏపీయన్జీవోలు కూడా జగన్ సరయిన రీతిలో ముందుకు వస్తే వారు కూడా అతనిని ఆదరించే అవకాశాలున్నాయి. ఇంతవరకు ఏపీయన్జీవోలు తమ నిరవధిక సమ్మెతో రాష్ట్రవిభజనను నిలువరించగలుగుతున్నారు కానీ కాంగ్రెస్ అధిష్టానాన్ని తన నిర్ణయం వెనక్కు తీసుకోనేలా మాత్రం ఒప్పించలేకపోతున్నారు. ఇటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి కూడా వారికి అండగా నిలబడేందుకు ముందుకు వచ్చినట్లయితే వారు అతనిని ఆహ్వానించినా ఆశ్చర్యం లేదు.   ఒకవేళ తమ పోరాటం విఫలమయ్యి రాష్ట్ర విభజన జరిగి, వైకాపా అధికారంలోకి వచ్చేఅవకాశాలున్నట్లు వారు భావిస్తే, అతనికి మద్దతు నీయడం ద్వారా వారి ఉద్యోగ ప్రయోజనాలు కూడా నెరవేరే అవకాశం ఉంది, గనుక వారు వైకాపాను ఉద్యమంలోకి ఆహ్వానించవచ్చును. అయితే, వైకాపా ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తులు లేదా మద్దతుకు అంగీకరించబోదని జగన్ ముందుగా వారికి హామీ ఈయవలసి ఉంటుంది.   ఒకవేళ వారి మధ్య సయోధ్య కుదిరినట్లయితే, ఇది కాంగ్రెస్, తెదేపాలకు పెద్ద ఎదురు దెబ్బ అవుతుంది.