Telangana Goverment

రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌

  అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రేపటి నుంచి రైతుల అకౌంట్లలో రైతు భరోసా నిధులు జమ చేయనుంది. రాష్ట్రవ్యాప్తంగా 1,034 రైతు వేదికల్లో రైతునేస్తం’కార్యక్రమం ప్రారంభమైంది. ప్రొ.జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వర్షాకాల పంటలకు పెట్టుబడి కోసం రేపటి నుంచి రైతుల ఖాతాల్లో భరోసా నిధులు జమ చేయాలని నిర్ణయించింది. ఎకరాలతో సంబంధం లేకుండా అందరికీ డబ్బులు వేయనున్నాట్లు తెలుస్తోంది. కాగా ఈ పథకం కింద ఎకరానికి రూ.6 వేల చొప్పున ఏటా రెండు సార్లు ప్రభుత్వం పెట్టుబడి సాయం అందిస్తోంది  

Technical error in cm cbn helicopter

సీఎం చంద్రబాబు హెలికాప్టర్ లో సాంకేతిక లోపం

ఆంధ్రప్రదేశ్  ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జిల్లాల పర్యటన కోసం ఉపయోగించే హెలికాప్టర్ లో సాంకేతిక సమస్య తలెత్తింది. ఇదే హెలికాప్టర్ ను రాష్ట్రపర్యటనలో కేంద్ర మంత్రి పియూష్ గోయెల్  కోసం కేటాయించారు. ఆయన తిరుపతి నుంచి కృష్ణపట్నం వెళ్లేందుకు సోమవారం (జూన్ 16) హెలికాప్టర్ వినియోగించాల్సి ఉంది. అయితే తీరా ఆయన హెలికాప్టర్ ఎక్కిన తరువాత సాంకేతిక సమస్య ఉత్పన్నం కావడంతో ఆయన తన పర్యటనను రద్దు చేసుకుని ఢిల్లీ తిరిగి వెళ్లిపోయారు. అదలా ఉంటే  సీఎం చంద్రబాబు జిల్లా పర్యటనలకు  వాడే హెలికాప్టర్లో సాంకేతిక సమస్య తలెత్తడం పట్ల ఆందోళన వ్యక్తం అవుతోంది.  అధికారులు అలర్ట్ అయ్యారు. ఈ హెలికాప్టర్ వినియోగంపై నివేదిక ఇవ్వాల్సిందిగా ఏపీ డీజీపీ ఇంటెలిజెన్స్ చీఫ్ ను ఆదేశించారు.  

election code violation case on bandi sanjay dismissed

బండి సంజయ్ పై కేసు కొట్టివేత

కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత బండి సంజయ్‌పై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసును తెలంగాణ హైకోర్టు సోమవారం  (జూన్ 16) కొట్టివేసింది.  2021 నవంబర్ 15న ఉమ్మడి నల్లొండ జిల్లాలో ఎన్నికల ప్రచారంలో భాగంగా బండి సంజయ్ భారీ ర్యాలీ నిర్వహించారు. ఆ ర్యాలీ సందర్భంగా ఆయన ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించి ఎటువంటి ముందస్తు అనుమతీ లేకుండా భారీ కాన్వాయ్ తో ర్యాలీ నిర్వహించారని అప్పట్లో ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు   పెన్ పహాడ్ పోలీసులు కేసు నమోదు చేశారు. నాటి నుంచీ ఈ కేసు 2021 నవంబర్ 15వ తేదీన ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం సందర్భంగా బండి సంజయ్ ఒక ర్యాలీ నిర్వహించారు. ఆ సమయంలో ఆయన సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్‌లో భారీ వాహనాలతో, ముందస్తు అనుమతి లేకుండా కాన్వాయ్‌తో ర్యాలీ చేపట్టారని ఎన్నికల అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పెన్‌పహాడ్ పోలీసులు బండి సంజయ్‌పై కేసు నమోదు చేశారు.ఈ కేసు హైదరాబాద్ లోని ప్రజాప్రతినిథుల కోర్టులో పెండింగ్ లో ఉంది.  ఈ కేసును క్వాష్ చేయాలని కోరుతూ బండి సంజయ్  తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. బండి సంజయ్ పిటిషన్ ను విచారించిన కోర్టు ఈ కేసు కొట్టేయాల్సిందిగా ఆదేశిస్తూ సోమవారం తీర్పు వెలువరించింది.

moaist party calls telugustates bandh

20న తెలుగు రాష్ట్రాల బంద్ కు మావోయిస్టుల పిలుపు

ఆపరేషన్ కగార్ కు నిరసనగా ఈ నెల 20న రెండు తెలుగు రాష్ట్రాల బంద్ కు మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. ఆపరేషన్ కగార్ పేరిట కేంద్రం  అటవీ ప్రాంతాలలో మిలటరీ ఆపరేషన్ ద్వారా హక్కులను కాలరాస్తున్నదని దుయ్యబట్టింది. ఈ మేరకు తెలంగాణ మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిథి జగన్ విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టు పార్టీ కీలక నేతలు చలం, అడేల్ లను ప్రభుత్వం హతమార్చిందని పేర్కొన్నారు.  ఆపరేషన్ కగార్‌లో తమ నాయకుల మరణం ద్వారా తీవ్ర నష్టం జరిగిందని, దీనికి నిరసనగా జూన్ 20న బంద్‌ను చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఈ బంద్‌ను విజయవంతం చేయడానికి ప్రజలు, సంస్థలు సహకరించాలని కోరారు.

KTR

కేటీఆర్‌కు జైలుకు వెళ్లాలని కుతూహలంగా ఉంది : మంత్రి సీతక్క

  బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌పై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్‌‌కు జైలు వెళ్లాలని  కుతూహలంగా ఉన్నట్లు ఉందని సీతక్క తెలిపారు. అందుకే వీలైనంత త్వరంగా జైలుకు పంపించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని రెచ్చగొడుతున్నారని ఆయన తెలిపారు. కేటీఆర్‌, కవిత మధ్య పోటీ నెలకొంది. కవిత జైలుకు పోయివచ్చి బీసీ ఎజెండా ఎత్తుకుంది. ఇప్పుడు నేను వెనుకబడ్డా అనుకుంటున్న కేటీఆర్‌.. జైలుకు పోయి పథకం రచించాలనుకుంటున్నారు.  ఏదో ఆశించి కేటీఆర్‌ జైలుకు పోవాలనుకుంటున్నాడు’ అని మంత్రి సీతక్క విమర్శించారు. కేటీఆర్ పొగరుతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు.ఇక పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సీతక్క మాట్లాడుతూ.. నేటి సమావేశంలో పంచాయతీ ఎన్నికలపై స్పష్టత వస్తుందని అనుకుంటున్నానని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో ఉంటాయని మాత్రమే తాను అన్నానని, నోటిఫికేషన్ గురించి ప్రత్యేకంగా ఏం మాట్లాడలేదని మీడియాలో ప్రచారం జరిగిందని, అది అవాస్తవమని సీతక్క క్లారిటీ ఇచ్చారు.  

