ఇంటి అప్పు తీర్చిన అభయప్రదాత.. బాబు

చంద్ర‌బాబు ఫించ‌న్ పంపీణీ   కార్య‌క్ర‌మంతో స్వయంగా పాలుపంచుకుని లబ్ధిదారుల ఇంటికి స్వయంగా వెళ్లి అందజేస్తున్న చంద్రబాబు.. ఆ సందర్భంగా వారి కష్టాలను వింటున్నారు. వాటిని తీర్చడానికి తన వంతు సహాయం చేయడానికి ఇసుమంతైనా వెనుకాడటం లేదు.   ఆయ‌న ఏ ఇంటికి ఆ ఒక‌టో తారీఖున వెళ్తారో ఆ ఇంటి వారికి ఉన్న సమస్యలన్నీ పరిష్కారమైపోయినట్లే అనడంలో సందేహం లేదు.  కొండకొచో వారి జీవిత కాల సమస్యలకు కూడా చిటికెలో పరిష్కరించేస్తున్నారు.  గతంలో అంటే వైసీపీ హయాంలో వాలంటీర్లు తెల్లవారకుండానే తలుపుతట్టి మరీ పింఛన్లు అందజేసేవారిని జగన్ సర్కార్ గప్పాలు కొట్టుకునేది.  అది ఏ మేరకు వాస్తవమో తెలియదు కానీ, పింఛన్లలోనూ ముడుపులు దండుకునే వారంటూ అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. సరే అది పక్కన పెడితే అప్పటి ముఖ్యమంత్రి జగన్ జనానికి ముఖం చూపిన సందర్భాలు చాలా చాలా తక్కువ. ఏ బటన్ నొక్కుడు కార్యక్రమానికో రోడ్డు కిరువైపులా పరదాలు కట్టి సభా స్థలికి వచ్చే ఆయన ప్రసంగాలు చేసే వారే కానీ ప్రజల వినతులను పట్టించుకున్న దాఖలాలు లేవు. అయితే చంద్రబాబు మాత్రం అందుకు పూర్తి భిన్నం. ఆయన నిత్యం ప్రజలతో మమేకమౌతున్నారు. వారి సమస్యలు వింటున్నారు. పరిష్కరిస్తున్నారు. స్వయంగా ఆయన ఒక లబ్ధిదారు ఇంటికి వెళ్లి మరీ పింఛను అందిస్తున్నారు. అందులో భాగంగా సోమవారం (డిసెంబర్ 1) ఏలూరు జిల్లా గోపీనాథపట్నంలో నాగలక్ష్మి అనే లబ్ధిదారు ఇంటికి వెళ్లిన చంద్రబాబు ఆమెకు పింఛను అందజేశారు. వారి యోగక్షేమాలు విచారించారు. సమస్యలను అడిగి మరీ తెలుసుకున్నారు.  ఆ ఇంట్లో చ‌దువుకుంటున్న యువ‌కుడు, చ‌దువు మ‌ధ్య‌లోనే ఆపేసిన యువ‌తికి సంబందించిన వివ‌రాలను తెలుసుకుని,  ఆ యువ‌కుడికి టీసీఎస్ లో జాబ్ కోసం సిఫారసు చేస్తానన్నారు. అలాగే  చ‌దువు ఆపేసిన  యువ‌తిని హైబ్రిడ్ ప‌ద్ధ‌తిలో తిరిగి ఎలా చ‌దువుకోవాలో సూచించారు. ఇక ల‌బ్దిదారు నాగ‌ల‌క్ష్మికి సంజీవ‌నీ ప‌థ‌కం ద్వారా ఎలాంటి ఆహారం అందించాలో సూచించారు. అక్కడితో ఆగలేదు.. నాగలక్ష్మి ఇంటి నిర్మాణం కోసం ఎంత ఖర్చు అవుతుందో ఆరా తీసి.. వారికి ఉన్న అప్పు ఎంతో తెలుసుకుని ఆ మొత్తాన్ని తీర్చే ఏర్పాట్లు చేయాల్సిందిగా అక్కడికక్కడే కలెక్టర్ ను ఆదేశించారు. దీంతో నాగలక్ష్మి కుటుంబం అప్పు మొత్తం తీరిపోయింది. సమస్యలు దూదిపింజల్లా ఎగిరిపోయాయి. ప్రజా ప్రభుత్వం ఎలా ఉంటుందో, ప్రజా నాయకుడు ఎలా ఉండాలో చంద్రబాబు ఆచరణలో చూపుతున్నారంటూ సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

చంద్రబాబు కాదు.. చిన్నబాబే!

ఇంతై.. ఇంతింతై.. వటుడింతై.. అన్నట్లుగా రాజకీయంగా, వ్యక్తిగా నారా లోకేష్ రోజు రోజుకూ ఎదుగుతున్నారు. తండ్రి చాటు బిడ్డగా, ఆయన చిటికిన వేలు పట్టుకుని రాజకీయాలలో బుడిబుడి అడుగులు ఆరంభించిన లోకేష్ ఇప్పుడు తండ్రితో సమానంగా, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే తండ్రికి మించిన తనయుడిగా ఎదుగుతున్నారు. తెలుగుదేశం పార్టీలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రాధాన్యత, అధికార పరిధి విస్తరణ వేగంగా పెరుగుతోంది. పార్టీలో నవతరం నాయకుడిగా  నారా లోకేష్ తనను తాను నిరూపించుకోవడమే కాకుండా పార్టీ నేతలు, శ్రేణుల నుంచి మద్దతు కూడా పొందుతున్నారు. పార్టీ వ్యవహారాలలో ఆయన పోషిస్తున్న కీలక పాత్ర పరిధి విస్తృతి చంద్రబాబుతో సమానంగా మారుతోందనడానికి ఇటీవలి కాలంలో పలు తార్కానాలు కనిపించాయి. గతంలో విదేశాలలో చిక్కుకున్న తెలుగువారిని వెనక్కు తీసుకురావడంలో కానీ.. ప్రకృతి విపత్తులు సంభవించిన సమయంలో సహాయ పునరావాస కార్యక్రమాల పర్యవేక్షణలో కానీ గతంలో చంద్రబాబు ఏ విధంగా క్రియాశీలంగా వ్యవహరించారో తెలిసిందే. ఇప్పుడు ఆ పనిని అంతే సమర్థతతో.. ఇంకా చెప్పాలంటే అంతకు మించి అన్నట్లుగా లోకేష్ నిర్వహిస్తున్నారు.  అంతే కాదు జాతీయ స్థాయిలో కూడా లోకేష్ కు మంచి గుర్తింపు లభిస్తోంది.   కేంద్రంతో సంబంధాల విషయంలో కానీ, రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే అంశంలో కానీ లోకేష్ ను తండ్రిని మించిన తనయుడిగా పార్టీ నేతలూ, శ్రేణులే కాదు, పరిశీలకులు సైతం అభివర్ణిస్తున్నారు.    ఇహ ఇప్పుడు తాజాగా లోకేష్ ఢిల్లీలో ఉన్నారు. ఈ పర్యటనలో ఆయన కేంద్ర మంత్రులు అమిత్ షా, శివరాజ్ సింగ్ చౌహాన్ లతో భేటీ అవుతారు. ఈ భేటీలలో ఆయన ఇటీవలి మొంథా తుపాను కారణంగా రాష్ట్రానికి జరిగిన ఆస్తినష్టాన్ని, రాష్ట్రంపై పడిన ఆర్థిక భారాన్నీ వారికి వివరిస్తారు. అందుకు సంబంధించిన నివేదికలు సమర్పిస్తారు. కేంద్రం నుంచి సహాయాన్ని కోరతారు. సాధారణంగా ఇలా కేంద్రానికి విజ్ణప్తులు చేయడం, ప్రకృతివిపత్తుల కారణంగా సంభవించిన ఆర్థిక నష్టాన్ని వివరించి సహాయం కోరడం అన్నది ముఖ్యమంత్రి చేస్తారు. అయితే ఇప్పుడు ఆ బాధ్యత లోకేష్ తీసుకున్నారు.   అంతే కాదు.. పార్లమెంటులో తెలుగుదేశం సభ్యులు అనుసరించాల్సిన వ్యూహం, రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలను లేవనెత్తే విషయంలో లోకేష్ ఎంపీలకు దిశా నిర్దేశం చేయనున్నారు. మొత్తంగా తెలుగుదేశం పార్టీలోనూ, కూటమి ప్రభుత్వంలోనూ లోకేష్ కు పెరుగుతున్న ప్రాధాన్యత, ప్రాముఖ్యతను కూటమి భాగస్వామ్య పార్టీలు కూడా స్వాగతిస్తున్నాయి. అంతగా ఆయన తన సమర్ధతతో అందరినీ ఆకట్టుకుంటూ ముందుకు సాగుతున్నారు. 

