బావ,బామ్మర్దుల ఆధిపత్య పోరు: రేవంత్ ఆజ్యం !!

బిఆర్ఎస్ పార్టీలో బావ,బామ్మర్దుల మధ్య ఆధిపత్య పోరాటం ముమ్మరమైనట్టు తాజా ఘటనలు,సన్నివేశాలు రుజువు చేస్తున్నవి.చాలాకాలంగా పార్టీపై ఆధిపత్యం కోసం అంతర్గత పోరాటం జరుగుతున్నప్పటికీ ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ,కౌశిక్ రెడ్డిల గొడవలో మాజీ మంత్రి హరీశ్ రావు పైచేయి సాధించినట్టు ఆ పార్టీ క్యాడర్ భావిస్తున్నది.పార్టీలో కేసీఆర్ తర్వాత నెంబర్ టూగా కేటీఆర్,నెంబర్ త్రీగా హరీశ్ రావు వ్యవహరిస్తున్నారు.ఇద్దరూ మంత్రులుగా పనిచేసిన వారే! అయితే కేటీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా సమర్థంగా 'పెర్ఫార్మ్' చేయడం లేదని కొందరు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు,మాజీ ఎమ్మెల్యేలు,నాయకులు,కార్యకర్తలు విమర్శిస్తున్నారు.పార్టీ అధికారం కోల్పోయాక కూడా కేటీఆర్ లో మునుపటి గర్వం,అహంకారం తగ్గడం లేదని అంటున్నారు.పార్టీ అధికారంలో ఉన్నట్టుగానే వర్కింగ్ ప్రెసిడెంట్ పనితీరు కనిపిస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. కేటీఆర్ వైఫల్యాలను హరీశ్ తనకు అనుకూలంగా మలచుకొని దూసుకుపోతున్నట్టు తెలుస్తోంది.కాంగ్రెస్ ప్రభుత్వంపైన,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపైన పెద్ద ఎత్తున విరుచుపడుతున్నారు.ఓటమి వల్ల పార్టీ శ్రేణుల్లో నెలకొన్న స్తబ్దత,నిరాశా నిస్పృహలను తొలగించేందుకు హరీశ్ రావు దూకుడు ప్రదర్శిస్తున్నట్టు పార్టీలో ప్రచారం జరుగుతోంది.బావ,బామ్మర్దుల మధ్య జరుగుతున్న 'పోరాటం'తో పార్టీ అధినేత కేసీఆర్ మరుగునపడి పోతున్నారు.కేసీఆర్ ఎర్రవల్లి ఫార్మ్ హౌజ్ కే పరిమితం కావడం హరీశ్ రావుకు కలిసి వచ్చినట్టు చెబుతున్నారు.2001 నుంచి కేసీఆర్ వెన్నంటి ఉద్యమంలో నడచిన హరీశ్ రావు,తెలంగాణ ప్రభుత్వంలోనూ తన మేనమామకు వెన్నుదన్నుగా ఉన్నారు.కేటీఆర్ మంత్రిగా మంచి మార్కులు సంపాదించినా,హరీశ్ రావు ప్రాబల్యానికి గండి కొట్టే చర్యలు అనేకం చేసినట్టు  ఆయనపై ఆరోపణలున్నవి. ఇద్దరి మధ్య జగడం 2014 నుంచి కొనసాగుతున్నది.అధికారం కోల్పోయాక అది ఉధృతమైనట్టు పార్టీ కార్యకర్తలు చెబుతున్నారు.ముఖ్యమంత్రిగా కేసీఆర్ తొలి టర్మ్ లోనే బావ,బామ్మర్దుల మధ్య  'ఆధిపత్య' పోరుకు బీజం పడింది.అప్పట్లో 'కేసీఆర్ తర్వాత సీఎం మా అన్న కేటీఆర్' అని ఎమ్మెల్సీ కవిత ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్య హరీశ్ రావుకు ఆయనకు మద్దతిచ్చే ఎమ్మెల్యేలకు తీవ్ర ఆగ్రహం తెప్పించాయి.అదే రోజు హరీశ్ రావు కేసీఆర్ నివాసానికి వెళ్ళి,కేటీఆర్,కవిత,సంతోష్... ఇతర కుటుంబసభ్యులతో 'ఘర్షణ'కు దిగారని బిఆర్ఎస్ నాయకులంటున్నారు.అది సద్దుమణిగినా ఇద్దరిమధ్యా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వాతావరణంకొంత కాలం కొనసాగింది. బంజారాహిల్స్ లోని మంత్రుల నివాస సముదాయంలో నాటి మంత్రి హరీశ్ రావు క్వార్టర్ దగ్గర 'స్పెషల్ బ్రాంచ్' పోలీసులు మఫ్టీలో నిఘా పెట్టడం,ఆ విషయాన్ని హరీశ్ రావు గుర్తించి కేటీఆర్ తో గొడవ పెట్టుకోవడం,నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గరకు ఈ పంచాయతీ వెళ్లడం,ఇద్దరినీ ఆయన నచ్చచెప్పడం... వంటి  ఘటనలను కొందరు బిఆర్ఎస్ నాయకులు గుర్తు చేస్తున్నారు.హరీశ్ రావును ఎవరెవరు కలుస్తున్నారో 'ఆరా' తీయడానికి కేసీఆర్ లేదా కేటీఆర్ నుంచి స్పెషల్ బ్రాంచ్ కు ఆదేశాలు అందినట్టు అప్పట్లో ఒక ప్రచారం జరిగింది.కేటీఆర్ ఆదేశాలతోనే  తనపైన నిఘా పెట్టినట్టు హరీశ్ రావు అనుమానించినందువల్ల ఇద్దరి మధ్య వాదోపవాదాలు జరిగాయని తెలిసింది. అలాగే ఇరిగేషన్ మంత్రిగా హరీశ్ రావు 'డిస్టింక్షన్' మార్కులు సంపాదించడంతో కేటీఆర్ లో అసూయ పెరిగిందన్న ప్రచారమూ అప్పట్లో జరిగింది.పైగా టిఆర్ఎస్ ఆవిర్భావం నుంచి కార్యకర్తగా,నాయకునిగా హరీశ్ కు గుర్తింపు ఉంది.ఆ గుర్తింపే పార్టీపై ఆయన  పట్టు పెరగడానికి కారణమైంది.కానీ పార్టీ అధ్యక్షుడు,ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారునిగా కేటీఆర్ కు తగిన గౌరవం లభించింది తప్ప అది ఆయన 'కష్టార్జితం' కాదన్న అభిప్రాయం పార్టీ కార్యకర్తల్లో ఉన్నది.ఐటి,పరిశ్రమల మంత్రిగా కేటీఆర్ సక్సెస్ కావడం వెనుక తన కృషితో పాటు  కొందరు ఐఏఎస్,ఐపీఎస్ అధికారులు శక్తివంచన లేకుండా పనిచేశారని చెబుతున్నారు.   పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరు అధికార కాంగ్రెస్ పార్టీకి అయాచిత వరంగా మారింది.ఈ పోరాటంలో ఆజ్యం పోయడానికి సీఎం రేవంత్  రెడ్డి ప్రయత్నిస్తున్నారు.వాళ్ళిద్దరి మధ్య దూరం మరింత పెరిగేలా రేవంత్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.బిఆర్ఎస్ లో 'అంతా తానే' అన్నట్లుగా వ్యవహరిస్తూ వచ్చిన కేటీఆర్ కు చెక్ పెట్టడానికి పార్టీ అధికారం కోల్పోవడం వల్ల హరీశ్ రావుకు కలిసి వచ్చిందంటున్నారు.ఒకవేళ కేసీఆర్ హ్యాట్రిక్ సాధించి ఉంటే కేటీఆర్ మరింత రెచ్చిపోయేవారని,హరీశ్ కు మంత్రి పదవి కూడా రాకుండా చేసే వారన్న చర్చ పార్టీ వర్గాల్లో ఉన్నది.   కాగా కేటీఆర్ ప్రభావాన్ని అటు బిఆర్ఎస్ లోనూ,జనాల్లోనూ తగ్గించాలన్నది  రేవంత్ ఎత్తుగడ. కొద్ది రోజులుగా కేటీఆర్ విమర్శలను పట్టించుకోనట్టుగా వ్యవహరిస్తూ, అదే సమయంలో హరీష్ రావు విమర్శలకు  కౌంటర్ ఇస్తుండడాన్ని గమనించవచ్చు.దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టార్గెట్ చేయడంతో సహజంగానే ప్రతిపక్ష శిబిరంలో హరీష్ రావు హైలెట్ అవుతున్నారు.బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను పట్టించుకోకుండా హరీష్ రావు పైనే విమర్శలు చేయడం,ఆయనకే సవాళ్లు విసరడం వెనుక రేవంత్ రెడ్డి వ్యూహాన్ని అర్ధం చేసుకోవచ్చు.తనకు కేసీఆర్ లేదా హరీశ్ తప్ప కేటీఆర్ పోటీదారు కాదనే సందేశాన్ని ప్రజల్లోకి పంపిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో కేటీఆర్ ను 'మేనేజ్మెంట్ కోటా'అంటూ విమర్శలు చేసిన రేవంత్ రెడ్డి తాజాగా  కేటీఆర్ విమర్శలకు,సోషల్ మీడియాలో ఆయన కౌంటర్లకు స్పందించడం లేదు. కొన్ని రోజులుగా హరీష్ రావు చుట్టూనే తెలంగాణ రాజకీయాలు నడుస్తున్నవి.కేటీఆర్ ను ముఖ్యమంత్రిగా తాను  టార్గెట్ చేస్తే అది ఆయనకు రాజకీయంగా మైలేజ్ రావచ్చునని రేవంత్ భావిస్తున్నారు.  హరీష్ రావును హైలైట్ చేయడం వల్ల ఆయనకు పాపులారిటీ రావడంతో పాటు,బావ బామ్మర్దుల మధ్య  వైరం పెరుగుతుందని కాంగ్రెస్ నాయకులంటున్నారు. -ఎస్.కే.జకీర్ (సీనియర్ జర్నలిస్ట్)   

