తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరుడు కొలువై ఉన్న తిరుమల క్షేత్రం నిత్యం భక్తులతో కిటకిటలాడుతుంటుంది. తిరుమలేశుని దర్శనానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి కూడా భక్తులు పోటెత్తుతుంటారు. మంగళవారం  (అక్టోబర్ 134 తిరుమల శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో 23 కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలకు పైగా పడుతోంది. ఇక 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులకు శ్రీవారి దర్శనానికి 4 గంటలకు పైగా సమయం పడుతోంది. కాగా సోమవారం  (అక్టోబర్ 13) శ్రీవారిని మొత్తం 78,569 మంది దర్శించుకున్నారు. వారిలో 27,482 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 93  లక్షల రూపాయలు వచ్చింది.  

పోలీసు శాఖను మూసివేయడం మంచిది.. పరకామణి కేసులో హైకోర్టు సీరియస్

తిరుమల పరకామణిలో అక్రమాలపై ఏపీ హైకోర్టు పోలీసుశాఖపై తీవ్ర సీరియస్ అయ్యింది. ఈ అక్రమాలకు సంబంధించి లోక్‌ అదాలత్‌లో కేసు రాజీ వ్యవహారానికి సంబంధించిన రికార్డులను సీజ్‌ చేయాలన్న తమ ఆదేశాలను పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీలో పోలీసు శాఖ నిద్రపోతోందని వ్యాఖ్యానించింది. అంతే కాకుండా సాక్ష్యాలను తారుమారు చేయడానికి సహకరిస్తోందని హైకోర్టు పేర్కొంది.  తిరుమల శ్రీవారి ఆలయంలోని పరకామణికి సంబంధించిన కేసులో గత నెల 19న ఇచ్చిన ఆదేశాలను పోలీసు శాఖ బేఖాతరు చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసుకు సంబంధించి లోక్ అదాలత్ లో రాజీ వ్యవహారానికి సంబంధించిన రికార్డులను సీజ్ చేయాలని హైకోర్టు గత నెల 19న ఆదేశాలు జారీ చేసింది. అయితే పోలీసు శాఖ, డీజీపీ ఈ ఆదేశాలను పట్టించుకోలేదంటూ సీరియస్ అయ్యింది. ఇలా అయితే పోలీసు శాఖను క్లోజ్ చేయడమే మంచిదని హెకోర్టు వ్యాఖ్యానించింది. రికార్డులు సీజ్‌ చేసి హైకోర్టు ముందు ఉంచాలని సీఐడీ డీఐజీకి ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 17కు వాయిదా వేసింది.  

కొత్త మద్యం పాలసీపై హైకోర్టులో పిటిషన్‌

  తెలంగాణ ప్రభుత్వ కొత్త మద్యం పాలసీపై హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. అనిల్‌కుమార్‌ అనే వ్యక్తి ఈ పిటిషన్‌ వేసి, ఒక్కో దరఖాస్తుకు రూ.3 లక్షల ఫీజు విధించడం అన్యాయమని వాదించారు. లాటరీలో షాప్‌ రాకపోతే ఆ మొత్తాన్ని తిరిగి ఇవ్వకుండా ఎక్సైజ్‌ శాఖకు జమచేస్తున్నారని ఆరోపించారు. లాటరీలో దుకాణం దక్కని వారికి, వారు చెల్లించిన దరఖాస్తు ఫీజును తిరిగి చెల్లించాలని కోర్టును అభ్యర్థించారు. అలాగే, లిక్కర్‌ షాప్‌ పొందిన దరఖాస్తుదారుల నుంచి ఇప్పటికే రిటైల్‌ ఎక్సైజ్‌ పన్ను, స్పెషల్‌ రిటైల్‌ ఎక్సైజ్‌ పన్ను, టర్నోవర్‌ పన్ను వసూలు చేస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. లిక్కర్‌ పాలసీపై ప్రభుత్వం జారీ చేసిన జీవోను రద్దు చేయాలని కూడా పిటిషనర్‌ కోర్టును కోరారు. ఈ పిటిషన్‌ను జస్టిస్‌ శ్రవణ్‌ కుమార్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఆబ్కారీశాఖ కమిషనర్‌కు నోటీసులు జారీ చేస్తూ, కేసు విచారణను హైకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది.

జూబ్లీ ఉప ఎన్నికకు తొలిరోజు ఎన్ని నామినేషన్లంటే?

    జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సోమవారం నోటిఫికేషన్ విడుదల కావడంతో రిటర్నింగ్ అధికారి పి సాయిరాం నామినేషన్ల స్వీకరించారు. ఉదయం 11.00 నుంచి మధ్యాహ్నం 03.00 గంటల వరకు పలువురు నామినేషన్లను దాఖలు చేశారు. ఈ ఉపఎన్నికకు తొలిరోజు 10 నామినేషన్లు దాఖలయ్యాయి. అందులో రెండు రిజిస్టర్ పార్టీల అభ్యర్థులు కాగా.. 8 స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు.  తెలంగాణా పునర్ నిర్మాణ సమితి తరుపున పూస శ్రీనివాస్ నామినేషన్ వేశారు. అలాగే నవతరం పార్టీ నుంచి అర్వపల్లి శ్రీనివాస రావు నామినేషన్ దాఖలు చేశారు. స్వతంత్ర అభ్యర్థులుగా సిలివేరు శ్రీకాంత్, పెసరకాయల పరీక్షిత్ రెడ్డి, చలిక చంద్ర శేఖర్, సపవత్ సుమన్, వేముల విక్రమ్ రెడ్డి, ఇబ్రహీం ఖాన్‌, సయ్యద్ ముస్తఫా హుస్సేన్, సల్మాన్ ఖాన్ లు నామినేషన్ లు దాఖలు చేశారు.  రిటర్నింగ్ అధికారి కార్యాలయంను సందర్శించిన జిల్లా ఎన్నికల అధికారిజూబ్లీ హిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలకు కొద్ది గంటల  ముందు షేక్ పేట తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రిటర్నింగ్ అధికారి కార్యాలయంను జిల్లా ఎన్నికల అధికారి ఆర్ వి కర్ణన్ రిటర్నింగ్ అధికారి కార్యాలయంను సందర్శించారు. సన్నద్ధతను RO , ARO లతో సమీక్షించారు.నామినేషన్ల ప్రక్రియ సజావుగా జరిగేలా ECI నిబంధనలకు లోబడి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి నామినేషన్ ల స్వీకరణకు సర్వ సన్నద్ధం గా ఉండాలని రిటర్నింగ్ అధికారి పి సాయిరాం కు సూచించారు.   