పొగాకు, పాన్ మసాలా ఉత్పత్తులకు కేంద్రం షాక్

  దేశంలో పెద్దగా నియంత్రణ లేని గుట్కా, పాన్ మసాలా పరిశ్రమను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక కీలక చట్టాన్ని తీసుకురాబోతోంది. ‘హెల్త్ సెక్యూరిటీ టు నేషనల్ సెక్యూరిటీ సెస్ బిల్, 2025’ పేరుతో రూపొందించిన ఈ బిల్లును ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారు. ఈ కొత్త చట్టం ప్రకారం, గుట్కా, పాన్ మసాలా వంటి పొగాకు ఉత్పత్తులపై పన్ను విధించే విధానం పూర్తిగా మారనుంది. ఇప్పటివరకు తుది ఉత్పత్తి ఆధారంగా పన్ను విధిస్తుండగా, ఇకపై వాటి తయారీకి ఉపయోగించే యంత్రాల ఉత్పత్తి సామర్థ్యం ఆధారంగా ప్రత్యేక సెస్సు విధించనున్నారు. చేతితో తయారుచేసే యూనిట్లకు కూడా ప్రతినెలా తప్పనిసరిగా నిర్దిష్ట మొత్తంలో సెస్సు చెల్లించాల్సి ఉంటుంది. నిబంధనలు కఠినతరం ఈ కొత్త విధానంలో, ఉత్పత్తి ఎంత జరిగిందనే దానితో సంబంధం లేకుండా ప్రతి నెలా తయారీదారులు సెస్సు చెల్లించాలి. ఒకవేళ యంత్రాలు లేదా యూనిట్ 15 రోజులకు మించి పనిచేయకపోతే మాత్రమే మినహాయింపు లభిస్తుంది. ప్రతి తయారీదారు తప్పనిసరిగా ప్రభుత్వంతో రిజిస్టర్ చేసుకోవాలి, నెలవారీ రిటర్న్స్ దాఖలు చేయాలి. అధికారులు ఎప్పుడైనా తనిఖీలు, విచారణ, ఆడిట్ చేసేందుకు వీలు కల్పించాలి. ఈ నిబంధనల ఉల్లంఘనకు ఐదేళ్ల వరకు జైలు శిక్ష, భారీ జరిమానాలు విధించేలా బిల్లులో ప్రతిపాదనలు ఉన్నాయి. అవసరమైతే సెస్సును రెట్టింపు చేసే అధికారాన్ని కూడా ప్రభుత్వం తన వద్దే ఉంచుకోనుంది. ధరలపై ప్రభావం ఉండదు మరోవైపు, సిగరెట్లపై ఉన్న జీఎస్టీ పరిహార సెస్సును కూడా కేంద్ర ఎక్సైజ్ చట్టం పరిధిలోకి మారుస్తూ మరో బిల్లును ప్రభుత్వం ప్రవేశపెడుతోంది. అయితే, ఈ మార్పుల వల్ల గుట్కా, పాన్ మసాలా లేదా సిగరెట్ల ధరలపై వినియోగదారులపై ఎలాంటి అదనపు భారం పడదని అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న పన్ను రేట్లలో ఎటువంటి మార్పు ఉండదని, కేవలం పన్నుల వసూలు విధానాన్ని క్రమబద్ధీకరించి, పారదర్శకత పెంచడమే లక్ష్యమని వివరించారు

ఏపీలో కొత్త పురుగు వ్యాధి కలకలం...మహిళ మృతి

  విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం మిట్టపల్లి గ్రామంలో గత కొంతకాలంగా జ్వరంతో బాధపడుతున్న రాజేశ్వరి(36) అనే మహిళ, ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లగా, స్క్రబ్ టైఫస్ సోకిందని వైద్యులు నిర్ధారించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందిన రాజేశ్వరి..ఈ స్క్రబ్ టైఫస్ వ్యాధి రాష్ట్రంలో అన్ని జిల్లాలో వ్యాపిస్తుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. చిత్తూరులో 379, కాకినాడలో 141, విశాఖపట్నంలో 123, వైఎస్సార్ కడపలో 94, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరులో 86, అనంతపురంలో 68, తిరుపతిలో 64, విజయనగరంలో 59, కర్నూలులో 42, అనకాపల్లిలో 41, శ్రీకాకుళంలో 34, అన్నమయ్యలో 32, గుంటూరులో 31, నంద్యాలలో 30 కేసులు నమోదైనట్లు వైద్య శాఖ అధికారులు తెలిపారు. వ్యాధి నిర్ధారణ జరిగితే సాధారణ యాంటిబయాటిక్స్ తో ఈ వ్యాధి నయం అవుతుందని, అస్వస్థతకు గురవ్వగానే నిర్లక్ష్యం చేయకుండా పరీక్షలు చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.  

