తిరగబడిన ట్రక్కు .. 16 మంది దుర్మరణం

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జలగావ్ జిల్లాలో  ఆదివారం  రాత్రి అరటిలోడుతో వెళ్తున్న ట్రక్కు  అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో  16 మంది దుర్మరణం పాలయ్యారు. మృతులందరూ కూలీలే. మృతుల్లో 8 మంది పురుషులు, ఆరుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు.  ప్రమాదంలో మరో ఐదుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను జలగావ్ జిల్లాలోని అభోడా, కేర్హళ, రావెర్ గ్రామాలకు చెందిన వారిగా గుర్తించారు. మహారాష్ట్రలోని ధూలే నుంచి రేవర్‌కు వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. అరటిలోడుతో వెళ్తున్న ట్రక్కు కింగ్వాన్ సమీపంలో అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాద సమయంలో మొత్తం 21 మంది కార్మికులు ఉన్నారు.  సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు. క్షతగాత్రులను రూరల్ ఆసుపత్రికి తరలించారు. నిర్లక్ష్యంగా వాహనం నడిపి ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కూలీలు చనిపోవడంతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. 

ప్రసంగిస్తూ కుప్పకూలిన సీఎం

పంచాయతీ ఎన్నికల సభలో ప్రసంగిస్తున్న ముఖ్యమంత్రి .. ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వేదికపైనే పడిపోయారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది, స్థానిక నాయకులు ముఖ్యమంత్రిని హాస్పిటల్ కు తరలించారు.  గుజరాత్ లో ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల జరుగుతున్నాయి. వడోదర సమీపంలోని నిజామ్ పురాలో జరిగిన సభకు సీఎం విజయ్ రూపాని హాజరయ్యారు. ఆయన సభలో  ప్రసంగిస్తూ ఒక్కసారిగా కుప్పకూలారు. ముఖ్యమంత్రి పడిపోవడంతో, బీజేపీ శ్రేణులు తీవ్ర ఆందోళనకు గురయ్యాయి. ఆయనకు వేదికపైగా ప్రథమ చికిత్స చేసి, వెంటనే అహ్మదాబాద్ కు తరలించి, ఆసుపత్రిలో చేర్చారు. గత రెండు రోజులుగా సీఎం విజయ్ రూపాని స్వల్ప అస్వస్థతతో ఉన్నారని చెబుతున్నారు. అయినా ఆయన  ముందుగా షెడ్యూల్ చేసుకున్న కార్యక్రమాలను రద్దు చేసుకోలేదని తెలుస్తోంది.  బాగా అలసి పోవడం వల్లే ఆయన స్పృహ తప్పారని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. మరో 24 గంటల పాటు అబ్జర్వేషన్ లో ఉంచుతామని వెల్లడించారు.

ఎమ్మెల్సీ కవితకు కొత్త పదవి 

ఇటీవలే ఎమ్మెల్సీగా ఎన్నికైన కల్వకుంట్ల కవిత... రాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ యాక్టివ్ అయ్యారు. ఆమెకు కొత్త పదవి వస్తుందని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. అది తాజాగా రుజువైంది. ఎమ్మెల్సీ కవిత కొత్త పదవి చేపట్టారు. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) గౌరవ అధ్యక్షురాలిగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సింగరేణిలో గుర్తింపు సంఘమైన టీబీజీకేఎస్‌కు అధ్యక్షుడిగా బి.వెంకట్రావు, ప్రధాన కార్యదర్శిగా మిర్యాల రాజిరెడ్డి మరోమారు ఎన్నికయ్యారు. శ్రీరాంపూర్ డివిజన్ సింగరేణి ఆఫీసర్స్ క్లబ్‌లో కంపెనీ స్థాయి యూనియన్ ప్రతినిధుల సమావేశం జరిగింది. అనంతరం ఎన్నికలు నిర్వహించారు. చర్చల అనంతరం పూర్తిస్థాయి కమిటీని ప్రకటించనున్నట్టు తెలిపారు. గతంలోనూ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) గౌరవ అధ్యక్షురాలిగా పని చేశారు. చివరి సారి జరిగిన సింగరేణి ఎన్నికల్లో ఆమె ఆధ్వర్యంలోనే టీబీజీకేఎస్ విజయం సాధించింది. అయితే గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం పదవికి కవిత రాజీనామా చేశారు.  టీబీజీకేఎస్ లో కీలక నేతగా ఉన్న నేత.. బీజేపీ అనుబంధ సంఘంలో చేరారు. ఇప్పుడు కవిత మళ్లీ యాక్టివ్ కావడంతో.. టీబీజీకేఎస్ కు దూరమైన నేతలను మళ్లీ ఆహ్వానించే యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. అంతేకాదు ఆర్టీసీలో బలమైన యూనియన్ గా ఉన్న టీఎంయూ బాధ్యతలు కూడా కవితే తీసుకోవచ్చనే చర్చ జరుగుతోంది. గతంలో ఈ సంఘానికి మంత్రి హరీష్ రావు గౌరవ అధ్యక్షురాలిగా ఉన్నారు. టీఎంయూ నేతలు కూడా ఇప్పటికే కవితతో టచ్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది.   

గంటా మరో సంచలనం! 

విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం తన  పదవికి రాజీనామా చేశారు విశాఖ ఉత్తర ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు. తాజాగా గంటా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన రాజీనామా వ్యక్తిగతమని చెప్పారు. తన రాజీనామాతో వచ్చే ఉప ఎన్నికలో.. తాను  పోటీ చేయబోనని ఆయన ప్రకటించారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ పాపంలో అన్ని రాజకీయపార్టీల పాత్ర ఉందన్నారు గంటా. పార్టీలకు అతీతంగా అందరూ పోరాడితేనే స్టీల్ ప్లాంట్‌ను దక్కించుకోగలమని పిలుపునిచ్చారు.  సీఎం జగన్‌మోహన్‌రెడ్డి రాజకీయ పంథాలను పక్కన పెట్టి ఉద్యమంలోకి రావాలని గంటా కోరారు. తన స్ఫూర్తితో మిగతా ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తారని ఆశీస్తున్నాని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పోరాటాల ద్వారానే స్టీల్ ప్లాంట్‌ను నిలబెట్టుకోగలమని గంటా శ్రీనివాస రావు స్పష్టం చేశారు. స్పీకర్ తన రాజీనామా అమోదిస్తారనుకుంటున్నానని చెప్పారు. స్టీల్ ప్లాంట్ కోసం పోరాడుతున్న ఎవరైన. నాన్ పొలిటికల్ వ్యక్తిని తన స్థానంలో పోటీ చేయిస్తే బాగుంటుందని గంటా శ్రీనివాసరావు అభిప్రాయపడ్డారు.  విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గంటా రాజీనామా చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ పరిరక్షణ కోసం రాజీనామా చేస్తున్నానని, ప్లాంట్‌ను ప్రైవేటుపరం చేయాలన్న నిర్ణయం అమలులోకి వచ్చిన తర్వాత రాజీనామాను ఆమోదించాలని కోరారు. దీంతో రాజీనామా స్పీకర్ ఫార్మాట్ లో లేదంటూ ఆయనపై విమర్శలు వచ్చాయి. దీంతో  గంటా మరోసారి తన పదవికి రాజీనామా చేశారు. ఈసారి ఏకవాక్యంతో తన రాజీనామాను  సమర్పించారు.  

కేసీఆర్ ఉచ్చులో విపక్షాలు! 

