Technical ilapsein Ahmedabad to London flight

అహ్మదాబాద్-లండన్ ఫ్లైట్ లో సాంకేతిక సమస్య.. టేకాఫ్ కు ముందే గుర్తించడంతో తప్పిన ముప్పు

అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా AI159 విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. అయితే టేకాఫ్ కు ముందు ఈ సమస్యను గుర్తించడంతో పెను ముప్పు తప్పింది.  ఈనెల 12న అహ్మదాబాద్-లండన్ ఎయిర్ ఇండియా ఫ్లైట్ అహ్మదాబాద్ సమీపంలో కుప్పకూలి వందల మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ప్రమాదం తరువాత ఎయిర్ ఇండియా విమానం ఆ రోట్లో నడపడానికి సిద్ధమైన తొలి ఫ్లైట్ ఇదే కావడం గమనార్హం. ఈ ఫ్లైట్ లో కూడా సాంకేతిక సమస్య తలెత్తడం ఆందోళన కలిగిస్తున్నది.  మొత్తంగా గత కొద్ది రోజులుగా ఎయిర్ ఇండియా సహా ప్రపంచవ్యాప్తంగా వివిధ కంపెనీల విమాన సర్వీసులలో ఇలా సాంకేతిక సమస్యలు తలెత్తడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతున్నది. 

chevireddy bhaskarreddy arrest

చెవిరెడ్డి అరెస్టు?

వైసీపీ సీనియర్ నేత, మాజీ  ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. లుక్ ఔట్ నోటీసు ఉండగా ఆయన దేశం విడిచి శ్రీలకంకు వెళ్లేందకు బెంగళూరు విమానాశ్రయానికి చేరుకోవడంతో పోలీసులు చెవిరెడ్డి భాసక్కరరెడ్డిని అదుపులోనికి తీసుకున్నారు.  వైసీపీ సీనియర్ నేత, మాజీ  ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. లుక్ ఔట్ నోటీసు ఉండగా ఆయన దేశం విడిచి శ్రీలకంకు వెళ్లేందకు బెంగళూరు విమానాశ్రయానికి చేరుకోవడంతో పోలీసులు చెవిరెడ్డి భాసక్కరరెడ్డిని అదుపులోనికి తీసుకున్నారు. మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి సిట్ చెవిరెడ్డిపై లుక్ ఔట్ నోటీసు జారీ చేసిన సంగతి తెలిసిందే.  చెవిరెడ్డి బెంగళూరు విమానాశ్రయానికి వస్తున్నారన్న అత్యంత విశ్వసనీయ సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఎయిర్ పోర్టు వద్ద ఆయనను అదుపులోనికి తీసుకుని విచారణ నిమిత్తం విజయవాడ తరలిస్తున్నారని తెలుస్తున్నది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.   చిత్తూరు జిల్లా చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన  2024 ఎన్నికలలో ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున పోటీ చేసి పరాజయం పాలయ్యారు.  వైసీపీ హయాంలో   చెవిరెడ్డి భాస్కరరెడ్డి ప్రభుత్వ విఫ్ గా కూడా పని చేశారు. అంతే కాకుండా తుడా చైర్మన్ గా కూడా ఉన్న ఆయన ఆ పదవిని అడ్డుపెట్టుకుని పలు అవకతవకలు, అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. కేసులు కూడా నమోదయ్యాయి. అలాగే జగన్ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ లో కూడా ఆయన నిందితుడిగా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే  ఏ వన్ గా   రాజ్ కసిరెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, వైఎస్. జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఓఎస్డీగా పనిచేసిన కృష్ణ మోహన్ రెడ్డి, ఈ ఆర్థిక వ్యవహారాలు చూసిన  బాలాజీ గోవిందప్పను  స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీం  అరెస్టు చేసిన విషయం తెలిసిందే.  ఈ కేసుతో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డికి ఉన్న సంబంధాలపై ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు దృష్టి సారించారు. అందులో భాగంగా చెవిరెడ్డి గన్మెన్ మదన్ రెడ్డిని విచారణ చేసిన విషయం తెలిసిందే. ఆయనపై సిట్ లుకౌట్ నోటీసు కూడా జారీ చేసింది. దీనిపై ఇటీవల చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తిరుపతిలో  మీడియాతో మాట్లాడుతూ తాను దేనికీ భయపడనని అన్నారు.  అటువంటి ఆయన అడ్డుకుంటారని తెలిసీ శ్రీలంకకు అంటూ బెంగళూరు విమానాశ్రయానికి వెళ్లడం పలు అనుమానాలకు తావిస్తోంది. పరారీ కావడానికి ప్రయత్నించారా అన్న సందేహాలు సైతం వ్యక్తం అవుతున్నాయి.  

government advisor post to ankarao

జై జగన్ అన్న అంకారావుకి సలహాదారు పదవా?

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఓ అనూహ్య నిర్ణయం తీసుకుంది. అంకారావు అనే వ్యక్తిని ప్రభుత్వ సలహాదారుగా నియమించింది. పర్యావరణ దినోత్సవం సందర్భంగా సన్మానం కోసం పిలిపించిన ఆయనను.. ఏకంగా సలహాదారుగా తీసుకుంటున్నట్టు అక్కడికక్కడే ప్రకటించి సీఎం చంద్రబాబు ఓ సంచలనమే రేపారు. నల్లమల అడవులను కాపాడేందుకు శ్రమిస్తున్న వారిలో అంకారావు ఒకరు అనే గుర్తింపు ఉంది. పల్నాడు జిల్లా కారంపూడికి చెందిన ఆయన చాలా ఏళ్లుగా పర్యావరణ కోసం పోరాటం చేస్తున్నారు.  ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ అంకారావును ప్రభుత్వ సలహాదారుగా నియమించడంపై కొందరు కూటమి నేతలు మాత్రం గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే అంకారావు వైసీపీ నేత అని.. ఆ పార్టీకే సపోర్ట్ చేశారంటున్నారు. అందుకే ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్న డిమాండ్ కూడా వినిపిస్తోంది. అంతేకాదు నాడు జై జగన్ అనలేదని వైసీపీ నేతలు తోట చంద్రయ్య గొంతుకోశారని.. కానీ నేడు నేడు జై జగన్ అన్న అంకారావుకి కూటమి ప్రభుత్వం కీలక పదవి కట్టబెట్టిందంటూ పెదవి విరుస్తున్నారు పల్నాడు జిల్లా టీడీపీ నేతలు.  పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు అన్యాయం చేస్తూ.. పక్క పార్టీ వారికి  కీలక సలహాదారుడు పదవి ఇవ్వడమేంటని ప్రశ్నిస్తున్నారు.  ఇటీవల జరిగిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా కూడా అంకారావు కేక్‌ కట్ చేశారనీ,  ఈ విషయం తెలుసుకోకుండా ఎలా నిర్ణయం తీసుకుంటారని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు అంకారావు నరసరావుపేట పార్లమెంట్  వైసిపి బీసీ సెల్ అధ్యక్షుడుగా  2018లో నియమితులయ్యారని గుర్తు చేస్తున్నారు. అప్పట్లో అంబటి రాంబాబు నరసరావుపేట పార్లమెంట్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారని.. అతని చేతుల మీదుగానే ఆయన నియామక పత్రాలు పొందారంటున్నారు. అంకారావు ఇప్పుడు కూడా వైసీపీలోనే ఉన్నారని.. కనీసం రాజీనామా కూడా చేయలేదని చెబతున్నారు.  అంకారావుకు ప్రభుత్వ సలహాదారు పదవి ఇవ్వడంపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై కూటమి శ్రేణులు మండిపడుతున్నాయి. కూటమి నేతలు తెలిసీ తెలియక చిన్న తప్పులు చేస్తేనే.. పార్టీ నుండి సస్పెండ్ చేసే అధినేతలు.. ఇలాంటి విషయాల్లో నియోజకవర్గ నాయకుల ప్రమేయం లేకుండా నిర్ణయం తీసుకోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పర్యావరణ శాఖ సలహాదారుడు జై జగన్ అంటున్న వీడియో టీడీపీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూశాకైనా.. సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని కూటమి నేతలు ఎదురుచూస్తున్నారు.

