రఘురామ  టార్చర్ కేసులో విజయపాల్ కు బెయిల్ నిరాకరణ 

ఉండి ఎమ్మెల్యే రఘురామ    కస్టోడియల్   టార్చర్ కేసులో ముందస్తు బెయిల్ కు దరఖాస్తు చేసుకున్న మాజీ అదనపు ఎస్పి విజయపాల్ కు చుక్కెదురైంది. బెయిల్ ఇవ్వడానికి న్యాయస్థానం తిరస్కరించింది.  కస్టోడియల్ టార్చర్ కేసులో  ఎవన్ గా ఉన్న ఐపిఎస్ అధికారి పిఎస్సార్ ఆంజనేయులు జెత్వాని కేసులో సస్పెండ్ అయ్యారు. ఎ 3గా మాజీ సిఎం జగన్  ఉన్నారు. సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉండటంతో న్యాయస్థానం బెయిల్ కు నిరాకరించింది ఎమ్మెల్యే రఘురామ ఇచ్చిన ఫిర్యాదుమేరకు నగరపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. కస్టోడియల్ టార్చర్ లో రఘురామ తీవ్రగాయాలకు గురైనట్టు సుప్రీం కోర్టు అభిప్రాయన్ని హైకోర్టు పరిగణలోకి తీసుకుంది. మధ్యంతర ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. తదుపరి విచారణను ఈ నెల 20 కి హైకోర్టు వాయిదావేసింది. 

ధాన్యం మొత్తం కొంటాం.. ఉత్తమ్!

రాష్ట్రంలో పండిన ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ  పౌర సరఫరాల శాఖామంత్రి  ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఇందు కోసం తెలంగాణ వ్యాప్తంగా  7,139 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.   మంగళవారం ఉదయం మఱ్ఱి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ లో 2023-24 ఖరీఫ్ పంట కొనుగోలుపై రాష్ట్రంలోనీ జాయింట్ కలెక్టర్ లు,జిల్లా పౌర సరఫరాల అధికారులు, జిల్లా స్థాయి పౌర సరఫరాల శాఖా మేనేజర్లతో  సమీక్షా సమావేశం నిర్వహించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి డిఫాల్ట్ మిల్లర్లకు ధాన్యం అప్పగించే ప్రసక్తే లేదని చెప్పారు.  

కాళేశ్వరం నిర్మాణ సంస్థకు నో క్లియరెన్స్ సర్టిఫికేట్ 

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సంస్థకు ఇచ్చే క్లియరెన్స్ సర్టిఫికేట్ ను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి అక్రమాలపై న్యాయ విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. రేవంత్ సర్కారు వేసిన ఈ కమిషన్  రద్దు చేయాలని ఇప్పటికే బిఆర్ఎస్ న్యాయస్థాన్ని ఆశ్రయించింది. రద్దు చేయడం కుదరదని న్యాయస్థానం ఇచ్చిన తీర్పు నేపథ్యంలో విజెలెన్స్ శాఖ నివేదిక తయారు చేసింది. ఈ నివేదిక విచారణ చేపడుతున్న కమిషన్ కు చేరకముందే నిర్మాణ సంస్థకు ఇచ్చిన  క్లియరెన్స్  సర్టిఫికేట్ ను ప్రభుత్వం రద్దు చేసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజిలు కుంగిపోవడంతో తిరిగి అదే సంస్థ మరమ్మత్తులు చేసిన తర్వాతే క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇవ్వాలని నిర్ణయించింది.  ఈ ప్రాజెక్టులో పని చేసిన ఇంజినీర్లకు ప్రభుత్వం నిలుపుదల చేసింది. డ్యామ్ సేప్టీ అధికారులు జాగ్రత్త చర్యలు తీసుకోలేదని ప్రభుత్వం భావిస్తుంది. బహిరంగ విచారణకు ఈ బ్యారేజికి చెందిన ఆరుగురు ఇంజినీర్లు విచారణ కమిషన్ ముందు హాజరుకానున్నారు. బుధవారం నుంచి ఈ నెల 25 వరకు కమిషన్ విచారణ జరగనుంది.  ఇప్పటికే 15 మంది ఇంజినీర్లను కమిషన్ విచారించింది. ప్రభుత్వానికి విచారణ కమిషన్ ఇచ్చిన నివేదిక తర్వాత బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. 

3న తిరుమలలో పవన్ ‘వారాహి సభ’!

తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ అయిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్..  11 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష  చేపట్టిన విషయం విదితమే. స్వామి వారి పవిత్ర ప్రసాదం లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించి అపవిత్రం చేసిన విషయం వెలుగులోకి  ప్రాయశ్చిత దీక్ష చేపట్టిన ఆయన తన దీక్షను తిరుమలలో విరమించనున్నారు.  అందు కోసం అక్టోబర్ 1వ తేదీన తిరుపతికి చేరుకొని అలిపిరి మెట్ల మార్గం ద్వారా నడుచుకొంటూ తిరుమల చేరుకుంటారు. 2వ తేదీ ఉదయం స్వామివారిని దర్శించుకున్న అనంతరం దీక్షను విరమిస్తారు.  3న తిరుపతిలో వారాహి సభను నిర్వహించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. 

కర్నూలులో హైకోర్ట్ బెంచ్.. సీఎం గ్రీన్ సిగ్నల్!

కర్నూలులో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. న్యాయ శాఖపై నిర్వహించిన సమీక్షలో కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు ప్రదిపాదనను కేంద్రానికి పంపుతామన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేర‌కు కర్నూలులో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. మంత్రివ‌ర్గ స‌మావేశంలో ఈ మేరకు తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామన్నారు.   రాజ‌ధాని అమరావతిలో   బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ ద్వారా వంద ఎకరాల్లో ఇంటర్నేషన్ లా స్కూల్ ఏర్పాటును ముందుకు తీసుకువెడతామని స్పష్టం చేశారు.

ఆంధ్రాతో పోలిక ఎందుకు హరీషూ!

బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు ఇంకా రాజకీయాల్లోనే వున్నారు. ఆ విషయాన్ని ప్రూవ్ చేసుకోవడానికే అన్నట్టుగా ఆయన చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చారు. తన ఉనికిని నిరూపించుకోవడానికే తప్ప విషయం ఏమీ లేదన్నట్టుగా ఏవో నాలుగు కామెంట్లు చేసి మీడియా సమావేశాన్ని ముగించారు. ఈ సందర్భంగా ఆయన ‘‘రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం శాశ్వతం కాదు. అధికారులు రెచ్చిపోవద్దు’’ అని  ఆయన అధికారులకు వార్నింగ్ ఇచ్చారు. ఆయన తన స్టేట్‌మెంట్‌ని అక్కడతో ఆపితే బాగుండేది. దాన్ని ఇంకొంచెం సాగదీస్తూ, ‘‘ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వంలో అధికారులు రెచ్చిపోయారు. ప్రస్తుతం సస్పెండ్ అవుతున్నారు. అధికారంలో వున్నామని రెచ్చిపోతే అక్కడి అధికారులకు పట్టిన గతే మీకూ పడుతుంది’’ అన్నారు.  అయినా, తెలంగాణ సాధించుకున్న తర్వాత పక్క రాష్ట్రంతో పోలికలు పెట్టాల్సిన అవసరం హరీష్ రావుకు ఎందుకో అర్థం కావడం లేదు. అలా పోల్చదల్చుకుంటే పక్క రాష్ట్రంతో ఎందుకు... తమ పార్టీ పదేళ్ళ పాలనతో పోల్చి చెప్పొచ్చు కదా. టీఆర్ఎస్ అండ్ బీఆర్ఎస్ పదేళ్ళ పాలనలో నాయకులు, వాళ్ళకి అనుకూలంగా అధికారులు ఈ ప్రభుత్వం శాశ్వతంగా వుంటుందనుకుని రెచ్చిపోయారు. చివరికి ఏమైంది? ప్రజలు బాగా బుద్ధిచెప్పారు. తమను తామే ఉదాహరణగా చెప్పుకుంటే సరిపోయేదానికి హరీష్ రావు పక్క రాష్ట్రంలో  విషయాలను ప్రస్తావించడం ఎందుకో! అయినా ఆంధ్రప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు జగన్ పాలన అదిరిపోయేలా సాగిందని, మరోసారి జగన్ అధికారంలోకి వస్తారని తన దగ్గర సమాచారం వుందని కేసీఆర్ ఆమధ్య కనపడినవాళ్ళందరికీ చెప్పారు. మరి ఇప్పుడు హరీష్ రావేమో వైసీపీ పాలనలో అధికారం శాశ్వతంగా వుంటుందనుకుని అధికారులు రెచ్చిపోయారు అంటున్నారు. హరీష్ రావు ఇలా జగన్ ప్రభుత్వాన్ని తెగిడితే మామయ్య కేసీఆర్ హర్టవుతారు కదా! ఈ చిన్న లాజిక్‌ని హరీష్ రావు ఎలా మిస్సయ్యారో!

పెద్దిరెడ్డి, ఆర్కే రోజా దర్శనం టిక్కెట్ల స్కామ్!

జగన్ పరిపాలన జరిగిన ఐదేళ్ళ కాలంలో శ్రీవారి దర్శనం టికెట్లు గోల్ మాల్ చేసి మాజీమంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్కే రోజా కోట్ల రూపాయలు దండుకొన్నారని తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపించారు. ఐదేళ్ల పాలనలో వైసీపీ వాళ్లు శ్రీవారి సొమ్మును దోచుకున్నారని ఆయన విమర్శించారు. దైవసేవ సేవచేయాల్సిన మాజీ ఈవో ధర్మారెడ్డి జగన్ పార్టీ నాయకుల సేవలో తరించారని వర్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. "పర్యాటకశాఖకు ప్రతిరోజూ 1000 దర్శనం టికెట్లు ఇస్తారు. వాటిలో 800 టికెట్లు మాజీమంత్రి పెద్దిరెడ్డి ఆశీస్సులతో నిర్వహించే 'కళాధర్ ట్రావెల్స్'కి ఇచ్చేవారు. హైదరాబాద్, బెంగళూరు, కడప, కర్నూలు, గంగావతి ప్రాంతాల నుంచి వచ్చే వారికి ఈ టికెట్లు అమ్మేవారు. ఒక్క కళాధర్ ట్రావెల్స్.కి మాత్రమే  అన్ని టికెట్లు ఇవ్వడంలో రహస్యం, అంతర్యం ఏమిటి?" అని వర్ల రామయ్య ప్రశ్నిస్తున్నారు. ఈ 800 టికెట్లను రద్దీని బట్టి ఐదు వేల రూపాయల నుంచి పదివేల రూపాయల వరకూ అమ్మేవారని వర్ల ఆరోపించారు.  ఒక్క కళాధర్ ట్రావెల్స్ వారికే అన్ని టికెట్లు ఇవ్వడం ఏమిటి? అని వర్ల ప్రశ్నిస్తున్నారు. మరోవైపు పర్యాటక శాఖ మంత్రి రోజా విషయానికి వస్తే.. నిజానికి ఆమె మంత్రి అయిన తర్వాత శ్రీవారి దర్శనాల్లో అందినంత డబ్బు దండుకోవడం మాత్రమే కాదు. ఎమ్మెల్యేగా వున్నప్పుడు కూడా నెలనెలా లక్షలాది రూపాయలు అక్రమ మార్గాల్లో దండుకునే వారనే ఆరోపణలు ఉన్నాయి. ఎమ్మెల్యేలకు నెలకు ఒకసారి  ప్రోటోకాల్ దర్శనం ఉంటుంది. ఎమ్మెల్యేలు ఇచ్చే సిఫారసు లేఖలకు అదనంగా, ఆ ఒక్క సందర్భంలో ఎమ్మెల్యే వెంట వచ్చే భక్తులను భారీ సంఖ్యలో అనుమతించేవారు. ప్రోటోకాల్ దర్శనం టిక్కెట్ ధర బ్లాక్ మార్కెట్‌లో ఒక్కొక్కటి 20 వేల వరకు కూడా పలుకుతూ వుంటుంది. ఈ టికెట్లను తాను ఏర్పాటు చేసుకున్న దళారీ ఉద్యోగుల ద్వారా రోజా విక్రయించి దండుకునేవారని ఆరోపణలున్నాయి. అలాగే బుక్ మై దర్శన్ పోర్టల్ ద్వారా కూడా టిక్కెట్ల బుక్కింగ్ విషయంలో అక్రమాలకు పాల్పడ్డారని వర్ల రామయ్య ఆరోపిస్తున్నారు.