జెత్వాని కేసులో కుక్కల విద్యాసాగర్ రిమాండ్ 

ముంబై నటి  కాదంబరి జెత్వాని కేసులో  అండర్ గ్రౌండ్ లో ఉన్న    వైసిపి నేత కుక్కల విద్యాసాగర్ ను  14 రోజుల పాటు రిమాండ్ కు తరలించారు.  విద్యాసాగర్ పై కేసు నమోదు చేసిన తర్వాత అండర్ గ్రౌండ్ లో ఉండి ముంబై తదితర నగరాల్లో కుక్కల విద్యాసాగర్ తలదాచుకున్నాడు.డెహ్రాడూన్ నుంచి  పోలీసులు విజయవాడ కోర్టుకు తరలించి రిమాండ్ కు పంపారు.   జెత్వానీపై  అప్పట్లో బడా పారిశ్రామికవేత్త జిందాల్  రేప్ చేసిన నేపథ్యంలో అతనిపై రేప్ కేసు నమోదైంది. ఈ రేప్ కేసు నుంచి తప్పించుకోవడానికి ఆ బడా పారిశ్రామిక వేత్త అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శరణు జొచ్చాడు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి ఆ పారిశ్రామికవేత్త అత్యంత సన్నిహితుడు. ఈ పరిచయాన్ని ఉపయోగించుకునే జిందాల్ జగన్ పంచన చేరారు. నేరం చేసిన జిందాల్ కు శిక్షపడే అవకాశాలున్నప్పటికీ జగన్ ఆ రేపిస్ట్ కు అండగా నిలిచారు.  జగన్ ఆదేశాలతో వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ జెత్వానిపై వేధింపులు చేస్తున్నప్పటికీ విషయం బయటకు పొక్కలేదు. ఎందుకంటే కుక్కల విద్యాసాగర్ జగన్ కు సన్నిహితుడు కావడమే. ఈ కేసులో ఎ వన్ ముద్దాయి కుక్కల విద్యాసాగర్.  దీంతో జెత్వానీ కేసులో అరెస్ట్ ల పర్వం మొదలైందనే అనుకోవాలి.

జ‌గ‌న్ గ‌తం గుర్తుచేసుకో.. మ‌త రాజ‌కీయాలు చేసింది నువ్వుకాదా!

