చిరుకి ఆ మాత్రం తెలియదా?.. వాళ్ల సినిమాలు చూడకండి: అశ్వనీదత్

ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రకటించిన మూడు రాజధానుల ప్రతిపాదనను సినీ హీరో చిరంజీవి స్వాగతించడాన్ని నిర్మాత అశ్వనీదత్ తప్పుబట్టారు. చిరంజీవికి ఏం తెలుసని మూడు రాజధానులు బాగుంటుందని చెప్పారని ఫైర్ అయ్యారు. ప్రపంచంలో బహుళ రాజధాని వ్యవస్థ ఫెయిలైన విషయం చిరంజీవికి తెలియదా అని ప్రశ్నించారు. పవన్‌ కళ్యాణ్ సినిమాల్లో నటిస్తే కోట్లలో సంపాదిస్తారని.. అయినా సినిమాలు వదిలేసి రైతుల కోసం ఎందుకు పోరాడుతున్నాడో చిరంజీవికి తెలియదా అని అశ్వనీదత్ చురకలంటించారు. రాజధాని ప్రాంతంలో పుట్టిన వాళ్లు సూపర్ స్టార్లుగా ఉన్నారని.. నటుడిగా కాకున్నా, సగటు మనిషిగా స్పందించాల్సిన అవసరం లేదా అని ఒక స్టార్ హీరోని ఉద్దేశించి అశ్వనీదత్ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. వాళ్ల సినిమాలు చూడటం మానేయండని, వాళ్లే దిగివస్తారని రాజధాని రైతులకు అశ్వనీదత్ పిలుపునిచ్చారు.

బాబు, పవన్ లపై వైసీపీ ఎమ్మెల్యే బూతు పురాణం

రాజధాని అమరావతి కోసం ఉద్యమిస్తున్న రైతులపై అధికార పార్టీ నేతలు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. పెయిడ్ ఆర్టిస్టులు అని.. రైతులైతే బురదలో దిగి పని చేసుకోవాలి కానీ ఇలా రోడ్ల మీద ప్యాంటులు వేసుకొని తిరగరు అని.. మెడలో బంగారం ఉన్న మహిళలు రైతులు ఎలా అవుతారని.. ఇలా రకరకాల వ్యాఖ్యలు చేశారు. అధికార పార్టీ నేతల వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రైతులు వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయినా వైసీపీ నేతల తీరు మారట్లేదు. రైతులపైనా, రైతులకు మద్దతుగా నిలుస్తున్న వారిపైనా నోరు పారేసుకుంటున్నారు.  తాజాగా కాకినాడ సిటీ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఓ ర్యాలీలో మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లపై హద్దు దాటి వ్యాఖ్యలు చేశారు. రాయడానికి వీలులేని బూతులు మాట్లాడారు. "చంద్రబాబూ నిన్ను ఒరేయ్ ల** **కా అని తిట్టాలనుంది వెదవకాన" అని నోరు పారేసుకున్నారు. "పవన్ పెద్ద పెద్ద మాటలు చెప్తాడు చేసేవి ల** పనులు.. దొంగ నా కొడుకు" అంటూ దారుణమైన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చేసిన వ్యాఖ్యల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆయనపై నెటిజనులు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ప్రజాప్రతినిధి అయ్యుండి ఇవేం మాటలు అని మండిపడుతున్నారు. మాజీ సీఎంని ఇలాంటి మాటలు అనడం ఏంటి? ఇదేం సంస్కారం అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సమావేశం మధ్యలో సడన్ గా ఢిల్లీ వెళ్లిన పవన్.. ఏపీలో కీలక పరిణామాలు!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సడెన్ గా ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరుగుతుండగానే మధ్యలోనే లేచి పవన్ ఢిల్లీకి బయలుదేరారు. కేంద్ర ప్రభుత్వ ప్రముఖుల అపాయింట్‌మెంట్‌ పవన్‌ కు ఖరారయిందని, అందుకే ఆయన హుటాహుటిన ఢిల్లీ వెళ్లారని తెలుస్తోంది. బీజేపీ జాతీయాధ్యక్షుడు, హోంమంత్రి అమిత్ షా తో ఆయన అప్పాయింట్ మెంట్ ఖరారు అయినట్లు సమాచారం. పవన్ సడన్ గా ఢిల్లీ వెళ్లడం హాట్ టాపిక్ గా మారింది. ఆయన రెండు రోజులుగా కేంద్ర ప్రముఖుల అప్పాయింట్ మెంట్ కోరుతున్నారు. ఏపీ మూడు రాజధానుల వ్యవహారంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని ఇటీవల కోరారు. అదే సమయంలో తాను కూడా ఈ మొత్తం వ్యవహారాన్ని కేంద్రంతో చర్చిస్తానని అన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన కేంద్ర పెద్దల అప్పాయింట్ మెంట్ కోరారు. ఈరోజు పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ఉన్న సమయంలో అప్పాయింట్ మెంట్ ఖరారైనట్లుగా ఫోన్ వచ్చింది. దీంతో వెంటనే పవన్ ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. ఢిల్లీలో ఆయన పలువురు కీలక వ్యక్తులను కలవనున్నారని సమాచారం. రాజధాని అంశంపై ప్రధానంగా చర్చించే అవకాశముందని తెలుస్తోంది. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ-జనసేన పొత్తు గురించి చర్చించే అవకాశముందని సమాచారం. పవన్ ఢిల్లీ పర్యటన తరువాత ఏపీ రాజకీయాల్లో సమీకరణాలు మారే అవకాశం ఉందని అంటున్నారు. అయితే, ఢిల్లీలో పవన్ ఎవరెవరిని కలుస్తారు..ఏం చర్చిస్తారనే దాని పైన మొత్తం సమీకరణాలు ఆధారపడి ఉన్నాయి.

చంటి పిల్లల్ని అరెస్ట్ చేసే స్థాయికి దిగజారిపోయారు జగన్ గారు!!

ఏపీ రాజధాని కోసం పోరాడుతున్న రైతులు, మహిళల విషయంలో ప్రభుత్వం, పోలీసులు వ్యవహరిస్తున్న తీరు సరికాదంటూ టీడీపీ నేత నారా లోకేష్ విమర్శించారు. మహిళల పట్ల పోలీసులు అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. చిన్నపిల్లల పట్ల కూడా జాలి చూపించట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తల్లితో పాటు నిరసనలో పాల్గొన్న ఒక చిన్న పిల్లాడిని అరెస్టు చేసిన ఫోటోని లోకేష్ ట్విట్టర్‌ ద్వారా షేర్‌ చేశారు. అంతేకాకుండా ఓ యువతితో భత్రతా బలగాలు అనుచితంగా ప్రవర్తించినట్లుగా ఉన్న మరో ఫోటోను కూడా ఆయన షేర్ చేశారు. 'చంటి పిల్లల్ని అరెస్ట్ చేసే స్థాయికి దిగజారిపోయారు వైఎస్ జగన్ గారు. వైసీపీ రాక్షస పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. మహిళల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు హేయనీయం.’ అని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అరెస్ట్ చేసిన మహిళల్ని మీది ఏ కులమో చెప్తే కానీ విడుదల చెయ్యం అని నిలదీస్తారా? ఈ ఘటనలతో మహిళల పై జగన్ గారికి ఉన్న గౌరవం ఏంటో సమాజానికి అర్ధం అయ్యింది. అరెస్టులు కాదు దమ్ముంటే మా అక్కా, చెల్లెళ్లు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పండి’ అని లోకేష్ నిలదీశారు.

