దర్శనం మొగులయ్యకు కేటీఆర్ భరోసా

  పద్మశ్రీ అవార్డు గ్రహీత, తెలంగాణ జానపద కళాకారుడు దర్శనం మొగులయ్యకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. మొగులయ్య ఈరోజు కేటీఆర్ నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆరోగ్యంపై కేటీఆర్ ఆరా… కంటి చికిత్స హామీ మొగులయ్య ఆరోగ్యం, యోగక్షేమాల గురించి కేటీఆర్ ఆరా తీశారు. ఈ సందర్భంగా మొగులయ్య తన కంటిచూపు మందగించిందని, చికిత్స కోసం ఇబ్బందులు పడుతున్న విషయాన్ని కేటీఆర్ దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే స్పందించిన కేటీఆర్, మొగులయ్యకు హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్ ఐ హాస్పిటల్‌లో పూర్తి చికిత్సను అందించే బాధ్యతను తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. మొగులయ్య ఇంటి స్థలం సమస్యపై కలెక్టర్‌కు కేటీఆర్ ఫోన్ అనంతరం మొగులయ్య, గత ప్రభుత్వం తనకు హయత్ నగర్ మండలంలో కేటాయించిన 600 గజాల స్థలం విషయంలో కొంతమంది వ్యక్తుల నుండి ఎదురవుతున్న ఇబ్బందులు, కోర్టు కేసుల వివరాలను కేటీఆర్‌కు వివరించారు. గత ప్రభుత్వం కోట్లాది రూపాయల విలువైన భూమిని తనకు ఉచితంగా అందిస్తే దీన్ని కొంతమంది కబ్జాదారులు కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారని మొగులాయి అన్నారు.  తాను కట్టుకున్న గోడలను ఇంటిని కూడా కులగోట్టారని, కోర్టు కేసులు వేసి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు గత ప్రభుత్వం ఇచ్చిన స్థలాన్ని కాపాడాలని కేటీఆర్ కి విజ్ఞప్తి చేశారు. ఈ అంశంలో అనేకసార్లు కలెక్టర్ల దృష్టికి తీసుకువెళ్లిన తనకు పరిష్కారం దొరకలేదని, తనకు అండగా నిలవాలని కోరారు.  దీనిపై తక్షణమే స్పందించిన కేటీఆర్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డికి ఫోన్ చేసి మాట్లాడారు. మొగులయ్యకు గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం కేటాయించిన భూమి విషయంలో కొందరు వ్యక్తులు కోర్టుల్లో కేసులు వేసి ఇబ్బందులకు గురిచేస్తున్నారని కలెక్టర్‌కు తెలిపారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించి, మొగులయ్యకు న్యాయం చేయాలని కోరారు.  అలాగే, మొగులయ్య ఆ స్థలంలో కట్టుకున్న గదిని కూడా కొంతమంది కూల్చివేసిన పరిస్థితి ఉందని మొగులయ్య చెప్పారని పేర్కొన్నారు. మొగులయ్య భూమికి, ఆయన కుటుంబానికి తగిన రక్షణ కల్పించాలని కలెక్టర్‌కు మాజీ మంత్రి సూచించారు. అవసరమైతే, మొగులయ్యకు ఎదురవుతున్న న్యాయపరమైన కేసులను ఎదుర్కొనేందుకు కూడా సహాయం అందిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. కేసీఆర్‌కు మొగులయ్య కృతజ్ఞతలు ఈ సందర్భంగా మొగులయ్య కేటీఆర్‌తో మాట్లాడుతూ, ఒకప్పుడు లింగాల అడవుల్లో 12 మెట్ల కిన్నెర వాయించుకునే తనకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రేమతోనే గుర్తింపు దక్కిందని తెలిపారు. బీఆర్‌ఎస్ అధినేత  తనను గుర్తించి ఉగాది పురస్కారం ఇచ్చి గౌరవించడం వల్లనే తన కళ ప్రపంచం దృష్టికి చేరిందని, తదనంతరం పద్మశ్రీ అవార్డు కూడా దక్కిందని పేర్కొన్నారు. కేసీఆర్ తమ కుటుంబం కోసం చేసిన సహాయానికి, తమ కష్టాలన్నీ తీర్చినందుకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని, ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. తన ఇంటి స్థలం వివాదాన్ని పరిష్కరించి, కోర్టు కేసుల విషయంలో సహాయం చేయాలని మొగులయ్య కేటీఆర్‌ను విజ్ఞప్తి చేశారు.

