ఆంధ్రాతో పోలిక ఎందుకు హరీషూ!

బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు ఇంకా రాజకీయాల్లోనే వున్నారు. ఆ విషయాన్ని ప్రూవ్ చేసుకోవడానికే అన్నట్టుగా ఆయన చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చారు. తన ఉనికిని నిరూపించుకోవడానికే తప్ప విషయం ఏమీ లేదన్నట్టుగా ఏవో నాలుగు కామెంట్లు చేసి మీడియా సమావేశాన్ని ముగించారు. ఈ సందర్భంగా ఆయన ‘‘రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం శాశ్వతం కాదు. అధికారులు రెచ్చిపోవద్దు’’ అని  ఆయన అధికారులకు వార్నింగ్ ఇచ్చారు. ఆయన తన స్టేట్‌మెంట్‌ని అక్కడతో ఆపితే బాగుండేది. దాన్ని ఇంకొంచెం సాగదీస్తూ, ‘‘ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వంలో అధికారులు రెచ్చిపోయారు. ప్రస్తుతం సస్పెండ్ అవుతున్నారు. అధికారంలో వున్నామని రెచ్చిపోతే అక్కడి అధికారులకు పట్టిన గతే మీకూ పడుతుంది’’ అన్నారు.  అయినా, తెలంగాణ సాధించుకున్న తర్వాత పక్క రాష్ట్రంతో పోలికలు పెట్టాల్సిన అవసరం హరీష్ రావుకు ఎందుకో అర్థం కావడం లేదు. అలా పోల్చదల్చుకుంటే పక్క రాష్ట్రంతో ఎందుకు... తమ పార్టీ పదేళ్ళ పాలనతో పోల్చి చెప్పొచ్చు కదా. టీఆర్ఎస్ అండ్ బీఆర్ఎస్ పదేళ్ళ పాలనలో నాయకులు, వాళ్ళకి అనుకూలంగా అధికారులు ఈ ప్రభుత్వం శాశ్వతంగా వుంటుందనుకుని రెచ్చిపోయారు. చివరికి ఏమైంది? ప్రజలు బాగా బుద్ధిచెప్పారు. తమను తామే ఉదాహరణగా చెప్పుకుంటే సరిపోయేదానికి హరీష్ రావు పక్క రాష్ట్రంలో  విషయాలను ప్రస్తావించడం ఎందుకో! అయినా ఆంధ్రప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు జగన్ పాలన అదిరిపోయేలా సాగిందని, మరోసారి జగన్ అధికారంలోకి వస్తారని తన దగ్గర సమాచారం వుందని కేసీఆర్ ఆమధ్య కనపడినవాళ్ళందరికీ చెప్పారు. మరి ఇప్పుడు హరీష్ రావేమో వైసీపీ పాలనలో అధికారం శాశ్వతంగా వుంటుందనుకుని అధికారులు రెచ్చిపోయారు అంటున్నారు. హరీష్ రావు ఇలా జగన్ ప్రభుత్వాన్ని తెగిడితే మామయ్య కేసీఆర్ హర్టవుతారు కదా! ఈ చిన్న లాజిక్‌ని హరీష్ రావు ఎలా మిస్సయ్యారో!

పెద్దిరెడ్డి, ఆర్కే రోజా దర్శనం టిక్కెట్ల స్కామ్!

జగన్ పరిపాలన జరిగిన ఐదేళ్ళ కాలంలో శ్రీవారి దర్శనం టికెట్లు గోల్ మాల్ చేసి మాజీమంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్కే రోజా కోట్ల రూపాయలు దండుకొన్నారని తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపించారు. ఐదేళ్ల పాలనలో వైసీపీ వాళ్లు శ్రీవారి సొమ్మును దోచుకున్నారని ఆయన విమర్శించారు. దైవసేవ సేవచేయాల్సిన మాజీ ఈవో ధర్మారెడ్డి జగన్ పార్టీ నాయకుల సేవలో తరించారని వర్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. "పర్యాటకశాఖకు ప్రతిరోజూ 1000 దర్శనం టికెట్లు ఇస్తారు. వాటిలో 800 టికెట్లు మాజీమంత్రి పెద్దిరెడ్డి ఆశీస్సులతో నిర్వహించే 'కళాధర్ ట్రావెల్స్'కి ఇచ్చేవారు. హైదరాబాద్, బెంగళూరు, కడప, కర్నూలు, గంగావతి ప్రాంతాల నుంచి వచ్చే వారికి ఈ టికెట్లు అమ్మేవారు. ఒక్క కళాధర్ ట్రావెల్స్.కి మాత్రమే  అన్ని టికెట్లు ఇవ్వడంలో రహస్యం, అంతర్యం ఏమిటి?" అని వర్ల రామయ్య ప్రశ్నిస్తున్నారు. ఈ 800 టికెట్లను రద్దీని బట్టి ఐదు వేల రూపాయల నుంచి పదివేల రూపాయల వరకూ అమ్మేవారని వర్ల ఆరోపించారు.  ఒక్క కళాధర్ ట్రావెల్స్ వారికే అన్ని టికెట్లు ఇవ్వడం ఏమిటి? అని వర్ల ప్రశ్నిస్తున్నారు. మరోవైపు పర్యాటక శాఖ మంత్రి రోజా విషయానికి వస్తే.. నిజానికి ఆమె మంత్రి అయిన తర్వాత శ్రీవారి దర్శనాల్లో అందినంత డబ్బు దండుకోవడం మాత్రమే కాదు. ఎమ్మెల్యేగా వున్నప్పుడు కూడా నెలనెలా లక్షలాది రూపాయలు అక్రమ మార్గాల్లో దండుకునే వారనే ఆరోపణలు ఉన్నాయి. ఎమ్మెల్యేలకు నెలకు ఒకసారి  ప్రోటోకాల్ దర్శనం ఉంటుంది. ఎమ్మెల్యేలు ఇచ్చే సిఫారసు లేఖలకు అదనంగా, ఆ ఒక్క సందర్భంలో ఎమ్మెల్యే వెంట వచ్చే భక్తులను భారీ సంఖ్యలో అనుమతించేవారు. ప్రోటోకాల్ దర్శనం టిక్కెట్ ధర బ్లాక్ మార్కెట్‌లో ఒక్కొక్కటి 20 వేల వరకు కూడా పలుకుతూ వుంటుంది. ఈ టికెట్లను తాను ఏర్పాటు చేసుకున్న దళారీ ఉద్యోగుల ద్వారా రోజా విక్రయించి దండుకునేవారని ఆరోపణలున్నాయి. అలాగే బుక్ మై దర్శన్ పోర్టల్ ద్వారా కూడా టిక్కెట్ల బుక్కింగ్ విషయంలో అక్రమాలకు పాల్పడ్డారని వర్ల రామయ్య ఆరోపిస్తున్నారు.

ముంబై నటి జెత్వానీ కేసు.. కుక్కల రిమాండ్ రిపోర్టులో సస్పెండైన ఐపీఎస్ అధికారుల పేర్లు

ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసు దర్యాప్తులో సోమవారం (సెప్టెంబర్ 23) కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అరెస్టైన వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్  రిమాండ్ రిపోర్ట్‌లో  ముగ్గురు ఐపీఎస్ అధికారుల పేర్లను పోలీసులు చేర్చారు. ఇదే కేసుకు సంబంధించి ఈ ముగ్గురినీ అంటే ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు, విజయవాడ మాజీ కమిషనర్ కాంతి రాణా తాతా, మరో ఐపీఎస్ అధికారి విశాల్ గున్నీ పేర్లను కుక్కల విద్యాసాగర్ రిమాండ్ రిపోర్టులో చేర్చారు.  ఈ ముగ్గురినీ కూడా నిందితులుగా ఆ రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. కాగా కుక్కల విద్యాసాగర్ కు కోర్టు అక్టోబర్ 4 వరకూ రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే.  ఈ కేసు వెలుగులోకి రాగానే అజ్ణాతంలోకి వెళ్లిపోయిన కుక్కల విద్యాసాగర్ ను పోలీసులు రెండు రోజుల కిందట డెహ్రాడూన్ లో అరెస్టు  చేసి విజయవాడకు తరలించిన సంగతి తెలిసిందే. కుక్కల విద్యాసాగర్ ను పపోలీసులు ఈ తెల్లవారు జామున న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు. న్యాయమూర్తి కుక్కల విద్యాసాగర్ కు 14 రోజుల రిమాండ్ విధించారు.   కుక్కల విద్యాసాగర్ ఫిర్యాదు మేరకు పోలీసు అధికారులు విమానంలో ముంబై వెళ్లి మరీ కాదంబరి జత్వానీని విజయవాడకు తీసుకువచ్చారు. అయితే ఆయన ఫిర్యాదుకు ఒక రోజు ముందే పోలీసు అధికారులు ముంబైకి విమానం టికెట్ బుక్ చేసుకోవడంతో  ఉద్దేశ పూర్వకంగానే జత్వానీని అరెస్టు చేసి వేధించారని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఆమెపై తప్పుడు కేసు పెట్టి ఇబ్బందులకు గురి చేశారని తేల్చుకున్నారు. వైసీపీ సర్కార్ పతనమై ఏపీలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత నటి కాదంబరి జత్వానీ  ఇబ్రహీం పట్నం పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు విచారణ జరిపిన పోలీసులు కుక్కల విద్యాసాగర్ ను నిందితుడిగా గుర్తించారు. వైసీపీ హయాంలో ప్రభుత్వ పెద్దలు, పార్టీ అగ్రనేతల ప్రోద్బలంతోనే ఐపీఎస్ అధికారులు పీఎస్సార్ ఆంజనేయులు, కాంతి రాణా తాతా, విశాల్ గున్నీ అడ్డగోలుగా వ్యవహరించి జత్వానీని అక్రమంగా అరెస్టు చేసి విజయవాడకు తీసుకువచ్చి వేధించారని గుర్తించారు. ఇప్పటికే విశాల్ గున్ని తన మూడు పేజీల వాంగ్మూలంలో దాదాపుగా తనపై ఎవరెవరు ఒత్తిడి చేసిందీ పూసగుచ్చినట్లు వివరించారు.  