టీఆర్ఎస్ లో పోటీ.. కాంగ్రెస్ కి కలిసొచ్చింది!!

ఈ పార్టీ కాకపోతే మరో పార్టీ ఏది ఏమైనా పోటీ చేయడమే ముఖ్యం. ఇది మునిసిపల్ ఎన్నికల్లో పోటీకి సంబంధించి వివిధ పార్టీల నేతల్లో నెలకొన్న అభిప్రాయం. దీంతో అభ్యర్థిత్వం పై పార్టీ నాయకత్వం నుంచి హామీ లేకపోయినా నామినేషన్ వేశారు. సొంత పార్టీ నుంచి టిక్కెట్ దక్కదని తెలియడంతో కండువా మార్చేశారు. మరో పార్టీ నుంచి కూడా నామషన్ దాఖలు చేశారు. చివరికి ఏ పార్టీ టిక్కెట్ దక్కితే ఆ పార్టీ బి ఫారాన్ని సమర్పించేందుకు సిద్ధమయ్యారు. ఇలా ఒక్కొక్కరు రెండు మూడు నామినేషన్లు కూడా వేయడమే కాక రాత్రి కి రాత్రి పార్టీ కూడా మారుతున్నారు. పరిషత్ ఎన్నికలను స్వీప్ చేసిన అధికార టీఆర్ఎస్ఐ ఈ తలనొప్పులను ఎక్కువగా ఎదుర్కొంటోంది. పలుచోట్ల కాంగ్రెస్ కు సైతం ఈ సమస్య ఎదురవుతుంది. టీఆర్ఎస్ నుంచి గోడదూకే వారు ఎక్కువగా కాంగ్రెస్ బీజేపీలనే ఎంచుకుంటున్నారు. అది కుదరకపోతే స్వతంత్ర అభ్యర్థు లుగా అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్దపడుతున్నారు. కామారెడ్డి మున్సిపాలిటీలో టీఆర్ఎస్ కు చెందిన ఎల్లంకి శ్రీనివాస్ కు ఆ పార్టీ టిక్కెట్ దక్కక పోవడంతో కాంగ్రెస్ లో చేరారు. గురువారం టీఆర్ ఎస్ తరుపున వార్డుకు నామినేషన్ వేసిన శ్రీనివాస్ టిక్కెట్ రావడం లేదని తెలిసి శుక్రవారం కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకున్న వెంటనే కాంగ్రెస్ తరఫున టికెట్ పొంది మళ్లీ నామినేషన్ వేశారు. ఎల్లారెడ్డి మునిసిపాలిటీలో టీఆర్ఎస్ టికెట్లు దక్కని ఆ పార్టీ మండల అధ్యక్షుడు మాజీ జడ్పీటీసీ సభ్యుడు ఎంపీటీసీ సభ్యులు కూడా కాంగ్రెస్ లో చేరారు. వీరంతా మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి వర్గీయులు కావడంతో వీరికి టికెట్ ఇచ్చేందుకు ఎమ్మెల్యే నల్లమడుగు సురేందర్ నిరాకరించినట్లు దీంతో వీరు పార్టీ మారినట్టు చెబుతున్నారు.మంచిర్యాల మున్సిపల్ వైస్ చైర్మన్ టీఆర్ఎస్ నేత ఉప్పలయ్య కాంగ్రెస్ లో చేరగా ఆయనను మునిసిపల్ చైర్మన్ అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రకటించింది.ఇలా నేతలు పార్టీలు మారడం పట్ల ఆ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రుల బుజ్జగింపుల పదునుపెట్టారు. మున్సిపల్ ఎన్నికల్లో అవకాశం దక్కకపోయినా నామినేటెడ్ పదవులు ఇతర అవకాశాల్ని ఎరగా చూపున్నారు నేతలు.

అమరావతి మహిళలకు అండగా జాతీయ మహిళా కమిషన్!!

రాజధాని మార్పు అంశం మొదలైన దగ్గర నుంచి ఆంధ్రా అంతటా వాతావరణం వేడెక్కుతోంది.రాజధాని గ్రామాల్లో జాతీయ మహిళా కమిషన్ ప్రతి నిధుల బృందం ఇటీవల పర్యటించింది. తుళ్లూరులో రైతుల మహిళలపై దాడులను కమిషన్ తీవ్రంగా పరిగణిస్తోంది. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారి పై లాఠీ చార్జ్ చేయడం అరెస్టులు చేయడం లాంటి వాటి పై క్షేత్రస్థాయిలోనే పర్యటించి నిజనిర్దారణ చేయనుంది ఇవాళ కమిటీని పంపిస్తున్నట్టు NWC చైర్ పర్సన్ రేఖా శర్మ తెలియజేశారు.మహిళలపై పోలీసులు అంత్యంత దారుణంగా దాడి చేసిన ఫోటోలు ట్విట్టర్ ద్వారా ఆమె దృష్టికి వెళ్లడంతో.. ఆమె పోలీసులు, ప్రభుత్వం తీరుపై తీవ్ర అసహనానికి గురైనట్లు తెలుస్తోంది. మరోవైపు, ప్రభుత్వం ఎంత దారుణంగా వ్యవహరిస్తోందో, పోలీసులు ఎలా దౌర్జన్యాలకు దిగుతున్నారన్న అంశం తమ వద్ద ఉన్న ఆధారాలతో సహా కమిటీ ముందు ఉంచనున్నట్లు మహిళలు తెలియజేశారు. కనకదుర్గమ్మకు పసుపు కుంకుమ నైవేధ్యం సమర్పించేందుకు వెళుతున్న తమతో పోలీసులు వ్యవహరించిన తీరును మహిళా కమిషన్ బృందానికి వివరించబోతున్నారు. పెయిడ్ ఆర్టిస్టులు అంటూ తమను పదేపదే కించపరుస్తున్నారని మహిళలు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల మందడం లో జరిగిన దాడితో పాటు నిన్న విజయవాడలో మహిళల ర్యాలీ సందర్భంగా సాగిన దమన కాండను కూడా కమిషన్ ముందుకు తీసుకురానున్నారు. రాజధానికి భూములిచ్చిన తాము న్యాయం కోసం పోరాడుతుంటే అత్యంత దారుణంగా కట్టడి చేయాలని చూస్తున్నారని మహిళలు వాపోతున్నారు. తమ హక్కులను కాపాడాలని డిమాండ్ చేస్తున్నారు.

బాబు తిరుపతి ర్యాలీకి అనుమతి నిరాకరించిన పోలీసులు... ఏం జరగనుంది?

