ఢిల్లీ నుంచి గల్లీ దాకా.. పొత్తుల పైనే చర్చలు

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు. శాశ్వత శతృవులు ఉండరు... ఇది ఒక విధంగా  సర్వామోదం పొందిన నానుడి. యూనివర్సల్ ట్రూత్.  సో .. పార్టీల మధ్య స్నేహ సంబంధాలు అటూ ఇటూ కావడం, పొత్తులు, కూటములు విచ్చిన్నం కావడం, పాత పొత్తులు వాడి,  కొత్త పొత్తులు విచ్చుకోవడం, కొత్త విషయం కాదు. నిన్న గాక మొన్న బీహారులో ఏమి జరిగిందో చూశాం.  రెండేళ్ళ క్రితం 2020 అక్టోబర్, నవంబర్ నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జనతా దళ్ (యు) పార్టీలు పొత్తు పెట్టుకుని, ఒకే కూటమిగా (ఎన్డీఎ) పోటీ చేశాయి. కూటమి విజయం సాధించింది. ఎన్డీఎ ప్రభుత్వం ఏర్పడింది. జేడీయు కంటే బీజేపీకి రెట్టింపు సీట్లు వచ్చినా, ముందే కుదిరిన ఒప్పందం ప్రకారం  జేడీయు నేత నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా  బాధ్యతలు చేపట్టారు. అయితే, ఈ రెండు సంవత్సరాలలో లోలోపల ఏమి జరిగిందో ఏమో కానీ, నితీష్ కుమార్ బీజేపీ చేయి వదిలి ఆర్జేడీ చేయి పట్టుకున్నారు. మళ్ళీ ఆయనే పీఠం ఎక్కారు. నితీష్  ముఖ్యమంత్రిగా కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. సరే, నితీష్ కుమార్ మనసు మళ్ళీ ఎప్పుడు మారుతుంది, ఈ ప్రభుత్వం ఎంతకాలం మనుగడ సాగిస్తుందనే భేతాళ ప్రశ్నలు ఉంటే ఉండవచ్చును కానీ, రాజకీయ ఎన్నికల పొత్తులకు సంబంధించి ఇదొక లేటెస్ట్ క్లాసిక్ ఎగ్జాంపుల్ గా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. నిజమే, ఇంతకు ముందు ఇదే బీహారులో ఇదే తరహ పొత్తులు కుడి ఎడమలు అయిన సందర్భాలున్నాయి. మహారాష్ట్రలోనూ కొంచెం అటూ ఇటుగా అదే జరిగింది. ఇతర రాష్ట్రలలోనూ, చివరకు జాతీయ స్థాయిలోనూ ఇలాంటి ఉదంతాలు అనేక ఉన్నాయి. కూటమిలో వచ్చిన కుమ్ములాటల కారణంగా ఒకే ఒక్క ఓటు తేడాతో  అటల్ బిహారీ వాజపేయి ప్రభుత్వం కూలి పోయింది.  అదలా ఉంచితే, ఇప్పుడు జాతీయ స్థాయి నుంచి రాష్ట్రాల వరకు పొత్తులు, ఎత్తులకు సంబంధించిన చర్చలే జోరుగా జరుగుతన్నాయి. టీవీ డిబేట్స్ మొదలు రచ్చబండ రాజకీయ చర్చల వరకు పొత్తుల మీదనే చర్చ నడుస్తోంది. ఎవరితో ఎవరు జట్టు కడతారు, ఎవరితో ఎవరు చేతులు కలుపుతారు ఎవరు ఎవరితో చేతులు కలిపితే ఫలితాలు ఎలా తారుమారు అవుతాయి అనే లెక్కల చుట్టూనే చర్చలు సాగుతున్నాయి.   తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బీహార్ రాజధాని పాట్నా వెళ్లి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తో సమావేశమై జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ ఏకం కావలసిన అవసరాన్ని ఇటు బీహారు పెద్దాయనకు, అటు దేశ ప్రజలకు ఒకేసారి విశద పరిచే ప్రయత్నం చేశారు. అలాగే, అంతకు ఒక రోజు ముందే ఎన్సీపీ అధినేత  శరద పవార్  బీజేపీయేతర రాజకీయ పార్టీలను జాతీయ స్థాయిలో ఏకం చేసి, ప్రజాభిప్రాయాన్ని కూడగట్టేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని చెప్పారు. అయితే అందులో తనది సలహాదారు పాత్ర మాత్రమే అని కూడా సెలవిచ్చారు. అలాగే, తృణమూల్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ, ఆప్ అధ్యక్షుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ఇలా ఎవరికి వారు, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని గద్దెదించడం కోసం ఎవరికి వారు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఏకమయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు కానీ, నాయకత్వం విషయంలో ఎవరి దారిన వారు విడి పోతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్  పాట్నా పర్యటనలో ఇదే  తగవు తలమానికంగా నిలిచింది. చివరకు ఆయన వెళ్ళిన పని, పంచిన కోటి రూపాయల నజరానాలు అన్నీ పక్కకి పోయి, నాయకత్వం విషయంలో కేసీఆర్, నితీష్ కుమార్ మధ్య ఏకాభిప్రాయం కుదరలేదన్న విషయమే ప్రముఖంగా బయటకు వచ్చింది.నాయకత్వ విషయం వచ్చే సరికి నితీష్ కుమార్ లేచి పోవడం, కేసీఆర్ ఆయన్ని కూర్చో పెట్టిందుకు భైఠోజీ .. భైఠో అని బతిమిలాడుకోవడమే హైలైట్ గా నిలిచింది.  అదొకటి అలా ఉంటే, ఆంద్ర ప్రదేశ్ లో టీడీపీ, బీజేపీల మధ్య మళ్ళీ పొత్తు పొడుస్తోందని, త్వరలోనే టీడీపీ ఎన్డీఎలో చేరుతోదంటూ గత వారం పదిరోజులుగా సాగుతున్న ప్రచారానికి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చక్కగా చుక్క(ఫుల్ స్టాప్) పెట్టారు. ఏపీ అభివృద్ది కోసం అవసరాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు అన్నారు. ఇప్పటి వరకూ పొత్తుల గురించి తానెక్కడా మాట్లాడలేదని చెప్పారు. పొత్తులపై నాయకుల్లోనూ ఈ స్పష్టత ఉండాలని తెలిపారు. నిజం, గతంలోనూ తెలుగు దేశం పార్టీ రాష్ట్ర ప్రయోజనాల కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకుంది. రాష్ట్ర ప్రయోజనాల కోసమే, ప్రత్యేక  హోదా కోసమే  పెట్టుకున్న పొత్తును తుంచేసుకుంది.   ఇప్పడు కూడా అదే పద్ధతిలో, ఎన్నికలు వచ్చినప్పుడు, అప్పటి రాజకీయ పరిస్థితి, రాజకీయ అవసరాలు, అన్నిటినీ  మించి రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవడమే సరైన నిర్ణయం అవుతుందని టీడీపీ భావిస్తోంది. చంద్రబాబు నాయుడు చెప్పింది కూడా అదే. నిజానికి ఇప్పడు కాదు, మొదటి నుంచి చంద్ర బాబు నాయుడు పొత్తుల చర్చలకు ఇంకా సమయం రాలేదనే అభిప్రాయం తోనే ఉన్నారు. అదలా ఉంటే తెలంగాణలో త్వరలో ఉప ఎన్నిక జరగనున్న మునుగోడులో అధికార తెరాసకు మద్దతు ఇవ్వాలని ఉభయ  కమ్యునిస్ట్ పార్టీలు సిపిఐ, సిపిఎం నిర్ణయించాయి. నిజమే, కొత్త పొత్తులకు పాత తగవులు అడ్డు రావని, లెఫ్ట్ పార్టీలే కాదు అన్ని పార్టీలు ఎప్పుడో నిర్ణయించాయి.ఇక్కడ నైతిక విలువలు అవీ ఇవీ అని మాట్లాడవలసిన అవసరం లేదు. అయితే, సిపిఐ, సిపిఎం పార్టీలు బీజేపీని ఓడించేందుకు తెరాసకు మద్దతు ఇస్తున్నామని చెప్పుకోవడం తాడి చెట్టు ఎందుకు ఎక్కావు అంటే ... ఆవుదూడ మేతకు అన్నట్లు ఉందని కొందరు  ఎద్దేవా చేస్తున్నారనుకోండి అది వేరే విషయం. గతంలో కేసేఆర్ లెఫ్ట్ పార్టీలను, ఆ పార్టీ నాయకులను ఎంతగా చులకన చేశారు, ఎంతగా అవహేళన చేశారు, లెఫ్ట్ నేతలు కేసీఆర్ ను  ఏ భాషలో దూషించారు అనేది ఇప్పడు అప్రస్తుతం.  అయితే, ఇలా  పొత్తుల చుట్టూ తిరుగుతున్న చర్చలో జాతీయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు, రాష్ట్ర స్థాయి నుంచి నియోజక వర్గ స్థాయి వరకు బీజేపీని ఓడించడమే లక్ష్యంగా కనిపిస్తోందని,  ఇన్ని పార్టీలు, ఇంత మంది మహా నాయకులు అందుకోసమే పనిచేస్తున్నారు, అని పిస్తుంది. కానీ... బీజేపీని, మోడీని ఓడించడం అయ్యే పనేనా అంటే రేపటి సంగతి ఏమో కానీ ఈరోజుకు అయితే కాదనే అనిపిస్తుందని విశ్లేషకులే కాదు, సామాన్యులు కూడా భావిస్తున్నారు. ఎందుకలా ...?!

అమరావతికి ఇలా కూడా జగన్ ఎసరు!?

‘భార్య అంటే ఇష్టం లేని మొగుడు పడకగది అంతా పాడుచేశాడు’ అన్నట్టు ఉంది జగన్  అండ్ కో తీరు చూస్తుంటే.. మూడున్నరేళ్ళ క్రితం అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి సర్కార్ అమరావతిని రాజధానిగా కొనసాగించే ఇష్టం లేక మూడు రాజధానుల గోలను తెర మీదకు తెచ్చింది. దీంతో 33 వేల ఎకరాల భూమిని రాజధాని నిర్మాణం కోసం అంద జేసిన ఆ ప్రాంత రైతులు, మహిళలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు, కౌలు రైతులు, దళిత రైతులు, మహిళలు  వివిధ రూపాలలో ఉద్యమాన్ని నిర్విరామంగా కొనసాగిస్తూనే ఉన్నారు. చివరికి అమరావతినే రాజధానిగా కొనసాగించాలని వైసీపీ సర్కార్ కు కోర్టు మొట్టికాయలు వేసింది. రాజధాని అమరావతి నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తిచేయాలని  గడువు కూడా విధించింది. కోర్టు మొట్టికాయలతో విధిలేని పరిస్థితిలో మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకున్న జగన్ రెడ్డి.. ఆ చట్టాన్ని మరింత పకడ్బందీగా తీసుకొస్తామంటూ అసెంబ్లీలోనే  తన వాచాలత ప్రదర్శించారు. ఇప్పుడు వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో మూడు రాజధానుల బిల్లు ప్రవేశపెట్టే దిశగా కసరత్తు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. మంత్రి అమర్నాథ్ రెడ్డి అయితే వచ్చే ఎన్నికలలోగానే  మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని ప్రకటించేశారు. ఈ నేపథ్యంలోనే అమరావతిలో కోర్టు తీర్పును ప్రభుత్వం ఉల్లంఘిస్తోందంటూ వచ్చిన ఫిర్యాదుపై హైకోర్టు స్పందించింది. అమరావతి రైతులకు అభివృద్ధి చేసి ప్లాట్ల పంపిణీ విషయం ఎంతవరకు వచ్చిందని జగన్ ప్రభుత్వాన్ని హైకోర్టు తాజాగా నిలదీశింది. ఒక పక్కన అమరావతి రాజధాని రైతుల ఉద్యమం నిరంతరాయంగా కొనసాగుతున్నప్పటికీ.. మరో పక్కన కోర్టు కూడా ఆరా తీస్తున్నప్పటికీ విధ్వంస ప్రక్రియ యథేచ్ఛగా కొనసాగుతుండడం పట్ల ఆ ప్రాంత  ప్రజలు, రైతుల్లో ఆగ్రహం వ్యక్తం అవుతోంది. రాజధాని శంకుస్థాపన కోసం ఏర్పాటు చేసిన రహదారిని తాడేపల్లి మండలం పెనుమాకకు చెందిన రైతు గోవిందరెడ్డి  గత నెల 31న తవ్వేశారు. శంకుస్థాపన ప్రాంతానికి ఆ రహదారి కోసం వేసిన కంకర చిప్స్ ను రెండున్నర అడుగుల లోతులో 30 మీటర్ల పొడవున గోవిందరెడ్డి తవ్వేసి, ట్రాక్టర్ల ద్వారా తరలించుకుపోవడం సంచలనంగా మారింది. రాజధాని ప్రాంత రహదారిని గోవిందరెడ్డి తవ్వేయడంపై రెవెన్యూ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజధాని అమరావతిలోని సీడ్ యాక్సెస్ రోడ్డుకు ఇతర ప్రాంతాల నుంచి అనుసంధానించే రహదారుల్లో అది కూడా ఒకటి కావడం విశేషం. రాజధాని నిర్మాణానికి ప్రధాని మోడీ శంకుస్థాపన చేసిన ఉద్దండరాయునిపాలెంకు ఈ రోడ్డు పశ్చిమ వైపున ఉంది. దీని నిర్మాణానికి గత టీడీపీ ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చించింది. గోవిందరెడ్డి తవ్వేసిన రహదారి ప్రాంతాన్ని రెవెన్యూ ఇన్ స్పెక్టర్ ప్రశాంతి తన సిబ్బందితో కలిసి పరిశీలించారు. ఆ తర్వాత రైతు గోవిందరెడ్డి నుంచి వివరణ తీసుకున్నారు. గోవిందరెడ్డి చెప్పిన సమాధానంతో ఆశ్చర్యపోవడం ఆర్ ఐ ప్రశాంతి వంతు అయింది. ఆ రహదారి ఉన్న పొలాన్ని తాను కొనుగోలు చేశానని, తన పొలాన్ని తాను చదును చేసుకోడానికే రహదారిని తవ్వేశానని గోవిందరెడ్డి చెప్పడం ఆశ్చర్యం కలిగించింది. అంతే కాకుండా రహదారిని తవ్వేసి తరలించుకెళ్లిన కంకర చిప్స్ ను తమ గ్రామంలో ప్రజోపయోగానికి వాడినట్లు కూడా చెప్పడం విశేషం. గోవిందరెడ్డి ఇచ్చిన వివరణతో తయారు చేసిన నివేదికను తాసిల్దారుకు ఆర్ ఐ ప్రశాంతి అందజేయడం గమనార్హం. ఆ నివేదిక ఆధారంగా పోలీస్ స్టేషన్ లో గోవిందరెడ్డిపై తాసిల్దారు ఫిర్యాదు చేశారు. రాజధాని రహదారిని తవ్వేసిన ప్రాంతంలో ఐకాస నేతలు నిరసనకు దిగారు. అమరావతిని నాశనం చేయాలనే దురుద్దేశంతోనే జగన్ ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తోందని వారు దుయ్యబట్టారు. రాజధాని నిర్మాణం నిలిచిపోవడం వల్లే తరచు ఇలాంటి అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయంటున్నారు. వైసీపీ నేతలే ఈ అక్రమ తవ్వకాలకు పాల్పడ్డారంటూ రాజధాని ఐకాస నేతలు ఆరోపిస్తున్నారు. అభివృద్ధి చేయడం చేతకాకపోతే ఊరుకోవాలి కానీ ఇలా రాజధాని కోసం వేసిన రోడ్లను తవ్వేసి, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమేంటనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. అమరావతినే రాజధానిగా కొనసాగించడం సుతరామూ ఇష్టం లేని జగన్ రెడ్డి ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి దుశ్చర్యలను ప్రోత్సహిస్తున్నారని, అమరావతి నిర్మాణాన్ని ఎలాగైనా కొండెక్కించాలనే కుట్రతోనే ఇలాంటి చర్యలకు దింపుతున్నారనే ఆరోపణలు సర్వత్రా వస్తున్నాయి.