కలియుగ వైకుంఠం.. తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన అపచారంతో యావత్ ప్రపంచంలోని శ్రీవారి భక్తులు కలవరానికి గురవుతున్నారు. పవిత్రమైన లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందంటూ ల్యాబ్ రిపోర్ట్ రావడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారం దేశ వ్యాప్తంగా పెద్ద దుమారం రేపుతోంది. కేంద్ర ప్రభుత్వ పెద్దలు సైతం ఈ అంశంపై స్పందించి.. అసలేం జరిగిందని ఆరా తీస్తున్నారు. మరోవైపు ఏపీ ప్రభుత్వం ఈ ఘటనను సీరియస్‌గా తీసుకుంది. కల్తీ వ్యవహారంలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు స్పష్టం చేశారు. లడ్డూ ప్రసాదం కల్తీ విషయంపై ప్రపంచ వ్యాప్తంగా హిందువులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఉత్తర భారతంలో ఈ ఆగ్రహం మరింత తీవ్రంగా వ్యక్తం అవుతోంది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్య‌మంత్రి, వైసీపీ అధినేత జగన్ మోహ‌న్‌ రెడ్డికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం తెలుసుకుంటే వైసీపీ నేతలకు నిద్రపట్టదనడంలో అతిశయోక్తి లేదు. జగన్ రెడ్డి.. తిరుమలను ఉపయోగించుకున్న తీరు.. అవినీతి, అక్రమాలకు వాడుకున్న వైనం ఒక్కొక్క‌టిగా వెలుగులోకి వ‌స్తుండ‌టంతో హిందువుల్లో ఆగ్ర‌హం క‌ట్ట‌లు తెంచుకుంటున్నది. శుక్ర‌వారం(సెప్టెంబర్ 20) సాయంత్రం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్రెస్‌మీట్ పెట్టి ఇదంతా కేవ‌లం చంద్ర‌బాబు నాయుడు రాజ‌కీయ‌మ‌ని, తిరుమ‌ల వేంక‌టేశ్వ‌ర స్వామినికూడా చంద్ర‌బాబు రాజ‌కీయాల‌కోసం వాడుకుంటున్నారని విమ‌ర్శ‌లు చేశారు.  అయితే జ‌గ‌న్ గ‌తాన్ని గుర్తుచేసుకుంటే రాజ‌కీయాల‌ కోసం మ‌తాన్ని వాడుకున్న‌ది ఎవ‌ర‌న్న‌ది తెలుస్తుందంటూ నెటిజ‌న్లు కౌంట‌ర్ ఇస్తున్నారు.  తిరుమ‌ల‌ను, హిందూ మ‌తాన్ని రాజ‌కీయంగా వాడుకున్న‌ది జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అనేది జ‌గ‌మెరిగిన స‌త్యం. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి క్రిస్టియ‌న్ మ‌త విశ్వాసాల‌ను బ‌లంగా న‌మ్మే వ్య‌క్తి. ఆయ‌న హిందూ దేవాల‌యాల‌కు వెళ్ల‌డం చాలా అరుదు.   2009లో ఒక‌సారి జ‌గ‌న్ తిరుమ‌ల వెళ్లారు. 2019 ఎన్నిక‌ల‌కు ముందు క్రిస్టియానిటి నుంచి హిందువుగా మ‌త మార్పిడి చేసుకున్న‌ట్లుగా త్రివేణి సంగ‌మంలో శార‌దాపీఠం స్వ‌రూపానంద స‌ర‌స్వ‌తి  జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని మూడు సార్లు నీటిలో ముంచారు. ఇందంతా 2019 ఎన్నిక‌ల ముందు జ‌రిగిన తంతు.. ఈ వ్య‌వ‌హారం అంతా రాజ‌కీయ అవ‌స‌రాల‌ కోసం జ‌రిగింద‌నేది అంద‌రికి తెలిసిన బ‌హిరంగ ర‌హ‌స్య‌మే. హిందువుల ఓట్లకోసం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఇలా ప్ర‌వ‌ర్తించార‌నేది రాజ‌కీయాల‌పై అవ‌గాహ‌న ఉన్న‌వారిని ఎవ‌ర్ని అడిగి చెప్పేస్తారు. వైసీపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ముఖ్య‌మంత్రి హోదాలో జ‌గ‌న్ రెడ్డి హిందువుల విశ్వాసాల‌కు విలువ‌నిచ్చారా అంటే అదీ లేదు. ఎవ‌రైనా దేవుడికి వ‌స్త్రాల‌కు స‌మ‌ర్పించే స‌మ‌యంలో స‌తీస‌మేతంగా వెళ్తారు. ప్ర‌భుత్వం త‌ర‌పున ముఖ్య‌మంత్రి హోదాలో అలా పట్టువస్త్రాలు స‌మ‌ర్పించ‌డం సంప్ర‌దాయం. కానీ,   దేవాల‌యాల‌కు వెళ్లిన స‌మ‌యంలో జ‌గ‌న్ వెంట ఆయ‌న స‌తీమ‌ణి భార‌తి ఎప్పుడూ క‌నిపించ‌లేదు. పైగా.. తాడేప‌ల్లి ప్యాలెస్‌లోనే తిరుప‌తి త‌ర‌హాలో సెట్ వేసి వేంక‌టేశ్వ‌ర స్వామి విగ్ర‌హాన్ని ఏర్పాటు చేశారు. త‌ద్వారా ..  మేము తిరుమ‌ల‌కు రాము.. తిరుమ‌ల వేంక‌టేశ్వ‌ర స్వామినే  మా ప్యాలెస్ కు తీసుకొచ్చామ‌న్న‌ట్లుగా  జ‌గ‌న్ ప్ర‌వ‌ర్తించారు.   భార‌త‌దేశంలో ఎవ‌రి మ‌తాన్ని వారు గౌర‌వించుకుంటారు. అందులో ఎలాంటి త‌ప్పులేదు. కానీ, జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి 2019 ఎన్నిక‌ల‌కు ముందు మ‌త మార్పిడి చేసుకోవ‌టానికి కార‌ణం ఏమిటి? అందులో రాజ‌కీయ అంశాలు ఏమీ లేవ‌ని కొద్దిసేపు అనుకుంటే.. జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన  త‌రువాత ఏ ఒక్క హిందూ ఆల‌యాన్నైనా నిర్మించారా? మ‌ర‌మ్మ‌తులు చేశారా? ఆల‌యాల భూమలు ఆక్ర‌మ‌ణ‌ల‌కు గురి కాకుండా ప‌రిర‌క్షించారా? అంటే  లేదు అన్న సమాధానమే వస్తుంది. జగన్ అధికారంలో ఉన్న సమయంలో ఏపీలో ప‌లు హిందూ ఆలయాలపై దాడులు జ‌రిగాయి. జగన్ హయాంలో  రాష్ట్రంలో దేవుడికే రక్షణ లేని పరిస్థితి ఉంది. జగన్ అధికారంలో ఉండగా అంతర్వేది నరసింహస్వామి రథం దగ్దం, విజయవాడ దుర్గమ్మ గుడిలో వెండి రథానికి ఉండే సింహాలు మాయం, విజయవాడలో సాయిబాబా విగ్రహం ధ్వంసం,  కర్నూల్ జిల్లాలో ఆంజనేయ స్వామి విగ్రహం ధ్వంసం.. వంటి ఎన్నో సంఘటనలు జరిగాయి. ఆ సమయంలో ప్రభుత్వం, పోలీసులు ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. దీంతో అప్పట్లోనే జగన్ సర్కార్ హిందూ దేవాలయాలపై దాడులను ప్రోత్సహిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తాయి. దీనికితోడు హిందువులు పుణ్య‌క్షేత్రంగా భావించే తిరుమ‌ల‌లోనూ జ‌గ‌న్ హ‌యాంలో అనేక అప‌చారాలు చోటు చేసుకున్నాయి. ల‌డ్డూ నాణ్య‌త లేకపోవ‌టంతో అప్ప‌ట్లోనే భ‌క్తులు టీటీడీ తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అప్ప‌ట్లో ల‌డ్డూ నాణ్య‌త‌లేక‌పోవ‌టానికి ల‌డ్డూ త‌యారీకి వినియోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు ఉండ‌ట‌మేన‌ని ఇప్పుడు అర్థ‌మ‌వుతుంది.  జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డికి హిందూ మ‌తంపై ఎలాంటి గౌర‌వం లేదు.. కేవ‌లం రాజ‌కీయాల కోస‌మే దానిని వాడుకుంటున్నార‌న‌డానికి ఎన్నో ఉదాహ‌ర‌ణ‌లు ఉన్నాయి. జ‌గ‌న్ తిరుమ‌ల వెళ్లిన స‌మ‌యంలో అర్చ‌కులు ఆయ‌న‌కు ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. ఆ స‌మ‌యంలో నెత్తిన అక్షింత‌లు వేశారు. జ‌గ‌న్ వెంట‌నే వాటిని త‌ల‌పై నుంచి తొల‌గించేశారు. హిందుత్వంపై గౌర‌వం ఉన్న‌వారు ఎవ‌రైనా అర్చ‌కులు దీవిస్తూ నెత్తిన వేసిన అక్షింత‌ల‌ను తొల‌గించ‌రు. చాలాసేపు త‌ల‌లో అలానే ఉంచుకుంటారు. కానీ, జ‌గ‌న్ ప‌లు సంద‌ర్భాల్లో అర్చ‌కులు దీవిస్తూ త‌న నెత్తిన వేసిన అక్షింత‌ల‌ను వెంట‌నే తొల‌గించిన వీడియోలు  సోష‌ల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అవుతున్నాయి. సీఎం చంద్ర‌బాబు నాయుడు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ హిందువులు. అయినా వారు ముస్లీం, క్రైస్త‌వుల మ‌తాల‌ను గౌర‌వంగా చూస్తారు. జ‌గ‌న్‌లా న‌టించ‌కుండా   ముస్లిం సంప్ర‌దాయాల‌ను,  క్రైస్త‌వులు సంప్ర‌దాయాల‌ను పాటిస్తూ గౌర‌వంగా ఉంటారు. కానీ, జ‌గ‌న్ మాత్రం హిందువుల ఓట్ల కోసం హిందుత్వాన్ని రాజ‌కీయంగా వాడుకున్నారు. పైగా హిందువులపై ప్రేమ ఒల‌క‌బోస్తూనే హిందూ దేవాల‌యాల‌పై దాడులు.. తిరుమ‌ల‌లో ఇష్టారీతిలో వ్య‌వ‌హ‌రిస్తూ హిందువుల మ‌నోభావాల‌ను అధికారాన్ని అడ్డుపెట్టుకొని జ‌గ‌న్ దెబ్బ‌తీశార‌న‌డంలో ఎలాంటి అతిశ‌యోక్తి లేదు.  