డ్రైవర్ రాయుడు సెల్ఫీ వీడియోపై అనుమానం ఉంది : ఎమ్మెల్యే బొజ్జల

  శ్రీకాళహస్తి నియోజకవర్గంలో హత్య చేయబడ్డ రాయుడు సెల్ఫీ వీడియో పై ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి స్పందించారు.. తన ప్రతిష్టను దెబ్బ కొట్టేందుకే ఈ వీడియో విడుదల చేశారని అన్నారు.. రాయుడు సెల్ఫీ వీడియో పై అనుమానం వ్యక్తం చేశారు.. హత్య చేసే ముందు వినుత దంపతులు రాయుడుని బెదిరించి ఇలా చెప్పించేరా లేక ఏఐ వీడియోనా అన్న అనుమానాలు ఉన్నాయని అన్నారు.. ఎన్నికలు సందర్భంగా అప్పటి జనసేన నాయకురాలు వినుత తన విజయానికి ఏమాత్రం సహకరించలేదని అన్నారు..  ఆమె మద్దతు కోరుతూ తన  తల్లి వినుత ఇంటికి వెళ్లిన కనీసం గేటు తీయలేదని అన్నారు. అయినా కూటమిలో భాగస్వామ్యంగా ఉన్నందుకు ఏనాడు తాను వినుతపైన ఆరోపణలు చేయలేదని అన్నారు. హత్య జరిగిన తర్వాత కూడా ఆమెపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని గుర్తు చేశారు.. అయినా ఉద్దేశపూర్వకంగా తనపై తప్పుడు ప్రచారం చేయడం సరికాదని ఢిల్లీలో వ్యాఖ్యానించారు.. తనపై జరుగుతున్న దుష్ప్రచారం తెరదించేందుకే ఈ అంశంపై తాను మీడియా ముందుకు రావాల్సి వచ్చిందని అన్నారు  

చర్లపల్లి జైలుకు వెళ్లిన కేంద్ర మంత్రి బండి సంజయ్

  కేంద్ర ఉప మంత్రి బండి సంజయ్ కుమార్ ఈరోజు చర్లపల్లి జైలును సందర్శించారు. సందర్శన సందర్భంగా డీజీపీ సౌమ్య మిశ్రా, జైలు శాఖ ఉన్నతాధికారులు మంత్రిని ఆత్మీయంగా స్వాగతించారు. అనంతరం మంత్రి జైలులో జరుగు తున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ఖైదీలతో మాట్లాడి, వారు తయారు చేస్తున్న ఉత్పత్తు లను పరిశీలించారు. గోశాలలో పశువు లకు స్వయంగా మేత వేశారు.ఒక దూడకు “కృష్ణ” అని పేరు పెట్టారు. తరువాత జైలులో ఏర్పాటు చేసిన వినోద క్లబ్‌, చెమట గులాబీ తోటలను కూడా సందర్శిం చారు.  ఖైదీలు నిర్వహి స్తున్న తేనె ఉత్పత్తి విధానాన్ని కూడా గమనించారు. అధికారులు జైలు సంస్కరణలు, ఖైదీ సంక్షేమ కార్యక్రమా లపై పవర్ పాయింట్ ప్రజెంటే షన్ ఇచ్చారు. విడుదలైన ఖైదీలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారని, మహిళా ఖైదీల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో విద్యను అందిస్తు న్నారని అధికారులు వివరించారు.చర్లపల్లి జైలు 25 ఏళ్ల క్రితం నిర్మించబ డిందని, అప్పటి నుంచి అనేక అభివృద్ధి కార్యక్ర మాలు చేపట్టినట్టు తెలిపారు.ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం ₹11.60 కోట్లు మంజూరు చేసిం దని, అందులో ₹11.30 కోట్లు వినియోగించబడినట్టు వివరించారు. డీజీపీ సౌమ్య మిశ్రా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జైలు శాఖలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయని అధికారులు చెప్పారు. ఖైదీల కుటుంబ సభ్యులు వీడియో లింక్ ద్వారా “ములా ఖాత్” చేసుకునే సౌకర్యం కల్పించా రని, ఖైదీలకు ఇన్సూరెన్స్ సదుపాయం అందించారని తెలిపారు. ఖైదీలకు విద్యా అవకాశాలు కల్పించి, కోర్సులు పూర్తి చేసిన వారికి డిగ్రీలు ప్రదానం చేస్తున్నారని చెప్పారు. అంతే కాకుండా ఖైదీల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ ప్రతిరోజూ సగటున 150 మందికి వైద్య పరీక్షలు నిర్వహి స్తున్నారని, ప్రతి ఖైదీకి వ్యక్తిగత ఆరోగ్య ప్రొఫైల్ నిర్వహిస్తున్నారని తెలిపారు. అదనం గా ప్రతిరోజు  యోగా, ధ్యానం, శారీరక వ్యాయామ శిక్షణ తరగతులు  నిర్వహిస్తున్నారని చెప్పారు. ఖైదీలకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా నైపుణ్యాభివృద్ధి కేంద్రం ఏర్పాటు చేసినట్టు వివరించారు. జైలు నుండి విడుదలైన తర్వాత కొందరు ఖైదీలు పెట్రోల్ బంక్‌లలో పనిచేస్తూ కనీసం రూ.18,000 జీతం పొందుతు న్నారని తెలిపారు. అలాగే జైలు సిబ్బంది సంక్షేమం, ఆరోగ్యం, క్రీడా కార్యక్రమాల కోసం కూడా ప్రత్యేక చర్యలు చేపట్టినట్టు చెప్పారు. తెలంగాణ జైలు సిబ్బంది వివిధ క్రీడల్లో అద్భుత ప్రదర్శన కూడా ఇస్తున్నారని, జైలు శాఖకు SKOCH అవార్డు లభించిందని పేర్కొన్నారు. అనంతరం బండి సంజయ్  మాట్లాడుతూ... చర్లపల్లి జైలులో అమలు చేస్తున్న ఖైదీ సంక్షేమ కార్యక్రమాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని చెప్పారు. ఖైదీలకు బీమా సదుపాయం కల్పించడం, వారి కుటుంబ సభ్యులకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడం వంటి చర్యలు ఎంతో ప్రశంసనీయం అన్నారు. మహిళా ఖైదీల పిల్లల విద్యా ఫీజులు చెల్లించే నిర్ణయం జైలు శాఖ తీసుకోవడం ఒక మానవతా దృక్పథం అని అభినందించారు. జైలు విభాగం డైరెక్టర్ జనరల్ సౌమ్య మిశ్రా దూరదృష్టి ప్రశంసనీయమని, ఆమె కస్టడీ, కేర్, కరెక్షన్ అనే మూలసూత్రాలను కార్యరూపంలోకి తీసుకువచ్చారని కేంద్ర మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు.బండి సంజయ్ గారు డీజీపీ సౌమ్య మిశ్రా యొక్క విజన్ మరియు చర్లపల్లి జైలును అభివృద్ధి చేసిన విధానాన్ని ప్రశంసించారు. ఇతర రాష్ట్రాల జైలు శాఖలు కూడా ఇక్కడి మాదిరి సంస్కరణలు చేపట్టేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు. ఖైదీలు తయారు చేస్తున్న ఉత్పత్తులు నాణ్యమైనవని, వాటిని ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు హైదరాబాద్‌లో ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేయాలని సూచించారు.కేంద్ర ప్రభుత్వం జైలు శాఖకు అన్ని విధాల సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు.  

ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ

  ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో  సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. వైజాగ్‌లో పెట్టుబడుల సదస్సుకు ప్రధానిని ఆహ్వానించారు. అలాగే నవంబర్ 14, 15వ తేదీల్లో విశాఖపట్నంలో జరుగనున్న సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్‌కు మోదీని ఆహ్వానించారు. ప్రధాని మోదీని కలవడం చాలా గౌరవంగా ఉందని ముఖ్యమంత్రి ఎక్స్ వేదికగా తెలిపారు.  ప్రజా సేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న ప్రధానికి రాష్ట్ర ప్రజల తరపున శుభాకాంక్షలు చెప్పాని పేర్కొన్నారు. జీఎస్టీ సంస్కరణల విషయంలో ప్రధాని నాయకత్వాన్ని ప్రశంచాని సీఎ తెలిపారు. కర్నూల్ జరిగే సూపర్ జీఎస్టీ సేవింగ్స్ కార్యక్రమానికి ఆహ్వానించాని పేర్కొన్నారు. రేపు(మంగళవారం) గూగుల్‌తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకునే కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు. చంద్రబాబు వెంట కేంద్ర మంత్రులు రామ్మోహన్‌ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌ ఉన్నారు.

