గాంధీ విగ్రహ ఘటనపై స్పందించిన ట్రంప్

నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ ‌ను పోలీస్ హత్య చేయడంతో.. అమెరికా జాత్యహంకార వ్యతిరేక నిరసనలతో అట్టుడికింది. జార్జ్ ఫ్లాయిడ్ హత్యకి వ్యతిరేకంగా చాలామంది రోడ్లపైకి వచ్చి ఆందోళనలు, నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఈ క్రమంలో భారత జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహాంపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. భారత రాయబార కార్యాలయం వద్దనున్న గాంధీ విగ్రహానికి రంగు పులిమారు, విగ్రహంపై అభ్యంతరకర రాతలు రాశారు. తాజాగా ఈ ఘటనపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దీన్ని అవమానకరమైన చర్యగా ఆయన పేర్కొన్నారు. కాగా, ఇప్పటికే గాంధీ విగ్రహంపై దుండగుల దుశ్చర్య విషయంలో భారత్‌ను అమెరికా క్షమాపణలు కోరింది. విగ్రహ పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటామని కూడా హామీ ఇచ్చింది.

రేప్ కేసులో సాక్షాత్తు కలెక్టర్... ప్రస్తుతం పరారీలో

ఛత్తీస్ గడ్ లో ఒక 33 ఏళ్ల మహిళ తాను నిర్వహిస్తున్నఎన్జీవో ఫండ్స్ కోసం జాన్జ్ గిర్ - చంప జిల్లాల కలెక్టర్ గా పని చేస్తున్న జనక్ పాఠక్ ను గత నెల కలవడం జరిగింది. ఐతే ప్రస్తుతం మా దగ్గర ఫండ్స్ లేవు.. ఉన్నపుడు కాల్ చేస్తా అని చెప్పి ఆమె పర్సనల్ నంబర్ తీసుకున్నాడట. ఐతే తాజాగా ఆ మహిళ ఆ కలెక్టర్ పై రేప్ కేసు పెట్టింది.  విషయం ఏంటంటే ఆమె పర్సనల్ నంబర్ తీసుకున్న కలెక్టర్ గారు కొద్దీ రోజుల క్రితం ఆమెకు కాల్ చేసి సాయంత్రం 5 గంటలు దాటిన తరువాత ఆఫీసుకు వచ్చి కలవాలని చెప్పారట. దానికి ఆమె 5 గంటల తరువాత మీ ఆఫీసు పని చేస్తుందా అని అడగగా నార్మల్ గా మా ఆఫీసు పనిని 5 గంటలకే ముగిస్తాం ఐతే మీది ఎన్జీవో కాబట్టి మీకోసం ప్రత్యేకంగా పని చేయాలని డిసైడ్ అయ్యాం అని చెప్పడం తో ఆమె వెళ్లి కలిసింది. ఐతే కలెక్టర్ గారు ఆమె నిర్వహించే ఎన్జీవో గురించి ఆరా తీస్తున్నట్లు నటిస్తూ ఆమె దగ్గరకు చేరి అసభ్యంగా ప్రవర్తిస్తూ కలెక్టర్ కార్యాలయం లోనే రేప్ చేసాడని ఆమె ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనికి సాక్ష్యంగా ఆమె కలెక్టర్ తనతో మాట్లాడిన ఫోన్ కాల్ సంభాషణలను ప్రూఫ్ గా చూపించింది.  దీంతో కలెక్టర్ ను విచారించేందుకు పోలీసులు కలెక్టర్ ఇంటికే వెళ్లగా అయన కనిపించక పోవడంతో విచారణకు తమ ముంచు హాజరవ్వాలని ఇంటికి నోటీసులు అంటించి వచ్చారు. ఆ కలెక్టర్ కోసం చాల ప్రాంతాల్లో వెతికినా ఫలితం లేకపోవడం తో అయన పరారీలో ఉన్నాడని డిసైడ్ అయ్యారు పోలీసులు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఆ కలెక్టర్ ను సస్పెండ్ చేసింది.