మెగా స్టార్ చిరు ఖాతాలో మరో ప్రపంచ రికార్డ్

మెగాస్టార్ చిరంజీ మరో ప్రపంచ రికార్డ్ సాధించారు. ఆయనక గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం దక్కింది.  156 చిత్రాలలో నటించిన చిరంజీవి 537 పాటలకు 24,000 డ్యాన్స్ మూవ్ మెంట్స్ చేశారు. మరే నటుడు ఇన్ని పాటలకు స్టెప్పులేసి దాఖలాలు లేవు. అందుకే చిరంజీవి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం దక్కింది. ఈ అవార్డును అందించడం కోసం గిన్నిస్ బుక్ రికార్డ్స్ ప్రతినిధులు ప్రత్యేకంగా హైదరాబాద్ కి వచ్చారు. బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ చేతుల మీదుగా అవార్డును చిరంజీవికి అందించారు. చిరంజీవి ఈ ఏడాది ఇప్పటికే ప్రతిష్టాత్మక పద్మవిభూషణ్ పొందారు. ఇప్పుడు గిన్నిస్ బుక్ రికార్డ్స్ లో స్థానం సంపాదించి మరో ఘనత సాధించారు. దీంతో మెగా అభిమానులతో పాటు, తెలుగు సినీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకొని, మెగాస్టార్ చిరంజీవి అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్న చిరంజీవి  ప్రస్తుతం వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని చిరంజీవి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అందుకునే వేదికపై ఓ వక్త వెల్లడించారు.  చిరంజీవి 25 రోజులుగా చికెన్ గున్యాతో బాధపడుతున్నారని, అయినప్పటికీ ఈ వేడుకకు హాజరయ్యారని, అది ఆయనకున్న డెడికేషన్ అని ఆయన పేర్కొన్నారు.చిరంజీవి అయితే చికెన్ గున్యా నుంచి  పూర్తిగా కోలుకుంటున్నారని, అభిమానులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరంలేదని ఆయన సన్నిహితవర్గాలు తెలిపాయి.

లడ్డూ కల్తీతో మనస్తాపం... పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష!

పవిత్రమైన తిరుమల క్షేత్రంలో జగన్ ప్రభుత్వ హయాంలో లడ్డూ ప్రసాదం కల్తీ ద్వారా అపవిత్రం అయిన నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మనస్తాపానికి గురయ్యారు. ఆ ఘోర తప్పిదానికి ప్రాయశ్చిత్తంగా ఆయన 11 రోజులపాటు ‘ప్రాయశ్చిత్త దీక్ష’ చేయాలని సంకల్పించుకున్నారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటనను విడుదల చేశారు.  ఆ ప్రకటన పూర్తి పాఠం ఇలా వుంది.... ఏడుకొండలవాడా..! క్షమించు... 11 రోజులపాటు ప్రాయశ్చిత్త దీక్ష. అమృతతుల్యంగా... పరమ పవిత్రంగా భావించే తిరుమల లడ్డు ప్రసాదం- గత పాలకుల వికృత పోకడల ఫలితంగా అపవిత్రమైంది. జంతు అవశేషాలతో మాలిన్యమైంది. విశృంఖల మనస్కులే ఇటువంటి పాపానికి ఒడిగట్టగలరు. ఈ పాపాన్ని ఆదిలోనే పసిగట్టలేకపోవడం హైందవ జాతికే కళంకం. లడ్డు ప్రసాదంలో జంతు అవశేషాలు ఉన్నాయని తెలిసిన క్షణం నా మనసు వికలమైంది. అపరాధ భావానికి గురైంది. ప్రజా క్షేమాన్ని కాంక్షించి పోరాటంలో ఉన్న నాకు ఇటువంటి క్లేశం ఆదిలోనే నా దృష్టికి రాకపోవడం బాధించింది. కలియుగ దైవమైన బాలాజీకి జరిగిన ఈ ఘోర అపచారానికి సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ ప్రాయశ్చిత్తం చేసుకోవలసిందే. అందులో భాగంగా నేను ప్రాయశ్చిత్త దీక్ష చేయాలని సంకల్పించాను. 22 సెప్టెంబర్ 2024 ఆదివారం ఉదయం గుంటూరు జిల్లా నంబూరులోని శ్రీ దశావతార వేంకటేశ్వర స్వామి ఆలయంలో దీక్ష చేపడతాను. దైనందిన విధుల్లో పాల్గొంటూనే దీక్ష కొనసాగిస్తాను. 11 రోజులపాటు దీక్ష కొనసాగించి అనంతరం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటాను. 'దేవదేవా... నీ పట్ల గత పాలకులు చేసిన పాపాలను ప్రక్షాళన చేసే శక్తిని ఇవ్వమ'ని వేడుకుంటాను. భగవంతుడిపై విశ్వాసం, పాప భీతి లేనివారే ఇటువంటి అకృత్యాలకు ఒడిగడతారు. నా బాధేమిటంటే- తిరుమల తిరుపతి దేవస్థానం అనే వ్యవస్థలో భాగమైన బోర్డు సభ్యులు, ఉద్యోగులు సైతం అక్కడి తప్పిదాలను కనిపెట్టలేకపోవడం, కనిపెట్టినా నోరు మెదపకపోవడం. నాటి రాక్షస పాలకులకు భయపడి మిన్నకుండిపోయారా అనిపిస్తోంది. వైకుంఠ ధామంగా భావించే తిరుమల పవిత్రతకు, వేదాచారాలకు, ధార్మిక విధులకు కళంకం తెచ్చే విధంగా పెడపోకడలకు పాల్పడిన గత పాలకుల తీరు హిందూ ధర్మాన్ని పాటించే ప్రతి ఒక్కరినీ బాధించింది. ఇక లడ్డు ప్రసాదం తయారీలో జంతు అవశేషాలు ఉన్న నెయ్యిని వినియోగించారనే విషయం తీవ్ర క్షోభకు గురి చేసింది. ధర్మాన్ని పునరుద్ధరించుకొనే దిశగా అడుగులు వేసే తరుణం ఆసన్నమైంది. ధర్మో రక్షతి రక్షితః -పవన్ కళ్యాణ్  