జోగి రమేష్ ఆధ్వర్యంలో కల్తీ మద్యం...జనార్దన్‌రావు షాకింగ్ కామెంట్స్

  నకిలీ మద్యం కేసులో అరెస్టైన ఏ-1 జనార్దన్ రావు షాకింగ్ విషయాలు బయటపెట్టారు. గత వైసీపీ ప్రభుత్వంలో మాజీ మంత్రి జోగి రమేష్ ఆధ్వర్యంలోనే నకిలీ మద్యం తయారీ ప్రారంభించామని తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిఘా పెంచడంతో నిలిపివేశామని కానీ ఏప్రిల్‌లో రమేష్ ఫోన్ చేసి మళ్లీ తయారు చేయాలన్నారని జనార్దన్ రావు పేర్కొన్నారు. కల్తీ మద్యం తయారీ మొదట ఇబ్రహీంపట్నంలో పెట్టాలనుకున్నాం. రమేశ్‌ ఆదేశాలతో తంబళ్లపల్లిలో తయారీ ప్రారంభించాం. తంబళ్లపల్లి అయితే చంద్రబాబుపై బురద జల్లోచ్చని చెప్పారు. ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చారు. అంతా రెడీ అయ్యాక నన్ను ఆఫ్రికాలో ఉన్న స్నేహితుడు దగ్గరకు పంపారు. జోగి రమేష్ తన మనుషుల ద్వారా లీక్ ఇచ్చి రైడ్ చేయించారు. తద్వారా కూటమి సర్కార్‌కి చెడ్డ పేరు తీసుకురావాలని కుట్ర చేశాడు.' అని జనార్థన్ రావు ఇవాళ సంచలన విషయాలు బయటపెట్టారు.అంతేకాదు, 'తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో జోగి రమేష్ మరో ప్లాన్ వేశారు. ఇబ్రహీంపట్నంలో కూడా సోదాలు చేయిద్దాం సరుకు తీసుకొచ్చి పెట్టు అని అన్నారు. జోగి రమేష్ చెప్పినట్టే లీక్ ఇచ్చి రైడ్ చేయించారు, జగన్ మీడియా కూడా ముందే ఉంది. అనుకున్నది జరిగింది..  ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చింది. నువ్వు ఇక్కడకు రావాల్సిన అవసరం లేదని జోగి రమేష్ అన్నారు. అంతా చూసుకుంటా బెయిల్ ఇప్పిస్తానని చెప్పి జోగి రమేష్ హ్యాండ్ ఇచ్చాడు. నా తమ్ముడిని కూడా నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ ఇరికించాడు. జై చంద్రారెడ్డికి కల్తీ లిక్కర్‌తో అసలు సంబంధం లేదు'. అని జనార్దన్ రావు తెలిపారు జయచంద్రారెడ్డికి వచ్చే ఎన్నికల్లో సీటు రాదని జోగి రమేశ్‌ నమ్మించారు. రమేశ్‌తో చిన్నప్పటి నుంచి నాకు పరిచయం ఉంది. నమ్మించి మోసం చేశారు. అందుకే బయటకు వచ్చి నిజం చెబుతున్నా’’ అని జనార్దన్‌రావు పేర్కొన్నాడు  

ములకలచెరువు కల్తీ మద్యం కేసులో మరో అరెస్టు

  అన్నమయ్య జిల్లా  ములకలచెరువు కల్తీ మద్యం కేసులో ఏ 22 నిందితుడిగా ఉన్న చైతన్య బాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  నకిలీ మద్యం కేసులో ఇప్పటివరకు అరెస్టు అయిన వారి సంఖ్య 15కి చేరింది. ఈ కేసులో ఎనిమిది మందిని అరెస్టు చేయాల్సి ఉంది. మరి కొంతమందిపై కేసు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం. కూటమి ప్రభుత్వం ఈ కేసుని సిట్‌‌కి అప్పగించన సంగతి తెలిసిందే.  నకిలీ లిక్కర్ తయారీతో సంబంధం ఉన్న వ్యక్తుల్లో టెన్షన్ పెరిగింది. ఆరోపణలు ఎదుర్కొంటూ ఏ (17) నిందితునిగా కేసు నమోదైన టీడీపీ నుంచి సస్పెన్షన్‌కు గురైన తంబళ్లపల్లె నియోజకవర్గం ఇన్‌చార్జ్ దాసరపల్లి జయచంద్రారెడ్డి, ఆయన బామ్మర్థి గిరిధర్ రెడ్డిని అరెస్టు చేసేందుకు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.