ముంబై నటి జెత్వానీ కేసు.. కుక్కల రిమాండ్ రిపోర్టులో సస్పెండైన ఐపీఎస్ అధికారుల పేర్లు

ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసు దర్యాప్తులో సోమవారం (సెప్టెంబర్ 23) కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అరెస్టైన వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్  రిమాండ్ రిపోర్ట్‌లో  ముగ్గురు ఐపీఎస్ అధికారుల పేర్లను పోలీసులు చేర్చారు. ఇదే కేసుకు సంబంధించి ఈ ముగ్గురినీ అంటే ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు, విజయవాడ మాజీ కమిషనర్ కాంతి రాణా తాతా, మరో ఐపీఎస్ అధికారి విశాల్ గున్నీ పేర్లను కుక్కల విద్యాసాగర్ రిమాండ్ రిపోర్టులో చేర్చారు.  ఈ ముగ్గురినీ కూడా నిందితులుగా ఆ రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. కాగా కుక్కల విద్యాసాగర్ కు కోర్టు అక్టోబర్ 4 వరకూ రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే.  ఈ కేసు వెలుగులోకి రాగానే అజ్ణాతంలోకి వెళ్లిపోయిన కుక్కల విద్యాసాగర్ ను పోలీసులు రెండు రోజుల కిందట డెహ్రాడూన్ లో అరెస్టు  చేసి విజయవాడకు తరలించిన సంగతి తెలిసిందే. కుక్కల విద్యాసాగర్ ను పపోలీసులు ఈ తెల్లవారు జామున న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు. న్యాయమూర్తి కుక్కల విద్యాసాగర్ కు 14 రోజుల రిమాండ్ విధించారు.   కుక్కల విద్యాసాగర్ ఫిర్యాదు మేరకు పోలీసు అధికారులు విమానంలో ముంబై వెళ్లి మరీ కాదంబరి జత్వానీని విజయవాడకు తీసుకువచ్చారు. అయితే ఆయన ఫిర్యాదుకు ఒక రోజు ముందే పోలీసు అధికారులు ముంబైకి విమానం టికెట్ బుక్ చేసుకోవడంతో  ఉద్దేశ పూర్వకంగానే జత్వానీని అరెస్టు చేసి వేధించారని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఆమెపై తప్పుడు కేసు పెట్టి ఇబ్బందులకు గురి చేశారని తేల్చుకున్నారు. వైసీపీ సర్కార్ పతనమై ఏపీలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత నటి కాదంబరి జత్వానీ  ఇబ్రహీం పట్నం పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు విచారణ జరిపిన పోలీసులు కుక్కల విద్యాసాగర్ ను నిందితుడిగా గుర్తించారు. వైసీపీ హయాంలో ప్రభుత్వ పెద్దలు, పార్టీ అగ్రనేతల ప్రోద్బలంతోనే ఐపీఎస్ అధికారులు పీఎస్సార్ ఆంజనేయులు, కాంతి రాణా తాతా, విశాల్ గున్నీ అడ్డగోలుగా వ్యవహరించి జత్వానీని అక్రమంగా అరెస్టు చేసి విజయవాడకు తీసుకువచ్చి వేధించారని గుర్తించారు. ఇప్పటికే విశాల్ గున్ని తన మూడు పేజీల వాంగ్మూలంలో దాదాపుగా తనపై ఎవరెవరు ఒత్తిడి చేసిందీ పూసగుచ్చినట్లు వివరించారు.  

పేదల జోలికి వెళ్లని హైడ్రా

హైడ్రా బీద బిక్కి ప్రజానీకం మీద కరుణించినట్లు తెలుస్తోంది. ఆదివారం నుంచి చేపట్టిన హైడ్రా కూల్చివేతల్లో పేద ప్రజల జోడికి హైడ్రా వెళ్లడం లేదు. చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ స్థలాల పరిరక్షణ కోసం ఏర్పాటైన హైడ్రా కమిషనర్ రంగనాథ్ దూకుడుగా వెళుతున్నారు. ఎఫ్ టి ఎల్, బఫర్ జోన్ లో నిర్మించే అక్రమ కట్టడాలను కూల్చేస్తున్నప్పటికీ గత రెండు రోజుల నుంచి పేదల ఇళ్లను ముట్టుకోవడం లేదు. కమర్షియల్ కాంప్లెక్స్ లు, విల్లాలను హైడ్రా కూల్చేస్తుంది. మధ్య తరగతి ప్రజలను కూడా హైడ్రా ముట్టుకోవడం లేదు. కూల్చివేతలకు చట్టబద్దత లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో హైడ్రా దిద్దుబాటు చర్యలు చేపడుతుంది. తాజాగా కూకట్ పల్లి నల్ల చెరువు బఫర్ జోన్ పరిధిలోని భూములలో నిర్మించిన కట్టడాలు కూల్చివేసినప్పటికీ పేద ప్రజల జోలికి వెళ్లకపోవడం గమనార్హం. నల్ల చెరువు 27 ఎకరాల్లో ఉంటే ఇందులో ఏడు ఎకరాలు ఆక్రమణకు గురైనట్లు హైడ్రా తేల్చేసింది.  అమీన్ పూర్ లో హైడ్రా అర్ధరాత్రి కూడా కూల్చివేతలు కొనసాగించింది. బాహుబలి మిషన్ ద్వారా పెద్ద భవంతులను హైడ్రా కూల్చివేసింది. మాదాపూర్ లో కూడా సోమవారం కూల్చివేసింది.  దుర్గం చెరువు  ఎఫ్ టి ఎల్ , బఫర్ జోన్ కూల్చివేతలను న్యాయస్థానం జోక్యంతో నిలుపదల చేసింది.  తొలిసారి హైడ్రా జీహెచ్ ఎంసీ వెలుపల కూడా అక్రమ కట్టడాలను కూల్చేయాలని నిర్ణయించింది. రంగారెడ్డి ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని పెద్ద చెరువు, మాసాబ్ చెరువులో అక్రమ కట్టడాలను కూల్చేయానికి హైడ్రా సిద్దమైంది. 

లడ్డూ ప్రసాదం... వైసీపీ వింత ప్రకటనలు!

