కరోనాతో కలిసి బ్రతకాల్సిందే: సి.ఎం. కేసీఆర్
posted on May 5, 2020 @ 11:27PM
కరోనా సమస్య రేపో మాపో సమసిపోయేది కాదు. కాబట్టి కరోనాతో కలిసి జీవించాల్సిందేనని సి.ఎం. కేసీఆర్ అన్నారు. మన చేతిలో వున్న ఏకైక ఆయుధం లాక్డౌన్. ఉపాయంతో మనల్ని మనమే రక్షించుకోవాలి. కరోనా సమస్య ఇప్పట్లో సమసిపోదు. కేంద్ర మార్గదర్శకాలను తూచ తప్పకుండా కఠినంగానే అమలు చేస్తున్నాం. రేపటినుంచి భూముల కొనుగోళ్ళు, అమ్మకాలకు అనుమతి ఇచ్చాం. రిజిస్ట్రేషన్ కార్యాలయాలు, ఇసుక మైనింగ్ ప్రారంభిస్తున్నట్లు సి.ఎం. తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాలన్నీ పూర్తి స్థాయిలో పనిచేస్తాయని సి.ఎం. తెలిపారు.
హైకోర్టు ఆదేశాల ప్రకారం పదవతరగతి పరీక్షలు పూర్తి చేస్తాం. రేపటి నుంచి ఇంటర్ స్పాట్ వ్యాల్యూయేషన్ ప్రారంభిస్తాం.
65 ఏళ్ళు దాటిన వారు, చిన్నపిల్లలు బయటికి రావద్దని సి.ఎం. విజ్ఞప్తి చేశారు. రెడ్జోన్లలో షాప్లు తెరిచే అవకాశం వుంది కానీ ఎట్టి పరిస్థితుల్లోను అనుమతి ఇవ్వడం లేదు. గృహనిర్మాణ యాక్టివిటీకి అనుమతి ఇచ్చాం. నిత్యావసరవస్తువుల షాపుల్ని అనుమతించామని సి.ఎం. తెలిపారు. షాపులన్నీ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తెరిచివుంటాయి.
చిల్లర రాజకీయాలు, చీప్ పాలిటిక్స్ కొంత మందికి అలవాటైపోయింది. ఉచిత వినోదం పంపే జోకర్లు, భఫూన్గాళ్ళని తెలంగాణా ప్రజలు వారిని చూసి నవ్వుకుంటున్నారని సి.ఎం. కేసీఆర్ ఎద్దేవా చేశారు. కనీసం ఏ సమస్యపై పోరాడాలనే తెలివి కూడా లేకుండా ఛండాలంగా వ్యవహరిస్తూ పనికిమాలిన ధర్నాలు చేస్తూ అభాసుపాలు కావద్దని కేసీఆర్ సూచించారు.
చిల్లరగాళ్ళ మాటల్లో పడి రైతులు భవిష్యత్ చెడగొట్టుకోవద్దని విజ్ఞప్తి చేశారు. రైతులు ఆలోచించండి. మాకు కమిట్మెంట్ వుంది. వంద శాతం రైతుల్ని ఆదుకుంటాం. రైతు బంధు యథాతథంగా కొనసాగిస్తాం సి.ఎం. భరోసా ఇచ్చారు.
రాజకీయ డ్రామాల్లో ఇరుక్కుంటే మీరే నష్టపోతారు. తెలంగాణాలో వున్నది రైతు రాజ్యం. చిల్లరగాళ్ళ రాజ్యం కాదు. రైతుసంక్షేమం పేదల సంక్షేమంలో రాజీ పడం. మే 15న మరోసారి సమీక్ష చేసి సడలింపుల విషయంలో నిర్ణయం తీసుకుంటామని సి.ఎం. తెలిపారు.