మేడారంలో క్యూఆర్ స్కానర్లు.. ఎందుకో తెలుసా?

మెడారంలోని వనదేవతలు సమ్మక్క, సారలమ్మ అమ్మవార్లకు కానుకులు సమర్పించేందుకు ఆన్ లైన్ విధానాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. వన దేవతల దర్శనం తరువాత కానుకలు వేసేందుకు జేబులో క్యాష్ లేక భక్తులు ఇబ్బంది పడుతున్న విషయం అధికారుల దృష్టికి రావడంతో  అధికారులు వనదేవతలకు కానుకలు సమర్పించడానికి ఆన్ లైన్ విధానాన్ని ఏర్పాటు చేశారు.

ఇందు కోసం తాడ్వాయ్ కెనరా బ్యాంకు అధికారులతో సంప్రదించి.. మేడారం ప్రాంగణంలో క్యూఆర్ కోడ్ స్కానర్ లను ఏర్పాటు చేయించారు. దీంతో వనదేవతలను దర్శించుకున్న తరువాత హుండీలో సొమ్ములు వేయాలని  అనుకున్నా చేతిలో డబ్బులు లేక ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా.. క్యూఆర్ కోడ్ స్కానర్ల ద్వారా చెల్లించే అవకాశం ఏర్పడింది. ఈ ఆన్ లైన్ స్కానర్లను మేడారం ప్రధాన పూజారి ఆవిష్కరించారు.  

పీపీపీకి మద్దతిస్తే అరెస్టులా...జగన్ బెదిరింపులపై పల్లా ఫైర్

  పీపీపీ విధానానికి మద్దతిచ్చిన వారిని అధికారంలోకి వచ్చిన వెంటనే అరెస్టు చేస్తామని వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రత్యక్ష దాడి అని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు  ఘాటుగా మండిపడ్డారు. మనం డా.బీఆర్ అంబేడ్కర్  రచించిన రాజ్యాంగంలో జీవిస్తున్నాం. నీ తాత రాజారెడ్డి రాసిన రాజ్యాంగంలో కాదు అంటూ జగన్‌ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పబ్లిక్–ప్రైవేట్ కలిసి ఉంటేనే అభివృద్ధి సాధ్యమని ప్రపంచం మొత్తం అంగీకరిస్తుంటే, పీపీపీకి మద్దతిచ్చిన వారిని జైలుకు పంపుతామని బెదిరించడం నియంతృత్వ ఆలోచనలకు పరాకాష్ట అని విమర్శించారు. ప్రజల చేతిలో ఇప్పటికే గుణపాఠం నేర్చుకున్నప్పటికీ జగన్ ఇంకా మారలేదని, అదే అహంకారంతో మళ్లీ రాజకీయ డ్రామాలు ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. పీపీపీకి మద్దతిచ్చిన వారిని అరెస్టు చేస్తామని భయపెట్టడం ద్వారా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నవారిని జగన్ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని విమర్శించారు. గత వైసీపీ పాలనలోనే అనేక పరిశ్రమలు రాష్ట్రం విడిచి వెళ్లిపోయాయని గుర్తు చేశారు.  జగన్ తాటాకు చప్పుళ్లకు ఎవరు జడిచేది లేదని, చట్టాలు ఎవరు అతిక్రమించినా జైలు ఊసలు లెక్కించాల్సిందేనని పల్లా స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజలు గత ఎన్నికల్లో జగన్‌కు బుద్ధి చెప్పారని, రానున్న ఎన్నికల్లో మరోసారి గట్టి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. గవర్నర్ వద్దకు తీసుకెళ్లిన ఒక కోటి సంతకాలు నిజమైతే, వాటికి సంబంధించిన ఆధార్ కార్డు వివరాలను మీడియాకు ఎందుకు బహిర్గతం చేయడం లేదని టీడీపీ చీఫ్ ప్రశ్నించారు. ఢిల్లీలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ముందు వైసీపీ ఎంపీలు పీపీపీ మోడల్‌కు మద్దతు ఇచ్చి, రాష్ట్రానికి వచ్చాక దానికే వ్యతిరేకంగా ఫేక్ ఉద్యమాలు చేయడం డిల్లీలో ఒక మాట – గల్లీలో ఇంకో మాట అనే జగన్ రాజకీయ నాటకానికి నిదర్శనమన్నారు. పీపీపీ విధానం ప్రైవేటీకరణ కాదని, దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలు విజయవంతంగా అమలు చేస్తున్న విధానమని పల్లా  స్పష్టం చేశారు. పీపీపీ విధానంలో నిర్మించే మెడికల్ కాలేజీలు ప్రభుత్వ మెడికల్ కాలేజీల పేరుతోనే నడుస్తాయని, వాటి యాజమాన్యం, పరిపాలన, పర్యవేక్షణ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలోనే ఉంటాయని తెలిపారు.  