భవిష్యత్ కార్యాచరణపై పోలీస్ అధికారులతో డీజీపీ సమీక్ష

  తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు ప్రణాళికలో కీలకం కానున్న 'తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌ 2047' సన్నాహాలపై రాష్ట్ర పోలీస్‌ డైరెక్టర్‌ జనరల్‌  బి. శివధర్‌ రెడ్డి  అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరిగిన ఈ సమావేశంలో డీజీపీ పోలీసు ఉన్నతాధికారులకు కీలక వ్యూహాత్మక దిశానిర్దేశం చేశారు.  'గ్లోబల్ సమ్మిట్ 2047' కార్యక్రమాన్ని కేవలం నిర్దేశిత సమయంలోనే కాకుండా, అత్యంత చురుకైన ప్రణాళికతో అమలు చేయాలని, వాస్తవంగా నిర్దేశించిన సమయం కంటే దశాబ్దం ముందుగానే అనేక లక్ష్యాలను సాధించాల్సిన అవసరం ఉందని డిజిపి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా, ఫోరెన్సిక్ ఎవిడెన్స్ యాక్ట్‌ను ప్రవేశపెట్టడంపై ఒక ముసాయిదా ప్రతిపాదనను సిద్ధం చేయాలని ఆయన సూచించారు. అలాగే, పంచాయతీ ఎన్నికల అనంతరం సీనియర్‌, యువ అధికారుల బృందం సెక్యూరిటీ ఆపరేటింగ్‌ సెంటర్‌ (ఎస్‌ఓసీ)ను సందర్శించడానికి సంబంధించిన షెడ్యూల్‌ను వెంటనే ఖరారు చేయాలని ఆదేశించారు.  అదనపు డిజిపి (సాంకేతిక సేవలు) సహకారంతో ప్రత్యేక సాంకేతిక అభివృద్ధి విభాగాన్ని (టెక్నాలజీ డెవలప్‌మెంట్ యూనిట్) ఏర్పాటు చేయాలని, ఇన్నోవేషన్‌ ఇంక్యుబేటర్ల కోసం టీ-హబ్‌లో ఓ హ్యాకథాన్‌ను కూడా నిర్వహించాలని డిజిపి అభిప్రాయపడ్డారు.తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌ను డిసెంబర్ 8, 9 తేదీల్లో ఫ్యూచర్‌ సిటీలో నిర్వహించనున్నట్లు డిజిపి వెల్లడించారు. ఈ సదస్సుకు ప్రపంచ స్థాయి పారిశ్రామికవేత్తలు, దౌత్యవేత్తలు, పెట్టుబడిదారులు, నిపుణులు, ప్రణాళికా నిపుణులు హాజరుకానున్నారు.  అనంతరం, డిసెంబర్ 11 నుంచి 13 వరకు ప్రజల కోసం ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో టీజీఎస్పీఎఫ్‌ డైరెక్టర్‌ స్వాతి లక్రా, ఏడీజీపీ (సీఐడీ)  చారు సిన్హా, ఐజీపీ (మల్టీ జోన్-I)  ఎస్‌. చంద్రశేఖర్‌ రెడ్డి,  ఐజీపీ (రైల్వేలు & రోడ్డు భద్రత)  కె. రమేష్‌ నాయుడుతో పాటు ఏడీజీపీలు, ఐజీపీలు, డీఐజీలు, ఎస్పీలు, డీసీపీలు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా తమ అభిప్రాయాలను డిజిపి తెలియజేశారు.  

కేరళ ముఖ్యమంత్రికి ఈడీ నోటీసులు

  కేరళ సీఎం పినరయి విజయన్‌కు మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌ మెంట్ డైరెక్టరేట్  షోకాజ్ నోటీసు జారీ చేసింది. ముఖ్యమంత్రి వ్యక్తిగత కార్యదర్శి తో పాటు రాష్ట్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి థామస్ ఐజాక్, కూడా ఈ నోటీసు లు అందాయి.. ఈడీ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం..  జారీ చేసిన ఈ నోటీసులో ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నిబంధనలను ఉల్లంఘిం చినట్లు ఆరోపణలు ఉన్నాయి. మాజీ ఆర్థిక మంత్రి థామస్ ఐజాక్, కేఐఐఎఫ్‌బీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కేఎమ్ అబ్రహాం కూడా ఈ నోటీసులు అందుకున్నారు.  ఈడీ గత మూడేళ్లుగా ఈ కేసుపై దర్యాప్తు నిర్వహిం చి.. సెప్టెంబర్‌లో తన నివేదికను అడ్జుడికేటింగ్ అథారిటీ ముందు సమర్పించింది. మసాలా బాండ్ల ద్వారా సేకరించిన నిధులను.. ఆర్బీఐ నిబంధనలను ఉల్లంఘిస్తూ భూమి కొను గోలుకు ఉపయోగించినట్లు ఈడీ ఆరోపిస్తోంది.  కేరళ మౌలిక సదుపాయాల నిధి బోర్డు (కేఐఐఎఫ్‌బీ) 2019 ఏప్రిల్‌లో లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో జాబితా చేయడం ద్వారా మసాలా బాండ్ల రూపంలో రూ. 2,150 కోట్లు నిధులను సేకరించింది. ఈ బాండ్ల జారీపై ఈడీ 2021లో దర్యాప్తు ప్రారంభించింది. అయితే ఈడీ నోటీసు అందినట్లు మాజీ ఆర్థిక మంత్రి థామస్ ఐజాక్ కూడా ధృవీకరించారు. అయితే ఈ ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. "ఇదంతా అనవసరం. మేము భూమి కొనుగోలు కోసం ఆ నిధులను ఎప్పుడూ ఉపయోగించలేదు. కేఐఐఎఫ్‌బీ ప్రాజెక్టుల కోసం భూసేకరణ నిబంధనల ప్రకారమే జరిగింది.  ఈ ఈడీ నోటీసు ఎన్నికల స్టంట్‌లో భాగమే" అని ఐజాక్ అన్నారు. కేఐఐ ఎఫ్‌బీ సీఈఓ అబ్రహాం ఈ నోటీసుపై స్పందించడానికి నిరాకరించగా.. ముఖ్యమంత్రి అదనపు వ్యక్తిగత కార్యదర్శి రవీంద్రన్ తనకు నోటీసు గురించి తెలియదని తెలిపారు.