స్వచ్ భారత్‌లో అనుకోని అతిథి...చిన్నారుల ఆనందం

  రాష్ట్ర వ్యాప్తంగా మూడవ శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం ప్రహసనంలా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ శనివారం నాడు జరిగిన కార్యక్రమం వాయు కాలుష్యానికి వ్యతిరేకంగా ప్రత్యేకంగా చేస్తున్న నేపథ్యంలో  కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పర్యటనలో ఆసక్తికర సంఘటన జరిగింది.  శనివారం నాడు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేశారు. పలు శంకుస్థాపనలు, అభివృద్ధి కార్యక్రమాలలో స్థానిక ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తో కలసి పాల్గొన్నారు. నరసన్నపేట నియోజకవర్గం సారవకోట మండలంలో పర్యటిస్తున్న సమయంలో నౌతల కూడలి లో చిన్నారులు చేస్తున్న స్వచ్ఛంద్ర కార్యక్రమం కేంద్ర మంత్రి దృష్టిని ఆకర్షించింది.  వాయు కాలుష్యానికి వ్యతిరేకంగా నినదిస్తూ.. సైకిళ్లలతో చిన్నారులు ర్యాలీ చేపట్టడం అక్కడి వారిని ఆలోచింపజేసింది. ఈ నేపథ్యంలో తన కాన్వాయ్ ను ఆపి చిన్నారులతో ముచ్చటించారు. మంచి కార్యక్రమం చేస్తున్నారంటూ కితాబిచ్చారు. ప్రతీ ఒక్క చిన్నారి మొక్కలను కూడా నాటాలని కోరారు.  సమాజ హితం కోసం చిన్నారులు చేస్తున్న ఈ కార్యక్రమంలో అనుకోని అతిథిగా కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు రావడంతో ఆ చిన్నారులు ఉబ్బితబ్బిబ్బి అవుతున్నారు.

భారత్‌ క్షిపణిలకు పాక్ తప్పించుకోలేదు : రాజ్‌నాథ్‌ సింగ్‌

   భారత సైన్యం అమ్ములపొదిలో మరిన్ని బ్రహ్మోస్‌ క్షిపణులు చేరాయి. ఉత్తర్‌ప్రదేశ్‌  రాజధాని లఖ్‌నవూలో బ్రహ్మోస్‌ ఏరోస్పేస్‌ యూనిట్‌ను రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సందర్శించారు. ఇక్కడ తొలి విడత బ్రహ్మోస్‌ క్షిపణులను ఉత్పత్తి చేశారు. వీటిని రాజ్‌నాథ్ సింగ్ సైన్యానికి అప్పగించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఆపరేషన్ సింధూర్  కేవలం ట్రైలర్ మాత్రమేనని పాకిస్తాన్ హెచ్చరించారు.  దాయాదులు దుస్పాహసాని తెగబడితే ఊహించని ప్రతిస్పందన ఉంటుందని హెచ్చరించారు. భారత్‌ సైన్యం పరాక్రమం అప్రతిహతం. మనకు ఉన్న ఆధునిక క్షిపణి సామర్థ్యాల ముందు శత్రువులు తప్పించుకోలేరని  రక్షణ మంత్రి  అన్నారు.ఇదే సందర్బంగా బ్రహ్మోస్ బృందం ఒక నెలలోనే రెండు దేశాలతో రూ.4 వేల కోట్ల ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు వెల్లడించారు. “తొలిసారి విదేశీ నిపుణులు లఖ్‌నవూకు రానున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఈ యూనిట్ టర్నోవర్ రూ.3 వేల కోట్లు దాటుతుంది. ప్రతి ఏటా రూ.5 వేల కోట్ల మేర జీఎస్టీ వసూలు అవుతుంది” అని రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారు.