Pm modi

ప్రధాని మోదీకి అత్యున్నత పురస్కారం

  భారత ప్రధాని మోదీ ప్రస్తుతం సైప్రస్ దేశంలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా, సైప్రస్ అత్యున్నత పౌర పురస్కారమైన 'గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ మకారియోస్ 3'ను ప్రధాని మోదీ అందుకున్నారు. సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడెస్ ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును మోదీకి అందజేశారు. ఈ గౌరవం 140 కోట్ల మంది భారతీయులకు దక్కిందని, ఇది ఇరు దేశాల మధ్య ఉన్న బలమైన సాంస్కృతిక సంబంధాలకు, సోదరభావానికి, వసుధైక కుటుంబం అనే భావనకు నిదర్శనమని ప్రధాని మోదీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.  ఈ పురస్కారాన్ని అందుకున్న అనంతరం ప్రధాని  మాట్లాడుతూ, సైప్రస్ ప్రభుత్వానికి, అక్కడి ప్రజలకు తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవార్డును భారత్-సైప్రస్ దేశాల మధ్య ఉన్న చిరకాల స్నేహానికి అంకితం చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ గుర్తింపు ఇరు దేశాల శాంతి, భద్రతలు, సార్వభౌమాధికారం, ప్రాంతీయ సమగ్రత, శ్రేయస్సు వంటి అంశాలపై పరస్పర నిబద్ధతను మరింతగా పటిష్టం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. మూడు దేశాల పర్యటనలో భాగంగా జూన్ 16న  సైప్రస్ చేరుకున్న ప్రధానికి నికోస్ క్రిస్టోడౌలిడెస్ విమానాశ్రయంలో సాదర స్వాగతం పలికారు. సైప్రస్ పర్యటన అనంతరం కెనడాకు మోదీ పయనమవుతారు. అక్కడ జరుగనున్న జీ-7 సదస్సులో పాల్గొంటారు. చివరిగా క్రొయేషియాలో అధికారిక పర్యటన జరుపుతారు.  

Minister Ponguleti Srinivas Reddy

మంత్రి పొంగులేటిపై టీపీసీసీ చీఫ్ ఆగ్రహం.. ఎందుకంటే?

  మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజర్వేషన్ల అంశంతో ముడిపడి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రి పొంగులేటి ప్రకటన చేయడాన్ని తప్పుబట్టిన టీపీసీసీ చీఫ్ తప్పుబట్టారు. మంత్రి వర్గంలో చర్చించాల్సిన అంశాలను ముందుగానే మీడియాతో మాట్లాడితే ఎలా అని సీరియస్‌ అయ్యారు. పార్టీలో చర్చించకుండా అలాంటి ప్రకటనలు చేయొద్దన్నారు. ఒకరి మంత్రిత్వ శాఖ అంశంపై వేరొకరు మాట్లాడం సరికాదని మహేశ్ కుమార్ గౌడ్ హితవు పలికారు.   సున్నిత, కోర్టు పరిధిలోని అంశాలపై మాట్లాడేప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని ఆయన సూచించారు. ఈ నెలాఖరులోగా స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తామని మంత్రి పొంగులేటి నిన్న ఖమ్మంలో చెప్పారు. తొలుత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తామని, ఆ తర్వాత సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు జరుపుతామని మంత్రి తెలిపారు. ఈ విషయంపై రేపు క్యాబినెట్ భేటీలో చర్చిస్తామని వివరించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు కేవలం 15 రోజులు మాత్రమే గడువు ఉందని, పూర్తిస్థాయిలో సిద్ధం కావాలని కాంగ్రెస్ శ్రేణులకు మంత్రి పొంగులేటి పిలుపునిచ్చారు.

police lock telanganabhawan

తెలంగాణ భవన్ కు పోలీసులు తాళం

హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ కు పోలీసులు తాళం వేశారు. కేటీఆర్ అరెస్టు వార్తల నేపథ్యంలో ఈ ఘటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఫార్ములా ఈ రేస్ కేసులో తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు సోమవారం (జూన్ 16) ఏసీబీ విచారణకు హాజరయ్యారు. హాజరు కావడానికి ముందు తెలంగాణ భవన్ కు చేరుకుని అక్కడ మీడియాతో మాట్లాడి అక్కడ నుంచే నేరుగా ఏసీబీ విచారణకు వెళ్లారు. తెలంగాణ భవన్ వద్ద మీడియాతో మాట్లాడిన ఆయన ఆ సందర్భంగా ఈ  ఫార్ములా రేస్ కేసులో తనను అరెస్టు చేసి జైలుకు పంపుతారని అన్నారు.  ఆ తరువాత ఆయన ఏసీబీ విచారణకు వెళ్లారు. కేటీఆర్ తెలంగాణ భవన్ నుంచి బయటకు వెళ్లగానే పోలీసులు తెలంగాణ భవన్ కు తాళం వేశారు.  దీనిపై బీఆర్ఎస్ శ్రేణుులు మండి పడుతున్నాయి. ప్రజాస్వామ్యమా పోలీసు రాజ్యమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.  పోలీసులు తెలంగాణ భవన్‌కు తాళం వేయడంతో పరిస్థితి ఉద్రిక్తతగా మారింది. అటు తెలంగాణ భవన్ సమీపంలోని నీలోఫర్ కేఫ్‌ను సైతం పోలీసులు మూయించి వేశారు. ఆ సమయానికి కేఫ్ లో ఉన్న వారిని బయటకు పంపించేసి ఆ తరువాత కేఫ్ ను మూయించివేశారు. తెలంగాణ భవన్  కు తాళం వేయడాన్ని ప్రశ్నించిన బీఆర్ఎస్ నేతలను అరెస్టు చేసి అక్కడ నుంచి తరలించేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఏ క్షణంలోనైనా కేటీఆర్ ను అరెస్టు చేసే అవకాశం ఉందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.  