అడ్మిషన్లు, ఫీజు నిర్మాణం, సేవల ప్రమాణాలు అన్నీ ప్రభుత్వమే నిర్ణయిస్తుందని, ప్రైవేట్ భాగస్వామికి ఇష్టారాజ్యంగా వ్యవహరించే అవకాశం లేదన్నారు. ఈ కాలేజీల్లో 70 శాతం పడకలు ఎన్టీఆర్ వైద్య సేవలు, ఆయుష్మాన్ భారత్ పథకాల లబ్ధిదారులకే కేటాయిస్తారని, దీని ద్వారా పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. జగన్ పాలనలో మెడికల్ కాలేజీల పేరుతో కేవలం రూ.1,400 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని, అవి కూడా కేంద్ర నిధులేనని పల్లా గుర్తు చేశారు. ఇప్పుడు రూ.3,000 కోట్లు ఖర్చు చేశామని అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. రూ.450–500 కోట్లతో రుషికొండ ప్యాలెస్ నిర్మించినప్పుడు పేదల ఆరోగ్యం, సంక్షేమం ఎందుకు గుర్తుకు రాలేదని ప్రశ్నించారు.  అదే డబ్బుతో కనీసం రెండు మెడికల్ కాలేజీలు నిర్మించవచ్చని, కానీ ప్రజలకు ఉపయోగం లేని వైట్ ఎలిఫెంట్‌గా రుషికొండ ప్యాలెస్ మిగిలిందని విమర్శించారు. మీ సాక్షి పత్రికే రుషికొండకు రూ.450 కోట్లు ఖర్చయిందని రాసిందని, ఇప్పుడు రూ.230 కోట్లు అని ఎందుకు అబద్ధాలు చెబుతున్నారని నిలదీశారు. మిగిలిన డబ్బు ఎవరికి కమీషన్లుగా వెళ్లిందో చెప్పాలని డిమాండ్ చేశారు. నీ పాలనలోనే 104, 108 సేవలను ప్రైవేటైజ్ చేశావని, ఆరోగ్యశ్రీ బకాయిలు పేరుకుపోయినప్పుడు ప్రజల ఆరోగ్యం గుర్తుకు రాలేదా జగన్ రెడ్డి? అని ప్రశ్నించారు. 2014–19లో టీడీపీ ప్రభుత్వం చేపట్టిన అమరావతి, పోలవరం, పరిశ్రమలను అక్కసుతో నాశనం చేసిన నువ్వు ఇప్పుడు క్రెడిట్ చోరీ గురించి మాట్లాడే అర్హత నీకు ఎక్కడిదని పల్లా  మండిపడ్డారు.  రుషికొండపై చూపిన ప్రేమను నర్సీపట్నం మెడికల్ కాలేజీపై చూపి ఉంటే అది ఇప్పటికి పూర్తయ్యేదని అన్నారు. 30 ఏళ్లు పట్టే మెడికల్ కాలేజీలను కేవలం రెండేళ్లలో పూర్తి చేసే పీపీపీ విధానాన్ని ఎందుకు అడ్డుకుంటున్నావని ప్రశ్నించారు. మీ వాటాదారులకు కమీషన్లు పోతాయనే భయమే దీనికి కారణమా అని ఘాటుగా వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి పేదల సంక్షేమమే లక్ష్యంగా పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని వేగవంతం చేశారని పల్లా  తెలిపారు. ఈ విధానంతో అదనంగా 220 మెడికల్ సీట్లు రాష్ట్రానికి వస్తాయని, అందులో 110 సీట్లు ప్రభుత్వ (కన్వీనర్) కోటాలోనే ఉంటాయని చెప్పారు. రెండేళ్లలోనే కాలేజీలు పూర్తై 2,500 ఎంబీబీఎస్ సీట్లు మన రాష్ట్ర విద్యార్థులకు అందుబాటులోకి వస్తాయని స్పష్టం చేశారు.  జగన్ విధానంలో అయితే ఇదే ఫలితం సాధించడానికి 15–20 ఏళ్లు పట్టేదన్నారు. పీపీపీ విధానానికి కేంద్ర ప్రభుత్వం, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలు, నేషనల్ మెడికల్ కమిషన్, నీతి ఆయోగ్, హైకోర్టు కూడా పూర్తి మద్దతు ఇచ్చాయని టీడీపీ చీఫ్ గుర్తు చేశారు. వైద్య విద్య ఖర్చులు విపరీతంగా పెరిగిన ప్రస్తుత పరిస్థితుల్లో పీపీపీ తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని కేంద్రం స్పష్టంగా చెప్పిందన్నారు.