ఉమేష్ చంద్ర హత్యలో ఆశన్న కుట్ర పథకం

అది 1999 సెప్టెంబ‌ర్ 4. స్థలం ఎస్సార్ న‌గ‌ర్ జంక్ష‌న్. ఎప్ప‌టిలాగానే ఐపీఎస్ ఉమేశ్ చంద్ర‌.. త‌న మారుతీ వ్యాన్ లో  డ్యూటీకి బ‌య‌లుదేరారు. ఇంత‌లో అనుకోని ఒక దాడి.   ఎప్ప‌టి నుంచో కాపు కాచిన న‌క్స‌ల్స్ యాక్ష‌న్ టీమ్.. ఒక్క‌సారిగా కాల్పుల మోత మోగించింది. డ్రైవ‌ర్, ఉమేష్ పీఏ అక్క‌డిక‌క్క‌డే చ‌నిపోగా.. ఆయుధం లేని ఉమేష్ చంద్ర‌.. వెంట‌నే కారు బ‌య‌ట‌కొచ్చి.. న‌క్సల్స్ ని ప‌ట్టుకుందామ‌ని ప్ర‌య‌త్నించారు. క‌ట్ చేస్తే ఆయ‌న ద‌గ్గ‌ర ఆయుధం లేద‌ని గుర్తించిన న‌క్స‌ల్స్.. వెంట‌నే ఆయ‌న మీదకు ఎదురు దాడికి తెగ‌బ‌డ్డారు. దీంతో వెన‌క్కు త‌గ్గిన ఆయ‌న ద‌గ్గ‌ర‌కు వచ్చి కాల్పులు జ‌రిపారు. దీంతో ఉమేష్ చంద్ర‌  మ‌ర‌ణించారు. ఈ మొత్తం యాక్ష‌న్ ప్లాన్ వెన‌క కీల‌క సూత్ర‌ధారి మ‌రెవ‌రో కాదు.. శుక్ర‌వారం (అక్టోబర్ 17) లొంగిపోయిన ఆశ‌న్న‌. వీళ్లు మొత్తం మూడు యాక్ష‌న్ టీములుగా ఏర్ప‌డి.. మూడు నెల‌ల పాటు రెక్కీ నిర్వ‌హించి.. ఈ దాడికి పాల్ప‌డ్డారు. అదెంత‌గా అంటే, ఏకంగా ఉమేష్ చంద్ర ఇంట్లోకి కూర‌గాయ‌ల వాళ్ల రూపంలో ఇత‌ర‌త్రా ప‌నివాళ్ల రూపంలో చొర‌బ‌డేంత‌. క‌ట్ చేస్తే ఆయ‌న క‌ద‌లిక‌లేంటి? ఏయే స‌మ‌యాల్లో నిరాయుధంగా వెళ్తుంటారు. ఏ రూట్లో వెళ్తుంటారు వంటి అనుపానుల‌న్నీ ప‌సిగ‌ట్టిన మరీ ఉమేష్ చంద్రను హతం చేశారు. ఈ మొత్తం వ్యవహారం అంతా ఆశ‌న్న నాయ‌క‌త్వంలోనే జరిగింది. కార‌ణ‌మేంట‌ని చూస్తే ఉమేష్ చంద్ర‌కు క‌డ‌ప పులి అన్న పేరుండేది. అంతే కాదు.. ఆయ‌న న‌క్సల్స్ ప్ర‌భావిత ప్రాంతాలైన వ‌రంగ‌ల్, క‌రీంన‌గ‌ర్ ప్రాంతాల్లో పోలీసు ఉన్న‌తాధికారిగా ప‌ని చేశారు. న‌క్స‌ల్స్ పై ఉక్కు పాదం మోపారు. ఇది మ‌న‌సులో పెట్టుకున్న న‌క్స‌లైట్లు ఆయ‌న్న హ‌త‌మార్చ‌డానికి చేసిన పథక రచన సూత్రధారి ఆశన్నే.  అయితే ఆశ‌న్న కూడా ఆనాడే పోలీస్ ఎన్ కౌంట‌ర్లో చ‌నిపోయి ఉండేవాడు. అప్ప‌టికీ పోలీసు ఇన్ఫార్మ‌ర్ల ద్వారా ఈ దాడిలో పాల్గొన్న యాక్ష‌న్ టీమ్ స‌భ్యులు వెళ్తున్న ఆటోను అట‌కాయించిన పోలీసులు. వారిని కాల్చి చంపేశారు. అయితే వెన‌కే బైక్ పై మ‌రొక‌రితో వ‌స్తున్న ఆశ‌న్న ఇది గుర్తించి.. అటు నుంచి అటే ప‌రారయ్యాడు. దీంతో ఇన్నాళ్ల పాటు పోలీసుల‌కు చిక్క‌కుండా, అజ్ణాతంలో గడిపిన ఆశన్ని ఇప్పుడు ఆయుధాలు అప్పగించి సరెండర్ అయ్యారు.  ఇదీ ఉమేష్ చంద్ర మ‌ర‌ణానికి ఆశ‌న్న‌కూ ఉన్న సంబంధం.

నారా లోకేష్ ఆస్ట్రేలియా టూర్

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ఆరు రోజుల పాటు ఆస్ట్రేలియాలో పర్యటించనున్నారు. స్పెషల్ విజిట్స్ ప్రోగ్రాం లో పాల్గొనేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం తరఫున అందిన ఆహ్వానం మేరకు లోకేష్ ఈ పర్యటన చేస్తున్నారు. ఇటీవలే ఆస్ట్రేలియా ప్రభుత్వం తరఫున ఆ దేశ హైకమిషనర్ మంత్రి లోకేష్ ను ఆహ్వానించిన సంగతి తెలిసిందే.  మానవ వనరులు, సాంకేతిక, ఆర్థికాభివృద్ధి రంగాల్లో ఏపీ నాయకత్వాన్ని ప్రశంసించిన ఆస్ట్రేలియా ప్రభుత్వం..  స్పెషల్ విజిట్స్ ప్రోగ్రామ్ లో భాగస్వామ్యం కావాలని మంత్రి నారా లోకేష్ ను కోరింది. ఇందులో భాగంగా మంత్రి లోకేష్ ఈ నెల 19 నుంచి 24 వరకూ ఆస్ట్రేలియాలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా లోకేష్  అక్కడ  విశ్వవిద్యాలయాలను సందర్శించి అక్కడ అనుసరిస్తున్న  విద్యావిధానాలపై అధ్యయనం చేస్తారు.  పర్యటనలో భాగంగా లోకేశ్ ఆస్ట్రేలియాలోని పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులతో సమావేశమవుతారు.  అలాగే, బిజినెస్ కౌన్సిల్ ఆఫ్ ఆస్ట్రేలియా, ఆస్ట్రేలియా ఇండియా బిజినెస్ కౌన్సిల్ ప్రతినిధులు, వివిధ రంగాల పారిశ్రామికవేత్తలతో సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాలను వివరిస్తారు. అదే విధంగా యూనివర్సిటీ ఆఫ్ న్యూసౌత్ వేల్స్, వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీ, గ్రిఫిత్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ మెల్‌బోర్న్ వంటి ప్రముఖ విద్యాసంస్థలను సందర్శిస్తారు. రాష్ట్రంలో క్రీడా మౌలిక సదుపాయాల కల్పనపై కూడా ఈ పర్యటనలో దృష్టి సారించనున్నారు. ఏపీలో అత్యాధునిక స్పోర్ట్స్ స్టేడియం నిర్మాణంపై అక్కడి ప్రముఖ ఆర్కిటెక్ట్‌లతో చర్చలు జరపడంతో పాటు మెల్‌బోర్న్, విక్టోరియా క్రికెట్ మైదానాలను పరిశీలిస్తారు. ఈ నెల‌ 19న సిడ్నీలో జరిగే తెలుగు ప్రవాసుల సమావేశంలో  కూడా లోకేష్ పాల్గొంటారు.  24 రాత్రి మెల్బోర్న్ నుంచి బయలుదేరి 25 రాత్రికి హైదరాబాద్ చేరుకుంటారు.