తెలంగాణ రాజకీయాల్లో కీలక మార్పులు జరుగుతున్నాయి. అన్ని పార్టీలు దూకుడు పెంచడంతో రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. అయితే సీఎం కేసీఆర్ ఉచ్చులో విపక్షాలు పడినట్లుగా కనిపిస్తున్నాయి. కేసీఆర్ తన ఎత్తులతో విపక్షాలను తన చుట్టూ తిప్పుకుంటున్నారనే చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు కూడా అలానే కనిపిస్తున్నాయి.  దుబ్బాకలో ఓటమి, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో  ఆశించిన ఫలితాలు రాకపోవడంతో టీఆర్ఎస్ ఢీలా పడింది. ఆ తర్వాత పార్టీపై ఫోకస్ చేసిన గులాబీ బాస్.. తన వ్యూహాలను పదును పెట్టారు. ఈ సమయంలోనే ముఖ్యమంత్రి మార్పు అంశం తెరపైకి వచ్చింది. కేటీఆర్ ను సీఎం చేస్తారనే ప్రచారం జరిగింది. టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు కూడా కేటీఆర్ జపం చేయడంతో.. విపక్షాలు కూడా ఇదే అంశంపై దృష్టి సారించాయి. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఎక్కడ మాట్లాడినా.. ముఖ్యమంత్రి మార్పుపైనే విమర్శలు చేశారు, కేసీఆరే ముఖ్యమంత్రిగా కొనసాగుతారని కామెంట్లు చేశారు. కాంగ్రెస్ నేతలు కూడా... ఇతర అంశాలను పక్కన పెట్టి.. కేసీఆర్, కేటీఆర్ లపైనే ఆరోపణలు చేస్తూ వచ్చారు. కేటీఆర్ పై ప్రచారం జోరుగా సాగుతున్నా స్పందించని సీఎం కేసీఆర్.. గత ఆదివారం జరిపిన పార్టీ కార్యవర్గ సమావేశంలో ఒక్కసారిగా బ్లాస్ట్ అయ్యారు. మరో పదేండ్లు తానే సీఎంగా ఉంటానని చెప్పారు. అంతేకాదు ముఖ్యమంత్రి పదవి గురించి ఎవరూ మాట్లాడినా ఊరుకునేది లేదంటూ పార్టీ నేతలను హెచ్చరించారు. తర్వాత నాగార్జున సాగర్ నియోజకవర్గంలో జరిగిన బహిరంగ సభలోనూ విపక్షాలకు విరుచుకుపడ్డారు కేసీఆర్. ఈ రెండు పరిణామాల తర్వాత విపక్షాలు కూడా వెంటనే తమ స్టాండ్ మార్చాయి. తమపై ఆరోపణలు చేసిన కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ కాంగ్రెస్, బీజేపీ నేతలు ప్రకటనలు చేస్తున్నారు. దీంతో కేసీఆర్ ఉచ్చులో విపక్షాలు పడ్డాయనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వస్తోంది. కేసీఆర్ ఎత్తులో చిక్కిన విపక్షాలు.. క్లారిటీ లేకుండా వ్యవహరిస్తున్నాయనే విమర్శలు కూడా వస్తున్నాయి. ముఖ్యంగా బండి సంజయ్ మాట్లాడుతున్న అంశాల్లో స్పష్టత లేదంటున్నారు. గతంలో ఎప్పుడు మాట్లాడినా .. కేసీఆర్ అవినీతిని బయటపెడతాం, జైలుకు పంపుతామని సంజయ్ చెప్పేవారు. అయితే కేటీఆర్ ముఖ్యమంత్రి కానున్నారనే ప్రచారం రాగానే.. ఒక్కసారిగా తన మాట మార్చారు. కేసీఆరే ముఖ్యమంత్రి ఉంటారని పదేపదే ప్రకటనలు చేశారు. దీంతో కేసీఆర్ ను జైలుకు పంపిస్తామన్న సంజయ్.. ఆయనే సీఎంగా ఉంటారని చెప్పడమేంటనే చర్చ జరిగింది. తాజాగా మళ్లీ కేసీఆర్ ను జైలుకు పంపిస్తామంటూ ప్రకటనలు చేస్తున్నారు బండి సంజయ్. దీంతో కేసీఆర్ రాజకీయ వ్యూహాల ముందు బీజేపీ నేతలు నిలవలేకపోతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.  తెలంగాణ కాంగ్రెస్ నేతల తీరు కూడా ఇలానే ఉంది. ముఖ్యమంత్రిగా కేసీఆర్ విఫలమయ్యారనే ఆరోపణలు చేస్తూ వచ్చారు కాంగ్రెస్ నేతలు. కేటీఆర్ సీఎం అవుతారని ప్రచారం రాగాానే.. మళ్లీ మాట మార్చారు. కేటీఆర్ ను ముఖ్యమంత్రిగా చేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. సీఎం మార్పుపై లేదని కేసీఆర్ క్లారిటీ ఇవ్వగానే... మళ్లీ పాత పాటే పాడుతున్నారు. విపక్షాల తీరును గమనిస్తున్న రాజకీయ విశ్లేషకులు... కేసీఆర్ ఆడుతున్న పొలిటికల్ డ్రామాలో ప్రతిపక్ష నేతలు చిక్కుకుంటున్నారని చెబుతున్నారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ పనికి రాడని విమర్శించిన వారే.. కేసీఆరే మరో మూడేండ్లు ముఖ్యమంత్రిగా ఉంటారనే చెప్పేలా కేసీఆర్ డ్రామా నడిపించారని అంటున్నారు. మొత్తంగా తన రాజకీయ చతురతతో విపక్షాలన్ని తన చుట్టే తిరిగేలా కేసీఆర్ కొత్త మైండ్ గేమ్ ఆడుతున్నారని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు.   

టీకా తీసుకున్న నిమ్స్ డాక్టర్లకు కోవిడ్! 

దేశ వ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. ఇండియాలో కవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాలను అందిస్తున్నారు. ఈ రెండు టీకాలూ సురక్షితమైనవేనని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేస్తుండగా, వైద్యుల్లోనే టీకా పనితీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  తాజాగా హైదరాబాద్ నిమ్స్ లో కలకలం రేగింది. కరోనావ్యాక్యిన్ ను తీసుకున్న 20 రోజుల తరువాత.. ఇద్దరు ప్రముఖ వైద్యులకు కోవిడ్ పాజిటివ్ వచ్చింది.  నిమ్స్ కు చెందిన ఓ రెసిడెంట్ డాక్టర్ కు, ఉస్మానియాకు చెందిన పీజీ విద్యార్థికీ కరోనా సోకింది. వీరిద్దరూ దాదాపు 20 రోజుల క్రితం కరోనా టీకా తొలి డోస్  తీసుకున్నారు.  ఇద్దరు వైద్యులకు కరోనా సోకిన విషయాన్ని అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. టీకా తీసుకున్న తరువాత వీరిద్దరూ తమకు వైరస్ సోకదన్న ధీమాతో మాస్క్ ధరించలేదని, భౌతిక దూరం పాటించడం, చేతులను శానిటైజ్ చేసుకోవడం వంటి నిబంధనలు పాటించలేదని, ఈ కారణంగానే వైరస్ సోకిందని ఉన్నతాధికారులు వెల్లడించారు. వారిద్దరి పేర్లను మాత్రం బహిర్గతం చేయలేదు.  అయితే  తొలి డోస్ తీసుకున్న 42 రోజుల తరువాతనే శరీరంలో కరోనాను ఎదుర్కొనే యాంటీ బాడీస్ వృద్ధి జరుగుతుందని ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. టీకా తీసుకున్నా అన్ని జాగ్రత్తలతో ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. చాలా మంది తొలి టీకా తీసుకోగానే నిబంధనలను పాటించడం లేదని, అందువల్లే ఇటువంటి కేసులు వెలుగులోకి వస్తున్నాయని అన్నారు.  

కొడాలి నానికి ఖతర్నాక్ షాక్! 