Census

జనగణనపై కేంద్రం గెజిట్‌ విడుదల

  దేశంలో 16వ జనగణనకు రంగం సిద్దమైంది. దీనికి సంబంధించి కేంద్ర హోంశాఖ  గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ సారి కులగణన చేపట్టనుండటంతో ప్రధాన్యత సంతరించుకుంది. జనాభ లెక్కల సేకరణ తొలిసారిగా పూర్తిగా ట్యాబ్‌ల ద్వారా డిజిటల్ రూపంలోనే సాగనుంది. ఇందు కోసం 34 లక్షల మంది ఎన్యూమరేటర్లు, సూపర్ వైజర్లు, 1.34 లక్షల మంది సిబ్బంది పనిచేస్తారు.  ప్రభుత్వ పోర్టళ్లు, యాప్‌లలో ప్రజలే సొంతంగానూ వివరాలు నమోదు చేసుకోవచ్చు.దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇది 8వ జనగణన కావడం గమనార్హం. ఈ కార్యక్రమాన్ని రెండు దశల్లో డిజిటల్ గా నిర్వహించి, 2027 మార్చి 1 నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. జమ్ముకశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్, లడఖ్‌లో 2026 అక్టోబర్ 1 నాటికి జనగణన ముగియనున్నది.  

department of meteorology caution telugu states

తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

బంగ్లాదేశ్ నుంచి ఉత్తర బంగాళాఖాతం మీదుగా దక్షిణ ఒడిశా వరకు, మహారాష్ట్ర నుంచి తెలంగాణ మీదుగా కోస్తాంధ్ర వరకు రెండు వేర్వేరు ఉపరితల ద్రోణులు ఏర్పడ్డాయి. అలాగే ఉత్తరాంధ్రను ఆనుకొని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. వీటి ప్రభావంతో ఉభయ తెలుగు రాష్ట్రాలలో  వర్షాలు కురుస్తున్నాయి. ఈ ఆవర్తనాలకు తోడు రుతుపవనాల కదలిక కూడా చురుకుగా ఉండటంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.   సోమవారం తెలంగాణలోని పలు ప్రాంతాలలో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయనీ, ఆ సమయంలో గంటకు 40 కిలోమీటర్ల వరకూ వేగంగా ఈదురుగాలులు వీస్తాయనీ పేర్కొంది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే  వచ్చే 24 గంటల్లో  శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు,నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, చిత్తూరు జిల్లాల్లో  ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాలలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తాంధ్ర తీరం వెంబడి బలమైన గాలులు వీస్తాయనీ, మత్స్యకారులు సముద్ర వేటకు వెళ్లకుండా ఉంటే మంచిదని వాతావరణ శాఖ పేర్కొంది.    

Yoga Day

ఆర్‌కే బీచ్‌లో యోగా దినోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన సీఎం చంద్రబాబు

    ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వైజాగ్‌లో పర్యటిస్తున్నారు. ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ  పర్యటించనున్న నేపథ్యంలో ఆ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను ముఖ్యమంత్రి పరిశీలించారు. ప్రధాని  రానున్న సందర్బంగా ఆర్కే బీచ్‌ వద్దకు వెళ్లి జిల్లా అధికారులతో మాట్లాడి పలు సూచనలు చేశారు. భారీ ఎత్తున యోగా కార్యక్రమం నిర్వహిస్తుండటంతో బస్సు నుంచి బీచ్‌ రోడ్డు వెంబడి ఏర్పాట్లను పరిశీలించారు.  వీఐపీల భద్రత తదితర అంశాలపై అధికారులు సీఎంకు వివరించారు. ఇవాళ సాయంత్రం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఇంటికి చేరుకుని ఆయన కుటుంబసభ్యులను పరామర్శిస్తారు పల్లా శ్రీనివాసరావు తండ్రి మాజీ ఎమ్మెల్యే పల్లా సింహాచలం అనారోగ్యంతో భాధపడుతు కన్నుమూశారు. అనంతరం ప్రత్యేక విమానంలో విజయవాడకు బయలుదేరి వెళతారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో మంత్రులు డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి, పార్థసారథితో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన మంత్రులు, ఉన్నతాధికారులు ఆదివారం విశాఖపట్నం చేరుకుని ఏర్పాట్లను పరిశీలించారు.  

heartbreaking grief of the relatives of the deceased

గుండెల్ని మెలి పెడుతున్న మృతుల బంధువుల ఆవేదన

అహ్మదాబాద్‌ ఘోర విమాన ప్రమాద ఘటనలో సజీవ దహనమైన వారి మృతదేహాలను గుర్తించడం కష్టతరమవుతోంది. శరీరాలు ఛిద్రమైపోవడంతో అవి ఎవరివో తేల్చడం కత్తిమీద సాములా మారింది. ప్రతి శరీర భాగానికి డీఎన్‌ఏ  టెస్టులు చేయాల్సి రావడంతో ఎక్కువ సమయం తీసుకుంటోంది. మరోవైపు మాంసపు ముద్దలు ఇచ్చి.. ‘ఇవి మీ వారివే’ అని వైద్యులు చెబుతుంటే.. బంధువులు అంగీకరించలేకపోతున్నారు. ఒకట్రెండు ముక్కలు కాకుండా పూర్తి మృతదేహాలను అప్పగిస్తే అంత్యక్రియలైనా గౌరవంగా నిర్వహించుకుంటామంటూ వారు పడుతున్న ఆవేదన కన్నీరు పెట్టిస్తోంది. డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహిస్తున్న అహ్మదాబాద్‌లోని సివిల్‌ ఆస్పత్రిలోని మార్చురీ వద్ద.. మృతదేహాన్ని తీసుకొచ్చే సంచీలో రెండు తలలు ఉండటం వివాదానికి తావిచ్చింది. అప్రమత్తమైన వైద్యాధికారులు వెంటనే మరోసారి డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. తన కుటుంబ సభ్యుల అవశే షాలన్నీ అప్పగించమని ఓ వ్యక్తి అధికారులను వేడుకున్నారు. అయితే..  అది సాధ్యం కాదని అతి కష్టం మీద ఆయనను అధికారులు ఒప్పించారు. కష్టమని తెలిసినా.. ఆత్మీయులను కోల్పోయిన బాధలో బాధిత కుటుంబీకులు వైద్యులను ప్రాధేయపడుతున్న తీరు కన్నీరు తెప్పిస్తోంది. ఓ వైపు కుటుంబీకులను కోల్పోయామన్న బాధ.  మరోవైపు కనీసం వారి మృతదేహాలను కూడా ఇంటికి తీసుకెళ్లలేకపోతున్నామన్న ఆవేదనతో ఆస్పత్రి ఆవరణలో పరిస్థితి హృదయవిదారకంగా మారింది. విమాన ప్రమాదంలో మృతి చెందినవారి మృతదేహాలను అహ్మదాబాద్‌లోని 1200 పడకల సివిల్‌ ఆస్పత్రిలో భద్రపరిచారు. రక్తసంబంధీకుల నుంచి డీఎన్‌ఏ నమూనాలను సేకరించి, మృతదేహాల నమూనాలతో సరిపోల్చి.. బంధువులకు అప్పగిస్తున్నారు. ఇప్పటి వరకు 14 మంది మృతుల డీఎన్‌ఏను వారి కుటుంబ సభ్యుల జన్యు పరీక్షలతో సరిపోలినట్లు అధికారులు వెల్లడించారు. డీఎన్‌ఏ పరీక్షతో పనిలేకుండా బంధువులు గుర్తుపట్టిన 8 మృతదేహాలను ఇప్పటికే వారి వారి కుటుంబసభ్యులకు అప్పగించారు. వీలైనంత వరకు మిగతా మృతుల డీఎన్‌ఏను గుర్తించేందుకు అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. బాధితుల కుటుంబాలతో సమన్వయం చేసుకోవడానికి 230 బృందాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.

mlc kavitha in new avatar

కొత్త వేషం కట్టిన ఎమ్మెల్సీ కవిత!?