పేదల జోలికి వెళ్లని హైడ్రా

హైడ్రా బీద బిక్కి ప్రజానీకం మీద కరుణించినట్లు తెలుస్తోంది. ఆదివారం నుంచి చేపట్టిన హైడ్రా కూల్చివేతల్లో పేద ప్రజల జోడికి హైడ్రా వెళ్లడం లేదు. చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ స్థలాల పరిరక్షణ కోసం ఏర్పాటైన హైడ్రా కమిషనర్ రంగనాథ్ దూకుడుగా వెళుతున్నారు. ఎఫ్ టి ఎల్, బఫర్ జోన్ లో నిర్మించే అక్రమ కట్టడాలను కూల్చేస్తున్నప్పటికీ గత రెండు రోజుల నుంచి పేదల ఇళ్లను ముట్టుకోవడం లేదు. కమర్షియల్ కాంప్లెక్స్ లు, విల్లాలను హైడ్రా కూల్చేస్తుంది. మధ్య తరగతి ప్రజలను కూడా హైడ్రా ముట్టుకోవడం లేదు. కూల్చివేతలకు చట్టబద్దత లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో హైడ్రా దిద్దుబాటు చర్యలు చేపడుతుంది. తాజాగా కూకట్ పల్లి నల్ల చెరువు బఫర్ జోన్ పరిధిలోని భూములలో నిర్మించిన కట్టడాలు కూల్చివేసినప్పటికీ పేద ప్రజల జోలికి వెళ్లకపోవడం గమనార్హం. నల్ల చెరువు 27 ఎకరాల్లో ఉంటే ఇందులో ఏడు ఎకరాలు ఆక్రమణకు గురైనట్లు హైడ్రా తేల్చేసింది.  అమీన్ పూర్ లో హైడ్రా అర్ధరాత్రి కూడా కూల్చివేతలు కొనసాగించింది. బాహుబలి మిషన్ ద్వారా పెద్ద భవంతులను హైడ్రా కూల్చివేసింది. మాదాపూర్ లో కూడా సోమవారం కూల్చివేసింది.  దుర్గం చెరువు  ఎఫ్ టి ఎల్ , బఫర్ జోన్ కూల్చివేతలను న్యాయస్థానం జోక్యంతో నిలుపదల చేసింది.  తొలిసారి హైడ్రా జీహెచ్ ఎంసీ వెలుపల కూడా అక్రమ కట్టడాలను కూల్చేయాలని నిర్ణయించింది. రంగారెడ్డి ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని పెద్ద చెరువు, మాసాబ్ చెరువులో అక్రమ కట్టడాలను కూల్చేయానికి హైడ్రా సిద్దమైంది. 

లడ్డూ ప్రసాదం... వైసీపీ వింత ప్రకటనలు!

పరమ పవిత్రమైన తిరుమల స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేసి అడ్డంగా దొరికిపోయిన వైసీపీ చేసిన తప్పు నుంచి తప్పించుకోవడానికి సర్వప్రయత్నాలు చేస్తోంది. అధికారం వెలగబెట్టిన కాలంలో జగన్ ప్రభుత్వం చేసిన ఈ దౌర్భాగ్యపు పనిని యావత్ దేశం అసహ్యించుకుంటోంది. లడ్డూని తయారు చేయడానికి ఉపయోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు వాడటం వల్ల హిందువుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ విషయంలో కేవలం హిందువులు మాత్రమే జగన్ మీద ఆగ్రహం వ్యక్తం చేయడం లేదు. ఇతర మతాల వారు కూడా ఈ ఘోరాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఏ మత విశ్వాసాన్నీ ఇంత దారుణంగా దెబ్బతీయకూడదని అంటున్నారు. జాతీయ మీడియా అయితే జగన్‌ని ఫుట్‌బాల్ ఆడుకుంటోంది. ఒక్క లడ్డూ విషయంలో మాత్రమే కాకుండా అధికారాన్ని వెలగబెట్టిన సమయంలో జగన్ ప్రభుత్వం చేసిన అన్యాయాలు, అక్రమాల చిట్టాని బయటకి తీసి కథనాలుగా అందిస్తోంది.  స్వామివారి లడ్డూని అపవిత్రం చేసిన పాపం జగన్ రాజకీయ కెరీర్‌నే సమాధి చేసే శాపంలా మారింది. ఇంత జరిగినా వైసీపీ నాయకులు తప్పుని ఒప్పుకోకుండా తప్పించుకునే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నారు. కానీ, ఆ ప్రయత్నాల సందర్భంగా వాళ్ళు చేస్తున్న తప్పులు జనానికి మరింత ఆగ్రహం తెప్పిస్తున్నాయి. తిరుమల శ్రీవారి ప్రసాదం విషయంలో జరిగిన అపచారానికి మనోవేదన చెందిన ఏపీ డిప్యూటీ సీఎం ప్రాయశ్చిత్త దీక్షను చేపట్టారు. ఈ దీక్ష మీద కూడా వైసీపీ నాయకులు అవాకులు చవాకులు పేలుతున్నారు. పవ‌న్‌ టార్గెట్ చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. అందులో ప్రధానంగా పేర్కొంటున్న కామెంట్ ఏమిటంటే, పవన్ కళ్యాణ్ ఒకసారి తన తండ్రి కొణిదెల వెంకట్రావు గురించి చెబుతూ, తన తండ్రి దీపారాధనతో సిగరెట్ వెలిగించుకునేవారని చెప్పారు. అలాంటి తండ్రికి పుట్టిన కొడుకు పవన్ కళ్యాణ్ ఇప్పుడు హిందూ మతానికి అన్యాయం జరుగుతోందని బాధపడుతున్నారు అని కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి కామెంట్లు పెట్టడం ద్వారా వైసీసీపీ నాయకులు తమ లేకితనాన్ని మరోసారి బయటపెట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ తండ్రి ఏదో చేస్తే, ఆయన కొడుకు హిందూ మత విశ్వాసాల గురించి మాట్లాడ్డమేంటని అనడం అజ్ఞానానికి అతిపెద్ద ఆనవాలు. తండ్రి అలా అయినంతమాత్రాన కొడుకు కూడా అలాంటి వాడేనా? ఆ లెక్కకొస్తే, జగన్ తాత వైఎస్ రాజీరెడ్డి బ్రిటీష్ వాళ్ళకి పంది మాంసం సరఫరా చేసేవాడు. అలాంటి తాతకు మనవడు కాబట్టి జగన్ పందికొవ్వు కలసిన నెయ్యితో స్వామివారి లడ్డూలు చేయించారని అనుకోవచ్చు కదా. ఒక కామెంట్ చేసేముందు ముందూ వెనుకా ఆలోచించే అలవాటు ఈ వైసీపీ వాళ్ళకి జీవితంలో రాదు! ఈ మేటర్ ఇంకా వుంది. పవన్ కళ్యాణ్ తండ్రి వెంకట్రావు దీపారాధన దీపంతో సిగరెట్ వెలిగించుకున్న మాట వాస్తవమే. ఈ విషయాన్ని ఒకసారి పవన్ కళ్యాణే స్వయంగా చెప్పారు. అయితే, ఆ తర్వాత ఏం జరిగిందో కూడా పవన్ కళ్యాణ్ చెప్పారు. అలా దీపారాధనతో సిగరెట్ వెలిగించుకున్న నాస్తికుడైన తన తండ్రి ఆ తర్వాత రామభక్తుడిగా మారిపోయారని, నిరంతరం రామనామాన్ని జపిస్తూ వుండేవారని, తాను అజ్ఞానంతో చేసిన తప్పుని జీవితాంతం గుర్తు చేసుకుని బాధపడుతూ వుండేవారని చెప్పారు. ఈ వైసీపీ మూకలు ఇదంతా వదిలేసి ‘పవన్ కళ్యాణ్ తండ్రి దీపారాధన దీపంతో సిగరెట్ వెలిగించుకున్నాడు’ అంటూ ప్రచారం చేయడంలో బిజీగా వున్నాయి. ఇక వైసీపీలో వున్న మరో కళాకారుడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి చేసిన ఒక గొప్ప కామెంట్ గురించి కూడా మనం చెప్పుకుని తరించాలి. నెయ్యిలో పంది కొవ్వు కలవటం గురించి ఆయన చేసిన కామెంట్లు వింటే, ఆయన బుర్రని ఏ మ్యూజియంలో పెట్టాలా అనే ఆలోచన ఎవరికైనా వచ్చితీరుతుంది. ఆయన చెబుతున్నదాని ప్రకారం... ‘‘ఆవు నెయ్యి రేటు రాగి లాంటిది. అదే పంది కొవ్వు ధర బంగారం లాంటిది. అలాంటప్పడు రాగిలాంటి ఆవు నెయ్యిలో బంగారం లాంటి పంది కొవ్వు ఎందుకు కలుపుతారు?’’ ఇదీ ఆయన వెర్షన్. ఆవు నెయ్యికంటే పంది కొవ్వే విలువైనది అని చెబుతూ తాము చేసిన తప్పును అడ్డదిడ్డంగా సమర్థించుకుంటున్న పొన్నవోలు సుధాకర్‌రెడ్డి ఆ వైఎస్ జగన్‌కి అసలు సిసలు ఫాలోవర్. ఈ మేటర్‌కి ముక్తాయింపు ఏమిటంటే, జగన్మోహన్ రెడ్డి వేడి వేడి కల్తీ నెయ్యిలో పడ్డారు. ఇక అందులో మునిగిపోవడం తప్ప చేయగలిగిందేమీ లేదు.

జగన్ నెత్తిన లడ్డూ బాంబు!?

తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడకం ఇప్పుడు దేశ వ్యాప్తంగా ప్రధాన అంశంగా చర్చల్లో నిలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులంతా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రాంతీయ మీడియా, సోషల్ మీడియా, ఆఖరికి జాతీయ మీడియా కూడా లడ్డూ వ్యవహారంపైనే ఫోకస్ చేసింది.  లడ్డూ వివాదంపై జగన్ మీడియా ముందుకు వచ్చి రాజకీయ విమర్శలు గుప్పించినా కూడా లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారం  జగన్ పాలనలోనే జరిగిందని జనం నమ్ముతున్నారు. జగన్ కౌంటర్ అటాక్ ను పట్టించుకున్న వారే లేరు. చివరాఖరికి వైసీపీ శ్రేణులు కూడా జగన్ రాజకీయ విమర్శలను నమ్మడం లేదు. వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డిలకు హిందూ మత విశ్వాసాల పట్ల నమ్మకం లేదనీ, అందుకే కల్తీ నెయ్యి సరఫరా జరుగుతున్నా పట్టించుకోలేదనే విశ్వసిస్తున్నారు. దీంతో లడ్డూ వివాదం నుంచి ఎలా బయటపడాలో, అసలీ వివాదంపై ఎలా స్పందించాలో కూడా తెలియక వైసీపీ నేతలు, శ్రేణులు చేష్టలుడిగాపోయాయి. రాజకీయంగానే కాదు, నైతికంగా కూడా వైసీపీ ప్రతిష్ట అధ: పాతాళానికి పడిపోయిందనడంలో సందేహం లేదు.  మామూలుగా ఓటు బ్యాంకు రాజకీయాలపై లడ్డూ ప్రసాదంలో కల్తీ వ్యవహారం జగన్ కు, ఆయన పార్టీకీ తీరని నష్టం చేసిందని అంతా భావిస్తున్నారు కానీ, లడ్డూ ప్రసాదంలో కల్తీ ఎఫెక్ట్ అంత కంటే లోతుగానే ఉంటుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జగన్ మీడియా ముందుకు వచ్చి లడ్డూ ప్రసాదం కల్తీ విషయంలో చేసిన రాజకీయ విమర్శలు పూర్తిగా నిరుపయోగం అవ్వడమే కాకుండా.. కచ్చితంగా జగన్ హయాంలోనే ఈ కల్తీ జరిగిందన్నది ప్రజలకు నిర్ధారణ చేశాయి. ఇది వైసీపీకి రాజకీయంగా తీరని నష్టం కలిగించిందనడంలో సందేహం లేదు. కేవలం నష్టమే కాకుండా ఆ పార్టీకి రాజకీయ ఉనికిని కూడా ప్రశ్నార్థకం చేసే రేంజ్ లో లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారం ప్రజలలో ఆగ్రహావేశాలను నింపింది.  లడ్డూ ప్రసాదంలో వినియోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు అవశేషాలు ఉన్నాయన్న సంగతి వెలుగు చూడగానే వైసీపీలో మేధావులుగా పరిగణింపబడుతున్న వారు దీని వల్ల పార్టీకి జరిగే నష్టం ఏ స్థాయిలో ఉంటుందన్న అంచనాలు వేయడం ప్రారంభించారు. జగన్  మీడియా సమావేశం కారణంగా మరింత డ్యామేజి జరిగింది తప్ప పార్టీకి ఎటువంటి ప్రయోజనం చేకూరలేదని వారు నిర్ధారణకు వచ్చారు. కల్తీ జరిగి ఉంటే జరిగి ఉండొచ్చు కానీ దానిని బయటపెట్టి తిరుమల దేవుని ప్రతిష్ఠకు భంగం కలిగిస్తారా అంటూ జగన్ మీడియా సమావేశంలో చంద్రబాబుపై విమర్శలు గుప్పించడం వైసీపీకి బూమరాంగ్ అయ్యింది. జగనే స్వయంగా కల్తీ జరిగినట్లు అంగీకరించినట్లైంది.  ఇక ఇప్పుడు రాజకీయంగా వైసీపీకి వాటిల్లిన, వాటిల్లబోయే నష్టం విషయానికి వచ్చే ముందు  2014 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీతో కలిసి కూటమిగా పోటీ చేసిన బీజేపీ.. ఆ తరువాత కొద్ది కాలానికే అప్పటి ప్రతిపక్షమైన వైసీపీకి, ఆ పార్టీ అధినేత జగన్ కు అనుకూలంగా వ్యవహరించడం ప్రారంభించింది. 2019 ఎన్నికల నాటికి పరోక్షంగా జగన్ కు అన్ని విధాలుగా పరోక్ష సహకారం అందించింది.  మళ్లీ 2024 ఎన్నికలు వచ్చే సరికి తెలుగుదేశంతో జట్టు కట్టింది. అంటే రాష్ట్రంలో కనీస బలం కూడా లేని బీజేపీ తన అవసరాలు, పబ్బం గడుపుకోవడం కోసం రాష్ట్రంలో ఊసరవెల్లిలా రంగులు మారుస్తోంది. అన్నిటికీ మించి తన రాజకీయ ప్రయోగాలకు ఆంధ్రప్రదేశ్ ను ఒక లేబొరేటరీలా వాడుకుంటోంది. ఈ  ప్రయోగాల కారణంగా ఏపీ ఏ గంగలో కలిసినా ఫర్యాలేదు అన్నట్లుగా వ్యవహరిస్తోంది.   అయితే ఇక ఇప్పుడు అంటే లడ్డూ వివాదం తరువాత ఆ పార్టీకి ఆ అవకాశం ఇసుమంతైనా లేదు. తన రాజకీయ ప్రయోజనాల కోసమైనా.. జగన్ కు మద్దతు, సహకారం అందించే పరిస్థితి ఇప్పుడే కాదు మరెప్పుడూ తలెత్తే అవకాశం లేదు. హిందూత్వను భుజాన వేసుకునే బీజేపీ ఇప్పుడు అనివార్యంగా మిగిలిన అన్ని పార్టీల కంటే ఎక్కువగా జగన్ పై విమర్శలు గుప్పించి, జగన్ తిరుమల తిరుపతికి చేసిన అపచారాన్ని ఎండగట్టక తప్పని పరిస్థితి లడ్డూ వివాదం కారణంగా ఏర్పడింది.  చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరించి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడకం వెనుక ఉన్నది వైసీపీయేనని సందేహాలకు అతీతంగా ఎస్టాబ్లిష్ చేశారు. దేవుడికి జరిగిన మహాపచారంలో వైసీపీ ప్రమేయం ఉందని నిరూపించేశారు. దీంతో వైసీపీకి బీజేపీ ద్వారాలు శాశ్వతంగా మూతపడేలా చేశారు. జగన్ తో ఏ రకంగానైనా సంబంధాలు కొనసాగిస్తే బీజేపీ దేశ వ్యాప్తంగా హిందువుల ఆగ్రహానికి గురౌతుంది. ఆ కారణంగానే బీజేపీ ద్వారాలు జగన్ కు ఇక ఎప్పటికీ తెరుచుకునే పరిస్థితి లేదు.  ఆ సంకేతాలు ఇప్పటికే ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. తాడేపల్లి ప్యాలెస్ వద్ద బీజేపీ ధర్నా జరగడాన్ని చెప్పవచ్చే. ఒక్క రాష్ట్రంలోనే కాకుండా దేశ వ్యాప్తంగా కూడా బీజేపీ శ్రేణులు నేతలు వైసీపీపై జగన్ పై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. దాంతొ ఇక వైసీపీ ఎప్పటికీ బీజేపీకి అంటరాని పార్టీగా మారిపోయిందనే చెప్పాలి.  అంటే జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ స్పీడందుకుంటుందన్నమాట. జగన్ లో ఇప్పటికే ఆ భయం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.  

తీన్మార్ మల్లన్న బీసీ సీఎం నినాదం ఆంతర్యమేంటో?

రాజకీయ నాయకులకు కామన్‌గా వుండే ఒక లక్షణం ఏంటంటే, తమకు ఏదైనా పదవో, ఇంకోటో కావాలంటే.... వాటిని ఇచ్చే వారిని డైరెక్ట్.గా అడగరు. ఏదో ఒక కొత్త ఉద్యమం లేపుతారు. కొత్త నినాదాన్ని చేపడతారు. అప్పుడు సదరు పదవి ఇచ్చే వ్యక్తికి విషయం అర్థమవుతుంది. వెంటనే ఏదో ఒక పదవో, కాంట్రాక్టో ప్రసాదిస్తాడు. దాంతో ఉద్యమాలు, నినాదాలు లేవనెత్తిన సదరు నాయకుడు గప్‌చుప్ అయిపోయి తనకు దక్కిన దానితో సంతృప్తిపడుతూ వుంటాడు. ఈమధ్య ఎమ్మెల్సీగా ఎన్నికైన తీన్మార్ మల్లన్న కూడా ఇదే బాటలో పయనిస్తున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి.  తీన్మాన్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ హోరాహోరీగా పోరాడి ఎమ్మెల్సీ అయ్యారు. అంత పోరాడి ఎమ్మెల్సీ అయ్యాను కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పోరాటపటిమను మెచ్చి ఏదైనా మంచి పదవి ఇస్తారేమోనని మల్లన్న ఆశించి వుండవచ్చు. అలా ఆశించడం తప్పు కూడా కాదు. అయితే మల్లన్నకు సీఎం రేవంత్ రెడ్డి పెద్దగా పట్టించుకున్నట్టు కనిపించడం లేదు. అయితే, ఇప్పుడు తీన్మార్ మల్లన్న కొత్తగా బీసీ ఉద్యమాన్ని నెత్తికి ఎత్తుకున్నారు. ఆదివారం నాడు హైదరాబాద్‌లో జరిగిన బీసీ కులసంఘాల అఖిల పక్ష రాష్ట్ర సదస్సులో పాల్గొన్న తీర్మాన్ మల్లన్న బీసీల గళాన్ని వినిపించే ప్రయత్నం చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పనతోపాటు సమగ్ర కుల గణనని కూడా కాంగ్రెస్ ప్రభుత్వంతో జరిపించే బాధ్యత తనదేనని తీన్మార్ మల్లన్న అన్నారు. ఒకవేళ ఇవి జరగకపోతే తనదే బాధ్యత అని తన నెత్తిన బరువు పెట్టుకున్నారు. జనాభా ప్రాతిపదిక ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలనేది కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ ఉద్దేశమని అధిష్ఠానం వైపు నుంచి నరుక్కొచ్చే ప్రయత్నం చేశారు. ఇదంతా బాగానే వుంది... ఇక్కడి వరకు ఎలాంటి అనుమానాలు లేవు. అయితే పనిలోపనిగా తీన్మార్ మల్లన్న ఒక  వ్యాఖ్య మాత్రం మనసులో ఏదో ఉద్దేశం పెట్టుకునే చేసినట్టు కనిపిస్తోంది.  ఇంతకీ ఆ వ్యాఖ్య ఏమిటంటే, తెలంగాణ రాష్ట్రం బీసీ రాష్ట్రంగా మారబోతోందట, 2028లో జరిగే ఎన్నికలలో బీసీ నాయకుడే తెలంగాణకు ముఖ్యమంత్రి అవుతారట. పదేళ్ళపాటు తానే ముఖ్యమంత్రిగా వుంటానని రేవంత్ రెడ్డి చెబుతున్నారు. అలాంటి వచ్చే ఎన్నికల తర్వాత బీసీ నాయకుడు ముఖ్యమంత్రి అవుతారని తీన్మార్ మల్లన్న అంటున్నారంటే, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కుర్చీ కిందకి నీళ్ళు తెచ్చే వ్యవహారమే కదా. అలాగే, ముఖ్యమంత్రి అవ్వాలన్న ఆశ వున్నప్పటికీ అవకాశం లేక ఊరుకున్న తెలంగాణ కాంగ్రెస్ బీసీ నాయకులలో లేనిపోని ఆశలు కలిగించడమే కదా! ఇంకానయం, తీన్మార్ మల్లన్న బీసీ ముఖ్యమంత్రి వస్తాడని మాత్రమే అన్నారు. బీసీ అయిన తానే ముఖ్యమంత్రి అవుతానని అనలేదు. ఏది ఏమైనప్పటికీ తీన్మార్ మల్లన్న ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విషయంలో అసంతృప్తిగా వున్నారు. తెలంగాణ ఉద్యమంలో తనవంతు పాత్రను పోషించిన తనది కేవలం ఎమ్మెల్సీ స్థాయి మాత్రమే కాదు.. ఇంకా పెద్ద స్థాయి అని, ఆ స్థాయిని రేవంత్ రెడ్డి ఇంకా గుర్తించలేదని తీన్మార్ మల్లన్న ఫీలవుతున్నట్టు అర్థమవుతోంది. మరి తీర్మాన్ మల్లన్నఈ ఆవేదనను రేవంత్ రెడ్డి గుర్తించి ఆయనకు సముచిత స్థానం కల్పిస్తారో, లేదా మల్లన్న ఆవేదదను ఈ చెవితో వినేసి ఆ చెవితో వదిలేస్తారో చూడాలి.