అసెంబ్లీని కూడా బ్లీచింగ్ పౌడర్ తో నింపేస్తారా

ఏపీ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 16 నుండి ప్రారంభం కావచ్చని వార్తలు వస్తున్నాయి. కరోనా కారణంగా ఇప్పటివరకు అసెంబ్లీ లో పూర్తీ స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టని కారణంగా ఇప్పుడు ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ బడ్జెట్ సెషన్ లో ఏడాది పాలనా వైఫల్యాల పైన సభలో జగన్ ప్రభుత్వాన్ని టీడీపీ నిలదీస్తుందని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తెలిపారు. గడచిన ఏడాది కాలంలో 80,000 కోట్లు అప్పు తెచ్చి రాష్ట్రాన్ని ఎంత అభివృద్ధి చేసింది చెప్పాలని అయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గత ఏడాది లో మొదటి పది నెలలు జగోనాతో  తరువాత రెండు నెలలు కరోనా తో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని అయన అన్నారు. 151 సీట్లు సాధించామన్న జగన్ కరోనా విషయంలో విఫలమయ్యారని అయన విమర్శించారు. రైతు కూలీలు, వలస కార్మికులు, వివిధ వృత్తుల వారికీ కేంద్రం ఇచ్చిన 1000 రూపాయల సాయానికి ఇతర రాష్ట్రాలు మరి కొంత జత చేసి ప్రజలకు పంచితే.. ఇక్కడ మాత్రం దానిలో కోత పెట్టి కేవలం 500 రూపాయలు ఇచ్చి అది కూడా తమ జేబుల నుండి ఇచ్చినట్లుగా బిల్డప్ ఇచ్చారని విమర్శించారు. ప్రభుత్వం ప్రజల గోడు పట్టించుకోకుండా సాండ్, వైన్, ల్యాండ్ స్కామ్ లతో వేల కోట్లను వెనకేసుకుంటున్నారని రామానాయుడు విమర్శించారు. దళితుల పై దౌర్జన్యాలు, దాడులు ఎక్కువయ్యాయని ఈ సందర్బంగా డాక్టర్ సుధాకర్, డాక్టర్ అనితారాణి, మాజీ ఎంపీ హర్ష కుమార్, ప్రొఫెసర్ ప్రేమానందం విషయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరును అయన ఎండగట్టారు. కరోనాను అడ్డుపెట్టుకుని తూతూమంత్రం గా అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామంటే చూస్తూ ఊరుకోమని అయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ముందుగా అసెంబ్లీ నిర్వహణ విషయం లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో స్పష్టం చేయాలని అయన ప్రభుత్వాన్ని కోరారు. కరోనా కు విరుగుడు పారాసిటమాల్, బ్లీచింగ్ పౌడర్ అన్నారని ఇపుడు శాసనసభను బ్లీచింగ్ పౌడర్ తో ముంచేత్తుతారా అని అయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సాక్షాత్తు కేంద్రం ఆదేశాలను, కోర్టు తీర్పులను ధిక్కరిస్తున్నారని జగన్ ప్రభుత్వాన్ని నిమ్మల విమర్శించారు.

అన్నదమ్ముల్లా ఉన్న మా మధ్య గొడవలు పెట్టాలని చూస్తున్నారు: లోకేష్

సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై టీడీపీ నేత నారా లోకేష్ విరుచుకుపడ్డారు. టీడీపీ అధ్యక్షుడిగా తాను పనికిరానా అంటూ లోకేష్ కన్నీరు పెట్టుకున్నారని, పార్టీ అధ్యక్షుని ఎంపికలో మనస్పర్థలు తలెత్తడంతో లోకేష్ తన తండ్రి చంద్రబాబుపై చెయ్యి చేసుకున్నారని.. ఇలా రకరకాలుగా మీడియాలో న్యూస్ వచ్చినట్టుగా ఎడిట్ చేసి కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అంతేకాదు, టీడీపీ ఎంపీ రామ్మోహన్‌ నాయుడి అభిమానుల పేరుతో ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి.. లోకేష్ కి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు. ఇవి కొందరు నిజమని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. "వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్ గారికి మ్యాటర్ వీక్ అనే విషయం పేటిఎమ్ బ్యాచ్ కి అర్థం అయిపోయింది. అందుకే 5 రూపాయిల చిల్లర కోసం తుప్పు పట్టిన బుర్రలకు పనిపెట్టి టిడిపి అధ్యక్షుడు ఎంపికలో నాయకుల మధ్య వివాదం అంటూ ఫేక్ అకౌంట్లతో రచ్చ చేస్తున్నారు." అంటూ ఎద్దేవా చేశారు. "అన్నదమ్ముల్లా ఉన్న నాకు,ఎంపీ రామ్మోహన్‌ నాయుడికి మధ్య గొడవలు పెట్టాలని ప్రయాస పడుతున్న పేటిఎం బ్యాచ్ ఆవేశానికి నా సానుభూతి. మీ ప్రయత్నాలు టిడిపి నాయకుల మధ్య బంధాన్ని మరింత బలపరుస్తున్నాయి. టిడిపిలో ప్రతి కార్యకర్తా అధ్యక్షుడితో సమానమే అని విషయం వైకాపా పేటిఎమ్ బ్యాచ్ కి గుర్తుచేస్తున్నాను." అని లోకేష్ పేర్కొన్నారు.

ఏపీలో బూట్ల కొలతల కోసం బడికి.. పిల్లల ప్రాణాలతో చెలగాటం!