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుట్ల కవిత,కొత్త వేషం కట్టారు. పాఠాలు చెప్పే పంతులమ్మగా మారి పోయారు. అయితే  కవితా టీచర్, అందరు టీచర్లు చెప్పే పాఠాలు చెప్పరు. పొలిటికల్ పాఠాలు మాత్రమే చెపుతారు.అది కూడా అందరికీ కాదు.. ఓన్లీ మహిళలు మరియు యువతకు మాత్రమే కవిత మేడం రాజకీయ పాఠాలు  బోధిస్తారు. అందు కోసం  ఆమె  తెలంగాణ జాగృతి తరపున 'లీడర్' కార్యక్రమాన్ని ప్రారంభించారు. బాగుంది.. ఒకప్పుడు కమ్యూనిస్ట్  పార్టీలు  రాజకీయ పాఠశాలలు నిర్వహించేవి.  అలాగే ఇతర పార్టీలు కూడా శిక్షణ తరగతులు నిర్వహించేవి. ఇప్పుడు అలాంటి పాఠశాలలు ఉన్నాయో లేదో తెలియదు కానీ.. వాటి  అవసరం అయితే వుంది.  యువతను రాజకీయాల్లోకి రప్పించి, సమాజంలో మార్పు తీసుకురావడానికి అవసరమైన నాయకత్వ నైపుణ్యాలను అభివృద్ధి చేయడం ఈ కార్యక్రమ లక్ష్యంగా కవిత పేర్కొన్నారు. యువత, మహిళలకు తెలంగాణ జాగృతి ఒక రాజకీయ శిక్షణ వేదికగా మారబోతుందని తెలిపారు.రాజకీయాల్లోకి యువత రావడం ద్వారా స్వచ్ఛమైన రాజకీయాలకు నాంది పలుకుతుందని   కవిత సెలవిచ్చారు.  సో .. సంకల్పం మంచిదే. అదీ కాకుండా ఆమే అన్నట్లు  మహిళా రిజర్వేషన్ బిల్లు, నియోజక వర్గాల పునర్విభజన తర్వాత, ముందు ముందు రాజకీయ నాయకుల అవసరం, మరీ ముఖ్యంగా..  ఎన్నికల్లో పోటీ చేసే మహిళా నాయకుల అవసరం పెరుగుతుంది. అలాగే..  బీసీ రిజర్వేషన్స్ అమలులోకి వచ్చిన తర్వాత  బీసీ నాయకులకు డిమాండ్ పెరుగుతుంది. సో .. కవిత సంకల్పం వరకు అయితే బాగుంది. కానీ.. ఢిల్లీ లిక్కర్ కుంభ కోణంలో జైలుకు కూడా వెళ్లి వచ్చిన ఆమెకు ఆ ఆర్హత, యోగ్యతా ఉన్నాయా  అనేదే ప్రశ్న.    సరే.. ఆమెకు ఆ అర్హత,యోగ్యతా ఉన్నాయా అనే విషయాన్ని కాసేపు పక్కన పెట్టినా.. నిజంగా ఆమె సంకల్పం అదేనా లేక అటు పార్టీకి, ఇటు ఫ్యామిలీకి దూరమై కొని తెచ్చుకున్న మనుగడ సంక్షోభం నుంచి బయట పడేందుకు ఆమె కొత్త వేషం కట్టరా అనేది పెద్ద పజ్లింగ్  ప్రశ్న. గత వారం పది రోజులుగా ఆమె పడుతున్న అగచాట్లు, ఫేస్ చేస్తున్న అవమానాలను గమనిస్తే..  కవిత  లీడర్  కార్యక్రమం పరమార్ధం  మనుగడ కాపాడు కోవడం కోసమే అని వేరే చెప్ప నక్కర లేదు.  అవును.. ఉదర పోషణార్ధం బహుకృత వేషం  అంటారు పెద్దలు. అది కాకా పోయినా, కోటి విద్యలు కూటి కొరకే  అనే సామెతను అయితే అందరూ వినే ఉంటారు. అంటే..  బతుకు తెరువు కోసం అనేక వేషాలు వేయక తప్పదని అర్థం. ఆఫ్టరాల్  పొట్ట కూటి కోసమే ఎన్నో వేషాలు వేయక తప్పనప్పుడు రాజకీయాల్లో రాణించాలంటే ఇంకెన్ని వేషాలు వేయవలసి ఉంటుందో వేరే చెప్ప నక్కర లేదు. అందులోనూ.. కాలం కలసి రానప్పుడు, కష్టాలు చుట్టిముట్టినప్పుడు రాజకీయ నాయకులు అవసరార్ధం వేషాలు మార్చక తప్పదు.. ఇప్పడు  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధినాయకురాలు కవిత పరిస్థితి కూడా అదే. అందుకే, ఆమె పంతులమ్మ వేషం కట్టారని అంటున్నారు.

Karimnagar District

ప్రభుత్వ ఆసుపత్రిలో సర్జరీ చేయించుకున్న కలెక్టర్‌.. సీఎం అభినందనలు

  ప్రభుత్వ ఆసుపత్రిలో శస్త్రచికిత్స  చేయించుకున్న కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతిని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభినందించారు. గవర్నమెంట్ ఆస్పత్రుల్లో ఆధునిక సదుపాయాలు, అనుభవం ఉన్న వైద్యులు, సేవా దృక్పథం ఉన్న సిబ్బంది ఉన్నారు. సర్కారు దవాఖానలో నాణ్యమైన వైద్య సేవలు అందుతాయన్న నమ్మకం మాత్రమే ఇప్పుడు కావాలి. ప్రభుత్వ ఆసుపత్రిలో శస్త్ర చికిత్స చేయించుకుని ఆ నమ్మకాన్ని కలిగించిన కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతికి నా అభినందనలు" అని ఎక్స్ ద్వారా సీఎం రేవంత్ పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి కొంతకాలంగా శ్వాస సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో, ఆమె నిన్న కరీంనగర్‌లోని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. అక్కడ ఈఎన్టీ  విభాగానికి చెందిన నిపుణులైన వైద్యుల బృందం ఆమెకు సక్సెఫుల్‌గా ఎండోస్కోపీ నేసల్ సర్జరీ, సెప్టోప్లాస్టిక్టి సర్జరీలను నిర్వహించింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉంది.