ఏపీ రాజధాని అంశం రోజు రోజుకు వేడెక్కుతోంది.జగన్ నిర్ణయం పై ఒకొక్క నేత ఒక్కోలా స్పందిస్తున్నారు .ఏపీ రాజధానిని తరలించాలన్న యోచనలో ఉన్న ప్రభుత్వం పై రైతుల నిరసన లు ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటి దాకా క్యాండిల్ ర్యాలీలు, పాదయాత్రలు, ధర్నాలు, రోడ్డు పై బైఠాయింపులతో తమ నిరసన తెలిపిన రైతలు ఇవాళ బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు.ఇవాళ ఉదయం ఇరవై తొమ్మిది గ్రామాల్లోని ఎస్సీ, ఎస్టీ, రైతులు బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. మందడం నుంచి విజయవాడ లోని గుణదల వరకు ఈ ర్యాలీ కొనసాగనుంది.టిడిపి అధినేత చంద్రబాబు తిరుపతిలో పర్యటించనున్నారు. అమరావతి పరిరక్షణ సమితి నిర్వహిస్తున్న బస్సు యాత్రలో ఆయన పాల్గొంటున్నట్లు సమాచారం.ఉదయం పది గంటలకు జేఏసీ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. సాయంత్రం నాలుగు గంటలకు పూలే విగ్రహం నుంచి నాలుగు కాళ్ల మండపం వరకు జరిగే ర్యాలీకి కూడా చంద్రబాబు హాజరవుతారు. అయితే తిరుపతి పోలీసులు మాత్రం శనివారం సాయంత్రం తిరుపతిలో నిర్వహించే అమరావతి పరిరక్షణ ర్యాలీకి అనుమతి లేదంటున్నారు. సంక్రాంత్రి హడావిడి ఉందని.. కాబట్టి ర్యాలీకి అనుమతి ఇవ్వలేమని తేల్చి చెప్పారు. ఎవరైనా ర్యాలీకి ప్రయత్నిస్తే అరెస్ట్ చేస్తామని హెచ్చరిస్తున్నారు. అంతేకాదు నగరంలో పోలీసుల్ని భారీగా మోహరించారు.. పరిస్థితి ఎస్పీలు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. దీంతో బాబు ఏం చేయబోతున్నారన్నది చర్చనీయంశంగా మారింది.

పోసాని-పృథ్వీ పెయిడ్ వార్ వెనుక అసలు కారణం ఏమిటంటే...

పృథ్వీ చేసిన కామెంట్లే వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలూ చేశారు. పెయిడ్ ఆర్టిస్టులతో ఆందోళనలు చేస్తున్నారని అన్నారు. వీరంతా అలాంటి మాటలే అన్నప్పటికీ, కేవలం పృథ్వీనే లక్ష్యంగా చేసుకుని పోసాని మాట్లాడ్డంపై వైసీపీలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఒకవైపు జగన్‌ను పొగుడుతూనే మరోవైపు పృథ్వీపై విమర్శలదాడి చేయడంలో పోసాని లెక్కలు వేరే ఉన్నాయని అంటున్నారు. పోసాని కృష్ణమురళి మొదటి నుంచీ జగన్‌కు అండగా ఉన్నారు. పార్టీ పెట్టిన కొత్తలోనే రోజాతోపాటు జగన్‌ వెంట నడిచింది పోసాని కృష్ణమురళే. చంద్రబాబుపై ఓ రేంజ్‌లో ఫైరవుతూ ప్రెస్‌మీట్లు పెట్టారు, జగన్‌ను ఆకాశానికెత్తుతూ లెక్కలేనన్ని సార్లు ప్రశంసలు కురిపించారు. పాదయాత్ర టైంలోనూ జగన్‌ దగ్గరికెళ్లి మద్దతు పలికారు. అయితే, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత, అసలు తనను పట్టించుకోవడం లేదన్న అసంతృప్తితో ఉన్నారు పోసాని. అంతేకాదు, తన తర్వాత పార్టీలోకి వచ్చిన సినిమా నటులకు జగన్‌ ప్రాధాన్యత ఇవ్వడాన్ని కూడా పోసాని జీర్జించుకోలేకపోతున్నారని అంటున్నారు. ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పదవి విజయ్ చందర్‌‌కు ఇవ్వగా ఎస్వీబీసీ ఛైర్మన్‌గా పృథ్వీరాజ్‌ను చేశారు జగన్. అదే పోసానికి కోపానికి కారణమంటున్నారు. తన తర్వాత పార్టీలోకి వచ్చిన పృథ్వీకి ఎస్వీబీసీ పదవి ఇచ్చి, కనీసం తనకు ఎలాంటి నామినేటెడ్‌ పదవి ఇవ్వకపోవడాన్ని తట్టుకోలేకపోతున్నారని అంటున్నారు. అందుకే, పృథ్వీని అదేపనిగా విమర్శించారనే మాట వినిపిస్తోంది. అయితే, రాజధాని రైతులపై ఒకవైపు పృథ్వీని టార్గెట్ చేస్తూనే, మరోవైపు జగన్‌‌పై ప్రశంసలు కురిపించారు పోసాని. మూడు రాజధానుల ప్రతిపాదనకు మద్దతు పలికారు. కావాలనే జగన్‌పై చంద్రబాబు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మాట్లాడారు. అంటే పోసాని టార్గెట్‌ రాజధాని మార్పూ కాదు, పెయిడ్ ఆర్టిస్టులన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు కాదు, కేవలం పృథ్వీ మాతమేనని క్లియర్ గా తెలుస్తోందని అంటున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ, మహిళా రైతులను కించపరిచేలా మాట్లాడుతున్న పృథ్వీకి, వైసీపీలో ఇంత ప్రాధాన్యం ఎందుకిస్తున్నారో తెలియడం లేదంటూ తన సన్నిహితులతో పోసాని అన్నట్లు తెలుస్తోంది.  

నెల్లూరు, ప్రకాశంతో కలిపి గ్రేటర్ రాయలసీమ... సంక్రాంతి తర్వాత ఉద్యమం...

జేసీ దివాకర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి మాత్రమే రాయలసీమ ప్రజలకు ఆమోదయోగ్యమని అన్నారు. ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేసిన జేసీ దివాకర్ రెడ్డి.... ఒకవేళ కేపిటల్ ను తరలించాలని చూస్తే మాత్రం సంక్రాంతి తర్వాత గ్రేటర్ రాయలసీమ ఉద్యమం చేపడతామన్నారు. నెల్లూరు, ప్రకాశం జిల్లాలతో కలిపి గ్రేటర్ రాయలసీమ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడతామని అన్నారు. కడప రాజధానిగా గ్రేటర్ రాయలసీమ కోసం ఉద్యమం చేపడతామంటోన్న జేసీ.... సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. విశాఖపట్నంలో రాజధానిని ఏర్పాటుచేస్తే... ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాలకు మాత్రమే అనుకూలంగా ఉంటుందని, అదే అమరావతి అయితే, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు అనుకూలంగా అందుబాటులో ఉంటుందని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా రాజధాని తరలింపుపై సీఎం జగన్ తన నిర్ణయాన్ని మార్చుకోవాలని సూచించారు. తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్లు అన్నట్టుగా వ్యవహరించడం మంచిదికాదన్నారు. ఎన్ని కమిటీలు వేసినా ఉపయోగం ఉండదని, అవన్నీ ముఖ్యమంత్రి నిర్ణయానికి అనుకూలంగానే నివేదికలు ఇస్తాయని జేసీ వ్యాఖ్యానించారు. అయితే, వైఎస్ రాజశేఖర్ రెడ్డి మాదిరిగా పరిపాలన చేస్తాడనుకుని వైసీపీకి 151 సీట్లిస్తే.... సీఎం జగన్మోహన్ రెడ్డి.... దాన్ని నిలుపుకోలేకపోతున్నారని అన్నారు. అయితే, తెలంగాణ ఉద్యమం సమయంలోనూ రాయలసీమ విషయంలో జేసీ దివాకర్ రెడ్డి తనదైన వాదనలు వినిపించారు. మిగతా రాయలసీమ నేతలకు భిన్నంగా అనంతపురం, కర్నూలు జిల్లాలను తెలంగాణలో కలిపి రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలని కోరారు. కానీ, ఆనాడు జేసీ కోరిక నెరవేరలేదు. మళ్లీ ఇప్పుడు రాజధాని వివాదం నడుస్తున్నవేళ మరోసారి రాయలసీమ వాదాన్ని జేసీ దివాకర్ రెడ్డి తెరపైకి తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్‌కు రాజధానిగా ఉంటే అమరావతి ఉండాలని... లేదంటే... గ్రేటర్ రాయలసీమను ఏర్పాటు చేయాలంటూ డిమాండు చేస్తున్నారు.  