ప్రశాంతంగా తెలంగాణ బంద్.. ర్యాలీలో జారిపడిన వీహెచ్

బీసీ సంఘాల పిలుపు మేరకు శనివారం (అక్టోబర్ 18) జరుగుతున్న తెలంగాణ బంద్ ప్రశాంతంగా జరుగుతోంది. అన్ని రాజకీయ పార్టీలూ బంద్ కు సంపూర్ణ మద్దతు ఇవ్వడమే కాకుండా బంద్ లో పాల్గొన్నాయి. ఇక బంద్ సందర్భంగా బస్సులన్నీ డిపోలకే పరిమితం కావడంతో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బంద్ లో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. ఆమె తన నివాసం నుంచి ఆటోలో ఖైరతాబాద్ చౌరస్తా వరకూ వచ్చి అక్కడ రోడ్డుపై బైఠాయించారు. ఇక అంబర్ పేటలో బంద్ సందర్భంగా జరిగిన ర్యాలీలో పాల్గొన్న కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వీహననుమంతరావు జారి పడ్డారు.  బంద్ సందర్భంగా జరిగిన ర్యాలీలో  పాల్గొన్న వీహెచ్ ఫెక్సీ పట్టుకుని నడుస్తుండగా అంబర్ పేట వద్ద అదుపు తప్పి కింద పడిపోయారు. వెంటనే కార్యకర్తలు ఆయనను లేవదీసి సపర్యలు చేశారు. అనంతరం ఆయన యథావిధిగా ర్యాలీలో పాల్గొన్నారు.  

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసుల తీరుపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.  పౌరులను అక్రమంగా నిర్బంధించడం, వారిపై దాడి చేయడం పోలీసులకు ఒక అలవాటుగా మారిందని  తీవ్ర వ్యాఖ్యలు చేసింది.  కర్నూలు జిల్లా చిప్పగిరి గ్రామానికి చెందిన గొల్ల జయపాల్ యాదవ్‌ను 2016లో సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకుని తీవ్రంగా కొట్టారని, ఆ దెబ్బల కారణంగా బాధితుడు ఎనిమిదేళ్లు గడిచినా ఇప్పటికీ సరిగా నడవలేని దుస్థితిలో ఉన్నాడని కోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. తనను చిత్రహింసలకు గురిచేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని జయపాల్ 2016లో ఫిర్యాదు చేస్తే, ఇన్నేళ్లయినా ఆ కేసులో తుది నివేదిక దాఖలు చేయకపోవడంపై న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్  ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పోలీసుల పనితీరును ఉదహరిస్తూ న్యాయమూర్తి  ఇటీవల హైకోర్టులో పనిచేసే డ్రైవర్‌పై మంగళగిరి సీఐ దాడి చేశారు. మేము జోక్యం చేసుకుని జిల్లా ఎస్పీని పిలిపించి మాట్లాడితే తప్ప కేసు నమోదు చేయలేదన్నారు.  జయపాల్ కేసులో కర్నూలు ఎస్పీ, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్‌ను కోర్టుకు హాజరుకావాలని ఆదేశించిన తర్వాతే, ఈ నెల 14న పోలీసులు సంబంధిత కోర్టులో తుది నివేదిక దాఖలు చేశారని న్యాయమూర్తి పేర్కొన్నారు. అనంతరం విచారణను ఈ నెల 24వ తేదీకి వాయిదా వేస్తూ కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్‌కు కోర్టు హాజరు నుంచి మినహాయింపు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 

గరీభ్ రథ్ ఎక్స్ ప్రెస్ లో అగ్ని ప్రమాదం

      గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్‌ రైలులో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటన పంజాబ్‌లో  సిర్హింద్ రైల్వే స్టేషన్ సమీపంలో  శనివారం చోటుచేసుకుంది.  అమృత్‌సర్ నుంచి సహర్సా వెళుతున్న గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ రైలు   అంబాలాకు అర కిలోమీటరు దూరంలో ఉండగా, ఒక బోగీ నుంచి దట్టమైన పొగలు రావడాన్ని సిబ్బంది, ప్రయాణికులు గమనించారు. దీంతో వెంటనే అప్రమత్తమైన లోకో పైలట్ రైలును నిలిపివేశారు. ప్రయాణికులు వెంటనే కిందకి దిగిపోయారు. ఈ సమాచారం అందుకున్న  అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రయాణికులను సకాలంలో రైలు నుంచి దిగిపోవడంతో ప్రాణనష్టం జరగలేదు.  అయితే మూడు బోగీలు ఈ ప్రమాదంలో పూర్తిగా కాలిపోయాయి. ప్రమాదకారణాలేమిటన్నది వెంటనే తెలియరాలేదు.  ఈ ప్రమాదం కారణంగా ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు  అంతరాయం ఏర్పడింది.  