ఇరాన్ ఇజ్రాయెల్ బ‌లాబలాలేంటి?

ఇటు సాంకేతికంగా,  అటు బ‌డ్జెట్ ప‌రంగా చూస్తే ఇరాన్ క‌న్నా ఇజ్రాయెలే ఒక‌టికి  ప‌ది రెట్లు ఎక్కువ‌. దేశ బడ్జెట్ లో ఇరాన్ డిఫెన్స్ బ‌డ్జెట్ సుమారు 8 బిలియ‌న్ డాల‌ర్లు మాత్ర‌మే ఉంటుంది. 2022, 2023 ప్ర‌కారం మ‌న‌కు అదే తెలుస్తుంది. అదే ఇజ్రాయెల్ బ‌డ్జెట్ 19 బిలియ‌న్ డాల‌ర్లు. దీన్నిబ‌ట్టే చెప్పొచ్చు ఎవ‌రు ఎక్కువ‌గా ర‌క్ష‌ణకు ప్రాధాన్య‌త‌నిస్తారో? ఇక ఇరాన్ కి, ఇజ్రాయెల్ కి ఉన్న యుద్ధ విమానాల సంగ‌తేంటో చూస్తే ఇజ్రాయెల్ కు 340 ఉంటే ఇరాన్ ద‌గ్గ‌ర 320 మాత్ర‌మే ఉన్నాయి. ఇజ్రాయెల్ ఫైట‌ర్ జెట్స్ లో ఎఫ్ 15, 35 ర‌కాలుంటే అదే ఇరాన్ ద‌గ్గ‌ర ఎఫ్ 4, 14 రాకాలున్నాయి. ఇవి మ‌రీ ఘోరం. 1960ల కాలం నాటివి. వీటి స్పేర్ పార్ట్స్ కూడా దొర‌క‌నంత దైన్యం.  ఇక ఇజ్రాయెల్ ఎంత లేటెస్ట్ అంటే ఈ దేశంలో త‌యారు చేసిన ఐర‌న్ డోమ్ టెక్నాల‌జీని యూఎస్ నేడు గోల్డెన్ డోమ్ గా వాడుకునేంత‌. అంతే కాదు ఇక్క‌డ లేజ‌ర్ వెప‌న్ టెక్నాల‌జీ కూడా త‌యారైంది. అది ఇత‌ర దేశాల్లో ఉన్న లేజ‌ర్ టెక్నాల‌జీక‌న్నా మోస్ట్ ప‌వ‌ర్ఫుల్. ఇటీవ‌లే వాటిని ప‌రీక్షించి చూసింది ఇజ్రాయెల్.  ఇక ఇజ్రాయెల్ ని దెబ్బ తీసే దారేద‌ని చూస్తే.. ఇరాన్ మాన్యువ‌ల్.. అదే ఇజ్రాయెల్ టెక్నిక‌ల్లీ హై ఎండ్. ఈ దేశం భారీ  టెక్నాల‌జీని క‌లిగి ఉంటుంది. దీంతో దీన్ని హ్యాండిల్ చేయాలంటే అదే టెక్నాల‌జీతో న‌రుక్కు రావ‌ల్సి ఉంటుంది. అందుకే ఇజ్రాయెల్ ని దెబ్బ తీయాలంటే సైబ‌ర్ దాడులు చేయాల‌ని అంటారు నిపుణులు. ఇజ్రాయెల్ పై వేల‌ల్లో సైబ‌ర్ దాడులు జ‌రుగుతాయి. అదే ఇరాన్ పై కేవ‌లం వంద‌ల్లో మాత్ర‌మే. ఉదాహ‌ర‌ణ‌కు 2023 అక్టోబ‌ర్- డిసెంబ‌ర్ మ‌ధ్య ఇజ్రాయెల్ మీద‌ 3380 సైబ‌ర్ దాడులు జ‌రిగాయి. అదే 2024  ఇరాన్ పార్ల‌మెంటు ఎన్నిక‌ల ముందు కేవ‌లం 200 సైబ‌ర్ దాడులు మాత్ర‌మే జ‌రిగాయి. ఒక స‌మ‌యంలో ఇరాన్ మీద సైబ‌ర్ దాడుల కార‌ణంగా ఆ దేశంలో పెట్రోలు బంకుల్లో ఇబ్బందులు త‌లెత్తాయి. వీట‌న్నిటిని బ‌ట్టీ చూస్తే ఇజ్రాయెల్ పై సైబ‌ర్ దాడులు ఎక్కువ‌. ఈ కోణంలో ఇరాన్ ఏదైనా ప్లాన్ చేస్తే ఇజ్రాయెల్ దూకుడును ఇరాన్ క‌ళ్లెం వేయ‌వ‌చ్చంటారు ఎక్స్ ప‌ర్ట్స్. అయితే ఇక్క‌డ మ‌రో ముఖ్య‌మైన విష‌యం ఏంటంటే ఇజ్రాయెల్ హీబ్రూ యూనివ‌ర్సిటీ ఒక స‌ర్వే ఇర్వ‌హించ‌గా ఇరాన్ పై దాడులు ఎమంత అవ‌స‌రం లేద‌నికు మూడింట రెండు వంతుల మంది చెప్పారు. ఇజ్రాయెల్ ప్ర‌ధాని బెంజిమ‌న్ నెత‌న్యాహూ రాజ‌కీయంగా డౌన్ అయిన‌పుడ‌ల్లా ఇరాన్ కార్డు వాడుతార‌ని అంటారు.  అందులో భాగంగానే ఈ యుద్ధం త‌లెత్తిన‌ట్టుగా నూ భావిస్తారు. దానికి తోడు యూఎస్ ఉండ‌నే ఉంది. యూఎస్ త‌న అవ‌స‌రాల  కోసం కూడా ఇలాంటి వార్ టెక్నిక్ ప్లే చేస్తుంటుంది అమెరికా. అందులో భాగంగానే ఈ వార్ న‌డుస్తున్న‌ట్టుగా ఒక టాక్ వైల్డ్ గా స్ప్రెడ్ అవుతోంది. మ‌రి చూడాలి ఈ యుద్ధం ముగింపు ఎక్క‌డో.

ఇరాన్- ఇజ్రాయెల్ మ‌ధ్య‌ఈ యుద్ధం అస‌లెందుకు?.. అమెరికా పాత్ర ఎంత‌?