పరమ పవిత్రమైన తిరుమల స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేసి అడ్డంగా దొరికిపోయిన వైసీపీ చేసిన తప్పు నుంచి తప్పించుకోవడానికి సర్వప్రయత్నాలు చేస్తోంది. అధికారం వెలగబెట్టిన కాలంలో జగన్ ప్రభుత్వం చేసిన ఈ దౌర్భాగ్యపు పనిని యావత్ దేశం అసహ్యించుకుంటోంది. లడ్డూని తయారు చేయడానికి ఉపయోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు వాడటం వల్ల హిందువుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ విషయంలో కేవలం హిందువులు మాత్రమే జగన్ మీద ఆగ్రహం వ్యక్తం చేయడం లేదు. ఇతర మతాల వారు కూడా ఈ ఘోరాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఏ మత విశ్వాసాన్నీ ఇంత దారుణంగా దెబ్బతీయకూడదని అంటున్నారు. జాతీయ మీడియా అయితే జగన్‌ని ఫుట్‌బాల్ ఆడుకుంటోంది. ఒక్క లడ్డూ విషయంలో మాత్రమే కాకుండా అధికారాన్ని వెలగబెట్టిన సమయంలో జగన్ ప్రభుత్వం చేసిన అన్యాయాలు, అక్రమాల చిట్టాని బయటకి తీసి కథనాలుగా అందిస్తోంది.  స్వామివారి లడ్డూని అపవిత్రం చేసిన పాపం జగన్ రాజకీయ కెరీర్‌నే సమాధి చేసే శాపంలా మారింది. ఇంత జరిగినా వైసీపీ నాయకులు తప్పుని ఒప్పుకోకుండా తప్పించుకునే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నారు. కానీ, ఆ ప్రయత్నాల సందర్భంగా వాళ్ళు చేస్తున్న తప్పులు జనానికి మరింత ఆగ్రహం తెప్పిస్తున్నాయి. తిరుమల శ్రీవారి ప్రసాదం విషయంలో జరిగిన అపచారానికి మనోవేదన చెందిన ఏపీ డిప్యూటీ సీఎం ప్రాయశ్చిత్త దీక్షను చేపట్టారు. ఈ దీక్ష మీద కూడా వైసీపీ నాయకులు అవాకులు చవాకులు పేలుతున్నారు. పవ‌న్‌ టార్గెట్ చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. అందులో ప్రధానంగా పేర్కొంటున్న కామెంట్ ఏమిటంటే, పవన్ కళ్యాణ్ ఒకసారి తన తండ్రి కొణిదెల వెంకట్రావు గురించి చెబుతూ, తన తండ్రి దీపారాధనతో సిగరెట్ వెలిగించుకునేవారని చెప్పారు. అలాంటి తండ్రికి పుట్టిన కొడుకు పవన్ కళ్యాణ్ ఇప్పుడు హిందూ మతానికి అన్యాయం జరుగుతోందని బాధపడుతున్నారు అని కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి కామెంట్లు పెట్టడం ద్వారా వైసీసీపీ నాయకులు తమ లేకితనాన్ని మరోసారి బయటపెట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ తండ్రి ఏదో చేస్తే, ఆయన కొడుకు హిందూ మత విశ్వాసాల గురించి మాట్లాడ్డమేంటని అనడం అజ్ఞానానికి అతిపెద్ద ఆనవాలు. తండ్రి అలా అయినంతమాత్రాన కొడుకు కూడా అలాంటి వాడేనా? ఆ లెక్కకొస్తే, జగన్ తాత వైఎస్ రాజీరెడ్డి బ్రిటీష్ వాళ్ళకి పంది మాంసం సరఫరా చేసేవాడు. అలాంటి తాతకు మనవడు కాబట్టి జగన్ పందికొవ్వు కలసిన నెయ్యితో స్వామివారి లడ్డూలు చేయించారని అనుకోవచ్చు కదా. ఒక కామెంట్ చేసేముందు ముందూ వెనుకా ఆలోచించే అలవాటు ఈ వైసీపీ వాళ్ళకి జీవితంలో రాదు! ఈ మేటర్ ఇంకా వుంది. పవన్ కళ్యాణ్ తండ్రి వెంకట్రావు దీపారాధన దీపంతో సిగరెట్ వెలిగించుకున్న మాట వాస్తవమే. ఈ విషయాన్ని ఒకసారి పవన్ కళ్యాణే స్వయంగా చెప్పారు. అయితే, ఆ తర్వాత ఏం జరిగిందో కూడా పవన్ కళ్యాణ్ చెప్పారు. అలా దీపారాధనతో సిగరెట్ వెలిగించుకున్న నాస్తికుడైన తన తండ్రి ఆ తర్వాత రామభక్తుడిగా మారిపోయారని, నిరంతరం రామనామాన్ని జపిస్తూ వుండేవారని, తాను అజ్ఞానంతో చేసిన తప్పుని జీవితాంతం గుర్తు చేసుకుని బాధపడుతూ వుండేవారని చెప్పారు. ఈ వైసీపీ మూకలు ఇదంతా వదిలేసి ‘పవన్ కళ్యాణ్ తండ్రి దీపారాధన దీపంతో సిగరెట్ వెలిగించుకున్నాడు’ అంటూ ప్రచారం చేయడంలో బిజీగా వున్నాయి. ఇక వైసీపీలో వున్న మరో కళాకారుడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి చేసిన ఒక గొప్ప కామెంట్ గురించి కూడా మనం చెప్పుకుని తరించాలి. నెయ్యిలో పంది కొవ్వు కలవటం గురించి ఆయన చేసిన కామెంట్లు వింటే, ఆయన బుర్రని ఏ మ్యూజియంలో పెట్టాలా అనే ఆలోచన ఎవరికైనా వచ్చితీరుతుంది. ఆయన చెబుతున్నదాని ప్రకారం... ‘‘ఆవు నెయ్యి రేటు రాగి లాంటిది. అదే పంది కొవ్వు ధర బంగారం లాంటిది. అలాంటప్పడు రాగిలాంటి ఆవు నెయ్యిలో బంగారం లాంటి పంది కొవ్వు ఎందుకు కలుపుతారు?’’ ఇదీ ఆయన వెర్షన్. ఆవు నెయ్యికంటే పంది కొవ్వే విలువైనది అని చెబుతూ తాము చేసిన తప్పును అడ్డదిడ్డంగా సమర్థించుకుంటున్న పొన్నవోలు సుధాకర్‌రెడ్డి ఆ వైఎస్ జగన్‌కి అసలు సిసలు ఫాలోవర్. ఈ మేటర్‌కి ముక్తాయింపు ఏమిటంటే, జగన్మోహన్ రెడ్డి వేడి వేడి కల్తీ నెయ్యిలో పడ్డారు. ఇక అందులో మునిగిపోవడం తప్ప చేయగలిగిందేమీ లేదు.

జగన్ నెత్తిన లడ్డూ బాంబు!?

తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడకం ఇప్పుడు దేశ వ్యాప్తంగా ప్రధాన అంశంగా చర్చల్లో నిలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులంతా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రాంతీయ మీడియా, సోషల్ మీడియా, ఆఖరికి జాతీయ మీడియా కూడా లడ్డూ వ్యవహారంపైనే ఫోకస్ చేసింది.  లడ్డూ వివాదంపై జగన్ మీడియా ముందుకు వచ్చి రాజకీయ విమర్శలు గుప్పించినా కూడా లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారం  జగన్ పాలనలోనే జరిగిందని జనం నమ్ముతున్నారు. జగన్ కౌంటర్ అటాక్ ను పట్టించుకున్న వారే లేరు. చివరాఖరికి వైసీపీ శ్రేణులు కూడా జగన్ రాజకీయ విమర్శలను నమ్మడం లేదు. వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డిలకు హిందూ మత విశ్వాసాల పట్ల నమ్మకం లేదనీ, అందుకే కల్తీ నెయ్యి సరఫరా జరుగుతున్నా పట్టించుకోలేదనే విశ్వసిస్తున్నారు. దీంతో లడ్డూ వివాదం నుంచి ఎలా బయటపడాలో, అసలీ వివాదంపై ఎలా స్పందించాలో కూడా తెలియక వైసీపీ నేతలు, శ్రేణులు చేష్టలుడిగాపోయాయి. రాజకీయంగానే కాదు, నైతికంగా కూడా వైసీపీ ప్రతిష్ట అధ: పాతాళానికి పడిపోయిందనడంలో సందేహం లేదు.  మామూలుగా ఓటు బ్యాంకు రాజకీయాలపై లడ్డూ ప్రసాదంలో కల్తీ వ్యవహారం జగన్ కు, ఆయన పార్టీకీ తీరని నష్టం చేసిందని అంతా భావిస్తున్నారు కానీ, లడ్డూ ప్రసాదంలో కల్తీ ఎఫెక్ట్ అంత కంటే లోతుగానే ఉంటుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జగన్ మీడియా ముందుకు వచ్చి లడ్డూ ప్రసాదం కల్తీ విషయంలో చేసిన రాజకీయ విమర్శలు పూర్తిగా నిరుపయోగం అవ్వడమే కాకుండా.. కచ్చితంగా జగన్ హయాంలోనే ఈ కల్తీ జరిగిందన్నది ప్రజలకు నిర్ధారణ చేశాయి. ఇది వైసీపీకి రాజకీయంగా తీరని నష్టం కలిగించిందనడంలో సందేహం లేదు. కేవలం నష్టమే కాకుండా ఆ పార్టీకి రాజకీయ ఉనికిని కూడా ప్రశ్నార్థకం చేసే రేంజ్ లో లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారం ప్రజలలో ఆగ్రహావేశాలను నింపింది.  లడ్డూ ప్రసాదంలో వినియోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు అవశేషాలు ఉన్నాయన్న సంగతి వెలుగు చూడగానే వైసీపీలో మేధావులుగా పరిగణింపబడుతున్న వారు దీని వల్ల పార్టీకి జరిగే నష్టం ఏ స్థాయిలో ఉంటుందన్న అంచనాలు వేయడం ప్రారంభించారు. జగన్  మీడియా సమావేశం కారణంగా మరింత డ్యామేజి జరిగింది తప్ప పార్టీకి ఎటువంటి ప్రయోజనం చేకూరలేదని వారు నిర్ధారణకు వచ్చారు. కల్తీ జరిగి ఉంటే జరిగి ఉండొచ్చు కానీ దానిని బయటపెట్టి తిరుమల దేవుని ప్రతిష్ఠకు భంగం కలిగిస్తారా అంటూ జగన్ మీడియా సమావేశంలో చంద్రబాబుపై విమర్శలు గుప్పించడం వైసీపీకి బూమరాంగ్ అయ్యింది. జగనే స్వయంగా కల్తీ జరిగినట్లు అంగీకరించినట్లైంది.  ఇక ఇప్పుడు రాజకీయంగా వైసీపీకి వాటిల్లిన, వాటిల్లబోయే నష్టం విషయానికి వచ్చే ముందు  2014 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీతో కలిసి కూటమిగా పోటీ చేసిన బీజేపీ.. ఆ తరువాత కొద్ది కాలానికే అప్పటి ప్రతిపక్షమైన వైసీపీకి, ఆ పార్టీ అధినేత జగన్ కు అనుకూలంగా వ్యవహరించడం ప్రారంభించింది. 2019 ఎన్నికల నాటికి పరోక్షంగా జగన్ కు అన్ని విధాలుగా పరోక్ష సహకారం అందించింది.  మళ్లీ 2024 ఎన్నికలు వచ్చే సరికి తెలుగుదేశంతో జట్టు కట్టింది. అంటే రాష్ట్రంలో కనీస బలం కూడా లేని బీజేపీ తన అవసరాలు, పబ్బం గడుపుకోవడం కోసం రాష్ట్రంలో ఊసరవెల్లిలా రంగులు మారుస్తోంది. అన్నిటికీ మించి తన రాజకీయ ప్రయోగాలకు ఆంధ్రప్రదేశ్ ను ఒక లేబొరేటరీలా వాడుకుంటోంది. ఈ  ప్రయోగాల కారణంగా ఏపీ ఏ గంగలో కలిసినా ఫర్యాలేదు అన్నట్లుగా వ్యవహరిస్తోంది.   అయితే ఇక ఇప్పుడు అంటే లడ్డూ వివాదం తరువాత ఆ పార్టీకి ఆ అవకాశం ఇసుమంతైనా లేదు. తన రాజకీయ ప్రయోజనాల కోసమైనా.. జగన్ కు మద్దతు, సహకారం అందించే పరిస్థితి ఇప్పుడే కాదు మరెప్పుడూ తలెత్తే అవకాశం లేదు. హిందూత్వను భుజాన వేసుకునే బీజేపీ ఇప్పుడు అనివార్యంగా మిగిలిన అన్ని పార్టీల కంటే ఎక్కువగా జగన్ పై విమర్శలు గుప్పించి, జగన్ తిరుమల తిరుపతికి చేసిన అపచారాన్ని ఎండగట్టక తప్పని పరిస్థితి లడ్డూ వివాదం కారణంగా ఏర్పడింది.  చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరించి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడకం వెనుక ఉన్నది వైసీపీయేనని సందేహాలకు అతీతంగా ఎస్టాబ్లిష్ చేశారు. దేవుడికి జరిగిన మహాపచారంలో వైసీపీ ప్రమేయం ఉందని నిరూపించేశారు. దీంతో వైసీపీకి బీజేపీ ద్వారాలు శాశ్వతంగా మూతపడేలా చేశారు. జగన్ తో ఏ రకంగానైనా సంబంధాలు కొనసాగిస్తే బీజేపీ దేశ వ్యాప్తంగా హిందువుల ఆగ్రహానికి గురౌతుంది. ఆ కారణంగానే బీజేపీ ద్వారాలు జగన్ కు ఇక ఎప్పటికీ తెరుచుకునే పరిస్థితి లేదు.  ఆ సంకేతాలు ఇప్పటికే ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. తాడేపల్లి ప్యాలెస్ వద్ద బీజేపీ ధర్నా జరగడాన్ని చెప్పవచ్చే. ఒక్క రాష్ట్రంలోనే కాకుండా దేశ వ్యాప్తంగా కూడా బీజేపీ శ్రేణులు నేతలు వైసీపీపై జగన్ పై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. దాంతొ ఇక వైసీపీ ఎప్పటికీ బీజేపీకి అంటరాని పార్టీగా మారిపోయిందనే చెప్పాలి.  అంటే జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ స్పీడందుకుంటుందన్నమాట. జగన్ లో ఇప్పటికే ఆ భయం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.  