నీలోఫర్ హాస్పిటల్‌లో బొద్దింకల బెడద...రోగుల తిప్పలు

  నేను రాను బిడ్డో సర్కారు దావఖానకి అనే పాట అందరికీ సుపరిచితం... పాత రోజుల్లో గవర్నమెంట్ హాస్పిటల్‌కి వెళ్లడానికి జనాలు భయపడుతూ ఉండేవారు. ఇప్పుడు నీలోఫర్ లో కూడా అదే పరిస్థితి ఏర్పడింది. అక్కడి పరిస్థితి చూసి రోగుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తూ... వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు... హైదరాబాద్ నగరంలోని నాంపల్లి పరిధిలోని నిలోఫర్ చిల్డ్రన్స్ హాస్పిటల్‌లో రోగుల భద్రత, పరిశుభ్రతపై తీవ్రమైన ఆందోళనలు వ్యక్తమవుతు న్నాయి.  ముఖ్యంగా RICU వార్డులో బొద్దింకల సంఖ్య అధికంగా పెరిగిపోయిందని చిన్నారుల పేరెంట్స్ అసహనం వ్యక్తం చేస్తు న్నారు. తమ పిల్లల చికిత్స కోసం హాస్పిటల్‌కి వస్తే... హాస్పీటల్లో ఉన్న అత్యంత కీలకమైన వార్డులో బొద్దింకలు యథేచ్ఛగా సంచరిస్తు న్నాయని పిల్లల తల్లిదండ్రులు వాపోయారు. ఈ బొద్దింకల కారణంగా పిల్లల ఆరోగ్య ప్రమాదంలో పడేటట్టుగా ఉందని పేరెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు.  హాస్పిటల్ పరిపాలనా విభాగం ఈ అంశాన్ని నిర్లక్ష్యంగా తీసుకుంటోందని తల్లిదండ్రులు వాపోయారు. పరిశుభ్రతా చర్యలు సక్రమంగా చేపట్టకపోవడం, శానిటేషన్ సిబ్బంది పర్యవేక్షణలో లోపాలు కారణంగానే ఈ దుస్థితి నెలకొన్నదని వారు విమర్శించారు.ఈ సమస్యపై అధికారులు వెంటనే స్పందించి అవసరమైన చర్యలు తీసుకొని, రోగులకు శుభ్రమైన మరియు సురక్షితమైన వాతావరణం కల్పించాలని చిన్నారుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

ఓల్డ్ సిటీ మెట్రోకు రూ.125 కోట్లు మంజూరు

  పాతబస్తీ మెట్రోకు తెలంగాణ ప్రభుత్వం రూ.125 కోట్లుకు  పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తున్నట్లుగా ప్రకటించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 'మెట్రో కనెక్టివిటీ టూ ఓల్డ్ సిటీ' పథకం కింద ఈ నిధులకు పర్మిషన్ వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. ఓల్డ్ సిటీ మెట్రోను మరింత వేగం నిర్మించడం కోసం ఈ నిధులు ఎంతగానో ఉపయోగపడుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు హైదరాబాద్ మెట్రో రైల్‌లో 20 మంది ట్రాన్స్‌జెండర్లను భద్రతా సిబ్బందిగా నియమించింది.ప్రత్యేక శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకున్న వీరంతా సోమవారం నుంచి ఎంపిక చేసిన మెట్రో స్టేషన్లు, రైళ్లలో తమ విధులను ప్రారంభించారు. రైళ్ల రాకపోకల వివరాలతో పాటు, మహిళా ప్రయాణికుల భద్రత విషయంలో వీరు ప్రముఖ పాత్ర వహించన్నట్లు మెట్రో అధికారులు తెలిపారు.  

సీఎం చంద్రబాబుపై లిక్కర్ కేసు కొట్టివేత

  సీఎం చంద్రబాబుపై వైసీపీ హయాంలో పెట్టిన లిక్కర్ కేసును కోర్టు కొట్టివేసింది.  అవకతవకలు జరిగినట్లు ఆధారాలు లేకపోవడంతో ఈ కేసును కొట్టివేస్తున్నట్లు పేర్కొంది. ఈ కేసు దర్యాప్తును ముగిస్తూ సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది.   అధికార దుర్వినియోగం జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో ఏసీబీ కోర్టు కేసును మూసేసింది. అలాగే ఆయనపై ఉన్న ఫైబర్ కేసును క్లోజ్ చేసినట్లు ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. మద్యం కంపెనీలకు లబ్ధి చేకూర్చారంటూ  చంద్రబాబు, కొల్లు రవీంద్రపై అప్పటి బేవరేజెస్‌ ఎండీ వాసుదేవరెడ్డి ఫిర్యాదు మేరకు గతంలో కేసు నమోదు చేసిన విషయం విదితమే

పరకామణి కేసులో సూత్రధారి...పాత్రధారి భూమాననే : మంత్రి అనగాని

  తిరుమల శ్రీవారి ఆలయంలో చోరీకి సంబంధించి విచారణ జరుగుతున్న పరకామణి కేసులో సూత్రధారి, పాత్రధారి వైసీపీ నేత భూమాన కరుణాకర్ రెడ్డినేనని తిరుపతి జిల్లా ఇంఛార్జ్ మంత్రి, రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. పరకామణి కేసులో అతి త్వరలో విచారణ నివేదిక ఇస్తారని, నిందుతులెవరో తెలిసిపోతుందని అన్నారు.  దేవుడి సోమ్మును దొంగతనం చేసిన వ్యక్తిని కాపాడేందుకు రాజీ చేయడం చరిత్రలో వినని, చూడని విషయమని అన్నారు. పరకామణి కేసులో భూమన కరుణాకర్ రెడ్డి ఉండబట్టే ఆ కేసు విచారణపై వ్యంగ్యంగా మాట్లాడుతున్నారని అన్నారు. దేవుడి అంటే ఎటువంటి నమ్మకం లేని కరుణాకరెడ్డి పింక్ డైమండ్, గోశాలతోపాటు ఇతర అంశాలపై అబద్దాలు ప్రచారం చేస్తూ భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని విమర్శించారు. పరకామణిలో చోరి చేసిన  దొంగ నుండి ఆస్తుల బదలాయింపు కరుణాకరెడ్డికే జరిగిందన్నారు.  కల్తీ నెయ్యి కేసులోనూ తప్పు జరిగినట్లు విచారణలో అందరూ అంగీకరించారని, కానీ తప్పు మాత్రం ఒకరిపై ఒకరు నెట్టుకుంటున్నారని అన్నారు. కానీ తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని అన్నారు.  రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ వ్యవహారంలో స్థానిక డీఐజీది ఏమైనా తప్పుంటే చర్యలు తీసుకుంటామని మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు.  

ఉత్తమ పోలీస్ స్టేషన్‌గా శామీర్పేట్

  దేశవ్యాప్తంగా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఎంపిక చేసిన ఉత్తమ పోలీస్ స్టేషన్లలో శామీర్పేట్ పోలీస్ స్టేషన్ ఏడో స్థానాన్ని, తెలంగాణలో మొదటి స్థానాన్ని సాధించింది. పోలీస్ స్టేషన్ పనితీరు, రికార్డుల నిర్వహణ, బాధితులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించడం, ఫిర్యాదులకు సమయానుకూల పరిష్కారం చూపించడం వంటి అంశాలను MHA పరిగణనలోకి తీసుకుంది. అలాగే స్టేషన్ పరిసరాల పరిశుభ్రత, గార్డెనింగ్, ఉత్తమ CCTNS పని, సిబ్బంది నైపుణ్యం వంటి అంశాలు కూడా పరిశీలనలో ఉన్నాయి.  ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా 10 ఉత్తమ పోలీస్ స్టేషన్లను ఎంపిక చేసే ఈ ప్రక్రియలో, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌కు చెందిన శామీర్పేట్ పోలీస్ స్టేషన్ రాష్ట్రంలో అగ్రస్థానాన్ని, దేశంలో ప్రతిష్టాత్మకమైన ఏడో ర్యాంకును సాధించడం విశేషం. ఈ సందర్భంగా మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి, ఏడీసీపీ మేడ్చల్ పురుషోత్తం, ఏసీపీ మేడ్చల్ బాలగంగిరెడ్డి, శామీర్పేట్ ఇన్స్పెక్టర్ శ్రీనాథ్‌తో పాటు సిబ్బందిని అభినందించారు.  