ఇజ్రాయెల్ ఒక మొండి దేశం. దీని  మెయిన్ పాల‌సీ శిక్షించు, తుద ముట్టించు. మ‌న‌తో యుద్ధం అని భావించ‌డానికే భ‌య‌ప‌డాలి. మ‌న‌పై దాడి చేయ‌డానికే ద‌డుచుకోవాలి? ఇదీ ఇజ్రాయెల్ బేసిక్ థియ‌రీ. కేవ‌లం దేశాలు వాటి సైన్యాలు ఇత‌ర‌త్రా వ్య‌వ‌స్థ‌ల మీద మాత్ర‌మే కాదు.. వ్య‌క్తుల మీద కూడా ఇజ్రాయెల్ క‌న్నేసిందంటే వారు నామ రూపాల్లేకుండా పోతారు. కావాలంటే ఇదే యుద్ధంలో చూడండి.. ఇరానీ అణు శాస్త్ర‌వేత్త‌ల‌ను ఇజ్రాయెల్ ఏ విధంగా మ‌ట్టుబెట్టిందంటే.. టెహ్రాన్ లో కారు బాంబులు పెట్టి ఆరుగురు అణు శాస్త్ర‌వేత్త‌ల‌ను తుద‌ముట్టించేసింది. దీనికి కార‌ణ‌మేంటంటే గ‌త కొంత కాలంగా  ఇరాన్ ఇజ్రాయెల్ పై అణు దాడి చేస్తాన‌ని చెప్ప‌డ‌మే.  కేవ‌లం మాట‌లే క‌దా? అన్న కోణంలో కొన్నాళ్ల పాటు ఏమ‌ర‌పాటుగా ఉంటూ వ‌చ్చింది ఇజ్రాయెల్. ఈ లోగా అణు నిర్వ‌హ‌ణ సంస్త ఒక ప్ర‌క‌ట‌న చేసింది. గ‌త ఇర‌వై ఏళ్ల‌లో ఎప్పుడూ లేని విధంగా ఇరాన్ అణు నియ‌మాల‌ను ఉల్లంఘించిన‌ట్టు తేల్చి చెప్పింది. దీనంత‌టికీ కార‌ణం ఇరాన్ పెద్ద ఎత్తున యురేనియం శుద్ధి చేయ‌ట‌మే. ఈ మొత్తం యురేనియంతో  9 అణుబాంబులు చేయ‌వ‌చ్చు. ఈ వార్త ఎప్పుడైతే తెలిసిందో ఇక ఇజ్రాయెల్లో ఓపిక న‌శించి పోయింది. దీంతో ఎలాంటి ప్ర‌క‌ట‌న‌ల్లేకుండా వారికెంతో ప‌విత్ర‌మైన శుక్ర‌వారం తెల్ల‌వారు జామున మూడున్న‌ర గంట‌ల స‌మ‌యంలో ఇరాన్ రాజ‌ధాని టెహ్రాన్ పై భీక‌ర దాడుల‌కు తెగ‌బ‌డింది ఇజ్రాయెల్.  ఆ దేశ అణు నిల్వలుండే ప్రాంతం న‌టాంజ్ పై భారీగా విరుచుకుప‌డింది. దీంతో నేల‌మాళిగ‌లో ఉన్న అణు కేంద్రం పై క‌ప్పు దారుణంగా దెబ్బ తినింది. ఇక టెహ్రాన్ కి వంద కిలోమీట‌ర్ల దోరంలో ఉండే మ‌రో అణు కేంద్రంపైనా దాడులు చేసింది ఇజ్రాయెల్. ఇరాన్ అణు కేంద్రాల‌పై దాడులు చేయ‌డం మాత్ర‌మే  కాకుండా.. ఆ దేశ ఆర్ధిక మూలాలైన చ‌మురు బావులు, ఇంకా గ్యాస్ నిల్వ‌ల‌పైనా దాడులు చేసింది. ఒకే సారి 11 గ్యాస్ ట్యాంకుల‌ను పేల్చ‌డంతో అవి ఒక్కొక్క‌టీ  పేలుతూ భారీ అగ్ని  కీల‌లు ఎగ‌సిప‌డ్డం ఆ ప్రాంతంలో భీతావ‌హ వాతావ‌ర‌ణం నెల‌కొంది.  తొలి రోజు అంటే శుక్ర‌వారం చేసిన దాడిలో ఇరానీయ‌న్ సైనిక  అధికారుల‌తో పాటు, అణు సైంటిస్టుల‌ను సైతం మ‌ట్టుబెట్ట‌డంతో పాటు వంద మంది వ‌ర‌కూ చ‌నిపోయిన‌ట్టు చెప్పింది ఇరాన్ స్టేట్ టీవీ. ఇదిలా ఉంటే శ‌నివారం ఆర్ధిక మూలాల‌పై దెబ్బ తీసి దారుణ‌మైన న‌ష్టాన్ని  క‌లిగించింది. ఇది మా దేశంపై ఆర్ధికంగా ఎంతో ప్ర‌భావం చూపుతుంద‌ని ప్ర‌క‌టించింది ఇరాన్ చ‌మురు మంత్రిత్వ శాఖ‌. ఆదివారం ఒక అపార్ట్ మెంట్ పైనా ఇజ్రాయెల్ దాడి చేయ‌డంతో 29 మంది చిన్నారుల‌తో పాటు 60 మంది పౌరులు మ‌ర‌ణించారు. ఇరాన్ సైతం ఇజ్రాయెల్ పై క్షిప‌ణి దాడులు చేసింది. మే నాలుగున ఆ దేశ ర‌క్ష‌ణ మంత్రి త‌మ ద‌గ్గ‌ర 1200 కి. మీ రేంజ్ అత్యాధునిక మిస్సైల్ ఉంద‌ని. అది ఇజ్రాయెల్ పై వాడ‌బోతున్నామ‌ని ప్ర‌క‌టించిన‌ట్టే వాటిని వాడింది. హ‌జ్ ఖాసిం బాలిస్టిక్ క్షిప‌ణి ప్ర‌యోగం చేసింది. ఇరాన్ చేసిన దాడుల్లో ఇజ్రాయెల్లోనూ మ‌ర‌ణాలు సంభ‌వించాయి.  అయితే ఈ దాడుల వెన‌క అమెరికా పాత్ర ఉన్న‌ట్టు అనుమానిస్తోంది ఇరాన్. కార‌ణం గ‌త కొంత కాలంగా ఇరాన్- అమెరికా మ‌ధ్య అణు ఒప్పందా చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. ఇవి ఎంత‌కీ తెల‌డం లేదు. దీంతో అమెరికా ఇజ్రాయెల్ చేత ఈ దాడులు చేయిస్తున్న‌ట్టుగా అనుమానిస్తోంది ఇరాన్. అన్న‌ట్టుగానే ట్రంప్ కూడా మాతో అణు ఒప్పందం ఇక‌నైనా చేసుకోవాల్సిందిగా అల్టిమేటం జారీ చేస్తున్నారు. ఇప్పుడు చేసుకోకుంటే ఇరాన్ సామ్రాజ్యంలో ఏదీ మిగ‌ల‌ద‌ని హెచ్చ‌రిస్తున్నారు. అయితే దీన్ని ఇరాన్ విదేశాంగ శాఖ ఖండిస్తోంది. ఈ స‌మ‌యంలో అణు ఒప్పందాలు చేసుకోవ‌డ‌మేంట‌న్న‌ది ఇరాన్ వాద‌న‌. అంతే కాదు ఒక ప‌క్క ఇజ్రాయెల్ దాడుల‌కు మ‌ద్ధ‌తు తెలుపుతూ మ‌రో ప‌క్క మాతో ఒప్పందాలు చేసుకోడానికి ఎగ‌బ‌డ్డ‌మా? అన్న‌ది ఇరాన్ ప్ర‌ధాన‌ ఆరోప‌ణ‌. అయితే అమెరికా మాత్రం అక్క‌డ యుద్ధం జ‌రుగుతుందా లేదా? అన్న‌ది చూడ‌దు. ర‌ష్యాతో ఉక్రెయిన్ యుద్ధంలో ఉండ‌గానే.. ప‌దేళ్ల ఖ‌నిజ ఒప్పందం చేసుకోవ‌డం చూసే ఉంటాం. భార‌త్- పాక్ మ‌ధ్య ఘ‌ర్ష‌న  సైతం క్యాష్ చేసుకోవాల‌ని చూసింది యూఎస్. ఇప్పుడు ఇరాన్- ఇజ్రాయెల్ వార్ వంతు.  ఈ దాడుల‌తో త‌మ‌కెలాంటి సంబంధం లేదంటూనే తాను చెబితే ఈ యుద్ధం క్ష‌ణాల్లో ఆగిపోతుంద‌ని అంటున్నారు ట్రంప్.. ఒక ప‌క్క చూస్తే క్రూడ్ ఆయిల్ ధ‌ర‌లు 150 డాల‌ర్ల‌కు పెరిగే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయ్. దీనంత‌టి వెన‌క అమెరికా యుద్ద ప‌న్నాగం  ఉన్న‌ట్టుగా అంచ‌నా వేస్తున్నారు ప‌శ్చిమాసియా వ్య‌వ‌హారాల నిపుణులు. ఈ యుద్ధం ఇప్ప‌ట్లో ఆగ‌ద‌ని వైట్ హౌస్ చేస్తున్న ప్ర‌క‌ట‌న బ‌ట్టీ చూస్తుంటే.. ఇందులో ఒప్పందాల తాలూకూ ఒత్తిడులున్నాయ‌ని. ఇజ్రాయెల్ ని  ఒక బూచిగా చూపించి ఇరాన్ చేత అణు ఒప్పందాలు చేసుకోవ‌డ‌మే ల‌క్ష్యంగా అమెరికా ఇదంతా చేయిస్తోంద‌న్న మాట వినిపిస్తోంది.