స్వామివారి లడ్డూకి పూర్వ వైభవం!

తిరుమల స్వామివారి ప్రసాదం లడ్డూ అన్నా, దాని పవిత్రత అన్నా, దాని రుచి అన్నా మీకు ఎంతో ఇష్టం కదూ? తిరుమల లడ్డూ తయారీలో ఉపయోగించిన నెయ్యిలో కల్తీ జరిగిందని, స్వచ్ఛమైన ఆవు నెయ్యి కాకుండా జంతువుల కొవ్వు కలిసిన నెయ్యితో లడ్డూ తయారీలో ఉపయోగించారని ఇటీవల వచ్చిన వార్తలు విని మీరు చాలా బాధపడే వుంటారు. తిరుమలలో ఎన్నో అవినీతి, అక్రమ కార్యకలాపాలు చేసిన ఈ దుర్మార్గులు చివరికి స్వామివారి లడ్డూని కూడా వదల్లేదా అని మీకు కోపం వచ్చింది  కదూ! ఈ ఐదేళ్ళుగా ఎంతో భక్తిగా, ప్రేమగా స్వీకరించిన లడ్డూ ప్రసాదం వెనుక ఇంత కుట్ర జరిగిందని మీకు బాధకలిగే వుంటుంది. స్వామివారికి జరిగిన అపచారం మీకు తీవ్ర మనోవేదన కలిగించే వుంటుంది. అయితే, ఇక అలా బాధపడాల్సిన అవసరమే లేదండీ.. పరిస్థితితో మార్పు వచ్చింది. తిరుమల లడ్డూకి పవిత్రత మళ్ళీ సమకూరింది. తిరుమల లడ్డూ విషయంలో ఇక ఎలాంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. చంద్రబాబు ప్రభుత్వం పరిస్థితిని పూర్తిగా మార్చింది. లడ్డూ తయారీకి ఉపయోగించే నేతిని మార్చింది. ఇప్పుడు శ్రీవారి లడ్డూని ఎలాంటి ఇబ్బంది లేకుండా, పవిత్రత విషయంలో ఎలాంటి అనుమానాలకు గురికాకుండా మహాప్రసాదాన్ని హాయిగా స్వీకరించవచ్చు. అలాగే శ్రీవారి ఆలయంలో జరిగిన దోషాలకు ప్రాయశ్చిత్తంగా టీటీడీ అధికారులు శాంతి హోమం, పంచగవ్య ప్రోక్షణ నిర్వహించారు. ఆలయంలోని అన్ని విభాగాల్లోనూ ప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్యంగా లడ్డూ తయారీ జరిగే పోటులో ప్రోక్షణ జరిగింది. స్వామివారికి మహా నైవేద్యం నిర్వహించారు. ఇక భక్తులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని టీటీడీ ఈఓ శ్యామలరావు భరోసా ఇస్తున్నారు. పూర్ణాహుతి కార్యక్రమ నిర్వహణతో అన్ని దోషాలూ తొలగుతాయని ఆయన వివరించారు. గతంలో వున్న నెయ్యి మొత్తాన్నీ తొలగించామని తెలిపారు. 

రేవంత్ వల్లే దేవర ప్రీ రిలీజ్ ఫంక్షన్ క్యాన్సిల్!

జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రేవంత్ రెడ్డి షాక్ ఇచ్చారా?  ఆ ఈవెంట్ రద్దు కావడానికి రేవంత్ రెడ్డే కారణమా అంటే అంటే ఎన్టీఆర్ అభిమానులు ఔననే అంటున్నారు. ఎంతో ముందుగా ఫిక్స్ అయిన దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆగిపోవడానికి రేవంత్ రెడ్డి అదే రోజు మాదాపూర్ లోని ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు రావడంతో దేవర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను క్యాన్సిల్ చేశారని అంటున్నారు. స్టార్ హీరో అయిన ఎన్టీఆర్ కు స్ట్రాంగ్ అభిమానుల బేస్ ఉంది. కొన్నేళ్ల తరువాత  ఎన్టీఆర్ సినీమా విడుదల కాబోతుండటంతో ఫ్యాన్స్ అవధులు లేని ఆనందంలో ఉన్నారు. వాస్తవానికి 2018 తరువాత ఎన్టీఆర్ సోలో హీరోగా వస్తున్న సినిమా దేవర. మధ్యలో ఆర్ఆర్ఆర్ రిలీజై రికార్డులు బద్దలు కొట్టింది. ఈ సినిమాలో నటనకు గాను ఎన్టీఆర్ పాన్ వరల్డ్ హీరో అయిపోయారు. అయినా కూడా ఆ సినిమాలో ఎన్టీఆర్ తో పాటు రామ్ చరణ్ కూడా హీరోగా నటించారు. దీంతో ఎన్టీఆర్ సోలో హీరోగా ఆరేళ్ల తరువాత వస్తున్న సినిమా దేవర. ఈ నేపథ్యంలోనే దేవర సినిమా క్రేజ్ అంబరాన్నంటింది. అందుకే దేరవ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు భారీ ఏర్పాట్లు చేశారు. అవసరమైన అనుమతులన్నీ తీసుకున్నారు. పోలీసులు కూడా ఫంక్షన్ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ అంటే తోపులాట, తొక్కిస లాట వంటివి జరగకుండా భారీ ఏర్పాట్లు చేశారు. నోవాటెల్ లో జరగాల్సిన ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ అభిమానులు అంచనాలకు అందనంత సంఖ్యలో భారీగా రావడంతో పోలీసులు కూడా చేతులెత్తేశారు. దీంతో చివరి క్షణంలో దేవర ప్రీరిలీజ్ ఫంక్షన్ ను రద్దు చేశారు. దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు తరువాత అభిమానుల ఆగ్రహాన్ని చల్లార్చేందుకు జూనియర్ ఎన్టీఆర్ ఓ వీడియో కూడా రిలీజ్ చేశారు. మొత్తం మీద అంచనాలకు మించి అభిమానులు పెద్ద సంఖ్యలో రావడంతో పాటు సీఎం రేవంత్ కార్యక్రమం కూడా దేవర ప్రీరిజ్ ఈవెంట్ రద్దుకు ప్రధాన కారణంగా చెబుతున్నారు.  ఎందుకంటే పోలీసు బందోబస్తు రేవంత్ కార్యక్రమం కోసం వెళ్లడంతో దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగాల్సిన నోవాటెల్ వద్ద సరిపడినంత బందోబస్తు లేకుండా పోయింది. సీఎం కార్యక్రమం ముగిసి పోలీసు బలగాలు నోవాటెల్ ప్రాంతానికి రాత్రి ఎనిమిదిన్నగంటల తరువాత వచ్చారు. అయితే అప్పటికే పోలీసులు కంట్రోల్ చేయలేనంతగా ఎన్టీఆర్ అభిమానులు నోవాటెల్ వద్దకు చేరుకున్నారు. చివరి క్షణంలో అంత క్రౌడ్ కంట్రోల్ చేయడం సాధ్యం కాదని భావించిన నిర్వాహకులు ఫంక్షన్ క్యాన్సిల్ చేయడం వినా మరో మార్గం లేదన్న నిర్ణయానికి వచ్చి ఫంక్షన్ రద్దైందని ప్రకటించారు.  అంచనాలకు మించి అభిమానులు తరలిరావడం వల్లే ఫంక్షన్ క్యాన్సిల్ అయ్యిందని నిర్వాహకులు, పోలీసులు చెబుతున్నా.. సీఎం రేవంత్ పాల్గొన్న కార్యక్రమ బందోబస్తు కోసం దేవర్ ప్రీరిలీజ్ ఫంక్షన్ ను బలి చేశారని అభిమానులు వాపోతున్నారు.   నిజానికి సీఎం ప్రోగ్రాం, దేవర ఫంక్షన్ రెండూ  దాదాపు  ఒకే టైమ్‌లో,  ఒకే ఏరియాలో జరగడమే అసలు సమస్య అని అభిమానులు అంటున్నారు. 

తిరుమల లడ్డూ ప్రసాదం విక్రయాలు పెరిగాయి.. ఎందుకంటే?