ఆసియాక‌ప్ .. వారంలో మ‌ళ్లీ భార‌త్‌-పాక్ వార్‌

అంత‌ర్జాతీయ క్రికెట్ పోటీ అన‌గానే యావ‌త్ క్రికెట్ వీరాభిమానుల‌కు గుర్తుచేసుకునే పోటీలు అతి పెద్ద‌వి రెండే.. ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా యాషెస్ సిరీస్‌, రెండోది భార‌త్, పాకిస్తాన్ మ‌ధ్య హోరాహోరీ జ‌రిగే  మ్యాచ్లు. వీటికే ప్రేక్ష‌కులు ఫిదా అయ్యేది. కార‌ణం యావ‌త్ క్రికెట్‌లో స‌త్తా ఉన్న ప్లేయ‌ర్లు, అస‌ లు ఉత్త‌మ స్థాయి ఆట ప్ర‌ద‌ర్శ‌న అనేది చూసి తరించ‌గ‌లిగేది ఈ నాలుగు జ‌ట్ల ధ‌నాధ‌న్ పోటీల్లోనే. ప్ర‌స్తు తం మ‌నం ఆసియా క‌ప్ పోటీలు చూసి త‌రిస్తున్నాం. ఆసియాక‌ప్ 2022 లో ఇప్ప‌టికే ఒక మ్యాచ్‌లో దాయాదులు క‌ల‌బ‌డ్డారు. మొద‌టి మ్యాచ్ భార‌త్ గెలిచింది. ఆసియా క‌ప్‌లో ఈసారి సూప‌ర్ 4 స్థాయికి రెండు వ‌చ్చాయి. వారం తిర‌క్కుండానే మ‌ళ్లీ ఇరు జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి. భార‌త్ ఈ మ్యాచ్‌లో విజృం భించి గెలిస్తే ర‌వ్వంత స్వ‌ల్ప స్కోర్ తేడాతో గెలిచినా, పాక్ ఓడినా మ‌ళ్లీ ఫైన‌ల్‌కి త‌ల‌ప‌డే అవ‌కాశా లుంటాయి. అస‌లు సిస‌లు పోటీ అప్పుడు చూడ‌గ‌ల్గుతాం.  ఇక సూప‌ర్ 4 మ్యాచ్‌ల్లో భాగంగా భార‌త్‌, పాక్‌లు ఆదివారం (ఆగ‌ష్టు 4)న త‌ల‌ప‌డ‌నున్నాయి. రెండు జ‌ట్లూ మంచి ప‌దును మీద ఉన్నాయి. రేపు జ‌రిగే మ్యాచ్ ప్ర‌క్ష‌కుల‌కు అత్యంత ఆస‌క్తిక‌ర, ఉత్సాహ‌భ‌రిత వాతావ ర‌ణంలో మ్యాచ్ ర‌క్తిక‌ట్టించే అవ‌కాశం ఉంద‌ని ఇప్ప‌టికే క్రికెట్ పండితులు అంటున్నారు. అంటే ఇది స‌హ‌జంగా దాయాదుల మ‌ధ్య జ‌రిగే పోటీ కాబ‌ట్టి అంతే స్థాయిలో జ‌రుగుతుంది, ఎక్క‌డ‌ యినా. కాకుంటే షార్జాలో గ‌నుక మ‌రింత ఉత్సుక‌త‌ను ప్ర‌ద‌ర్శిస్తారు. ఎవ‌రికి వారే ధీటుగా ఆడే ప్లేయ‌ర్ల‌తో రికార్డు స్థాయి పెర్‌ఫార్మెన్స్‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌వ‌చ్చు.  భార‌త్‌కు విజ‌యావ‌కాశాలు ఉన్నాయ‌నే అంటున్నారు. ఈ టోర్నీలోనూ క‌ప్పును కాపాడుకుంటారన్న ధీమా కూడా వీరాభిమానులు వ్య‌క్తం చేస్తున్నారు. కార‌ణం  పాక్ జ‌ట్టులో అర‌వీర‌భ‌యంక‌ర లెఫ్టార్మ్ పేస‌ర్ షాహీన్ ఈ టోర్నీకి జ‌ట్టులోకి ఎంపిక కాలేదు. అత‌ని  మోకాటి గాయం కార‌ణంగా అత‌న్ని జ‌ట్టులోకి తీసుకోలేదు. వాస్త‌వానికి అత‌ను ఇటీవ‌ల భార‌త్ బ్యాట‌ర్ల‌కు పెద్ద ప‌రీక్ష‌పెట్టేడు. అచ్చం వాసిం అక్ర‌మ్ స్థాయి స్వింగ్‌తో బ్యాట‌ర్ల‌కు ద‌డ‌పుట్టించేడు.  కుర్రాడు, పొడుగ్గా వుండి ప‌రుగున వ‌చ్చి  బంతిని మ‌హా తెలివిగా స్వింగ్ చేస్తుంటే బ్యాట‌ర్లు బెంబేలెత్త‌క పోరు. ఆ అనుభ‌వం మ‌న వాళ్ల‌కి కొంత ద‌క్కింది. అత‌ను వ‌స్తే ఈ టోర్నీలో మ‌రింత గ‌ట్టి పోటీ ఉండేది. కానీ మ‌న‌వారికి అదృ ష్టం, పాక్‌కు దుర‌దృష్టం అత‌ను మోకాటి గాయంతో ఇంటికి ప‌రిమితం అయ్యాడు. అయిన‌ప్ప‌టికీ వారి బౌలింగ్ విభాగాన్ని త‌క్కువ‌గా చూడాల్సిన‌దేమీ లేదు. పాక్‌కి మొహ‌మ్మ‌ద్ రిజ్వాన్‌, ఫ‌క‌ర్ జ‌మాన్ ఉన్నా రు. వారి ధాటిని ఎదుర్కొన‌డంలో కాస్తంత జాగ్ర‌త్త‌గా బ్యాట్ చేయ‌వ‌ల‌సి వ‌స్తుంది. శుక్ర‌వారం మ్యాచ్ అంత కు ముందు భార‌త్‌తో జ‌రిగిన మ్యాచ్‌లోనూ పాక్ బౌల‌ర్లు మంచి నైపుణ్యాన్నే ప్ర‌ద‌ర్శించారు. అలాగే పాక్‌ను ఇబ్బందిపెట్ట‌గ‌లిగిన మ‌న ఆల్‌రౌండ‌ర్ ర‌వీంద్ర జ‌డేజా కూడా ఇక టోర్నీ లో ఆడ‌డు. అత‌ను కూడా మోచేతి గాయం కార‌ణంగా టోర్నీకి దూర‌మ‌య్యాడు. అత‌ని స్థానంలో జ‌ట్టులోకి మ‌రో ఆల్‌రౌండ‌ర్ అక్ష‌ర్ ప‌టేల్ వ‌చ్చాడు. అయితే జ‌డేజా ఫీల్డ‌ర్‌గా అంత‌ర్జాతీయ స్థాయిలో ఎంతో పేరున్న సూప‌ర్ ప్లేయ‌ర్‌. మెరుపువేగంతో బంతిని ఆప‌డం, వికెట్లు ప‌డ‌గొట్ట‌డంలో ఏ గొప్ప అంత‌ర్జాతీయ ప్లేయ‌ర్‌కీ తీసిపోడ‌ని పాక్ మాజీలు కూడా అంగీక‌రించారు. అత‌ని వేగం ముందు బ్యాట‌ర్లు బ‌హు జాగ్ర‌త్త‌గానే ఉంటారు. అంత‌టివాడు ఏకంగా ఇపుడు ఏకంగా టోర్నీకి గాయం కార‌ణంగా దూరం కావ‌ల‌సి వ‌చ్చింది. అలాగ‌ని అక్ష‌ర్ ప‌టేల్ త‌క్కువేమీ కాదు.  పోతే ఆసియా క‌ప్ టోర్నీల్లో ఇప్ప‌టివ‌ర‌కూ భార‌త్ , పాక్‌లు 16 మ్యాచ్‌ల్లో ఢీకొంటే భార‌త్ 9 మ్యాచ్‌లు, పాకిస్తాన్ 5 మ్యాచ్‌లు గెలిచాయి. రెండు మ్యాచ్‌ల్లో ఫ‌లితాలు రాలేదు. అంటే ఒక‌టి టై కాగా, మ‌రొక‌టి ఫ‌ల‌తం తేల‌కుండానే ముగిసింది. ఆసియాక‌ప్‌లో భార‌త్ విజ‌యాలు 67.27 శాతం మేర‌కు ఉంది. కాగా మొత్తం మీద ఆసియా క్రికెట్ టోర్నీల్లో జ‌రిగిన 50 మ్యాచ్‌ల్లో పాకిస్తాన్ 28 మ్యాచ్‌లు గెల‌చింది. అంటే ఇక్క‌డి పిచ్‌ల మీద వారికి సంపూర్ణ ఆధిప‌త్యం ఉంద‌నే అంగీక‌రించాలి. ఈ లెక్క‌లు, స‌త్తాల ప‌రంగా చూసుకుంటే రేప‌టి అంటే ఆదివారం ఆగ‌ష్టు 4వ తేదీ మ్యాచ్ రెండు సింహాలు ఢీకొన్న స్థాయిలో జ‌రిగే అవ‌కాశాలే ఉన్నాయి. ఇరు దేశాల క్రికెట్ వీరాభిమానుల‌తో పాటు ఇత‌ర రంగాల‌కు చెందిన వారూ మ‌రింత ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. మ‌ళ్లీ ఇలాంటి ఉత్సాహాన్ని రెట్టింపు చేసే ఉత్కంఠ‌త‌కు ఆలవాల‌మ‌య్యే మ్యాచ్ చూడ‌టానికి మ‌రింత స‌మ‌యం ప‌డుతుంది. జ‌య‌హో భార‌త్‌!

అసెంబ్లీ ఎన్నికలకు ముందే మూడు రాజధానులు.. గుడివాడ అమర్నాథ్

కోర్టు తీర్పులు, ప్రజల ఆకాంక్షలు పట్టని నేతలు తాము చెప్పిందే వేదమని అంటారు. అనడమే కాదు అదే నమ్ముతారు. ఎవరేమన్నా, ఎన్ని విధాలుగా తప్పుపట్టినా వారికి పట్టనే పట్టదు. ఏపీ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కూడా అదే వరుసకు చెందుతారు. ఒక వైపు కోర్టు మొట్టి కాయలు, మరో వైపు అమరావతి రైతుల ఆందోళన ఇవేమీ పట్టించుకోకుండావచ్చే ఎన్నికలకు ముందే మూడు రాజధానులు ఏర్పాటు చేయడం ఖాయమని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. విశాఖపట్నంలో శుక్రవారం(సెప్టెంబర్ 2) విలేకరులతో మాట్లాడిన ఆయన తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లను జైలుకు పంపాలన్నారు. వారిరువురూ రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం కలిగించేలా మాట్లాడుతున్నారని విమర్శించారు. గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలలో 90 శాతం నెరవేర్చామన్న గుడివాడ అమర్నాథ్.. అయినా ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని తామెక్కడా చెప్పలేదన్న కొత్త వాదనకు తెరలేపారు. విభజన హామీలను కేంద్రానికి తాకట్టు పెట్టిన చంద్రబాబుకు జగన్ ను విమర్శించే అర్హత లేదన్నారు. త్వరలో జరగనున్న కేబినెట్ సమావేశంలో ప్రధానంగా మూడు రాజధానులపైనే చర్చ ఉంటుందన్నారు. బల్క్ డ్రగ్ ప్రాజెక్టును చంద్రబాబు వ్యతిరేకించడాన్ని మంత్రి అమర్నాథ్ తీవ్రంగా తప్పుపట్టారు. రాష్ట్ర ప్రగతిని అడ్డుకుంటున్న చంద్రబాబును రాష్ట్రం నుంచి తరిమేయాలన్నారు.  