అహ్మదాబాద్ ఫ్లైట్ యాక్సిడెంట్ లో ట‌ర్కీ కుట్ర కోణం?

కొంద‌రు చెబుతున్న అభిప్రాయాన్ని బ‌ట్టి  చెబితే ఫ్లైట్ AI171 అహ్మ‌దాబాద్ టు లండన్ ఫ్ల‌యిట్ యాక్సిడెంట్ కి సంబంధించి వార్త‌లు కాదు.. విజువ‌ల్స్ చూడాలి. ఇదంతా ప్రీప్లాన్డ్ కాకుంటే అన్న‌ది వీరి వాద‌న‌. ఒక యాక్సిడెంట్ ని ఇంత క్లియ‌ర్ క‌ట్ గా ఒక‌రు ఎలా తీయ‌గ‌ల‌రు?   ఈ మ‌ధ్య కాలంలో మ‌నం చూసే ఉంటాం.. భార‌త్ పాక్ వార్ లో ట‌ర్కీ పాక్ కి చేసిన డ్రోన్ హెల్ప్. దీన్ని బ‌ట్టి చూస్తే ఇక్క‌డున్న ట‌ర్కీ యాంగిల్ ఒక‌టి బ‌య‌ట ప‌డుతుంది. అహ్మ‌దాబాద్ ఎయిర్ పోర్టులో   మే 15 వరకు టర్కిష్ సంస్థ అయిన సెలెబి గ్రౌండ్ సర్వీసెస్.. గ్రౌండ్ ఆపరేషన్‌లను నిర్వహించింది. ఇదే ఇక్క‌డ అనుమానాస్పందంగా మారింది. కేవ‌లం ఒకే ఒక్క ఇంజిన్ తో స‌ముద్రాల‌ను అవ‌లీల‌గా దాట‌గలిగిన బోయింట్ 787 ఫ్లైట్ ఏంటి.. 45 సెక‌న్ల‌లో ఇలా కుప్ప  కూల‌డ‌మేంటి? అన్న‌దెవ‌రికీ అర్దం కావ‌డం లేదు. రెండు ఇంజిన్లు ఫెయిల్ అయినా కూడా అంత వేగంగా ఇంత భారీ విమానం కుప్ప‌కూల‌డం అసాధ్యం అన్న‌ది నిపుణుల మాట‌.  విమానం టేకాఫ్ నుంచి కుప్ప కూలిపోయే వ‌ర‌కూ దాని సెక‌న్ టు సెక‌న్ సిట్యువేష‌నేంటో చూస్తే.. 00:00 సెక‌న్ల స‌మ‌యంలో టేకాఫ్.. స్మూత్ గా అయ్యింది. 00:10 సెక‌న్ల వ‌ద్ద‌ ఫ్లైట్ పైకి లేచింది. 00:20 టైంలో – ఫ్లాప్‌లు వెనక్కి తగ్గలేదు. 00:25 స‌మ‌యంలో ల్యాండింగ్ గేర్ ఇంకా కిందే ఉంది. 00:28 సెకన్ల‌పుడు – ఆర్ఏటి మోహరించబడి ఉంది.  00:29 టైంలో – పైలట్ మేడే కాల్ పంపారు.  రియాక్ష‌న్ రాలేదు.  00:35 సెక‌న్ల‌పుడు  విమానం కింద‌కు వంగింది. ఆపై  నియంత్రణ కోల్పోయింది. 00:45 సెక‌న్ల టైంలో – క్రాష్ అయింది. ఇందులో ఏదో కుట్ర కోణం దాగి ఉంటుంద‌ని భావిస్తున్నారు కొంద‌రు నిపుణులు. ఇలా ఎప్ప‌టికీ జ‌ర‌గ‌ద‌ని అంటారు వీరు.  కార‌ణ‌మేంటంటే కోటిలో ఒక్క‌సారి కూడా సెక‌న్ల‌లో ఒక విమానం డెడ్ అయ్యి ఇలా పూర్తిగా కింద  ప‌డిపోదు. ఇందులో ఏదో ఒక ఆప‌రేష‌న్ జ‌రిగి ఉంటే త‌ప్ప‌.. ఇందులో ప‌క్షి సిద్దాంతం ఒక‌టి చెబుతున్నారు కానీ..  అది కూడా పూర్తిగా త‌ప్పు.. ఎలాంటి ప‌క్షులు విమానాన్ని ఢీ కొట్ట‌లేద‌ని తెలుస్తోంది. పూర్తిగా విద్యుత్ ఫెయిల్యూర్ సైతం రాట్ ని ప్రేరేపించద‌ని అంటున్నారు. ఒక ఇంజిన్ టేకాఫ్ అయ్యే కెపాసిటీ క‌లిగి ఉందంటే అందులో దాదాపు ఎలాంటి ప్ర‌మాద‌క‌ర‌మైన సంకేతాలు లేన‌ట్టే.. ముప్పై సెక‌న్ల‌లో కుప్ప  కూలిపోయే విమానం అస‌లు అక్క‌డి నుంచి క‌ద‌ల‌క మొరాయిస్తుందని అంటారు ఏవియేష‌న్ ఎక్స్ ప‌ర్ట్స్.    అందుకే వీరు  ఇది యాంత్రిక లోపం కాదు. యాధృచ్చికం అంత‌క‌న్నా కాదు. ఇందులో ఏదో ఒక ఆప‌రేష‌న్ జ‌రిగింది. లేకుంటే డ్రీమ్ లైన‌ర్ లాంటి ఒక టెక్నిక‌ల్లీ హై ఎండ్ విమాన‌మేంటి ఇలా కుప్ప‌కూలిపోవ‌డ‌మేంటి? అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక అంత‌టి వీక్ మెయిన్ టైన్స్ లో ఈ సంస్థకు చెందిన విమానాలు లేవన్న‌ది నిపుణుల మాట‌. ఫ్లాప్‌లు ప్లస్  గేర్ ప్లస్  ఆర్ఏటి ప్లస్ బ్లాక్అవుట్ ఈజ్ ఈక్వల్ టు ఎలక్ట్రానిక్ సిస్టమ్ విధ్వంసం.  