Air Indias series of losses not stopped yet

ఎయిరిండియా క‌ష్ట‌న‌ష్టాల ప‌రంప‌ర ఇంకా ఆగ‌లేదా?

యువ‌ర్ అటెన్ష‌న్ ప్లీజ్. హాంకాంగ్ టూ ఢిల్లీ ఫ్లైట్ నెంబ‌ర్ ఏ1- 315 బోయింగ్ 787-8 డ్రీమ్ లైన‌ర్ చిన్న సాంకేతిక స‌మ‌స్య త‌లెత్త‌డంతో తిరిగి హాంకాంగ్ లో ఎమ‌ర్జెన్సీ ల్యాండింగ్ చేయ‌బోతున్నామ‌ని ప్ర‌కటించ‌డంతో ఒక్క‌సారిగా ప్ర‌యాణికుల గుండెలు అర‌చేతిలోకి వ‌చ్చేశాయి. ఎవ‌రి ఇష్ట దైవాన్ని వారు త‌లుచుకోవడం మొద‌లు పెట్టారు.తిరిగి హాంకాంగ్ లో ఈ ఫ్లైట్ ల్యాండ్ అయ్యాక బ‌తుకు జీవుడా! అంటూ ఎటు వాళ్లు అటు పారిపోయారు. ఇంతా చేస్తే ఎయిరిండియా అధికార ప్ర‌తినిథి చెప్పిందేంటంటే.. వారి ప్ర‌యాణాన్ని రీషెడ్యూల్ చేస్తాం. లేదంటే టికెట్ డబ్బులు రీఫండ్ చేస్తామ‌ని ప్ర‌క‌టించ‌డంతో దాదాపు అంద‌రు ప్ర‌యాణికుల నుంచి వ‌చ్చిన మెసేజ్ రీఫండ్ చేయ‌మ‌ని.  యూపీలోని ఘ‌జియాబాద్ నుంచి కోల్ క‌తా వెళ్లే ఫ్ల‌యిట్ సిట్యువేష‌న్ ఇంకో ర‌కం. గంట సేపు సాంకేతిక లోపం కార‌ణంగా ఆగిపోయిందీ ఫ్లైట్ నెంబ‌ర్ ఐఎక్స్- 1511, ఆ గంట సేపు ప్రయాణికులు ఊపిరి బిగ‌బ‌ట్టి అలాగే కాలం గ‌డిపారంటే వారి ప‌రిస్థితేమిటో ఊహించుకోవ‌చ్చు. మ‌రో భ‌యంక‌ర‌మైన ప్ర‌యాణ అనుభ‌వం విష‌యానికి వ‌స్తే.. ఆరోజు స‌రిగ్గా జూన్ 12వ తేదీ. ఆ టైంలో అహ్మ‌దాబాద్ లో ఘోర విమాన ప్ర‌మాదం జ‌రిగింది. దుబాయ్ నుంచి జైపూర్ రావ‌ల్సిన ఐఎక్స్- 196 దుబాయ్ లో రాత్రి 7. 44కి బ‌య‌లు దేరాల్సింది మ‌రునాటి వేకువ జాము 12. 44కి బ‌య‌లు దేరింది. అంటే ఏకంగా ఐదు గంట‌లు.  ఈ ఐదుగంట‌లూ ఆ ఫ్లైట్ లో న‌ర‌కం చూశారు ప్ర‌యాణికులు. ఏసీ లేదు. నీళ్లు, ఆహారం అందివ్వ‌లేదు. పిల్ల‌లుంటే వారు ఆ ఉక్క‌పోత‌లో ఆక‌లిద‌ప్పుల‌తో అల‌మ‌టించినా ప‌ట్టించుకున్న పాపాన పోలేదు. ప‌క్క రోజు వేకువ జాము 2. 44కి ఈ ఫ్లైట్ జైపూర్ లో ల్యాండ‌య్యింది. ఆ స‌మ‌యంలో  ఈ ఎయిరిండియా ప్ర‌యాణికుల ఫీలింగ్ ఏంటో తెలుసా? హ‌మ్మ‌య్యా మ‌నం  కూడా కాలి బూడిద‌వకుండానే నేల‌పై అడుగు పెట్టాం. గంటో అర‌గంట‌లో ప్రాణాల‌తో ఇంటికెళ్తాం. బాప్ రే బ‌చ్ గ‌యా.. అంటూ ఊపిరి పీల్చుకున్నారు.  కాళ‌రాత్రులంటారే స‌రిగ్గా అలాంటి ప్ర‌యాణ అనుభ‌వాన్నిస్తోంది ఎయిర్ ఇండియా. దాని టైం బ్యాడో.. లేక దాన్నెక్కే ప్ర‌యాణికుల టైం స‌రిగా లేదో తెలీదు గానీ.. ఎయిర్ ఇండియా అంటేనే హ‌డ‌లి చ‌స్తున్నారొక్క‌క్క‌రూ. ఇండిగో త‌ర్వాత సెకండ్ బెస్ట్ ఎయిర్ లైన‌ర్ ఎయిర్ ఇండియా.  మొత్తం 102 దేశ విదేశీ తీరాల‌కు ప్ర‌యాణికుల‌ను చేర్చే ఎయిర్ ఇండియా చ‌రిత్ర ఈ నాటిది కాదు. ఇది 1932 నాటిది. దీని ఆప‌రేష‌న‌ల్ హెడ్డాఫీస్ ఢిల్లీ. బెంగ‌ళూరు, ముంబై వంటి ప్రాంతాల్లోనూ నెట్ వ‌ర్క్ విస్త‌రించి ఉంది. ఇక హ‌ర్యానాలోని గుర్గాంలో మెయిన్ ఆఫీసుంది. ప్ర‌స్తుతం ఎయిరిండియాలో డెబ్భై ఐదు శాతం వాటా టాటాల‌ది కాగా మిగిలిన ఇర‌వై ఐదు శాతం సింగ‌పూర్ ఎయిర్ లైన్స్ ది.  ఎయిరిండియా మ‌ధ్య‌లో చేతులు మారినా ఇటీవ‌లే తిరిగి  టాటాల ప‌ర‌మైంది. ఆనాటి నుంచి 14 శాతం మేర లాభాల‌ను అర్జించింది. ఫైనాన్షియ‌ల్ ఇయ‌ర్- 24 కంటే, 25లో మెరుగైన‌ ట‌ర్నోవ‌ర్ర సాధించింది. ప్ర‌స్తుతం కూడా 11 శాతం  పెరుగుద‌ల‌తో 7 బిలియ‌న్ డాల‌ర్ల మేర ట‌ర్నోవ‌ర్ సాధిస్తోంది. అంతా బాగుంద‌నుకునే లోపు ఇదిగో ఈ వ‌రుస న‌ష్టాలు. అహ్మాదాబాద్ లో ఏమని అనుమానాస్ప‌ద ఘోర విమాన ప్ర‌మాదం జ‌రిగిందో అప్ప‌టి నుంచీ ఈ ఎయిర్ లైన‌ర్ టైం పూర్తిగా తిర‌బ‌డిన‌ట్టుంది. ప్ర‌యాణికుల‌కు మెరుగైన ప్ర‌యాణ  సౌక‌ర్యం అందిస్తామంటోన్న  ఎయిర్ ఇండియా.. వారి పాలిటి య‌మ‌పాశ‌మై.. దారుణంగా దెబ్బ తీస్తోంది. ఇప్పుడెంత‌టి న‌ష్ట‌మంటే కేవ‌లం అహ్మ‌దాబాద్ డ్రీమ్ లైన‌ర్ కుప్ప‌కూల‌డంతో దాని విలువ 120 మిలియ‌న్ డాల‌ర్లు. అంటే దాదాపు వెయ్యి కోట్లు. అత్య‌వ‌స‌ర నిధి కింద పాతిక‌ల‌క్ష‌ల మేర ఈ ప్ర‌యాణ బాధితుల‌కు ఆర్ధిక సాయం ప్ర‌క‌టించింది ఎయిరిండియా. ఆల్రెడీ కోటి రూపాయ‌లు ఒక్కొక్క‌రికీ న‌ష్ట‌ప‌రిహారం ఇస్తామ‌ని చెప్పింది. ఈ మొత్తం విలువ సుమారు 300 కోట్లు. ఇక ప్ర‌మాదం జ‌రిగిన రోజు బోయింగ్ తో స‌హా ఇండిగో త‌దిత‌ర విమాన యాన షేర్ల‌న్నీ కుప్ప‌కూల‌డంతో ఈ మొత్తం న‌ష్టం విలువ సుమారు 6 ల‌క్ష‌ల కోట్లు. దీంతో ఇటు తామే కాకుండా అటు బోయింగ్ సంస్థ ఆర్డ‌ర్ల‌ను కూడా ఎయిరిండియా ప్ర‌భావితం చేస్తోన్న మాట వినిపిస్తోంది.  మ‌రి ఈ న‌ష్టాల నుంచి ఎయిరిండియాను గ‌ట్టెక్కించేవారేరీ. ఈ విష‌యాలు తెలిసిన ప్ర‌యాణికులు ఎయిర్ ఇండియా అంటేనే హ‌డ‌లి పోతున్నారు. కార‌ణం టేకాఫ్ అయిన 45 సెక‌న్ల‌కే కుప్ప‌కూలిపోయే విమానాలున్న ఈ సంస్థ మెయిన్ టైన్స్ స‌రిగా లేద‌న్న పేరు రావ‌డంతో వారంతా ఈ ఫ్ల‌యిట్ బుకింగ్స్ కి ఒక‌టికి ప‌ది సార్లు ఆలోచిస్తున్నారు. ఫ‌స్ట్ మీ ద‌గ్గ‌రున్న అన్ని ర‌కాల  విమానాలు, వాటి ఫిట్నెస్ ని ఒక‌సారి  థార్డ్ పార్టీ చెకింగ్ చేసి మీ అధికారిక వెబ్ సైట్ల‌లో వాటిని పోస్ట్ చేస్తే త‌ప్ప‌.. ప్ర‌యాణికుల్లో న‌మ్మ‌కం రాద‌న్న మాట వినిపిస్తోంది విమాన‌యాన రంగ నిపుణుల నుంచి.  తాజా వార్త ఏంటంటే మంగ‌ళ‌వారం ఉద‌యం శాన్ ఫ్రాన్సిస్కో వెళ్తున్న ఫ్ల‌యిట్ నెంబ‌ర్ ఏఐ- 180 విమానం ఇంజిన్లో సాంకేతిక లోపం క‌నిపించ‌డంతో ప్ర‌యాణికుల‌ను కోల్ క‌త‌లో దింపేసింది. దీన్నిబ‌ట్టీ ఎయిర్ ఇండియాకేదో దుర‌దృష్టం వెంటాడుతోంది. ఇది ప్ర‌యాణికుల‌కు చుక్క‌లు చూపిస్తున్న‌ట్టు తెలుస్తోంది.