బీసీ సంఘాల తెలంగాణ బంద్.. డిపోలకే పరిమితమైన బస్సులు

బీసీ సంఘాల ఐక్యకార్యాచరణ పిలుపు మేరకు శనివారం (అక్టోబర్ 18) తెలంగాణ బంద్ జరుగుతోంది. ఈ బంద్ కు అన్ని పార్టీలూ మద్దతు ప్రకటించాయి.  బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పనపై హైకోర్టు ఇచ్చిన స్టేను నిరసిస్తూ బీసీ సంఘాల జేఏసీ పిలుపు మేరకు జరుగుతున్న తెలంగాణ బంద్ కు ప్రభుత్వం కూడా మద్దతు ప్రకటించింది. బంద్ సందర్భంగా ఉదయం నుంచీ బస్సులన్నీ డీపోలకే పరిమితమైపోయాయి. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలు మూతపడ్డాయి. వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నాయి.   కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లు ఇచ్చేందుకు తాము చేయాల్సినన్నీ చేస్తున్నామని ..బంద్‌కు మా మద్దతు ఉంటుందని ప్రకటించింది. అలాగే బీఆర్ఎస్ కూడా బంద్ కు మద్దతు తెలిపింది. ఇక ఈ బంద్ కు నేతృత్వం వహిస్తున్న బీసీ సంఘాల ఐక్యకార్యాచరణ వేదికకు కన్వీర్ సాక్షాత్తూ బీజేపీ రాజ్యసభ సభ్యుడైన ఆర్ కృష్ణయ్యే  కావడంతో బీజేపీ కూడా బంద్ ను సమర్శించినట్లే అయ్యింది.    

చిట్టీల పేరుతో రూ.150 కోట్లకు టోకరా.. డాక్టర్ దంపతుల నిర్వాకం

చిట్టీల పేరుతో జనాలను 150 కోట్ల రూపాయలకు మోసం చేసిన డాక్టర్ దంపతుల ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పేరుకు ఇద్దరూ వైద్యులే అయినా.. ఆ వృత్తితోనే నమ్మించి జనాలను నిలువునా ముంచేశారు. హైదరాబాద్ నిజాంపేట బండారీ కాలనీ లే ఔట్ లో క్లినిక్ ఏర్పాటు చేసిన డాక్టర్ రేష్మ, డాక్టర్ అలీ దంపతులు.. చిట్టీల పేరుతో దాదాపు వంద మందిని దగా చేసి 150 కోట్ల రూపాయలు దండుకుని బిచాణా ఎత్తేశారు.    చిట్టీల కాలపరిమితి పూర్తయినా డబ్బులు ఇవ్వకపోవడంతో బాధితులు క్లినిక్ కు వచ్చారు. అయితే అప్పటికే ఈ కిలాడీ దంపతులు బిచాణా ఎత్తేశారు. దీంతో నిలువునా ముంచేశారని గ్రహించిన  బాచుపల్లి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ వైద్య జంటపై ఇప్పటి వరకూ 42 మంది ఫిర్యాదు చేశారు. అయితే ఈ కిలాడీ జంట బాధితుల సంఖ్య భారీగానే ఉంటుందని అంటున్నారు. చిట్టీల పేరుతో ఒక్కొక్కరి నుంచి 50 వేల నుంచి పది లక్షల వరకూ వసూలు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. కేసు నమోదు చేసిన పోలీసులు రేష్మ-అలీ దంపతుల కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు.

శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు

కలియుగ ప్రత్యక్ష  దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల పుణ్యక్షేత్రం నిత్యం భక్తులతో కిటకిటలడుతుంటుంది. స్వామివారి దర్శనానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ, విదేశాల నుంచి కూడా భక్తులు పొటెత్తుతుంటారు. అటువంటి తిరుమల క్షేత్రంలో శనివారం (అక్టోబర్ 18) శ్రీవారి దర్శనానికి వేచి ఉన్న భక్తులతో వైకుంఠం కాంప్లెక్స్ లోని 20 కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులకు శ్రీవారి దర్శనానికి నాలుగు గంటలకు పైగా సమయం పడుతోంది.  ఇక శుక్రవారం (అక్టోబర్ 17) శ్రీవారిని మొత్తం 66 వేల 675మంది దర్శించుకున్నారు. వారిలో 24 వేల 681 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3కోట్ల 32 లక్షల రూపాయలు వచ్చింది.  