పోసాని వర్సెస్ పృథ్వీ... పెయిడ్ కామెంట్స్ పై రచ్చరచ్చ

ఒకరేమో థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ... మరొకరేమో టాలీవుడ్ రాజాధి రాజా పోసాని... ఇద్దరూ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌కు హార్డ్‌కోర్‌ లీడర్సే... జగన్మోహన్ రెడ్డికి వీరాభిమానులే... అయితే, వీళ్లిద్దరి మధ్య రాజధాని వివాదం చిచ్చురేపింది. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం నడుస్తోంది. అయితే, ప్రస్తుతం ఎస్వీబీసీ చైర్మన్ గా ఉన్న పృథ్వీ అమరావతి రైతులపై చేసిన కామెంట్లు రచ్చరచ్చ అవుతున్నాయి. అమరావతిలో పెయిడ్‌ ఆర్టిస్టులతో రైతు ఉద్యమం జరుగుతోందన్న పృథ్వీ.... వారు సాధారణ రైతులైతే ఆడి కార్లు, మహిళల చేతులకు బంగారు గాజులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. పేరుకే అది రైతుల పోరాటమని, కానీ అక్కడ నడుస్తున్నది కార్పొరేట్ ఉద్యమం అన్నారు. అయితే, పృథ్వీ చేసిన ఈ వ్యాఖ్యలపై అమరావతి మహిళా రైతులు భగ్గుమన్నారు. పృథ్వీ దిష్టిబొమ్మలను తగలబెట్టారు. మహిళా ఆందోళనకారులను కించపరిచేలా మాట్లాడిన పృథ్వీ, క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే, పృథ్వీ కామెంట్లపై, పోసాని కృష్ణమురళి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మహిళా రైతులను కించపరిచే వ్యాఖ్యలేంటని ప్రశ్నించారు. జగన్‌ సర్కారును అప్రదిష్టపాలు చేస్తోంది పృథ్వీలాంటివారేనంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రెస్ మీట్ మొత్తం పృథ్వీనే టార్గెట్ చేశారు పోసాని. ఒకవైపు జగన్‌ను పొగుడుతూనే, మరోవైపు పృథ్వీలాంటి వారివల్లే, జగన్‌కు చెడ్డపేరు వస్తోందని బ్యాలెన్స్‌డ్‌‌గా పంచ్‌లు కురిపించారు. ఒకవిధంగా చెప్పాలంటే పృథ్వీని తనదైన స్టైల్లో మాటలతో ఆటాడేశారు పోసాని. పోసాని విమర్శలకు కొంచెం ఆలస్యంగా స్పందించినా... ఘాటుగానే రియాక్టయ్యారు పృథ్వీ. అమరావతిలో ఆందోళనలు చేస్తున్నది ముమ్మాటికీ పెయిడ్ ఆర్టిస్టులేనంటూ స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. తాను పార్టీ స్టాండ్ ప్రకారమే మాట్లాడానన్న పృథ్వీ.... క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదన్నారు. అయినా, ఎవరో అడిగితే తాను సమాధానం చెప్పాలా అంటూ పోసానికి రివర్స్ కౌంటర్ ఇఛ్చారు. తన వల్ల పార్టీ నష్టపోతుందని తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఫైరైన పృథ్వీ.... పోసానికి దమ్ముంటే ఏదైనా వేదికపైకి వచ్చి మాట్లాడాలని సవాలు విసిరారు. వ్యవసాయం చేసే రైతులను తాను పెయిడ్ ఆర్టిస్టులని అనలేదని, కానీ అమరావతిలో ఆందోళనలు చేస్తున్నవాళ్లు మాత్రం ముమ్మాటికీ పెయిడ్ ఆర్టిస్టులేనని అన్నారు. తనతోపాటు నటించిన పలువురు అమరావతి ఆందోళనల్లో ఉన్నారని పృథ్వీ చెప్పుకొచ్చారు. అయితే, పోసాని కామెంట్స్ కు పృథ్వీ స్ట్రాంగ్ కౌంటరివ్వడంతో... ఈ వివాదం ఎటువైపు వెళ్తుందో చూడాలి.

జగన్‌కు ఈడీ షాక్‌... జనవరి 24న కీలక తీర్పు...

ఆస్తుల కేసులో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వలేమని, తప్పనిసరిగా హాజరుకావాలంటూ కోర్టు తేల్చిచెప్పడంతో న్యాయస్థానం ముందు అటెండ్ అయ్యారు. అయితే, సీబీఐ దాఖలు చేసిన 11 ఛార్జిషీట్లు సహా ఈడీ నమోదు చేసిన 6 అభియోగ పత్రాలపై విచారణ జరిపిన న్యాయస్థానం... తదుపరి విచారణను జనవరి 17కి వాయిదా వేసింది. అయితే, డిశ్చార్జి పిటిషన్లన్నీ కలిపి విచారణ జరపాలన్న జగన్ పిటిషన్‌పైనా వాదనలు జరిగాయి. ఇరువర్గాల వాదనలు ముగియడంతో నిర్ణయాన్ని కూడా జనవరి 17కే వాయిదా వేసింది. అయితే, ముఖ్యమంత్రిగా ప్రజా విధుల్లో ఉన్నందున ఈడీ కేసుల్లో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని మరో పిటిషన్‌లో జగన్మోహన్‌రెడ్డి అభ్యర్ధించడంతో ఎన్‌‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ అధికారులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. తీవ్రమైన ఆర్ధిక నేరాలు కావడంతో నిందితులకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వొద్దంటూ కోర్టును కోరింది ఈడీ. ఈ కేసులో ఇరువర్గాల వాదనలు పూర్తవడంతో తీర్పును జనవరి 24కి వాయిదా వేసింది.

జగన్ ఆస్తుల కేసులో తెలంగాణ మంత్రికి సీబీఐ కోర్టు షాక్‌... 17న కోర్టుకు హాజరుకావాలని ఆదేశం