విదేశాల్లో ఆర్థిక నేరగాళ్లు లలిత్ మోడీ, మాల్యాల రాజసం

  ఇండియా విడిచి పారిపోయిన వ్యాపారవేత్తలు లలిత్ మోడీ, విజయ్ మాల్యా మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి, లండన్‌లో లలిత్ మోడీ తన స్నేహితుడు విజయ్ మాల్యా 70వ పుట్టినరోజుకు ముందు నిర్వహించిన విలాసవంతమైన పార్టీలో ప్రత్యక్షమయ్యాడు. భారతదేశంలో కోట్లాది రూపాయల కుంభకోణాలు, రుణ ఎగవేతలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరూ విదేశాలలో బహిరంగంగా వేడుకలు జరుపుకుంటున్నారు. జనాన్ని నిండా ముంచి విదేశాల్లో వారు బహిరంగ పార్టీల్లో పాల్గొంటుండం హాట్ టాపిక్‌గా మారింది.   ఐపిఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోడీ ఈ ప్రీ-బర్త్‌డే పార్టీని లండన్‌లోని తన విలాసవంతమైన ఇంట్లో నిర్వహించారు. విజయ్ మాల్యా డిసెంబర్ 18, 1955న జన్మించారు. ఈ పార్టీ డిసెంబర్ 16న జరిగింది. అంతర్జాతీయ ఫోటోగ్రాఫర్ జిమ్ రీడెల్ సోషల్ మీడియాలో విజయ్ మాల్యా పార్టీ గురించి సమాచారాన్ని పంచుకున్నారు. లలిత్ మోడీ, విజయ్ మాల్యాల ఫోటోను పోస్ట్ చేశారు. లలిత్ తన అందమైన ఇంట్లో విజయ్ మాల్యా కోసం విలాసవంతమైన ప్రీ-70వ పుట్టినరోజు పార్టీని నిర్వహించారని రాశారు. ఈ పోస్ట్‌కు ప్రతిస్పందిస్తూ, లలిత్ మోడీ, “తన స్నేహితుడు విజయ్ మాల్యా పుట్టినరోజును జరుపుకోవడానికి తన ఇంటికి వచ్చిన అతిథులందరికీ ధన్యవాదాలు” అని రాశారు.  ఆ తర్వాత విజయ్ మాల్యా ఆ పోస్ట్‌ను రీట్వీట్ చేశారు. ప్రఖ్యాత వ్యాపారవేత్త, బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్-షా కూడా ఈ పార్టీలో పాల్గొన్నారు. హాలీవుడ్ నటుడు ఇద్రిస్ ఎల్బా, ప్రఖ్యాత ఫ్యాషన్ డిజైనర్ మనోవిరాజ్ ఖోస్లా కూడా ఈ పార్టీలో కనిపించారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలలో కిరణ్ మజుందార్-షా కొన్నిసార్లు మనోవిరాజ్ ఖోస్లాతో నిలబడి, కొన్నిసార్లు ఇద్రిస్ ఎల్బాతో మాట్లాడుతున్నట్లు కనిపించారు. జిమ్ రీడెల్ కూడా పార్టీ ఆహ్వాన కార్డును ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. రీమా, లలిత్ తమ ప్రియమైన స్నేహితుడు విజయ్ మాల్యా గౌరవార్థం ఒక ఆకర్షణీయమైన సాయంత్రం నిర్వహిస్తున్నారని కార్డులో పేర్కొన్నారు.  ఆ కార్డు విజయ్ మాల్యాను “మంచి కాలాల రాజు” అని పేర్కొంది. లలిత్ మోడీ, విజయ్ మాల్యా కలిసి కనిపించడం ఇదే మొదటిసారి కాదు. అంతకుముందు, నవంబర్ 29న, లలిత్ మోడీ తన 63వ పుట్టినరోజును లండన్‌లో చాలా వైభవంగా జరుపుకున్నారు. లండన్‌లోని మేఫెయిర్ ప్రాంతంలోని ప్రసిద్ధ మాడాక్స్ క్లబ్‌లో ఈ పార్టీ జరిగింది. విజయ్ మాల్యా కూడా ఆ పార్టీకి హాజరయ్యారు. ఆ సమయంలో లలిత్ మోడీ ఆ పార్టీకి సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

గ్రీన్ కార్డ్ లాటరీని రద్దు చేస్తూ ట్రంప్ సంచలన నిర్ణయం

  అమెరికాకు వెళ్లాలని కలలు కనే కోట్లాది మంది విదేశీయులకు డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం భారీ షాక్ ఇచ్చింది. దశాబ్దాలుగా కొనసాగుతున్న 'గ్రీన్ కార్డ్ లాటరీ' (డైవర్సిటీ వీసా ప్రోగ్రామ్)ను తక్షణమే నిలిపివేస్తూ ట్రంప్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అమెరికా భద్రత దృష్ట్యా ఈ చర్యలు తీసుకున్నట్లు శ్వేతసౌధం వర్గాలు వెల్లడించాయి. ముఖ్యంగా ఇటీవల అగ్రరాజ్యంలో చోటుచేసుకున్న కాల్పుల ఘటన ఈ నిర్ణయానికి ప్రధాన కారణం అని తెలుస్తోంది. కొద్దిరోజుల క్రితం అమెరికాలోని ప్రసిద్ధ 'బ్రౌన్ యూనివర్సిటీ'లో ఒక దుండగుడు జరిపిన కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు మరణించగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దారుణానికి ఒడిగట్టిన వ్యక్తి పోర్చుగీస్ జాతీయుడని దర్యాప్తులో తేలింది. అయితే ఆ నిందితుడు అసలు అమెరికాలోకి ఎలా ప్రవేశించాడనే కోణంలో విచారణ జరపగా.. అతను 'గ్రీన్ కార్డ్ లాటరీ' ద్వారానే దేశంలోకి అడుగు పెట్టినట్లు అధికారులు గుర్తించారు. అయితే ఇలాంటి నేరపూరిత మనస్తత్వం ఉన్న వ్యక్తులు సులభంగా దేశంలోకి రావడానికి ఈ విధానం మార్గంగా మారుతోందని ట్రంప్ ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు ఈ ఘటనపై హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టీ నోయెమ్ స్పందిస్తూ.. "మన దేశంలోకి ఇటువంటి దారుణమైన వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించకూడదు" అని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఈ ప్రోగ్రామ్‌ను వెంటనే నిలిపివేయాలని యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్‌ను (USCIS) ఆదేశించారు. ఈ నిర్ణయంతో ఇకపై డైవర్సిటీ వీసా కింద కొత్త దరఖాస్తులను స్వీకరించడం నిలిచిపోనుంది.  అమెరికాలోని వలస జనాభాలో వైవిధ్యాన్ని పెంపొందించడం కోసం ఇమిగ్రేషన్ అండ్ నేషనాలిటీ యాక్ట్ కింద ప్రతి ఏటా సుమారు 55,000 గ్రీన్ కార్డులను లాటరీ పద్ధతిలో కేటాయిస్తారు. అమెరికాకు తక్కువ సంఖ్యలో వలస వెళ్లే దేశాల పౌరులకు ఈ విధానం ద్వారా శాశ్వత నివాసం పొందే అవకాశం లభిస్తుంది. అయితే ఇప్పుడు భద్రతా కారణాలతో ఈ ప్రక్రియకు ట్రంప్ బ్రేక్ వేశారు.  ట్రంప్ మొదటి నుంచి అక్రమ వలసలపై కఠినంగా ఉన్నప్పటికీ.. ఇప్పుడు చట్టబద్ధంగా ఉండే లాటరీ విధానాన్ని కూడా రద్దు చేయడం అంతర్జాతీయంగా చర్చకు దారితీసింది. ఈ నిర్ణయం వల్ల ఇతర దేశాల నుంచి అమెరికా వెళ్లి సెటిల్ అవ్వాలనుకునే మధ్య తరగతి ప్రజలకు పెద్ద దెబ్బ తగిలినట్లయింది.