Iran and Israel war India in dilemma

ఇరాన్‌- ఇజ్రాయెల్‌ యుద్ధం.. సందిగ్ధంలో భారత్

ఇరాన్‌, ఇజ్రాయెల్‌ మధ్య యుద్ధం తీవ్రతరమవుతున్నది. ఇరుదేశాలు దాడి, ప్రతిదాడులతో పశ్చిమాసియా రణరంగంగా మారింది. ఈ నేపథ్యంలో టెహ్రాన్‌లోని ఇజ్రాయెల్‌ గూఢచార సంస్థ మొస్సాద్‌కు చెందిన డ్రోన్‌ ఫ్యాక్టరీని ఇరాన్‌ ధ్వంసం చేసింది. ఇరాన్‌ ఇంతకాలం హమాస్, హెజ్బొల్లా వంటి ప్రాంతీయ శక్తులను ఇజ్రాయెల్‌ పైకి ఎగదోసేది. ఇప్పుడు ఇజ్రాయెల్‌ నేరుగా ఇరాన్‌పై దాడికి దిగింది. రెండు దేశాలూ డ్రోన్లు, క్షిపణులతో దాడులు, ప్రతిదాడులు చేసుకుంటున్నాయి. ఇది పశ్చిమాసియాతోపాటు మిగతా ప్రపంచంపైనా తీవ్ర ప్రభావం చూపనుంది. ఇరాన్‌, ఇజ్రాయెల్‌ వైరానికి 1979లోనే బీజం పడింది. ఆ ఏడాది ఇరాన్‌లో మతశక్తుల నాయకత్వంలో విప్లవం సంభవించింది. అయతుల్లా ఖొమైనీ సారథ్యంలోని ఇరాన్‌ మత పాలకులు ఇజ్రాయెల్‌ను జియోనిస్టు శత్రువుగా ప్రకటించారు. ఆ తర్వాత లెబనాన్‌లో హెజ్బొల్లా, గాజాలో హమాస్‌కు ఇరాన్‌ మద్దతునిచ్చి ఇజ్రాయెల్‌పై పోరుకు ఉసిగొల్పింది. ఇజ్రాయెల్‌కు అమెరికా, నాటో కూటమి పూర్తి మద్దతు ఇస్తూ వచ్చాయి. 2024 ఏప్రిల్‌లో సిరియా రాజధాని డమాస్కస్‌లోని ఇరాన్‌ రాయబారి కార్యాలయంపై ఇజ్రాయెల్‌ జరిపిన దాడిలో ఇరానియన్‌ రివల్యూషనరీ గార్డ్స్‌ అధికారులు హతమయ్యారు. ఇరాన్‌ అక్టోబరులో ఇజ్రాయెల్‌పై క్షిపణులు, డ్రోన్లతో ప్రతిదాడి చేసింది. తాజాగా ఇజ్రాయెల్‌ ఆపరేషన్‌ రైజింగ్‌ లయన్‌ పేరుతో ఇరాన్‌లోని అణు, సైనిక స్థావరాలపై విరుచుకుపడింది. ప్రతిగా ఇరాన్‌ డ్రోన్లు, క్షిపణులతో ఇజ్రాయెల్‌లోని నగరాలపై దాడి చేసినా, ప్రాణనష్టం తక్కువే. ఇజ్రాయెల్‌లోని సైనిక స్థావరాలు, ఇంధన మౌలిక వసతులను లక్ష్యంగా చేసుకున్న ఇరాన్‌ బాలిస్టిక్‌ మిసైళ్లు గణనీయమైన నష్టాన్ని కలిగించినట్లు తెలుస్తోంది. మరోవైపు అణ్వాయుధ నిరోధ ఒప్పందం నుంచి ఉపసంహరించుకునే దిశగా ఇరాన్‌ యోచిస్తోంది. ఇరాన్‌, ఇజ్రాయెల్‌ పోరు ప్రభావం పశ్చిమాసియాకు మాత్రమే పరిమితం కాలేదు. మిగతా ప్రపంచంపై కూడా ఆర్థిక, రాజకీయ ప్రభావాన్ని కనబరుస్తోంది.ఇరాన్‌ తీరంలోని హోర్ముజ్‌ జలసంధి ద్వారానే ప్రపంచ చమురు వాణిజ్యంలో అత్యధిక భాగం నడుస్తోంది. ఈ జలసంధి బందయితే చమురు నౌకల రాకపోకలు స్తంభించిపోయి ప్రపంచ ఆర్థికం దెబ్బతింటుంది. ఇప్పటికే ఆంక్షలతో సతమతమవుతున్న ఇరాన్‌కు తాజా పరిణామాలతో చమురు ఎగుమతులు నిలిచిపోతే ద్రవ్యోల్బణం కట్టు తప్పుతుంది. అది రాజకీయ అస్థిరతకు దారితీయకమానదు.  తాజాగా అమెరికా, ఇరాన్‌ల మధ్య జరగాల్సిన అణు చర్చలు గాడి తప్పాయి. చర్చల నుంచి వైదొలగుతామనీ, అంతర్జాతీయ అణుశక్తి సంస్థ(ఐఏఈఏ)తో మాత్రమే సంబంధాలు కొనసాగిస్తామని ఇరాన్‌ హెచ్చరించింది. దారికి రాకపోతే ఇరాన్‌పై మరింత తీవ్రంగా దాడులు జరుగుతాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ హెచ్చరించారు. వెంటనే అణు ఒప్పందం కుదుర్చుకోవడం మంచిదని హితవు పలికారు. ఇజ్రాయెల్‌ దాడులను విమర్శించిన రష్యా, చైనాలు ఇరాన్‌కు ఆయుధ, సాంకేతిక, దౌత్య సహాయాల్ని అందించి, ప్రత్యామ్నాయ సైనిక కూటములలో చేరాల్సిందిగా ప్రతిపాదించవచ్చు. ఇరాన్‌-ఇజ్రాయెల్‌ పోరులో ప్రధాన దేశాలు జోక్యం చేసుకోవడం వల్ల పరిస్థితి మరింత