బీహార్ సీఎం నితీష్ కు షాక్.. మణిపూర్ లో జేడీయూ ఖాళీ

బీహార్ సీఎం నితీష్ కుమార్ కు ఆ పార్టీ ఎమ్మెల్యేలు బిగ్ షాక్ ఇచ్చారు. మణిపూర్ లో జేడీయూకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలూ కమలం గూటికి చేరారు. వారు ఆరుగురూ బీజేపీలో విలీనం కావడంతో మణిపూర్ అసెంబ్లీలో జేడీయూ ఖాళీ అయ్యింది. దీనిపై  బీజేపీ నాయకుడు, ఎంపీ సుశీల్ మోడీ మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాలు జేడీయూ ముక్త గా మారుతున్నాయని ట్వీట్ చేశారు. కాగా మణిపూర్ లో జేడీయూ ఎమ్మెల్యేల విలీనాన్ని స్పీకర్ వెంటనే ఆమోదించారు.  బీజేపీ నేత, ఎంపీ సుశీల్ మోదీ ట్వీట్ చేస్తూ.. మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాలు ‘జేడీయూ ముక్త్’గా మారుతున్నాయని సెటైర్ వేశారు. నితీష్ కుమార్ కు ఇలా ఎదురు దెబ్బ తగలడం పది రోజుల వ్యవధిలో ఇది రెండో సారి. గత నెల 25న అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన జేడీయూ ఎమ్మెల్యే టెకి కసో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు.  2019లో అరుణాచల్ ప్రదేశ్లో  జేడీయూ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో విజయం సాధించినా,   ఆ తర్వాత ఆరుగురు జేడీయూ ఎమ్మెల్యేలు కమలం గూటికి చేరిపోయారు. ఇప్పుడు అంటే గత నెల 25న ఆ మిగిలిన ఒక్క ఎమ్మెల్యే కూడా బీజేపీలో చేరడంతో అరుణాచల్ అసెంబ్లీలో జేడీయూకి ప్రాతినిథ్యమే లేకుండా పోయింది. తాజాగా మణిపూర్ లో కూడా ఆ పార్టకి చెందిన ఆరుగురూ కమలం గూటికి చేరడంతో ఆ రాష్ట్రంలోనూ జేడీయూ ఖాళీ అయిపోయినట్లైంది.

మళ్ళీ మూడు.. అసెంబ్లీలో బిల్లు ?

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఉపసంహరించుకున్న మూడు రాజధానుల బిల్లును మళ్ళీ తెస్తుందా? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తమ మానస పుత్రికకు మళ్ళీ ప్రాణం పోయాలని అనుకుంటున్నారా? అంటే, అధికార వైసీపీ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. గత సంవత్సరం (2021) నవంబర్ లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకుంది. ఇందుకు సమబందించి  దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా రాష్ట్ర  అడ్వకేట్ జనరల్, ఈ మేరకు కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి పాత బిల్లును ఉపసంహరించుకుంటూ తెచ్చిన కొత్త బిల్లును సభ ఆమోదం తెలిపింది. అయితే, అప్పుడే ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, ప్రభుత్వం వికేంద్రీకరణకు కట్టుబడి ఉందని, సాంకేతికంగా బిల్లును వెనక్కి తీసుకున్నా, మూడు రాజధానులకే తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. అంతే కాదు, ఉపసంహరించుకున్న బిల్లు స్థానంలో మరింత పక్కా బిల్లును త్వరలోనే తీసుకొస్తామని ప్రకటించారు. ఇదంతా చరిత్ర, అయితే ఇప్పడు, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, ఈ నెల మూడవ వారంలో మొదలయ్యే, అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో  మూడు రాజధానుల బిల్లును మళ్ళీ ప్రవేశ పెట్టె ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. నిజానికి ఇంతవరకు అధికారికంగా అసెంబ్లీ సమావేశాల  తేదీలు ఖరారు కాలేదు. కానీ విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు, ఈ నెల మూడవ వారంలో వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలను నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది.ఈ నెల 7న జరిగే కేబినెట్ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల తేదీల పై తుది నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు. అలాగే,ఈ సారి అసెంబ్లీ సమావేశాల్లో పలు కీలకమైన బిల్లులతో పాటుగా, మరోసారి మూడు రాజధానుల బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టుగా ప్రచారం అయితే జోరుగా సాగుతోంది.  కాగా, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మూడు రాజధానుల అంశాన్ని మొదటి సారిగా 2019 డిసెంబర్ 17న సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీలో ప్రకటించారు. శాసన రాజధానిగా అమరావతి, కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్నం, న్యాయరాజధానిగా కర్నూలును నిర్ణయించినట్లు ప్రకటించారు. ఆ తర్వాత మండలిలో ప్రవేశపెట్టారు. అక్కడ ఆమోదం పొందకపోవడంతో గవర్నర్ ద్వారా ఆర్డినెన్స్ తీసుకొచ్చి పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏను రద్దు చేస్తూ ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది. దీనిపై రాజధాని రైతులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఆందోళన  చేపట్టారు ఈ రోజుకు కూడా అమరావతి రైతుల ఆందోళన కొనసాగుతూనే వుంది. ఎండా వానలు, ప్రకృతి వైపరీత్యాలతో  పాటుగా కొవిడ్ మహమ్మారిని కూడా తట్టుకుని అమరావతి రైతులు, మహిళలు విభిన్న రూపాల్లో ఆందోళన కొనసాగిస్తున్నారు. న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు పేరున అమరావతి రైతులు చారిత్రక పాదయాత్ర నిర్వహించారు. కాగా, సెప్టెంబర్ 12వ తేదీకి ఉద్యమం ప్రారంభించి వెయ్యి రోజులు పూర్తిఅవుతున నేపధ్యంలో అదే రోజు నుంచి మరోసారి రైతులు, మహిళలు మరో మహా పాదయాత్రకు సిద్దం అవుతున్నారు. ఈ సారి అమరావతి నుంచి శ్రీకాకుళం జిల్లా సూర్యభగవానుడు కొలువైన అరసవల్లి వరకు అసెంబ్లీ నుంచి అరసవెల్లి వరకు పేరున మరో మహా పాదయత్ర చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు.  మరో వంక  తెలుగు దేశం, బీజేపీ సహా ప్రతిపక్ష పార్టీలు అన్నీ మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నాయి. అమరావతి రైతులకు మద్దతుగా ఆందోళనలో పాలుపంచుకున్నారు. అయినా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మొండిగా ముందుకు పోతున్నారు. ఈ నేపధ్యంలో ఈ నెల చివర్లో జరిగే  అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో  ప్రభుత్వం ప్రవేశ పెట్టే బిల్లు విషయంలో ఇటు ప్రజల్లో అతి పొలిటికల్ సర్కిల్స్ లో ఉత్కంఠను రేపుతోంది.

మల్టీప్లెక్స్ లలో రూ.75లకే సినిమా చూడొచ్చు.. ఎప్పుడంటే..?

అభిమాన హీరో సినిమాను వెండి తెరమీద చూడటం అ కిక్కే వేరు. ఇప్పటి వారికి తెలియకపోవచ్చు కానీ మైళ్లకు మైళ్లు నడిచి వెళ్లి టూరింగ్ టాకీసులలో సినిమా చూసి వచ్చి ఆ కథ నెలల తరబడి చెప్పుకునే వారు పూర్వం. ఆ తరువాత థియేటర్లు పెరిగాయి. 35ఎంఎం, 70ఎంఎంలు వచ్చాయి. ఇప్పుడందరికీ సినిమా థియేటర్లు పరిచయమే. తరచూ సినిమాలు చూడటమూ మామూలే. అయితే మల్టీ ప్లెక్స్ లో సినిమా చూస్తే మాత్రం ఆ కిక్కే వేరప్పా అంటారు. కానీ మల్టీ ప్లెక్స్ లలో సినిమా టికెట్ల ధరలకు దడిసి చాలా మంది వాటిలో సినిమా చూస్తూ ఎంజాయ్ చేయాలన్న కోరికను, ఆశనూ చంపేసుకుంటారు. అలాంటి వారి కోసం మల్లీ ప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఒక శుభవార్త చెప్పింది. కేవల 75 రూపాయలకే మల్లీప్లెక్స్ లో సినిమా టికెట్ కొనుక్కొని హాయిగా ఆ ఎక్స్ పీరియెన్స్ ఎంజాయ్ చేయమంటోంది. అయితే ఇది ప్రతి రోజూ సాధ్యం కాదు. కేవలం ఒకే ఒక్క చాన్స్. అదీ ఎందుకంటే ఈ నెల 16న జాతీయ సినిమా దినోత్సవం (నేషనల్ సినిమా డే). ఆ సందర్భాన్ని పురస్కరించుకుని దేశ వ్యాప్తంగా అన్ని మల్లీప్లెక్స్ ధియేటర్లలో ప్రేక్షకులు కేవలం 75 రూపాయలకే సినిమా టికెట్ కొని సినిమా చూడొచ్చు. అంటే సెప్టెంబర్ 16న మల్టీప్లెక్స్‌లలో సినిమా టికెట్ రేటు 75 రూపాయలకు కుదించాలని మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్  ఇండియా నిర్ణయించింది. ఈ క్రమంలోనే దేశంలోని అన్ని నగరాలలో ఉన్న   మల్టీప్లెక్స్ థియేటర్లలో ఈ డిస్కౌంట్ రేటును అమలు అవుతుంది.   థియేటర్ వ్యాపారాన్ని నిలబెట్టిన సినీ ప్రేక్షకుల కోసం మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఈ నిర్ణయం తీసుకుంది.   