తిరుమల లడ్డూ ప్రసాదం వివాదంపై తార స్థాయిలో  చర్చ జరుగుతున్న వేళ కూడా లడ్డూ ప్రసాదాల విక్రయాలు తగ్గలేదు సరికదా గణనీయంగా పెరిగాయి. ఈ వివాదం వెలుగులోకి రాకముందు.. అంటే జగన్ హయాంతో పోలిస్తే.. గత పది రోజులుగా లడ్డూ విక్రయాలు విపరీతంగా పెరిగాయి.  జగన్ హయాంలో లడ్డూ ప్రసాదం నాణ్యత గణనీయంగా తగ్గిపోయిందన్న విమర్శలు వెల్లువెత్తాయి. నాణ్యత లేనందున భక్తులు లడ్డూ ప్రసాదాల కొనుగోలు విషయంలో కొంచం ముందు వెనుకలాడారు. గతంలోలా శ్రీవారిని దర్శించుకుని లడ్డూ ప్రసాదాలను పెద్ద ఎత్తున కొనుగోలు చేయకుండా నియంత్రణ పాటించారు. పెద్ద సంఖ్యలో లడ్డూ ప్రసాదాలను కొనుగోలు చేసి తమ తమ ఊర్లకు తీసుకు వెళ్లి బంధు మిత్రులకు పంచే సంప్రదాయానికి జగన్ హయాంలో చెక్ పడింది. ఎందుకంటే అప్పట్లో లడ్డూ నిలవ ఉండేది కాదు. నాణ్యతా లోపం కారణంగా రెండు మూడు రోజులకే పాడైపోయేది. తిరుమల యాత్ర ముగించుకని తమ తమ ఊళ్లకు వెళ్లిన తరువాత లడ్డూ ప్రసాదాన్ని బంధు మిత్రులకు పంచాలంటే భక్తులు ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సి వచ్చేది. ఆ కారణంగానే జగన్ అధికారంలో ఉండగా లడ్డూ ప్రసాదాల విక్రయాలు పడిపోయాయి. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత లడ్డూ ప్రసాదంలో నాణ్యత పెరిగిన విషయాన్ని భక్తులు గుర్తించారు. సామాజిక మాధ్యమం ద్వారా పలువురు ఈ విషయాన్ని చాటారు. దీంతో కూటమి సర్కార్ కొలువుదీరిన తరువాత తిరుమల లడ్డూ ప్రసాదాల విక్రయాలలో పెరుగుదల కనిపించింది. అయితే అప్పటికి లడ్డూ ప్రసాదంలో  వినియోగించే నెయ్యి జంతువుల కొవ్వుతో కల్తీ అయ్యిందన్న విషయం వెలుగులోనికి రాలేదు. అయితే  కూటమి ప్రభుత్వం కొలువుదీరగానే తిరుమల ప్రక్షాళన ప్రారంభించింది. అన్న ప్రసాదం నుంచి, తిరుమల కొండపై హోటళ్లలో పారిశుద్ధ్యం, తినుబండారాలలో నాణ్యత విషయంలో రాజీపడకుండా ముందుకు సాగడంతో మార్పు ప్రస్ఫుటంగా కనిపించింది. జనం, భక్తులు కూడా అదే అనుకున్నారు. అయితే ఎప్పుడైతే తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వు అవశేషాల వినియోగం వెలుగుచూసిందో... భక్తులు నివ్వెర పోయారు. దిగ్భ్రాంతికి గురయ్యారు. జగన్ హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదంలో నాణ్యతా లోపానికి కారణం తెలిసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  అదే సమయంలో  కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నాణ్యత విషయంలో రాజీ పడబోమన్న చంద్రబాబు ఆ మాట నిలబెట్టుకుని కల్తీని నివారించారని భక్త జనం నమ్ముతున్నారు. అందుకే ఇంతటి వివాదంలోనూ గతం కంటే లడ్డూ విక్రయాలలో పెరుగుదల కనిపిస్తోంది.  ఈ నెల 19న భక్తులు 3 లక్షల 59 వేల 650 లడ్డూలు కొనుగోలు చేస్తే.. 20వ తేదీన ఆ సంఖ్య 3లక్షల 17 వేల 954గా ఉంది. ఇక 21వ తేదీనైతే అది 3 లక్షల 67 వేల 607కు పెరిగింది.   దీనిని బట్టి చూస్తే లడ్డూ ప్రసాదం వివాదం వాటి విక్రయాలపై ఇసుమంతైనా ప్రభావం పడలేదని స్పష్టమౌతోంది.  ఇందుకు కూటమి కొలువుదీరిన తరువాత తిరుమల తిరుపతి దేవస్థానం పారదర్శకంగా వ్యవహరించడం, నాణ్యత పెంపు స్ఫష్టంగా కనిపిస్తుండటం కారణంగా చెప్పవచ్చు. అలాగే తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో మళ్లీ నంది నెయ్యే వినియోగిస్తున్నట్లే టీటీడీ ప్రకటించడం కారణంగా చెప్పొచ్చు.  

తిరుపతి లడ్డు వివాదం ..ధర్మారెడ్డి ఏరీ? ఎక్కడ?

తిరుమల తిరుపతి లడ్డూ వివాదంతో దేశం అట్టుడికిపోతున్నది. లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడకం జరిగిందన్న విషయం ల్యాబ్ నివేదికతో నిర్ద్వంద్వంగా తేలిపోయింది. జగన్ హయాంలో దేవాలయాలపై జరిగిన అరాచకాలు, దాడులను మించి లడ్డూ ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వు వినియోగం.. ప్రజల మనోభావాలను తీవ్రాతి తీవ్రంగా దెబ్బతీసింది. ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా దేశ ప్యాప్తంగా జనం ఆందోళనలకు దిగుతున్నారు. జగన్ దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తున్నారు. తాడేపల్లి ప్యాలెస్ వద్ద కూడా బీజేపీ ధర్నా చేసింది. జగన్ పై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేసింది. ఇక జాతీయ మీడియా తిరుమల శ్రీవారి లడ్డూ వివాదంపై డిబేట్లు నిర్వహించింది. అంటే జగన్ హయాంలో తిరుమల పవిత్రత దెబ్బతిందని ప్రజలు సందేహాలకు అతీతంగా నిర్ధారణకు వచ్చేశారు.  ఒక్క చాన్స్ అంటూ ప్రజలను అభ్యర్థించి అధికారంలోకి వచ్చిన జగన్  ఐదేళ్ల పాటు బాధ్యతారహితంగా అరాచక పాలన సాగించారు. దాడులు, దౌర్జన్యాలు, అక్రమ కేసులు, కక్ష సాధింపులే తన పాలనా విధానం అన్న రీతిలో జగన్ పాలన సాగింది. అదంతా పక్కన పెడితే..  తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై మాట్లాడాల్సిన అప్పటి  తిరమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి మాత్రం మౌనాన్ని ఆశ్రయించారు. అసలు ఆయన ఎక్కడ ఉన్నారన్న సమాచారం కూడా లేదు.  జగన్ హయాంో ఐదేళ్లపాటు  తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా పనిచేసిన ధర్మారెడ్డి ఈ లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై మాట్లాడాలి. కానీ ఆయన ఆచూకీ తెలియడం లేదు.   జగన్ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా ఐదేళ్లు వెలగబెట్టిన ధర్మారెడ్డి.. 2024 ఎన్నికల ఫలితాలకు సరిగ్గా నాలుగు రోజుల ముందు పదవీ విరమణ చేశారు.  జగన్ హయాంకు ముందు వరకూ టీటీడీ ఈవోలుగా పని చేసిన వారంతా ఐఏఎస్ అధికారులు మాత్రమే. కానీ  జగన్ అధికారం చేపట్టిన తరువాత టీటీడీ ఈవో నియోమకం విషయంలో సంప్రదాయానికీ, ఆనవాయితీకి పంగనామాలు పెట్టేసి ఐడీఈఎస్ (ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్స్ సర్వీస్)కి చెందిన ధర్మారెడ్డిని ఏరి కోరి మరీ టీటీడీ ఈవోగా నియమించుకున్నారు.  జగన్ అప్పగించిన బాధ్యతను ధర్మారెడ్డి తు.చ.తప్పకుండా నిర్వర్తించారు. తిరుమల పవిత్రతను మంటగలిపే విధంగా నిర్ణయాలు తీసుకున్నారు. తిరుమల కొండపై అన్యమత ప్రచారం జరిగినా పట్టించుకోలేదు. రాజకీయ ప్రసంగాలకు వేదికగా తిరుమల మారుతున్నా మాట్లాడలేదు. టీటీడీలో అన్యమతస్తులను కొలువులు కట్టబెట్టారు. ఇలా టీటీడీ జగన్ హయాంలో ధర్మారెడ్డి జాగీర్ అన్నట్లుగా మారిపోయింది. ధర్మారెడ్డి జాగీరు అంటే జగన్ జాగీరేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సరే ఇప్పుడు జగన్ అధికారంలో లేరు. జగన్ హయాంలో టీటీడీలో రాజ్యమేలిన అరాచకం, అకృత్యాలపై ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లడ్డూ ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వు వినియోగించారని వెలుగులోనికి వచ్చింది. వీటన్నిటికీ తొట్ట తొలుత బాధ్యత వహించాల్సింది అప్పటి ఈవో ధర్మారెడ్డి మాత్రమే. ఆ తరువాత అప్పటి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఆయనకు మందు టీటీడీ చైర్మన్ గా ఉన్న వైవీ సుబ్బారెడ్డిలు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అయితే వీరిలో ధర్మారెడ్డి మాత్రం కనిపించడం లేదు. వినిపించడం లేదు.   ఐదేళ్ల పాటు డిప్యూటేషన్ పై ఆంధ్ర సర్వీస్ లో ఉన్న ధర్మారెడ్డి, తనకు జూన్ 30 వరకూ ఎక్స్ టెన్షన్ ఇవ్వాల్సిందిగా ఎన్నికలకు ముందు కోరారు. అందుకు కేంద్రం అంగీకారం కూడా తెలిపింది. అయితే ఎన్నికలలో జగన్ రెడ్డి పార్టీ ఘోర పరాజయాన్ని మూటకట్టుకుని అధికారం కోల్పోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు ప్రభుత్వం ధర్మారెడ్డిని సెలవుపై పంపింది.  జూన్ 30తో ఎక్సటెన్షన్ ముగియటంతో సొంత క్యాడర్ లో చేరి ఉండాలి కానీ చేరారా లేదా అన్న సమాచారం లేదు.   

బావ,బామ్మర్దుల ఆధిపత్య పోరు: రేవంత్ ఆజ్యం !!