చాయ్ పే చర్చలో... ప్రధాని, ప్రియాంకా

  పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగిసిన నేపథ్యంలో ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఈ సందర్బంగా లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా తన ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన చాయ్ పే చర్చ కార్యక్రమంలో ప్రధాని మోదీ , కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ ఒకేచోట చేరి సరదాగా ముచ్చటించారు. ఈ సమావేశంలో ప్రియాంక వయనాడ్‌ లోక్ సభ నియోజకవర్గం గురించి ప్రధాని మోదీతో చర్చించినట్లు తెలుస్తోంది.  వయనాడ్‌ ఫారెస్ట్‌లో దొరికే ఓ మూలికను వాడుతున్నానని.. దానివల్ల తనకు అలర్జీ సమస్యలు పూర్తిగా తగ్గియని ప్రియాంక తెలిపారు. ఈ సందర్బంగా అధికార ప్రతిపక్షాల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు కాకుండా స్నేహపూర్వకంగా సాగిన సరదా ముచ్చట్లు  నవ్వుల పువ్వులు పూయించాయి. పార్లమెంట్ ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడిన తర్వాత ప్రియాంక గాంధీ చాయ్ పే చర్చ కి హాజరు కావడం విశేషంగా నిలిచింది.  అలాగే ఇటీవల ప్రధాని మోదీ ఇథియోపియా, జోర్డాన్, ఒమన్ పర్యటన వివరాలను ప్రియాంక గాంధీ  గురించి అడగగా, బావుందని ప్రధాని బదులిచ్చారు. ఈ సమావేశంలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ధర్మేంద్ర యాదవ్, ఎన్‌సిపి (ఎస్పీ)కి చెందిన సుప్రియా సులే, సిపిఐ నాయకురాలు డీరాజా  సమావేశంలో పాల్గొన్నారు.   