కరోనా విజృంభిస్తోంది. ప్రజలు ఎవరికి వారు జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని, అనవసరంగా బయటకు రావద్దని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఏపీలో మాత్రం ఈ హెచ్చరికలను గాలికి వదిలేస్తున్నారు. బూట్ల కొలత పేరుతో విద్యార్థులను పాఠశాలలకు రప్పిస్తూ.. పిల్లల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. జగనన్న విద్యా కానుక లో భాగంగా ఏపీ ప్రభుత్వం విద్యార్థులకు బూట్లు ఇవ్వనున్న సంగతి తెలిసిందే. బూట్ల పంపిణీ చేయడానికి విద్యార్థులను స్కూళ్లకు రప్పించి పాదాల కొలతలు తీసుకోవాలంటూ ఇటీవల ఉత్తర్వులిచ్చారు. కరోనా కారణంగా స్కూళ్లు తెరవక పోయినా.. బూట్ల కొలత కోసం విద్యార్థులను పిలిపించారు. కొలతలు ఇవ్వడానికి విద్యార్థులంతా స్కూళ్లకు క్యూ కట్టారు. ఉపాధ్యాయులు పాదాల కొలతలను తీసుకుంటున్నారు. అయితే, కరోనా విజృంభిస్తోన్న వేళ.. ఇలా విద్యార్థులను గుంపులుగా స్కూళ్లకు రప్పించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

కాస్త ఊరట.. మూడు వాయిదాల్లో విద్యుత్‌ బిల్లులు

మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు.. అసలే కరోనా కష్టకాలంలో సంపాదన తగ్గి సామాన్యులు ఇబ్బంది పడుతుంటే, విద్యుత్‌ బిల్లులు షాకిస్తూ మరింత కష్టపెడుతున్నాయి. ఎప్పుడూ రానంతగా విద్యుత్‌ బిల్లులు చాలా ఎక్కువ మొత్తంలో వస్తుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దీనిపై విపక్షాలు ప్రభుత్వం మీద విమర్శలు గుప్పిస్తున్నాయి. అయితే తెలంగాణ ప్రభుత్వం మాత్రం కరెంట్ బిల్లింగ్ లో ఎక్కడ పొరపాటు లేదని స్పష్టం చేసింది. మామూలుగానే వేసవిలో విద్యుత్ వినియోగం పెరుగుతుందని, దానికితోడు లాక్ డౌన్ తో అందరూ ఇళ్లలో ఉండటంతో మరింత వినియోగం పెరిగిందని చెప్పుకొచ్చింది. అదీగాక, మూడు నెలల బిల్లు ఒకేసారి రావడంతో కూడా పెద్ద మొత్తంలాగా కనిపిస్తుందని తెలిపింది. ఇదిలాఉంటే, విద్యుత్‌ బిల్లుల చెల్లింపుపై తెలంగాణ సర్కార్ వినియోగదారులకు ఊరట కల్పించింది. మూడు నెలల బిల్లును వాయిదా పద్ధతిలో కట్టే అవకాశం ఇస్తున్నట్టు విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రకటించారు మార్చి, ఏప్రిల్‌, మే మాసాలకు జారీచేసిన బిల్లు మొత్తాన్ని 30శాతం, 40శాతం, 30శాతం చొప్పున మూడు వాయిదాల్లో చెల్లించే అవకాశం కల్పిస్తున్నామని మంత్రి తెలిపారు. తదుపరి మాసాల్లో జారీ అయ్యే బిల్లులతో పాటు వాయిదా మొత్తాన్ని కలిపి చెల్లించాలని, ఇందుకు 1.5 శాతం చొప్పున వడ్డీగా చెల్లించాలని చెప్పారు. కరోనా, లాక్‌డౌన్‌ కారణంగా ఆదాయం పడిపోయి, బిల్లులు చెల్లించలేని వారికోసమే ఈ అవకాశాన్ని ఇస్తున్నామని తెలిపారు. ఆన్‌లైన్‌ చెల్లింపులకు వాయిదాల వెసులుబాటు వర్తించదని, విద్యుత్‌ రెవెన్యూ కార్యాలయాల్లో నగదు చెల్లింపుదారులకు మాత్రమే ఈ అవకాశముంటుందని పేర్కొన్నారు.

హైకోర్టు ఆదేశాలను అమలు చేయడం అసాధ్యం!!

