సహసం కోల్పోయిన సహనశీలి...నచ్చకపోతే బయటకు వెళ్లిపోండి..
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఎంత సహనం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు ఆయన సహనాన్ని కాస్త పక్కన పెట్టేశారు. ఇప్పటికే తన సహనాన్ని పక్కన పెట్టి.. రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని, ప్రధాని మోడీ మీదే యుద్ధం ప్రకటించారు. గత నాలుగేళ్లు ఎంతో ఓపికగా ఎదురుచూశారు... కానీ కేంద్ర ప్రభుత్వం ఏపీకి అన్యాయం చేస్తున్న నేపథ్యంలో మోడీకే ఎదురుతిరిగారు. దీని వల్ల తనను వ్యక్తిగతంగా ఇబ్బంది పెడతారని తెలిసినా, రాష్ట్రం కోసం తప్పలేదు. అయితే ఒకపక్క చంద్రబాబు అలా చేస్తుంటే మరోపక్క సొంత పార్టీ నేతలే ఆయనకు తలనొప్పిగా తయారయ్యారు. కానీ ఇది వరకు లాగా చంద్రబాబు వారికి నచ్చజెప్పే పరిస్థితిలో లేరు. వారికి లెఫ్ట్ అండ్ రైట్ వాయించి... క్లాస్ పీకి పంపిస్తున్నారు. నేను గతంలో మాదిరిగా, నచ్చజెప్పే ధోరణిలో ఉండను, ప్రజల్లో పలుచన అయ్యే చర్యలు సహించను, మీకు ఇష్టమైతే క్రమశిక్షణగా ఉండండి, లేకపోతే వెళ్ళిపోండి అంటూ, సీనియర్ నాయకులని కూడా చూడకుండా, వాయిస్తున్నారు.
బస్సు మీద చంద్రబాబు బొమ్మ చిరిగినందుకు దెందులూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఏకంగా బస్సునే ఆపేసి.. ప్రయాణికులను దించేసి నానా యాగి చేశారు. ఇందుకుగాను... చంద్రబాబు ప్రభాకర్ను పిలిపించి క్లాస్ తీసుకున్నారట. బస్సు మీద బొమ్మ చిరిగితే, ఇంత రచ్చ చెయ్యటం ఏంటి, ప్రతి సారి మీరు ఇలా చేస్తే ఎలా ? బాధ్యతాయుతమైన పదవిలో ఉండి రోడ్డుమీద ఈ తగాదాలు, గొడవలేంటి? నా చాకిరీ అంతా మీ చర్యలతో కొట్టుకుపోతోంది. నీ విషయంలో ఇప్పటికి రెండు మూడుసార్లు ఓపిక పట్టాను. అయినా మార్పు లేదు. ఇంకోసారి ఇలాంటి గొడవల్లో తలదూర్చితే ఎంత కఠిన నిర్ణయానికైనా వెనుకాడను. ఒక నియోజకవర్గం పోయునా ఫర్వాలేదు. పార్టీ ప్రతిష్ఠ నాకు ముఖ్యం అంటూ చింతమనేని పై ఫైర్ అయ్యారట.
ఇక అఖిల ప్రియకు, ఏవీ సుబ్బారెడ్డి కి మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ గురించి చెప్పనక్కర్లేదు. గత కొద్దికాలంగా వీరి మధ్య మాటల యుద్దం జరుగుతున్నా.. ఇటీవల ఏపీ సబ్బురాడ్డిపై జరిగిన రాళ్ల దాడి వల్ల ఈ పంచాయితీ కూడా చంద్రబాబు దగ్గరకు వెళ్లింది. ఇద్దరినీ చంద్రబాబు పిలిపించి.. హెచ్చరించారు..ఎన్ని సార్లు మీకు రాజీ కుదిర్చాను, దేనికైనా ఒక హద్దు ఉంటుంది, ఇష్టం లేకపోతే వెళ్లిపోవచ్చు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఆళ్లగడ్డలో వేలు పెట్టవద్దు, మీకు ఎదో ఒక అవకాసం ఇస్తాను, పని చెయ్యండి అంటే, మీరు ఆగారు.. కానీ నీ తొందరపాటుతో పాడు చేసుకుంటున్నావు, మీ వల్ల పార్టీకి చెడ్డ పేరు.. వింటే బాగుపడతారు. లేకపోతే మీ కర్మ అంటూ సుబ్బారెడ్డిని మందలించారట. ఇక అఖిలప్రియ పై ఎప్పుడూ లేని విధంగా, ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ‘మీ అమ్మకు, నాన్నకు రాని అవకాశం నీకు వచ్చింది. దానిని సద్వినియోగం చేసుకోవాలి. మీరు చిన్న పిల్లలు. రాజకీయంగా ఇంకా అనుభవం రాలేదు. సుబ్బారెడ్డికి, మీకు సమస్యలేవైనా ఉంటే ఎవరైనా మధ్యవర్తిని పెట్టి పరిష్కరించుకోండి. అంతేతప్ప పార్టీ వేదికగా వాటిపై పోరాటం చేయవద్దు’ అని ఆయన సూటిగా చెప్పేశారట. అంతేకాదు... ఎమ్మెల్యే పీతల సుజాత, ఎంపీ మాగంటి బాబు చేస్తున్న రచ్చ పై కూడా, ఇద్దరినీ పిలిచి హెచ్చరించారు... మీరు మారకపోతే మిమ్మల్నే మార్చాల్సి వస్తుంది. నేను చెప్పింది నచ్చకపోతే బయటకు వెళ్లిపొండి. నాకేమీ అభ్యంతరం లేదు అని తెగేసి చెప్పారట. మరి చంద్రబాబుకు సహనం ఎంత కోల్పేతే ఇలా వార్నింగ్ లు ఇస్తారు పాపం. అసలే ప్రత్యేహోదా విషయంలో కేంద్రంతో యుద్దానికి దిగి ఆ తలనొప్పులే భరించలేకపోతుంటే మధ్యలో పార్టీ నేతల తలనొప్పులు ఒకటి. అందుకే ఉన్న ఓపిక పోయినట్టుంది... అందరికీ వార్నింగ్ ల మీద వార్నింగ్ లు ఇచ్చేస్తున్నారు.