తీన్మార్ మల్లన్న బీసీ సీఎం నినాదం ఆంతర్యమేంటో?

రాజకీయ నాయకులకు కామన్‌గా వుండే ఒక లక్షణం ఏంటంటే, తమకు ఏదైనా పదవో, ఇంకోటో కావాలంటే.... వాటిని ఇచ్చే వారిని డైరెక్ట్.గా అడగరు. ఏదో ఒక కొత్త ఉద్యమం లేపుతారు. కొత్త నినాదాన్ని చేపడతారు. అప్పుడు సదరు పదవి ఇచ్చే వ్యక్తికి విషయం అర్థమవుతుంది. వెంటనే ఏదో ఒక పదవో, కాంట్రాక్టో ప్రసాదిస్తాడు. దాంతో ఉద్యమాలు, నినాదాలు లేవనెత్తిన సదరు నాయకుడు గప్‌చుప్ అయిపోయి తనకు దక్కిన దానితో సంతృప్తిపడుతూ వుంటాడు. ఈమధ్య ఎమ్మెల్సీగా ఎన్నికైన తీన్మార్ మల్లన్న కూడా ఇదే బాటలో పయనిస్తున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి.  తీన్మాన్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ హోరాహోరీగా పోరాడి ఎమ్మెల్సీ అయ్యారు. అంత పోరాడి ఎమ్మెల్సీ అయ్యాను కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పోరాటపటిమను మెచ్చి ఏదైనా మంచి పదవి ఇస్తారేమోనని మల్లన్న ఆశించి వుండవచ్చు. అలా ఆశించడం తప్పు కూడా కాదు. అయితే మల్లన్నకు సీఎం రేవంత్ రెడ్డి పెద్దగా పట్టించుకున్నట్టు కనిపించడం లేదు. అయితే, ఇప్పుడు తీన్మార్ మల్లన్న కొత్తగా బీసీ ఉద్యమాన్ని నెత్తికి ఎత్తుకున్నారు. ఆదివారం నాడు హైదరాబాద్‌లో జరిగిన బీసీ కులసంఘాల అఖిల పక్ష రాష్ట్ర సదస్సులో పాల్గొన్న తీర్మాన్ మల్లన్న బీసీల గళాన్ని వినిపించే ప్రయత్నం చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పనతోపాటు సమగ్ర కుల గణనని కూడా కాంగ్రెస్ ప్రభుత్వంతో జరిపించే బాధ్యత తనదేనని తీన్మార్ మల్లన్న అన్నారు. ఒకవేళ ఇవి జరగకపోతే తనదే బాధ్యత అని తన నెత్తిన బరువు పెట్టుకున్నారు. జనాభా ప్రాతిపదిక ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలనేది కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ ఉద్దేశమని అధిష్ఠానం వైపు నుంచి నరుక్కొచ్చే ప్రయత్నం చేశారు. ఇదంతా బాగానే వుంది... ఇక్కడి వరకు ఎలాంటి అనుమానాలు లేవు. అయితే పనిలోపనిగా తీన్మార్ మల్లన్న ఒక  వ్యాఖ్య మాత్రం మనసులో ఏదో ఉద్దేశం పెట్టుకునే చేసినట్టు కనిపిస్తోంది.  ఇంతకీ ఆ వ్యాఖ్య ఏమిటంటే, తెలంగాణ రాష్ట్రం బీసీ రాష్ట్రంగా మారబోతోందట, 2028లో జరిగే ఎన్నికలలో బీసీ నాయకుడే తెలంగాణకు ముఖ్యమంత్రి అవుతారట. పదేళ్ళపాటు తానే ముఖ్యమంత్రిగా వుంటానని రేవంత్ రెడ్డి చెబుతున్నారు. అలాంటి వచ్చే ఎన్నికల తర్వాత బీసీ నాయకుడు ముఖ్యమంత్రి అవుతారని తీన్మార్ మల్లన్న అంటున్నారంటే, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కుర్చీ కిందకి నీళ్ళు తెచ్చే వ్యవహారమే కదా. అలాగే, ముఖ్యమంత్రి అవ్వాలన్న ఆశ వున్నప్పటికీ అవకాశం లేక ఊరుకున్న తెలంగాణ కాంగ్రెస్ బీసీ నాయకులలో లేనిపోని ఆశలు కలిగించడమే కదా! ఇంకానయం, తీన్మార్ మల్లన్న బీసీ ముఖ్యమంత్రి వస్తాడని మాత్రమే అన్నారు. బీసీ అయిన తానే ముఖ్యమంత్రి అవుతానని అనలేదు. ఏది ఏమైనప్పటికీ తీన్మార్ మల్లన్న ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విషయంలో అసంతృప్తిగా వున్నారు. తెలంగాణ ఉద్యమంలో తనవంతు పాత్రను పోషించిన తనది కేవలం ఎమ్మెల్సీ స్థాయి మాత్రమే కాదు.. ఇంకా పెద్ద స్థాయి అని, ఆ స్థాయిని రేవంత్ రెడ్డి ఇంకా గుర్తించలేదని తీన్మార్ మల్లన్న ఫీలవుతున్నట్టు అర్థమవుతోంది. మరి తీర్మాన్ మల్లన్నఈ ఆవేదనను రేవంత్ రెడ్డి గుర్తించి ఆయనకు సముచిత స్థానం కల్పిస్తారో, లేదా మల్లన్న ఆవేదదను ఈ చెవితో వినేసి ఆ చెవితో వదిలేస్తారో చూడాలి.

స్వామివారి లడ్డూకి పూర్వ వైభవం!