కరోనా వైరస్ వ్యాప్తి, నివారణ చర్యలు తదితర అంశాలపై తెలంగాణ సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, వైద్యఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంత కుమారి, కమిషనర్ యోగితా రాణా తదితరులు పాల్గొన్నారు. కరోనా విషయంలో వాస్తవ పరిస్థితికి, మీడియాలో జరుగుతున్న ప్రచారానికి ఏమాత్రం పొంతన లేదని అధికారులు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. కొన్ని మీడియా సంస్థలు, కొందరు వ్యక్తులు కావాలని తప్పుడు ప్రచారం చేసి, ప్రజలను గందరగోళ పరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గాంధీ ఆసుపత్రి కరోనా పేషంట్లతో కిక్కిరిసిపోతున్నదని కొందరు ప్రచారం చేస్తున్నారు. ఇది పూర్తిగా అబద్ధం. గాంధీ ఆసుపత్రిలో 2150 మందికి చికిత్స అందించే అవకాశం ఉంది. ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో కేవలం 247 మంది కరోనా పేషంట్లు మాత్రమే ఉన్నారని అధికారులు తెలిపారు. కరోనా సోకిన వారికి చికిత్స అందించడానికి అవసరమైన అన్ని రకాల సదుపాయాలు, పరికరాలు సిద్ధంగా ఉన్నాయని అధికారులు వివరించారు. పేషంట్లు ఎక్కువైతే చికిత్స అందించే ఏర్పాట్లు లేవని కూడా దుష్ప్రచారం చేస్తున్నారు. కానీ తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ పూర్తి సంసిద్ధంగా ఉంది. 9.61 లక్షల పీపీఈ కిట్లు, 14 లక్షల ఎన్-95 మాస్కులు సిద్ధంగా ఉన్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ సౌకర్యం కలిగిన బెడ్స్ 3600 సిద్ధంగా ఉన్నాయి. వెంటిలేటర్లు, టెస్ట్ కిట్లు, ఇతరత్రా పరికారలన్నీ సిద్ధంగా ఉన్నాయి. ఎంతమందికైనా చికిత్స అందించడానికి వైద్యశాఖ పూర్తి సంసిద్ధంగా ఉందని అధికారులు స్పష్టం చేశారు. వైద్యులకు, వైద్య సిబ్బందికి కరోనా సోకుతున్నదనే ప్రచారం చేసి ఆత్మస్థైర్యం దెబ్బతీయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని అధికారులు ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా సోకివారికి వైద్య సేవలు అందించేవారికి కూడా వైరస్ సోకుతున్నది. ఇది కేవలం తెలంగాణలోనే జరగడం లేదు. ఢిల్లీ ఎయిమ్స్ లో కూడా 480 మందికి కరోనా వైరస్ సోకింది. ఐసిఎంఆర్ అంచనా ప్రకారమే భారత్ లో 10వేల మంది వైద్యసిబ్బందికి కరోనా సోకింది. కేవలం తెలంగాణలో మాత్రమే వైద్య సిబ్బందికి కరోనా సోకుతున్నట్లు దుష్ప్రచారం చేయడం బాధాకరమని అధికారులు చెప్పారు. ఏ కారణంతో చనిపోయినా సరే, మరణించిన ప్రతీ ఒక్కరికీ కరోనా పరీక్షలు నిర్వహించాలన్న హైకోర్టు ఆదేశాలు అమలు చేయడం అసాధ్యమని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో వివిధ కారణాల వల్ల ప్రతీ రోజు సగటున 1000 మంది వరకు మరణిస్తుంటారు. వారందరికీ పరీక్షలు చేయడమే పనిగా పెట్టుకుంటే, ఆసుపత్రుల్లో ఇతర వైద్య సేవలు అందించడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. డబ్ల్యూహెచ్‌వో, కేంద్ర ప్రభుత్వం, ఐసీఎంఆర్‌లు మృతదేహలకు పరీక్షలు నిర్వహించాలని చెప్పలేదని అధికారులు గుర్తు చేశారు. కోర్టులో కొందరు కావాలనే పిల్స్ వేయడంవల్ల వైద్యాధికారులు కోర్టుల చుట్టూ తిరగాల్సివస్తోందన్నారు. పిల్స్ వేసి వైద్యాధికారుల సమయాన్ని వృథా చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. కాగా, కరోనావిషయంలో ఎవరికి వారు జాగ్రత్తగా ఉండాలే తప్ప, అనవసరంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. కరోనా వ్యాప్తి నివారణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదని, అదే సమయంలో ప్రజలు కూడా ఎవరికి వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తెలంగాణలో కరోనా కేసులు ఎక్కువైనా సరే, తగిన వైద్యం అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం స్పష్టం చేశారు.

భారత్ లో ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసులివే

భారత్‌లో రోజుకి 9 వేలకు పైగా కరోనా‌ కేసులు నమోదవ్వడం సాధారమైపోయింది. గత 24 గంటల్లో దేశంలో 9,987 మందికి కరోనా పాజిటివ్ గా తేలిందని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే. గత 24 గంటల్లో కరోనాతో 331 మంది మరణించారు. దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య  2,66,598కి చేరగా, మృతుల సంఖ్య 7,466కి చేరుకుంది. కరోనా నుంచి కోలుకొని ఇప్పటివరకు 1,29,215 మంది డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం 1,29,917 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 49,16,116 కరోనా టెస్ట్‌లు చేసినట్టు కేంద్రం ప్రకటించింది. గడిచిన 24 గంటల్లోనే 1,41,682 టెస్టులు నిర్వహించారు. ఇక, దేశంలో కరోనా రికవరీ రేటు 49 శాతంగా ఉంది.