 బతుకమ్మ పండగతో  కవిత రీ ఎంట్రీ

  ఢిల్లీ లిక్కర్ స్కాంలో చిక్కుక్కున్న బిఆర్ఎస్ ఎంఎల్సి  కవిత దాదాపు ఐదున్నరనెలలు తీహార్ జైల్లో  ఉన్నారు.  కవితకు బెయిల్ లభించిన తర్వాతే ఆమె  రాజకీయాలపై ఫోకస్ పెట్టారు. బతుకమ్మ బ్రాండ్ అంబాసిడర్ గా పేరు గడించిన కవిత వచ్చే అక్టోబర్ మొదటి వారంలోనే రాజకీయాల్లో రీ ఎంట్రీ అని ప్రచారం జరుగుతుంది. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు కవిత అటు పార్టీలో ఇటు ప్రభుత్వంలో హల్ చల్ చేశారు. కవిత ఏం చెబితే అది జరిగేది. అవినీతి, అహంకారం  తదితర కారణాలతో ఓటమి చెందిన బిఆర్ఎస్ దేశ రాజకీయాల్లో అధోపాతాళానికి పడిపోయింది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలన్న ఉద్దేశ్యంతో టిఆర్ఎస్ కాస్తా బిఆర్ఎస్ గా మారిపోయింది. ఇక్కడే  బిఆర్ ఎస్ అధ్యక్షుడు కెసీఆర్ తప్పులో కాలేశారు. పార్టీ అస్తిత్వమే ప్రమాదంలో పడేట్లు చేశారు. కూతురు, కొడుకు మధ్య ముఖ్యమంత్రి సీటు కోసం జరిగిన కొట్లాట వల్లే పార్టీ పేరు మార్చాల్సి వచ్చిందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ ను నిలువరించడానికి అన్నా చెల్లెళ్లు తాత్కాలికంగా విభేధాలను పక్కనపెట్టినట్లు తెలుస్తోంది.  కవిత జైల్లో ఉన్నప్పుడు పలుమార్లు కెటీఆర్ జైలులో ములాఖత్ కార్యక్రమంలో కలిశారు. బెయిల్ పై వెలుపలికి వచ్చే సమయంలో బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆమెకు స్వాగతం పలికేటట్లు కెటీఆర్ జాగ్రత్త పడ్డారు. ఒక రోజు ముందే  ఆయన ఎమ్మెల్యేలను ఢిల్లీ తీసుకెళ్లిన సంగతి తెలిసిందే.  బతుకమ్మ పండగను దేశ విదేశాల్లో చాటి చెప్పిన కవిత మళ్లీ తన పూర్వ వైభవం కోసం తండ్లాడుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బిఆర్ ఎస్ రాజకీయ మైలేజి కోసం కవిత ప్రయత్నిస్తుంది. రాజకీయ ప్రయోజనాల కోసమే తనను లిక్కర్ స్కాంలో ఇరికించారని కవిత ప్రచారం చేయనుంది.  నిజామాబాద్ కు చెందిన పార్టీ ముఖ్య నేతలతో కవిత సమావేశమై రీ ఎంట్రీకి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

పేట్ బషీర్ బాద్ లో డ్రగ్స్ ముఠా అరెస్ట్ 

మాదకద్రవ్యాలకు తెలంగాణ రాజధాని అడ్డాగా మారింది. గోవా నుంచి  మత్తు పదార్థాలను  తరలిస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి ఎండిఎంఏ మత్తు పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు.  కారులో హైదరాబాద్  పేట్ బషీర్బాద్ కు కు తరలిస్తుండగా పోలీసులు చాకచక్యంగా పట్టుకుని ముగ్గురిని అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లో ఇటీవల డ్రగ్స్  కు అలవాటు పడ్డ వారు ఎక్కువయ్యారు. యువత టార్గెట్ గా డ్రగ్స్ స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. రద్దీ ప్రాంతాల్లో ఉన్న పాన్ షాప్ లలో మత్తు పదార్థాలు లభ్యమవుతున్నాయి. డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. డ్రగ్స్ నాడీ వ్యవస్థపై ప్రభావం పడుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. డిప్రెషన్ కు లోనై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని వారు పేర్కొన్నారు. 

పవన్ కళ్యాణ్ అనాథాశ్రమం!