పాతబస్తీలో రూ. 400 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా

  పాత బస్తీలో గ‌జం ఖాళీ జాగా లేకుండా ల‌క్ష‌లాది నివాసాలున్న చోట‌.. ఏకంగా 7 ఎక‌రాల‌ను ఓ ప్ర‌బుద్ధుడు క‌బ్జా చేస్తే.. ఆ భూమిని హైడ్రా శుక్ర‌వారం కాపాడింది. పోలీసు స్టేష‌న్లో కేసుల‌కు వెర‌వ‌కుండా.. కోర్టు ఫైన్లు కూడా ప‌ట్టించుకోకుండా.. చుట్టూ ఇనుప రేకుల‌తో లోప‌ల ఏం జ‌రుగుతుందో తెలియ‌కుండా ప్ర‌హ‌రీ నిర్మించి.. ఆక్ర‌మ‌ణ‌లో ఉన్నవారిని హైడ్రా ఖాళీ చేయించింది. రెవెన్యూ అధికారుల స‌మ‌క్షంలో.. పోలీసు బందోబ‌స్తు మ‌ధ్య ఇనుప రేకుల ప్ర‌హ‌రీని తొల‌గించి.. అక్క‌డ హైడ్రా ఫెన్సింగ్  ఏర్పాటు చేసింది.   ప్ర‌భుత్వ భూమిగా వివరాలు పేర్కొంటూ హైడ్రా బోర్డులు పెట్టింది.  దీంతో అక్క‌డి స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. జ‌నాభా ఎక్కువ‌గా ఉన్న పాత‌బ‌స్తీలో గ‌జం జాగా దొర‌క‌ని ప్రాంతంలో ఏకంగా 7 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమి ఉండ‌డం ప‌ట్ల స్థానికులు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. హైడ్రా శుక్ర‌వారం కాపాడిన 7 ఎక‌రాల భూమి విలువ దాదాపు రూ. 400 కోట్ల వ‌ర‌కూ ఉంటుంద‌ని అధికారులు అంచ‌నా వేశారు. క‌బ్జాదారులు మాయం చేసిన చెరువుతో పాటు.. నాలాల‌ను పున‌రుద్ధ‌రిస్తే బ‌మృక్‌నుద్దౌలా మాదిరి ఆహ్లాద‌క‌ర వాతావ‌ర‌ణం ఏర్ప‌డుతుంద‌ని చెబుతున్నారు.  కేసులున్నా వెర‌వ‌ని క‌బ్జాదారులు. హైదరాబాద్ జిల్లా బండ్లగూడ మండలం కందికల్ విలేజ్‌లోని మొహమ్మద్‌నగర్ – లాలితాబాగ్ ప్రాంతం, రైల్వే ట్రాక్ సమీపంలో టౌన్ సర్వే నంబర్ 28, బ్లాక్:ఎఫ్, వార్డు నంబర్ 274లో మొత్తం 9.11 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇప్పటికే 2 ఎకరాలు కబ్జా అయి.. నివాసాలు వచ్చేశాయి. ఆ నివాసాల జోలికి వెళ్లకుండా కబ్జాలో ఉన్న 7 ఎకరాల భూమిని హైడ్రా కాపాడింది.  సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్స్ ప్రకారం అక్క‌డ చెరువు ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది.  కాని ఆ చెరువు ఆన‌వాళ్లు ఎక్క‌డా లేకుండా మ‌ట్టితో క‌బ్జాదారులు క‌ప్పేశారు. ఈ  భూమిని కబ్జా చేసి తనదంటూ ఆర్. వెంకటేష్ కుటుంబ సభ్యులు మరియు ఇతరులు పోరాడుతున్నారు. వీరి పై భవానిపురం పోలీసు స్టేష‌న్‌లో రెవెన్యూ అధికారులు కేసులు కూడా పెట్టారు.  ఇప్పుడు ఆయ‌న వార‌సులు ఒక ప‌క్క‌న ఈ భూమి త‌మ‌దంటూ చెబుతుండ‌గా.. వారి వ‌ద్ద నుంచి ప‌ట్టాభి రామి రెడ్డి కొన్నానంటూ మ‌రోవైపు క‌బ్జాలో భాగ‌స్వామ్యం అయ్యాడు.  ఈ మేర‌కు కోర్టులో కేసు కూడా వేశాడు.  అయితే ప్ర‌భుత్వ భూమిని ఏ ప్రాతిప‌దిక‌న త‌న‌దిగా చెప్పుకుంటార‌ని.. కోర్టు స‌మ‌యం వృథా చేసినందుకు కోటి రూపాయ‌లు ఫైన్ కూడా వేసింది.  అయినా క‌బ్జాదారులు ఖాళీ చేయ‌కుండా  కోర్టులు చుట్టూ తిరుగుతున్నారు.   స్థానికుల హ‌ర్షం.. మొహమ్మద్‌నగర్ – లాలితాబాగ్ ప్రాంతంలో, రైల్వే ట్రాక్ సమీపంలో ప్రభుత్వ భూమితో పాటు నాలా, కుంట ను క‌బ్జా దారుల చెర‌ నుంచి విముక్తి క‌ల్పించిన హైడ్రాకు స్థానికులు ధ‌న్య‌వాదాలు తెలిపారు.  హైడ్రాకు ఫిర్యాదు చేయ‌గానే.. స్థానికంగా విచారించి.. వెంట‌నే చ‌ర్య‌లు తీసుకోవ‌డాన్ని కుమ్మరి వాడి పీస్ వెల్ఫేర్ సొసైటీ ప్ర‌తినిధులు ఆనందం వ్య‌క్తం చేశారు.  రెండు కమ్యూనిటీల మధ్య ఉన్న సున్నితమైన ప్రాంతంలో క‌బ్జాల‌కు పాల్ప‌డిన వారు ప్లాట్లుగా మార్చి అమ్మేందుకు ప్ర‌య‌త్నించ‌డం వివాదంగా మారింది. వీరి వెనుక బ‌డాబాబుబులున్నారంటూ ఫిర్యాదు దారులు పేర్కొన్నారు. ఈ అక్రమ ఆక్రమణలపై గతంలోనే బండ్లగూడ తహసీల్దార్, పోలీసు శాఖలకు పలుమార్లు ఫిర్యాదు చేశారు. కోర్టులు కూడా ప్రభుత్వ భూమి అని స్పష్టంగా తీర్పులు ఇచ్చినప్పటికీ కబ్జాదారులు ఖాళీ చేయ‌కుండా ప్లాట్లు చేసి అమ్ముకోవాల‌ని ప్ర‌య‌త్నించ‌డం ఆందోళన కలిగించే అంశమని పేర్కొన్నారు. అటువైపు ఎవ‌రూ వెళ్ల‌డానికి వీలు లేకుండా చేశారంటూ వాపోయారు. హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్ ఐపీఎస్‌కి అభినంద‌న‌లు తెలిపారు. ఆక్రమణదారులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని.. అక్క‌డ నాలాతో పాటు.. చెరువును పున‌రుద్ధ‌రిస్తే పాత‌బ‌స్తీలో చాలా ప్రాంతాల‌కు వ‌ర‌ద ముప్పు త‌ప్పుతుంద‌ని స్థానికులు పేర్కొన్నారు.  

41 మంది మావోయిస్టులు సరెండర్

  మావోయిస్టులుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డి  ఎదుట  41 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ముగ్గురు రాష్ట్ర నాయకులతో పాటు ఛత్తీస్ గఢ్ కు చెందిన మావోయిస్టులు సరెండర్ అయినారు. లొంగిపోయిన వారిలో హిడ్మా బెటాలియన్ కమాండర్స్ ఉన్నారు. సరెండర్ అయిన మావోయిస్టుల నుంచి 24 ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  లొంగిపోయిన వారిలో కామారెడ్డికి చెందిన రాష్ట్ర కమిటీ కార్యదర్శి ఎర్రగొల్ల రవి ఎలియాస్‌ సంతోష్‌, మంచిర్యాలకు చెందిన కనికారపు ప్రభంజన్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఆరుగురు డివిజన్‌ కమిటీ సభ్యులు, ఇద్దరు సెంట్రల్‌ విజన్‌ కమాండర్లు ఉన్నారు. మిగతా మావోయిస్టులంతా ఛత్తీస్‌గఢ్‌కు చెందినవారిగా డీజీపీ శివధర్‌రెడ్డి పేర్కొన్నారు. 