సీఎం జగన్ తో సినీ ప్రముఖుల భేటీ!!

ఏపీ సీఎం వైఎస్ జగన్‌తో సినీ పెద్దలు భేటీ కానున్నారు. లాక్‌డౌన్‌ నిబంధనలకు సడలింపులు ఇచ్చిన నేపథ్యంలో సినిమా, టీవీ‌ షూటింగ్‌లకు అవకాశం ఇవ్వాలని చిత్ర పరిశ్రమ ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తోంది. ఈ నేపథ్యంలో సినీ పెద్దలు నేడు సీఎం జగన్ తో సమావేశం కానున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు సీఎం జగన్‌తో చిరంజీవి నేతృత్వంలోని సినీ బృందం భేటీ కానుంది. చిరంజీవితో పాటు నాగార్జున, రాజమౌళి, త్రివిక్రమ్‌, కొరటాల శివ, జీవిత, సి.కళ్యాణ్‌ తదితరులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. రాష్ట్రంలో సినిమా షూటింగ్ లకు అనుమతులు, థియేటర్లలో ప్రదర్శనలు వంటి అంశాలపై వారు సీఎం జగన్ తో చర్చించనున్నారు. కాగా, ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కొన్ని నిబంధనలతో షూటింగ్ లకు అనుమతినిచ్చింది. ఏపీ ప్రభుత్వం కూడా షూటింగ్ లకు అనుమతినిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే థియేటర్లలో ప్రదర్శనలకు మాత్రం ఇప్పుడే అనుమతినిచ్చే అవకాశం కనిపించడంలేదు.

కేరళ ఏనుగు ఘటనలో కొత్త కోణం

కేరళ రాష్ట్రంలో పేలుడు పదార్థాలు నింపిన పండు తిని గర్భంతో ఉన్న ఏనుగు మరణించిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనమైన సంగతి తెలిసిందే. ఏనుగు మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని పెద్ద ఎత్తున డిమాండ్స్ వినిపించాయి. అయితే ఇప్పుడు ఈ ఘటనలో కొత్త కోణం వెలుగు చూసింది. ఇది ఉద్దేశపూర్వకంగా చేసినది కాదని, ప్రమాదవశాత్తు జరిగిందని ప్రాథమిక విచారణలో తేలినట్లు కేంద్ర పర్యావరణ శాఖ తెలిపింది.  అడవి పందుల నుంచి పంటపొలాలలను కాపాడుకునేందుకు కొందరు స్థానికులు ఆ ప్రాంతంలో పేలుడు పదార్థాలతో కూడిన పండ్లను ఎరగా వేస్తారని, అటువంటి ఒక పండునే ఈ ఏనుగు తిన్నదని పర్యావరణ శాఖ పేర్కొంది. ఈ ఘటనకు సంబంధించి సోషల్‌ మీడియాలో వస్తున్న వదంతులను ప్రజలు నమ్మవద్దని పర్యావరణ శాఖ విజ్ఞప్తి చేసింది. ఈ విషయంలో ఎవరిదీ ఉద్దేశపూర్వక తప్పు లేదని, అయినప్పటికీ, నిందితులను వదిలేది లేదని స్పష్టం చేసింది. ఏనుగు మరణానికి కారణమైన వారిని అదుపులోకి తీసుకుని, కఠిన చర్యలు చేపట్టాలని ఆదేశించామని పర్యావరణ శాఖ తెలిపింది.

డాక్టర్‌ అనితారాణి వ్యవహారంపై సీఐడీ విచారణకు సీఎం ఆదేశం.. ఇంతలోనే ట్విస్ట్!!