జగన్ అక్రమాస్తుల కేసులో తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఏపీ మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి సీబీఐ కోర్టు షాకిచ్చింది. పెన్నా సిమెంట్స్ వ్యవహారంలో అనుబంధ ఛార్జిషీటును సీబీఐ కోర్టు స్వీకరించింది. రెండేళ్ల క్రితమే అడిషనల్‌ ఛార్జి షీటును దాఖలు చేసినప్పటికీ హైకోర్టు స్టే విధించడంతో విచారణ నిలిచిపోయింది. అయితే, తాజాగా పెన్నా సిమెంట్స్ వ్యవహారంలో అనుబంధ ఛార్జిషీటును స్వీకరించిన సీబీఐ కోర్టు... సబితా ఇంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావు, ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి... అలాగే, రిటైర్డ్ అధికారులు శామ్యూల్‌, వీడీ రాజగోపాల్‌కు సమన్లు జారీ చేసింది. వాస్తవానికి, పెన్నా వ్యవహారంలో రెండేళ్ల క్రితమే సీబీఐ ఛార్జిషీటు దాఖలు చేసింది. అయితే, వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సహా నిందితులంతా అనుబంధ ఛార్జిషీటును స్వీకరించవద్దంటూ వాదించారు. అయితే, తమకున్న సమాచారంలో మొదటి ఛార్జిషీట్ దాఖలు చేశామని, ఆ తర్వాత మరిన్ని వివరాల ఆధారంగా అనుబంధ ఛార్జిషీట్ చేశామని సీబీఐ వివరించింది. చట్ట ప్రకారం ఎప్పుడు కీలకాంశాలు వెలుగులోకి వచ్చినా ఛార్జిషీటు దాఖలుచేసే వెసులుబాటు దర్యాప్తు సంస్థలకు ఉందని తెలిపింది. అయితే, ఇప్పటికే దర్యాప్తు పూర్తయిందని తెలిపిన సీబీఐ.... పాత ఛార్జిషీటులో ఉన్న విషయాలనే మళ్లీ ప్రస్తావిస్తూ మరికొందరిని నిందితులుగా చేర్చడం సమంజసం కాదంటూ జగన్ సహా నిందితుల తరపు లాయర్లు వాదించారు. అయితే, నిందితుల తరపు న్యాయవాదుల వాదనలను తోసిపుచ్చిన సీబీఐ కోర్టు.... అనుబంధ ఛార్జిషీటును విచారణకు స్వీకరించి సమన్లు ఇష్యూ చేసింది. అనంతపురం, తాండూరు, ఇతర ప్రాంతాల్లో పెన్నా సిమెంట్స్‌కు జరిగిన గనుల కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయని సీబీఐ అభియోగాలు నమోదు చేసింది. అప్పటి గనులశాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి, అలాగే ఆనాటి రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు సహా పలువురు అధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని సీబీఐ ఆరోపిస్తోంది. అవినీతి నిరోధక చట్టం ప్రకారం వీళ్లంతా నేరానికి పాల్పడ్డారని అనుబంధ ఛార్జిషీటులో సీబీఐ అభియోగాలు నమోదు చేసింది. దాంతో, తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఏపీ మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి... అలాగే, రిటైర్డ్ అధికారులు శామ్యూల్‌, వీడీ రాజగోపాల్ తదితర నిందితులందరూ జనవరి 17న తప్పనిసరిగా కోర్టుకు హాజరుకావాలంటూ ఆదేశించింది.

రాజధాని వివాదంపై పవన్ సంచలన వ్యాఖ్యలు... కేంద్రం కల్పించుకోవాలని డిమాండ్‌....

అమరావతి రైతులు, మహిళల ఆందోళనలకు జనసేనాని పవన్ కల్యాణ్‌ సంఘీభావం తెలిపారు. విజయవాడ పార్టీ కార్యాలయంలో గుంటూరు జిల్లా జనసేన నేతలతో సమావేశమైన పవన్‌ను అమరావతి రైతులు కలిసి మద్దతు కోరారు. ఈ సందర్భంగా రాజధాని రైతులతో సమావేశమైన జనసేనాని.... రాజధాని తరలింపపై కీలక వ్యాఖ‌్యలు చేశారు. ఏపీ రాజధాని వివాదంలో కేంద్రం పెద్దన్న పాత్ర పోషించాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. అలాగే, రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలతో కేంద్రం అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. విభజన చట్టం ప్రకారం రాజధాని విషయంలో కేంద్రానికి బాధ్యత ఉందని జనసేనాని గుర్తుచేశారు. అలాగే, ఏపీ రాజధాని వివాదంపై బీజేపీ, కాంగ్రెస్‌ తమ వైఖరి చెప్పాలని డిమాండ్ చేశారు. రాజధానికి భూములిచ్చిన రైతులు... తమకు అన్యాయం జరుగుతుందని పెద్దఎత్తున ఆందోళన చేస్తున్నారని.... వాళ్లకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. భూములిచ్చిన రైతులతో ప్రభుత్వం చర్చించి సరైన నిర్ణయం తీసుకోవాలని సూచించారు.

నొప్పి ఉన్నచోటే మందు రాయాలి... తలనొప్పి వచ్చిందని తలే తీసేస్తారా?

ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి... కోర్టు బోనులో నిలబడి ఆంధ్రాకు తలవంపులు తీసుకొచ్చారంటూ మండిపడ్డారు. జయలలిత తర్వాత ముఖ్యమంత్రి హోదాలో బోనులో నిలబడింది ఒక్క జగనే అన్నారు. ఇది, ఆంధ్రప్రదేశ్‌‌కు ఎంతో సిగ్గుచేటంటూ అశోక్ నిప్పులు చెరిగారు. ఏపీలో శుక్రవారానికి ఒక ప్రత్యేకత ఉందన్న అశోక్ గజపతిరాజు... సాక్షాత్తు ముఖ్యమంత్రే ప్రతి శుక్రవారం కోర్టు బోనులో నిల్చుంటే.... ఆంధ్రుల పరువు పెరుగుతుందా? పోతుందా? అంటూ ప్రశ్నించారు. ఇక, మూడు రాజధానులు వద్దు... అమరావతే ముద్దు అంటూ విజయనగరంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి టీడీపీ, సీపీఐ, సీపీఎం, ఆమ్ ఆద్మీతోపాటు లోక్‌సత్తా, ప్రజాసంఘాలు హాజరయ్యాయి. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అమరావతిని స్వాగతించిన జగన్... ఇప్పుడు మూడు రాజధానులు అనడం సరికాదని అశోక్ గజపతిరాజు అన్నారు. అమరావతిని కాపాడుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజలందరిపైనా ఉందన్నారు. జగన్ పరిపాలన చూస్తుంటే... మొఘలుల పాలన గుర్తొస్తుందని అన్నారు. రాజధానులను మార్చడం మంచి సంస్కృతి కాదన్న అశోక్ గజపతిరాజు.... అమరావతి నుంచి కేపిటల్‌ను తరలించే శక్తి ఎవరికీ లేదన్నారు.  అయినా, తలనొప్పి వస్తే మాత్ర వేసుకోవాలని, కానీ తలే తీసేస్తానంటే కుదురుతుందా? అంటూ అశోక్ ప్రశ్నించారు. నొప్పి ఉన్నచోటే మందు రాయాలే కానీ... మొత్తం ఆ భాగాన్నే తీసేస్తాననడం సరికాదని సీఎం జగన్ కు అశోక్ గజపతిరాజు సూచించారు.

అమరావతి మహిళలపై పోలీసుల దౌర్జన్యం... లాఠీఛార్జ్‌పై ఎన్‌హెచ్‌ఆర్సీ సీరియస్‌...

రాజధానిపై ఆందోళనలు ఉగ్రరూపం దాల్చుతున్నాయి. మూడు రాజధానులు వద్దు... అమరావతే ముద్దు అంటూ రాజధాని రైతులు, మహిళలు పెద్దఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. ఎక్కడికక్కడ ధర్నాలు, రాస్తారోకోలతో హోరెత్తిస్తున్నారు. దాంతో, అమరావతి గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. అయితే, అమరావతి నుంచి విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి రాజధాని మహిళలు తలపెట్టిన పాదయాత్ర తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. పాదయాత్రకు అనుమతి లేదంటూ తుళ్లూరులో మహిళలను పోలీసులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. దాంతో, పోలీసులకు వ్యతిరేకంగా మహిళలు పెద్దఎత్తున నినాదాలు చేశారు. అయితే, తాము... ప్రభుత్వంపై యుద్ధం చేయడానికి వెళ్లడం లేదని... కేవలం దుర్గమ్మను దర్శించుకోవడానికే వెళ్తున్నామంటూ మహిళలు... పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అదే సమయంలో, కొందరు మహిళలు... పోలీసులను, బారికేడ్లను దాటుకుని ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ఈ లాఠీఛార్జ్‌లో పలువురు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు.  అయితే, అమరావతి మహిళలపై లాఠీఛార్జ్‌ను జాతీయ మహిళా కమిషన్ తీవ్రంగా పరిగణించింది. లాఠీఛార్జ్‌ను సుమోటోగా స్వీకరించిన జాతీయ మహిళా కమిషన్... పోలీసులకు నోటీసులు పంపింది. అలాగే, తుళ్లూరులో మహిళలపై పోలీస్ చర్యపై నిజనిర్ధారణ కోసం రేపు అమరావతికి కమిటీని పంపుతున్నట్లు ఎన్‌హెచ్‌ఆర్సీ ఛైర్ పర్సన్ రేఖాశర్మ తెలిపారు.