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం చంద్రబాబు భేటీ

  ఢిల్లీలో  సీఎం చంద్రబాబు  పర్యటన కొనసాగుతుంది.  కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతరామన్‌తో ముఖ్యమంత్రి సమావేశం అయ్యారు. పూర్వోదయం ద్వారా ఏపీని గ్రోత్ ఇంజన్‌గా మర్చేందుకు, రాయలసీమను హర్టీకల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని కేంద్రమంత్రిని చంద్రబాబు కోరారు. పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుకు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు రానున్న మూడేళ్లలో రూ.41 వేల కోట్ల ఆర్థిక సహాయం అవసరమని, దీని కోసం వచ్చే బడ్జెట్‌లో ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని చంద్రబాబు కోరారు.  అలాగే కరవు పీడిత ప్రాంతాలైన రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల సాగు, తాగునీటి అవసరాలు తీర్చేందుకు గోదావరి వరద జలాలను తరలించే పోలవరం-నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుకు ఆర్థిక చేయూత అందించాలని విజ్ఞప్తి చేశారు. సాస్కీ పథకం కింద పెండింగ్‌లో ఉన్న యూనిటీ మాల్, గండికోట పర్యాటక ప్రాజెక్టులతో పాటు, కొత్త మౌలిక సదుపాయాల కల్పన కోసం 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.10,054 కోట్లు మంజూరు చేయాలని వినతి పత్రం సమర్పించారు.  కేంద్ర పోర్టులు, షిప్పింగ్, జలరవాణా మంత్రి సర్బానంద సోనోవాల్‌తో రా చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. దుగరాజపట్నం షిప్‌బిల్డింగ్ క్లస్టర్, ఫిషింగ్ హార్బర్లకు కేంద్ర సాయంపై చర్చించారు. దేశంలో నౌకాశ్రయాలు, నౌకా నిర్మాణ రంగ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాలకు కృతజ్ఞతలు తెలిపారు. మత్స్యకారుల జీవనోపాధి మెరుగుదల కోసం ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాన్ని ప్రతిష్ఠాత్మకంగా చేపట్టామని, ఫేజ్–1లో చేపట్టిన నాలుగు ఫిషింగ్ హార్బర్లకు అదనపు నిధులు కేటాయించాలని కోరారు. ప్రకాశం జిల్లా ఓడరేవు ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి సాగరమాల పథకం కింద రూ.150 కోట్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు  

ఫిఫా ఫుట్‌బాల్ ప్రపంచకప్ విజేతకు కళ్లు చెదిరే ప్రైజ్‌మనీ!

వచ్చే ఏడాది జరగనున్న   ఫుట్‌బాల్ వరల్డ్ కప్ విజేత జట్టుకు బంపర్ ఆఫర్ తగలనుంది. ఫిఫా ప్రపంచ కప్  టోర్నీ ఛాంపియన్‌కు రూ.451 కోట్ల ప్రైజ్‌మనీ దక్కనుంది.  2022 వరల్డ్ కప్ గెలిచిన అర్జెంటీనా రూ.379కోట్లు లభించాయి. గత సారితో పోలిస్తే ఈ సారి నగదు బహుమతిని ఫిఫా 48.9శాతం పెంచింది.  అంటే 2026 ఫుట్‌బాల్ ప్రపంచ కప్ విజేత జట్టుకు కళ్లు చెదిరే ప్రైజ్‌మనీ దక్కనుంది. విజేత జట్టుకు రికార్డు స్థాయిలో రూ.451 కోట్లు ప్రైజ్ మనీగా దక్కుతుంది. 2022 ప్రపంచ కప్ గెలిచిన అర్జెంటీనాకు రూ.379 కోట్లు లభించాయి. గత సారితో పోలిస్తే ఈ సారి నగదు బహుమతిని ఫిఫాభారీగా పెంచింది. 2022 కప్‌ టోర్నీ  మొత్తం ప్రైజ్‌మనీ రూ.3971 కోట్లు కాగా.. ఇప్పుడు దానిని భారీగా రూ.5911 కోట్లకు పెంచారు. గ్రూప్ దశలో 48 జట్లు పోటీపడనున్నాయి. జట్టుకు రూ.81 కోట్ల చొప్పున దక్కనున్నాయి. ఈ టోర్నీ సన్నద్ధత కోసం ప్రతి జట్టుకు రూ.13.53కోట్లు లభిస్తాయి. రౌండ్ ఆఫ్ 32 దశకు చేరే జట్లకు రూ.99.27 కోట్ల చొప్పున.. ప్రిక్వార్టర్స్‌లో ప్రవేశించే టీమ్‌లకు రూ.135 కోట్ల చొప్పున లభిస్తాయి. క్వార్టర్స్ చేరే జట్లకు రూ.171 కోట్ల చొప్పున దక్కుతాయి. నాలుగో స్థానంలో నిలిచే జట్టు రూ.243 కోట్లు, మూడో స్థానాన్ని సాధించే టీమ్ రూ.261 కోట్లు సంపాదిస్తాయి.  రన్నరప్‌కు రూ.297 కోట్లు లభిస్తాయి. ప్రపంచ కప్ విజేతతో పోలిస్తే క్లబ్ ప్రపంచ కప్‌లో గెలిచే జట్టుకే ఎక్కువ నగదు బహుమతి దక్కనుంది. 2025 క్లబ్ ప్రపంచ కప్ నెగ్గిన చెల్సీకి రూ.1128 కోట్లు లభించాయి. జాతీయ జట్లతో పోలిస్తే క్లబ్ జట్ల నిర్వహణకు ఎక్కువ ఖర్చులు అవుతుండటంతో ఫిఫా అందుకు తగ్గట్టే ప్రైజ్‌మనీ అందిస్తోంది.