చరమాంకంలో మావోయిస్టు తీవ్రవాదం.. మోడీ

దేశంలో మావోయిస్టు తీవ్రవాదం చరమాంకంలో ఉందని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. ముందుగా చెప్పినట్లుగానే వచ్చే ఏడాది మార్చి నాటికి భారత్ నక్సల్ విముక్త దేశంగా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు. భారత్ కు మావోయిస్టు తీవ్రవాద పీడ పూర్తిగా తొలగిపోతుందన్నారు.  ఢిల్లీలో శుక్రవారం (అక్టోబర్ 17) జరిగిన ఎన్డీటీవీ   వరల్డ్ సమ్మిట్‌లో మోడీ మాట్లాడారు.  దశాబ్దాలుగా దేశ అభివృద్ధికి మావోయిజం  శాపంగా మారిందన్న ఆయన.. గత కొన్నేళ్లుగా దేశంలో మావోయిస్టుల ప్రాబల్యం గణనీయంగా తగ్గిందన్నారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలలో అభివృద్ధి శకం మొదలైందన్నారు. ఈ ఫలితమే.. కేవలం 72 గంటల వ్యవధిలో 303 మంది మావోయిస్టుల లొంగుబాటు అని మోడీ పేర్కొన్నారు.  వారంతా ఇప్పుడు భారత రాజ్యాంగాన్ని విశ్వసించి జనజీవన స్రవంతిలో కలిసేందుకు సిద్ధమయ్యారని వివరించారు. గత కాంగ్రెస్ హయాంలో 'అర్బన్ నక్సల్స్  మావోయిస్టుల ఘోరాలను కప్పిపుచ్చారన్న ప్రధాని.. ఇటీవల మావోయిస్టు బాధితులు ఢిల్లీకి వచ్చి తమ గోడును వినిపించుకోవడానికి ఏడు రోజుల పాటు ప్రయత్నించారని, కొందరు కాళ్లు, చేతులు కోల్పోయిన పేద రైతులు, గిరిజనులు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి తమ గొంతును ప్రజలకు చేర్చమని వేడుకున్నారని గుర్తుచేశారు. 50 ఏళ్లుగా మావోయిస్టుల దాడుల వల్ల ఎన్నో మారుమూల ప్రాంతాల్లో పాఠశాలలు, ఆసుపత్రులు, కనీస మౌలిక సదుపాయాలు లేకుండా పోయాయని అన్నారు. ఒకప్పుడు దేశంలో 125 జిల్లాలలో  మావోయిస్టుల ప్రాబల్యం ఉండేదనీ, ఇప్పుడు వారి ప్రాబల్యం కేవలం 11 జిల్లాలకు పరిమితమైందన్న మోడీ.. వాటిలో కూడా మావోయిస్టుల బలం ఎక్కువగా ఉన్న జిల్లాలు మూడంటే మూడేనని చెప్పారు.   అభివృద్ధి, భద్రతల తమ ప్రభుత్వానికి సమ ప్రాధాన్యతాంశాలన్న ప్రధాని మోడీ  మావోయిస్టుల కంచుకోట బస్తర్‌లో గిరిజనులు ఇప్పుడు 'బస్తర్ ఒలింపిక్స్' నిర్వహిస్తుండటమే సాంస్కృతిక పునరుజ్జీవనానికి నిదర్శనంగా అభివర్ణించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఈఏడాది  దీపావళిని ప్రజలు నిర్భయంగా, ప్రశాంతంగా, ఆనందంగా జరుపుకుంటారని మోడీ అన్నారు.  

టీవీకే విజయ్ కరూర్ పర్యటన వాయిదా.. ఎందుకంటే?

తమిళగ వెట్రి కజగం(టీవీకే) అధినేత విజయ్   కరూర్ పర్యటన వాయిదా పడింది. వాస్తవానికి ఆయన శుక్రవారం (అక్టోబర్ 17)న కరూర్ లో పర్యటించి గత నెల 27న టవీకే ప్రచార సభలో జరిగిన తొక్కిసలాటలో మరణించిన వారి బంధువులను పరామర్శించాల్సి ఉంది. అయితే చివరి నిముషంలో విజయ్ తన పర్యటన వాయిదా వేసుకున్నారు. ఇంతకీ ఆయన పర్యటన వాయిదాకు కారణమేంటంటే.. 41 మంది మరణానికి కారణమైన కరూర్ తొక్కిసలాట ఘటనపై సుప్రీం ఆదేశాల మేరకు కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ దర్యాప్తు చేపట్టింది.  సీబీఐ అధికారులు దర్యాప్తులో భాగంగా శుక్రవారమే (అక్టోబర్ 17) కరూర్ చేరుకున్నారు.  ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్  సీబీఐ అదనపు డీఎస్పీలు ముఖేష్ కుమార్,  రామకృష్ణన్‌ దర్యాప్తులో భాగంగా  కరూర్ చేరుకున్నారు. వీరు సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేస్తారు. అలాగే కరూర్ సభ సందర్భంగా భద్రత, రద్దీ నియంత్రణలో వైఫల్యాలు, తమిళనాడు పోలీసులు మంజూరు చేసిన అనుమతులను తొక్కిసలాటకు సంబంధించిన సీసీ ఫుటేజీలు పరిశీలిస్తారు. ఈ నేపథ్యంలోనే దర్యాప్తునకు ఆటంకం కలిగించవద్దన్న ఉద్దేశంతో టీవీకే అధినేత విజయ్ తన పర్యటనను వాయిదా వేసుకున్నారు.  