టట్టటాయ్.. బ్రేకింగ్ న్యూస్.. టట్టటాయ్... ఫ్లాష్ న్యూస్.. పవర్‌స్టార్, డిప్యూటీ సీఎం... మన పవన్ కళ్యాణ్ ఒక అనాథాశ్రమాన్ని ఏర్పాటు చేశారు. అవును.. నిజంగానే అనాథాశ్రమాన్ని స్థాపించారు. ఆ అనాథాశ్రమం పూర్తి వివరాలు తెలుసుకోవాలని మీకు చాలా ఇంట్రెస్ట్.గా వుంది కదూ! అబ్బ... ఆశ, దోశ, అప్పడం, వడ... ఇంత హాట్ న్యూస్ మొత్తాన్నీ వెంటనే చెప్పేస్తామా ఏంటి? ముందు పవన్ కళ్యాణ్ గొప్పతనం గురించి షార్ట్ అండ్ స్వీట్‌గా చెబుతాం. ఆ తర్వాతే ఆ అనాథాశ్రమం గురించి చెబుతాం... ఏమంటారు? ఆ.. మీరేమంటారూ? ఎక్కువగా సాగదీయకుండా ప్రొసీడైపొమ్మంటారు... అంతేగా? సినిమా ఇండస్ట్రీ వాళ్ళు పవర్‌స్టార్‌తో సినిమాలు తీయడానికి, కోట్లకు కోట్లు డబ్బు ఇవ్వడానికి రెడీగా వున్నారు. కానీ పవన్ కళ్యాణ్ ఏమన్నారు? ఆ డబ్బు వద్దంటే వద్దు...  ప్రజాసేవే నాకు ముద్దు అన్నారు. రాజకీయాల్లోకి వచ్చారు. జనసేన పార్టీని పెట్టారు. ఎన్నో అవమానాలు భరించారు. ఎన్నెన్నో త్యాగాలు చేశారు. త్యాగాల త్యాగరాజు ఆయన. ఎన్ని బాధలు పడితేనేం... మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అయ్యారు. ఇక పవన్ కళ్యాణ్ చేసిన దానధర్మాల గురించి చెప్పాలంటే ఒక పెద్ద పుస్తకమే రాయొచ్చు. అలాంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు చేసిన మరో గొప్పపని అనాథాశ్రమాన్ని స్థాపించడం. మొన్నీమధ్యే వరద బాధితుల కోసం ఆరు కోట్ల రూపాయల విరాళం ఇచ్చారు.  అప్పుడు ఆయన్ని చాలామంది ఆపద్బాంధవుడు అని మెచ్చుకున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనాథ రక్షకుడు కూడా అయ్యారు. ఏ ఆధారం లేక.. పట్టించుకునేవారే లేక.. ఏం చేయాలో అర్థం కాక, దిక్కూమొక్కూ లేకుండా వున్నవారిని ఆ అనాథాశ్రమంలోకి తీసుకుంటున్నారు. నా అనేవాళ్ళు లేనివారికి నేనున్నానంటూ తన చేతిని అందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ స్థాపించిన అనాథాశ్రమంలో చేరినవాళ్ళు ఆనందంతో మురిసిపోతున్నారు. కొంతమంది కళ్ళు ఆనంద బాష్పాలతో తడిచిపోతున్నాయి. కొంతమంది ఆయన కాళ్ళమీద పడిపోతున్నారు. ఇంకొంతమంది ఆయన్ని గాఠ్ఠిగా కౌగిలించుకుంటున్నారు. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ అనాథాశ్రమంలో చేరినవాళ్ళు ఊరికే వుండటం లేదు. తమకు తెలిసిన మరికొంతమందిని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ అనాథాశ్రమంలో చేర్చుతున్నారు.  అలాంటి అనాథలందరితో పవన్ కళ్యాణ్ అనాథాశ్రమం కళకళలాడుతోంది. ఇంతకీ అనాథాశ్రమం అంటే, నిజంగా దిక్కూమొక్కూ లేనివాళ్ళని అక్కున చేర్చుకునే అనాథాశ్రమం అనుకున్నారా? కాదండీ బాబూ... ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని దిక్కూమొక్కూ లేని రాష్ట్రంగా చేసినవాళ్ళని దగ్గరకి చేర్చుకునే అనాథాశ్రమం. పవన్ కళ్యాణ్ తన జనసేన పార్టీనే అనాథాశ్రమంగా మార్చేశారు. జగన్ పార్టీలో అనాథల్లా దిక్కూమొక్కూ లేకుండా పడి వున్నవాళ్ళందర్నీ తన పార్టీలో చేర్చుకుంటున్నారు. జగన్ పార్టీ అధికారంలో వున్నప్పుడు ఆ పార్టీ నాయకులు చాలామంది అన్యాయాలు, అక్రమాలు, దారుణాలు చేశారు. ఇప్పుడు ఆ ఆ పార్టీ అధికారం కోల్పోవడంతో వాళ్ళందరూ అధికారంలేని అనాథలుగా మారిపోయారు. సంపాదించింది చాలక, ఇంకా సంపాదించే అవకాశం లేక అల్లాడిపోతున్నారు. అలాంటి వారి అధికార ఆకలిని పవన్ కళ్యాణ్ తీరుస్తున్నారు. పవన్ కళ్యాణ్ స్థాపించిన అనాథాశ్రమం పుణ్యమా అని జగన్ పార్టీలో వున్న అనాథలందరికీ మంచి ఆశ్రయం దొరుకుతోంది. పవన్ కళ్యాణ్ ఇలాగే అలాంటివాళ్ళందరికీ ఆశ్రయం ఇస్తూ వుంటే, కొంతకాలానికి పవన్ కళ్యాణ్ పార్టీని ‘జనసేన’ అనరు... ‘జగన్ సేన’ అంటారు!

లడ్డూ వివాదం.. కేసీఆర్ మౌనం జగన్ కోసమేనా?

తిరుమల లడ్డూ ప్రసాదం వివాదంపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగానికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ హిందూ వాదులంతా డిమాండ్ చేస్తున్నారు. తిరుమల పవిత్రతను దెబ్బ తీశారంటూ మాజీ ముఖ్యమంత్రి జగన్ పై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తున్నారు. సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలకు డిమాండ్ చేస్తున్నారు. ఈ వివాదంపై స్పందించని రాజకీయ పార్టీ లేదంటే అతిశయోక్తి కాదు. రాహుల్ గాంధీ కూడా లడ్డూ ప్రసాదం వివాదంపై సమగ్ర విచారణకు డిమాండ్ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలను దెబ్బతీసిన ఈ సంఘటనకు బాధ్యులను విడిచేందుకు వీల్లేదన్నారు.  అయితే దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన లడ్డూ వివాదంపై బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం నోరెత్తలేదు. ఆయనే కాదు ఆ పార్టీకి చెందిన ఎవరూ కూడా ఈ విషయంపై స్పందించలేదు. సమయం అయినా కాకపోయినా, సందర్భం ఉన్నా లేకపోయినా, అధికారంలో ఉన్నంత కాలం నా కంటే పెద్ద హిందువు ఎవరున్నారు అంటూ పదే పదే తనను తానే ఓ పెద్ద హిందూ వాదిగా ప్రకటించుకున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ లడ్డూ వివాదం విషయంలో మౌనంగా ఉండటం బీఆర్ఎస్ శ్రేణులను సైతం విస్మయ పరుస్తోంది.  కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడూ, అధికారం కోల్పోయిన తరువాత కూడా యాజ్ణాలు చేశారు. హిందూ ధర్మానికి తనకు తాను బ్రాండ్ అంబాసిడర్ గా ప్రకటించుకోవాలని తహతహలాడారు. అటువంటి కేసీఆర్ తిరుమల లడ్డూ ప్రసాదం వివాదంలో అనూహ్యంగా మౌనాన్ని ఆశ్రయించారు.  అయితే నా కంటే పెద్ద హిందువు ఎవరున్నారంటూ ప్రకటనలు గుప్పించిన తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి  కేసీఆర్ ఈ విషయంలో మాత్రం స్పందించడం లేదు.  లడ్డూ ప్రసాదం వివాదం ఇప్పుడు దేశంలోనే హాట్ టాపిక్. సోషల్ మీడియా, ప్రాంతీయ మీడియా, జాతీయ మీడియా కూడా ఈ అంశాన్నే హైలైట్ చేస్తున్నాయి. దేశ వ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలూ అంశంపై స్పందించాయి. కానీ పరమ భక్తుడిని అని చెప్పుకునే కేసీఆర్ మాత్రం నోరెత్తలేదు. బీఆర్ఎస్ నేతలెవరూ కూడా స్పందించలేదు.  బహుశా తన మౌనం వల్ల జగన్ కు ఏమైలా ప్రయోజనం చేకూరుతుందని కేసీఆర్ భావిస్తున్నారేమో అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఎందుకంటే జగన్, కేసీఆర్ ల రాజకీయ స్నేహబంధం తెలిసిందే. 2019 ఎన్నికలలో జగన్ విజయం సాధించి ఏపీలో అధికారంలోకి రావడానికి అప్పటికి తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ తన వంతు సహకారం అందించారు. అలాగే 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేసీఆర్ కు రాజకీయ లబ్ధి చేకూర్చడానికి సాగర్ డ్యాం వద్ద హంగామా సృష్టించి జగన్ తన వంతు సాయం చేశారు. ఆ ఎన్నికలలో బీఆర్ఎస్ పరాజయం పాలైందనుకోండి అది వేరే సంగతి. ఇక ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో జగన్ విజయం సాధించబోతున్నారంటూ..కేసీఆర్ జోస్యం చెప్పి ఏదో మేరకు జగన్ కు సాయపడేందుకు కేసీఆర్ శతథా ప్రయత్నించారు. ఆ ప్రయత్నాలేవీ ఫలించలేదనుకోండి. ఇక ఇప్పుడు లడ్డూ వివాదం విషయానికి వస్తే.. తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వివాదంలో జగన్ ప్రతిష్ట జాతీయ స్థాయిలో పాతాళానికి పతనమైంది. ఈ తరుణంలో కేసీఆర్ తన మౌనం ద్వారా ఏదో మేరకు జగన్ కు ప్రయోజనం లభిస్తుందని కేసీఆర్ భావిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తనను తాను పరమ భక్తుడిగా ప్రకటించుకునే కేసీఆర్ దేవుడికి సంబంధించిన అంశంలో కూడా రాజకీయ లాభనష్టాలను బేరీజు వేసుకోవడాన్ని పలువురు విమర్శిస్తున్నారు.  