ఆసియా కప్‌.. ఆడుతూపాడుతూ  గెలిచిన పాక్‌

ఆసియాక‌ప్ లో శుక్ర‌వారం షార్జాలో  పెద్ద కామెడీ సినిమా చూశారు ప్రేక్ష‌కులు. ఏదో ప్రాక్టీస్ మ్యాచ్ జ‌రిగిన‌ట్టుంది కానీ మంచి ట‌గ్గాఫ‌ర్ మ్యాచ్‌లా అనిపించ‌లేదు. కేవ‌లం నాలుగో తేదీన భార‌త్‌తో త‌ల‌ప‌డేందుకు పాకిస్తాన్ శుక్ర‌వారం హాంకాంగ్ మీద ప్రాక్టీస్ మ్యాచ్ ఆడిన‌ట్టుంది. అస‌లు ఒక అంత‌ర్జాతీయ మ్యాచ్‌లో ఆల‌వోక‌గా గెల‌వడం అంటే అర్ధం చూపించారు పాకిస్తాన్ ప్లేయ‌ర్లు.  స్టేడియంలో, ప్ర‌పంచ‌మంతా టీవీల్లోనూ చూసిన‌వారికి మంచి కామెడీసినిమా చూసిన‌ట్టే ఉంది. హాంకాంగ్ ఆట చూస్తుంటే వీళ్లు అస‌లు టోర్నీకి ఎందుకు వ‌చ్చి స‌మ‌యం వృధా చేయ‌డం అనిపించ‌క‌పోదు. శుక్ర‌వారం సెప్టెంబ‌ర్ 2న జ‌రిగిన గ్రూప్ ఏ చివ‌రిదైన ఆరో మ్యాచ్ ని పాకిస్తాన్ స‌ర‌దాక‌బుర్ల‌కి బాగా జ్ఞాప‌కం ఉంచుకుంటారేమో. ఎందుకంటే, పాకిస్తాన్ హాంకాంగ్‌ను ఏకంగా 155 ప‌రుగుల తేడాతో ఓడించింది. ఆసియాక‌ప్ టోర్నీలో హాంకాంగ్ చేసిన స్కోరే అతి త‌క్కువ స్కోర్ అవుతుందేమో! మొదట బ్యాట్ చేసిన పాకిస్తాన్ 20 ఓవ‌ర్ల‌లో 2 వికెట్ల న‌ష్టానికి 193 ప‌రుగులు చేసింది. హాంకాంగ్ 10.4 ఓవ‌ర్ల‌లో కేవ‌లం 38 ప‌రుగుల‌కు వెనుదిరిగారు. పాక్ బౌల‌ర్ల‌ధాటికి భ‌య‌ప‌డ్డారో, అస‌లు బ్యాటింగ్ తెలియ‌క పెవిలియ‌న్ దారి ప‌ట్టారో అర్ధంగాలేదు. అంతా పాక్ బౌల‌ర్లను చూడ్డానికి వ‌చ్చిన‌ట్టు వ‌చ్చి వ‌ర‌స‌పెట్టి వెళ్లారు. కెప్టెన్ బాబ‌ర్ అజామ్ లోలోప‌ల న‌వ్వుకున్నాడు. ఇది మ్యాచ్‌లా లేదు.. భార‌త్‌తో పోటీకి ప్రాక్టీస్ చేస్తున్న‌ట్టుంద‌ని. నిజ‌మే మ్యాచ్ మొత్తం అలానే జ‌రిగింది. ఈ మ్యాచ్‌లో పాక్ గెలిచి తీరాలి. కానీ మ‌రీ ఇంత సులువు అవుతుంద‌ని బ‌హుశా అనుకోలేదేమో. పాపం హాంకాంగ్ కెప్టెన్ నిజాక‌త్ ఖాన్‌కి ఏడుపే త‌క్కువ‌. ప‌డ‌క ప‌డ‌క వీళ్ల‌తోనే ప‌డాలా అని బాధ‌ప‌డే ఉంటాడు. ప్రేక్ష‌కులు టిఫిన్ చేస్తూ, బ‌టానీలు తింటూ ఏదో స‌ర‌దాగా పిల్ల‌ల ఆట‌ని చూసినంత కాల‌క్షేపం ఆట‌లా చూశారు. ఇళ్ల‌లో టీవీలో చూసిన‌వారిలో దాదాపు అంద‌రూ అన్ని ఇళ్ల‌లో వారూ క్రికెట్ కాకుండా ఇంకేదో చూసిన‌ట్టు ఆనందించి ఉంటారు. పొట్ట‌చెక్క‌లయ్యెట్టు న‌వ్వుకున్నారు.. భార‌త్‌, పాక్ వీరాభిమానులు.  పాకిస్తాన్ మొద‌ట బ్య‌టింగ్‌కు దిగింది. ఆరంభ‌ద‌శ‌లోనే వికెట్ కోల్పోయింది. అబ్బా హాంకాంగ్ ఇర‌గ‌దీస్తార‌నుకున్నారంతా. ఆ త‌ర్వాత మొదల‌యింది దంపుడు కార్య‌క్ర‌మం. మొహ‌మ్మ‌ద్ రిజ్వాన్‌, ఫ‌క‌ర్ జ‌మాన్ ఎంతో బాగా బాదారు. రిజ్వాన్ 42 బంతుల్లో అర్ధ‌సెంచ‌రీ చేసి టీ20 టోర్నీల్లో 5000 ప‌రుగులు పూర్తి చేశాడు. ఇలా చేసిన పాక్ అయిద‌వ బ్యాట‌ర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు. త‌ర్వాత మ‌రింత రెచ్చిపోయి 57 బంతుల్లో 78 ప‌రుగులు చేయ‌డంలో హాంకాంగ్ బౌల‌ర్ల‌కు బంతి ఎలా వెయ్యాలో మ‌ర్చిపోయేలా చేశాడు. మొత్తం ఆరు ఫోర్లు, ఒక భారీ సిక్స్ కొట్టాడు. ఇక అవ‌త‌ల‌వేపున్న ఫ‌కార్ త‌క్కువేమీ కాన‌ట్టు 38 బంతుల్లో అర్ధ‌సెంచ‌రీ చేసి చూపాడు. మొద‌ట పాక్ కెప్టెన్ వికెట్ తీసిన  హాంకాంగ్ బౌల‌ర్ ఇషాన్ రెండో వికెట్‌గా ఫ‌కార్ దొరికాడు. అప్ప‌టికి పాక్ ప‌ది ఓవ‌ర్ల‌లో 64 ప‌రుగులు పూర్తిచేసింది. ఆ త‌ర్వాత అంతా ప‌రుగుల వ‌ర‌దే. బంతి వేయ‌డం ఎలా అని హాంకాంగ్ బౌల‌ర్లు ఆలోచ న‌లో ప‌డ్డారు. వెర్రిమొహాలేసుకుని చూస్తుండిపోయారు. వీర‌బాదుడుకి పాక్ బ్యాట‌ర్లు అర్ధం చూపించారు.  193 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని ఛేదించ‌డానికి హాంకాంగ్ బ‌రిలోకి దిగింది. అంత స్కోర్ అధిగ‌మించ‌డం వారికి క‌ష్ట‌మే. ఆ సంగ‌తి ప్రేక్ష‌కుల‌కూ అర్ధ‌మ‌యింది. వారంత ధాటిగా బ్యాట్‌చేసే స‌త్తా వారికి లేద‌న్న‌ది అర్ధ‌మ‌యింది. కానీ మ‌రీ ఇంత దారుణంగా వెనుది రుగుతార‌ని స్టేడియం గేట్ మ్యాన్ కూడా ఊహించ‌లేదు. కేవ‌లం 18 ప‌రుగుల‌కే 4 వికెట్లు కోల్పోయింది. త‌ర్వాత మ‌రింత వ‌ర‌సె ట్టారు. పాక్ బౌల‌ర్లు షాబాద్ ఖాన్‌, న‌వాజ్‌లు నిజంగానే స‌ర‌దా ప్రాక్టీస్‌లా బౌలింగ్ చేశారు. ప్రాక్టీస్‌లో ఒక వికెట్ పెట్టి ప్రాక్టీస్ చేసి నంత స‌ర‌దాగా బౌలింగ్ చేశారు. ప్ర‌తీ బాల్‌కి వికెట్ తీస్తార‌న్నంత ప‌దునుగా బౌలింగ్ చేయ‌డం గ‌మ‌నార్హం. షాబాద్ ఖాన్ కేవ‌లం 2.4 ఓవ‌ర్ల‌లో మ‌రీ ఎక్కువ‌గా 8 ప‌రుగులు ఇచ్చి 4 వికెట్లు తీయ‌గా, న‌వాజ్ కేవ‌లం 2 ఓవ‌ర్ల‌లో మ‌రీ ఎక్కువ‌గా 5 ప‌రు గులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. 

 కుప్పం సంఘ‌ట‌న అంత పెద్ద‌దేం కాదు.. డిజిపీ రాజేంద్ర‌నాధ్ రెడ్డి

కుప్పం ఘటన శాంతిభద్రతలను ఇబ్బందిపెట్టేంత పెద్దదికాదని డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియా తో మాట్లాడుతూ కుప్పం ఘటనలో పాల్గొన్నవారు స్థానికులేనని తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు )కు ఎన్‌ఎస్‌జీ సెక్యూరిటీ పెంచడం, తగ్గించడం అనేది.. వచ్చే ఇన్‌పుట్స్‌పై ఆధారపడి ఉంటుందన్నారు.  సెక్యూరిటీ పెంచడం, తగ్గించడంలో నిజాలు ఎంతో తెలియదని చెప్పారు. ఎంపీ గోరంట్ల మాధవ్‌  వీడియోపై సీఐడీ విచారిస్తోందని తెలిపారు. సెప్టెంబర్‌ 11న సీపీఎస్‌ ఉద్యోగుల సమ్మెపై ఎలాంటి విజ్ఞప్తి రాలేదని తెలిపారు. అభ్యర్థన వచ్చాకా అనుమతివ్వాలా.. వద్దా అనేది చెబుతామన్నారు. ఉద్యోగులను అరెస్ట్‌ చేయలేదని బైండోవర్ చేశామని రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. కుప్పంలో టీడీపీ నేతలు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని, రెవెన్యూ అధికారుల ఫిర్యాదుతో కుప్పంలో కేసులు నమోదు చేశామని  చిత్తూరు ఎస్పీ తెలిపారు. ఆరోజు మంగళగిరిలో తెదేపా శ్రేణులు డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించారు. ప్రధాన ద్వారాన్ని తోసుకుని లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. నల్లజెండాలు, తెదేపా జెండాలతో గేటు వద్దే అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో బైఠాయిం చి నిరసన వ్యక్తం చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ నుంచి డీజీపీ కార్యాలయానికి అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు.  కుప్పంలో చంద్రబాబుని అడ్డుకునే యత్నం, అన్న క్యాంటీన్​పై దాడిని నిరసిస్తూ అచ్చెన్నాయుడు.. డీజీపీ కార్యాలయానికి కాలినడకన వెళ్లారు. అచ్చెన్నాయుడు వెంట పీతల సుజాత, ఎం.ఎస్. రాజు, తెనాలి శ్రావణ్ కుమార్, నాదెండ్ల బ్రహ్మం, ఇతర తెదేపా నేతలు నిరసనగా బయలుదేరారు. డీజీపీ కార్యాలయం గేటు ఎక్కి దూకేందుకు తెదేపా శ్రేణులు యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు.

ఆమ్నీషియాప‌బ్ కేసు...మైన‌ర్ల‌ను మేజ‌ర్లుగా ప‌రిగ‌ణించండి  పోలీసుల పిటిష‌న్

జూబ్లీహిల్స్ పబ్ రేప్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. గ్యాంగ్‌ రేప్‌కు పాల్పడిన ఐదుగురు మైనర్లను మేజర్లుగా పరి గణించాలంటూ నాంపల్లి కోర్టు లో పోలీసులు పిటిషన్‌ దాఖలు చేశారు. ఐదుగురికి మెచ్యూరిటీ లెవల్స్‌ ఉన్నాయని, మేజర్ కు ఉండాల్సిన లక్షణాలన్నీ ఐదుగురికి ఉన్నాయని పోలీసులు పిటిషన్‌లో పేర్కొన్నారు. పోలీసుల పిటిషన్‌పై త్వరలో కోర్టు విచారణ చేపట్టనుంది. ఈ ఏడాది ఏప్రిల్‌ 28న ఓ పార్టీలో పాల్గొనేందుకు జూబ్లీహిల్స్‌ అమ్నేషియా పబ్‌కు వచ్చిన మైనర్‌ బాలి కపై సాదుద్దీన్‌ అనే యువకుడితోపాటు నలుగురు మైనర్లు సామూహిక అత్యాచారం జరిపిన విషయం తెలిసిందే. మరో మైనర్‌ బాలిక పట్ల అసభ్యం గా ప్రవర్తించాడని పోలీసులు రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు. నిందితుల్లో చాలామందికి రాజకీయ కుటుం బ నేపథ్యం ఉండ టంతో కేసు సంచలనంగా మారింది. నలుగురు మైనర్లు కావడంతో.. పోలీసులు ముందు నుంచి సాదుద్దీన్‌నే ప్రధాన నిందితుడిగా పేర్కొన్నారు. మిగతా మైనర్‌ నిందితుల్లో ఓ ప్రభుత్వ శాఖలో కీలక పదవిలో ఉన్న వ్యక్తి కుమారుడు, సంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి కుమారుడితో పాటు మరో ఇద్దరు వ్యాపారవేత్తల కుమారు లున్నారు. వీవీఐపీల పిల్లలు నిందితులుగా ఉండడం.. ఈ ఘటనపై విపక్షాల నిరసనల నేపథ్యంలో పోలీసులు కేసును సీరియస్‌గా తీసుకు న్నారు. మైనర్లకు కూడా పెద్ద శిక్షలు పడేలా పకడ్బందీగా సాక్ష్యాధారాలు సేకరిస్తున్నారు. రిమాం డ్‌ రిపోర్టులో ఇప్పటికే 12 మంది సాక్షులను విచారించినట్లు పేర్కొన్న పోలీసులు వారి పేర్లను, వివరాలను కోర్టుకు అందజేశారు. వారిలో బాలిక తల్లి దండ్రులు, సోదరుడు, బాలికను పబ్‌కు తీసుకెళ్లిన వ్యక్తి, పబ్‌ నిర్వాహకుల్లో ఇద్దరు, ఓ బౌన్సర్‌, ఓ కాపలాదారు, బేకరీలో పని చేసే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. కేసుకు మరింత బలం చేకూరేలా పబ్‌లో సీసీటీవీ ఫుటేజీలో కనిపించిన వారు.. నిందితులతో సన్నిహితంగా మెలిగినవారిని కూడా సాక్ష్యులుగా చేర్చాలని పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. బాలికపై అత్యాచా రానికి ఉపయోగించిన ఇన్నోవా వాహనంలో లభించిన తల వెంట్రుకలను పోలీసులు సేకరించారు.