తిరుమల స్వామివారి ప్రసాదం లడ్డూ అన్నా, దాని పవిత్రత అన్నా, దాని రుచి అన్నా మీకు ఎంతో ఇష్టం కదూ? తిరుమల లడ్డూ తయారీలో ఉపయోగించిన నెయ్యిలో కల్తీ జరిగిందని, స్వచ్ఛమైన ఆవు నెయ్యి కాకుండా జంతువుల కొవ్వు కలిసిన నెయ్యితో లడ్డూ తయారీలో ఉపయోగించారని ఇటీవల వచ్చిన వార్తలు విని మీరు చాలా బాధపడే వుంటారు. తిరుమలలో ఎన్నో అవినీతి, అక్రమ కార్యకలాపాలు చేసిన ఈ దుర్మార్గులు చివరికి స్వామివారి లడ్డూని కూడా వదల్లేదా అని మీకు కోపం వచ్చింది  కదూ! ఈ ఐదేళ్ళుగా ఎంతో భక్తిగా, ప్రేమగా స్వీకరించిన లడ్డూ ప్రసాదం వెనుక ఇంత కుట్ర జరిగిందని మీకు బాధకలిగే వుంటుంది. స్వామివారికి జరిగిన అపచారం మీకు తీవ్ర మనోవేదన కలిగించే వుంటుంది. అయితే, ఇక అలా బాధపడాల్సిన అవసరమే లేదండీ.. పరిస్థితితో మార్పు వచ్చింది. తిరుమల లడ్డూకి పవిత్రత మళ్ళీ సమకూరింది. తిరుమల లడ్డూ విషయంలో ఇక ఎలాంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. చంద్రబాబు ప్రభుత్వం పరిస్థితిని పూర్తిగా మార్చింది. లడ్డూ తయారీకి ఉపయోగించే నేతిని మార్చింది. ఇప్పుడు శ్రీవారి లడ్డూని ఎలాంటి ఇబ్బంది లేకుండా, పవిత్రత విషయంలో ఎలాంటి అనుమానాలకు గురికాకుండా మహాప్రసాదాన్ని హాయిగా స్వీకరించవచ్చు. అలాగే శ్రీవారి ఆలయంలో జరిగిన దోషాలకు ప్రాయశ్చిత్తంగా టీటీడీ అధికారులు శాంతి హోమం, పంచగవ్య ప్రోక్షణ నిర్వహించారు. ఆలయంలోని అన్ని విభాగాల్లోనూ ప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్యంగా లడ్డూ తయారీ జరిగే పోటులో ప్రోక్షణ జరిగింది. స్వామివారికి మహా నైవేద్యం నిర్వహించారు. ఇక భక్తులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని టీటీడీ ఈఓ శ్యామలరావు భరోసా ఇస్తున్నారు. పూర్ణాహుతి కార్యక్రమ నిర్వహణతో అన్ని దోషాలూ తొలగుతాయని ఆయన వివరించారు. గతంలో వున్న నెయ్యి మొత్తాన్నీ తొలగించామని తెలిపారు. 

రేవంత్ వల్లే దేవర ప్రీ రిలీజ్ ఫంక్షన్ క్యాన్సిల్!

జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రేవంత్ రెడ్డి షాక్ ఇచ్చారా?  ఆ ఈవెంట్ రద్దు కావడానికి రేవంత్ రెడ్డే కారణమా అంటే అంటే ఎన్టీఆర్ అభిమానులు ఔననే అంటున్నారు. ఎంతో ముందుగా ఫిక్స్ అయిన దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆగిపోవడానికి రేవంత్ రెడ్డి అదే రోజు మాదాపూర్ లోని ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు రావడంతో దేవర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను క్యాన్సిల్ చేశారని అంటున్నారు. స్టార్ హీరో అయిన ఎన్టీఆర్ కు స్ట్రాంగ్ అభిమానుల బేస్ ఉంది. కొన్నేళ్ల తరువాత  ఎన్టీఆర్ సినీమా విడుదల కాబోతుండటంతో ఫ్యాన్స్ అవధులు లేని ఆనందంలో ఉన్నారు. వాస్తవానికి 2018 తరువాత ఎన్టీఆర్ సోలో హీరోగా వస్తున్న సినిమా దేవర. మధ్యలో ఆర్ఆర్ఆర్ రిలీజై రికార్డులు బద్దలు కొట్టింది. ఈ సినిమాలో నటనకు గాను ఎన్టీఆర్ పాన్ వరల్డ్ హీరో అయిపోయారు. అయినా కూడా ఆ సినిమాలో ఎన్టీఆర్ తో పాటు రామ్ చరణ్ కూడా హీరోగా నటించారు. దీంతో ఎన్టీఆర్ సోలో హీరోగా ఆరేళ్ల తరువాత వస్తున్న సినిమా దేవర. ఈ నేపథ్యంలోనే దేవర సినిమా క్రేజ్ అంబరాన్నంటింది. అందుకే దేరవ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు భారీ ఏర్పాట్లు చేశారు. అవసరమైన అనుమతులన్నీ తీసుకున్నారు. పోలీసులు కూడా ఫంక్షన్ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ అంటే తోపులాట, తొక్కిస లాట వంటివి జరగకుండా భారీ ఏర్పాట్లు చేశారు. నోవాటెల్ లో జరగాల్సిన ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ అభిమానులు అంచనాలకు అందనంత సంఖ్యలో భారీగా రావడంతో పోలీసులు కూడా చేతులెత్తేశారు. దీంతో చివరి క్షణంలో దేవర ప్రీరిలీజ్ ఫంక్షన్ ను రద్దు చేశారు. దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు తరువాత అభిమానుల ఆగ్రహాన్ని చల్లార్చేందుకు జూనియర్ ఎన్టీఆర్ ఓ వీడియో కూడా రిలీజ్ చేశారు. మొత్తం మీద అంచనాలకు మించి అభిమానులు పెద్ద సంఖ్యలో రావడంతో పాటు సీఎం రేవంత్ కార్యక్రమం కూడా దేవర ప్రీరిజ్ ఈవెంట్ రద్దుకు ప్రధాన కారణంగా చెబుతున్నారు.  ఎందుకంటే పోలీసు బందోబస్తు రేవంత్ కార్యక్రమం కోసం వెళ్లడంతో దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగాల్సిన నోవాటెల్ వద్ద సరిపడినంత బందోబస్తు లేకుండా పోయింది. సీఎం కార్యక్రమం ముగిసి పోలీసు బలగాలు నోవాటెల్ ప్రాంతానికి రాత్రి ఎనిమిదిన్నగంటల తరువాత వచ్చారు. అయితే అప్పటికే పోలీసులు కంట్రోల్ చేయలేనంతగా ఎన్టీఆర్ అభిమానులు నోవాటెల్ వద్దకు చేరుకున్నారు. చివరి క్షణంలో అంత క్రౌడ్ కంట్రోల్ చేయడం సాధ్యం కాదని భావించిన నిర్వాహకులు ఫంక్షన్ క్యాన్సిల్ చేయడం వినా మరో మార్గం లేదన్న నిర్ణయానికి వచ్చి ఫంక్షన్ రద్దైందని ప్రకటించారు.  అంచనాలకు మించి అభిమానులు తరలిరావడం వల్లే ఫంక్షన్ క్యాన్సిల్ అయ్యిందని నిర్వాహకులు, పోలీసులు చెబుతున్నా.. సీఎం రేవంత్ పాల్గొన్న కార్యక్రమ బందోబస్తు కోసం దేవర్ ప్రీరిలీజ్ ఫంక్షన్ ను బలి చేశారని అభిమానులు వాపోతున్నారు.   నిజానికి సీఎం ప్రోగ్రాం, దేవర ఫంక్షన్ రెండూ  దాదాపు  ఒకే టైమ్‌లో,  ఒకే ఏరియాలో జరగడమే అసలు సమస్య అని అభిమానులు అంటున్నారు. 