ట్రంప్ పబ్లిసిటీ స్టంట్స్... యూఎస్‌లో 12 అడుగులు బంగారు విగ్రహం

  అమెరికా ప్రెసిడెంట్ రూటే సెపరేటు. సెల్ఫ్ పబ్లిసిటీ అంటే ఆయనకు ఎంత పిచ్చో వేరే చెప్పనవసరం లేదు. నోబెల్ శాంత బహుమతి కోసం ఆయన ఎంత హడావుడి చేశారో ఎవరూ మర్చిపోరు. తాజాగా ఆయన గోల్డెన్ స్టాట్యూ ప్రపంచవ్యాప్తంగా హాట్‌టాపిక్ అయింది. గత నెల సెప్టెంబర్ లో ట్రంప్ గోల్డెన్ స్టాచ్యూ ఏర్పాటు చేశారు. అది కూడా అమెరికా చట్టసభల భవనం క్యాపిటల్ బిల్డింగ్ ఎదురుగా పెట్టారు. 12 అడుగుల ఎత్తైన ట్రంప్ బంగారు విగ్రహం అది. చేతిలో బిట్ కాయిన్ పట్టుకుని నిలబడ్డట్లు పెట్టిన ఆ విగ్రహాన్ని చూసేందుకు జనాలు తండోపతండాలుగా వస్తుండటం విశేషం. ఒక్కొక్కరికి ఒక్కో పిచ్చి ఉంటుంది. తాజాగా క్రిప్టో కరెన్సీ ఇన్వెస్టర్ల నిధులతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గోల్డెన్ స్టాట్యూ  ఏర్పాటు చేశారు. ట్రంప్ కు ఇలాంటివంటే మహా ఇష్టం. 12 అడుగుల బంగారు విగ్రహంపై విమర్శలు వెల్లువెత్తినా... ట్రంప్ మాత్రం పిచ్చ హ్యాపీ అయిపోయారు. జస్ట్ ఇదే కాదు.. ట్రంప్ మైండ్ సెట్ ఎవరికీ అంతుపట్టదన్న టాక్ ఉంది. చరిత్రలో నిలిచిపోయేందుకు ట్రంప్ తనను తానే ప్రొజెక్ట్ చేసుకుంటుంటారు. అది రివర్స్ అవుతుందా.. సక్సెస్ అవుతుందా అనేది పక్కన పెడితే... ప్రపంచంలోనే తాను బలమైన లీడర్ అని ట్రంప్ బలంగా విశ్వసిస్తుంటారు. అయితే చైనా, భారత్, రష్యా మాత్రం ఆయన్ను లెక్క చేయడం లేదు. ఎంత వరకైనా తేల్చుకుందాం అంటున్నాయి.  ఫస్ట్ ఇంట గెలిచి రచ్చగెలవాలని ట్రంప్ అనుకుంటున్నారో ఏమోగానీ.. మొదట అమెరికాలో ప్రొజెక్ట్ అవ్వాలనుకుంటున్నారు. అమెరికా మాజీ అధ్యక్షుల కంటే గొప్ప వ్యక్తిగా ఎలివేషన్స్ ఇచ్చుకుంటున్నారు. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. 2026లో అమెరికా స్వాతంత్ర్యం 250 ఏళ్లు పూర్తిచేసుకోబోతోంది. ఈ సందర్భంగా అమెరికా ట్రెజరీ డిపార్ట్‌మెంట్ ఒక డాలర్ ప్రత్యేక నాణెం విడుదల చేయడానికి ప్రణాళికలు రెడీ చేస్తోంది. ఈ డాలర్ కాయిన్ పై డొనాల్డ్ ట్రంప్ ఫోటో పెట్టుకుంటున్నారు. ట్రంప్ పిడికిలి ఎత్తి ఉన్న ఫోటో పెట్టి.. పక్కన ఫైట్, ఫైట్, ఫైట్ అన్న నినాదాలతో ఉన్న నాణెం డిజైన్‌ డ్రాఫ్ట్ రిలీజ్ చేశారు. నిజానికి ఇది అమెరికన్ కరెన్సీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, సంప్రదాయాలకు విరుద్ధం. బతికి ఉన్న వారి ఫోటోలు కాయిన్లు, నోట్లపై వేయకూడదు. కానీ ట్రంప్ కు ముందు చూపు ఎక్కువ కదా. ఫ్యూచర్ ప్లాన్ తో గతంలోనే చట్టం చేయించుకున్నారు.    అమెరికాలో ప్రముఖ నాయకుల ముఖాలను చెక్కిన మౌంట్‌ రష్మోర్‌ పై ట్రంప్ కన్ను ఎప్పటి నుంచో ఉంది. ఆ కొండపై నేషనల్‌ మెమోరియల్‌లో తన ఫేస్ స్టాచ్యూను చెక్కించాలని తెగ ఆసక్తి చూపారు. ట్రంప్ సోషల్ మీడియా అకౌంట్ లో ఏఐ వీడియోను కూడా షేర్ చేసుకున్నారు. అందులో అమెరికన్ లెజెండరీ ప్రెసిడెంట్ల పక్కనే తనది కూడా ఉన్నట్లు ఎలివేట్ చేసుకున్నారు. మౌంట్‌ రష్మోర్‌ నేషనల్‌ మెమోరియల్‌ సౌత్ డకోటాలోని కీస్టోన్‌ వద్ద ఉన్న బ్లాక్‌ హిల్‌పై ఉంది. ఇక్కడి భారీ గ్రానైట్‌ శిలలపై అధ్యక్షుల ముఖాల బొమ్మలను డిజైన్‌ చేశారు. ఏటా కొన్ని మిలియన్ల మంది సందర్శకులు ఇక్కడికి వస్తుంటారు.  వాటిని చూసి వెళ్తుంటారు. ఈ మెమోరియల్‌పై అమెరికా మాజీ అధ్యక్షులైన జార్జి వాషింగ్టన్‌, థామస్‌ జెఫర్సన్‌, రూజ్ వెల్ట్‌, అబ్రహం లింకన్‌ ముఖాలు ఉన్నాయి. వీరంతా అమెరికాను వివిధ అంశాల్లో బలోపేతం చేసిన వారే. ఒక్కో శిల్పం 60 అడుగుల ఎత్తు ఉంటుంది. వీటిల్లో తన ముఖం కూడా ఉండాలని ట్రంప్‌ కోరుకుంటున్నారు. కానీ అది వర్కవుట్ కాలేదు. ఎందుకంటే ఆ పర్వతంపై ఐదో ముఖం చెక్కడానికి చోటు సరిపోదు. మౌంట్‌ రష్మోర్‌ను నిర్వహించే నేషనల్‌ పార్క్‌ సర్వీస్‌ కూడా అక్కడ ఐదో తల ఏర్పాటుకు సేఫ్టీ కాదని, మొత్తం కూలిపోతాయని స్పష్టం చేసింది అసలు ట్రంప్ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేవారు. ఆ క్రమంలోనే ది అప్రెంటిస్ అనే రియాల్టీ టీవీ షో హోస్ట్ చేశారు. 2004 నుంచి 2017 వరకు NBC నెట్‌వర్క్‌లో 15 సీజన్‌లు రన్ అయింది. 14-18 మంది బిజినెస్ కంటెస్టెంట్లు పోటీ పడ్డారు.  ఈ షోలు ట్రంప్‌ని టఫ్ బిజినెస్‌మ్యాన్ గా బ్రాండ్ చేశాయి. అయితే ఈ షోలు ప్లీప్లాన్ అని, ట్రంప్ ఇమేజ్ మాస్క్ అని కొందరు అంటారు. ఇప్పుడు అధ్యక్షుడు అయినప్పటికీ అదే కథ నడుస్తోంది. అందుకే ట్రంప్ రూటే సపరేటు.

పోలీస్ సిబ్బందికి డీజీపీ శివధర్ రెడ్డి కీలక సందేశం

  రాష్ట్ర పోలీస్  సిబ్బందికి తెలంగాణ డీజీపీ  శివధర్ రెడ్డి  లేఖ రాశారు. ప్రజల భద్రత, పోలీస్ వ్యవస్థ నైతికత, సిబ్బంది సంక్షేమం గురించి స్పష్టమైన దిశానిర్దేశాలు అందించారు. డీజీపీ తన లేఖలో పేర్కొంటూ ఫెయిర్ అండ్ ఫ్రెండ్లీ, ప్రొఫెషనల్ పోలీసింగ్ నా ఫిలాసఫీ  అని అన్నారు. ప్రజల భద్రత మన ప్రధాన బాధ్యత అని గుర్తు చేశారు. పోలీస్ సిబ్బంది సంక్షేమం తన వ్యక్తిగత ప్రాధాన్యత అని స్పష్టం చేశారు.  మనం చేపట్టే ప్రతి దర్యాప్తు ప్రజా సంక్షేమ పట్ల మన సునితత్వం మరియు నిబద్ధ తను ప్రతిబింబిం చాలి. మన లక్ష్యం చట్టాన్ని అమలు చేయడం మాత్రమే కాదు. ప్రజలు గౌరవించే విధంగా చేసుకోవాలి. ప్రజా విశ్వాసమే పోలీసింగ్ యొక్క నిజమైన కొల మానం... ప్రజలతో సౌఖ్యంగా వ్యవహ రిస్తూ విధి నిర్వ హణ చేయాలి. ప్రతి పోలీస్ అధి కారి మరియు వారి కుటుంబం యొక్క సంక్షేమం వ్యక్తి గత ప్రాధాన్యత‌.. క్రమశిక్షణ సమగ్రత మరియు జవాబు దారితనం మన బలానికి మూల స్తంభాలుగా ఉంటాయి. నేరా లను నిరోధిం చడం... వివాదా లను పరిష్క రించడం.... భాగ స్వామ్య బాధ్యత యొక్క భావాన్ని తెలుసు కోవడం.... మనకు ఉండాల్సిన ముఖ్య లక్షణాలు... అలాగే, పోలీస్ స్టేషన్లలో సివిల్ వివాదాలకు తావు ఇవ్వరాదని, అటు వంటి వ్యవహారాలు పూర్తిగా సివిల్ కోర్టుల పరిధిలోని వని డీజీపీ పేర్కొన్నారు. “పోలీస్ స్టేషన్‌లను సివిల్ పంచాయితీ అడ్డాగా మార్చితే కఠిన చర్యలు తీసుకుంటామని" హెచ్చరించారు. సమాజంలో శాంతిని కాపాడు కోవడంలో ప్రజల సహకారం తీసు కుంటూ ముందుకు వెళ్లాలని డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు. యూనిఫార్మ్ ధరించే వారిలో అవినీతి చోటు చేసుకోవడం అసహ్యకరమని చెప్పారు. “యూనిఫార్మ్, కరప్షన్ ఒకే చోట ఉండవు. ఒక్కరైనా లంచం తీసుకుంటే మొత్తం పోలీస్ శాఖ కే చెడ్డపేరు వస్తుంది. అలాంటి వారిపై కఠినంగా వ్యవహరిస్తామని" స్పష్టం చేశారు.  మన ప్రవర్తన యూనిఫామ్ కు గౌరవాన్ని మరియు ప్రభుత్వానికి గర్వాన్ని అలాగే సమాజానికి శాంతిని తెస్తుంది. ప్రతి అధికారికి నాదొక సందేశం... మీ యూనిఫామ్ ను గర్వంగా మరియు వినయంగా ధరించండి..ధైర్యంగా, మర్యాదగా కరుణతో విధి నిర్వ హణలో ప్రొఫెషనల్ గా ఉండండి. అలాగే పోలీసింగ్‌లో టెక్నాలజీ వినియో గాన్ని పెంచాలని సూచిస్తూ, “బేసిక్ పోలీసింగ్‌తో పాటు ఆధునిక సాంకేతిక తను ఉపయోగిం చాలని డీజీపీ పేర్కొన్నారు. చివరిగా, ప్రజా సేవను ముఖ్యంగా గుర్తుచేస్తూ —మీరు నమోదు చేసే ప్రతి ఎఫ్ ఐ ఆర్.... మీరు స్పందించే ప్రతి కాల్... మీరు దర్యాప్తు చేసే ప్రతి కేసు... ఎంతో న్యాయబద్ధంగా, అత్యంత ప్రమాణా లను ప్రతిబింబించే విధంగా కేసును చేదించండి...మీ మీద ప్రజలకు నమ్మకం కలగాలి. పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కితే న్యాయం జరుగుతుందని ప్రజలు నమ్మాలి. మనల్ని గౌరవిం చాలి.  “పేదవారు కష్టంలో ఉన్నప్పుడు పోలీస్ ఉన్నాడని గుర్తు చేయండి. ఆపదలో ఆదుకున్న వారిని ప్రజలు ఎప్ప టికీ మరిచిపోరు” అని సిబ్బందిని ఉద్బోధించారు. ఈ లేఖతో రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ సిబ్బందికి ప్రజాభిముఖత, నైతికత, సేవా ధోరణి పై స్పష్టమైన దిశానిర్దేశం లభించింది.