మునిసిపల్ ఎన్నికల పోరు.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ జోరు!!

గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న 10 నియోజకవర్గాల్లో.. కేవలం ఒక్కటంటే ఒక్కటి మాత్రమే అధికార టీఆర్ఎస్ దక్కించుకుంది. ఆ తరువాత జరిగిన పార్లమెంట్ స్థానిక ఎన్నికల్లో మాత్రం టిఆర్ఎస్ విజయ డంఖా మోగించింది. తాజా మున్సిపల్ ఎన్నికల్లో పరిస్థితి ఎలా ఉంటుందోననే ఆందోళన గులాబీ పార్టీలో నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటే వచ్చినప్పటికీ ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్లేట్ ఫిరాయించి టీఆర్ఎస్ బలాన్ని పెంచారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో ఐదు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల భారమంతా మంత్రి అజయ్ కుమార్ మీదనే ఉంది. జిల్లాలో కాంగ్రెస్ నాయకత్వం బలహీనంగా ఉండటం టిఆర్ఎస్ కు కలిసొచ్చే అంశంగా మారింది.  గత మున్సిపల్ ఎన్నికల్లో నాలుగు మున్సిపాలిటీల్లో కలిపి 97 వార్డులు ఉంటే వాటిలో కేవలం ఐదు వార్డుల్లోనే టీఆర్ఎస్ గెలుపొందింది. ఇల్లెందులో మూడు, మధిరలో ఒకటి, కొత్తగూడెంలో మరొకటి కలిపి ఐదింటిని దక్కించుకుంది. సత్తుపల్లిలో ఒక్క వార్డు కూడా గెలవలేకపోయింది. అయితే నాలుగు మున్సిపాలిటీలను ఫిరాయింపుదారుల సహకారంతో టిఆర్ఎస్ కైవసం చేసుకుంది. మధిరలో కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థి చైర్ పర్సన్ గా ఎన్నికయ్యారు. అయితే ఆ తరువాత ఆమె కూడా టిఆర్ఎస్ కండువా కప్పేసుకుంది. మధిర సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కోట, ఇక్కడ భట్టిని ఓడించేందుకు జెడ్పీ చైర్మన్ కమల్ రాజ్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. కాంగ్రెస్ ను ఓడించేందుకు టిడిపితో కలసి పోటీ చేయడానికి టిఆర్ఎస్ ప్రయత్నించి విఫలమైందని సమాచారం. దీంతో టిడిపి, కాంగ్రెస్ కలిసి పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది.  సత్తుపల్లిలో గత ఎన్నికల్లో ఒక్క వార్డు కూడా గెలవలేకపోయింది. టిడిపి నుంచి చైర్ పర్సన్ గా దొడ్డాకుల స్వాతి ఎన్నికయ్యింది. ఆ తరువాత ఈమె కూడా టిఆర్ఎస్ లో చేరిపోయింది. ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కూడా టీఆర్ఎస్ వైపే ఉండటంతో ఇక్కడ గులాబీ పార్టీ గుబాళించడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. కొత్తగూడెంలో గత ఎన్నికల్లో ఒక్క వార్డు మాత్రమే దక్కించుకుంది. కాంగ్రెస్ పార్టీకి ఛైర్మన్ సీట్ దక్కింది. ఆ తరవాత వారు కూడా టిఆర్ఎస్ లో చేరి పోయారు. ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అంతంత మాత్రం గానే ఉంది. ఇక్కడ గెలుపు బాధ్యతను వనమా వెంకటేశ్వరరావుకు అప్పగించారు. జలగం వర్గీయుల సపోర్ట్ ఎవరికి ఉంటుందనేది ఇప్పుడు ఆసక్తి కలిగిస్తున్న అంశం. ఇల్లెందు మున్సిపాలిటీలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. గత ఎన్నికల్లో టిఆర్ఎస్ ఇక్కడ నాలుగు వార్డుల్లో గెలిచింది. ఆ తరువాత చైర్ పర్సన్ మడత రమాతో పాటు పలువురు టీఆర్ఎస్ లో చేరి పోయారు. ఇక్కడ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్, మడత రమా వర్గాల మధ్య పోరు సాగుతోంది. ఇక్కడ కూడా కాంగ్రెస్ ప్రభావం అంతంత మాత్రమే.  ఇక వైరా మున్సిపాలిటీకీ మోదటిసారి ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడ ఎమ్మెల్యే రాములు నాయక్ కు మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ మధ్య పోటీ తీవ్రంగా ఉంది. ఇరువర్గాలూ ఎన్నికల్లో బాహాబాహీకి సిద్ధమవుతున్న పరిస్థితి. ఇల్లెందు వైరాలలో ఆధిపత్య పోరును సద్దుమణిగించేందుకు మంత్రి పువ్వాడ ప్రయత్నిస్తున్నారు. ఐదు మున్సిపాల్టీల్లో గెలుపు బాధ్యత ఇప్పుడు మంత్రి పువ్వాడ పైనే ఉంది. ఎమ్మెల్యేలతో పాటు ప్రత్యర్థులను సమన్వయం చేసుకుంటూ పార్టీని గెలిపించడానికి మంత్రి తీవ్రంగా శ్రమిస్తున్నారు.