బిగ్ బాస్ షో పై ఫిర్యాదు.. హౌస్ ను ముట్టడిస్తామని హెచ్చరిక

టీవీలో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ షో పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. గజ్వేల్ కు చెందిన కమ్మరి శ్రీనివాస్, రవీందర్ రెడ్డి, సుకుమార్ రెడ్డి, చంద్ర శేఖర్, శ్రీనివాస్ లు ఈ ఫిర్యాదు చేశారు. బిగ్ బాస్ షో సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తుందని, షోకు ఎంపిక అయిన వారిలో కొందరికి సమాజంలో విలువ లేదనీ వారా ఫిర్యాదులో పేర్కొన్నారు.   బిగ్ బాస్ బృందం కుటుంబ విలువలు పాటించని వారిని షోకు ఎంచుకుంటోందని  ఆరోపించారు. దివ్వెల మాధురి, రీతూ చౌదరి లాంటి వారిని సెలక్ట్ చేసుకొని బిగ్ బాస్ సమాజానికి ఎలాంటి సందేశాన్ని ఇస్తుందని   అభ్యంతరాలు లేవనెత్తారు. సమాజం సిగ్గు పడే విధంగా నిర్వాహకులు బిగ్ బాస్ షో నిర్వహిస్తున్నారని, వెంటనే బిగ్ బాస్ షోను నిలిపివేయాలని కోరారు. బిగ్ బాస్ పై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. లేకపోతే బిగ్ బాస్ హౌస్ ను ప్రజా సంఘాలు, మహిళా సంఘాలతో కలిసి ముట్టడిస్తామని హెచ్చరించారు. కర్ణాటకలో చేసిన విధంగా ఇక్కడ కూడా బిగ్ బాస్ బ్యాన్ చెయ్యాలన్నారు.  

బంద్ సందర్భంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించం.. డీజీపీ హెచ్చరిక

బీసీ సంఘాలు శనివారం నిర్వహించతలపెట్టిన తెలంగాణ బంద్ కార్యక్రమాన్ని శాంతియుతంగా జరుపుకోవాలని రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు. బంద్ పేరుతో ఎవరైనా అవాంఛనీయ ఘటనలకు కానీ, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు గానీ పాల్పడినా, శాంతి భద్రతలకు విఘాతం కలిగించినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  పోలీస్ సిబ్బంది, నిఘా బృందాలు ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షణ చేస్తాయన్నారు. బంద్ సందర్భంగా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సమస్యలు  ఎదురవ్వకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు.

శ్రీవారికి కొప్పెర హుండీ కానుక

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారికి భక్తులు అనేక రకాలుగా కానుకలు సమర్పించుకుంటారు.   ధనం.. బంగారం.. వెండి.. ఇంకా అనేకంగా ముడుపులు కట్టి భక్తితో సమర్పించుకుంటారు. అయితే తిరపతి సమీపంలోని కొప్పెర‌వాండ్లప‌ల్లె కొప్పెర వంశస్థలు మాత్రం శ్రీవారికి హుండీ సమర్పించడం  వంశపారపర్యంగా వస్తున్న ఆచారం.  అందులో భాగంగానే శ్రీవారికి శుక్రవారం (అక్టోబర్ 17) కొప్పెర హుండీ విరాళంగా అందించారు.   కొప్పెర‌వాండ్లప‌ల్లెకు చెందిన  కొప్పెర సాయిసురేష్‌ ఈ   హుండీని ఆలయంలో పోటు పేష్కార్ మునిరత్నంకు అందజేశారు. రాగి, ఇత్తడితో క‌లిపి త‌యారుచేసిన ఈ హుండీ బ‌రువు 70 కిలోలు ఉంటుంది.  దీని విలువ రెండున్నర లక్షల రూపాయలు ఉంటుంది. 1821 నుంచి వంశపారంపర్యంగా స్వామివారికి తమ వంశస్థులు కొప్పెరహుండీలను కానుకగా సమర్పిస్తున్నట్లు ఆయన తెలిపారు.  ఈ కొప్పెర హుండీ తయారీకి 20 రోజులు పడుతుంది.  