పంచాయతీ ఎన్నికల్లో ఏపీ మంత్రి కొడాలి నానికి దిమ్మతిరిగే షాక్ తగిలింది. తనకు ఎదురు లేదని చెప్పుకునే నానికి.. ఆయన నియోజకవర్గ ఓటర్లు షాకిచ్చారు. గుడివాడ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థులు సంచలన విజయాలు సాధించారు. మంత్రి కొడాలి ఎన్ని ఎత్తులు వేసినా, బెదిరింపులకు దిగినా.. ఓటర్లు మాత్రం బ్యాలెట్ బాక్సుల్లో తమ ప్రతాపం చూపించారు.  గుడివాడ నియోజకవర్గంలో 58 పంచాయతీలు ఉండగా.. 20 స్థానాల్లో టీడీపీ మద్దతుతో సర్పంచ్‌లు విజయం సాధించారు. వైసీపీ బలపరిచిన అభ్యర్థులు 32 పంచాయతీలు గెలుచుకోగా.. జనసేన ఒకటి, సీపీఎం ఒకటి,  స్వాతంత్ర అభ్యర్థులు నాలుగు పంచాయతీల్లో గెలిచారు. అయితే టీడీపీ మద్దతుతో గెలిచిన అభ్యర్థులను స్వతంత్రులుగా గలిచామని చెప్పాలంటూ వైసీపీ నేతలు ఒత్తిడి చేస్తున్నారు. టీడీపీ మద్దతుతో గెలిచిన అభ్యర్థులను తమ ఖాతాలో వైసీపీ నాయకులు వేసుకుంటున్నారు.   అంతేకాదు కొడాలి నాని సొంతూరు పెదపారుపూడి మండలం యలమర్రులో టీడీపీ మద్దతుదారులు ఘన విజయం సాధించారు. యలమర్రులో టీడీపీ మద్దతు ఇచ్చిన సర్పంచ్‌ అభ్యర్థి కొల్లూరి అనూష 271 ఓట్ల మెజారిటీతో గెలిచారు. 12 వార్డుల్లో 11 టీడీపీ మద్దతుదారులే సొంతం చేసుకున్నారు. మిగిలిన ఒక్క వార్డులోనూ వైసీపీ మద్దతు పలికిన అభ్యర్థి కేవలం ఒక్క ఓటు తేడాతో గెలిచారు. గుడివాడ నియోజకవర్గం ఫలితాలపై టీడీపీ కార్యకర్తలు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు. కొడాలి నానికి ఊహించని షాక్ అని  టీడీపీ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.  

కర్నూల్ జిల్లాలో ఘోర ప్రమాదం.. 14 మంది దుర్మరణం

విశాఖపట్నం జిల్లా అరకు లోయలో జరిగిన బస్సు ప్రమాదం ఘటన మరవకముందే.. కర్నూల్ జిల్లాలో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.  వెల్దుర్తి మండలం మాదాపురం వద్ద తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. చిత్తూరు నుంచి హైదరాబాద్ కు వస్తున్న ఓ టెంపో రహదారిపై అదుపు తప్పి, కుడివైపునకు పడిపోయింది. అదే సమయంలో అటు వైపుగా వస్తున్న  ఆ దిశగా లారీ టెంపోను ఢీకొట్టింది.   ఈ ప్రమాదంలో 14 మంది మరణించగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు. మృతుల్లో ఓ చిన్నారితో పాటు 8 మంది మహిళలు ఉన్నారు. టెంపో డ్రైవర్ నిద్రమత్తే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమిక నిర్దారణకు వచ్చారు. కేసు నమోదు చేసి విచారిస్తున్నామని తెలిపారు. 

కుక్క కన్నా హీనం! కాంగ్రెస్ నేత హాట్ కామెంట్స్ 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ , మంత్రి కేటీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. కేసీఆర్ లేకుంటే టీపీసీసీ ఉండేది కాదన్న వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు. తెలంగాణ ఎట్లా వచ్చిందో కేటీఆర్ తెలుసుకుని మాట్లాడాలని జీవన్ రెడ్డి సూచించారు. ఉద్యమానికి స్ఫూర్తి ఎవరు? ప్రతిఫలాన్ని అనుభవిస్తున్నదెవరో తెలంగాణ ప్రజలకు అంతా తెలుసన్నారు. తెలంగాణపై చర్చ జరిగిన రోజు లోక్ సభలో  కేసీఆర్ లేడన్నారు జీవన్ రెడ్డి. ఆయన ఎక్కడ తాగి పన్నాడో ఆనాడాయనకే తెలియదని ఎద్దేవా చేశారు. తెలంగాణకు కాపలా కుక్క లెక్క ఉంటా అన్న కేసీఆర్ కు.. ఇప్పుడు తెలంగాణా ప్రజలే కుక్కల్లా కనిపిస్తున్నారని జీవన్ రెడ్డి అన్నారు. కుక్కలకు విశ్వాసం ఉంటది.. కానీ విశ్వాసం లేని వ్యక్తి కేసీఆర్అం టూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు జీవన్ రెడ్డి.సీఎం పదవిని ఎవడైనా చెప్పుతో సమానం అంటాడా..? చెప్పును పట్టుకుని మరింకా ఎందుకు వేలాడుతున్నావ్.. ఇడిసిపెట్టు కదా..? మళ్ళీ నేనే సీఎం అంటావ్? నీ టైం అయిపొయింది. నీ  ఇంట్లో ముసులం పుట్టుంది.. మొగల్ సామ్రాజ్యం మాదిరిగా నీ ఇంట్లో ఔరాంగజేబు పుట్టిండు.. నీకు పదవి ఉండదు.. జాగ్రత్త అంటూ జీవన్ రెడ్డి హెచ్చరిక చేశారు.  నల్ల కుబేరులకు  మోడీ అండగా నిలుస్తున్నారని జీవన్ రెడ్డి ఆరోపించారు. గుడిని పార్టీ అంశంగా మార్చుకుని ప్రజల్ని మత ప్రాతిపదికన చీల్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారం లోకి వస్తేనే రైతులకు న్యాయం జరుగుతుందన్నారు జీవన్ రెడ్డి. మద్దతు ధర కల్పించడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత అన్నారు జీవన్ రెడ్డి. కేసీఆర్ సన్న వడ్ల పేరుమీద ఏంచేశాడో తెలంగాణాలో అందరికీ తెలుసన్నారు. ధాన్యం సేకరణ నిలిచిపోతే బియ్యం పంపిణీ నిలిచిపోయే ప్రమాదముందన్నారు.  