 కల్తీ లడ్డూపై జనసేన అగ్రహం...జగన్ దిష్టిబొమ్మ దహనం

తిరుపతిలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కి వ్యతిరేకంగా జనసేన నేతలు ఆందోళన చేపట్టారు. తిరుపతిలో కల్తీ లడ్డూ తయారీకి పాల్పడ్డ  గత వైసీపీ ప్రభుత్వం భక్తుల మనోభావాలను దెబ్బతీసిందన్నారు.  తిరుపతి లడ్డూ కల్తీ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. మాజీ ముఖ్యమంత్రి జగన్ పాలనలో జరిగిన ఈ కల్తీ గూర్చి విని భక్తులు మనోవేదనకు గురయ్యారు.  పూర్తి స్థాయిలో విచారణ జరపాలని జనసేన నేతలు డిమాండ్ చేశారు.  కమిషన్లకు కక్కుర్తిపడ్డ వైసీపీ నాయకులు ఈ కల్తీకి పాల్పడ్డారని జనసేన నేతలు అంటున్నారు. వైసీపీ నేతల దిష్టి బొమ్మలను జనసేన నేతలు చెప్పులతో కొట్టి దహనం చేశారు. జగన్ దిష్టి బొమ్మను వారు రహనం చేశారు. ఇటీవలి కాలంలో వైసీపీ నేతలు పలువురు జనసేనలో చేరిన నేపథ్యంలో జనసేననేతల చేపట్టిన ఈ ఆందోళన వల్ల కూటమి మరింత బలోపేతమైంది. 

వైసీపీ నుంచి వలసల వరద!

ఈ ప్రాంతం, ఆ ప్రాంతం అన్న తేడా లేదు. ఈ సామాజిక వర్గం, ఆ సామాజిక వర్గం అన్న బేధం లేదు. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ పుట్టి మునిగిపోతోంది. ఆ పార్టీ నుంచి వలసల వరద వెల్లువెత్తుతోంది. ఆ వలసల వరద ధాటికి వైసీపీ గేట్లు పగిలిపోతున్నాయి. జగన్ తాడేపల్లి ప్యాలెస్ పునాదులు కదిలిపోతున్నాయి. ఒకరు ఇద్దరు కాదు పదుల సంఖ్యలో వైసీపీ నుంచి మాజీ ఎమ్మెల్యేలు జనసేన గూటికి  చేరిపోతున్నారు. దీంతో వైసీపీ బైసీపీగా మారిపోయిందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అసలా పార్టీ రాష్ట్రంలో ఉనికి మాత్రంగానైనా నిలిచే అవకాశాలు కనిపించడం లేదంటున్నారు పరిశీలకులు. అంతెందుకు జగన్ కు స్వయానా సోదరి, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు షర్మిల అయితే వైసీపీలో జగన్ వినా మరెవరూ మిగిలే పరిస్థితి కనిపించడం లేదని కుండబద్దలు కొట్టేశారు. చివరాఖరికి వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి కూడా వైసీపీని వీడడం ఖాయమని షర్మిల జోస్యం చెప్పారు. ఆ జోస్యం సంగతి పక్కన పెడితే ప్రస్తుతం వైసీపీ నుంచి జనసేనలోకి క్యూకడుతున్న నేతల జాబితా చూస్తుంటే వైసీపీ ఖాళీ అయిపోవడం ఖాయమని చెప్పకతప్పదంటున్నారు పరిశీలకులు. సీఎం నుంచి మాజీ సీఎంగా డిమోట్ అయిన క్షణం నుంచీ జగన్ నోట తరచుగా పదవులు శాశ్వతం కావు అన్న సూక్తి వినిపిస్తోంది. ప్రస్తుతం వైసీపీలో వలసలను చూస్తుంటే జగన్ మాటలు ఆయన పార్టీ నేతలు బాగా వంటబట్టించుకున్నారని అనక  పదవి ఎటూ శాశ్వతం కాదు.. కనీసం అధికారం ఉన్న పార్టీ పంచనో, కూటమిలోనో ఉంటే బెటర్ కదా అనుకుంటున్నట్లున్నారు. అందుకే జగన్ కు, ఆయన పార్టీకీ గుడ్ బై చెప్పేసి జనసేనాని చెంతకు చేరిపోతున్నారు. సామినేని ఉదయభాను, బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, కిలారు రోశయ్య ఇలా చెప్పుకుంటూ పోతే ఆ జాబితా చిన్నదేమీ కాదు.. కొండవీటి చాంతాడులా అలా సాగుతూనే ఉంటుంది.  ఇలా వైసీపీ నుంచి బయటకు వచ్చేస్తున్న వారిలో 2024 ఎన్నికలలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ అభ్యర్థుల చేతిలో పరాజయం పాలైన వారే పెద్ద సంఖ్యలో ఉన్నారు. అంటే నియోజకవర్గంలో తమకు పెద్ద ప్రాధాన్యత ఉండే అవకాశాలు లేవని తెలిసీ వారు జగన్ తో తెగతెంపులు చేసుకుంటేనే రాజకీయ భవిష్యత్ ఉంటుందన్న నిర్ణయానికి వచ్చేసినట్లున్నారు. ఇక వైపీపీ నుంచి జనసేనలోకే పెద్ద సంఖ్యలో నేతలు ఎందుకు వలస వెడుతున్నారంటే.. తెలుగుదేశం వైసీపీ నంచి చేరికలకు తలుపులు మూసేయడమే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ఇప్పటికే వైసీపీలో కీలకంగా ఉన్న సామినేని ఉదయభాను, బాలినేని శ్రీనివాసరెడ్డి, కిలారు రోశయ్య వంటి వారి చేరికలు, చేరికలకు ముహూర్తాలు ఖరారైపోగా ఇంకా ఈ జాబితాలో మాజీ మంత్రి విడదల రజనీ, మాజీ ఎమ్మెల్యే శిల్పాచక్రపాణిరెడ్డి వంటి పేర్లు కూడా చోటు చేసుకోనున్నాయి. గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ ప్రజలలో బాగా పాపులర్ అయిన కేతిరెడ్డి తాను వైసీపీని వీడే ప్రశక్తే లేదని చేసిన ప్రకటనను పరిశీలకులు విశ్వసించడం లేదు. ప్రస్తుతం కాకపోయినా రేపో తరువాతో ఆయనా వైసీపీకి బైబై చెప్పేయడం ఖాయమంటున్నారు.  అలాగే పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, దర్శి మాజీ ఎమ్మెల్యే మదిశెట్టి వేణుగోపాల్ వంటి వారు కూడా జగన్ పార్టీకి జెల్ల కొట్టేయడానికి సిద్ధంగా ఉన్నారు.  రానున్న రోజుల్లో వైసీపీని వీడే వారి సంఖ్య ఇంకా పెరుగుతుందనీ, సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా ఈ వలసల క్యూలో చేరే అవకాశాలున్నాయని అంటున్నారు. 