బిఆర్ఎస్ పార్టీలో బావ,బామ్మర్దుల మధ్య ఆధిపత్య పోరాటం ముమ్మరమైనట్టు తాజా ఘటనలు,సన్నివేశాలు రుజువు చేస్తున్నవి.చాలాకాలంగా పార్టీపై ఆధిపత్యం కోసం అంతర్గత పోరాటం జరుగుతున్నప్పటికీ ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ,కౌశిక్ రెడ్డిల గొడవలో మాజీ మంత్రి హరీశ్ రావు పైచేయి సాధించినట్టు ఆ పార్టీ క్యాడర్ భావిస్తున్నది.పార్టీలో కేసీఆర్ తర్వాత నెంబర్ టూగా కేటీఆర్,నెంబర్ త్రీగా హరీశ్ రావు వ్యవహరిస్తున్నారు.ఇద్దరూ మంత్రులుగా పనిచేసిన వారే! అయితే కేటీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా సమర్థంగా 'పెర్ఫార్మ్' చేయడం లేదని కొందరు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు,మాజీ ఎమ్మెల్యేలు,నాయకులు,కార్యకర్తలు విమర్శిస్తున్నారు.పార్టీ అధికారం కోల్పోయాక కూడా కేటీఆర్ లో మునుపటి గర్వం,అహంకారం తగ్గడం లేదని అంటున్నారు.పార్టీ అధికారంలో ఉన్నట్టుగానే వర్కింగ్ ప్రెసిడెంట్ పనితీరు కనిపిస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. కేటీఆర్ వైఫల్యాలను హరీశ్ తనకు అనుకూలంగా మలచుకొని దూసుకుపోతున్నట్టు తెలుస్తోంది.కాంగ్రెస్ ప్రభుత్వంపైన,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపైన పెద్ద ఎత్తున విరుచుపడుతున్నారు.ఓటమి వల్ల పార్టీ శ్రేణుల్లో నెలకొన్న స్తబ్దత,నిరాశా నిస్పృహలను తొలగించేందుకు హరీశ్ రావు దూకుడు ప్రదర్శిస్తున్నట్టు పార్టీలో ప్రచారం జరుగుతోంది.బావ,బామ్మర్దుల మధ్య జరుగుతున్న 'పోరాటం'తో పార్టీ అధినేత కేసీఆర్ మరుగునపడి పోతున్నారు.కేసీఆర్ ఎర్రవల్లి ఫార్మ్ హౌజ్ కే పరిమితం కావడం హరీశ్ రావుకు కలిసి వచ్చినట్టు చెబుతున్నారు.2001 నుంచి కేసీఆర్ వెన్నంటి ఉద్యమంలో నడచిన హరీశ్ రావు,తెలంగాణ ప్రభుత్వంలోనూ తన మేనమామకు వెన్నుదన్నుగా ఉన్నారు.కేటీఆర్ మంత్రిగా మంచి మార్కులు సంపాదించినా,హరీశ్ రావు ప్రాబల్యానికి గండి కొట్టే చర్యలు అనేకం చేసినట్టు  ఆయనపై ఆరోపణలున్నవి. ఇద్దరి మధ్య జగడం 2014 నుంచి కొనసాగుతున్నది.అధికారం కోల్పోయాక అది ఉధృతమైనట్టు పార్టీ కార్యకర్తలు చెబుతున్నారు.ముఖ్యమంత్రిగా కేసీఆర్ తొలి టర్మ్ లోనే బావ,బామ్మర్దుల మధ్య  'ఆధిపత్య' పోరుకు బీజం పడింది.అప్పట్లో 'కేసీఆర్ తర్వాత సీఎం మా అన్న కేటీఆర్' అని ఎమ్మెల్సీ కవిత ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్య హరీశ్ రావుకు ఆయనకు మద్దతిచ్చే ఎమ్మెల్యేలకు తీవ్ర ఆగ్రహం తెప్పించాయి.అదే రోజు హరీశ్ రావు కేసీఆర్ నివాసానికి వెళ్ళి,కేటీఆర్,కవిత,సంతోష్... ఇతర కుటుంబసభ్యులతో 'ఘర్షణ'కు దిగారని బిఆర్ఎస్ నాయకులంటున్నారు.అది సద్దుమణిగినా ఇద్దరిమధ్యా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వాతావరణంకొంత కాలం కొనసాగింది. బంజారాహిల్స్ లోని మంత్రుల నివాస సముదాయంలో నాటి మంత్రి హరీశ్ రావు క్వార్టర్ దగ్గర 'స్పెషల్ బ్రాంచ్' పోలీసులు మఫ్టీలో నిఘా పెట్టడం,ఆ విషయాన్ని హరీశ్ రావు గుర్తించి కేటీఆర్ తో గొడవ పెట్టుకోవడం,నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గరకు ఈ పంచాయతీ వెళ్లడం,ఇద్దరినీ ఆయన నచ్చచెప్పడం... వంటి  ఘటనలను కొందరు బిఆర్ఎస్ నాయకులు గుర్తు చేస్తున్నారు.హరీశ్ రావును ఎవరెవరు కలుస్తున్నారో 'ఆరా' తీయడానికి కేసీఆర్ లేదా కేటీఆర్ నుంచి స్పెషల్ బ్రాంచ్ కు ఆదేశాలు అందినట్టు అప్పట్లో ఒక ప్రచారం జరిగింది.కేటీఆర్ ఆదేశాలతోనే  తనపైన నిఘా పెట్టినట్టు హరీశ్ రావు అనుమానించినందువల్ల ఇద్దరి మధ్య వాదోపవాదాలు జరిగాయని తెలిసింది. అలాగే ఇరిగేషన్ మంత్రిగా హరీశ్ రావు 'డిస్టింక్షన్' మార్కులు సంపాదించడంతో కేటీఆర్ లో అసూయ పెరిగిందన్న ప్రచారమూ అప్పట్లో జరిగింది.పైగా టిఆర్ఎస్ ఆవిర్భావం నుంచి కార్యకర్తగా,నాయకునిగా హరీశ్ కు గుర్తింపు ఉంది.ఆ గుర్తింపే పార్టీపై ఆయన  పట్టు పెరగడానికి కారణమైంది.కానీ పార్టీ అధ్యక్షుడు,ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారునిగా కేటీఆర్ కు తగిన గౌరవం లభించింది తప్ప అది ఆయన 'కష్టార్జితం' కాదన్న అభిప్రాయం పార్టీ కార్యకర్తల్లో ఉన్నది.ఐటి,పరిశ్రమల మంత్రిగా కేటీఆర్ సక్సెస్ కావడం వెనుక తన కృషితో పాటు  కొందరు ఐఏఎస్,ఐపీఎస్ అధికారులు శక్తివంచన లేకుండా పనిచేశారని చెబుతున్నారు.   పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరు అధికార కాంగ్రెస్ పార్టీకి అయాచిత వరంగా మారింది.ఈ పోరాటంలో ఆజ్యం పోయడానికి సీఎం రేవంత్  రెడ్డి ప్రయత్నిస్తున్నారు.వాళ్ళిద్దరి మధ్య దూరం మరింత పెరిగేలా రేవంత్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.బిఆర్ఎస్ లో 'అంతా తానే' అన్నట్లుగా వ్యవహరిస్తూ వచ్చిన కేటీఆర్ కు చెక్ పెట్టడానికి పార్టీ అధికారం కోల్పోవడం వల్ల హరీశ్ రావుకు కలిసి వచ్చిందంటున్నారు.ఒకవేళ కేసీఆర్ హ్యాట్రిక్ సాధించి ఉంటే కేటీఆర్ మరింత రెచ్చిపోయేవారని,హరీశ్ కు మంత్రి పదవి కూడా రాకుండా చేసే వారన్న చర్చ పార్టీ వర్గాల్లో ఉన్నది.   కాగా కేటీఆర్ ప్రభావాన్ని అటు బిఆర్ఎస్ లోనూ,జనాల్లోనూ తగ్గించాలన్నది  రేవంత్ ఎత్తుగడ. కొద్ది రోజులుగా కేటీఆర్ విమర్శలను పట్టించుకోనట్టుగా వ్యవహరిస్తూ, అదే సమయంలో హరీష్ రావు విమర్శలకు  కౌంటర్ ఇస్తుండడాన్ని గమనించవచ్చు.దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టార్గెట్ చేయడంతో సహజంగానే ప్రతిపక్ష శిబిరంలో హరీష్ రావు హైలెట్ అవుతున్నారు.బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను పట్టించుకోకుండా హరీష్ రావు పైనే విమర్శలు చేయడం,ఆయనకే సవాళ్లు విసరడం వెనుక రేవంత్ రెడ్డి వ్యూహాన్ని అర్ధం చేసుకోవచ్చు.తనకు కేసీఆర్ లేదా హరీశ్ తప్ప కేటీఆర్ పోటీదారు కాదనే సందేశాన్ని ప్రజల్లోకి పంపిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో కేటీఆర్ ను 'మేనేజ్మెంట్ కోటా'అంటూ విమర్శలు చేసిన రేవంత్ రెడ్డి తాజాగా  కేటీఆర్ విమర్శలకు,సోషల్ మీడియాలో ఆయన కౌంటర్లకు స్పందించడం లేదు. కొన్ని రోజులుగా హరీష్ రావు చుట్టూనే తెలంగాణ రాజకీయాలు నడుస్తున్నవి.కేటీఆర్ ను ముఖ్యమంత్రిగా తాను  టార్గెట్ చేస్తే అది ఆయనకు రాజకీయంగా మైలేజ్ రావచ్చునని రేవంత్ భావిస్తున్నారు.  హరీష్ రావును హైలైట్ చేయడం వల్ల ఆయనకు పాపులారిటీ రావడంతో పాటు,బావ బామ్మర్దుల మధ్య  వైరం పెరుగుతుందని కాంగ్రెస్ నాయకులంటున్నారు. -ఎస్.కే.జకీర్ (సీనియర్ జర్నలిస్ట్)   

జెత్వాని కేసులో కుక్కల విద్యాసాగర్ రిమాండ్ 

ముంబై నటి  కాదంబరి జెత్వాని కేసులో  అండర్ గ్రౌండ్ లో ఉన్న    వైసిపి నేత కుక్కల విద్యాసాగర్ ను  14 రోజుల పాటు రిమాండ్ కు తరలించారు.  విద్యాసాగర్ పై కేసు నమోదు చేసిన తర్వాత అండర్ గ్రౌండ్ లో ఉండి ముంబై తదితర నగరాల్లో కుక్కల విద్యాసాగర్ తలదాచుకున్నాడు.డెహ్రాడూన్ నుంచి  పోలీసులు విజయవాడ కోర్టుకు తరలించి రిమాండ్ కు పంపారు.   జెత్వానీపై  అప్పట్లో బడా పారిశ్రామికవేత్త జిందాల్  రేప్ చేసిన నేపథ్యంలో అతనిపై రేప్ కేసు నమోదైంది. ఈ రేప్ కేసు నుంచి తప్పించుకోవడానికి ఆ బడా పారిశ్రామిక వేత్త అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శరణు జొచ్చాడు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి ఆ పారిశ్రామికవేత్త అత్యంత సన్నిహితుడు. ఈ పరిచయాన్ని ఉపయోగించుకునే జిందాల్ జగన్ పంచన చేరారు. నేరం చేసిన జిందాల్ కు శిక్షపడే అవకాశాలున్నప్పటికీ జగన్ ఆ రేపిస్ట్ కు అండగా నిలిచారు.  జగన్ ఆదేశాలతో వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ జెత్వానిపై వేధింపులు చేస్తున్నప్పటికీ విషయం బయటకు పొక్కలేదు. ఎందుకంటే కుక్కల విద్యాసాగర్ జగన్ కు సన్నిహితుడు కావడమే. ఈ కేసులో ఎ వన్ ముద్దాయి కుక్కల విద్యాసాగర్.  దీంతో జెత్వానీ కేసులో అరెస్ట్ ల పర్వం మొదలైందనే అనుకోవాలి.