ఇదీ ఈక్వేష‌న్.. ఎలా అని  చూస్తే ట్యాంపర్డ్ ఏవియానిక్స్, రోగ్ ఫర్మ్‌వేర్ ప్యాచ్,  ఇఎమ్ సిగ్నల్ జామింగ్,  వైరింగ్ విధ్వంసం ఇంత వేగంగా జ‌రిగాయంటే ఇందులో రాజీ ప‌డ్డ సిబ్బంది హ‌స్త‌మేదైనా ఉందా? అన్న కోణంలోనూ ద‌ర్యాప్తు జ‌ర‌గాల్సి ఉంది.  ఇక్క‌డ మే 15 వ‌ర‌కూ సెల‌బీ గ్రౌండ్ స‌ర్వీసెస్ సంస్థ ఆప‌రేష‌న్లు నిర్వ‌హించ‌గా.. దీనికి  విమానాల విష‌యంలో పూర్తి యాక్సెస్ ఉంది. విమానం ఎలక్ట్రానిక్ బే వరకు - మ‌రీ మాట్లాడితే దాని మెయిన్ సిస్ట‌మ్ వరకు ఈ సంస్థ చొచ్చుకుపోగ‌ల‌దు. ఇది కేవ‌లం యాక్సిడెంట్ కాదు. ఇందులో ఏదో మత‌ల‌బు దాగి ఉంద‌ని చెబుతోంది ఇందుకే.  అయితే ట‌ర్కిష్ సంస్థ ఈ కుట్ర కోణాన్ని ఖండిస్తోంది. ఎయిర్ ఇండియా ట‌ర్కీ టెక్నికల్ కంపెనీ మ‌ధ్య 2024- 25 మ‌ధ్య ఒక ఒప్పందం జ‌రిగిన మాట నిజ‌మే  కా నీ.. అది  బోయింగ్ 787-8 కి కాదు.  బీ 777కి మాత్ర‌మే అంటోందీ ట‌ర్కిష్ కంపెనీ. అయితే వారికి గ్రౌండ్ స‌ర్వీస్ లో భాగంగా అన్ని విమానాల‌కూ ఒక యాక్సెస్ ఉంటుంద‌ని అంటారు నిపుణులు. మ‌రి చూడాలి.. ట‌ర్కీ కుట్ర కోణంలో నిజానిజాలేంటో ఈ ప్ర‌మాద విచార‌ణ‌కు చెందిన పూర్తి వివ‌రాలు వెలుగులోకి వ‌చ్చే వ‌ర‌కూ ఏమీ చెప్ప‌లేం అన్న‌ది కొంద‌రి మాట‌.

అండమాన్ సముద్రంలో అపార చమురు నిక్షేపాలు!

ముడి చమురు దిగుమతులకు భారత్ ఇక వెంపర్లాడాల్సిన పని లేదు. ఇప్పటికైనా ప్రపంచంలో ముడి చమురు విషయంలో  అమెరికా, చైనాల తరువాత మూడో స్థానంలో ఉన్న భారత్ అతి త్వరలో ముడి చమురును ఎగుమతి చేసే స్థాయికి ఎదగనుంది. అండమాన్ సముద్రంలో అపార చమురు నిక్షేపాలు ఉన్నాయనీ, వాటిని కనుగొని వెలికి తీసేందుకు భారత్ సమాయత్తమౌతోంది. ఈ విషయాన్ని కేంద్ర పెట్రోలియయం, సహజవాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి చెప్పారు. ఒక ఆంగ్ల మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయనీ సంగతి తెలిపారు. అండమాన్ సముద్రంలో ఉన్న భారీ చమురు నిల్వల ముందు గయానాలోని చమురు నిల్వలు తక్కువేనని ఆయన అన్నారు. ప్రస్తుతం భారత్ రష్యా, ఇరాక్, సౌదీ అరేబియా వంటి దేశాల నుండి పెద్ద మొత్తంలో ముడి చమురును దిగుమతి చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అండమాన్ సముద్రంలో భారీగా ఉన్న చమురు నిల్వలను వెలికి తీస్తే భారత్  దశ మారిపోతుంది. ముడి చమురును దిగుమతి చేసుకునే స్థితి నుంచి పెద్ద ఎత్తున ఎగుమతి చేసే స్థాయికి చేరుతుంది. అంతే కాదు 3.7 ట్రిలియన్ నుంచి మన   $20 ట్రిలియన్ లకు మన ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని కేంద్ర మంత్రి చెప్పారు.