ఆసియా క‌ప్‌..గాయంతో జ‌డేజా ఔట్‌,అక్ష‌ర్  ఇన్‌

ఆసియా క‌ప్ 2022లో భార‌త్ జ‌ట్టుకి ఊహించ‌ని స‌మ‌స్యే ఎదుర‌యింది. సీనియ‌ర్ ఆల్‌రౌండ‌ర్ ర‌వీంద్ర‌జ‌డేజా గాయం కార‌ణ‌గా ఏకంగా టోర్నీకి దూర‌మ‌య్యాడు. అత‌ని స్థానంలో మ‌రో ఆల్‌రౌండ‌ర్ అక్ష‌ర్ ప‌టేల్‌ని జ‌ట్టులోకి తీసుకున్న‌ట్టు భార‌త్ సెలెక్ట‌ర్లు అధికారికంగా ప్ర‌క‌టించారు. ఆసియా కప్‌ 2022 కోసం జులైలో ప్రకటించిన జట్టులోకి స్టాండ్ బై ప్లేయర్‌గా అక్షర్ పటేల్ ఎంపిక య్యాడు.  పాకిస్థాన్‌తో గత ఆదివారం జరిగిన మ్యాచ్‌లో రవీంద్ర జడేజా చూడ‌ముచ్చ‌టైన‌ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. ఆ మ్యాచ్‌లో రెండు ఓవర్లు వేసి 11 పరుగులే ఇచ్చిన జడేజా.. బ్యాటింగ్‌లో నెం.4లో క్రీజులోకి వెళ్లి 29 బంతుల్లోరెండు ఫోర్లు, రెండు సిక్స్‌ లతోస‌హా 35 పరుగులు చేశాడు. కెప్టెన్ రోహిత్ శర్మ సూచనల మేరకు ఆ మ్యాచ్‌లో ఆఖరి వరకూ క్రీజులో ఉన్న రవీంద్ర జడేజా..మిడిల్ ఓవర్లలో విరాట్ కోహ్లీతో, స్లాగ్ ఓవర్లలో హార్దిక్ పాండ్యాతో కలిసి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. ఇంకా చెప్పాలంటే.. పక్కా వ్యూహంతో రవీంద్ర జడేజా‌ని ఆఖరి వరకూ క్రీజులో ఉంచి పాకిస్థాన్‌పై భారత్ జట్టు విజయం సాధించింది. హాంకాంగ్‌తో గత బుధవారం జరిగిన మ్యాచ్‌లో రవీంద్ర జడేజాకి బ్యాటింగ్‌ అవకాశం రాలేదు. కానీ.. బౌలింగ్‌లో మాత్రం రవీంద్ర జడేజా 4 ఓవర్లు వేసి కేవలం 15 పరుగులే ఇచ్చాడు. అలానే ఒక వికెట్ కూడా పడగొట్టాడు. భారత్ జట్టు ఆదివారం సూపర్-4 లో తలపడనుంది. ఈ మ్యాచ్‌‌కి భారత్ ప్రత్యర్థిగా పాకిస్థాన్ లేదా హాంకాంగ్ వచ్చే అవకాశం ఉంది. జడేజాకు కుడి మోకాలికి ఇబ్బంది కలగడం ఇదే మొదటిసారి కాదు. అదే జాయింట్‌కి గాయం కారణంగా అతను జూలైలో వెస్టిం డీస్‌లో భారత పర్యటనలో వన్డే లెగ్‌కు దూరమయ్యాడు. తాజా గాయాన్ని ప్రకటించిన బిసిసిఐ పత్రికా ప్రకటన దాని తీవ్రత ను పేర్కొనలేదు లేదా రికవరీ విండోను అంచనా వేయలేదు. ఆస్ట్రేలియాలో పురుషుల టీ20 ప్రపంచ కప్‌కి రెండు నెలల కంటే తక్కువ సమయం ఉన్నందున జడేజా త్వరగా కోలుకోవాలని భార‌త్ భావిస్తోంది. అంతకు ముందు, వారు ఆసియా కప్‌ను పూర్తి చేసి ఆస్ట్రేలియా,  దక్షిణాఫ్రికాతో ద్వైపాక్షిక స్వదేశంలో సిరీస్ లు ఆడతారు. అక్షర్ జడేజాతో సమానమైన ఆటగాడు, ఎడమచేతి వాటం బ్యాటింగ్, ఎకనామిక్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలింగ్, అనేక సంద ర్భాలలో సీనియర్ ఆల్‌రౌండర్ లోటును తీర్చాడు. కానీ జడేజా పాత్ర  ప్రాముఖ్యతను బట్టి, ఆసియా కప్  సూపర్ 4 దశ అంత కు మించి భారత్‌ పురోగతికి అక్షర స్లాట్‌లు ఎంతవరకు కీలకం. ముగ్గురు స్టాండ్-బై ఆటగాళ్లలో  శ్రేయాస్ అయ్యర్దీ, దీపక్ చాహర్ ఇతరులు.  చాహర్ మాత్రమే దుబాయ్‌లో ఉన్నారు, జట్టుతో శిక్షణ పొందుతున్నారు. అక్సర్ జట్టులో చేరడానికి శుక్ర వారం రాత్రి  వెళ్తాడు.

అలీకి మళ్ళీ ..పోసానికి కూడా!

నవ్వండి .. నవ్వండి.. నవ్విన నాప చేనే పండుతుంది... అనే సామెత మీకు తెలియక పోవచ్చును, కానీ, నిజ్జంగానే, కమెడియన్ అలీకి త్వరలో నామినేటెడ్ పోస్టు ఖాయం. ఎస్, వింటున్నది నిజమే, గిల్లుకుని గిచ్చుకుని చూసుకోవలసిన అవసరం లేదు. మీరు అనుకోవచ్చును, అబ్బో మూడేళ్ళుగా ఈ మాట వింటూనే ఉన్నాం గానీ ఇంకో మాటుంటే చెప్పమని మీరు అంటే అనవచ్చును, కానీ, బట్ షూర్.. అలీ ఇంటికి అల్లుడు వచ్చిన వేళా విశేషమో మరేమో కానీ,(ఈ మధ్యనే అలీ తమ కుమార్తె వివాహం చేశారు)ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఆయనకు ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ పదవి కాదంటే అందుకు సమానమైన మరో నామినేటెడ్ పదవి ఇవ్వాలని నిర్ణయానికి వచ్చినట్లు వైసీపీ సర్కిల్స్ లో ఘట్టిగా వినిపిస్తోంది. నిజానికి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి  ఫైల్ మీద పోస్ట్ రాసి, సంతకం పెట్టడం మాత్రమే మిగిలుందని, అంటున్నారు. అయితే ఒక్క ఆలీకేనా ఈ అదృష్టం అంటే, కాదుట, అలీకంటే ఎక్కువగా జగన్ రెడ్డిని భుజాన మోసే, పోసాని కృష్ణ మురళీకి కూడా నామినేటెడ్ పోస్టు ఖాయమని, అది కూడా అతి త్వరలోనే విడుదలవుతుందని అంటున్నారు. ఆలీకి వక్ఫ్ బోర్డు చైర్మన్ పోస్టు ఇస్తే, పోసానికి ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోస్టు ఇవ్వచ్చని అంటున్నారు.  నిజానికీ ,అలీ, పోసానీలతో పాటుగా మోహన్ బాబు ఫ్యామిలీ, పృధ్విరాజ్ గత ఎన్నికల్లో వైసీపీకి మద్దతుగా ప్రచారం చేశారు. అయితే, అధికారంలోకి వచ్చిన తర్వాత, జగన్ రెడ్డి ఒక్క పృద్వీని మాత్రమే ఎస్వీబీసీ టీవీ చానల్ చైర్మన్ పదవికి నామినేట్  చేశారు. అది కూడా మూడు నాళ్ళ ముచ్చటగానే ముగిసి పోయింది. ఆయనపై ఏవో ఆరోపణలు రావడంతో ధర్టీ ఇయర్స్ ఇండస్ట్రీని పక్కన పెట్టేశారు. పృధ్విరాజు పార్టీకి దూరమయ్యారు. అటు మోహన్ బాబు కూడా అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. అలీ, పోసాని మాత్రం ఇంకా పార్టీని వదల కుండా  చకోర పక్షుల్లా జగన్ రెడ్డి దయకోసం, కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. జబర్దస్త్ రోజా మంత్రి పదవికోసం ఎంతగా తాపత్రయ పడ్డారో, అంతకంటే ఎక్కువగా అలీ, పోసాని నామినేటెడ్ పదవుల కోసం తాపత్రయ పడుతున్నారని అంటారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కూడా ఆలీని ఒకటికి రెండు సార్లు ఇంటికి పిలిచి మరీ ఒట్టి చేతులతో పంపించారు. రెండు మూడు సార్లు ఆయనకు పదవులు కేటాయించినట్టు ప్రచారం సాగింది. తొలుత రాజ్యసభ, ఆ తరువాత కేబినెట్ హోదాతో సమానమైన వక్ఫ్ బోర్డు చైర్మన్ పదవికి అలీకి కేటాయించనున్నారన్న ప్రచారం జరిగింది. అలీ దంపతులు కలిసిన సందర్భంలో మీకు గుడ్ న్యూస్ చెబుతానంటూ స్వయంగా జగన్ చెప్పడంతో పాపం అలీ అమాయకంగా ఉబ్బితబ్బిబ్బయ్యారు. అయితే గుడ్ న్యూస్ ఏదీ అలీ చెవిన పడలేదు. ఇప్పుడు మరోసారి ఆయనకు పదవి కేటాయించనున్నారన్న ప్రచారం అయితే సాగుతోంది.  అలాగే పోసాని కృష్ణ మురళీ జగన్ రెడ్డిని వెనకేసుకొచ్చె క్రమంలో జనసేన పవన్ కళ్యాణ్ ఫాన్స్ ఆగ్రహానికి కూడా గురయ్యారు. ఆయనను టార్గెట్ చేస్తూ పవన్ ఫాన్స్ చాలా అసభ్యంగా ట్రోల్ చేశారు. అఫ్కోర్స్, అయన తక్కువతినలేదనుకోండి. అయినా, ఒక విధంగా జగన్ రెడ్డికి మద్దతుగా నిలిచినందుకు పోసాని  సినిమా అవకాశాలు పోగొట్టుకున్నారు. అయినా  నామినేటెడ్ పదవి రాలేదు.  ఇంతలోనే మూడేళ్ల వైసీపీ పాలన ముగిసి పోయింది. మరో సారి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఇప్పటికే పూర్తిగా అడుగంటి పోయాయి. అయినా, ఇప్పటికీ అదిగో ఇదిగో అంటున్నారే తప్ప పదవులు మాత్రం కేటాయించలేదు. అయితే ఇప్పడు ఆలీతో పాటుగా, పోసానికి నామినేటెడ్  పదవులు ఇచ్చేసినట్లే అనుకోమంటున్నారు. అయితే ఇప్పటికే ఒకటికి రెండుసార్లు భంగపడిన అలీ మాత్రం  వస్తే చూద్దాంలే .. అన్నట్లుగానే ఉన్నారని అంటున్నారు. అవును మరి, జగన్ రెడ్డి అయినా మరొకరు అయినా అందరినీ అన్ని వేళలా మోసం చేయలేరు కదా.. దట్సిట్..

ఆర్ఎస్ఎస్ లోనూ మంచివాళ్లు.. మమత మాటల వెనుక మర్మమేంటి?