జ‌గ‌న్ గ‌తం గుర్తుచేసుకో.. మ‌త రాజ‌కీయాలు చేసింది నువ్వుకాదా!

కలియుగ వైకుంఠం.. తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన అపచారంతో యావత్ ప్రపంచంలోని శ్రీవారి భక్తులు కలవరానికి గురవుతున్నారు. పవిత్రమైన లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందంటూ ల్యాబ్ రిపోర్ట్ రావడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారం దేశ వ్యాప్తంగా పెద్ద దుమారం రేపుతోంది. కేంద్ర ప్రభుత్వ పెద్దలు సైతం ఈ అంశంపై స్పందించి.. అసలేం జరిగిందని ఆరా తీస్తున్నారు. మరోవైపు ఏపీ ప్రభుత్వం ఈ ఘటనను సీరియస్‌గా తీసుకుంది. కల్తీ వ్యవహారంలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు స్పష్టం చేశారు. లడ్డూ ప్రసాదం కల్తీ విషయంపై ప్రపంచ వ్యాప్తంగా హిందువులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఉత్తర భారతంలో ఈ ఆగ్రహం మరింత తీవ్రంగా వ్యక్తం అవుతోంది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్య‌మంత్రి, వైసీపీ అధినేత జగన్ మోహ‌న్‌ రెడ్డికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం తెలుసుకుంటే వైసీపీ నేతలకు నిద్రపట్టదనడంలో అతిశయోక్తి లేదు. జగన్ రెడ్డి.. తిరుమలను ఉపయోగించుకున్న తీరు.. అవినీతి, అక్రమాలకు వాడుకున్న వైనం ఒక్కొక్క‌టిగా వెలుగులోకి వ‌స్తుండ‌టంతో హిందువుల్లో ఆగ్ర‌హం క‌ట్ట‌లు తెంచుకుంటున్నది. శుక్ర‌వారం(సెప్టెంబర్ 20) సాయంత్రం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్రెస్‌మీట్ పెట్టి ఇదంతా కేవ‌లం చంద్ర‌బాబు నాయుడు రాజ‌కీయ‌మ‌ని, తిరుమ‌ల వేంక‌టేశ్వ‌ర స్వామినికూడా చంద్ర‌బాబు రాజ‌కీయాల‌కోసం వాడుకుంటున్నారని విమ‌ర్శ‌లు చేశారు.  అయితే జ‌గ‌న్ గ‌తాన్ని గుర్తుచేసుకుంటే రాజ‌కీయాల‌ కోసం మ‌తాన్ని వాడుకున్న‌ది ఎవ‌ర‌న్న‌ది తెలుస్తుందంటూ నెటిజ‌న్లు కౌంట‌ర్ ఇస్తున్నారు.  తిరుమ‌ల‌ను, హిందూ మ‌తాన్ని రాజ‌కీయంగా వాడుకున్న‌ది జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అనేది జ‌గ‌మెరిగిన స‌త్యం. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి క్రిస్టియ‌న్ మ‌త విశ్వాసాల‌ను బ‌లంగా న‌మ్మే వ్య‌క్తి. ఆయ‌న హిందూ దేవాల‌యాల‌కు వెళ్ల‌డం చాలా అరుదు.   2009లో ఒక‌సారి జ‌గ‌న్ తిరుమ‌ల వెళ్లారు. 2019 ఎన్నిక‌ల‌కు ముందు క్రిస్టియానిటి నుంచి హిందువుగా మ‌త మార్పిడి చేసుకున్న‌ట్లుగా త్రివేణి సంగ‌మంలో శార‌దాపీఠం స్వ‌రూపానంద స‌ర‌స్వ‌తి  జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని మూడు సార్లు నీటిలో ముంచారు. ఇందంతా 2019 ఎన్నిక‌ల ముందు జ‌రిగిన తంతు.. ఈ వ్య‌వ‌హారం అంతా రాజ‌కీయ అవ‌స‌రాల‌ కోసం జ‌రిగింద‌నేది అంద‌రికి తెలిసిన బ‌హిరంగ ర‌హ‌స్య‌మే. హిందువుల ఓట్లకోసం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఇలా ప్ర‌వ‌ర్తించార‌నేది రాజ‌కీయాల‌పై అవ‌గాహ‌న ఉన్న‌వారిని ఎవ‌ర్ని అడిగి చెప్పేస్తారు. వైసీపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ముఖ్య‌మంత్రి హోదాలో జ‌గ‌న్ రెడ్డి హిందువుల విశ్వాసాల‌కు విలువ‌నిచ్చారా అంటే అదీ లేదు. ఎవ‌రైనా దేవుడికి వ‌స్త్రాల‌కు స‌మ‌ర్పించే స‌మ‌యంలో స‌తీస‌మేతంగా వెళ్తారు. ప్ర‌భుత్వం త‌ర‌పున ముఖ్య‌మంత్రి హోదాలో అలా పట్టువస్త్రాలు స‌మ‌ర్పించ‌డం సంప్ర‌దాయం. కానీ,   దేవాల‌యాల‌కు వెళ్లిన స‌మ‌యంలో జ‌గ‌న్ వెంట ఆయ‌న స‌తీమ‌ణి భార‌తి ఎప్పుడూ క‌నిపించ‌లేదు. పైగా.. తాడేప‌ల్లి ప్యాలెస్‌లోనే తిరుప‌తి త‌ర‌హాలో సెట్ వేసి వేంక‌టేశ్వ‌ర స్వామి విగ్ర‌హాన్ని ఏర్పాటు చేశారు. త‌ద్వారా ..  మేము తిరుమ‌ల‌కు రాము.. తిరుమ‌ల వేంక‌టేశ్వ‌ర స్వామినే  మా ప్యాలెస్ కు తీసుకొచ్చామ‌న్న‌ట్లుగా  జ‌గ‌న్ ప్ర‌వ‌ర్తించారు.   భార‌త‌దేశంలో ఎవ‌రి మ‌తాన్ని వారు గౌర‌వించుకుంటారు. అందులో ఎలాంటి త‌ప్పులేదు. కానీ, జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి 2019 ఎన్నిక‌ల‌కు ముందు మ‌త మార్పిడి చేసుకోవ‌టానికి కార‌ణం ఏమిటి? అందులో రాజ‌కీయ అంశాలు ఏమీ లేవ‌ని కొద్దిసేపు అనుకుంటే.. జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన  త‌రువాత ఏ ఒక్క హిందూ ఆల‌యాన్నైనా నిర్మించారా? మ‌ర‌మ్మ‌తులు చేశారా? ఆల‌యాల భూమలు ఆక్ర‌మ‌ణ‌ల‌కు గురి కాకుండా ప‌రిర‌క్షించారా? అంటే  లేదు అన్న సమాధానమే వస్తుంది. జగన్ అధికారంలో ఉన్న సమయంలో ఏపీలో ప‌లు హిందూ ఆలయాలపై దాడులు జ‌రిగాయి. జగన్ హయాంలో  రాష్ట్రంలో దేవుడికే రక్షణ లేని పరిస్థితి ఉంది. జగన్ అధికారంలో ఉండగా అంతర్వేది నరసింహస్వామి రథం దగ్దం, విజయవాడ దుర్గమ్మ గుడిలో వెండి రథానికి ఉండే సింహాలు మాయం, విజయవాడలో సాయిబాబా విగ్రహం ధ్వంసం,  కర్నూల్ జిల్లాలో ఆంజనేయ స్వామి విగ్రహం ధ్వంసం.. వంటి ఎన్నో సంఘటనలు జరిగాయి. ఆ సమయంలో ప్రభుత్వం, పోలీసులు ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. దీంతో అప్పట్లోనే జగన్ సర్కార్ హిందూ దేవాలయాలపై దాడులను ప్రోత్సహిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తాయి. దీనికితోడు హిందువులు పుణ్య‌క్షేత్రంగా భావించే తిరుమ‌ల‌లోనూ జ‌గ‌న్ హ‌యాంలో అనేక అప‌చారాలు చోటు చేసుకున్నాయి. ల‌డ్డూ నాణ్య‌త లేకపోవ‌టంతో అప్ప‌ట్లోనే భ‌క్తులు టీటీడీ తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అప్ప‌ట్లో ల‌డ్డూ నాణ్య‌త‌లేక‌పోవ‌టానికి ల‌డ్డూ త‌యారీకి వినియోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు ఉండ‌ట‌మేన‌ని ఇప్పుడు అర్థ‌మ‌వుతుంది.  జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డికి హిందూ మ‌తంపై ఎలాంటి గౌర‌వం లేదు.. కేవ‌లం రాజ‌కీయాల కోస‌మే దానిని వాడుకుంటున్నార‌న‌డానికి ఎన్నో ఉదాహ‌ర‌ణ‌లు ఉన్నాయి. జ‌గ‌న్ తిరుమ‌ల వెళ్లిన స‌మ‌యంలో అర్చ‌కులు ఆయ‌న‌కు ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. ఆ స‌మ‌యంలో నెత్తిన అక్షింత‌లు వేశారు. జ‌గ‌న్ వెంట‌నే వాటిని త‌ల‌పై నుంచి తొల‌గించేశారు. హిందుత్వంపై గౌర‌వం ఉన్న‌వారు ఎవ‌రైనా అర్చ‌కులు దీవిస్తూ నెత్తిన వేసిన అక్షింత‌ల‌ను తొల‌గించ‌రు. చాలాసేపు త‌ల‌లో అలానే ఉంచుకుంటారు. కానీ, జ‌గ‌న్ ప‌లు సంద‌ర్భాల్లో అర్చ‌కులు దీవిస్తూ త‌న నెత్తిన వేసిన అక్షింత‌ల‌ను వెంట‌నే తొల‌గించిన వీడియోలు  సోష‌ల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అవుతున్నాయి. సీఎం చంద్ర‌బాబు నాయుడు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ హిందువులు. అయినా వారు ముస్లీం, క్రైస్త‌వుల మ‌తాల‌ను గౌర‌వంగా చూస్తారు. జ‌గ‌న్‌లా న‌టించ‌కుండా   ముస్లిం సంప్ర‌దాయాల‌ను,  క్రైస్త‌వులు సంప్ర‌దాయాల‌ను పాటిస్తూ గౌర‌వంగా ఉంటారు. కానీ, జ‌గ‌న్ మాత్రం హిందువుల ఓట్ల కోసం హిందుత్వాన్ని రాజ‌కీయంగా వాడుకున్నారు. పైగా హిందువులపై ప్రేమ ఒల‌క‌బోస్తూనే హిందూ దేవాల‌యాల‌పై దాడులు.. తిరుమ‌ల‌లో ఇష్టారీతిలో వ్య‌వ‌హ‌రిస్తూ హిందువుల మ‌నోభావాల‌ను అధికారాన్ని అడ్డుపెట్టుకొని జ‌గ‌న్ దెబ్బ‌తీశార‌న‌డంలో ఎలాంటి అతిశ‌యోక్తి లేదు.  