తేనెటీగల దాడిలో ఇద్దరు కూలీలు మృతి, ముగ్గురి  పరిస్థితి విషమం

రాజమౌళి  ‘ఈగ’చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ చిత్రంలో విలన్  క్యారెక్టర్లో సుదీప్ నటించాడు. హీరో నానిని హత్య చేస్తే మరో జన్మలో నాని ఈగ రూపంలో జన్మిస్తాడు. హీరోయిన్ సమంతకు ఈ విషయం తెలిసిపోతుంది. హీరో ఈగ, సమంతలు కల్సి సుదీప్ ను హత్య చేస్తారు. .ఈగను అగ్నికి అహుతి చేయాలని ప్రయత్నించి తానే ఆ మంటల్లో అహుతి అవుతాడు సుదీప్.   అది రీల్ స్టోరీ. ఇది  మాత్రం రియల్ స్టోరీ. ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లాలో పొలం పనులు చేసుకునే కూలీలను తేనెటీగలు  దాడి చేసి హత్య చేశాయి.  లక్షలాది తేనెటీగలు ;పొలం పనులకు వచ్చిన ఇద్దరు కూలీలను పొట్టనబెట్టుకున్నాయి.   ఎప్పటి మాదిరిగా సద్దిమూట కట్టుకుని పొలం పనులకు వచ్చిన ఈ కూలీల బతుకు అదే రోజు తెల్లారిపోయింది. తాము వెంట తెచ్చుకున్న సద్ది మూటే  వారికి చివరి  మెతుకులయ్యాయి.    ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేయడంతో ఇద్దరు కూలీలు అక్కడికక్కడే చనిపోయారు. చనిపోయిన వారిలో కిల్లరి కాంతమ్మ, కిల్లరి కిష్టప్ప ఉన్నారు. వీరిరువురు భార్య భర్తలు.  మరో ముగ్గురు కూలీలు తీవ్ర గాయాలతో స్థానిక హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.  మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నం కెజీహెచ్ కు తరలించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారి చేయడంతో ప్రస్తుతం అక్కడికి తీసుకెళ్లినట్లు సమాచారం. నేరం జరగగానే పోలీసులు సీన్లో ఎంటరయ్యారు.తేనెటీగల దాడి వివరాలను పోలీసులు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు.   

వరద బాధితుల కోసం భారీగా విరాళాలు!

ఆంధ్రప్రదేశ్‌లో  వరద బాధితుల సహాయం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి.   అసోసియేషన్ ఆఫ్ సెక్రటేరియట్ ఇంజినీర్స్   రూ.67,29,398 చెక్కును ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌కి అందించింది.  అలాగే గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం ఇంజినీరింగ్ అసిస్టెంట్స్ ఒక రోజు మూల వేతనాన్ని సీఎం సహాయ నిధికి అందించారు.  అలాగే రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, ఆయన సతీమణి శ్రీమతి వెంకట లక్ష్మి రూ.25 లక్షలు ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇచ్చారు. అలాగే టాలీవుడ్‌ యువ నటుడు  హైపర్‌ ఆది  3 లక్షల రూపాయలు  విరాళంగా ఇచ్చారు. ఇందుకు సంబంధించి ఆయన ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ను కలిసి చెక్కు అంద చేశారు.

నేడే ఢిల్లీ సీఎంగా ఆతిషి ప్రమాణం!

ఢిల్లీ ముఖ్యమంత్రిగా అతిషి సింగ్   మరికొన్ని గంటల్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆమెతో పాటు మరో ఐదుగురు ఆప్ ఎమ్మెల్యేలు  మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శనివారం  సాయంత్రం 4.30 గంటలకు రాజ్ నివాస్‌లో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సెనా.. ఈ ఆరుగురి చేత ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.  అతిషితోపాటు ఆమె కేబినెట్‌‌లో గోపాల్ రాయ్, కైలాశ్ గెహ్లాట్,  సౌరబ్ భరద్వాజ్, ఇమ్రాన్ హుస్సేన్‌, ముఖేశ్ అహ్లావత్‌లతో కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది. కాగా ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్టై.. ఇటీవలే బెయిలుపై విడుదలైన కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. 

తిరుమలలో సంప్రోక్షణకు సీఎం ఆదేశం!

తిరుమల పవిత్రతను పునరుద్ధరించే విషయంపై సీఎం చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆగమ, వైదిక శాస్త్రాల ప్రకారం తిరుమలలో సంప్రోక్షణ చేపట్టాలని ఆదేశించారు. వైసీపీ ప్రభుత్వ  హయాంలో శ్రీవారి లడ్డూ తయారీలో నాణ్యతా లోపాలపై సీఎం చంద్రబాబు సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అత్యంత పవిత్రమైన లడ్డూ అపవిత్రం కావడాన్ని తీవ్రంగా  పరిగణించారు. లడ్డూలో వాడకూడని పదార్థాలను వినియోగించిన నేపథ్యంలో తిరుమల అపవిత్రం అయిందని భావించిన సీఎం క్షేత్రాన్ని పవిత్రం చేసేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై దృష్టిపెట్టారు. ఈ నేపథ్యంలో తొలుత లడ్డూలు తయారు చేసే పోటుతో పాటు, నెయ్యి భద్రపరిచిన ప్రదేశాలను సంప్రోక్షణ చేయాలని ఆదేశించారు.