ఉత్తరాఖండ్ కు మరో గండం! రిషిగంగలో కొత్త సరస్సు

మంచు విలయానికి కకా వికలమైంది ఉత్తరాఖండ్. మంచు కొండలు విరిగి పడడంతో ధౌలిగంగా నది పొంగింది. విద్యుత్ ప్రాజెక్టులను ముంచేసింది. వందలాది మందిని పొట్టన పెట్టుకుంది.  మంచు కొండల్లో ఇప్పటికీ సహాయ చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆ విపత్తను మర్చిపోకముందే మరో డేంజర్ సిగ్నల్ వచ్చేసింది. ఉత్తరాఖండ్ కు మరో గండం ముంచుకొస్తుందని తెలుస్తోంది. గత ఆదివారం  మంచు చరియలు విరిగిపడిన చోట ఓ కొత్త సరస్సు పుట్టుకొచ్చింది. రోజురోజుకు అది విస్తరిస్తోంది. రిషిగంగ వద్ద సముద్ర మట్టానికి 2,838 మీటర్ల ఎత్తున ఆ సరస్సు ఏర్పడినట్టు అధికారులు, శాస్త్రవేత్తలు ధ్రువీకరించారు. ఎన్డీఆర్ఎఫ్, డీఆర్డీవోల ఉపగ్రహ చిత్రాల ద్వారా అది ప్రమాదం తర్వాత కొత్తగా ఏర్పడిన సరస్సే అని తేలింది.  రిషిగంగ దగ్గర కొత్తగా సరస్సు ఏర్పడిన ప్రాంతాన్నీ  డీఆర్డీవో శాస్త్రవేత్తలు  పరిశీలించి వచ్చారు. ఇప్పటిదాకా అక్కడ 7 లక్షల ఘనపు మీటర్ల మేర.. అంటే దాదాపు  70 కోట్ల లీటర్లు నీరు వచ్చి చేరినట్టు చెబుతున్నారు. 350 మీటర్ల పొడవున్న ఈ సరస్సు.. మూడు ఫుట్ బాల్ మైదానాల పరిమాణంలో ఉన్నట్టు గుర్తించారు. సహజంగా ఏర్పడిన ఈ డ్యామ్ లోతు దాదాపు 60 మీటర్లుందని అంచనా వేశారు.  ప్రస్తుతం దీని వల్ల ఎలాంటి ప్రమాదం లేకపోయినా... మున్ముందు మాత్రం మరిన్ని వరదలు వచ్చే ముప్పుందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. మంచు కొండలు విరిగి పడిన చోట సరస్సు ఏర్పడినట్టు గురువారమే హేమవతి నందన్ బహుగుణ గర్వాల్ యూనివర్సిటీ పరిశోధకులు ఓ వీడియోను విడుదల చేశారు. అయితే  అది కొత్తగా ఏర్పడిన సరస్సు అని ఇప్పుడే చెప్పలేమని వాడియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీ వర్సిటీ తెలిపింది. తాజాగా వచ్చిన ఎన్డీఆర్ఎఫ్ ఉపగ్రహ చిత్రాలు ద్వారా ఆ సరస్సు కొత్తగా  ఏర్పడిందేనని నిర్దారించారు. డీఆర్డీవో ఆ ప్రాంతాన్ని పరిశీలించిన తర్వాత కేంద్ర జలసంఘానికి నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక ఆధారంగా సీడబ్ల్యూసీ అక్కడ వరదల పరిస్థితిపై అంచనా వేస్తోంది.  వరద వస్తే ఎంత సేపట్లో వస్తుంది? జనాలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ఎంత సమయం పడుతుంది? వంటి వివరాలతో కేంద్ర జల సంఘం అధికారులు లెక్కలు వేస్తున్నారు. సరస్సు ఎత్తు, పరిమాణం ఆధారంగా సెకనుకు 8.9 లక్షల లీటర్ల నీళ్లు సరస్సు నుంచి వచ్చే అవకాశం ఉందని తేలారు. అలా అయితే రెండున్నర కిలోమీటర్ల దూరాన్ని 9 నిమిషాల్లోనే నీళ్లు చేరతాయని , జోషిమఠ్ కు రావడానికి 53 నిమిషాలు పడుతుందని సీడబ్ల్యూసీ లెక్కగట్టింది. అయితే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ చెప్పారు.

కొత్త మేయర్‌ కు అప్పుడే షాక్.. 

హైదరాబాద్ నూతన మేయర్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన గద్వాల విజయలక్ష్మి సీట్లో కూర్చొని రెండు రోజులు కూడా కాలేదు అప్పుడే  షాక్ తగిలింది.. అధికారులు ఆమెకు అదిరిపోయే ఝలక్ ఇచ్చారు.  గ్రేటర్ హైదరాబాద్ కొత్త మేయర్ గద్వాల విజయలక్ష్మి అనుచరుడికి జీహెచ్‌ఎంసీ షాకిచ్చింది. ఈ నెల 11న గ్రేటర్ మేయర్‌గా విజయలక్ష్మి కి , శుభాకాంక్షలు తెలుపుతూ ఆమె అనుచరుడు అతిష్ అగర్వాల్.. నగరంలో భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాడు. ఇలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై నగర పౌరుడు ట్విట్టర్‌లో జీహెచ్‌ఎంసీ అధికారులను ప్రశ్నించాడు. దీంతో అప్రమత్తమైన జీహెచ్‌ఎంసీ అధికారులు.. ఫ్లెక్సీలు అనధికారికంగా ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన సదరు విజయలక్ష్మి అనుచరుడు అతిష్ అగర్వాల్‌పై అధికారులు కొరడా ఝళిపించింది. అతిష్ అగర్వాల్‌కు లక్ష రూపాయలు జరిమానా విధిస్తూ జీహెచ్ఎంసీ ఈవీడీఎం అధికారులు షాకిచ్చారు. జీహెచ్‌ఎంసీ అధికారుల జరిమానా పై కొత్త మేయర్ అనుచరుడు అతిష్ అగర్వాల్ తో పాటు కొత్త మేయర్ విజయలక్ష్మి కూడా ఆశ్చర్యానికి గురయ్యారు..      

నాగార్జున సాగర్ బరిలో టీడీపీ! ఆ పార్టీ  కోసమేనా? 

తెలంగాణలో పూర్త  వైభవం కోసం ప్రయత్నిస్తున్న తెలుగు దేశం పార్టీ.. త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలోనూ పోటీ చేయాలని నిర్ణయించింది. నాగార్జున సాగర్ ఉపఎన్నికకు పార్టీ అభ్యర్థిని కూడా ప్రకటించింది. సాగర్ లో  మువ్వ అరుణ్ కుమార్ పోటీ చేస్తారని టీటీడీపీ అధికారక ప్రకటన విడుదల చేసింది. పార్టీ అధినేత చంద్రబాబుతో చర్చించాకే అభ్యర్థిని ఖరారు చేశారని తెలుస్తోంది. నాగార్జున సాగర్ లో టీడీపీ గతంలో బలంగా ఉండేది. ఇప్పుడు కూడా నేతలు ఇతర పార్టీల్లోకి వెళ్లినా.. కేడర్ అలాగే ఉందని చెబుతోంది. అంతేకాదు నాగార్జున సాగర్ పరిధిలో దాదాపు 12 వేల సెటిలర్ ఓటర్లున్నారు. అవన్ని తమకు కలిసి వస్తాయని అంచనా వేసుకుంటున్నారు తెలంగాణ తమ్ముళ్లు.  నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. వరుస విజయాలతో దూకుడు మీదున్న బీజేపీ... దాన్ని కంటిన్యూ చేయాలని భావిస్తోంది. దుబ్బాకలో ఓటమి, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఆశించిన ఫలితం రాకపోవడంతో కుదేలైన అధికార పార్టీ.. సాగర్ సత్తా చాటాలని భావిస్తోంది. మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్ బలహీనం అయిందనే ప్రచారాన్ని తిప్పికొట్టాలంటే.. తమకు పట్టున్న సాగర్ ఘన విజయం సాధించాలని కాంగ్రెస్ ప్రణాళికలు రచిస్తోంది. ఇలా అన్ని పార్టీలు సవాల్ గా తీసుకుంటుండగా.. ఇప్పుడు టీడీపీ పోటీ చేస్తుండటం మరింత ఆసక్తిగా మారింది.  నాగార్జున సాగర్ లో టీడీపీ పోటీ చేస్తే అధికార పార్టీకే ప్లస్ అవుతుందని కొందరు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వ ఓటును చీల్చడానికే కేసీఆర్.. టీడీపీ పోటీ చేసేలా చూస్తున్నారనే ఆరోపణలు కొందరి నుంచి వస్తున్నాయి. బీజేపీ కోసమే టీడీపీ బరిలో ఉంటుందనే మరో చర్చ కూడా జరుగుతోంది. నియోజకవర్గం పరిధిలో ఉన్న సెటిలర్లు గత రెండు ఎన్నికల్లో టీఆర్ఎస్ కు మద్దతుగా నిలిచారని.. ఈసారి వాళ్ల ఓట్లు కారు పార్టీకి వెళ్లకుండా ఉండేందుకే టీడీపీ పోటీ చేస్తుందని చెబుతున్నారు. ఎవరి వాదన ఎలా ఉన్నా... టీడీపీ పోటీ చేస్తుండటంతో నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో రాజకీయ సమీకరణలు మారే అవకాశం ఉందని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

జగన్ సర్కార్ తీరుతో మోడీ షాక్!

ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల సంచలన ఘటనలు జరిగాయి. ముఖ్యంగా అలయాలపై వరుసగా జరిగిన దాడులు తీవ్ర కలకలం రేపాయి. రాజకీయంగా కాక పుట్టించాయి. నర్సాపురం ఎంపీ రఘురామ రాజ కృష్ణం రాజు శనివారం ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. ఇద్దరి మధ్య దాదాపు 18 నిమిషాల పాటు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఏపీలో జరుగుతున్న పరిణామాలను ప్రధాని మోడీకి వివరించానని చెప్పారు ఎంపీ రఘురామ కృష్ణం రాజు.   ఏపీ ప్రభుత్వ తీరుపై ప్రధాని మోడీ ఆశ్చర్యం వ్యక్తం చేశారని తెలిపారు.  ఏపీలో ప్రస్తుతం జరుగుతున్న అన్ని విషయాలపై సావదానంగా విన్న ప్రధాని ఒక్క విషయంలో మాత్రం ఆశ్చర్యానికి గురయ్యారని ఎంపీ రఘురామ రాజు చెప్పారు. రాష్ట్రంలో చర్చిల నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం టెండర్లను పిలిచిందని రఘురామ.. మోడీకి తెలిపారు. దీంతో చర్చిల నిర్మాణానికి ప్రభుత్వ టెండర్లా? అని ప్రశ్నిస్తూ.. ఆశ్చర్యానికి గురయ్యారని, ఈ విషయంలో ప్రభుత్వమే టెండర్లు పిలవడం ఎలా సాధ్యమని మోడీ అన్నారని రఘురామ రాజు  వెల్లడించారు. చర్చిల టెండర్లకు సంబంధించిన పూర్తీ వివరాలు ఇవ్వాలని ఎంపీ రఘురామ కృష్ణంరాజును ప్రధాని మోడీ  కోరినట్లు తెలుస్తోంది. మీ చేతులతో శంకుస్థాపన చేసిన అమరావతిని నిలిపివేస్తే పేద రైతులకు అన్యాయం జరుగుతోందని ప్రధాని మోడీకి చెప్పానని తెలిపారు రఘురామ కృష్ణం రాజు. దేవాలయాలపై దాడులు విషయంలో జోక్యం చేసుకోవాలని కోరానన్నారు.  విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటుపరం చేయొద్దని ప్రధానికి విన్నవించానని తెలిపారు. స్టీల్‌ప్లాంట్‌పై ప్రధాని మోడీ అభయం లభించినట్టుగానే భావిస్తున్నానని చెప్పారు నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు. 

కొడాలి నానిపై కేసు నమోదు చేయండి.. ఎస్ఈసీ నిమ్మగడ్డ ఆదేశం

ఎపి మంత్రి కొడాలి నాని అనుచిత వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కృష్ణా జిల్లా ఎస్పీని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఆదేశించారు. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించినందుకు ఐపీసీ 504, 505(1)(C), 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని ఆ ఆదేశాల్లో ఎస్‌ఈసీ పేర్కొన్నారు. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించినందుకు క్లాజ్‌-1, క్లాజ్‌-4 కింద కేసు నమోదు చేయాలని అయన ఆదేశించారు. ఎన్నికల కమిషన్‌పై మంత్రి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను కించపరుస్తూ కొడాలి నాని శుక్రవారం చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఈ విమర్శలపై స్పందించిన ఎస్‌ఈసీ.. ఆయనకు షోకాజ్‌ నోటీసు పంపించింది. సాయంత్రానికి మంత్రి తన వివరణను న్యాయవాది ద్వారా వివరణ ఇచ్చారు. పంచాయతీ ఎన్నికల్లో పార్టీ మద్దతుదారుల విజయంపైనే మాట్లాడానని ఆ వివరణలో చెప్పారు. తానూ కేవలం ప్రతిపక్షాల వేధింపులను ప్రస్తావించానని తెలిపారు. ఎస్‌ఈసీని కించపరిచే ఉద్దేశం, ఆలోచన ఏమాత్రం లేదని అయన పేర్కొన్నారు. రాజ్యాంగ వ్యవస్థల పట్ల తనకు గౌరవముందన్నారు. వివరణ పరిశీలించి షోకాజ్‌ నోటీస్ ఉపసంహరించుకోవాలని కొడాలి నాని కోరారు. అయితే నాని వివరణపై ఎస్‌ఈసీ సంతృప్తి చెందలేదు. దీంతో ఆయనపై.కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.

గ్యాంగ్ రేప్.. ఒక కట్టు కథే ! అసలు స్టోరీ చెప్పిన సీపీ 

పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టారు.. దారుణం, అమానుషం అంటూ మీడియా ఊదరగొట్టింది. అయ్యో ఆడపిల్లకే రక్షణ లేదా అంటూ జనాలు భగ్గుమన్నారు. ఇదీ మూడు రోజుల క్రితం హైదరాబాద్ శివారు ఘట్ కేసర్ ప్రాంతంలో వెలుగుచూసి తెలుగు రాష్ట్రాల్లో సంచలనం స్పష్టించిన బీ ఫార్మసీ విద్యార్థిని కిడ్నాప్ కేసు కథ. హైదరబాద్ శివారులో గతంలో జరిగిన దిశ తరహా ఘటనే మళ్లీ జరిగిందనే ఆందోళన వ్యక్తమైంది. కాని పోలీసుల విచారణలో  అసలు నిజం బట్టబయలు కావడంతో  అంతా అవాక్కయ్యారు.  విద్యార్థిని కట్టుకథ అల్లిందని తేలడంతో ముక్కున వేలేసుకుంటున్నారు.  ఈ  కేసులో అసలు ఏం జరిగిందో  రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ వివరించారు  అసలు ఆ అమ్మాయిపై అత్యాచారం జరగలేదని తెలిపారు.  కుటుంబ సమస్యలతో ఇంటి నుంచి వెళ్లిపోవాలని భావించిన యువతి, తల్లి అదేపనిగా ఫోన్ చేస్తుండడంతో అబద్ధం ఆడిందని, పోలీసులను తప్పుదోవ పట్టించిందని తెలిపారు. అత్యాచార ఘటన ఆ అమ్మాయి అల్లిన కట్టుకథ అని వివరించారు.  ఇందులో ఆటోడ్రైవర్ పై కక్ష కోణం కూడా ఉందన్నారు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్.  రాచకొండ సీపీ  చెప్పిన వివరాల ప్రకారం..  "ఆ అమ్మాయి రాంపల్లి ఆర్ఎల్ నగర్ కు చెందిన బీఫార్మసీ విద్యార్థిని. ఈ నెల 10వ తేదీ సాయంత్రం డయల్ 100 నెంబరుకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. 5.30 గంటలకు రాంపల్లి బస్టాప్ వద్ద కాలేజీ బస్సు దిగిన విద్యార్థిని ఓ ఆటోలో ఎక్కగా, ఆ ఆటోడ్రైవర్ ఎక్కడా ఆపకుండా తీసుకెళ్లిపోయాడంటూ మాకు ఫిర్యాదు అందింది. ఈ మేరకు యువతి తన తల్లికి చెప్పగా ఆమె మాకు ఫోన్ చేసింది. ఈ ఫోన్ కాల్ నేపథ్యంలో సమీప పోలీస్ స్టేషన్లను అప్రమత్తం చేశాం. వాహనాల తనిఖీ షురూ చేశాం. నిర్జన ప్రదేశాల్లోనూ గాలింపు జరిపాం. చివరికి 7.50 గంటలకు ఆ అమ్మాయి ఫోన్ నెంబరును ట్రాక్ చేయగలిగాం.  లొకేషన్ ను ట్రేస్ చేయగా అన్నోజిగూడ వద్ద ఉన్నట్టు వెల్లడైంది. దాంతో పోలీసులు అక్కడికి వెళ్లేసరికి దుస్తులు చిందరవందరగా ఉన్న స్థితిలో ఆ అమ్మాయి కనిపించింది. అక్కడి నుంచి ఆమెను ఆసుపత్రికి తరలించాం. తనను ఆటోడ్రైవర్లు రేప్ చేశారని చెప్పింది. దాంతో ఆటోడ్రైవర్లను అదుపులోకి తీసుకుని ప్రశ్నించాం. శాస్త్రీయకోణంలో దర్యాప్తు చేయగా ఆటోడ్రైవర్లు ఎలాంటి తప్పు చేయలేదని తేలింది. సీసీటీవీ ఫుటేజిలో కూడా ఆ అమ్మాయి పలు ప్రాంతాల్లో ఒంటరిగానే సంచరించినట్టు వెల్లడైంది. కేసు రీ కన్ స్ట్రక్షన్ లో ఆ అమ్మాయి అబద్దాలు చెప్పిన విషయం తేటతెల్లమైంది. వాస్తవ పరిస్థితులకు, ఆ విద్యార్థిని చెబుతున్న విషయాలకు ఎక్కడా పొంతన కుదరలేదు. దాంతో ఆ అమ్మాయిని ప్రశ్నిస్తే అసలు విషయం చెప్పింది. కుటుంబ సమస్యలు ఉన్నాయని, అందుకే ఇంటి నుంచి వెళ్లిపోవాలనుకున్నానని వెల్లడించింది. గతంలో ఓ ఆటో డ్రైవర్ పై ఉన్న కోపాన్ని ఇప్పుడు ఉపయోగించుకుంది. తనను కిడ్నాప్ చేశాడని తల్లికి చెప్పింది. దాంతో అది నిజమే అని నమ్మిన ఆ విద్యార్థిని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది" అని సీపీ మహేశ్ భగవత్ వివరించారు. 