ఇంటికి ఒక్కరు చాలు.. అమరావతిని రాజధానిగా నిలుపుకునేందుకు బాబు పిలుపు

రాజధాని అమరావతి కోసం ప్రతి ఇల్లు ఉద్యమించాలని.. ప్రతి ఇంటి నుంచి ఒకరు ముందుకు రావాలని.. అందరూ సంఘటిత శక్తిగా మారాలని.. టిడిపి అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. రాజధానిని అమరావతి లోనే ఉంచాలి అంటూ అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ ఆధ్వర్యంలో  తొలిసారిగా మచిలీపట్నం, విజయవాడలో జరిగిన జేఏసీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ప్రజా రాజధానిని రక్షించేందుకు పార్టీలకు అతీతంగా అందరూ ఒకే వేదికపైకి వచ్చామని చంద్రబాబు అన్నారు. అమరావతి పరిరక్షణ సమితి అంటే సీఎం జగన్ భయపడుతున్నారని..అందుకే బస్సు యాత్రకు అన్ని అనుమతులు ఇచ్చి చివర్లో రూట్ పర్మిషన్ లేదంటూ పోలీసులను ఉసిగొలిపి అడ్డుకున్నారని దుయ్యబట్టారు.  ముందుగా ప్రజావేదికను కూల్చేశారన్నారు. అమరావతికి ముంపు భయం లేదని నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ చెప్పినా కూడా మునిగిపోతుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు తెలిపారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని తాను అమరావతిలో పెద్ద ఎత్తున భూములు కొన్నానని ప్రచారం చేశారన్నారు. హై కోర్టు న్యాయమూర్తితో విచారణ జరపాలంటే వెనుకడుగువేస్తున్నారు. ఎన్నికల ముందు అమరావతిలో చదరపు గజం రూ 30,000 పలికింది. తాను మళ్లీ వచ్చి ఉంటే లక్ష పలికేదని.. ఆ డబ్బుతోనే అమరావతిని బ్రహ్మాండంగా నిర్మించవచ్చని ఎద్దేవా చేశారు. ఇది ప్రజా రాజధాని దేవుళ్ల మొదలు ప్రజలందరి ఆశీస్సులు ఉన్నాయి. దానిని కదిలించే శక్తి ఎవరికీ లేదన్నారు. ప్రజా రాజధానిని రక్షించుకునేందుకు ఇంటికో వ్యక్తి బయటికి వస్తే.. మనమందరం కలిసి కట్టుగా ఉద్యమిస్తే జగన్ తోక ముడుస్తారని అన్నారు. ఆయన తీరుతో బయటి రాష్ట్రాల్లో మన పరువు పోతుందన్నారు. ఆంధ్ర ప్రజల బతుకు మూడుముక్కలాటయిందని ఇతర రాష్ర్టాల ప్రజలు నవ్వుతున్నారు. అమరావతి కోసం ఉద్యమించే వారిపై తన పత్రిక ద్వారా బురద చల్లుతున్నారని తెలియజేశారు. రాజధానిపై రెఫరెండం పెట్టి.. దమ్ముంటే మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలవండి.. అప్పుడు మీ ఇష్టం వచ్చిన చోట రాజధానులు పెట్టుకోవాలి అన్నారు.  మంత్రి పేర్ని నాని, పవన్ కళ్యాణ్ ను పవన్ నాయుడు అని సంబోధిస్తున్నారు. మరీ ఆయనేమన్నా నాని రెడ్డా పవన్ స్వశక్తితో ఎదిగిన వాడు. ఆయన వ్యక్తిగత జీవితంపై బురద జల్లుతున్నారు. ఉన్న ఊరి నుంచి రాజధాని తరలిపోతుంటే ఎవరైనా పోరాడతారని అన్నారు. కానీ మంత్రి పేర్ని నానికి ఇక్కడ రాజధాని ఉండటం ఇష్టం లేనట్లే ఉంది.. అందుకే సిగ్గులేకుండా హైపవర్ కమిటీలో సభ్యుడిగా ఉన్నారు. తాను ఒక పిలుపు ఇస్తే అమరావతి రైతులు 33,000 ల ఎకరాలను రాజధాని కోసం స్వచ్ఛందంగా ఇచ్చారన్నారు.  విశాఖ నీతి నిజాయితీ ఉండేవాళ్ల నగరం.. అక్కడ అరాచకాలు సృష్టించేందుకు వైసీపీ నాయకులు బయలుదేరారు అని చంద్రబాబు అన్నారు. హుద్ హుద్ ముందు హుద్ హుద్ తర్వాత విశాఖ ఎలా ఉందో అక్కడ ఎవరిని అడిగినా చెబుతారని అన్నారు. దానిని టెక్నాలజీ హబ్ గా, ఫార్మా హబ్ గా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిదే అన్నారు. మచిలీపట్నంలో జరిగిన బహిరంగ సభకు అధికారులు అవంతరాలు సృష్టించేందుకు ప్రయత్నించారు. విద్యుత్ సరఫరాను నిలిపేశారు. సభలో చంద్రబాబు ప్రసంగిస్తూ ఇలాంటి చర్యలతో ఉద్యమాన్ని ఆపలేరన్నారు. సభకు వచ్చిన వారందరు తమ సెల్ ఫోన్లలో ఉన్న లైట్ ను వెలిగించాలని పిలుపునిచ్చారు. దీంతో ఒక్కసారిగా సభా ప్రాంగణం వద్ద సెల్ ఫోన్ లైట్ల వెలుగుతో నిండిపోయింది.

దేశంలో ఇప్పటివరకు ఎంతమందిని ఉరితీశారు? నిర్భయ దోషులను ఉరి తీస్తారా? లేదా?

నిర్భయ దోషులను ఉరి తీయనున్న నేపధ్యంలో మరణశిక్షల అమలు మరోసారి తెరపైకి వచ్చింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మన దేశంలో ఒక వెయ్యి పద్నాలుగు  మందిని ఉరి తీశారు. అయితే, నేషనల్‌ క్రైం రికార్డులను పరిశీలిస్తే గత 15ఏళ్లలో నాలుగు ఉరి శిక్షలు మాత్రమే అమలు అయ్యాయి. 2003-18 డిసెంబర్‌  మధ్య కాలంలో కోర్టులు ఏకంగా 400 మందికి ఉరి శిక్షలు విధించాయి. వీరిలో  నలుగురు మాత్రమే ఉరికంభం ఎక్కారు. గత 15ఏళ్లలో  మరణ దండన విధించిన కేసుల్లో కేవలం ఒక్క శాతం మందినే ఉరితీసినట్లు గణాంకాలను బట్టి తెలుస్తోంది ఒక టీనేజ్‌ అమ్మాయిని అత్యాచారం చేసి చంపిన 44ఏళ్ల వాచ్‌మెన్‌ ధనుంజయ్‌ ఛటర్జీని 2004 ఆగస్టు 14న బెంగాల్‌లోని ఆలీపూర్‌ జైల్లో ఉరి తీశారు. 2008 ముంబై దాడుల్లో సజీవంగా పట్టుపడ్డ కసబ్‌ను 2012 నవంబర్‌లో పూణె ఎర్రవాడ జైల్లో ఉరి తీశారు. పార్లమెంట్‌పై దాడి కేసులో 2013 ఫిబ్రవరి 9న అఫ్జల్‌ గురును తీహార్‌ జైల్లో ఉరి తీశారు. గత 15 ఏళ్లలో ఉరి కంభం ఎక్కిన నాలుగో వ్యక్తి యాకూబ్‌ మెమెన్‌. అయితే, కోర్టులు విధించిన 1200 మరణ శిక్షలను ఉన్నత న్యాయస్థానాలు యావజ్జీవ ఖారాగార శిక్షలుగా మార్చాయి. ఘోరమైన నేరాలకు పాల్పడిన ఈ దోషులకు శిక్ష తగ్గిస్తే ప్రజలు క్షమించరనే భయంతో నలుగురిని మాత్రమే ఉరితీశారు. చాలా ఏళ్ల తర్వాత ఇప్పుడు నిర్భయ దోషులందర్నీ ఒకేసారి ఉరి తీయనున్నారు. ఢిల్లీలో నిర్భయపై దారుణంగా గ్యాంగ్ రేప్ చేసి, పాశవికంగా వ్యవహరించి ఆమె హత్యకు కారణమైన ఘటనలో వారిని ఉరికంభం ఎక్కించనున్నారు. ఈ మేరకు తీహార్ జైల్లో నాలుగు ఉరికంభాలను అధికారులు సిద్ధం చేశారు. ఆ ఉరికంభాలతో పాటు నాలుగు సొరంగాలను కూడా నిర్మించారు. నిర్భయ దోషులైన పవన్, ముఖేశ్ సింగ్, అక్షయ్ ఠాకూర్, వినయ్‌కి ఒకేసారి ఉరిశిక్ష అమలు చేయనున్నారు. మరోవైపు చాలా మంది రాష్ట్రపతి క్షమాభిక్షను అభ్యర్థిస్తుండటం వల్ల మరణదండన అమలులో జాప్యం జరుగుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.  దేశవ్యాప్తంగా వివిధ కేసుల్లో మరణశిక్ష ఖరారైన  దోషులు రాష్టప్రతి క్షమాభిక్ష పెడితే జీవితాంతం జైలులో గడిపేయవచ్చునని ఎదురు చూస్తున్నారు.  కొన్ని దేశాల్లో అమలవుతున్న మరణశిక్షలను  పరిశీలిస్తే విస్మయాన్ని కలిగిస్తాయి. చైనాలో  వెయ్యిమందికి మరణశిక్షను విధిస్తే అంతమందినీ ఉరితీశారు.  ఇరాన్‌లో 507 మందిని, సౌదీ అరేబియాలో 146 మందిని, ఇరాక్‌లో 125 మందిని, పాకిస్తాన్‌లో 60 మందిని, ఈజిప్టులో 35 మందిని, అమెరికాలో 23 మందిని, అఫ్ఘానిస్తాన్‌లో ఐదుగురిని, మలేషియాలో నలుగురిని, జపాన్‌లో నలుగురిని ఉరితీశారు. భారత్‌లో 2017లో ఒక్కరికి కూడా ఉరిశిక్షను విధించలేదు. ఇదిలా ఉంటే, ప్రపంచంలో 142 దేశాలు ఉరిశిక్షను రద్దు చేశాయి. 56 దేశాలు మాత్రమే ఉరిశిక్షను అమలు చేస్తున్నాయి. మన దేశంలో మరణశిక్ష విధించే చట్టాలు ఉన్నా, ఆ శిక్షలు అంతగా అమలు కావడం లేదు. గతంలో ప్రతిఏటా పదుల సంఖ్యలో ఉరి అమలు కాగా, ఇప్పుడు మాత్రం జాప్యం జరుగుతోంది.