లొంగుబాటు కాదు.. జనజీవన స్రవంతిలో కలవడం : మావోయిస్టు అగ్రనేత ఆశన్న

చతిస్ గఢ్  సీఎం ఎదుట మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు,   చంద్రబాబు నాయుడు పై అలిపిరిలో  జరిగిన క్లైమోర్ మైన్స్ దాడిలో  పాల్పడ్డ కీలక పాత్రధారి, సూత్రధారి తక్కెళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్నఅలియాస్ రూపేష్  లొంగిపోయాడు.  ఆయనతో పాటు 208 మంది లొంగిపోయినట్లు  అధికారులు ప్రకటించారు.  మావోయిస్టు అగ్రనేత ఆశన్న అలియాస్ రూపేష్ లొంగుబాటు చరిత్రలోనే అతిపెద్ద  లొంగుబాటుగా చెప్పవచ్చు.  దేశ మావోయిస్టు ఉద్యమ చరిత్రలో  ఇదో కీలక మలుపు అంటున్నారు విశ్లేషకులు.  దశాబ్దాలుగా అడవుల్లో ఆయుధ పోరాటాన్ని కొనసాగిస్తున్న మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు తక్కెళ్ళపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న అలియాస్ రూపేష్..  తన అనుచరులతో కలిసి చత్తీస్‌గఢ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జిష్ణు దేవ్ సాయి సమక్షంలో లొంగిపోయాడు. గన్ను వదిలి రాజ్యాంగాన్ని చేపట్టడానికి మావోయిస్టు కేంద్రకమిటీ సభ్యుడు ఆశన్న నిర్ణయించుకోవడం మావోయిస్టు ఉద్యమానికి గట్టి ఎదురుదెబ్బగా చెబుతున్నారు. వనం వదిలి ఆయన జనం బాట పట్టారు.  ఆయనతో కలిసి  మొత్తం 208 మంది మావోయిస్టులు ప్రభుత్వం ఎదుట ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలో కలిశారు. వీరిలో మహిళలు 110 మంది, పురుషులు 98 మంది ఉన్నారు. లొంగిపోయిన వారు 153 ఆయుధాలను ప్రభుత్వానికి అప్పగించారు. వీరందరిపై కలిపి  సుమారు 8 కోట్ల రూపాయల రివార్డు ఉందని అధికారులు వెల్లడించారు. ఇలా ఉండగా తన లొంగుబాటు సందర్భంగా ప్రసంగించిన ఆశన్న.. తమది లొంగుబాటు కాదని చెప్పారు. తాము జనజీవన స్రవంతిలో కలుస్తున్నామని వివరించారు. ఈ సందర్భంగా ఆయన  తన సహచరులను ఉద్దేశించి చేసిన ప్రసంగం హృద్యంగా ఉంది.  అనివార్య పరిస్థితుల్లో   ఆయుధాలను వదిలిపెడుతున్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీలో కొనసాగడం సాధ్యం కాదు. ఎవరికి వారే తమ తమ రక్షణ కోసం ఇప్పుడు పోరాటం చేసుకోవాలి. ఆయుధాలను వదిలిపెడుతున్నాం కానీ మన పంథాను మరచిపోవడం లేదు, జనజీవన స్రవంతిలో కలిసి  ప్రజల కోసం పోరాటం కొనసాగిస్తామని ఆశన్న ఉద్ఘాటించారు. సహచరులంతా ఎక్కడ ఉన్నారో అక్కడే లొంగిపోవడం మంచిదని సూచించారు. ఎవరైనా లొంగిపోదామని భావిస్తే తనను సంప్రదించాలన్నారు.  ఇది లొంగుబాటు కాదు, జనజీవన స్రవంతిలో కలవడమన్న మాటను  ప్రభుత్వం కూడా అంగీకరించిందని చెప్పిన ఆశన్న.. ఉద్యమంలో అమరులైన సహచరులకు ఆయన ఈ సందర్భంగా జోహార్లు చెప్పారు.  ఆయన ప్రసంగం విన్న మావోయిస్టు క్యాడర్ కొద్ది సేపు నిశ్శబ్దంగా ఉన్నారనీ, ఆ తరువాత వారి కళ్లు చెమ్మగిల్లాయని అక్కడున్న అధికారులు తెలిపారు. ఆయన మాటలు విన్న మావోయిస్టు కేడర్లు క్షణకాలం నిశ్శబ్దంగా నిలబడి కంటతడి పెట్టారని అక్కడున్న అధికారులు తెలిపారు. ఇలా ఉండగా శుక్రవారం ఛత్తీస్ గఢ్ సీఎం సమక్షంలో ఆయుధాలు అప్పగించి లొంగిపోయిన మావోయిస్టులలో  మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు తక్కెళ్ళపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న అలియాస్ రూపేష్ రూపేష్, కేంద్ర కమిటీ సభ్యుడు రాజ్ మాన్ మండవి, సెంట్రల్ జోన్ కమిటీ సభ్యులు రాజు సలాం,  వెట్టి అలియాస్ సంతు, సీనియర్ డివిజనల్ కమాండర్‌ రతన్ ఇలాం, రీజనల్ కమిటీ సభ్యులు తదితరులు ఉన్నారు.   ఇంత పెద్ద స్థాయిలో ఒకేసారి కేంద్ర, జోన్, రీజనల్ స్థాయి నాయకులు లొంగిపోవడం భారత మావోయిస్టు చరిత్రలో ఇదే తొలిసారి. కాగా ఈ సందర్భంగా ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి జిష్ణు దేవ్ సాయి మాట్లాడుతూ, ఇది శాంతి పథకానికి గొప్ప విజయంగా అభివర్ణించారు. లొంగిపోయిన వారికి ప్రభుత్వం పునరావాస సదుపాయాలు, జీవనోపాధి అవకాశాలు కల్పిస్తుందని హామీ ఇచ్చారు.  భారత మావోయిస్టు ఉద్యమంలో ఒకే సారి రెండు వందల మందికి పైగా లొంగిపోవడం ఇదే మొదటిసారన్న ఆయన..  ఇది కేవలం ఒక సాంఘిక పరిణామం మాత్రమే కాదు, దశాబ్దాలుగా సాగుతున్న  హింసా మార్గానికి ముగింపు సంకేతమని చెప్పారు.  రూపేష్ లొంగుబాటు దేశ మావోయిస్టు ఉద్యమానికి కొత్త దశను తెరిచింది. “ఇది లొంగుబాటు కాదు — ప్రజలతో కలిసిపోవడం” అనే రూపేష్ మాటలు ప్రస్తుతం చత్తీస్‌గఢ్ అడవుల్లో మారుమ్రోగు తున్నాయి.ఈ పరిణామం శాంతి వైపు మావోయిస్టు ఉద్యమం మెల్లగా మలుపు తీసుకుం టున్న సంకేతంగా నిపుణులు విశ్లేషిస్తున్నారు.