జేపీ వైఎస్సార్ కోవర్ట్ ! గోనె సంచలన కామెంట్స్

శ్రీరంగ నీతులు ఎదుటి వారికి చెప్పడానికి మాత్రమే పనికి వస్తాయి. కానీ వాస్తవంలో మాత్రం అవి ఆచరణ సాధ్యం కావని తాజాగా వెలుగు చూసిన ఒక సంచలన విషయం స్పష్టం చేస్తోంది. మాజీ ఐఏఎస్ అధికారి, లోక్ సత్తా నేత జయప్రకాశ్ నారాయణ్ ఎంతో నిజాయితీపరుడని ఏ అంశంపైన అయినా అనర్గళంగా మాట్లాడగలరని పేరుంది. అయన లోక్ సత్తా పార్టీ మొదలు పెట్టి రాజకీయాలలో ప్రవేశించినపుడు ఈ కుళ్ళు రాజకీయాలలో అయన ఇమడలేరని ప్రజలు భావించారు. 2009 లో మొట్టమొదటి సారి జేపీ కూకట్ పల్లి నుండి పోటీ చేసినపుడు అనేక మంది విద్యావంతులు.. రాజకీయాలకు, కులమతాలకు అతీతంగా ఓట్లు వేసి ఆయనను ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. అయితే అయన అందరూ అనుకున్నంత నిజాయితీపరుడు కాదని అయన కూడా మేడిపండు లాంటివాడేనని తాజాగా వెలుగు చూసిన ఒక ఇంటర్వ్యూ ద్వారా తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే, వై ఎస్ రాజశేఖర్ రెడ్డి సన్నిహితుడు అయిన గోనె ప్రకాశ‌రావు తాజాగా జేపీ పై సంచలన ఆరోపణలు చేశారు. 2009 ఎన్నికల సమయంలో అప్పటి ఉమ్మడి ఎపి సీఎం వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి జయప్రకాశ్ నారాయణకు కోటి రూపాయలు ఇచ్చారని ఆరోపించారు. అప్పట్లో లోక్‌సత్తాను పోటీకి నిలపడం ద్వారా ప్రతిపక్ష టిడిపి ఓట్లను చీల్చడానికి వైఎస్ .. జేపీకి సొమ్ములు ఇచ్చారని గొనె ప్రకాశరావు ఒక టీవీ ఛానెల్‌ చర్చలో ఆరోపించారు. అయితే వాస్తవానికి అప్పట్లో జేపీ వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డిని రూ.40లక్షలు అడిగితే ఆయన ఏకంగా కోటి రూపాయలు ఇచ్చారని గొనె చెప్పారు. అంతేకాకుండా దీనికి సాక్ష్యాలు కూడా ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. అప్పట్లో వై.ఎస్‌ ప్రోత్సాహంతోనే జయప్రకాష్ ‌నారాయణ, ప్రజారాజ్యం అధినేత చిరంజీవి ఎన్నికలలో అభ్యర్థులను బరిలోకి దించారని, దీంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటును వీరిద్దరూ చీల్చడం ద్వారా రాజశేఖర్‌రెడ్డికి మేలు చేశారని.. అప్పటి ఎన్నికల్లో గెలవాల్సిన టిడిపి ఓడిపోయిందని గోనె తన విశ్లేషణలో పేర్కొన్నారు. అప్పటి ఎన్నికల్లో లోక్ సత్తా పార్టీ తరుపున పోటీ చేసిన అభ్యర్థుల్లో జేపీ తప్ప ఎవరూ గెలవకపోయినా.. ప్రతి నియాజకవర్గంలో ఆ పార్టీకి మంచి ఓట్లే వచ్చాయి. అప్పట్లో జయప్రకాష్‌నారాయణ కు ఉన్న మంచిపేరు తో ఆయన పార్టీ తరుపున అభ్యర్థి ఎవరో కూడా తెలియకపోయినా ప్రజలు మాత్రం ఓట్లు వేశారు. దీంతో దాదాపు 65 నుంచి 75 నియోజకవర్గాల్లో ఆయన పార్టీ ఓట్లు చీల్చింది. అప్పట్లో జేపీ, చిరంజీవి వల్లే ప్రధాన ప్రతిపక్షమైన టిడిపి ఓడిపోయిందనే విశ్లేషణలు వచ్చాయి. అయితే లోక్ సత్తా నేత జయప్రకాష్‌నారాయణ వై.ఎస్‌తో కుమ్మక్కు అయ్యారనే విషయం మాత్రం ఎవరికీ తెలియదు. అయితే గోనె తాజాగా చేసిన వ్యాఖ్యలతో జేపీ నిజాయితీపరుడని భావించిన వారందరు ఇపుడు ముక్కు మీద వేలేసుకుంటున్నారు. అప్పట్లో కోటి రూపాయల కోసం ఇంతపని చేశారా.. అంటూ ఇపుడు అవాక్కు అవుతున్నారు.

