తెలంగాణలో రాహుల్ మకాం...17 నుంచి 23 వరకు
posted on Nov 16, 2023 @ 3:32PM
ఎన్నికలు కూత వేటు దూరంలో ఉండగా తెలంగాణలో కాంగ్రస్ స్పీడ్ పెంచింది. జోడో యాత్రతో తెలంగాణ ప్రజలకు దగ్గరైన కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ తెలంగాణ ప్రజలను మరో మారు పలకరించడానికి రానున్నారు. కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ ఆరు రోజులపాటు తెలంగాణలో పర్యటించనున్నారు.ఎన్నికల ప్రచారంలో భాగంగానే ఆయన టూర్ ఖరారైనట్లు తెలుస్తోంది.17వ తేదీన తెలంగాణకు రానున్న రాహుల్ 23 దాకా ఇక్కడే ఉండనున్నట్లు సమాచారం.శుక్రవారం ఉదయం తెలంగాణకు రానున్న రాహుల్ గాంధీ అదే రోజు పాలకుర్తి,వరంగల్, భువనగిరిలో కాంగ్రెస్ నిర్వహించే సభల్లో పాల్గొంటారు.అక్కడి నుంచి వరుసగా ఆరు రోజుల పాటు ఆయన సభల్లో పాల్గొననున్నారు.ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ప్రతీ నియోజకవర్గంలోనూ పార్టీకి చెందిన అగ్రనేతల పర్యటనలు ఉండేలా కాంగ్రెస్ కసరత్తులు చేస్తోంది.ఈ క్రమంలోనే ఒకేరోజు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే,రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీసమావేశాలు ఉండేలా ప్లాన్ చేస్తోంది.
తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో దూసుకుపోతుంది. సిక్స్ గ్యారెంటీస్ తో కాంగ్రెస్ పార్టీ ప్రజాకర్షణ రోజు రోజుకి పెరుగుతోంది. తొమ్మిదిన్నర సంవత్సరాలు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ఇప్పుడు బిఆర్ఎస్ ప్రభుత్వం యాంటీ ఇన్ క్యుంబెన్సీ మూట గట్టుకుంది. తెలంగాణ సాధించిన నేతగా కెసీఆర్ కు వరుసగా రెండు పర్యాయాలు అధికారం కట్టబెట్టారు. మూడోసారి హ్యాట్రిక్ కొట్టడానికి బిఆర్ఎస్ నేత కెసీఆర్ ఉవ్వీలూరుతున్నప్పటికీ కాంగ్రెస్ ఈ ఎన్నికలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేయాలని యోచిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలు తెలంగాణలో ఎన్నికల ప్రచారాన్ని విస్తృతంగా చేపట్టాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా శుక్రవారం నుంచి రాహుల్ పర్యటన అని తెలుస్తోంది. కర్నాటకలో అధికారంలో ఉన్న బిజెపిని మట్టికరిపించిన కాంగ్రెస్ పార్టీ అదే జోష్ తో తెలంగాణలో అడుగుపెట్టింది. లిక్కర్ స్కాంలో ఉన్న కల్వకుంట్ల కవితను బిజెపి ప్రభుత్వం ఇంత వరకు అరెస్ట్ చేయలేదని బిఆర్ఎస్ బీ టీం బిజెపి అని కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో తీసుకెళ్తుంది.