ఆపరేషన్ సింధూర్ ఎఫెక్ట్.. రిపేర్లు మొదలుపెట్టిన పాక్

జమ్మూ కశ్మీర్‌  పహల్గామ్ లో ఈ ఏడాది ఏప్రిల్ 22న జరిగిన  ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం మే 7న ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఆపరేషన్‌లో భాగంగా పాక్, పీఓకేలోక చొచ్చుకెళ్లి ఉగ్ర స్థావరాలపై విరుచుకుపడింది. ఆ సందర్భంగా భారత్ దాడుల్లో మురిద్ ఎయిర్‌బేస్‌లోని కీలక భవనం ధ్వంసమైందనీ,  ప్రస్తుతం పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయని శాటిలైట్ ఫోటోలు వెల్లడించాయి. పాక్ డ్రోన్ కార్యకలాపాలకు కేంద్రమైన ఈ భవనంపై జరిగిన దాడి తీవ్ర నష్టాన్ని కలిగించింది. ఆపరేషన్ సిందూర్ కారణంగా పాకిస్థాన్ లో దెబ్బతిన్న ఇతర ఎయిర్‌బేస్‌లలోనూ మరమ్మతులు జరుగుతున్నా యి.    26 మంది అమాయకులను బలిగొన్న పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం మే 7న ఆపరేషన్ సిందూర్ చేపట్టి పాకిస్థాన్‌, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై విరుచుకుపడింది. దీంతో ఇరు దేశాల మధ్య సైనిక ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో పాక్ వైమానిక, సైనిక స్థావరాలపై భారత వైమానిక దళం బాంబులు వర్షం కురిపించింది. పాకిస్థాన్‌కు చెందిన మురిద్ ఎయిర్‌బేస్‌లోని కీలక కమాండ్ అండ్ కంట్రోల్ భవనంపై కూడా దాడిచేసింది. ఆ దాడిలో ధ్వంసమైన భవనానికి పాక్ పునర్నిర్మాణ పనులు చేపట్టినట్టు తాజాగా హై-రిజల్యూషన్ శాటిలైట్ ఫోటోలు బయటపెట్టాయి. భారత్ దాడిలో భవనం పైకప్పు కూలిపోయి, నిర్మాణానికి తీవ్ర నష్టం వాటిల్లిందని భావిస్తున్నారు. డిసెంబర్ 16 నాటి వంటోర్  ఫోటోలు పాకిస్థాన్ డ్రోన్‌లను ఆపరేట్ చేసే ఒక పెద్ద కాంప్లెక్స్ పక్కనే ఉన్న భవనాన్ని ఎర్రటి టార్పాలిన్‌తో కప్పి ఉంచడాన్ని చూపిస్తున్నాయి. ఈ టార్పాలిన్‌ను రిపేర్లు లేదా జరిగిన నష్టాన్ని శాటిలైట్ నిఘా కంటబడకుండా ఉండేందుకు సైన్యాలు సాధారణంగా ఉపయోగిస్తాయి. జూన్ నెలలో తీసిన ఫోటోల్లో భవనంపై చిన్న ఆకుపచ్చ టార్పాలిన్ కనిపించింది. ఇప్పుడు మొత్తం భవనం పెద్ద టార్పాలిన్ కింద మరమ్మతు లేదా పునర్నిర్మాణంలో ఉంది. దీనిపై దాడికి రూఫ్-పెనెట్రేటింగ్ వార్‌హెడ్‌లు కలిగిన క్షిపణులను ఉపయోగించి ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఈ క్షిపణులు భవనం పైకప్పును చీల్చుకుని లోపల పేలి, ఎక్కువ నష్టాన్ని కలిగిస్తాయి. పంజాబ్‌లోని చక్వాల్ జిల్లాలో ఉన్న మురిద్ ఎయిర్‌బేస్ పాకిస్థాన్ వైమానిక దళానికి  ముఖ్యమైన స్థావరం. ఇక్కడ నుంచే షాహ్‌పర్ సిరీస్, బుర్రాక్, బేరక్టార్ టిబి2/ అకిన్సీ, వింగ్ లూంగ్ II వంటి డ్రోన్‌లను  ఆపరేట్ చేస్తారు. మే 10న పాకిస్థాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ మేజర్ జనరల్ కషిఫ్ అబ్దుల్లా కాల్పుల విరమణ కోసం భారత్ డీజీఎంఓకి కాల్ చేయడానికి కొన్ని గంటల ముందు ఆ దేశ ఎయిర్‌బేస్‌లపై భారత వైమానిక దళం దాడులను తీవ్రతరం చేసింది. దీనికి ముందు 26కు పైగా ప్రదేశాలలో పాక్ డ్రోన్‌ దాడులకు తెగబడటంతో ప్రతిగా భారత వాయు సేన ఈ దాడులు చేసింది. ఈ సమయంలో ఐఏఎఫ్ ఇంటిగ్రేటెడ్ ఎయిర్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ నోడ్స్, ఎయిర్‌బేస్‌లు, ఎస్-400 క్షిపణి రక్షణ వ్యవస్థపై పాక్ దాడులు చేసింది. ఉధంపూర్, పఠాన్‌కోట్, అదంపుర్, భుజ్‌లలోని ఐఏఎఫ్ స్థావరాలకు, సిబ్బందికి స్వల్ప నష్టం జరిగింది. మే 10న మురిద్‌పై భారత్ రెండో దాడి చేయగా.. అక్కడ భూగర్భ సదుపాయానికి 30 మీటర్ల దూరంలో మూడు మీటర్ల వెడల్పుతో పెద్ద గొయ్యి ఏర్పడినట్టు శాటిలైట్ ఫోటోలు వెల్లడించాయి. నిపుణుల అంచనా ప్రకారం.. ఈ భూగర్భ స్థావరం ప్రత్యేక పరికరాల నిల్వకు లేదా భారీ బాంబు దాడులను తట్టుకోగలిగేందుకు ఉద్దేశించినదట. దాడులకు గురైన తన ఎయిర్‌బేస్‌లలో పునర్నిర్మాణ పనులు దాయాది దేశం ప్రారంభించింది. సర్దార్‌లోని ముషఫ్ ఎయిర్‌బేస్, దక్షిణ పంజాబ్‌లోని రహీమ్ యార్ ఖాన్‌లోని దెబ్బతిన్న రన్‌వేలను మరమ్మతు చేసుకుంది. జాకబ్‌బాద్, భోలారి, సుక్కూర్‌లలోని హ్యాంగర్‌లు ధ్వంసమయ్యాయి. జాకబ్‌బాద్‌లో పలుఎ ఫ్-16 ఫైటర్ విమానాలు ధ్వంసమైనట్టు నివేదికలు వచ్చాయి. భోలారిలోని హ్యాంగర్‌పై దాడిలో ఒక ఎయిర్‌బోర్న్ ఎర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ ఎయిర్‌క్రాఫ్ట్ ధ్వంసమైంది. సుక్కూర్‌లో హ్యాంగర్‌ను నేలమట్టం చేసింది. ఇస్లామాబాద్ సమీపంలోని నూర్ ఖాన్ ఎయిర్‌బేస్‌పై భారత వైమానిక దళం జరిపిన  దాడులలో ధ్వంసమైన కాంప్లెక్స్ స్థానంలో కొత్త నిర్మాణాలు చేపట్టింది.