పాలమూరును పదేళ్లపాటు నిర్లక్ష్యం చేశారు : సీఎం రేవంత్‌

  నారాయణపేట జిల్లా మక్తల్‌లో ప్రజాపాలన విజయోత్సవాలను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గోన్నారు.‘‘ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తికావొస్తుంది. రెండేళ్ల విజయోత్సవ సభను మక్తల్‌లో నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని రేవంత్‌రెడ్డి అన్నారు. పాలమూరు బిడ్డను ప్రజలు గెలిపించి అధికారం కట్టబెట్టార అని తెలిపారు.  మహబూబ్‌నగర్ జిల్లా నుంచి 12 మంది ఎమ్మెల్యేలను అందించి నిండు మనసుతో ఆశీర్వదించారని.. మీ ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రిగా ఇవాళ మీ ముందు నిలబడ్డాలని రేవంత్ అన్నారు. పాలమూరు గడ్డ ప్రేమిస్తే ప్రాణమిస్తుంది.. మోసం చేస్తే పాతాళానికి తొక్కుతుంది అని నిరూపించారు. ఆనాడు పాలమూరులో ఊరు లేకపోయినా బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను  ఈ గడ్డ ఆదరించిందని కానీ పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి సంగం బండను పగలగొట్టేందుకు రూ. 12 కోట్లు కూడా ఇవ్వలేదని సీఎం అన్నారు.  పాలమూరు ప్రాజెక్టులను పూర్తి చేయలేదు..  పదేళ్లలో నారాయణపేట్ కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలని ఆలోచన చేయలేదని రేవంత్ అన్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే పనులు మొదలు పెట్టాలని ప్రయత్నిస్తే కోర్టులో కేసులు వేసి ఏడాదిన్నర పనులు జరగకుండా ఆపారని తెలిపారు. పాలమూరు అభివృద్ధి లక్ష్యంగా జిల్లాలో 14 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తున్నామని.. జిల్లాలో ఐఐటీ ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు.  2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఏకానమీగా తీర్చి దిద్దుతామని సీఎం అన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చాయి… కాళ్లల్లో కట్టెలు పెట్టే వాళ్ళను కాదు.. అభివృద్ధిని కోరుకునేవారిని ఎన్నుకోండని రేవంత్‌రెడ్డి తెలిపారు. దేశానికి పాలమూరు జిల్లా ఆదర్శంగా ఉండాలనేదే మా ఆకాంక్ష అని అన్నారు.  మీరు చేతికి ఓటు వేసి గెలిపిస్తే అభయహస్తమై మీ జీవితాల్లో వెలుగులు నింపుతోందని రేవంత్ అన్నారు. 

పెన్షన్ల కోసమే రూ.50 వేల కోట్లు ఖర్చు చేశాం : సీఎం చంద్రబాబు

  కూటమి ప్రభుత్వం 18 నెలల  పాలనలో పెన్షన్ల కోసమే రూ.50 వేల కోట్లు ఖర్చు చేశామని సీఎం చంద్రబాబు అన్నారు. ఇవాళ  ఏలూరు జిల్లా ఉంగుటూరు మండల పరిధిలోని గోపీనాథపట్నంలో గ్రామంలో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న గుడ్ల నాగలక్ష్మికి పెన్షన్ అందించారు. అనంతరం ఉంగుటూరులో ఏర్పాటు చేసిన అగ్రికల్చర్ ఎగ్జిబిషన్‌ను సందర్శించి, ప్రజా వేదిక సభలో సీఎం పాల్గొన్నారు.  ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతు విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసే పనిలో ఉన్నామని తెలిపారు. గ్రామసభలు అంటే మొక్కుబడిగా నిర్వహించడం కాదని ఒక మార్పు రావాలని అన్నారు. అభివృద్ధి పనుల వివరాలన్నీ సచివాలయంలో అందుబాటులో ఉంచాలని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్ని ఒక్కొక్కటిగా నెరవేర్చుతున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కంటే ధనిక రాష్ట్రాలు కూడా పెన్షన్ల కోసం ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేయడం లేదని ముఖ్యమంత్రి అన్నారు.  రాబోయే ఐదేళ్లలో రూ.1.65 లక్షల కోట్ల పెన్షన్లు ఇవ్వబోతున్నామని ప్రకటించారు. ప్రతి వంద మందిలో 13 మందికి పెన్షన్లు ఇస్తున్నామని అన్నారు. ప్రతి వంద మందిలో 13 మందికి పెన్షన్లు ఇస్తున్నామని అన్నారు. ప్రజల ఆహారపు అలవాట్ల అనుగుణంగా రైతులు డిమాండ్ ఆధారిత పంటలు పండించాలన్నారు. ఏపీ అభివృద్ధి జరిగితేనే భూముల ధరలు పెరుగుతాయని అన్నారు. హైదరాబాద్ అభివృద్ధి అయింది కాబట్టే అక్కడి భూముల ధరలు పెరిగాయని వెల్లడించారు.  ఒకప్పుడు కోకాపేటలో రూ.10 వేలకు ఎకరం భూమి వచ్చేదని, ఇప్పుడు ఎకరం రూ.170 కోట్లకు పైనే పలుకుతోందని అన్నారు. ఏపీకి భవిష్యత్తులో మంచి రోజులు రాబోతున్నాయని చంద్రబాబు అన్నారు. ఏడాదికి 3 సిలిండర్లు ఇస్తుమని.. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తుమని తెలిపారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా తల్లికి వందనం అమలు చేస్తున్నామని తెలిపారు.  ప్రజలు కూటమి అభ్యర్థులను 164 సీట్లలో గెలిపించి తమకు అపూర్వ మద్దతును అందించారని ఇన్ని సీట్లు ఇవ్వడం ద్వారా ప్రజలు తమ బాధ్యతను మరింత పెంచారని సీఎం తెలిపారు. 16,347 మందికి డీఎస్సీ ఉద్యోగాలు కల్పించామని తెలిపారు. అన్నదాత సుఖీభవ ద్వారా ప్రతి రైతుకు రూ.20 వేలు ఇస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. పీఎం కిసాన్ కింద రైతుల ఖాతాల్లో ఇప్పటికే రూ.14 వేలు జమ చేశామని ఆయన అన్నారు. పంచసూత్రాల ఆధారంగా వ్యవసాయాన్ని లాభసాటిగా చేయాలనేదే ప్రభుత్వం లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

ఇండియాలో మస్క్ స్టార్ లింక్ ఇంటర్నెట్ సేవలు!?