జూబ్లీ ఉప ఎన్నికల్లో 300 మంది మాలల నామినేషన్లు

  తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ పేరుతో గత ఐదు నెలలుగా ఎస్సీలోని 58 కులాలకు జరుగుతున్న తీవ్ర అన్యాయాన్ని, విద్య, ఉద్యోగ, ప్రమోషన్లలో ఎదురవుతున్న నష్టాన్ని నిరసిస్తూ మాల సంఘాల జేఏసీ చైర్మన్ మందాల భాస్కర్  సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో  ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ మందాల భాస్కర్ మాట్లాడుతూ....గత ఐదు నెలలుగా తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి మరియు వివిధ పార్టీల అధ్యక్షులకు తమకు జరుగుతున్న అన్యాయంపై వినతి పత్రాలు అందజేసినా స్పందన కరువైందని, మాల సమాజానికి జరుగుతున్న అన్యాయం, రిజర్వేషన్ల వర్గీకరణ వల్ల జరుగుతున్న నష్టంపై సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి తమ ఆకాంక్షను, ఆవేదనను తెలియజేయాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన- జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో పోటీ మాల సమాజానికి జరుగుతున్న అన్యాయంపై తమ నిరసనను ప్రజాస్వామ్య పద్ధతిలో తెలియజేయడానికి జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికలలో 300 మంది మాలలు నామినేషన్లు వేయనున్నట్లు ప్రకటించారు. ఐదు నెలలుగా గ్రూప్-3లోని మాల 25 కులాలకు జరుగుతున్న నష్టంపై ఈ పోటీ ఒక నిరసన యుద్ధంగా ఉంటుందని తెలిపారు.  

ఆర్థిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ పురస్కారం

  ఆర్థిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ బహుమతి వరించింది. జోయెల్ మోకీర్, అఘీయన్, పీటర్ హూవీట్‌‌కు నోబెల్ బహుమతి దక్కింది. ఆవిష్కరణ ఆధారిత ఆర్థిక వృద్ధి సిద్దాంతానికి గాను ఈ పురస్కారం అందించనున్నట్టు నోబెల్ ఫౌండేషన్ సభ్యులు వెల్లడించారు. ఫిలిప్ అఘియన్, పీటర్ హౌయిట్‌లకు ‘ఇన్నోవేషన్-డ్రైవెన్ ఎకనామిక్ గ్రోత్’ సిద్ధాంతాన్ని అభివృద్ధి చేసినందుకు గాను ఈ గౌరవం లభించింది.  జోయెల్ మోకిర్ అమెరికన్-ఇజ్రాయెల్ ఆర్థిక చరిత్రకారుడు. ప్రస్తుతం నార్త్‌వెస్టర్న్ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. సాంకేతిక పురోగతి, ఆవిష్కరణలు ఆర్థిక వృద్ధిపై చూపే ప్రభావాన్ని ఆయన విస్తృతంగా పరిశీలించారు. ఫిలిప్ అఘియన్ ఫ్రెంచ్-బ్రిటిష్ ఆర్థికవేత్త. కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ప్రొఫెసర్‌గా ఉన్న ఆయన, పోటీ, ఆవిష్కరణ, వృద్ధి మధ్య సంబంధాన్ని ప్రత్యేక మోడల్స్‌ ద్వారా వివరించారు. మరో శాస్త్రవేత్త పీటర్ హౌయిట్ కెనడాకు చెందినవారు.  బ్రౌన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా ఉన్న ఆయన, ఆవిష్కరణలు ఆర్థిక వ్యవస్థలో ఎలా పనిచేస్తాయో గణిత మోడల్స్‌ ద్వారా ప్రపంచానికి చూపించారు. మొత్తం 11 మిలియన్ స్వీడిష్ క్రౌన్లు (సుమారు 12 మిలియన్ అమెరికన్ డాలర్లు) విలువైన ఈ బహుమతి ముగ్గురికి సమానంగా పంచనున్నారు. కాగా ఇటీవలే భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రంలో శాస్త్రవేత్తలకు , అలాగే శాంతి పురస్కారాలని నోబెల్ కమీటి ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఏపీ బ్రాండ్ ఇమేజ్ పెంచేలా సీఐఐ సదస్సు

అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం  రాష్ట్రానికి పెద్దఎత్తున పెట్టుబడులు ఆకట్టుకోవడం, ఏపీ బ్రాండ్ ఇమేజ్ పెంచుకోవడంతో పాటు సరికొత్త ఆలోచనలకు సీఐఐ భాగస్వామ్య సదస్సు వేదిక  కావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు.  విశాఖపట్నంలో  వచ్చే నెల 14, 15 తేదీలలో  రెండు రోజుల పాటు  రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించతలపెట్టిన సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్‌ సన్నాహకాలపై ఆయన సచివాలయంలో  సోమవారం (అక్టోబర్ 13)   ఆయన సమీక్ష నిర్వహించారు.  ఆంధ్రప్రదేశ్‌ను  ఆర్థిక, సాంకేతిక ప్రగతిలో దేశంలోనే అగ్రగామిగా నిలపడమే తన లక్ష్యమని చెప్పారు. ఈ సీఐఐ సదస్సుకు ముఖ్య అతిధిగా ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించనున్నట్లు చెప్పారు.  వివిధ దేశాల వాణిజ్య మంత్రులను, లీడింగ్-గ్లోబల్ సీఈవోలను కూడా ఈ సదస్సుకు ఆహ్వాచించాలని ఆయన అదికారులకు నిర్దేశించారు.  దేశ, విదేశాలకు చెందిన పారిశ్రామిక వేత్తలు, పాలసీ థింకర్లకు ఈ సదస్సులో   ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. గ్లోబల్ టెక్ ట్రాన్సఫర్మేషన్, గ్లోబల్ ట్రస్ట్ పెంచుకోవడం, గ్లోబల్ ట్రేడ్‌లో దేశం వాటా పెరగడం సదస్సు లక్ష్యంగా ఉండాలని చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశంచేశారు.  ఈ సదస్సు సందర్భంగా విశాఖ నగరాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దాలన్న ఆయన అలాగే సదస్సుకు వచ్చే ప్రతినిథులకు మంచి ఆతిథ్యమివ్వాలన్నారు.   గ్రీన్ ఎనర్జీ రంగంలో రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తోంది. అలాగే గూగుల్ వంటి అంతర్జాతీయ సాంకేతిక దిగ్గజ సంస్థలు రాష్ట్రానికి వస్తున్నాయి. రాష్ట్రం త్వరలోనే ఏఐ, ఇన్నోవేషన్ హబ్‌గా మారనుంది. సదస్సులో ఈ అంశాలు, రాష్ట్ర ఆకాంక్షలు ప్రతిబింబించాలన్నారు.  ఏర్పాట్లకు సమయం తక్కువ ఉన్నందున వేగంగా పనులు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు.  ఇలా ఉండగా విభజిత ఆంధ్రప్రదేశ్ లో సీఐఐ సదస్సు నిర్వహించడం ఇది నాలుగో సారి.  గతంలో 2016, 2017, 2018లో వరుసగా మూడేళ్ల పాటు మూడు  విశాఖలో వేదికగానే సీఐఐ సదస్సులు జరిగాయి.  ఇప్పుడు జరగనున్న ఈ సీఐఐ సదస్సు  టెక్నాలజీ, ట్రస్ట్, ట్రేడ్-నావిగేటింగ్ ది జియోఎకనామిక్ ఆర్డర్  థీమ్‌తో  నిర్వహించనున్నారు. మొత్తం 13 సెషన్లుగా జరిగే ఈ సదస్సులో..  29 మంది వాణిజ్య మంత్రులు, 80 మంది దేశ, విదేశీ సీఈవోలు, 40 దేశాల నుంచి ప్రతినిధులు, అలాగే 13మంది కేంద్ర మంత్రులు  హాజరవుతారు. జీ20 దేశాలు, మిడిల్ ఈస్ట్, యూరప్, ఆసియా, పశ్చిమాసియా తదితర ప్రాంతాల నుంచి ప్రతినిధులు పాల్గొంటారు.  ట్రేడ్, జియోఎకనామిక్ ఫ్రేమ్ వర్క్, టెక్నాజజీ-ఇన్నోవేషన్, డిఫెన్స్, ఏరోస్పేస్, హెల్త్ కేర్, బయోటెక్నాలజీ, స్మార్ట్ మాన్యుఫాక్చరింగ్, లాజిస్టిక్స్-సప్లయ్ చైన్, సస్టెయినబిలిటీ-క్లీన్ ఎనర్జీ, లెవరేజింగ్ టెక్నాలజీ అంశాలపై సెషన్లు జరుగుతాయి. అయితే ఈ సమ్మిట్‌ను విజయవంతం చేసేందుకు ఇప్పటికే పలుదేశాల్లో పర్యటించి పారిశ్రామికవేత్తలను మంత్రి లోకేష్ ఆహ్వానించడంతో రోడ్‌షోలు నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు నారా లోకేష్, నారాయణ, ప్రధాన కార్యదర్శి విజయానంద్, సీఐఐ డైరెక్టర్ జనరల్ చందర్జిత్ బెనర్జీ పాల్గొన్నారు.

డ్రైవర్ రాయుడు హత్య కేసులో కొత్త ట్విస్ట్

  డ్రైవర్ రాయుడు హత్య కేసులో తమకు సంబంధం లేదని శ్రీకాళహస్తి జనసేన సస్పెండెట్ నేత కోట వినుత వీడియో విడుదల చేశారు. చేయని తప్పుకు జైలుకు వెళ్లిన బాధ కంటే హత్య చేశారని చెప్పడమే బాధగా ఉందన్నారు. తప్పు చేయలేదు కాబట్టి బెయిల్ వచ్చింది.  కోర్టులో కేసు ఉంది. కావునా ఎక్కువ మాట్లాడలేను. త్వరలో నిజాలు బయట వస్తాయన్నారు. ఈ కుట్రకు సంబంధించిన అన్ని ఆధారాలను బయటపెడతామని వినూత వీడియోలో పేర్కొన్నాది. విదేశాలలో లక్షల జీతాలు వదులుకొని  ప్రజాసేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చామన్నారు. త్వరలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను కలిసేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు.  మరోవైపు గత కొన్ని రోజుల క్రితం హత్యకు గురైన డ్రైవర్ రాయుడు సెల్ఫీ వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  2023 నవంబర్ నుండి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తో టచ్‌లో ఉన్నాను. జనసేన నాయకులు పేట చంద్రశేఖర్, కొట్టే సాయి ప్రసాద్, అలాగే సుధీర్ రెడ్డి అనుచరుడు సుజిత్ రెడ్డి ద్వారా పరిచయం ఏర్పడింది అని పేర్కొన్నారు.అలాగే, వినూత కోటాకు సంబంధించిన రాజకీయ, వ్యక్తిగత వివరాలన్నీ తానే ఎమ్మెల్యేకు అందించానని, ఆ సేవలకు ప్రతిఫలంగా 2024 ఎన్నికల ముందు రూ.20 లక్షలు అందుకున్నానని వీడియోలో తెలిపారు. ఇంకా ఆయన చెప్పిన మరో సంచలన అంశం— వినూత కోటా, చంద్రబాబు కోటా లను చంపాలని ఎమ్మెల్యే ఆదేశించాడని, ఆ ఆదేశాల మేరకు రెండు సార్లు కారు ప్రమాదం సృష్టించే ప్రయత్నం చేశానని చెప్పారు.అదేవిధంగా, ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి నేరుగా వచ్చి, వినూత కోటా, చంద్రబాబు కోటా ప్రైవేట్ వీడియోలు తీయాలని బెదిరించాడని, అందుకోసం మరో రూ.30 లక్షలు ఇస్తానని ప్రలోభపెట్టాడని శ్రీనివాసులు వీడియోలో వెల్లడించారు. కెమెరాలు బెడ్రూంలో ఏర్పాటు చేసే సమయంలోనే తాను పట్టుబడ్డానని తెలిపారు. డ్రైవర్ శ్రీనివాసులు విడుదల చేసిన ఈ వీడియో బయటకు రావడంతో శ్రీకాళహస్తి ప్రాంతంలో కలకలం రేగింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతూ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తోంది.

బాటిల్ బాగోతం బయటపెట్టే ఎక్సైజ్ సురక్షా యాప్!