పాక్‌కు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ షాక్!

ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్థాన్‌కు అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ మరోసారి షాకిచ్చింది. దేశంలో విపరీతంగా పెరుగుతున్న జనాభాను అరికట్టేందుకు గర్భనిరోధక సాధనాలపై పన్ను మినహాయింపు ఇవ్వాలన్న పాక్ ప్రభుత్వ అభ్యర్థనను ఐఎంఎఫ్ నిర్మొహమాటంగా తిరస్కరించింది. పన్ను వసూళ్లలో ఎలాంటి రాజీ పడకూడదనే ఉద్దేశంతో, కండోమ్‌లపై విధిస్తున్న 18 శాతం జీఎస్‌టీని తొలగించేందుకు ద్రవ్య నిధి ససేమిరా అంది. ప్రస్తుతం పాకిస్థాన్ ఐఎంఎఫ్ నుంచి పొందుతున్న బెయిలవుట్ ప్యాకేజీలో భాగంగా కఠినమైన నిబంధనలను అమలు చేస్తోంది. ఈ క్రమంలో గర్భనిరోధక సాధనాలపై పన్ను తగ్గిస్తే రాబడి లక్ష్యాలు దెబ్బతింటాయని ఐఎంఎఫ్ అభిప్రాయపడింది. ఒకవేళ రాయితీలు ఇవ్వాలనుకుంటే వచ్చే బడ్జెట్ వరకు వేచి చూడాలని స్పష్టం చేసింది. ఇలాంటి మినహాయింపులు ఇస్తే పన్నుల అమలు యంత్రాంగం బలహీన పడుతుందనీ, పైగా ఈ వస్తువుల అక్రమ రవాణా పెరిగే ప్రమాదం ఉందని ఐఎంఎఫ్ హెచ్చరించింది. కేవలం కండోమ్‌లే కాకుండా మహిళలకు అవసరమైన శానిటరీ ప్యాడ్‌లు, శిశువుల డైపర్లపై కూడా పన్ను రాయితీలు ఇవ్వడానికి ఐఎంఎఫ్ నో అంది. పాక్ ఫెడరల్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ పంపిన ఈ ప్రతిపాదనల వల్ల దాదాపు 400 నుంచి 600 మిలియన్ పాకిస్థాన్ రూపాయల ఆదాయం తగ్గుతుందని అంచనా వేసి, ఆ ప్రతిపాదనలను నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. ప్రపంచంలో అత్యంత వేగంగా జనాభా పెరుగుతున్న దేశాల్లో పాకిస్థాన్ ఒకటి. ప్రస్తుతం అక్కడ ఏటా దాదాపు 60 లక్షల మంది జనాభా అదనంగా చేరుతున్నారు. జనాభా వృద్ధి రేటు 2.55 శాతంగా ఉంది. ఈ పెరుగుదల వల్ల ప్రభుత్వ సేవలు, సామాన్యుల ఆదాయాలపై తీవ్ర ఒత్తిడి పడుతోంది. ఇలాంటి సమయంలో గర్భనిరోధక సాధనాలను చౌకగా అందించాలని ప్రభుత్వం భావించింది. అయితే ఐఎంఎఫ్ నిబంధనల వల్ల విధించిన 18 శాతం జీఎస్‌టీ కారణంగా, ఇవి సామాన్యులకు అందనంత భారంగా మారాయి.   విదేశీ అప్పుల కోసం నిత్యావసరాలను కూడా పాక్ ప్రభుత్వం  లగ్జరీ వస్తువులుగా పరిగణించాల్సి రావ డం అక్కడి దయనీయ స్థితికి అద్దం పడుతోంది. రుణం కోసం ఐఎంఎఫ్ షరతులను నెరవేర్చడానికి పాకిస్థాన్ నానా పాట్లూ పడుతోంది. పన్ను వసూళ్లతో పాటు ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణను కూడా వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ ను అమ్మకానికి పెట్టిన సంగతి తెలిసిందే.  ఇప్పటి వరకు ఐఎంఎఫ్ నుంచి దాదాపు 3.3 బిలియన్ డాలర్ల నిధులను పాక్ పొందింది. ఈ అప్పుల నుంచి బయటపడలేక.. చివరకు దేశ జనాభా నియంత్రణ అంశాన్ని కూడా ఆర్థిక లెక్కలకే  వదిలేయాల్సిన దుస్థితిలో పాకిస్థాన్ ఉంది.