బీజేపీలో లుకలుకలు పెరుగుతున్నాయా?  మోడీ, షా ద్వయం ఆధిపత్య ధోరణి పట్ల వ్యతిరేకత పెరుగుతోందా? ఆ వ్యతిరేకత ఒక్కసారిగా బట్టబయలు అయ్యేందుకు పిల్లి మెడలో గంట కట్టేందుకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సిద్ధమయ్యారా? నితిన్ గడ్కరీ మోడీకి వ్యతిరేకంగా గళమెత్తితే ఆయనకు మద్దతుగా నిలిచేందుకు బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ సై అంటున్నాయా? వెనకుండి ఇంత కాలం బీజేపీకి మెంటార్ గా వ్యవహరించిన ఆర్ఎస్ఎస్ కూడా నితిన్ గడ్కరీకే మద్దతుగా నిలవడానికి సిద్ధంగా ఉందా? ఒక్క వ్యక్తి తెగించి ఒక అడుగు ముందుకు వేయడానికి సిద్ధపడితే.. ఆయనకు అండగా వెనుక నిలవడానికి ఇంత మందీ సిద్ధంగా ఉన్నారా? అన్న ప్రశ్నలకు రాజకీయ పరిశీలకులు ఔననే సమాధానమిస్తున్నారు. బీజేపీని ఇతర మూస రాజకీయ పార్టీల నుంచి ఇంత కాలం ప్రత్యేకంగా నిలుపుతున్న విధానాలన్నిటికీ మోడీ తిలోదకాలిచ్చేశారనీ, గతంలో కాంగ్రెస్ ను ఏ విధానాలు అవలంబిస్తోందని విమర్శించారో, ఇప్పుడు మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అవే విధానాలను అవలంబిస్తోందన్న అభిప్రాయం ఇప్పుడు కమలం పార్టీలోనే వ్యక్తమౌతున్నది. అధికారం చాలు ఇంకే విలువలూ అక్కర్లేదన్న చందంగా కేంద్రంలోని మోడీ సర్కార్ వ్యవహరిస్తోందన్న భావన పార్టీలో వ్యక్తమౌతున్నది. దానినే గడ్కరీ ఇటీవల ఒక సమావేశంలో ఒకింత ఉద్వేగ పూరితంగా వ్యక్తం చేశారు. అది మొదలు బీజేపీలో గడ్కరీ నేతృత్వంలో తిరుగుబావుటా ఎగురవేయడానికి రంగం సిద్ధమైందన్న చర్చ ప్రారంభమైంది. రోజు రోజుకూ ఆ చర్చ తీవ్ర తరమౌతున్నది. నాగపూర్ (ఆర్ఎస్ఎస్) తో సన్నిహిత సంబంధాలున్న గడ్కరీకే ఆర్ఎస్ఎస్ మద్దతు ఉంటుందన్న వాదన బలంగా తెరపైకి వచ్చింది. పార్టీలో  మోజారిటీ సభ్యులు గడ్కరీకి మద్దతుగా నిలిచేందుకు సిద్ధంగా ఉన్నాయంటూ పలువురు వ్యాఖ్యానాలు చేశారు.  గడ్కరీ రాజకీయమంటే అధికార దాహమేనా అంటూ వ్యాఖ్యనించిన అనంతరం ఆయనకు బీజేపీ పార్లమెంటరీ బోర్డులో స్థానం గల్లంతైంది. దీంతో గడ్కరీ పట్ల సర్వత్రా సానుభూతి వ్యక్తమైంది. రాజకీయాలలో విలువల గురించి మాట్లాడితే.. పక్కన పెట్టేస్తారా అన్న చర్చా మొదలైంది. బీజేపీలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా పార్లమెంటరీ బోర్డులో గడ్కరీ స్థానం కోల్పోవడంపై బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం అవుతోంది.   మోడీ ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం కాగడా పెట్టి వెతికినా కనిపించడం లేదని పార్టీ వర్గాలే అంటున్నాయి. మోడీ, షా ద్వయం పార్టీలో ఎవరినీ సొంతంగా ఆలోచించడానికి కానీ, స్వతంత్రంగా పని చేయడానికి కానీ అవకాశం ఇవ్వడం లేదన్న అసంతృప్తి, అసమ్మతి పార్టీలో గూడు కట్టుకుని ఉన్నాయనీ, అయితే గడ్కరీకి పార్లమెంటరీ బోర్డులో స్థానం కల్పించకపోవడంతో కేబినెట్ లో స్వతంత్రంగా పని చేసే ఏకైక మంత్రిగా, మోడీ విధానాలలోని లోపలను ఎత్తి చూపగలిగే ధైర్యం ఉన్న నాయకుడిగా పేరొందిన ఒకే ఒక్కడినీ కూడా  పొమ్మనకుండా పొగపెట్టేందుకు రంగం సిద్ధమైందని పార్టీ శ్రేణులకు సైతం అవగతమైంది. గడ్కరీ పార్టీలో బలమైన నేతగా, అత్యధికులకు ఇష్టమైన నాయకుడిగా ఎదిగారు. 2019 ఎన్నికలకు ముందు ఎన్డీయే భాగస్వామ్య పార్టీలలో మోడీ నాయకత్వం పట్ల, ఆయన వ్యవహార శైలి పట్ల అసంతృప్తి బాగా వ్యక్తమైన సమయంలో మోడీకి ప్రత్యామ్నాయంగా ప్రధానిగా గడ్కరీ పేరు పరిశీలనలోకి వచ్చినట్లు కూడా చెబుతారు. పైగా నితిన్ గడ్కరీ నాగపూర్ తో సన్నిహిత సంబంధాలు ఉన్న వ్యక్తి. ఆర్ఎస్ఎస్ నుంచి ఎదిగిన నేత. నేటికీ స్వయం సేవక్ సంఘ్ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనే వ్యక్తి. అటువంటి గడ్కరీకి పార్టీలో ప్రాధాన్యత తగ్గించేయడమంటే.. పార్టీకి సిద్ధాంత పునాదిని వేసిన ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని తిరస్కరించడమేగా పార్టీలోని పలువురు భావిస్తున్నారు. పార్టీ, ప్రభుత్వం రెండూ మోడీ, షా ద్వయమే అన్నట్లగా పరిస్థితి మారిపోయింది. గతంలో కాంగ్రెస్ ను వ్యక్తిపూజ అంటే విమర్శలు గుప్పించిన బీజేపీలో ఇప్పుడు అదే పరిస్థితి ఉందని బీజేపీలోని ఒక వర్గం గట్టిగా చెబుతోంది. ఈ పరిస్థితుల్లో గడ్కరీకి పార్లమెంటరీ బోర్డు నుంచి ఉద్వాసన పలకడంతో పార్టీలో అసంతృప్తి జ్వాలలు ఎగసి పడుతున్నాయి. గడ్కరీ తన అసమ్మతిని, అసంతృప్తిని వ్యక్తం చేస్తే ఆయనతో గొంతు కలిపేందుకు పార్టీలో చాలా మంది సిద్ధంగా ఉన్నారని పరిశీలకులు అంటున్నారు. అంతే కాకుండా ఇప్పటికే ఖాళీ అయిపోయిన ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు కూడా గడ్కరీ నాయకత్వం కింద పని చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలిస్తున్నాయని అంటున్నారు. ఎన్డీయే భాగస్వామ్య పక్షాల తీరు పట్ల మోడీ షా ద్వయం వ్యవహార తీరును గతంలో పలుమార్లు గడ్కరీ తప్పుపట్టిన సంగతిని ఈ సందర్భంగా వారు గుర్తు చేస్తున్నారు. ముఖ్యంగా శివసేన విషయంలో మోడీ షా ద్వయం వ్యవహరించిన తీరును గడ్కరీ వ్యతిరేకించారని అంటున్నారు. రాజకీయాలంటే కేవలం అధికారం కోసం వెంపర్లాట మాత్రమే కాదని ఒకింత నిర్వేదంగా వ్యాఖ్యానించిన సంగతి కూడా తెలిసిందే. ఎవరు ఔనన్నా కాదన్నా బీజేపీలో గడ్కరీ  కీలక నేత. నంబర్ గేమ్ లో ఉండరు కానీ, ఆయనను కాదనే వారు కానీ కాదని అనగలిగే వారు కానీ ఎవరూ ఉండరు. ఎందుకంటే ఆయన ఆర్ఎస్ఎస్ కు అత్యంత ఆప్తుడు. నాగపూర్ ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో ఆయనకు బోలెడంత పలుకుబడి కూడా ఉంది. గతంలో ఆర్ఎస్ఎస్ మోడీకి ప్రత్యామ్నాయం ఎవరు అన్న ప్రశ్నకు గడ్కరీ పేరే చెప్పింది. ఈ రోజుకూ మోడీకి రీప్లేస్ మెంట్ ఎవరంటే ఎవరైనా గడ్కరీ పేరే చెబుతారు. అటువంటి గడ్కరీకీ పార్టీలో ప్రాధాన్యత లేకుండా చేయచడానికి మోడీ షా ద్వయం ప్రయత్నించడంపై పార్టీలోనే అసమ్మతి, అసంతృప్తి వ్యక్తమౌతున్నాయి. అంతే కాకుండా దేశ వ్యాప్తంగా ఉన్న బీజేపీయేతర పార్టీలు కూడా గడ్కరీకి సానుభూతి వ్యక్తం చేస్తున్నాయి. మోడీ షాలకు వ్యతిరేకంగా ఆయన నిలబడితే మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు పంపుతున్నాయి. ఆర్ఎస్ఎస్ లో కూడా ఉత్తములు ఉన్నారనీ, అందరినీ రాక్షసులంటూ ఒకే గాటల కట్టేయడం సరి కాదనీ  మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలే ఇందుకు సంకేతం. ఆమె పరోక్షంగా గడ్కరీకి మద్దతుగా మోడీషాకు వ్యతిరేకంగా బీజేపీలో తిరుగుబాటు అంటూ జరిగితే తాను గడ్కరీకి మద్దతుగా నిలుస్తానని చెప్పకనే చెప్పారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. మమత వంటి కరుడుగట్టిన మోడీ వ్యతిరేకులకు గడ్కరీ నమ్మదగిన నేతగా కనిపిస్తున్నారు. నేడు  మోడీ నాయకత్వంలో బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారం చేపట్టగలిగిందంటే అందుకు వాజ్ పేయి, అద్వానీ, దీనదయాళ్ ఉపాధ్యాయ వంటి మహనీయులు వేసిన పునాదులే కారణమని గడ్కరీ నిర్ద్వంద్వంగా చెప్పారు. అంతే కాదు ఆ సందర్బంగా గతంలో వాజ్ పేయి చేసిన చీకటి ఏదో ఒక రోజున తొలగిపోతుంది, సూర్యుడు బయటకు వస్తాడు, కమలం వికసిస్తుందన్న ప్రసంగాన్ని ఉటంకించారు. గడ్కరీ వ్యాఖ్యల వెనుక ప్రస్తుత పరిస్థితులు మారుతాయనీ త్వరలోనే మార్పు తప్పదనీ, ఆ మార్పు తన నాయకత్వంలోనే మొదలౌతుందన్న సంకేతం కూడా గడ్కరీ మాటల వెనుక ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు  రాత్రికి రాత్రి మహారాష్ట్రలో ప్రభుత్వం మారిపోవడం, నిన్నటి దాకా బీజేపీపై విమర్శలతో నిప్పులు చెరిగిన శివసేనలోని ఒక వర్గం బీజేపీతో జట్టు కట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడాన్ని గడ్కరీ తీవ్రంగా వ్యతిరేకించారు.  అలాగే బీజేపీయేతర ప్రభుత్వాలు అధికారంలో  రాష్ట్రాలలో ఆ ప్రభుత్వాలను కూలదోసైనా సరే అధికారం చేజిక్కించుకోవడానికి మోడీ, షా ద్వయం వేస్తున్నఎత్తులను,    పన్నుతున్నవ్యూహాలను గడ్కరీ వ్యతిరేకిస్తున్నారనీ, మోడీ, షా ద్వయం తీరు పట్ల అసంతృప్తితో ఉన్నారని గడ్కరీ  సన్నిహితులు అంటున్నారు. గడ్కరీ రాజకీయ వైరాగ్యం ప్రకటిస్తూ చేసిన వ్యాఖ్యల టార్గెట్ నిస్సందేహంగా మోడీ, షాలేనని అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గతంలో కూడా ఒక సారి గడ్కరీ.. నాయకుడనే వాడు విజయాలకే కాదు పరాజయాలకు కూడా బాధ్యత వహించాలని మోడీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా వారు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు గడ్కరీ ఒక అడుగు ముందుకు వేస్తే ఆయన వెంట నడవడానికి బీజేపీలోని ఒక బలమైన వర్గమే కాదు. గడ్కరీ మద్దతుగా నిలవడానికి పలు  బీజేపీ యేతర పార్టీలూ సిద్ధంగా ఉన్నాయి. ఇందుకు మమతా బెనర్జీ వ్యాఖ్యలే ప్రబల నిదర్శనంగా చెప్పొచ్చు. ఎన్డీయే భాగస్వామ్య పక్షాలన్నీ గడ్కరీ నాయకత్వాన్ని గట్టిగా కోరుకుంటున్నాయి. అలాగే ఇప్పటికే ఎన్డీయేను వీడి వెళ్లిన పార్టీలు కూడా గడ్కరీ నాయకత్వంలో పని చేయడానికి సుముఖంగా ఉన్నాయని అంటున్నారు. అలాగే  మోడీని గట్టిగా వ్యతిరేకించే పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా గడ్కరీకి మద్దతుగా నిలిచేందుకు సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు పంపారు. బీహార్ సీఎం నితీష్ కుమార్,  పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్.. ఇంకా చెప్పాలంటే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. ఇలా చాలా మంది ముఖ్యమంత్రులు గడ్కరీ నాయకత్వంలో బీజేపీలో కనుక చీలిక వస్తే   గడ్కరీకి మద్దతుగా నిలిచేందుకు సదా సిద్ధమన్న సంకేతాలు పంపుతున్నారు. ఈ నేపథ్యంలోనే త్వరలోనే గడ్కరీ తన అసమ్మతి గళాన్ని మరింత గట్టిగా వినిపించే అవకాశాలున్నాయని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. తాజాగా మమతా బెనర్జీ ఆర్ఎస్ఎస్ లోనూ మించి వారున్నారంటూ చేసిన వ్యాఖ్యలు కచ్చితంగా గడ్కరీని ఉద్దేశించి చేసినవేనని పరిశీలకులు అంటున్నారు. ఇక గడ్కరీ అడుగు ముందుకు వేయడమే తరువాయి.. జాతీయ స్థాయిలో ఒక సరి కొత్త రాజకీయ సమీకరణకు తేరలేస్తుందని వారు గట్టిగా చెబుతున్నారు.

లావుగా ఉన్నాడ‌ని వ‌దిలేసింది.. త‌గ్గాక బాధ‌ప‌డింది!

తెర‌మీద కండ‌ల‌వీరుడు స‌ల్మాన్ క‌న‌ప‌డ‌గానే ఈల‌ల‌గోల‌, చెర్రీ క‌ర‌ప‌డ‌గానే తెర‌మీద‌కి కాయితాలు, పూల జ‌ల్లు. హీరో సిక్స్‌పాక్‌లో ఉండాలి, విల‌న్ ఎలా ఉన్నా ప‌ర్వాలేదు, క‌మెడియ‌న్ బొజ్జ‌తోనే ఉండాలి.. ఇలాంటి కొన్ని సూత్రాలు స్టాండ‌ర్డ్‌గా పాటిస్తున్నాయి సినిమాలు. అవే కావాల‌నుకుంటున్నారు అమ్మా యిలు. క‌ల‌లో రాకుమారుడు, ప‌క్కింటి కుర్రాడు ఎవ‌ర‌యినా స‌రే చ‌చ్చిన‌ట్టు సిక్స్‌పాక్ తోనే ఉండాలి. లేకపోతే నిద్రాప‌ట్ట‌దు, ప‌క్కింటి వేపు చూడ‌రు. మ‌రంచేత కుర్రాళ్ల‌కు ఇదో శిక్ష‌. లేక‌పోతే ఇదుగో పువీ లానే ల‌వ‌ర్ దూర‌మ‌వుతుంది. త‌ర్వాత ఏ ప్యాక్ తెచ్చుకునీ ప్ర‌యోజ‌నం ఉండ‌దు! అయినా ఇపుడు యూత్ అంటే స్పోర్ట్స్ బైక్‌, సిక్స్‌ప్యాక్ తోనే క‌న‌ప‌డాలి. అలానే కాలేజీలు, ఆఫీసుల్లో రాజ్యం ఏలుతున్నారు. లేక‌పోతే అమ్మాయిలు ప‌ట్టించుకోర‌న్న గ‌ట్టి న‌మ్మం వారికీ ఉంది. ఏ వ‌య‌సులో ప‌ని ఆ వ‌య‌సులో కానిచ్చేయాల‌న్నారు ప్రేమికుల‌ను ఉత్సాహ‌ప‌రిచే సిద్ధాంతులు. అందుకే వీధికో చెర్రీ, స‌ల్మాన్‌లు ఎదుర‌వుతుంటారు. లేక‌పోతే ప‌ట్ట‌ణానికే అవ‌మానం అనే జ‌నం కూడా ఉన్నారు! పువీ టిక్‌టాక్ హీరో. అత‌ను మంచి న‌టుని గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అమాంతం ఓ అమ్మాయి ప్రేమించేసింది. తీరా ప‌రిచ‌యంచేసుకుని అలా బైక్ మీద తిర‌గాల‌నుకుంది మిల్కీబ్యూటీలా! కానీ ఆమె ఆశ‌లు నిరాశ‌య్యాయి, క‌న్న క‌ల‌లు క‌రిగిపోయాయి. మ‌నోడు న‌టుడే కాని స‌ల్మాన్‌, చెర్రీ కాక‌పోయే. అవును పువీ మంచి న‌టుడే త‌ప్ప బాడీ పెద్ద‌గా మెయిన్‌టేన్ చేయ‌లేదు. అందువ‌ల్ల ఇద్ద‌రు పిల్ల‌ల తండ్రిలా త‌యార‌య్యాడు, బొజ్జ‌తో. అత‌న్ని చూసి అయ్యో వీడు నా పువీ కాదు అనుకుంది ఆ పిల్ల‌. త‌ర్వాత నేనే ఫోన్‌లో ఇన్ని రోజులు మాట్లాడింది, ప్రేమ వ్య‌వ‌హారం ప్రోపోజ్ చేసిందీను.. అని అనే శాడు. ఆమె ఖంగారు ప‌డింది. ఈ దిబ్బ‌వాడినా నేను కోరుకుంది. ఛా.. చెర్రీ అనుకున్నా. సారీ అనేసింది పువీకి ఆ పిల్ల‌.  అంతే మ‌నోడు చెలిమి లేదు.. చెలియ‌లేదు.. అంటూ పాడుకోబోయాడు. కానీ ప‌క్కింటి బాబాయిగారు, వీధిలో బాడీబిల్డింగ్ ట్ర‌యిన‌ర్ పిలిచి అబ్బాయి బాడీ త‌గ్గించుకోను చిట్కాలున్నాయి. పాటించ‌మ‌న్నారు. అంతే మ‌నోడు విప‌రీతంగా క‌ష్ట‌ప‌డ్డాడు. టిక్ టాక్ షోలు చేస్తూనే మ‌రో వంక ఆ పిల్ల మీద ప‌గ తీర్చుకోవాల నుకున్నాడు. ఆరు నెల‌ల త‌ర్వాత అనూహ్యంగా శ‌రీరంలో ఎంతో మార్పు వ‌చ్చిం ది. నిజంగానే మ‌నోడు  స‌ల్మాన్ అయిపోయాడు. త‌న‌ను అద్దంలో చూసుకుని తానే న‌మ్మ‌లేక‌ పోయాడు. ఎదురింటి పిల్ల దొంగ త‌నంగా చూస్తున్న‌పుడు అవును నిజ‌మే అనుకున్నాడు. ఇపుడు పువీ కి ఎంతో గ‌ర్వంగా ఉంది. త‌న‌కు సిక్స్‌పాక్ వ‌చ్చింది. త‌న‌ను తాను చెర్రీ, స‌ల్మాన్ అనుకున్నాడు.  పువీ ఎంతో మారిపోయాడు.. ఇపుడు చూస్తే అమాంతం ప్రేమ‌లో ప‌డాల్సిందే అన్న సందేశం పువీని ముందు ఇష్ట‌ప‌డిన అమ్మాయికి ఎవ‌రో చేర‌వేశారు. అవునా అనుకుంది. మ‌ళ్లీ సందేహించింది. ఒక‌రోజు అత‌నికి తెలియ‌కుండా అత‌న్ని ఫాలో అయింది. పువీ బాడీ బిల్డింగ్ సెంట‌ర్‌లో ఎక్స‌ర్‌సైజ్‌లు చేస్తుంటే తెర‌వెన‌క‌నుంచీ చూసింది. అవును నా వాడే  అనుకుంది. అయ్యో వీడిని ఎందుకు వ‌దులుకున్నాను.. ఎందుకు అవ‌మానించాను.. అని తెగ బాధ‌ప‌డింది. కానీ పువీ మాత్రం బాధ‌ప‌డ‌లేదు. ఇపుడు అత‌ను 63 కిలోల బ‌రువుతో ఉన్నాడు. చ‌క్క‌ని బాడీ.. అమ్మాయిలు ఎవ‌ర‌యినా ప‌డ‌తారు .. అదే ధైర్యంతో అద్దంలో చూసుకుని న‌వ్వుకున్నాడు.. త‌న‌ను కాద‌న్న అమ్మాయి మాత్రం ఏడుస్తూ ఇంటిదారి ప‌ట్టింది!