మెగా స్టార్ చిరు ఖాతాలో మరో ప్రపంచ రికార్డ్

మెగాస్టార్ చిరంజీ మరో ప్రపంచ రికార్డ్ సాధించారు. ఆయనక గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం దక్కింది.  156 చిత్రాలలో నటించిన చిరంజీవి 537 పాటలకు 24,000 డ్యాన్స్ మూవ్ మెంట్స్ చేశారు. మరే నటుడు ఇన్ని పాటలకు స్టెప్పులేసి దాఖలాలు లేవు. అందుకే చిరంజీవి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం దక్కింది. ఈ అవార్డును అందించడం కోసం గిన్నిస్ బుక్ రికార్డ్స్ ప్రతినిధులు ప్రత్యేకంగా హైదరాబాద్ కి వచ్చారు. బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ చేతుల మీదుగా అవార్డును చిరంజీవికి అందించారు. చిరంజీవి ఈ ఏడాది ఇప్పటికే ప్రతిష్టాత్మక పద్మవిభూషణ్ పొందారు. ఇప్పుడు గిన్నిస్ బుక్ రికార్డ్స్ లో స్థానం సంపాదించి మరో ఘనత సాధించారు. దీంతో మెగా అభిమానులతో పాటు, తెలుగు సినీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకొని, మెగాస్టార్ చిరంజీవి అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్న చిరంజీవి  ప్రస్తుతం వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని చిరంజీవి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అందుకునే వేదికపై ఓ వక్త వెల్లడించారు.  చిరంజీవి 25 రోజులుగా చికెన్ గున్యాతో బాధపడుతున్నారని, అయినప్పటికీ ఈ వేడుకకు హాజరయ్యారని, అది ఆయనకున్న డెడికేషన్ అని ఆయన పేర్కొన్నారు.చిరంజీవి అయితే చికెన్ గున్యా నుంచి  పూర్తిగా కోలుకుంటున్నారని, అభిమానులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరంలేదని ఆయన సన్నిహితవర్గాలు తెలిపాయి.

లడ్డూ కల్తీతో మనస్తాపం... పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష!

పవిత్రమైన తిరుమల క్షేత్రంలో జగన్ ప్రభుత్వ హయాంలో లడ్డూ ప్రసాదం కల్తీ ద్వారా అపవిత్రం అయిన నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మనస్తాపానికి గురయ్యారు. ఆ ఘోర తప్పిదానికి ప్రాయశ్చిత్తంగా ఆయన 11 రోజులపాటు ‘ప్రాయశ్చిత్త దీక్ష’ చేయాలని సంకల్పించుకున్నారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటనను విడుదల చేశారు.  ఆ ప్రకటన పూర్తి పాఠం ఇలా వుంది.... ఏడుకొండలవాడా..! క్షమించు... 11 రోజులపాటు ప్రాయశ్చిత్త దీక్ష. అమృతతుల్యంగా... పరమ పవిత్రంగా భావించే తిరుమల లడ్డు ప్రసాదం- గత పాలకుల వికృత పోకడల ఫలితంగా అపవిత్రమైంది. జంతు అవశేషాలతో మాలిన్యమైంది. విశృంఖల మనస్కులే ఇటువంటి పాపానికి ఒడిగట్టగలరు. ఈ పాపాన్ని ఆదిలోనే పసిగట్టలేకపోవడం హైందవ జాతికే కళంకం. లడ్డు ప్రసాదంలో జంతు అవశేషాలు ఉన్నాయని తెలిసిన క్షణం నా మనసు వికలమైంది. అపరాధ భావానికి గురైంది. ప్రజా క్షేమాన్ని కాంక్షించి పోరాటంలో ఉన్న నాకు ఇటువంటి క్లేశం ఆదిలోనే నా దృష్టికి రాకపోవడం బాధించింది. కలియుగ దైవమైన బాలాజీకి జరిగిన ఈ ఘోర అపచారానికి సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ ప్రాయశ్చిత్తం చేసుకోవలసిందే. అందులో భాగంగా నేను ప్రాయశ్చిత్త దీక్ష చేయాలని సంకల్పించాను. 22 సెప్టెంబర్ 2024 ఆదివారం ఉదయం గుంటూరు జిల్లా నంబూరులోని శ్రీ దశావతార వేంకటేశ్వర స్వామి ఆలయంలో దీక్ష చేపడతాను. దైనందిన విధుల్లో పాల్గొంటూనే దీక్ష కొనసాగిస్తాను. 11 రోజులపాటు దీక్ష కొనసాగించి అనంతరం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటాను. 'దేవదేవా... నీ పట్ల గత పాలకులు చేసిన పాపాలను ప్రక్షాళన చేసే శక్తిని ఇవ్వమ'ని వేడుకుంటాను. భగవంతుడిపై విశ్వాసం, పాప భీతి లేనివారే ఇటువంటి అకృత్యాలకు ఒడిగడతారు. నా బాధేమిటంటే- తిరుమల తిరుపతి దేవస్థానం అనే వ్యవస్థలో భాగమైన బోర్డు సభ్యులు, ఉద్యోగులు సైతం అక్కడి తప్పిదాలను కనిపెట్టలేకపోవడం, కనిపెట్టినా నోరు మెదపకపోవడం. నాటి రాక్షస పాలకులకు భయపడి మిన్నకుండిపోయారా అనిపిస్తోంది. వైకుంఠ ధామంగా భావించే తిరుమల పవిత్రతకు, వేదాచారాలకు, ధార్మిక విధులకు కళంకం తెచ్చే విధంగా పెడపోకడలకు పాల్పడిన గత పాలకుల తీరు హిందూ ధర్మాన్ని పాటించే ప్రతి ఒక్కరినీ బాధించింది. ఇక లడ్డు ప్రసాదం తయారీలో జంతు అవశేషాలు ఉన్న నెయ్యిని వినియోగించారనే విషయం తీవ్ర క్షోభకు గురి చేసింది. ధర్మాన్ని పునరుద్ధరించుకొనే దిశగా అడుగులు వేసే తరుణం ఆసన్నమైంది. ధర్మో రక్షతి రక్షితః -పవన్ కళ్యాణ్  

 బతుకమ్మ పండగతో  కవిత రీ ఎంట్రీ

  ఢిల్లీ లిక్కర్ స్కాంలో చిక్కుక్కున్న బిఆర్ఎస్ ఎంఎల్సి  కవిత దాదాపు ఐదున్నరనెలలు తీహార్ జైల్లో  ఉన్నారు.  కవితకు బెయిల్ లభించిన తర్వాతే ఆమె  రాజకీయాలపై ఫోకస్ పెట్టారు. బతుకమ్మ బ్రాండ్ అంబాసిడర్ గా పేరు గడించిన కవిత వచ్చే అక్టోబర్ మొదటి వారంలోనే రాజకీయాల్లో రీ ఎంట్రీ అని ప్రచారం జరుగుతుంది. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు కవిత అటు పార్టీలో ఇటు ప్రభుత్వంలో హల్ చల్ చేశారు. కవిత ఏం చెబితే అది జరిగేది. అవినీతి, అహంకారం  తదితర కారణాలతో ఓటమి చెందిన బిఆర్ఎస్ దేశ రాజకీయాల్లో అధోపాతాళానికి పడిపోయింది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలన్న ఉద్దేశ్యంతో టిఆర్ఎస్ కాస్తా బిఆర్ఎస్ గా మారిపోయింది. ఇక్కడే  బిఆర్ ఎస్ అధ్యక్షుడు కెసీఆర్ తప్పులో కాలేశారు. పార్టీ అస్తిత్వమే ప్రమాదంలో పడేట్లు చేశారు. కూతురు, కొడుకు మధ్య ముఖ్యమంత్రి సీటు కోసం జరిగిన కొట్లాట వల్లే పార్టీ పేరు మార్చాల్సి వచ్చిందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ ను నిలువరించడానికి అన్నా చెల్లెళ్లు తాత్కాలికంగా విభేధాలను పక్కనపెట్టినట్లు తెలుస్తోంది.  కవిత జైల్లో ఉన్నప్పుడు పలుమార్లు కెటీఆర్ జైలులో ములాఖత్ కార్యక్రమంలో కలిశారు. బెయిల్ పై వెలుపలికి వచ్చే సమయంలో బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆమెకు స్వాగతం పలికేటట్లు కెటీఆర్ జాగ్రత్త పడ్డారు. ఒక రోజు ముందే  ఆయన ఎమ్మెల్యేలను ఢిల్లీ తీసుకెళ్లిన సంగతి తెలిసిందే.  బతుకమ్మ పండగను దేశ విదేశాల్లో చాటి చెప్పిన కవిత మళ్లీ తన పూర్వ వైభవం కోసం తండ్లాడుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బిఆర్ ఎస్ రాజకీయ మైలేజి కోసం కవిత ప్రయత్నిస్తుంది. రాజకీయ ప్రయోజనాల కోసమే తనను లిక్కర్ స్కాంలో ఇరికించారని కవిత ప్రచారం చేయనుంది.  నిజామాబాద్ కు చెందిన పార్టీ ముఖ్య నేతలతో కవిత సమావేశమై రీ ఎంట్రీకి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.