తిరుమల లడ్డూ ప్రసాదం విక్రయాలు పెరిగాయి.. ఎందుకంటే?

తిరుమల లడ్డూ ప్రసాదం వివాదంపై తార స్థాయిలో  చర్చ జరుగుతున్న వేళ కూడా లడ్డూ ప్రసాదాల విక్రయాలు తగ్గలేదు సరికదా గణనీయంగా పెరిగాయి. ఈ వివాదం వెలుగులోకి రాకముందు.. అంటే జగన్ హయాంతో పోలిస్తే.. గత పది రోజులుగా లడ్డూ విక్రయాలు విపరీతంగా పెరిగాయి.  జగన్ హయాంలో లడ్డూ ప్రసాదం నాణ్యత గణనీయంగా తగ్గిపోయిందన్న విమర్శలు వెల్లువెత్తాయి. నాణ్యత లేనందున భక్తులు లడ్డూ ప్రసాదాల కొనుగోలు విషయంలో కొంచం ముందు వెనుకలాడారు. గతంలోలా శ్రీవారిని దర్శించుకుని లడ్డూ ప్రసాదాలను పెద్ద ఎత్తున కొనుగోలు చేయకుండా నియంత్రణ పాటించారు. పెద్ద సంఖ్యలో లడ్డూ ప్రసాదాలను కొనుగోలు చేసి తమ తమ ఊర్లకు తీసుకు వెళ్లి బంధు మిత్రులకు పంచే సంప్రదాయానికి జగన్ హయాంలో చెక్ పడింది. ఎందుకంటే అప్పట్లో లడ్డూ నిలవ ఉండేది కాదు. నాణ్యతా లోపం కారణంగా రెండు మూడు రోజులకే పాడైపోయేది. తిరుమల యాత్ర ముగించుకని తమ తమ ఊళ్లకు వెళ్లిన తరువాత లడ్డూ ప్రసాదాన్ని బంధు మిత్రులకు పంచాలంటే భక్తులు ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సి వచ్చేది. ఆ కారణంగానే జగన్ అధికారంలో ఉండగా లడ్డూ ప్రసాదాల విక్రయాలు పడిపోయాయి. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత లడ్డూ ప్రసాదంలో నాణ్యత పెరిగిన విషయాన్ని భక్తులు గుర్తించారు. సామాజిక మాధ్యమం ద్వారా పలువురు ఈ విషయాన్ని చాటారు. దీంతో కూటమి సర్కార్ కొలువుదీరిన తరువాత తిరుమల లడ్డూ ప్రసాదాల విక్రయాలలో పెరుగుదల కనిపించింది. అయితే అప్పటికి లడ్డూ ప్రసాదంలో  వినియోగించే నెయ్యి జంతువుల కొవ్వుతో కల్తీ అయ్యిందన్న విషయం వెలుగులోనికి రాలేదు. అయితే  కూటమి ప్రభుత్వం కొలువుదీరగానే తిరుమల ప్రక్షాళన ప్రారంభించింది. అన్న ప్రసాదం నుంచి, తిరుమల కొండపై హోటళ్లలో పారిశుద్ధ్యం, తినుబండారాలలో నాణ్యత విషయంలో రాజీపడకుండా ముందుకు సాగడంతో మార్పు ప్రస్ఫుటంగా కనిపించింది. జనం, భక్తులు కూడా అదే అనుకున్నారు. అయితే ఎప్పుడైతే తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వు అవశేషాల వినియోగం వెలుగుచూసిందో... భక్తులు నివ్వెర పోయారు. దిగ్భ్రాంతికి గురయ్యారు. జగన్ హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదంలో నాణ్యతా లోపానికి కారణం తెలిసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  అదే సమయంలో  కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నాణ్యత విషయంలో రాజీ పడబోమన్న చంద్రబాబు ఆ మాట నిలబెట్టుకుని కల్తీని నివారించారని భక్త జనం నమ్ముతున్నారు. అందుకే ఇంతటి వివాదంలోనూ గతం కంటే లడ్డూ విక్రయాలలో పెరుగుదల కనిపిస్తోంది.  ఈ నెల 19న భక్తులు 3 లక్షల 59 వేల 650 లడ్డూలు కొనుగోలు చేస్తే.. 20వ తేదీన ఆ సంఖ్య 3లక్షల 17 వేల 954గా ఉంది. ఇక 21వ తేదీనైతే అది 3 లక్షల 67 వేల 607కు పెరిగింది.   దీనిని బట్టి చూస్తే లడ్డూ ప్రసాదం వివాదం వాటి విక్రయాలపై ఇసుమంతైనా ప్రభావం పడలేదని స్పష్టమౌతోంది.  ఇందుకు కూటమి కొలువుదీరిన తరువాత తిరుమల తిరుపతి దేవస్థానం పారదర్శకంగా వ్యవహరించడం, నాణ్యత పెంపు స్ఫష్టంగా కనిపిస్తుండటం కారణంగా చెప్పవచ్చు. అలాగే తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో మళ్లీ నంది నెయ్యే వినియోగిస్తున్నట్లే టీటీడీ ప్రకటించడం కారణంగా చెప్పొచ్చు.