ముదరవచ్చు. పశ్చిమాసియా నుంచి వచ్చే చమురు సరఫరాలపై భారత ఆర్థిక వ్యవస్థ ఆధారపడి ఉంది. ఈ దేశాల్లోని భారతీయ కార్మికులు, నిపుణులు జమచేసే విదేశ మారక ద్రవ్యం ఇండియాకు ఎంతో ప్రయోజనకరం. పశ్చిమాసియాతో భారత్‌కు సైనిక వ్యూహపరమైన ప్రయోజనాలూ ఉన్నాయి. అందువల్ల ఇరాన్‌, ఇజ్రాయెల్‌ పోరు దీర్ఘకాలం కొనసాగడం భారత్‌కు నష్టదాయకమే. చమురు సరఫరా స్తంభిస్తే ఇండియాలో ధరలు పెరిగిపోతాయి. రవాణా, పారిశ్రామిక ఉత్పత్తి దెబ్బతింటాయి. ఎరువుల కొరతతో ఆహారోత్పత్తి తగ్గే ప్రమాదం ఉంది. ఇండియాకు ఇజ్రాయెల్‌తో రక్షణ, సాంకేతికపరంగా పొత్తు ఉంది. ఇరాన్‌లో చాబహార్‌ రేవును అభివృద్ధి చేయడం ద్వారా మధ్యాసియాతో రవాణా అనుసంధానం ఏర్పరచుకోవడానికి భారత్‌ కృషిచేస్తోంది. అందుకని ఇరాన్, ఇజ్రాయెల్‌లలో ఎటువైపూ మొగ్గలేని పరిస్థితి నెలకొంది.  ప్రస్తుతం నడుస్తున్న యుద్ధం ఇరాన్, ఇజ్రాయెల్‌ మధ్యే సాగుతుందా, ఇతర శక్తులూ జోక్యం చేసుకుంటాయా అన్నది త్వరలో తేలిపోతుంది. ఇజ్రాయెల్‌ దాడుల వల్ల ఇరాన్‌ బాగా బలహీనపడింది. భారత్‌కు ఇరాన్, ఇజ్రాయెల్‌లు రెండింటితో సత్సంబంధాలు ఉన్నందువల్ల మధ్యవర్తిత్వం వహించగల స్థితిలో ఉంది. మరి చూడాలి ఈ యుద్ద వాతావరణం ఏ మలుపులు తిరుగుతుందో?

tpcc chief warning to minister ponguleti srinivasa reddy

మంత్రి పొంగులేటికి టీపీసీసీ చీఫ్ వార్నింగ్

రాష్ట్ర మంత్రివర్గంలో ఆయన నంబర్ టు అనుకుంటారు.. అన్ని శాఖలు తనవే అనుకుంటారు.. హైదరాబాద్ లో ప్రభుత్వ కార్యక్రమం ఏదైనా ఆయన సీఎం రేవంత్ రెడ్డితో ఉంటారు  గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉందా అంటే అదీ లేదు.  కాని ఆయన సఖల శాఖలపై ప్రకటనలు చేస్తారు. కేసీఆర్, కేటీఆర్ లపై ఒంటికాలిపై లేస్తారు.. ఆయన ఎవరో మీకు ఈ పాటికే అర్ధం అయిఉంటుంది ఆయనే పొంగులేటి శ్రీనివాసరెడ్డి . సాధారణంగా ప్రభుత్వ వ్యవహారాలు మీడియాకు   చెప్పాల్సి వస్తే ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి, పార్టీకి సంబంధించిన విషయాలైతే పీసీసీ ప్రెసిడెంట్ వివరిస్తారు. కాని ఇక్కడ మాత్రం అన్నీ శీనన్నే అదేనండీ పొంగులేటి శ్రీనివాసరెడ్డే చూసుకుంటున్నారు.  గతంలో మూసీ అభివృద్ధికి సంబంధించిన అభివృద్ధి పనుల కోసం అంటూ  మీడియాను వెంటబెట్టుకుని సియోల్ పర్యటనకు వెళ్లారు.. అక్కడికి వెళ్లిన విషయం వదిలేసి మా బృందం రాష్ట్రానికి తిరిగి వచ్చేలోగా రాజకీయంగా పెద్ద బాంబు పేలుతుందని సంచలన ప్రకటన చేశారు. అంటే బీఆర్ఎస్ ముఖ్య నాయకుడిని అరెస్ట్ చేస్తామనే అర్థం వచ్చే విధంగా మాట్లాడారు.  కాని ఇప్పటి వరకు అటువంటిది ఏమీ జరగలేదు.  ఇలా అనేక విషయాల్లో తనకు తోచిన రీతిలో ప్రకటనలు చేస్తారు.. ప్రభుత్వ పరంగా ముఖ్యమైన నిర్ణయాలు కూడా తానే వెల్లడిస్తారు.. స్థానిక సంస్థల ఎన్నికలపై విధానపరమైన నిర్ణయం క్యాబినెట్ లో తీసుకున్నాకే ప్రకటించాల్సి ఉంది.. ఇంత ముఖ్యమైన విషయంపై తాజాగా మీడియాకు వెల్లడించారు.  దీనిపై పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సీరియస్ అయ్యారు.  ఒక క్యాబినెట్ మంత్రికి పీసీసీ ప్రెసిడెంట్ వార్నింగ్ ఇవ్వడం బహుశా ఇటీవల కాలంలో జరిగిన దాఖలాలు లేవు.  ఇప్పటికైనా పొంగులేటి తన వైఖరిని మార్చుకుంటారో లేదో వేచిచూడాల్సిందే…