కరీంనగర్ లో మంత్రుల ప్రతీకార ఆట... బెంబేలెత్తుతోన్న ప్రత్యర్ధులు

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మంత్రులు చేస్తోన్న వ్యాఖ్యలు టీఆర్‌ఎస్ లో కొందరికి నిద్ర లేకుండా చేస్తున్నాయి. ఒక్కో మంత్రి ఒక్కోలా స్పందించినా.....ముగ్గురి మాటల వెనకా...అర్ధం ఒకటే అనే చర్చ సాగుతోంది. ఏడాది కిందట జరిగిన ఘటనపై ఈ ముగ్గురు మంత్రులు సీరియస్‌గా ఉన్నారు. కొంతమంది చేసిన గాయానికి, వారు ఇప్పటికీ లోలోపల పగతో రగిలిపోతున్నారు. ఇంకా వేచి చూస్తే, మంచిది కాదనుకున్నారో  ఏమో గాని, ఇక అదను చూసి దెబ్బ కొట్టాలని డిసైడ్ అయ్యారు. ఈటెల రాజేందర్, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్. ఈ ముగ్గురు మంత్రులే ఇప్పుడు ప్రతీకారం తీర్చుకోబోతున్నారంటూ జిల్లాలో చర్చ స్టార్ట్ అయ్యింది. మున్సిపల్ ఎన్నికల సమావేశాల్లో మంత్రులు చేసిన వ్యాఖ్యలు కూడా అలానే ఉన్నాయంటూ సొంత పార్టీలో కార్యకర్తలు చెప్పుకుంటున్నారు. తమకు ద్రోహం చేసిన శత్రువు ఎవరో తెలిసినా, ఏడాది కాలంగా మౌనంగా ఉన్న మంత్రులు... ఇప్పుడు ఇంకా ఆలస్యం చేయకుండా తమ ఆపరేషన్ మొదలు పెట్టారు. దాంతో, కొంతమంది తెలిసి....మరికొంత మంది తెలియక నూతిలో పడ్డ ఎలుక మాదిరిగా ఆందోళన చెందుతున్నారని అంటున్నారు. ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలో ఉన్న మంత్రులకు, గెలుపు కంటే గుణపాఠాన్నే నేర్పించాయి గత అసెంబ్లీ ఎన్నికలు. తమకు అనుచరులుగా ఉన్న వారంతా, తీరా సమయానికి వ్యతిరేకులుగా మారి, తమ నాయకలనే ఓడించే ప్లాన్ చేశారు. ఎన్నికల సమయంలో ఎవరినీ దూరం పెట్టలేని, అలాగే నిందించలేని పరిస్థితి. ఎలాగోలా ప్రజల మద్దతుతో విజయం సాధించి, సీనియారిటి, పార్టీ విధేయత కోటలో మంత్రి పదవులు సంపాదించుకున్నారు ఈటెల, కొప్పుల, గంగుల. వెన్నుపోటుదారుల సంగతి తేల్చేందుకు సిద్ధమయ్యారు మినిస్టర్లు.  గత ఎన్నికల్లో ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ భారీ మెజారిటీతో విజయం సాధిస్తాననే ధీమాతో ఉన్నారు. మంత్రి పదవి ఎలాగైనా వస్తుందన్న జోష్‌లో ముమ్మర ప్రచారం చేశారు. తీరా సమయానికి ఈశ్వర్‌కి అనుకూలంగా ఉన్నవారంతా ఓ మాజీ ఎంపీకి సపోర్ట్ చేయడంతో, చావుతప్పి కన్ను లొట్టపోయినట్లు విజయం సాధించారు. అప్పటి వరకు అందరినీ గుడ్డిగా నమ్మిన ఈశ్వర్, ఇప్పుడు తన మార్క్ రాజకీయాలు చేస్తూ...ద్రోహులను హడలెత్తిస్తున్నారు. ఇక ఈటెల రాజేందర్. తనను ఓడించడానికి సొంతపార్టీలో వున్న చాలామంది ట్రై చేశారని, ఇప్పటికీ రగిలిపోతున్నారాయన. పదవుల కోసం ఈటెల చుట్టూ తిరగడం... పదవులు రాగానే ఈటెలకు తలనొప్పిగా మారడం హుజూరాబాద్ రాజకీయాల్లో సాధారణమైంది. నమ్మక ద్రోహం చేసిన వారికి మున్సిపల్ ఎన్నికల్లో టికెట్లు ఇవ్వడం కుదరదంటూ బహిరంగంగానే చెప్పేశారు ఈటెల. ఇక, నమ్మిన వారే వెన్ను పోటు పొడిచారని ఆగ్రహంతో వున్నారు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌. ప్రజల్లో ఉన్న ఆదరాభిమానాలు, టీఆర్ఎస్‌ మీద ఉన్న విశ్వాసంతో గెలిచి మంత్రి పదవి దక్కించుకున్నానని అంటున్నారు గంగుల. నాడు తనకు వ్యతిరేకంగా పని చేసిన వారి ఆటకట్టించే పని మొదలుపెట్టారట. ముగ్గురు మంత్రులకీ మున్సిపల్ ఎన్నికల రూపంలో, ఒక మంచి ఆయుధం దొరికినట్టయ్యింది. నమ్మకద్రోహం చేసినవారిని పక్కకు పెట్టే అవకాశాన్ని కల్పించాయి పోల్స్. వ్యతిరేకులు, నమ్మకద్రోహులు, వెన్నుపోటుదారుల కోటాలో లిస్ట్ తయారు చేసుకున్న మంత్రులు, వారికి టికెట్ ఇవ్వకుండా పొలిటికల్ దెబ్బ తీయడానికి ప్లాన్ చేశారట. మంత్రుల లిస్ట్‌లో ఎంతమంది ఉన్నారో తెలీదు గాని...పార్టీలో సీనియర్లుగా చెప్పుకునే వారిపై రాజకీయ వేటు పడే అవకాశం ఉంది.