ముల‌క‌ల‌చెరువు, ఇబ్ర‌హీంప‌ట్నం న‌కిలీ మ‌ద్యం వ్య‌వ‌హారంపై చంద్ర‌బాబు చాలా చాలా సీరియ‌స్ అయ్యారు. ఈ విష‌యంలో ఎన్నో రాజ‌కీయ కుట్ర కోణాలున్నాయ‌ని.. వాటిని తానిపుడు చెప్ప‌న‌నీ.. న‌లుగురు ఐపీఎస్ ల‌తో పాటు మ‌రొక ఎక్సైజ్ అధికారితో ఈ కేసు విచార‌ణ జ‌రుపుతామ‌ని, దీని ద్వారా ఈ మొత్తం వ్య‌వ‌హారంలోని అస‌లు కుట్ర మొత్తం బ‌య‌ట ప‌డుతుంద‌ని అన్నారు ఏపీ సీఎం చంద్ర‌బాబు. తాను ఇటీవ‌లే 15 వేళ్ల పాటు సీఎంగా ప‌ద‌వీ కాలం పూర్తి చేశాన‌నీ.. స‌రిగ్గా అదే స‌మ‌యంలో ప్ర‌తిప‌క్షంలో కూడా అంతే కాల‌మున్నాన‌నీ.. అలాంటి త‌న‌కు ఇలాంటి వ్య‌వ‌హారం ఎక్క‌డా త‌గ‌ల్లేద‌ని అన్నారుచంద్రబాబు. డ‌బుల్ ఈఎన్ఏ తీసుకొచ్చింది తానేన‌నీ. మంచో చెడో కొంద‌రు మందుబాబుల‌కు ఈ వ్య‌స‌నం అల‌వాటైంది. వారిని తాగ‌మ‌ని ప్రోత్స‌హించ‌డం కాదు కానీ, వారి ఆరోగ్య ప‌రిర‌క్ష‌ణ త‌న‌కు  అత్యవసరం అని అన్నారు చంద్ర‌బాబు.  అందులో భాగంగా తాము ఎక్సైజ్ సుర‌క్ష అనే ఒక కొత్త యాప్ తీసుకొచ్చామ‌నీ.. ఈ యాప్ ద్వారా బాటిల్ ట్రాకింగ్ ఈజీగా చేయ‌వ‌చ్చ‌ని.. ఒక్క‌సారి మీరు ప్లే స్టోర్ కి వెళ్లి.. ఏపీ ఎక్సైజ్ సుర‌క్ష  యాప్ డౌన్ లోడో చేస్కుని.. స్కాన్ చేసుకుంటే.. అస‌లీ బాటిల్ ఎప్పుడు- ఎక్క‌డ-  ఎలా త‌యారైంది? ఆ వివ‌రాలేంటి? అనే అంశాల‌తో కూడిన ట్రేస‌బిలిటీ నుంచి దాని క్వాలిటీ స‌ర్టిఫికేష‌న్ తో స‌హా అన్ని అందులో న‌మోదు అయ్యి ఉంటాయని అన్నారు.  ఆ మాట‌కొస్తే తాము ఫించ‌న్లు ఎలా ఇస్తున్నామో జియో ట్యాగింగ్ తో స‌హా తెలిసిపోతుంద‌ని అన్నారు. ఒక బాటిల్ ఎవ‌రు- ఎప్పుడు- ఎక్క‌డ  అమ్మారు? కొన్నార‌న్న డీటైల్స్ మొత్తం ఇందులో ఎగ్జిబిట్ అవుతాయ‌ని. ఒక్క‌సారి ఒక బాటిల్ అమ్మ‌డంతో ఈ కేస్ హిస్ట‌రీ అక్క‌డితో క్లోజ్ కావాల‌ని.. ఇక్క‌డ కొని మ‌రొక చోట అమ్మినా ఆ విష‌యం కూడా మ‌న‌కు ఈ యాప్ ద్వారా తెలిసిపోతుంద‌ని.. ఇక‌పై బెల్ట్ షాపులు న‌డ‌వ‌టం అంత తేలిక కాద‌ని అన్నారాయ‌న‌. బెల్ట్ షాపులు న‌డిపితే బెండు తీస్తామ‌ని హెచ్చ‌రించారు సీఎం చంద్ర‌బాబు. అస్త‌వ్య‌స్తంగా ఉన్న అబ్కారీ శాఖ‌ను అంచెలంచ‌లుగా ప్ర‌క్షాళ‌న చేస్తున్నామ‌ని.. సిబ్బంది సైతం అప్ర‌మ‌త్తంగా ఉండాలి. లేకుంటే త‌ర‌త‌మ బేధాలు చూడ‌కుండా వారిపైనా క‌ఠిన  చ‌ర్య‌లుంటాయ‌ని వార్న్ చేశారు  చంద్ర‌బాబు. ఈ న‌కిలీ మ‌ద్యం కేసులో కీల‌క నిందితుడైన జ‌య‌చంద్రారెడ్డి త‌మ పార్టీ వాడైనా స‌రే ఎక్కువ ఆలోచించ‌కుండానే స‌స్పెండ్ చేసిన‌ట్టు చెప్పుకొచ్చారు చంద్ర‌బాబు. ఇక ఏ1 నిందితుడు జ‌నార్ద‌న‌రావును కూడ అరెస్టు చేసి వివ‌రాలు రాబ‌డుతున్న‌ట్టు చెప్పారు చంద్ర‌బాబు. ఫ్యూచ‌ర్ లో దీని వెన‌కున్న రాజ‌కీయ కుట్ర కోణం మొత్తం బ‌య‌ట‌ప‌డుతుంద‌ని అన్నారాయ‌న‌. ఒక వేళ ఈ బాటిల్ ట్రాకింగ్ లో.. ఒక న‌కిలీ బాటిల్ బ‌య‌ట ప‌డితే.. అది ఎక్క‌డి నుంచి వ‌చ్చిందో కూడా తెలిసిపోతుంద‌ని.. నేర‌స్తులు ఈ విష‌యం గుర్తించాల‌ని అన్నారు చంద్ర‌బాబు. లేదు మా వెన‌క వాళ్లున్నారు వీళ్లున్నార‌ని వేషాలు వేస్తే.. వారి తాట తీస్తామ‌ని తీవ్ర స్థాయిలో హెచ్చ‌రిక‌లు జారీ చేశారు సీఎం చంద్ర‌బాబు.