tehran empty with fear of iran attacks

ఇజ్రాయెల్ దాడుల భయం... ఖాళీ అవుతున్న టెహ్రాన్

ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌లో పరిస్థితి దయనీయంగా మారింది. ఇజ్రాయెల్ దాడులతో జనం తీవ్ర భయాందోళనలకు గురౌతున్నారు. మరిన్ని వైమానిక దాడులు జరుగుతాయన్న భయంతో జనం టెహ్రాన్ వీడి   వెడుతున్నారు.  కాస్పియన్ సముద్ర తీర ప్రాంతంవైపు జనం తండోపతండాలుగా వెడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇంత పెద్ద సంఖ్యలో జనం ఒక్కసారిగా బయటకు వచ్చి నగరం వీడి వెళ్లడానికి ప్రయత్నిస్తుండటంతో టెహ్రాన్ దారులన్నీ కిక్కిరిసిపోయాయి. భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.  టెహ్రాన్ లోని సైనిక స్థావరాలే తమ లక్ష్యమని జనావాసాలు కాదనీ ఇజ్రాయెల్ ప్రకటించినప్పటికీ జనంలో భయం పోవడం లేదు. ఇక టెహ్రాన్ లో ఇంధనంపై, ఏటీఎమ్ ల నుంచి డబ్బులు విత్రాపై ఆంక్షలు విధించడంతో  జనం నానా ఇబ్బందులూ పడుతున్నారు. నగరం విడిచి పోవడానికి వాహనాలలో ఇంధనం నింపుకునేందుకు పరిమితులు ఉండటంతో వారు నిస్సహాయులుగా మిగిలిపోయారు. అలాగే  ఎటీఎమ్ ల నుంచి సొమ్ములు విత్ డ్రాపై కూడా పరిమితులు విధించడంతో నగదు చెలామణిలేక ఇబ్బందులు పడుతున్నారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే టెహ్రాన్ వీడి సురక్షిత ప్రాంతాలకు తరలిపోతేనే బతికి బట్టకడతామన్న ఉద్దేశంతో జనం నగరం దాటి గ్రామీణ ప్రాంతాలుకు తరలి వెడుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే టెహ్రాన్ ఖాళీ అవ్వడం ఖాయమంటున్నారు. 

wimen tied to tree for not repaying debt

అప్పు తీర్చలేదని మహిళను చెట్టుకు కట్టేశారు.. కుప్పంలో దారుణం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సొంత నియోజకవర్గం కుప్పంలో దారుణం చోటు చేసుకుంది. అప్పు తీర్చలేదని మహిళను చెట్టుకు కట్టేసిన దారుణం కుప్పం పరిధిలోని నారాయణపురంలో  జరగింది. బాధిత మహిళ శిరీష భర్త తిమ్మరాయప్ప మునికన్నప్ప అనే వడ్డీ వ్యాపారి వద్ద వద్ద రూ.80 వేలు అప్పు చేసాడు. అయితే తిమ్మరాయప్ప అప్పు తీర్చలేక  భార్య, బిడ్డలను వదిలేసి పరారయ్యడు. దీంతో అప్పు తీర్చాలంటూ శిరీషకు వేధింపులు మొదలయ్యాయి.  కూలీ పని చేస్తూ కొద్ది కొద్దిగా అప్పు కడుతున్న శిరీష సమయానికి డబ్బులు చెల్లించడంలేదంటూ ఆమెను చెట్టుకు కట్టేసి దుర్భాషలాడుతూ దాడికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు వడ్డా వ్యాపారి మునికన్నప్పను అరెస్టు చేశారు.  కాగా ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సీరియస్ అయ్యారు. మహిళను కట్టేసి దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.   జిల్లా ఎస్పీతో మాట్లాడిన చంద్రబాబు ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆదేశించారు.  