స్పేస్‌ఎక్స్, టెస్లా కార్ల  అధినేత ఎలాన్ మస్క్ తన స్టార్‌లింక్ ఇంటర్నెట్ సేవలను భారత్‌లో ప్రారంభించేందుకు ముందుకు వచ్చారు.  తక్కువ ఖర్చుతో, నమ్మకమైన ఇంటర్నెట్ సేవలను  భారత గ్రామీణ ప్రాంతాలకు అందిస్తానంటున్నారు. తన స్టార్ లింక్ ప్రస్తుతం ఇండియాలో ఉన్న టెలికాం సంస్థలకు ఎటువంటి పోటీ కాదని చెబుతున్నారు.  ప్రముఖ ఇన్వెస్టర్ నిఖిల్ కామత్‌తో 'పీపుల్ ఆఫ్ డబ్ల్యూటీఎఫ్' పాడ్‌కాస్ట్‌లో  మాట్లాడిన మస్క్ ప్రపంచ వ్యాప్తంగా  150 దేశాల్లో తన సేవలను అందిస్తోందనీ, ఇక ఇప్పుడు ఇండియాలో కూడా అడుగుపెట్టేందుకు తాను ఆసక్తిగా ఉన్నానని చెప్పుకొచ్చారు.  భూమికి దగ్గరగా తిరిగే వేలాది ఉపగ్రహాల ద్వారా హై-స్పీడ్ ఇంటర్నెట్ అందిస్తామని మస్క్ చెబుతున్నారు. భూమిపై ఫైబర్ కేబుల్స్ దెబ్బతిన్నా ఇంటర్నెట్ సేవలకు అంతరాయం కలగని టెక్నాలజీతో తమ సంస్థ సేవలందిస్తుందని మస్క్ చెప్పారు.   ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన సందర్భాలలో  కూడా  స్టార్‌లింక్ ఇంటర్నెట్ సేవలకు అంత రాయం కలగదని మస్క్ వివరించారు.  ఇటీవల రెడ్ సీ కేబుల్స్ తెగిపోయినప్పుడు కూడా స్టార్‌ లింక్ సేవలు నిరంతరాయంగా కొనసాగాయని ఈ సందర్భంగా మస్క్ గుర్తుచేశారు.

ఏఐకి మాటల మాయ.. కంపెనీల డేటాకు ప్రాంప్ట్ గండం!

ఏఐ వినియోగం రోజు రోజుకి పెరుగుతున్న నేపథ్యంలో కంపెనీలకు సరికొత్త ముప్పు పొంచి ఉన్నదని హైదరాబాద్ పోలీస్ కమిషనర్  సజ్జనార్ హెచ్చరించారు. ఈ మేరకు తన సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ ఖాతాలో చేసిన పోస్టులో ఇటీవలి కాలంలో  ఏఐ ఎవినియోగం చాలా ఎక్కువైంది. ప్రతి చిన్న  విషయానికి దానిని ఉపయోగిస్తున్నారు. అయితే.. ఏఐ విస్తృతి పెరిగాక.. చిన్న స్టార్టప్‌ల నుంచి బడా మల్టీ నేషనల్ కంపెనీల వరకు అంతా ఇప్పుడు  ఏఐ చాట్‌బోట్ ల జపం చేస్తున్నాయి. కస్టమర్ల సందేహాలకు క్షణాల్లో సమాధానాలివ్వడం, పని వేగం పెంచడం, ఖర్చు తగ్గించడం వంటి ప్రయోజనాలు ఉండటంతో సంస్థలు వీటిపై ఎక్కువగా ఆధారపడుతున్నాయి. అయితే, ఈ సాంకేతికత వెనుక ఓ సరికొత్త ముప్పు పొంచి ఉందని ఆయన పేర్కొన్నారు.  ఆ ముప్పు పేరే  ప్రాంప్ట్ ఇంజెక్షన్‌  అని  సజ్జనార్ తెలిపారు. అసలింతకీ ఈ ప్రాంప్ట్ ఇంజెక్షన్ ఏమిటి?.. అంటే.. ఏఐ పని చేయడానికి   ఇచ్చే ఆదేశాలను ప్రాంప్ట్ అంటారు. సైబర్ నేరగాళ్లు ఈ ప్రాంప్ట్ నే తమ ఆయుధంగా మలచుకుంటున్నారని సజ్జనార్ పేర్కొన్నారు.  ఏఐ మోడల్‌ను తప్పుదోవ పట్టించేలా, ట్రిక్ చేసేలా మిలీషియస్ ప్రాంప్ట్స్ ఇస్తున్నారని తెలిపారు.  క్లుప్తంగా చెప్పాలంటే..  ఏఐని మాటలతో మాయ చేస్తున్నారు. ఇలా ఏఐని కన్ఫ్యూజ్ చేసి, సాధారణంగా బయటపెట్టకూడని సంస్థల అంతర్గత పత్రాలు, కస్టమర్ల రికార్డులు, సిస్టమ్ వివరాలను రాబట్టడమే ఈ  'ప్రాంప్ట్ ఇంజెక్షన్ అటాక్ అని వివరించారు. ఇది డేటా భద్రతకు పెనుముప్పు అని హెచ్చరించారు.  ప్రస్తుతం చాలా సంస్థలు తమ ఏఐ మోడల్స్, చాట్‌బోట్‌లను సంస్థలోని కీలకమైన డేటా సిస్టమ్‌లకు  అనుసంధానిస్తున్నాయి. ఎండ్ యూజర్‌కు ఈ సమాచారం పొరపాటున కూడా కనిపించకూడదు. కానీ, హ్యాకర్లు వేసే ఒకే ఒక్క 'ట్రిక్కీ ప్రాంప్ట్' వల్ల ఈ గోప్య సమాచారమంతా బయటపడే ప్రమాదం ఉంది.  ఈ ముప్పును పసిగట్టి, నివారించడానికి సంస్థలు తక్షణమే 'ప్రాంప్ట్ గార్డ్‌రెయిల్స్' (రక్షణ కవచాలు) ఏర్పాటు చేసుకో వాల్సిన అవసరం ఉంది. కేవలం ఒక అంచె భద్రత సరిపోదు, మల్టీ-లేయర్ డిఫెన్స్ విధానాన్ని పాటించాలని సజ్జనార్ సూచించారు.  ఏఐకి సేఫ్టీ ట్రైనింగ్ ఇవ్వడం, కఠినమైన నిబంధనలు  విధించడం ద్వారా అనవసర సమాచారాన్ని ఇవ్వకుండా నియంత్రించాలి. అలాగే.. హానికరమైన  ప్రాంప్ట్‌లను గుర్తించే వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. ఇంకా,  ఏఐకి యాక్సెస్ ఇచ్చే డేటా, ఏపీఐ లపై కఠిన నియంత్రణలు ఉండాలి. ఇక   ఎప్పటికప్పుడు సెక్యూరిటీ ఆడిట్స్ నిర్వహిస్తూ,  డేటా యాక్సెస్‌ను పరిమితం చేయాలి. ఇలా సరైన భద్రతా చర్యలు తీసుకోకపోతే సంస్థల కార్యకలాపాలు స్తంభించిపోవడంతో పాటు, విలువైన డేటా నేరగాళ్ల చేతికి చిక్కి కోలుకోలేని దెబ్బతినే ప్రమాదం ఉందని  సిపి సజ్జనర్ తన పోస్ట్ లో హెచ్చరించారు. 