అమరావతిలో సీఆర్డీయే భవన ప్రారంభం

రైతులతో కలిసి రిబ్బన్ కట్ చేసిన చంద్రబాబు రాజధాని అమరావతి ప్రాంతంలో మరో అధునాతన కట్టడం ప్రారంభమైంది. రాజధాని అమరావతికి గుండెకాయ వంటి సీఆర్డీయే భవనాన్ని  ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సోమవారం (అక్టోబర్  13)  ప్రారంభించారు.   ఏడు ఫ్లోర్లతో , రెండున్నర  లక్షల చదరపు అడుగుల వైశాల్యంతో నిర్మించిన భవనం ప్రారంభం కావడం రాజధాని అమరావతి నిర్మాణంలో అత్యంత కీలక ముందడుగుగా చెప్పవచ్చు. కాగా ఈ భవన ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు... రాజధాని కోసం భూములిచ్చిన రైతులను కూడా భాగస్వాములను చేశారు  ఈరోజు ఉదయం 9.54 గంటలకు వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఈ కార్యక్రమం వైభవంగా జరిగింది. సీఆర్డీయే భవనం ప్రారంభోత్సవానికి వచ్చిన చంద్రబాబుకు   పండితులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం రైతులతో కలిసి సీఎం చంద్రబాబు రిబ్బన్ కట్ చేసి నూతన భవనాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన భవనమంతా తిరిగి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన వెంట ఉన్న మంత్రి నారాయణ.. భవన నిర్మాణ శైలి, సౌకర్యాలను సీఎంకు వివరించారు. వాస్తవానికి సీఆర్డీయే భవన నిర్మాణం 2019లోనే  పూర్తైనప్పటికీ, అప్పట్లో అధికారంలోకి వచ్చిన వైసీపీ తాను అధికారంలో ఉన్న ఐదేళ్లూ కూడా భవన ఎలివేషన్ పనులను నిలిపివేసింది. తిరిగి 2024లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాతనే మిగిలిన పనులను పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువచ్చింది.  సీఎం చంద్రబాబు ఆదేశాలు, సూచనల మేరకు  సీఆర్డీఏ కార్యాలయాన్ని  అత్యాధునిక  హంగులతో రూపొందించారు. పూర్తి సౌండ్ ప్రూఫ్ విధానంతో ఈ నిర్మాణా లు జరిగాయి. గ్రౌండ్ ఫ్లోర్లో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. అమరావతి  నగరవ్యాప్తంగా పనులు జరిగే ప్రాంతాల్లో,  సీసీ కెమెరాలును ఏర్పాటు చేసి..  వాటి ద్వారా వచ్చే ఫీడ్ ను ఈ కంట్రోల్ రూమ్ కు అనుసంధానం చేస్తారు. వీటితోపాటు డ్రోన్ ద్వారా చిత్రీకరించే దృశ్యాలను కూడా ఇక్కడ నుంచి పర్యవేక్షించే విధంగా అత్యాధునిక టెక్నాలజీని కమాండ్ కంట్రోల్ రూమ్  లో ఏర్పాటు చేశారు.  రాజధాని నగరంలోని కీలక ప్రాంతాలు ,భవనాలకు సంబంధించిన మైక్రో లెవల్  డిజైన్ ఎక్స్పీరియన్స్  ను ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ప్రదర్శనకు ఉంచుతారు. అమరావతి బృహత్ ప్రణాళిక ను ఈ కేంద్రంలోని నమునాల ద్వారా ప్రత్యక్షంగా పరిశీలించే అవకాశం ఉంటుంది.  అదేవిధంగా సచివాలయం ,హైకోర్టు, అసెంబ్లీ, రాజభవన్, సీఎం నివాసం తో పాటు క్వాంటం వ్యాలీ  ఉద్యానవనాలు, రహదారులు తదితర డిజైన్లను ఈ కార్యాలయం నుండి అత్యాధునిక టెక్నాలజీ ద్వారా వీక్షించే వీలు ఉంటుంది.  ఈ భవనం  మొదటి అంతస్తులో  కమాండ్ కంట్రోల్ సెంటర్   ఏర్పాటు చేశారు. అదేవిధంగా క్యాంటీన్లు ,ఇతర ఎక్స్పీరియన్స్ సెంటర్లను నిర్మించారు.  కాన్ఫరెన్స్ హాల్స్ కూడా మొదటి అంతస్తులోనే ఉన్నాయి. ఇక పోతే..    రెండు, మూడు, ఐదు అంతస్తులు సిఆర్డిఏ వర్క్ స్టేషన్లు,  నాలుగో అంతస్తులో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయాలకు కేటాయించారు. ఇక ఆరో అంతస్తులో అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ కార్యాలయం ,ఏడో అంతస్తులో మున్సిపల్  శాఖ మంత్రి పేషీ , ప్రజా ఆరోగ్య శాఖ తదితర కార్యాలయాల కు కేటాయించారు ..మొత్తం 4.23 ఎకరాలలో నిర్మించిన ఈ భవనంలో, మొత్తం 2.42 లక్షల చదరపు అడుగులు బిల్ట్  ఏరియా ఉంది.... ప్రతి అంతస్తులో 33 వేల చదరపు అడుగులు అందుబాటులో ఉంటుంది. 

గ్రేటర్ కమ్యూనిటీలో దొంగల బీభత్సం

గ్రేటర్ కమ్యూనిటీ లో దొంగలు బీభత్సం సృష్టించారు. గ్రేటర్ కమ్యూనిటీ అంటేనే పూర్తి భద్రత, మెరుగైన సౌకర్యాలు ఉంటాయి. ఎటువంటి భయానికీ తావులేకుండా ప్రశాంతంగా ఉండొచ్చనే ఎవరైనా గ్రేటర్ కమ్యూనిటీలో ఇళ్లు తీసుకోవాలని భావిస్తారు. ఖర్చు ఎక్కువైనా భద్రతకు సంబంధించిన భరోసా ఉంటుందన్న భావనతో గ్రేటర్ కమ్యూనిటీలకే మొగ్గు చూపుతారు.   అయితే అటువంటి గ్రేటర్ కమ్యూనిటీలోనే ఆదివారం (అక్టోబర్ 12) అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. ఇళ్లల్లోకి చొరబడి భారీగా దోచుకున్నారు. ఈ ఘటన హిమాయత్ నగర్ పీఎస్ పరిధిలోని సదాశివ గ్రేటర్ కమ్యూనిటీలో జరిగింది. ఈ కమ్యూనిటీలోని రెండు విల్లాలలో దొంగలు భారీ ఎత్తున నగదు, బంగారం దోచుకున్నారు. గ్రేటర్ కమ్యూనిటిలో తాళం వెసి ఉన్న రెండు విల్లాలను లక్ష్యంగా చేసుకుని దొంగలు ఈ చోరీకి పాల్పడ్డారు. చొరీకి ముందు  ఆ ప్రాంతంలోని సీసీ కెమేరాలను ఆపి వేసి, సెంట్రల్ లాక్ ఉన్న డోర్లను పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. ముఖానికి మాస్క్ వేసుకున్న దొంగలు  ఆ రెండు ఇళ్లల్లోనూ కలిపి 60 వేల రూపాయలకు పైగా నగదు, 35 గ్రాముల బంగారం, ఐదు కేసీల వెండి, విలువైన చీరలు దోచుకున్నారు.  ఫుల్ సెక్యూరిటీ ఉన్నా కూడా గ్రేటర్ కమ్యూనిటీలో చోరీ జరగడంతో అక్కడి వారు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు   కేసు నమోదు చేసుకుని దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.  

వేద విశ్వవిద్యాలయంలో మరో రెండు చిరుతలు

తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో  చిరుత సంచారం మరోసారి కలకలం రేపుతోంది. ఆదివారం రాత్రి వర్సిటీ ప్రాంగణంలోని ఉద్యోగుల క్వార్టర్స్ సమీపంలోకి చిరుత వచ్చింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమేరాల్లో రికార్డ్ అయ్యాయి.  ఇటీవల అటవీశాఖ అధికారులు ఒక చిరుతను బంధించిన సంగతి తెలిసిందే. దీంతో ఊపిరి పీల్చుకున్న వర్సిటీ విద్యార్థులు, సిబ్బంది అంతలోనే మరో చిరుత సంచరిస్తుండటంతో తీవ్ర భయాందోళనలకు గురి అవుతున్నారు.  అధికారుల సమాచారం మేరకు ఈ ప్రాంతంలో మరో రెండు చిరుతలు సంచరిస్తున్నాయి. చిరుతలను బంధించేందుకు బోన్లు ఏర్పాటు చేసిన అటవీశాఖ అధికారులు.. రాత్రి వేళల్లో సిబ్బంది, విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. రాత్రిపూట ఎవరూ బయటకు రావద్దంటూ ఆంక్షలు విధించారు.