sit new technic to question prabhakar rao

ప్ర‌భాక‌ర్ రావు విచారణలో సిట్ కొత్త టెక్నిక్

బాధితుల ముందు నిందితుడి విచార‌ణ‌  ఫోన్ ట్యాపింగ్ విచార‌ణాధికారులైన డీసీపీ విజ‌య్ కుమార్, ఏసీపీ వెంక‌ట‌గిరి  ప్రభాకరరావును విచారించడంలో కొత్త టెక్నిక్ వాడుతున్నారు.  అదేంటంటే ఫోన్ ట్యాపింగ్ బాధితుల ముందు ప్ర‌ధాన నిందితుడు ప్రభాకరరావును విచారించనున్నారు.   ఇంత‌కీ ప్ర‌భాక‌ర్ రావు అధ్వ‌ర్యంలో ఎంద‌రి ఫోన్లు ట్యాప్ అయ్యాయ‌ని చూస్తే..  బాధితులు చెప్పే లెక్క‌ల్ని బట్టి  4వేల నుంచి ఆరు వేల వ‌ర‌కూ ఉన్నారు. ఆఖ‌రున డీఎస్పీగా యాక్సిల‌రేటెడ్ ప్ర‌మోట్ అయిన ప్ర‌ణీత్ ఫోన్లోనూ ఎంద‌రో రాజ‌కీయ  నాయ‌కుల ఫోన్ రికార్డింగులున్నాయంటే ప‌రిస్థితి ఏమిటో ఊహించుకోవ‌చ్చు. ప్ర‌భాక‌ర్ రావు చెప్ప‌డం వ‌ల్లే తామిలా చేశామ‌ని ప్ర‌ణీత్ త‌దిత‌రులు చెబితే.. నేను మాత్రం నాటి డీజీపీ  మ‌హేంద‌ర్ రెడ్డి, ఇంటెలిజెన్స్ ఐజీ అనిల్ చెప్పిన‌ట్టు చేశాన‌ని అంటున్నారు ప్ర‌భాక‌ర్ రావు. ప్ర‌ణీత్ ద్వారా కొన్ని ఎఫ్ఎస్ఎల్ రిపోర్టుల ద్వారా ప్ర‌భాక‌ర్ రావును క్రాస్ క్వ‌శ్చిన్ చేసిన అధికారులు మంగళవారం (జూన్ 17) ఆయనను కొత్త టెక్నిక్ తో  విచారించ‌బోతున్నారు. ట్యాపింగ్ బాధితుల్లో సుమారు 600 మంది డేటా సేక‌రించి వారంద‌రినీ పిలిపించి విష‌యం చెప్పారు అధికారులు. మీరు ఈ ఇన్వెస్టిగేష‌న్లో కోప‌రేట్ చేయాల‌ని వారిని కోరారు. వారు కూడా స‌రే అన్నారు.  ఇక బాధితుల ఆవేద‌న బ‌ట్టి చూస్తే..  భార్యాభ‌ర్త‌ల ఫోన్ కాల్స్ సైతం విన‌డం అన్యాయ‌మ‌ని వాపోయారు. అంతే కాదు త‌మ బంధుమిత్రులంద‌రి ఫోన్ కాల్స్ విన్నార‌నీ.. మేము ఎవ‌రికీ చెప్ప‌కుండా దాచుకున్న నెంబ‌ర్ల‌ను కూడా రికార్డింగ్ లో పెట్టార‌నీ. మా ప్ర‌తి క‌ద‌లిక కాపు కాచార‌నీ.. మా ప్ర‌తి కాల్ విన్నార‌న్న‌ది వీరి ఆవేద‌న‌. అయితే ఒక రిటైర్డ్ ఐజీ అయిన ప్ర‌భాక‌ర్ రావును, ఆనాటి సీఎస్ సోమేశ్ తిరిగి  ఒక ప‌ద‌విలో  కూర్చోబెట్టి ఇంత‌టి ఘ‌న‌కార్యం చేయ‌డం కూడా క‌రెక్టు కాద‌న్న కోణంలో కొంద‌రు మాట్లాడారు. ఇందులో సోమేశ్ ని సైతం శిక్షించాల్సి ఉంద‌ని డిమాండ్ చేసిన వారున్నారు. వ‌చ్చే రోజుల్లో మ‌రే పాల‌కుడూ కూడా ఇలా చేయ‌కుండా నిందితుల‌కు శిక్ష‌లు ప‌డాల‌ని సూచించారు. ఇదిలా ఉంటే హోం మంత్రిత్వ శాఖ‌కు త‌ప్పుడు స‌మాచారం ఇచ్చి.. మావోయిస్టుల మ‌ద్ద‌తు దారుల‌న్న ముద్ర వేసి ప్ర‌స్తుత మంత్రి ,  ఉద్యోగుల ఫోన్ నెంబ‌ర్లు మొత్తం ట్యాప్ చేశారు నాటి ఎస్ఓటీ అధికారులు.  మ‌రీ ముఖ్యంగా ప్ర‌ణీత్ రావుకు మునుగోడు బంప‌రాఫ‌ర్ ప్ర‌క‌టించారు ప్ర‌భాక‌ర్ రావు. న‌ల్గొండ జిల్లాకు తాను ఎస్పీగా ఉండ‌గా బీబీన‌గ‌ర్ లో ఎస్సైగా ప‌ని చేసేవారు ప్ర‌ణీత్.. ఆ స‌మ‌యంలో సామాజిక వ‌ర్గ సంబంధ బాంధ‌వ్యాల‌ను అడ్డు పెట్టుకుని ప్ర‌భాక‌ర్ రావుతో బాగా ద‌గ్గ‌రైన ప్ర‌ణీత్. ఆయ‌న ఇంటెలిజెన్స్ ఎస్ఐబీకి వెళ్ల‌గానే తాను కూడా ఒక ఇన్ స్పెక్ట‌ర్ గా అందులో జాయిన్ అయ్యారు. ఐదేళ్లు తిరిగే స‌రిక‌ల్లా డీఎస్పీగా ప్ర‌మోట‌య్యారాయ‌న‌.  2007 లో ప్ర‌ణీత్ తో పాటు సుమారు 450 మంది ఎస్సైలు డిపార్ట్ మెంట్లో జాయిన్ అయితే.. వారంద‌రిలోకీ ఒక్క ప్ర‌ణీత్ మాత్ర‌మే డీఎస్పీ ర్యాంక్ లో ఉన్నారు. ఇది అసాధార‌ణంగా చెబ‌తారు.  ప్ర‌ణీత్ పొందిన యాక్సిల‌రేటెడ్ ప్ర‌మోష‌న్ అన్న‌ది యాంటీ మావోయిస్టు కార్య‌క‌లాపాల్లో యాక్టివ్ రోల్ ప్లే చేసే వారికిస్తారు. అలాంటిది అక్ర‌మ ట్యాపింగ్ కి పాల్ప‌డ్డ ఒక అధికారికి ఇవ్వ‌డం ఇదే తొలిసారిగా భావిస్తున్నారు. 2023లో బీఆర్ఎస్ అధికారం కోల్పోయాక‌.. అప్ప‌టి వ‌ర‌కూ తాము సేక‌రించిన ప్రొఫైల్స్ డేటా మొత్తం 1200 పేజీలు. ఈమొత్తాన్ని ధ్వంసం చేశారు ప్ర‌ణీత్ రావు. అంతే కాదు.. హార్డ్ డిస్క్ ల‌ను ముక్క‌లు చేసి వాటిని మూసీలో ప‌డేశారు. వీట‌న్నిటిని బ‌ట్టి చూస్తే వీరెంత‌టి చేయ‌రాని ప‌ని చేశారో అర్ధం చేసుకోవ‌చ్చంటారు నిపుణులు. ప్ర‌ణీత్- ప్ర‌భాక‌ర్ ని కూడా ఎదురెదురుగా పెట్టి.. విచారించ‌నున్నారు అధికారులు. ఆపై బాధితుల ఎదుట  కూడా ప్ర‌ధాన నిందితుడు ప్ర‌భాక‌ర్ రావును విచారించ‌నున్నారు. ఆయ‌న‌కు ఈ కేసు తీవ్ర‌త  ఎంతటిదో అర్ధ‌మ‌య్యేలా చేయ‌నున్న‌ట్టు ఈ ప‌థ‌క ర‌చ‌న చేసిన‌ట్టు చెబుతున్నారు.  బాధితుల్లో కొంద‌రు ఇప్ప‌టికే మీడియాతో మాట్లాడుతూ.. ఒక వేళ పై వాళ్లు చెప్పినా.. వీరికంటూ ఒక విచ‌క్ష‌ణ ఉండాలి  క‌దా?  మేము వ్య‌క్తిగ‌తంగా మాట్లాడుకున్న ప్ర‌తి మాట విన‌డ‌మేంటి? ఇది  ముమ్మాటికీ త‌ప్పు. రాజ్యాంగం  క‌ల్పించిన గోప్య‌తా హ‌క్కును హ‌రించే అధికారం వీరికి ఎవ‌రిచ్చారంటూ తీవ్ర స్తాయిలో విరుచుకుపడుతున్నారు వీరు.. మ‌రి చూడాలి ఈ విచార‌ణ ద్వారా ప్ర‌భాక‌ర్ రావు నుంచి మ‌రెన్ని నిజాలు రాబ‌డుతారో అధికారులు.

technical lapse in another airindia flight

మరో ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక సమస్య

ఎయిర్ ఇండియా విమానాలలో తరచుగా  కేతిక లోపాలు తలెత్తడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. తాజాగా మంగళవారం (జూన్ 17) తెల్లవారుజామున  శాన్ ఫ్రాన్సిస్కో నుండి కోల్‌కతా మీదుగా ముంబైకి బయలుదేరిన మ ఎయిర్ ఇండియా విమానం ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో ప్రయాణికులను అత్యవసరంగా దించేశారు.  బోయింగ్ 777-200ఎల్ఆర్ విమానం  శాన్ ఫ్రాన్సిస్కోనుంచి బయలుదేరి మంగళవారం అర్ధరాత్రి దాటిన తరువాత   12.45 కోల్ కతా విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యింది. ఈ విమానం తెల్లవారు జామున రెండు గంటలకు  ముంబైకి  బయలుదేరాల్సి ఉంది. అయితే..   విమానం ఎడమ ఇంజిన్‌లో సాంకేతిక లోపం గుర్తించడంతో  విమానం టేకాఫ్ లో విపరీతమైన జాప్యం జరిగింది. లోపం సవరిం చడానికి చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఉదయం 5.20 గంటల సమయంలో ప్రయా ణీకులందరినీ విమానం నుంచి దించివేశారు. 