వంటింటి ఫ్లోరింగ్ త‌వ్వితే బంగారునాణాలు దొరికాయ్‌!

పిల్ల‌లు ఆడుకునేప్పుడు ఏ మూలో చెంచానో, గ్లాసో దొరికితే అయ్యో దీనికోసం రెండు రోజులుగా వెతుకుతున్నార్రా.. అంటూ అమ్మో, అమ్మ‌మ్మో తెగ ఆశ‌ర్య‌పోతూ అందుకుంటారు. ఇల్లు క‌ట్టే య‌త్నం లో తీసే గుంట‌ల్లో లంకె బిందెలు దొరికిన సంఘ‌ట‌న‌లూ చాలా గ్రామాల్లో జ‌రిగాయి. అలాంటిది రూ.2.3 కోట్ల విలువ‌యిన బంగారు నాణాలే దొరికితే !  ఇంగ్లండ్ నార్త్‌యార్క్‌షైర్‌లో దంప‌తులు త‌మ ఇంట్లో  వంటింటి ఫ్లోరింగ్ బాగుచేయించుకోవాల‌ని ప‌ను లు మొద లెట్టారు. కొంచెం త‌వ్వ‌గానే ఘ‌ల్లుమ‌ని శ‌బ్దం విన‌ప‌డింది. ఏందిరా అయ్యా అని పెద్దాళ్లిద్ద‌రూ చూస్తే చిన్న కుండ‌లాంటిదాంట్లో ఏకంగా 264 బంగారు నాణాలు ద‌ర్శ‌న‌మిచ్చాయి. అంతే వారి ఆనం దానికి అంతే లేదు. ఇది ఊహించ‌ని దైవ‌కృప అనుకున్నారు. అయితే అవి సుమారు 400 సంవ‌త్స‌రాల నాటివి అని అధికారులు, వేలంలో వాటిని కొన్న‌వారు తేల్చారు. ఈ నాణాల మ‌ట్టికుండ‌ను చూడ‌గానే దంప‌తులు వాటిని తీసి దాచ‌లేదు. వెంట‌నే లండ‌న్ ప్ర‌ముఖ వేలం సంస్థ స్పింక్ అండ్ స‌న్ అధికారు ల‌కు ఈ సంగ‌తి తెలియ‌జేశారు. ఆ దంప‌తులు ప‌దేళ్ల‌కు పైగా ఆ భ‌వ‌నంలో ఉంటున్నారు. ప‌దేళ్ల క్రితం ఆ  భ‌వ‌నాన్ని కొన్నార‌ట‌.  కానీ వంటింటి ఫ్లోరింగ్ పాడ‌యి నానా ఇబ్బందులూ ప‌డుతుండేవారు. కొంతసొమ్ము పోగుచేసి బాగు చేయిం చాల‌నుకున్నారు. ఊహించ‌నివిధంగా త‌వ్వ‌కంలో ఈ నాణాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. అస‌లు చిన్న మ‌ట్టి కుండలో అన్ని నాణాలు ఎలా పెట్టార‌న్న‌ది అధికారులు చూసి ఆశ్చ‌ర్య‌ప‌డ్డారు. ఈ నాణాలు 1610, 1727 మ‌ధ్య కాలం నాటివ‌ని ప‌రిశీల‌కులు తేల్చారు. అవి జేమ్స్ 1, ఛార్లెస్ 1, జార్జ్ 1 కాలానికి చెందిన‌విగా పేర్కొన్నారు.

బీజేపీ తెరాస జుగల్ బందీ

తెలంగణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు ఇతర రాష్ట్రాలకు వెళ్లి, కేంద్ర ప్రభుత్వం పై నిప్పులు చెరుగుతున్నారు.మోడీ ప్రభుత్వం మహా డేంజర్ అని దేశాన్ని హెచ్చరిస్తున్నారు. అర్జెంటుగా, బీజీపీ సర్కార్ను సాగనంప వలసిన అవసరాన్ని నొక్కి వక్కాణిస్తున్నారు. గుజరాత్ మోడల్ కు పోటీగా తెలంగాణ మోడల్ అభివృద్ధిని తెరమీదకు తెచ్చారు. బీజేపీ ముక్త భారత్ నినాదంతో కమల దళం పై కలిసి పోరాడేందుకు,రండని ప్రజలకు,పార్టీలకు పిలుపు ఇచ్చారు. సరే, కేసేఆర్ రమ్మంటే వచ్చేవాళ్ళు ఎవరు,?బీజేపీని గద్దె దించేది ఎవరు? అసలు మోడీకి ప్రత్యాన్మాయం ఎవరు? అనే పలు ప్రశ్నలకు ఇంకా సమాధానాలు రావాల్సి ఉందనుకోండి.. అన్నిటినీ మించి, ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేయడమే కాకుండా, ప్రభుత్వ ఉద్యోగులకు ఏ నెలకు ఆ నెల జీతాలు ఇవ్వలేని, తెలంగాణ మోడల్ బుజానికి ఎత్తుకునేది ఎవరు? వంటి ప్రశ్నలు ఇంకా చాలాచాలానే ఉన్నాయనుకోండి, అది వేరే విషయం. అదలా ఉంటే, కేసీఆర్ అలా రాష్ట్రాలను చుట్టి వస్తుంటే, కేంద్ర మంత్రులు, బీజేపీ జాతీయ నాయకులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎంపీలు ఏదో ఒక పేరున తెలంగాణలో పర్యటిస్తున్నారు.కేసేఆర్ ప్రభుత్వం టార్గెట్ గా విమర్శలు ఎక్కుపెడుతున్నారు. నిజానికి, ఇటీవల కాలంలోరాష్ట్రంలో బీజేపే జాతీయ నాయకుల పర్యటన లేని రోజంటూ లేదంటే ఆశ్చర్య పోనవసరం లేదు. అంతలా బీజేపీ జాతీయ నాయకత్వం రాష్ట్రం పై దృష్టిని కేంద్రీకరించింది.  అందుకే కావచ్చును, ఇటీవల ముఖ్యమంత్రి కేసేఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుట్ల కవిత, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తమ పాత్ర లేదని వివరణ ఇచ్చే సందర్భంలో, బీజేపీ నాయకులు మిడతల దండుల రాష్ట్రంపై దాడి చేస్తున్నారని, తమపై  నిరాధారమైనఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తపరిచారు. కవిత చేసింది ఆరోపణే అయినా, నిజంగా కూడా బీజేపీ 2024 లోక్ సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, కేంద్రంలో వరసగా మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు ఇప్పటినుంచే పార్లమెంట్‌ ప్రవాస్‌ యోజన పేరిట  ప్రచారయాత్రను పెద్ద ఎత్తున  చేపట్టింది. అయితే, అది ఏదో ఒక్క తెలంగాణకు మాత్రమే పరిమితం కాదు. గత లోక్ సభ ఎన్నికల ఫలితాల ఆధారంగా  దేశం మొత్తంలో ఎంపిక చేసిన 144 పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం జరుగుతోంది. రెండు పార్లమెంట్‌ నియోజకవర్గాలు కలిపి ఒక క్లస్టర్‌ ఏర్పాటు చేశారు. 40 మంది కేంద్ర నేతలకు ఈ క్లస్టర్‌ బాధ్యతలు అప్పగించారు. ఈ నియోజకవర్గాల్లో కేంద్రమంత్రులు, ఎంపీలు పర్యటిస్తున్నారు. మూడు రోజులపాటు నియోజకవర్గాల్లోనే బస చేస్తారు. అలా గుర్తించిన నియోజక వర్గాలలో తెలంగాణలోని 17 నియోజక వర్గాలు ఉన్నాయి. అందుకే, గత నెలలో ఈ కార్యక్రమం మొదలైనప్పటి నుంఛి, కేంద్ర మంత్రులు ఒకరి వెంట ఒకరు తమకు కేటాయించిన లోక్ సభ నియోజక వర్గాల్లో పర్యటిస్తున్నారు.  ఇందులో భాగంగానే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ కామారెడ్డి జిల్లా జహీరాబాద్‌ లోక్ సభ నియోజక వర్గంలో పర్యటిస్తున్నారు.అసందర్భంగా ఆమె, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వంపై ఘాటైన విమర్శలే చేశారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్‌కు మించి అప్పులు చేస్తోందని ఆమె  ఆరోపించారు. ఈ రుణ భారం మొత్తాన్నీ తిరిగి ప్రజలపైనే మోపనుందన్నారు. మిగులు బడ్జెట్‌తో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని.. ఎనిమిదేళ్లలో సీఎం కేసీఆర్‌ అప్పుల కుప్పగా మార్చారని విమర్శించారు. రాష్ట్రంలో పుట్టబోయే ప్రతి బిడ్డపై రూ.1.25 లక్షల అప్పు ఉంటుందని.. దీన్నిబట్టి కేసీఆర్‌ ఏ స్థాయిలో అప్పులు చేశారో అర్థం చేసుకోవచ్చని అన్నారు. తెలంగాణను కేసీఆర్‌ నుంచి కాపాడుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజలపైనే ఉందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి ఎంతమేర వెళ్తున్నాయన్న విషయాన్ని తెలుసుకునేందుకే బీజేపీ అధిష్ఠానం పార్లమెంట్‌ ప్రవాస్‌ యోజన కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. కేంద్ర పథకాల పేర్లను తెలంగాణ ప్రభుత్వం మార్చేసి, తన సొంత ప్రయోజనాలకు ఉపయోగించుకుంటోందని ఆరోపించారు. పేర్లు మారిస్తే తెలంగాణ ప్రభుత్వాన్ని తప్పకుండా ప్రశ్నిస్తామని నిర్మల స్పష్టం చేశారు. రాష్ట్ర రైతులకు అన్నీ ఇస్తున్నామని కేసీఆర్‌ సర్కారు పదేపదే చెబుతోందని.. కానీ, రాష్ట్రంలో 100మంది రైతుల్లో 91.7శాతం మంది అప్పులపాలయ్యారన్నారు. ఎన్‌సీఆర్‌బీ లెక్కల ప్రకారం రైతుల ఆత్మహత్యల్లో రాష్ట్రం దేశంలోనే నాలుగో స్థానంలో ఉందని తెలిపారు.పేరు మార్చి.. డబుల్‌ బెడ్‌రూం అన్నారు..కేంద్ర ప్రభుత్వ పథకమైన పీఎం ఆవాస్‌ యోజన కింద తెలంగాణలో ఇళ్లు కట్టించాల్సి ఉండగా.. కేసీఆర్‌ ప్రభుత్వం కేంద్ర పథకం పేరును మార్చి డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు అని ప్రచారం చేసుకుంటోందని నిర్మల మండిపడ్డారు. అలాగే పీఎం మత్స్య సంపద యోజన, నేషనల్‌ కో ఆపరేటివ్‌ డెవల్‌పమెంట్‌, ఫసల్‌ బీమా యోజన, ఆయుష్మాన్‌ భారత్‌ వంటి పథకాల పేర్లను మార్చేసి.. అమలు చేస్తున్నారని విమర్శించారు. ఉపాధి పథకంపై తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రతినిధులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఈ పథకం కింద కేంద్రం గడిచిన 8 ఏళ్లలో తెలంగాణకు రూ.20వేల కోట్లు ఇచ్చిందన్నారు. తెలంగాణలో ఉపాధి హామీ పథకం అమలు, నిధుల వ్యయంలో అవకతవకలు జరగడంతోనే కేంద్ర ప్రభుత్వం సర్వే చేయిస్తోందని చెప్పారు. తెలంగాణ ప్రజల సంక్షేమాన్ని మరిచి దేశమంతా తిరుగుతూ తానే ప్రధానమంత్రినని కేసీఆర్‌ చెప్పుకుంటున్నారని నిర్మల ఎద్దేవా చేశారు. బిహార్‌ వెళ్లిన కేసీఆర్‌ నవ్వులపాలయ్యారన్నారు. కాళేశ్వరం నీటి ప్రాజెక్టును డబ్బుల కోసం కట్టారా..? నీటి కోసం కట్టారా..? అని కేసీఆర్‌ను నిర్మల ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం మొదట రూ.39,500 కోట్లు ఖర్చు అవుతాయని నిర్ణయించారని, ఇప్పుడు దాని విలువను రూ.1.20 లక్షల కోట్లకు పెంచారని విమర్శించారు. ప్రాజెక్టు నిర్వాసితులకు కేసీఆర్‌ ప్రభుత్వం ఇప్పటివరకు పరిహారం ఇవ్వలేదని ఆరోపించారు. అయితే, కేంద్ర మంత్రి నిర్మల సీతరామన్ చేసిన ఆరోపణలు లేదా ఇచ్చిన వివరణలో ఎక్కడా కొత్తదనం లేదు. నిజానికి, గత కొంత కాలంగా బీజేపీ, తెరాసల మధ్య ఇదే జుగుల్ బందీ నడుస్తోందని, రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇలాంటి జుగుల్ బందీ వలన ప్రయోజనం ఉండదని, చర్యలు లేకుడా చేసే విమర్శలు, ప్రతి విమర్సలకు విలువ ఉండదని అంటున్నారు. 