కాంగ్రెస్ టార్గెట్ గా మమత, కేసీఆర్ రాజకీయం! బీజేపీ దూసుకు రావడంతో ఆగమాగం 

ఫస్ట్ బెంగాల్. నెక్ట్స్ తెలంగాణ. బెంగాల్ లో గెలిచి తెలంగాణపై దండయాత్ర. కోల్ కతా వేదికగా అమిత్ షా చేసిన రాజకీయ గర్జన ఇది. రాష్ట్రం కాని రాష్ట్రంలో కమలం బాస్ కామెంట్స్ తో.. తెలంగాణలో ప్రకపంనలు వస్తున్నాయి. అక్కడ కాళీ మాత సాక్షిగా సౌండ్ చేస్తే.. ఇక్కడ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో పొలిటికల్ రీసౌండ్ వస్తోంది. బెంగాల్ గడ్డ నుంచి బీజేపీ బిగ్ బాస్ చేసిన వ్యాఖ్యలు కాకతాలీయమేమీ కాదు. పెను సంచలనమే. బెంగాల్ లో జరిగిన రాజకీయ పరిణామాలు.. తెలంగాణలో జరుగుతున్న పొలిటికల్ ఇంజనీరింగ్ కు అనేక పోలికలు ఉన్నాయని విశ్లేషిస్తున్నారు. ఆ కంపారిజైన్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది.  బెంగాల్ తో ఏం జరిగింది? బెంగాల్. ఒకప్పుడు వామపక్షాల ఇలాకా. దశాబ్దాల పాటు ఎర్ర జెండాలదే హవా. సుత్తి, కొడవలిలో ఎర్ర బారిన బెంగాల్ లో మమతా బెనర్జీ నేతృత్వంలో గడ్డి పూల పార్టీ విరబూసింది. తృణమూల్ చీఫ్ గా కమ్యూనిస్టు పార్టీలను పాతరేసింది దీదీ. ఎక్కడికక్కడ విపక్షాన్ని తొక్కిపడేస్తూ.. బెంగాల్ లో వామపక్షాల ఉనికినే ప్రశ్నార్థకం చేసింది. ఆ అణచివేత కొన్నాళ్ల పాటు తృణమూల్ కు ఆధిపత్యం కల్పించినా.. పరోక్షంగా అది బీజేపీకే ఎక్కువ కలిసొచ్చిందని చెబుతారు. కమలనాథులు బెంగాల్ లో పాగా వేసేందుకు రూట్ క్లియర్ చేసింది మమతేనంటారు. క్షేత్ర స్థాయిలో బలమైన కేడర్ ఉన్న కమ్యూనిస్టులు కనుమరుగు అవడంతో.. ఆ పొలిటికల్ స్పేస్ ను కాషాయ దళం ఆక్రమించేసింది. మమతపై ఉన్న వ్యతిరేకత మొత్తం.. బీజేపీ వైపు ఏకీకృతం అవుతోంది. అదే, వామపక్షాలు కాస్తైనా బలంగా ఉండి ఉంటే.. బీజేపీ ఇంతలా ఎదిగేది కాకపోవచ్చని అంటున్నారు. ప్రస్తుతం బెంగాల్ లో మమత పార్టీకి ప్రత్యామ్నాయం కమలం మాత్రమే. ప్రజాబలం భారీగా పెరగడంతో.. వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి పీఠం దిశగా దూసుకుపోతోంది బీజేపీ. ఇదంతా దీదీ స్వయంకృతాపరాధమే. బెంగాల్ తో తెలంగాణకు పోలికేంటి? సేమ్ టూ సేమ్ తెలంగాణలోనూ బెంగాల్ మాదిరే రాజకీయం నడుస్తోందని పోల్చుతున్నారు. బెంగాల్ తర్వాత నెక్ట్స్ టార్గెట్ తెలంగాణేనంటూ అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. బెంగాల్ లో ఎలాగైతే మమతా బెనర్జీ.. ప్రతిపక్షాలను ఎదగకుండా చేశారో.. ఇక్కడ కేసీఆర్ సైతం కాంగ్రెస్, టీడీపీలను చీల్చి ఆ పార్టీలను బొంద పెట్టే ప్రయత్నం చేశారు. ఒకప్పటి ప్రధాన ప్రతిపక్షాలైన హస్తం, సైకిల్ చతికిలపడటంతో.. కేసీఆర్ వ్యతిరేకులందరికీ బీజేపీ ఆశాకిరణంగా కనిపిస్తోంది. కాంగ్రెస్, టీడీపీ ప్రాభవం తగ్గడంతో ఇక ప్రతిపక్షం పాత్రలో కమలదళం దూసుకుపోతోంది. బీజేపీకి మిగతా విపక్షాల నుంచి ఎలాంటి పోటీ లేకపోవడంతో.. అధికార పార్టీతో నేరుగా తలపడుతూ తడాఖా చూపిస్తోంది పువ్వు గుర్తు పార్టీ.  కమలంతో కారుకు కష్టాలేనా?  కేంద్రంలో అధికారంలో ఉన్న జాతీయ పార్టీ కూడా కావడంతో.. బీజేపీకి బలం, బలగం దండిగా ఉంది. అందుకే వివిధ పార్టీల్లో ఉన్న అసంతృప్తులు.. కేసీఆర్ వ్యతిరేకులంతా బీజేపీ వైపు చూస్తున్నారు. ప్రభుత్వ విధానాలు నచ్చక ఆగ్రహంతో ఉన్న వర్గాలన్నీ కాషాయ పార్టీకే జై కొడుతున్నాయి. దుబ్బాక, గ్రేటర్ లో ప్రజాతీర్పు కమలానికి అనుకూలంగా ఉండటానికి ఇదే కారణమంటున్నారు. కేసీఆర్ కాంగ్రెస్, టీడీపీలను తొక్కేయడంతోనే.. తెలంగాణలో కమలం విరబూస్తోందని.. బెంగాల్ లో సైతం అచ్చం ఇలానే జరిగిందని గుర్తు చేస్తున్నారు. ఈ రెండు రాష్ట్రాల రాజకీయ రంగ స్థలంలో పాత్రలన్నీ ఒకేలా ఉండటంతో.. బెంగాల్ గెలుపు తర్వాత తెలంగాణే టార్గెట్ అంటూ అమిత్ షా సింహగర్జన చేశారంటూ విశ్లేషిస్తున్నారు. బెంగాల్ లో ఫైర్ బ్రాండ్ లీడర్ దీదీతో కబడ్డీ అడుకుంటున్న కమలనాథులు.. తెలంగాణలో రాజకీయంగా రాటు దేలిన కేసీఆర్ తో  ఏమేరకు నెగ్గుకొస్తారో చూడాలి.   

పీకే ఇంటిపైకి బుల్డోజర్

రాజకీయాలు గాడి తప్పుతున్నాయి. ప్రతీకారాలకు అధికారం అస్త్రంగా మారుతోంది. ప్రజల సంక్షేమం కోసం పని చేయాల్సిన పాలకులు... దాన్ని పక్కన పెట్టి తమ ప్రత్యర్థులను టార్గెట్ చేయడంపై ఫోకస్ చేస్తున్నారు. దూకుడు నిర్ణయాలతో రాజకీయాలకు మచ్చ తెస్తున్నారు. గతంలో తమిళనాడు ఎక్కువగా కనిపించిన ఈ తరహా రాజకీయాలు... ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో పీక్ స్టేజీకి చేరాయి. ఏపీలో జరుగుతున్న పరిణామాలతో ప్రభావితం అయ్యారో ఏమో.. బీహార్ లోనూ అదే జరుగుతోంది.  ప్రముఖ రాజకీయ వ్యూహకర్త, జనతాదళ్ యునైటెడ్ మాజీ నేత ప్రశాంత్ కిశోర్ ఇంటి సరిహద్దు గోడలను బీహార్‌లోని బక్సర్ పాలనా యంత్రాంగం కూల్చివేసింది. ప్రహారి గోడతో పాటు అతని ఇంటిలోని కొంత భాగాన్ని కూడా  నేలమట్టం చేసింది. ప్రశాంత్ కిశోర్ ఇంటిలోని కొంత స్థలాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు బక్సర్ అధికారులు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం 84వ జాతీయ రహదారిని ఫోర్‌లైన్స్‌గా మార్చేందుకు భూ సేకరణ ప్రక్రియ జరుగుతోంది. ఈ నేపధ్యంలోనే ప్రశాంత్ కిశోర్‌కు చెందిన ఇంటిలోని  కొంత భాగాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నదని తెలుస్తోంది. ప్రశాంత్ కిశోర్ ఇంటి గోడలను కూల్చివేస్తున్న సమయంలో జనం అక్కడ భారీఎత్తున గుమిగూడారు. 15 నిముషాల్లో ఈ కూల్చివేతల కార్యక్రమం పూర్తయ్యింది. తన ఇంటిలోని కొంత బాగాన్ని బుల్డోజర్ తో కూల్చడంపై  ప్రశాంత్ కిశోర్ ఇప్పటివరకూ ఏమీ మాట్లాడలేదు. బీహార్ అసెంబ్లీకి గత నవంబర్ లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. బీజేపీ-జేడీయూ కూటమి అత్తెసరు మెజార్టీతోనే విజయం సాధించి అధికారం చేపట్టింది. అయితే అసెంబ్లీ ఎన్నికలకు ఆర్జేడీకి వ్యూహకర్తగా వ్యవహరించారు ప్రశాంత్ కిషోర్. ఆయన డైరెక్షన్ లోనే తేజస్వి యాదవ్ దూసుకుపోయారు. బీజేపీ-జేడీయూ కూటమికి చుక్కలు చూపించారు. ప్రచారంలో బీజేపీ-నితీశ్ కూటమిపై ఘాటుగా విమర్శలు చేశారు పీకే. ఆ కోపంతోనే ఇప్పుడు ఆయన ఇంటిని కూల్చేశారని భావిస్తున్నారు .