tpcc chief statemeny inphone tapping case

ఫోన్ ట్యాపింగ్ కేసు.. సిట్ ఎదుటకు సాక్షిగా టీపీసీసీ చీఫ్

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో  కీలక ముందడుగు పడింది. ఈ కేసులో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ  అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ సాక్షిగా వాంగ్మూలం ఇవ్వనున్నారు.దర్యాప్తు అధికారులు కోరడంతో మహేష్ కుమార్ గౌడ్ మంగళవారం జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయానికి వెళ్లి ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షిగా అధికారులకు వాంగ్మూలం ఇస్తారు.   2023 నవంబర్ లో జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల సమయంలో మహేశ్ కుమార్ గౌడ్ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న సంగతి తెలిసిందే. ప్రచారం ఉధృతంగా సాగుతున్న తరుణంలో.. ఆయన ఫోన్‌ను అప్పటి ప్రభుత్వం ట్యాప్ చేసిందన్న ఆరోపణల నేపథ్యంలో ఈ కేసు దర్యాప్తులో ముఖేష్ కుమార్ గౌడ్ వాంగ్మూలం అత్యంత కీలకంగా మారనుందని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు.  మహేష్ కుమార్ గౌడ్ ఇప్పుడు టీపీసీసీ అధ్యక్షుడిగా ఉణ్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆయన ఇచ్చే వివరాలు కేసు దర్యాప్తునకు కీలకంగా మారతాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అనుమానితులను, ఇతర బాధితులను పోలీసులు విచారించి, వారి నుంచి కూడా వివరాలు సేకరించిన విషయం విదితమే. అది పక్కన పెడితే...పోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో మంగళవారం (జూన్ 17) కీలకంగా మారనుంది.  విచారణలో భాగంగా ఎస్ఐబీ మాజీ  చీఫ్ ప్రభాకర్ రావు  తో కలిపి కేసులో కీలక నిందితులైన ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు, తిరుపతన్న, భుజంగ రావులను ప్రశ్నించనున్నారు. అలాగే ఫోరెన్సిక్ బృందం ఇచ్చిన నివేదిక ఆధారంగా కూడా ప్రశ్నించనున్నారు. కొన్ని దశాబ్దాలుగా హార్డ్ డిస్క్‌లలో సేకరించిన జాతీయ భద్రతకు సంబంధించిన డేటా మిస్ అవ్వడంపై కూడా సిట్ విచారిస్తుంది. ఇప్పటి వరకు ఈ కేసులో   400 మంది నుంచి వాంగ్మూలాలు నమోదు చేశారు.  

Journalist

జైలు నుంచి కొమ్మినేని విడుదల

  అమరావతి మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో అరెస్టైన జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు జైలు నుంచి విడుదలయ్యారు. గుంటూరు జైలు నుంచి విడుదలైన ఆయనకు వైసీపీ నేత అంబటి రాంబాబు స్వాగతం పలికారు. కాగా శుక్రవారమే సుప్రీం కోర్టు కొమ్మినేనికు బెయిల్ మంజూరైనా న్యాయస్ధానానికి వరస సెలవులు కారణంగా సంబంధిత ఉత్తర్వులను లాయర్లు పొందలేకపోయారు. ఇవాళ ఉత్తర్వులు అందడంతో ఆయన జైలుకు నుంచి విడుదలయ్యారు. కాగా బెయిల్ మంజూరు సమయంలో కొమ్మినేనికి సుప్రీంకోర్టు పలు సూచనలు చేసింది. మహిళలను కించపర్చేలా మరోసారి చేయొద్దని తెలిపింది. అలాగే ఆయనపై పోలీసులు పెట్టిన పలు సెక్షన్లపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. వెంటనే ఆ సెక్షన్లు తొలగించాలని, ఇక బెయిల్ కు సంబంధించి అన్ని విషయాలు ట్రయల్ కోర్టు చూసుకుంటుందని ధర్మాసనం తెలిపింది.  

Formula-E car case

జైల్లో పెడితే హాయిగా రెస్ట్‌ తీసుకుంటా : కేటీఆర్

  తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో హాజరైన బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అనంతరం నేరుగా తెలంగాణ భవనం చేరుకోని మీడియా సమావేశం నిర్వహించారు. ఇది ఒక లొట్టపీసు కేసు అని, ముఖ్యమంత్రి ఓ లొట్టపీసు అని తీవ్ర స్ధాయిలో కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనకు ఒకటే షోకు. నేను నెల రోజులు జైలులో ఉన్న .. వీళ్లను కూడా కొన్నిరోజులు జైలుపెట్టాలి అన్నదే ఆయనకున్న షోకు, పైశాచిక ఆనందం ఒక్కటే అని కేటీఆర్ విమర్శించారు. అందుకే ఇవాళ అధికారులకు నేను చెప్పిన.. మీకు పై నుంచి ఆదేశాలు రావొచ్చు ఇప్పటికే.. వస్తే పెడితే జైలులో పెట్టుకొమ్మని చెప్పాను. పదిహేను రోజులు విశ్రాంతి తీసుకొని వస్తానని చెప్పాను.  ఇప్పుడు మళ్లీ చెబుతున్నా.. తప్పు చేయలేదు.. తలదించుకునే పని ఎంతమాత్రం చేయలేదని ఆయన తెలిపారు. ఈ ఫార్ములా కార్‌ రేస్‌పై అసెంబ్లీలో చర్చ పెట్టాలని అడిగితే రేవంత్‌రెడ్డి పారిపోయిండని ఆయన అన్నారు. అవసరమైతే లై డిటెక్టర్‌ పరీక్ష చేయించుకుంటా.. నువ్వు రా రేవంత్‌కు సవాల్ విసిరారు. నాపై ఇప్పటి వరకు 14 కేసులు పెట్టారు. ఇంకో 1400 కేసులు పెట్టుకో.. అవసరమైతే జైలులో పెట్టుకో. ఏమన్న చేసుకో. భయపడేది లేదు. తెలంగాణ కోసం ఆనాడు జైలుకు పోయినం. అవసరమైతే తెలంగాణ ప్రతిష్టను పెంచేందుకు తీసుకున్న నిర్ణయం వల్ల జైలుకు వెళ్లాల్సి వస్తే భయపడేటోడు ఎవడూ లేడు. నీ ఉడుత ఊపులకు ఎట్టి పరిస్థితుల్లో భయపడమని కేటీఆర్ మండిపడ్డారు.