తనను వైసీపీ నేతలు వేధిస్తున్నారంటూ చిత్తూరు జిల్లా పెనుమూరు ప్రభుత్వ డాక్టర్ అనితారాణి ఆరోపించిన సంగతి తెలిసిందే. కాగా, డాక్టర్‌ అనితారాణి వ్యవహారంలో సీఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఘటనపై నిజానిజాలేంటో తేల్చాలంటూ సీఐడీ దర్యాప్తుకు ఆదేశించారు. అయితే ఓ వైపు సీఎం ఆమె వ్యవహారంపై సీఐడీ దర్యాప్తుకు ఆదేశిస్తే, మరోవైపు వైద్య ఆరోగ్యశాఖ ఆమెను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియా వేదికగా వైద్య ఆరోగ్యశాఖపై అసత్య  ప్రచారం చేశారంటూ డాక్టర్‌ అనితారాణిని అధికారులు సస్పెండ్ చేశారు. అనితారాణి మానసిక స్థితి సరిగా లేదని చిత్తూరు జిల్లా వైద్యాధికారి పెంచలయ్య చెబుతున్నారు. ఇప్పటివరకు పనిచేసిన ప్రతిచోట తన తీరుతో వివాదాస్పదమయ్యారని, ఇప్పటికే పలుమార్లు సస్పెండ్‌ అయ్యారని తెలిపారు. అనితారాణిపై గతంలో అనేక ఫిర్యాదులు ఉన్నాయని, రోగులతో కూడా గొడవలు పెట్టుకునేవారని పెంచలయ్య తెలిపారు. గతంలో కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పని చేసినప్పుడు ఆరు నెలలకు మించి ఆమె ఎక్కడ పని చేయలేదని గుర్తు చేశారు. డాక్టర్‌ అనితారాణి ఆరోపణలు అవాస్తవమని పెంచలయ్య కొట్టిపారేశారు. అయితే అనితారాణి వ్యవహారంపై సీఎం సీఐడీ విచారణకు ఆదేశించిన తర్వాత.. ఆమెపై సస్పెన్షన్‌ వేటు వేయటం ఏమిటన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

టీడీపీ ఎమ్మెల్యేలు అందుకే పార్టీ మారలేదట

కొద్ది రోజుల క్రితం ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అధికార పార్టీ ఐన వైసిపిలోకి జంప్ అంటూ వార్తలు వచ్చాయి. ఒక పక్క మహానాడు జరగబోతుండగా మరో పక్క ఆ ఎమ్మెల్యేలు వైసిపి కీలక నేతలతో చర్చలు పూర్తయ్యాయి ఇక పార్టీ మారడమే.. అని వార్తలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. ఐతే తరువాత ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ మారడం లేదని కావాలనే కొంత మంది తమ పై కుట్ర చేస్తున్నారని మీడియా ముందు వివరణ ఇవ్వడం జరిగింది. ఐతే ఇది మహానాడు టైం లో కేవలం చంద్రబాబును ఇబ్బంది పెట్టే ఉద్దేశ్యం తో వైసిపి పార్టీ వేసిన ప్లాన్ మాత్రమేనని రాజకీయ విశ్లేషకులు చెపుతున్నారు. వైసిపికి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న నేపధ్యం లో ఆ పార్టీకి వేరే పార్టీ ఎమ్మెల్యేల తో పనేంటని వారు అంటున్నారు. ఐతే తమ పార్టీలోకి వచ్చే వారికీ ఎటువంటి రాచమర్యాదలు ఉండవని కేవలం వారి నియోజకవర్గం పనుల్లో ప్రభుత్వ సహకారం ఉంటుందని వైసిపి నేతలు చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇదే సమయం లో ఇప్పటికే టీడీపీ ని వీడి వైసిపిలో చేరిన వంశీ, మద్దాలి గిరి వంటి వారికి తమ నియోజక వర్గాల్లో ఆల్రెడీ ఉన్న పార్టీ నాయకుల హవా నడుస్తున్న నేపథ్యంలో వీరికి పెద్దగా ఒరిగిందేమి లేదని టాక్. దీంతో ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ మారే విషయం పక్కన పెట్టేశారని కూడా టాక్ వినిపిస్తోంది.

తెలంగాణ సర్కార్ పై హైకోర్టు సీరియస్

కరోనా పరీక్షల విషయంలో తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా పరీక్షలపై తమ ఆదేశాలు అమలు చేయడం లేదని హైకోర్టు మండిపడింది. ఆదేశాలు అమలు కాకపోతే వైద్య ఆరోగ్యశాఖ అధికారులపై ధిక్కరణ చర్యలు చేపడతామని, వైద్యారోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి, ప్రజారోగ్యశాఖ డైరెక్టర్‌ను బాధ్యుల్ని చేస్తామని హెచ్చరించింది. ఆస్పత్రుల్లో మరణిస్తే మృతదేహాలకూ పరీక్షలు చేయాలన్న ఆదేశాలు కూడా అమలు కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది.  అయితే, హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేశామని, విచారణ జరగాల్సి ఉందని ఏజీ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. సుప్రీంకోర్టులో విచారణ జరిగే వరకు హైకోర్టు ఆదేశాలను అమలు చేయాల్సిందేనని స్పష్టం చేసింది.  ప్రజలకు కరోనా ర్యాండమ్ టెస్టులు చేయడం లేదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తగినంత రక్షణ కిట్లు సరఫరా చేయనందుకే వైద్యులకు కరోనా సోకిందని అభిప్రాయపడింది. మీడియా బులెటిన్లలో తప్పుడు లెక్కలు ఇస్తే కోర్టు ధిక్కరణ చర్యలు చేపడతామని హెచ్చరించిన హైకోర్టు.. వాస్తవాలు తెలియకుంటే ప్రజలకు కరోనా తీవ్రత ఎలా తెలుస్తుందని ప్రశ్నించింది. ఈ నెల 17లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని వైద్యారోగ్యశాఖను హైకోర్టు ఆదేశించింది.