కొత్త‌బ‌స్సుల కొనుగోలు అసాధ్యం..ఏపీ ఆర్టీసీ ఎండీ

ఆర్టీసీ ఆదాయం ఆశాజ‌న‌కంగా లేద‌ని, 50 శాతం డీజిల్‌కు ఖ‌ర్చుకాగా, మ‌రో 40 శాతం నిర్వ‌హ‌ణ‌కు సిబ్బంది జీతాల‌కు రూ.300 కోట్లు అవుతోంద‌ని  క‌నుక ఇప్ప‌ట్లో కొత్త బ‌స్సులు కొనుగోలు అసాధ్య‌మ‌ని ఏపీ ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభు త్వంలో ఆర్టీసీ విలీనమైన తర్వాత జీతభత్యాల వెసులుబాటు ఉన్నా ఆదాయం ఆశాజనకంగా లేద న్నారు. గత నెలలో ఆర్టీసీకి వచ్చిన ఆదాయంలో ప్రభుత్వానికి 25 శాతం మేర రూ.124 కోట్లు చెల్లిం చామని తెలిపారు. జూన్‌లో పిలిచిన టెండ‌ర్ల ద్వారా 339 అద్దెబ‌స్సులు, ఆగ‌ష్టులో పిలిచిన టెండ‌ర్ల ద్వారా మ‌రో 156 అద్దె బ‌స్సులు ఖ‌రార‌య్యాయ‌ని తిరుమ‌ల‌రావు అన్నారు. నాన్‌ ఏసీ స్లీపర్‌ బస్సులకు డిమాండ్‌ఉందని గుర్తించాం. 62 అద్దెబస్సులకు టెండర్లు పిలవగా.. ఇప్పటి వరకు 30 బస్సులు వచ్చాయి. ఈ బస్సు లకు స్టార్‌ రైడర్‌ అనే పేరును ఖరారు చేశామ‌న్నారు.  బీఓటీ విధానంలో ఆదాయాన్ని పెంపొందించుకునేందుకు వీలుగా నిబంధనలను సవరించాం. గతం లో మాదిరిగా 33 ఏళ్లకు కాకుండా 15 ఏళ్ల పాటు ఆర్టీసీ ఖాళీ స్థలాలను లీజుకు ఇచ్చేందుకు కొత్త పాలసీ తీసుకువచ్చామ‌న్నారు.  అలాగే, తెలంగాణకు బస్సులు పెంచేందుకు కృషిచేస్తామ‌ని,  18 రూట్లలో కొత్త బస్సులు పెంచామ‌న్నారు. ఇతర రాష్ట్రాలకు బస్సులు పెంచే ప్రతిపాదనలున్నాయి. ప్రయాణికుల భద్రత కోసం బస్సుల్లో న్యూమాటిక్‌ డోర్లు ఏర్పాటు చేయనున్నాం. ఈ నెల కొత్త పీఆర్‌సీ జీతాలలో కలపలేదని,  సాంకేతిక కారణాలతో ఈ సమస్య ఏర్పడింద‌ని, ప్రాంతీయ స్థాయిలో జీతాలు చెల్లించేందుకు వీలుగా అప్‌డేషన్‌ చేయాల్సి ఉండ టం వల్ల ఈ నెలలో కొత్త పీఆర్‌సీ కలపటం కుదరలేదని ఎండీ తిరుమ‌ల‌రావు  తెలిపారు. 

నటుడు అలీకి నామినేటెడ్ పోస్టు ఫిక్సేనా? ఎంద చాట!

గత ఎన్నికలలో తనకు అండగా నిలిచిన నటులకు జగన్ ఏదో ఒక ప్రయోజనం చేకూరుస్తానని అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్లుగా ఊరిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా ప్రముఖ కమేడియన్ అలీ విషయంలో అయితే ఆయనను ఏకంగా రాజ్యసభకు పంపిస్తానని నమ్మించారు. సినీ పరిశ్రమతో టికెట్ల వివాదం సందర్భంగా జగన్ అలీని ప్రత్యేకంగా పిలిపించుకుని మరీ చర్చించారు.  ఆ సందర్భంగా కూడా త్వరలో పిలుపు వస్తుంది, గుడ్ న్యూస్ వింటారు అని మళ్లీ ఊరించారు. ఆ తరువాత షరా మామూలే! పిలుపూ లేదు, మంచి కబురూ లేదు. అయితే గత ఎన్నికలలో వైసీపీ తరఫున పని చేసిన నటులలో కమేడియన్ పృధ్వీరాజ్ కు మాత్రమే పదవి దక్కింది. అయితే అది మూడు నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. ఏదో వివాదంలో ఇరుక్కున్న పృధ్విని పదవి నుంచి తొలగించి, ఆ తరువాత పట్టించుకోవడమే మానేశారు జగన్. ఇక జగన్ కు అనుకూలంగా గత ఎన్నికలలో పని చేసిన నటులు   మోహన్ బాబు, అలీ, పోసాని కృష్ణమురళీలకు సదవుల సంగతి దేవుడెరుగు ఇంత వరకూ పార్టీలో సరైన గుర్తింపే  దక్కలేదు,  దీంతో మోహన్ బాబు బహిరంగంగా ప్రకటించకపోయినా వైసీపీకి దూరమైనట్లు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. తన విద్యాసంస్థల ఆధ్వర్యంలో నిర్మించిన ఆలయ ప్రారంభోత్సవానికి విపక్ష నేత చంద్రబాబును ఆహ్వానించారు. ఇందు కోసం తన కుమార్తె మంచు లక్ష్మితో కలిసి చంద్రబాబు నివాసానికి వెళ్లారు. తాను  తెలుగుదేశం పార్టీకి చేరువ అవుతున్నట్లు సంకేతాలు ఇచ్చారు. ఇక అలీ, పోసానిల విషయానికి వస్తే వారు జగన్ కరుణా కటాక్షా వీక్షణాల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు.  జగన్ మాత్రం అదిగో ఇదిగో అంటూ మూడేళ్లు గడిపేశారు. దీంతో జగన్ పార్టీకి మద్దతుగా నిలవడం వల్ల ప్రయోజనం లేదని సినీ పరిశ్రమ మొత్తం భావిస్తున్నది.  ముఖ్యంగా అలీ, పోసాని కృష్ణ మురళీ ఇటీవలి కాలంలో వైసీపీతో అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. అలీ అయితే ఒకటి రెండు సందర్భాలలో తనకు పదవి విషయంలో నిర్ణయం తీసుకోవలసింది జగనే అని నిష్ఠూరంగా చెప్పారు కూడా. ముఖ్యంగా ఈ మూడేళ్ల కాలంలో అలీకి పదవి విషయంలో భారీ ప్రచారం జరిగింది. వక్ఫ్ బోర్డు చైర్మన్ అని ఒక సారీ, రాజ్యసభ సభ్యత్వం అని మరోసారీ బాగా ప్రచారం జరిగింది. అలీకి స్వయంగా జగన్ నుంచి పిలుపు కూడా వచ్చింది. అయితే పదవి మాత్రం రాలేదు. ఇక ఇప్పుడు రాష్ట్రంలో ఎలక్షన్ ఫీవర్ మొదలైపోయిన తరువాత, జగన్ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతక గూడుకట్టుకుందన్న ప్రచారాల నేపథ్యంలో మళ్లీ సినీ గ్లామర్ అవసరమని జగన్ భావిస్తున్న తరుణంగా మళ్లీ అలీకి పదవి ఇవ్వనున్నారంటూ ప్రచారం జోరందుకుంది.   అలీకి ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా నియమించనున్నట్టు వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అయితే ఈ ప్రచారం పట్ల అలీ పెద్ద సంతోషంగా లేరని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అలీ అంత కంటే పెద్ద పదవిని ఆశిస్తున్నారనీ, ఇంత కాలం జగన్ ఆ విషయమే చెబుతూ వచ్చారనిఅంటున్నారు. రాజ్యసభకు అవకాశం ఇప్పుడు లేదు కనుక దానితో సమానమైన హోదా ఉండే పదవిని అలీ ఆశిస్తున్నట్లు చెబుతున్నారు.   ఇక పోసానికి కూడా ఏదో ఒక నామినేటెడ్ పోస్టు ఖాయమని వైసీపీ శ్రేణులు అంటున్నాయి.  

హ‌రీష్ రాజీనామా చేయాలి..మాణిక్యం ఠాకూర్ డిమాండ్ 

రంగారెడ్డి జిల్లా ఇబ్ర‌హీంప‌ట్నం ప్ర‌భుత్వాస్ప‌త్రిలో కు.ని ఆప‌రేష‌న్లు విక‌టించ‌డం ఘ‌ట‌న దుమారం రేపుతోంది. ఈ సంఘ‌ట‌న‌లో న‌లుగురు మ‌హిళ‌లు మృతిచెందారు. ఈ సంఘ‌ట‌న‌పై రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మాణిక్యంఠాకూర్ ట్విట‌ర్‌లో స్పందించారు. రాష్ట్ర ప్ర‌భుత్వం దీనికి బాధ్య‌త వ‌హించాల‌ని, ఆరోగ్య శాఖ మంత్రి హ‌రీష్ రావు రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆస్పత్రిలో నిర్లక్ష్యం కారణంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న నలుగురు మహిళలు మృతి చెందారని ఇప్ప‌టికే ప్ర‌జ‌ల నుంచీ భారీ విమ‌ర్శ‌లు  ప్ర‌భుత్వం ఎదుర్కొంటున్న‌ది. పోర్చుగ‌ల్‌లో భార‌తీయ గ‌ర్భిణి మృతికి బాధ్య‌త వ‌హిస్తూ అక్క‌డి వైద్య‌శాఖ మంత్రి త‌న ప‌ద‌వికి  రాజీ నామా చేశార‌ని, ఇక్క‌డ  వైద్య‌శాఖ హ‌రీష్ రాజీనామా చేయాల‌ని మాణిక్యం డిమాండ్ చేస్తున్నారు.  మరోవైపు ఈ ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (ఎస్‌హెచ్‌ఆర్‌సీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. కుటుం బ నియంత్రణ శస్త్రచికిత్సలు విఫలమై ముగ్గురు మహిళలు మృతి చెందారని.. మరికొందరి పరిస్థితి విష మంగా ఉందంటూ మీడియా వార్తల ఆధారంగా సుమోటోగా కేసును స్వీకరించింది. ఈ ఘటనకు దారి తీసిన కారణాలు, నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై తీసుకున్న చర్యలకు సంబంధించి అక్టోబర్ ప‌ది నాటికి సమగ్ర నివేదిక ఇవ్వాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ను ఇవ్వాలని ఆదేశించింది. ఇక ఇబ్రహీంపట్నం ఘటనపై తీవ్ర విమర్శలు రావడంతో తెలంగాణ ప్రభుత్వం కుటుంబ నియంత్రణ క్యాంపులను తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ ఘటనపై నివేదిక వచ్చే వరకు క్యాంపులను నిలిపివేయా లని ఆదేశించింది. నివేదిక వచ్చాకే కుటుంబ నియంత్రణ క్యాంపుల కొనసాగింపుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రోజుకు 15 ఆపరేషన్లు మాత్రమే చేయాలని గతంలోనే నిబంధన ఉండగా.. అదేమీ పట్టిం చుకోకుండా ఇష్టం వచ్చినట్లు ఆపరేషన్లు చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఒక్క ఇబ్రహీంపట్నం లోనే గంట వ్యవధిలో 34 కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశారు డాక్టర్లు.