ఇరాన్‌లో నుంచి విద్యార్ధులు సురక్షితంగా స్వదేశానికి

  ప్రపంచంలో ఎక్కడ ఎలాంటి ఉద్రిక్తలు చోటు చేసుకున్న, ముఖ్యంగా ఇరుగు పొరుగు దేశాల మధ్య యుద్ధ వాతావరణం, నెలకొన్న సమయంలో, ఆయా దేశాల్లో చదువుకుంటున్న భారతీయ విధ్యార్ధులను, ఇతరత్రా, ఉద్యోగ, ఉపాధి వ్యాపకాల్లో ఆయా దేశాల్లో ఉన్న భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తీసుకు రావడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పెద్ద సవాలుగా మారుతుంది. గతంలో రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన సమయంలో, ఉక్రెయిన్‌లో చిక్కుకు పోయిన వందలాది మంది మన విధ్యార్ధులను మన విదేశాంగ శాఖ ఆ దేశంతో దౌత్య పరమైన చర్చలు జరిపి, మన విధ్యార్ధులను సురక్షితంగా స్వదేశానికి తీసుకు వచ్చింది. ఇప్పడుమళ్ళీ మరో మారు, అలంటి పరిస్థితే ఎదురైంది. ఇజ్రాయెల్-ఇరాన్ దేశాల మధ్య యుద్ద వాతావరణం వేడెక్కుతున్న నేపధ్యంలో ఇరు దేశాల్లో చిక్కుకుపోయిన, భారతీయులు, ముఖ్యంగా ఇరాన్’లో పెద్ద సంఖ్యలో ఉన్న భారతీయ విద్యార్ధులను సురక్షితంగా స్వదేశానికి తీసుకు వచ్చేందుకు,మన విదేశాంగ శాఖ, నడుం బిగించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాటు మూడు దేశాల విదేశీ పర్యటనలో ఉన్న, విదేశాంగ మంత్రి, ఎస్. జయశంకర్’  భారతీయ విద్యార్ధులు సురక్షితంగా భూసరిహద్దులు దాటేలా అనుమతించాలని చేసిన విజ్ఞప్తిని   ఇరాన్’  ప్రభుత్వం వెంటనే ఆమోదించింది. అయితే, ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ తమ గగనతలాన్ని ఇప్పటికే మూసేసిన నేపధ్యంలో, భూసరిహద్దుల్ని తెరిచి భారతీయ విద్యార్ధులను, సరిహద్దులు దాటించేందుకు,ఇరాన్ అంగీకరించింది. ఇరాన్ కు భారత్ కు చెందిన 1500 మందికి పైగా విద్యార్దులున్నారు.  ప్రస్తుత పరిస్థితి, దేశంలోని విమానాశ్రయాల మూసివేత, అలాగే అనేక రాజకీయ మిషన్లు తమ దౌత్యవేత్తలను, జాతీయులను విదేశాలకు బదిలీ చేయమని భారత్ చేసిన అభ్యర్థనల దృష్ట్యా, అన్ని భూ సరిహద్దులు దాటడానికి తెరిచి ఉన్నాయని ఇరాన్ విదేశాంగమంత్రి అబ్బాస్ అరాగ్చీ ప్రకటించారు.దీంతో ఇరాన్’లో చిక్కుకుపోయిన మన విద్యార్ధులు, సురక్షితంగా స్వదేశానికి చేరుకుంటారని, ఆందోళన చెంద వలసిన అవసరం లేదని, విదేశాంగ శాఖ అధికారులు తెలిపారు.

పేర్ని నానికి అరెస్ట్ వారెంట్ జారీ

  వైసీపీ మాజీ మంత్రి మాజీ మంత్రి పేర్నినానికి బిగ్ షాక్ తగిలింది. నూజీవీడు కోర్టు ఆయనకు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. 2019లో టీడీపీ కార్యకర్త చందు, శ్రీహర్ష లపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో సాక్షిగా పేర్ని నాని ఉన్నారు. వరుసగా వాయిదాలకు కోర్టుకు పేర్ని నాని హాజరుకాలేదు. కోర్టుకు రాకపోవటంతో తదుపరి విచారణకు  నానిని కోర్టులో హాజరుపరచాలని పోలీసులని మచిలీపట్నం కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 19వ తేదీకి న్యాయస్థానం వాయిదా వేసింది. దీంతో తమ ఎదుట హాజరుకావాలని పలుమార్లు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయినా సరే పేర్నినాని కోర్టుకు హాజరుకాలేదు. మూడు సార్లు వాయిదా వేసినా కానీ హాజరుకాకపోవడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇందుకు సంబంధించి వారెంట్ జారీ చేసింది.   

ముగిసిన కేటీఆర్ ఏసీబీ విచారణ..సెల్‌ఫోన్‌ సీజ్‌కు అధికారుల యత్నం

  ఫార్ములా-ఈ కార్‌ కేసులో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విచారణ ముగిసింది. దాదాపు 7 గంటల పాటు అధికారులు ఆయనను విచారించారు. విచారణ అనంతరం ఏసీబీ కార్యాలయం నుంచి ఆయన తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. 60 ప్రశ్నలను ఏసీబీ సంధించినట్లు తెలుస్తోంది. అవసరమైతే మరోసారి పిలుస్తామని, విచారణకు అందుబాటులో ఉండాలని కేటీఆర్‌ను కోరినట్లు  తెలుస్తోంది. కేటీఆర్‌ సెల్‌ఫోన్‌ను సీజ్‌ చేసేందుకు అధికారులు ప్రయత్నించారు. అయితే, ఇవాళ విచారణకు సెల్‌ఫోన్‌ తీసుకురాలేదని మాజీ మంత్రి తెలిపారు. ఈ-రేసు సమయంలో వాడిన సెల్‌ఫోన్లను అప్పగించాలని కేటీఆర్‌ను అధికారులు ఆదేశించారు.  ఈ నెల 18లోపు సెల్‌ఫోన్లను అప్పగించాలని స్పష్టం చేశారు. విచారణ అనంతరం కేటీఆర్‌ తెలంగాణ భవన్‌ను వెళ్లారు.పార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ ను ఏసీబీ ప్రశ్నించడం ఇది రెండో సారి. ఎఫ్ఈవో కంపెనీ ప్రతినిధులు ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా దర్యాప్తు అధికారులు కేటీఆర్ ను ప్రశ్నించినట్లు సమాచారం. హెచ్ఎండీఏ నిధుల దుర్వినియోగం, మంత్రి వర్గ ఆమోదం లేకుండా నిధులు ఎందుకు మళ్లించారన్న అంశాలపై కేటీఆర్ ను ఏసీబీ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఏసీబీ ప్రశ్నలకు బదులిస్తూ హెచ్ఎండీఏ నిధులను ఎఫ్ఈవోకు పంపామని ఇందులో తాను ఎక్కడా లబ్ది పొందలేదని కేటీఆర్ దర్యాప్తు అధికారులకు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.   

రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌

  అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రేపటి నుంచి రైతుల అకౌంట్లలో రైతు భరోసా నిధులు జమ చేయనుంది. రాష్ట్రవ్యాప్తంగా 1,034 రైతు వేదికల్లో రైతునేస్తం’కార్యక్రమం ప్రారంభమైంది. ప్రొ.జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వర్షాకాల పంటలకు పెట్టుబడి కోసం రేపటి నుంచి రైతుల ఖాతాల్లో భరోసా నిధులు జమ చేయాలని నిర్ణయించింది. ఎకరాలతో సంబంధం లేకుండా అందరికీ డబ్బులు వేయనున్నాట్లు తెలుస్తోంది. కాగా ఈ పథకం కింద ఎకరానికి రూ.6 వేల చొప్పున ఏటా రెండు సార్లు ప్రభుత్వం పెట్టుబడి సాయం అందిస్తోంది