షూటింగ్ లకు తెలంగాణ సర్కార్ అనుమతి

తెలంగాణలో సినిమా, టీవీ షూటింగులు కొనసాగించుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీనికి సంబంధించిన ఫైలుపై సీఎం కేసీఆర్ సంతకం చేశారు. కోవిడ్ 19 మార్గదర్శకాలు, లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూ.. సినిమా, టీవీ షూటింగ్ లు కొనసాగించుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. పరిమిత సిబ్బందితో, ప్రభుత్వ మార్గదర్శకాలు పాటిస్తూ షూటింగులు నిర్వహించుకోవచ్చని, షూటింగులు పూర్తయిన వాటి పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా నిర్వహించుకోవచ్చని స్పష్టం చేశారు. అయితే, థియేటర్లు తెరిచేందుకు మాత్రం అనుమతి ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాల్సి ఉన్నందున థియేటర్లను ప్రారంభించడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది.

పది మంది ఎమ్మెల్యేలు గోడ దూకేస్తారట.. టీడీపీ ఎమ్మెల్యే సంచలనం 

కరోనా ధాటికి కొంత స్తబ్దుగా మారిన రాజకీయాలు తాజాగా టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే కరణ బలరాం వ్యాఖ్యలతో మళ్ళీ వేడెక్కాయి. తన కుమారుడిని వైసిపి లోకి పంపి ప్రస్తుతానికి ఎటు వైపు ఉన్నారో తెలియని సీనియర్ ఎమ్మెల్యే కరణం చంద్రబాబు పై విరుచుకు పడ్డారు. గతంలో చంద్రబాబు చేసిన నిర్ణయాలతో ఏపీ తీవ్రంగా నష్టపోయిందని విమర్శించారు. జగన ఏడాది పాలన ను విమర్శించినా ప్రజలు మాత్రం సీఎం జగన్ తోనే ఉన్నారని అయన అన్నారు. గత ఎన్నికలలో టీడీపీ ఓటమి పై ఇప్పటికయినా ఆ పార్టీ సమీక్షించుకోవాలని ఆయన అన్నారు. ప్రస్తుతం రాజకీయాలలో విలువలు లేవని ఐతే ఎమ్మెల్యేలు మాత్రం నియోజక వర్గ అభివృద్ధిపై దృష్టి పెడుతున్నారని ఆయన అన్నారు. త్వరలో 10 నుండి 12 మంది టీడీపీ ఎమ్మెల్యేలు గోడ దూకే ఛాన్స్ ఉందని ఈ సందర్బంగా అయన బాంబు పేల్చారు.

కేటీఆర్ కి రేవంత్ రెడ్డి సవాల్.. నేనే జేసీబీ నడిపి అక్రమ నిర్మాణం కూలగొడతా!!

జన్వాడలో అక్రమంగా ఫాంహౌస్ నిర్మాణం చేపట్టిన మంత్రి కేటీఆర్ ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారని, తప్పు చేసి దొరికిపోయాక కూడా ఏమాత్రం సిగ్గుపడడంలేదని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి విమర్శించారు. 111 జీవోను ఉల్లంఘించి కేటీఆర్‌ అక్రమ నిర్మాణం చేపట్టారని రేవంత్ ఆరోపించారు. ఆ స్థలం కేటీఆర్‌ లీజుకు తీసుకున్నారని బాల్క సుమన్‌ చెబుతున్నారని, అక్కడ తనకు భూమి లేదని కేటీఆర్‌ కూడా ట్వీట్‌ చేశారని రేవంత్ గుర్తుచేశారు. అయితే, జన్వాడ ఫాంహౌస్‌ 301 నుంచి 313 సర్వే నెంబర్లలో విస్తరించి ఉందన్న రేవంత్.. 301 సర్వే నెంబర్లో కేటీఆర్‌ సతీమణి పేరిట 3 ఎకరాలు ఉందని తెలిపారు. భూములు లేవని కేటీఆర్‌ పచ్చి అబద్దాలు ఆడుతున్నారన్నారని మండిపడ్డారు. కేటీఆర్‌ మంత్రి పదవి నుంచి తప్పుకోవాలని, లేదంటే బర్తరఫ్‌ చేయాలని రేవంత్‌ డిమాండ్ చేశారు. వట్టినాగులపల్లిలో తమకు భూములున్న మాట వాస్తవమేనన్నారు. తన అక్రమ నిర్మాణం ఎక్కడున్నా కూల్చడానికి సిద్ధమని.. మీరు సిద్ధమా? అని రేవంత్ ప్రశ్నించారు. తాను, తన బావమరిది వట్టినాగులపల్లిలో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నట్టు టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారని, ఆ భూముల్లో తాను అక్రమంగా ఒక్క అంగుళంలో నిర్మాణం చేపడుతున్నా కూలగొట్టేందుకు తాను సిద్ధమేనని, తన లాగా కేటీఆర్ కూడా అక్రమ నిర్మాణాలను కూలగొట్టగలరా? అని రేవంత్ సవాల్ విసిరారు. "వట్టినాగులపల్లి లో భవనమో, భవంతో ఉందన్నారు కదా. ఒకవేళ, అక్కడేదైనా అక్రమ నిర్మాణం ఉందంటే నేనే జేసీబీ నడిపి కూలగొడతా. ఆ తర్వాత జన్వాడ వెళదాం. మనిద్దరం ప్రజల ముందు పరీక్షకు నిలబడదాం" అంటూ కేటీఆర్ కు రేవంత్ సవాల్ విసిరారు.  ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పైనా రేవంత్ మండిపడ్డారు. ఆయన కొడుకు చేసిన అక్రమాలపై తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాలి అంటూ నిలదీశారు. తండ్రీకొడుకులు కల్లబొల్లి మాటలు చెప్పి, ప్రజల్ని బలిచేసి విలాసవంతమైన ఫాంహౌస్ లు నిర్మించుకొని పత్తిత్తుల్లాగ మాట్లాడుతున్నారు అంటూ కేసీఆర్, కేటీఆర్ లపై రేవంత్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