దారికొస్తున్న సోషల్ మీడియా 

సోషల్ మీడియా రెండు వైపులా పదునున్న కత్తి. ఎవరు ఎలా ఉపయోగిస్తున్నారు అనే దానిపై ప్రయోగం, ప్రయోజనం, ఫలితం ఆధారపడి ఉంటాయి. అయితే దురదృష్టవశాత్తు ప్రపంచవ్యాప్తంగా కూడా సోషల్ మీడియా దుర్వినియోగమే ఎక్కువగా ఉందని అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇక మన దేశం విషయం అయితే చెప్పనక్కరలేదు.  ఇతర దేశాలతో పాటుగా మన దేశంలోనూ విద్వేషపూరిత వ్యాఖ్యలు, విమర్శల వ్యాప్తికి సోషల్ మీడియా వేదికగా నిలుస్తోంది. అందుకే ఎక్కడ ఎలాంటి అల్లర్లు జరిగిన, అశాంతి చోటు చేసుకున్నా, శాంతి భద్రతల పరిస్థితి తలెత్తినా,ప్రభుత్వ అధికారులు, వెంటనే సోషల్ మీడియాపై ఆంక్షలు విధించడం ఆనవాయితీగా మారింది. రౌడీ షీటర్లు ఇతర సంఘ వ్యతిరేక శక్తుల విషయంలో ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటారో, సోషల్ మీడియా విషయంలో కూడా అలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోవలసిన అగత్యం ఏర్పడుతోంది. అనేక సందర్భాలలో సోషల్ మీడియాపై ఆంక్షలు విధించిడం వలన పరిస్థితి వేగంగా అదుపులోకి వచ్చిన సందర్భాలు కూడా లేక పోలేదు. అయితే, ఇలా భావప్రకటన స్వేచ్చను హరించడం ఎంత వరకు సమంజసం అనేది ప్రస్తుతానికి ప్రశ్నగానే మిగిలింది. అందుకే, మీడియాకు అయినా సోషల్ మీడియాకు అయినా స్వయం నియంత్రణ  అనండి చాలా అవసరమని, అనేక మంది అభిప్రాయపడుతున్నారు.   అదలా ఉంచే  మెల్లి మెల్లిగా సామాజిక మాధ్యమ సంస్థల మధ్య పోటీ పెరగడంతో ఆయా సంస్థలు తమ వేదికలు దుర్వినియోగం కాకుండా కట్టడిచేసే ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. ఉదాహరణకు ఢిల్లీ సరిహద్దుల్లో రెండు నెలలకు పైగా నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతోన్న రైతు ఉద్యమాన్ని తప్పుదోవ పట్టించేలా ఉన్న అకౌంట్లను తొలగించాలన్న కేంద్రం ఆదేశాలను ట్విట్టర్ ముందుగా బేఖాతరు చేసింది. అది  ‘భావ ప్రకటన స్వేచ్ఛ’ విధానాని విరుద్ధమని ప్రకటించింది. అయితే,  కేంద్ర ప్రభుత్వం కూ’ యాప్’ను పోటీకి నిలపడంతో, ట్విట్టర్ తలొగ్గక తప్పలేదు. కేంద్ర ప్రభుత్వం సూచించిన వాటిలో 97 శాతం అకౌంట్లు, పోస్టులను ట్విట్టర్ బ్లాక్‌ చేసింది.     ఇదొక ఉదాహరణ మాత్రమే, నిజానికి ఫిర్యాదులతో సంబంధం లేకుండా, సామాజిక మాధ్యమాల దుర్వినియోగాన్ని నియంత్రించేందుకు నిరంతర పర్యవేక్షణ యంత్రంగాల ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నట్లు సామాజిక మాధ్యమ సంస్థలు ప్రకటిస్తున్నాయి. ఇందులో భాగంగా, ప్రపంచవ్యాప్తంగా గత ఏడాది చివరి మూడు నెలలలోనే  రెండుననర కోట్లు పైగా విద్వేషపూరిత ప్రసంగాలకు సంబంధించిన పోస్టులపై చర్యలు తీసుకున్నట్లు ఫేస్‌బుక్‌ వెల్లడించింది. ప్రస్తుతం ఫేస్‌బుక్‌కు ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో, సుమారు 184 కోట్ల రోజువారీ వినియోగదారులు ఉన్నారు.  నిత్యం కోట్ల సంఖ్యలో వినియోగదారులు ఫేస్‌బుక్‌ వేదికగా పోస్టులు చేస్తుంటారు. అయితే, వీటిలో విద్వేషపూరిత ప్రసంగాలు, అభ్యంతరకరమైన పోస్టులపై చర్యలు తీసుకోవడంలో ఫేస్‌బుక్‌ చూసీ చూడనట్లు వదిలేస్తుందనే విమర్శలను ఎదుర్కొంది.  ఇక మెసెంజర్, టెలిగ్రామ్ రావడంతో ఫేస్ బుక్ తప్పనిసరి  పరిస్థితులలో దిద్దుబాటు చర్యలు చేపట్టింది.  విద్వేషపూరిత పోస్టులను కట్టడి చేసేందుకు చర్యలు తీసుకుంటామని, ఇందుకు మరిన్ని విధానాలను తీసుకొస్తామని పేస్ బుక్  ప్రకటిస్తోంది. ముఖ్యంగా వార్తా విభాగంలో ఇటువంటి వాటిని కచ్చితంగా అమలు చేస్తున్నామని తాజాగా వెల్లడించింది. ఇందులో భాగంగానే తాజాగా ప్రతి పదివేల వ్యూస్‌లో 7 నుంచి 8 విద్వేషపూరిత వ్యూస్‌ తగ్గినట్లు ఫేస్‌బుక్‌ ప్రతినిధి గయ్‌రోజన్‌ వెల్లడించారు. హింసాత్మక, గ్రాఫిక్‌ కంటెంట్‌ కూడా 0.07 శాతం నుంచి 0.05శాతానికి తగ్గినట్లు తెలిపారు. అంతేకాకుండా యూజర్లు రిపోర్టు చేయకముందే వీటిపై చర్యలు తీసుకునే రేటు 26 శాతం నుంచి 49 శాతానికి పెరిగినట్లు వెల్లడించారు. సోషల్ మీడియాను సమాజ హితం కోసం వినియోగించుకోవాలని కోరుకునే వారికి ఇది ఒక శుభ వార్తే కదా...