శునకంతో పార్లమెంట్‌కు వచ్చిన ఎంపీ రేణుకా చౌదరి

  పార్లమెంట్ శీతకాల సమావేశాలు సందర్బంగా ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి తన పెంపుడు కుక్కని తీసుకుని  రాజ్యసభకు వెళ్లారు. అనుమతి లేకపోవడంతో  పార్లమెంట్ సిబ్బంది వెనక్కి పంపారు. దీంతో అది కరిచే కుక్క కాదు, కరిచే వాళ్లంతా లోపల ఉన్నారంటూ రేణుకా చౌదరి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.  పెంపుడు కుక్కను తీసుకురావడంపై  బీజేపీ ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేశారు.   "మూగ జీవిని మేము రక్షించాం. అది పెద్ద సమస్యగా, చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వానికి వేరే పని లేదా?" అని ఆమె నిలదీశారు. అంతేకాకుండా, "అసలైన కరిచే వాళ్లు పార్లమెంట్‌లోనే కూర్చున్నారు. వాళ్లే ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ప్రతిరోజూ పార్లమెంట్‌లో కూర్చుని మమ్మల్ని కరిచే వాళ్ల గురించి మనం మాట్లాడం," అంటూ బీజేపీ ఎంపీలను ఉద్దేశించి రేణుకా చౌదరి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు  

హిల్ట్ పాలసీపై గవర్నర్‌కు బీజేపీ ఫిర్యాదు

  హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్‌ఫర్మేషన్-హెచ్ఐఎల్‌టీ పాలసీపై గవర్నర్ జిష్ణు దేవ్‌ వర్మకు తెలంగాణ బీజేపీ అధ్యక్షులు రామచందర్ రావు  నేతృత్వంలో గవర్నర్‌కు వినతి పత్రం అందించారు. హిల్ట్ పేరిట ప్రభుత్వం భూదందాకు పాల్పడుతోందని ఆరోపించారు. 9,292.53  ఎకరాల భూమిని మల్టీపర్పస్‌కు వినియోగించేలా తక్కువ ధరకు అప్పగిస్తోందని దీని వెనుక రూ.5 లక్షల కోట్ల స్కామ్ ఉందని ఆరోపించింది.  గవర్నర్ వెంటనే జోక్యం చేసుకొని  భూములను పరిరక్షించాలని హిల్ట్ రద్దు చేసి రిటైర్డ్ జడ్జితో విచారించాలని రామచందర్ గవర్నర్‌ను కోరారు.రేవంత్ సర్కార్ ప్రజావ్యతిరేక విధానాలను అనుసరిస్తోందని విమర్శించారు. ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ఈ నెల 7న ఇందిరాపార్కు వద్ద భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మహా ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. మున్సిపాలిటీల విలీనం ద్వారా జీహెచ్ఎంసీని విస్తరించాలనుకుంటోందని, ఇందులోనూ ఎన్నో కుట్రలు దాగి ఉన్నాయని బీజేపీ చీఫ్ తెలిపారు.  భూముల ధరలు ఎంత ఉన్నాయి, ఇప్పుడు ఎంత పలుకుతున్నాయి, గతంలో ఎంత ఉన్నాయో పరిశీలిస్తే అక్రమాలు చేస్తున్నట్లు అర్థమవుతోందని అన్నారు. ఇప్పటికే కోకాపేటలో భూములు ఎన్ని కోట్లు పలికాయో చూశామని అన్నారు.హైదరాబాద్ పారిశ్రామిక ప్రాంతాల్లోని భూములను బహుళ వినియోగ జోన్లుగా మార్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం హిల్ట్ పాలసీని అమలులోకి తెచ్చింది.  గవర్నర్‌ను కలిసిన వారిలో రామచందర్ రావుతో పాటు బీజేపీ శాసన సభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి తదితరులు ఉన్నారు.

మ‌స్క్ మ‌స్త్ చెప్పారుగా!

ఎలాన్ మ‌స్క్    మ‌న భార‌తీయ మేథ‌, ప్ర‌తిభ‌కు మంచి స‌ర్టిఫికేట్లే ఇచ్చారు.  జెరోధా స‌హ వ్య‌వ‌స్థాప‌కుడు నిఖిల్ కామ‌త్ త‌న పాడ్కాస్ట్- పీపుల్ బై డ‌బ్ల్యూటీఎఫ్ లో పాల్గొన్న మ‌స్క్ ప‌లు విష‌యాల‌ను పంచుకున్నారు. అందులో భాగంగా ఆయ‌న చేసిన కీల‌క‌మైన కామెంట్ భార‌తీయ మేథ‌తో అమెరికా లాభపడిందనీ, అది నూటికి నూరుపాళ్లూ వాస్తవమేననీ తెల్చి చెప్పారు.  ఇదే విష‌యాన్ని ట్రంప్ కూడా కోట్ చేసిన సంగ‌తి తెలిసిందే. అమెరికాలో ప్ర‌తిభ త‌క్కువ‌. ప్ర‌తిభ ఉన్నా కూడా దానికి శ్రమ జోడించ‌డంలో అమెరిక‌న్ల‌కు బ‌ద్ద‌కం  కాస్త ఎక్కువేన‌ని ఏకంగా అగ్రదేశాధినేతే అంగీకరించేసినప్పుడు.. మస్క్ చెప్పడంలో గొప్పేంటి అన్న ప్రశ్నను పక్కన పెడితే..  అసలిప్పుడు విషయం ఏంటంటే  ప్ర‌తిభావంతుల‌ను నియ‌మించుకునేందుకు తీస్కొచ్చిన హెచ్1 బీ వీసా దుర్వినియోగం ఇటీవ‌ల బాగా పెరుగుతోంది. దీంతో వ‌ల‌స వ్య‌తిరేక భావ‌న‌కు ఆస్కార‌మేర్ప‌డింద‌నింటారు మ‌స్క్. గ‌త ప్ర‌భుత్వ త‌ప్పిదాలు కూడా ఇందులో పుష్క‌లంగా ఉన్నాయంటున్నారు.   గ‌త పాల‌కుడు బైడ‌న్ పాల‌న‌లో.. స‌రిహ‌ద్దుల్లో ఎలాంటి నియంత్ర‌ణ ఉండేది కాద‌నీ.. దీంతో అక్ర‌మ వ‌ల‌స‌లు పెరిగాయన్నది మస్క్ మాటల వెనుక అర్ధం.  అక్రమంగా వలస వచ్చిన వారికి.. ప్రభుత్వ ప్రయోజనాలు అందకుండా చూడాలన్నది మస్క్ సూచన.  వలసల కట్టడికి సరిహద్దుల వద్ద నియంత్రణ కచ్చితంగా పాటించ కుంటే..  పలు సమస్యలు ఉత్పన్నమౌతాయని హెచ్చరిస్తున్నారు కూడా.   టాలెంటెడ్స్ కొర‌త ఇప్పుడే కాదు ఎప్పుడూ ఉంటుంద‌ని చెప్పే ఈ ట్రిలియనీర్ మస్క్.. చాలా కంపెనీలు టాలెంటెడ్స్ ను కాకుండా..  ఒక అమెరిక‌న్ ఎంప్లాయికి చెల్లించాల్సిన జీతంతో పోలిస్తే, విదేశీ ఉద్యోగికి స‌గం  ఇచ్చినా చాల‌న్న కోణంలో ఆలోచించి విదేశీయులను రిక్రూట్ చేసుకుంటున్నారనీ.. ఇదే వలస వ్యతిరేకతకు బలం చేకూర్చిందనీ చెబుతున్నారు.   త‌న కంపెనీలైన టెస్లా, స్పేస్ ఎక్స్, ఎక్స్ సంస్థ‌లు ప్ర‌తిభామంతుల‌ను తీసుకుంటాయనీ,  వారికి స‌గ‌టు కంటే ఎక్కువ జీతాలు ఇస్తాయనీ చెబుతున్నారు.  అయితే  ఔట్ సోర్సింగ్ కంపెనీలు హెచ్ 1 బి వీసాల వ్య‌వ‌స్థ‌ను దుర్వినియోగం చేసి దెబ్బ తీశాయన్న మస్క్.. ఈ దుర్వినియోగాన్ని అరికట్టాలే కానీ, మొత్తంగా ఈ వ్యవస్థనే రద్దు చేయాలనడం సమంజసం కాదన్నారు. అదే సమయంలో ఆయన  హెచ్ వ‌న్ బీ వీసాల కోసం ఎదురు చూస్తోన్న భార‌తీయ యువ‌తకు తీసుకుంటున్న వేతనం కంటే సమాజానికి ఎక్కువగా ఉపయోగపడాలని సూచించారు. అలా ఉపయోగపడే వారినే తాను గౌరవిస్తానన్నరు. తానే కాదు ఏ యజమానైనా అలాగే ఆలోచిస్తాడని మస్త్ ముక్తాయించారు. ఫైనల్ గా మస్క్ చెప్పిందేమిటంటే.. దోచుకోవడానికి అమెరికా వస్తున్నామన్న భావన సరికాదనీ, వెయ్యి డాలర్ల జీతం తీసుకునే ఉద్యోగి కంపెనీకి లక్ష డాలర్ల లాభాన్ని చేకూర్చేలా ఉండాలని. అదీ సంగతి.  