కరోనా ను జయించాడు.. కానీ పోలీసులు అరెస్ట్ చేసారు

ప్రపంచం మొత్తం కరోనా భయంతో వణుకుతోంది. ఎటు పక్క నుండి ఈ వైరస్ తలుపు తడుతుందోనని అందరు భయపడుతుంటే ఆ మహానుభావుడు మాత్రం కరోనా ను జయించిన ఆనందం లో ఊరేగింపు జరిపి పోలీసుల చేతికి చిక్కాడు. అసలు విషయంలోకి వస్తే బెంగుళూరు లోని పేదరాయణ పుర కార్పొరేటర్ కు కొద్దీ రోజులక్రితం కరోనా సోకింది. ఐతే ప్రభుత్వ ఐసోలేషన్ వార్డులో ఉంచి మంచి ఫుడ్ పెట్టి ట్రీట్మెంట్ ఇవ్వడంతో పూర్తిగా కోలుకున్నాడని వైద్యులు డిశ్చార్జ్ చేసారు. ఐతే కరోనా ను జయించిన ఆనందం లో అయన అనుచరులు పెద్ద ఊరేగింపుతో టపాసులు కాలుస్తూ ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఇప్పుడు అదే అయన పీకకు చుట్టుకొంది. లాక్ డౌన్ టైం లో సోషల్ డిస్టెన్స్ పాటించకుండా హడావిడి చేసినందుకు పోలీసులు అయన ను అరెస్ట్ చేసారు. అయినా ఇది కరోనా సమయం అని మరిచిపోయి ప్రవర్తిస్తే తరువాత పరిస్థితులు మన చేతుల్లో ఉండవని గ్రహించకపోతే పర్యవసానం ఇలాగే ఉంటుంది.

తెలంగాణలో మరిన్ని కరోనా పరీక్షలు చేయాలి: గవర్నర్ తమిళిసై

తెలంగాణలో కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం తన విధానాల్లో కొన్ని మార్పులు చేసుకోవాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ అభిప్రాయం వ్యక్తం చేసారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఆమె ఈ రోజు నిమ్స్ హాస్పిటల్ ను సందర్శించి అక్కడి పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఐసిఎంఆర్ నిబంధనల ప్రకారం పరీక్షలు చేస్తున్నప్పటికీ మరిన్ని పరీక్షలు చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని ఆమె తెలిపారు. కరోనా బారిన వైద్యులు మరియు సిబ్బందిని ఆమె స్వయంగా వెళ్లి పరామర్శిచారు. అక్కడ జరుగుతున్న ఏర్పాట్ల గురించి ఆమె అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం నిమ్స్ ను విఐపిలకు అలాగే వైద్యులకు మాత్రమే చికిత్స అందించే విధంగా ఇక్కడ ప్రత్యేక కోవిడ్ ఆసుపత్రిగా మారుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు నిమ్స్ లోని నలుగురు ప్రొఫెసర్లు, 8 మంది వైద్యులు, 8 మంది పారామెడికల్ సిబ్బంది కరోనా బారిన పడ్డారు. వీరితో డైరెక్ట్ కాంటాక్ట్ లో ఉన్న ఇతర వైద్యులు మరియు స్టాఫ్ ను క్వారంటైన్ లో ఉంచారు.