వైసీపీ ఫ్రాడ్ బ్రాండ్స్!

వైసీపీ ఒక క్రిమిన‌ల్ గ్యాంగ్ అని చెప్ప‌డానికి ఇప్ప‌టికే ఆ పార్టీ అధినేత నుంచి ర‌ప్పా  ర‌ప్పా ఫ్లెక్సీలు ప‌ట్టుకు తిరిగే కేడ‌ర్ వ‌ర‌కూ అందరూ ముంజేతి కంకణానికి అద్దం ఎందుకన్న రీతిలో రుజువు చేసేశారు. జగన్ ఆస్తుల కేసులలో, ఆ పార్టీ నేతలు ఏపీ మద్యంస్కాం, కల్తీమద్యం కుంభకోణం, భూ కబ్జాలు వంటి ఎన్నో నేరాలలో కేసులను ఎదుర్కొంటున్నారు. కొందరు కటకటాల వెనుక ఉన్నారు. ఇది చాలు  ఆ పార్టీ ఒక క్రిమినల్స్ గ్యాంగ్ అని చెప్పడానికి అంటున్నారు తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు.   ఇప్పుడు తాజాగా వైసీపీలో   లేడీ  డాన్స్ కూడా ఉన్నట్లు వెలుగులోకి వస్తోందంటున్నారు.  మొన్నటికి మొన్న నెల్లూరు లేడీ డాన్ అరుణ వ్య‌వ‌హారం. ఇప్పుడు తాజాగా అదే నెల్లూరు జిల్లాకు, చెందిన అర‌వ కామాక్షి కేసు. అరవ కామాక్షి అయితే  ఏకంగా గంజాయి దందా నిర్వ‌హిస్తూన్నట్లు పోలీసులు చెబుతున్నారు.   అర‌వ కామాక్షి చేసే గంజాయి దందాను  అరిక‌ట్టాల‌ని పోరాటం చేస్తున్న    పెంచల‌య్య‌ అనే వ్యక్తిని వెంటాడి, వేటాడి మరీ హత్య చేసింది కామాక్షి గ్యాంగ్ అని పెంచలయ్య హత్య కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు చెబుతున్నారు. త‌న గంజాయి దందాకు  పెంచ‌ల‌య్య‌ ఆడ్డు వ‌స్తున్నాడ‌న్న కారణంగా  అత‌డ్ని ఎలాగైనా హతమార్చాలని నిర్ణయించుకున్న కామాక్షి గ్యాంగ్ చివరకు పెంచలయ్య త‌న బిడ్డ‌ను స్కూలు నుంచి తీసుకొస్తుండ‌గా  కాపు కాచి మరీ ఖతం చేశారని చెబుతున్నారు.   ఈ హత్య ఘటనను కూడా వైసీపీయులు రాజకీయ ప్రత్యర్థులపై నెట్టేయడానికి ప్రయత్నించారు. దీనిపై  రియాక్టైన నెల్లూరు రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధ‌ర్ రెడ్డి. ఒక వేళ నాపై సీపీఏం  నేత‌లు కేసు పెడితే తాను వారు విధించే శిక్ష‌ను ఎదుర్కుంటాన‌న్నారు. వాస్తవానికి   అర‌వ కామాక్షికి ఆనం విజ‌య్ కుమార్ రెడ్డి వ‌ర్గానికి  ఎంతో సంబంధ‌ముంద‌ని ఆరోపించారాయ‌న‌.  ఇటీవల  జ‌గ‌న్ నెల్లూరు వ‌చ్చిన‌పుడు ఇదే అర‌వ కామాక్షి ఐదు ల‌క్ష‌ల రూపాయ‌లు  ఖ‌ర్చుల కోసం ఇచ్చింది నిజం కాదా?  అని ప్రశ్నించారు. ఆమెకూ వైసీపీ నేత‌ల‌కు అంత‌టి సంబంధ బాంధ‌వ్యాలున్నాయి కనుకే..   విజ‌య్ కుమార్ రెడ్డి, పెంచ‌ల‌య్య కుటుంబాన్ని  ప‌ర‌మార్శించ‌డానికి రాలేద‌న్నారు కోటంరెడ్డి. ఇదంతా ఇలా ఉంటే వైసీపీ ప్రత్యర్థులపై బూతులతో విరుచుకుపడే గ్యాంగ్ ను తయారు చేసిందనీ, అది చాలదన్నట్లు ఇప్పుడు ఒక అరుణ‌, ఒక అర‌వ కామాక్షి వంటి ఫ్రాడ్ బ్రాండ్స్ ని కూడా రంగంలోకి దింపిందనీ విమర్శించారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.